AP Special News
-
మన విద్యా రంగమే భేష్
‘మన విద్యా విధానం మరింత బలపడాలి. స్కూల్ స్థాయి నుంచే ఉన్నత అవకాశాలు కల్పించే విధంగా బోధన ఉండాలి. యువతకు కళాశాల స్థాయిలోనే విస్తృత బోధన సదుపాయాలు కల్పించాలి’ – మన విద్యా రంగంపై నిరంతరం వ్యక్తమవుతున్న అభిప్రాయం ఇది.అయితే దీనికి భిన్నంగా.. మన విద్యా వ్యవస్థ.. కెరీర్ అవకాశాల విషయంలో నేటి తరం యువత స్పందించడం గమనార్హం. ప్రపంచ దేశాలతో పోల్చితే మన దేశ విద్యా విధానమే బాగుంటుందనే ఆశాభావాన్ని యువత వ్యక్తం చేసింది. అదే విధంగా కెరీర్ అవకాశాల కోణంలోనూ భవిష్యత్.. బ్రహ్మాండంగానే ఉంటుందనే రీతిలో స్పందించింది.ఈ వివరాలు.. టోఫెల్, జీఆర్ఈ వంటి పరీక్షలు నిర్వహించే ప్రముఖ టెస్టింగ్ సంస్థ.. ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్)(ETS survey) నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యాయి. ఈ మేరకు మొత్తం 18 దేశాల్లో 18 వేల మంది యువత అభిప్రాయాల ఆధారంగా మానవాభివృద్ధి నివేదికను ఈటీఎస్ విడుదల చేసింది. ఇందులో పలు అంశాలను స్పృశించింది.మన విద్యా వ్యవస్థ బాగుంటుంది..మన దేశ విద్యా వ్యవస్థ బాగుంటుందని 70 శాతం యువత సర్వేలో ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే భవిష్యత్తులోనూ ప్రగతి ఉంటుందని 76 శాతం మంది పేర్కొన్నారు. ఇదే సమయంలో అంతర్జాతీయంగా మాత్రం 30 శాతం మంది మాత్రమే తమ విద్యా వ్యవస్థ బాగుంటుందని అభిప్రాయపడ్డారు. 64 శాతం మంది ప్రగతిశీలత ఉంటుందని చెప్పారు.నాణ్యతతో కూడిన విద్య కష్టమే..ఒకవైపు.. మన విద్యా వ్యవస్థ బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేసిన యువత.. నాణ్యమైన విద్యను అందుకోవడం మాత్రం కష్టంగా మారిందని అభిప్రాయం వ్యక్తం చేసింది. కొన్ని వర్గాల వారే ప్రయోజనం పొందేలా విద్యావకాశాలు ఉన్నాయని ఏకంగా 78 శాతం మంది పేర్కొన్నారు. అదే విధంగా ఉపాధ్యాయుల కొరత ఉందని 74 శాతం మంది స్పష్టం చేశారు. అలాగే అత్యున్నత నాణ్యమైన కోర్సులు, విద్యా సంస్థల విషయంలో ఇప్పటికీ కొరత ఉందన్నారు.ముందంజలో నిలిచే అవకాశం..ప్రస్తుత అవకాశాలతో కెరీర్లో ముందంజలో నిలవడానికి అవకాశం ఉంటుందని 69% మంది భారత యువత అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా ఈ సంఖ్య 59% మాత్రమే కావడం గమనార్హం. అదే విధంగా 2035 నాటికి తమ రంగాల్లో అభివృద్ధి ఉంటుందని 72% మంది ఆశాభావం వ్యక్తం చేశారు.ఉద్యోగాల కొరత..ఉద్యోగాల కొరత ఉంటుందని 40 శాతం మంది భారతీయ యువత పేర్కొనగా.. అంతర్జాతీయంగా ఇది 34 శాతంగా నమోదైంది. అదే విధంగా చదువుకోవడం ఖరీదైన విషయంగా మారిందని 33 శాతం మంది వెల్లడించారు. నూతన నైపుణ్యాలవైపు పరుగులు..మన దేశ విద్యార్థులు, ఉద్యోగార్థులు నూతన నైపుణ్యాలు అందిపుచ్చుకోవడంలో పరుగులు పెడుతున్నారని ఈటీఎస్ సర్వే వెల్లడించింది. లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనేది కెరీర్ సుస్థిరతకు తోడ్పడుతుందని 91 శాతం మంది పేర్కొనడం విశేషం. అదే విధంగా యూనివర్సిటీల డిగ్రీలకంటే ఆయా విభాగాల్లో క్రెడెన్షియల్స్, సర్టిఫికేషన్స్కు ఎంతో ప్రాధాన్యత ఉందని 88 శాతం మంది పేర్కొన్నారు.ఏఐ.. అవకాశాల వేదిక..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందనే అభిప్రాయాలు వెల్లడవుతున్న పరిస్థితుల్లో.. తాజా సర్వేలో మాత్రం ఇందుకు భిన్నంగా యువత స్పందించింది. ఏఐని ముప్పుగా భావించట్లేదని, తమకు లభించిన అవకాశంగా భావిస్తున్నామని 88 శాతం మంది స్పష్టం చేయడం విశేషం. అదే విధంగా.. అంతర్జాతీయ స్థాయిలో ప్రతి పది మంది ఉద్యోగుల్లో నలుగురు.. ఏఐ లిటరసీ, మానవ సామర్థ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతున్నారు.లాభాపేక్ష లేని సంస్థలు కూడా..దేశంలో అత్యున్నత విద్యను అందించడంలో లాభాపేక్ష లేని సంస్థలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ సంస్థలకు మన దేశం అత్యంత అనుకూల దేశంగా ఉందని.. సర్వేలో పాల్గొన్న వారిలో 26 శాతం మంది తెలిపారు. అంతర్జాతీయంగా ఈ సంఖ్య 19 శాతంగానే ఉంది.ఆ 3 స్కిల్స్ ప్రధానంగా..జాబ్ మార్కెట్లో ముందంజలో నిలవడానికి ఏఐ/డిజిటల్ లిటరసీ, సృజనాత్మకత, కమ్యూనికేషన్లు కీలకంగా నిలుస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది. ఇందుకోసం అవసరమైతే సంస్థలు శిక్షణ సదుపాయాలు కల్పించాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.బోధన, మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడాలినేటి యువత వాస్తవ పరిస్థితులపై అవగాహన ఏర్పరచుకుంటున్నారు. అందుకే అప్ స్కిల్లింగ్, రీ–స్కిల్లింగ్ అవసరమని భావిస్తున్నారు. ఇందుకోసం కళాశాల స్థాయి నుంచే కృషి చేస్తున్నారు. అయితే దీనికి తగినట్లుగా మౌలిక సదుపాయాలు, బోధన అవకాశాలు మరింత మెరుగు పడాలి. అంతర్జాతీయంగా పోలిస్తే మన విద్యార్థులు ఏ దేశంలోనైనా.. ఉన్నత విద్య, ఉద్యోగ రంగాల్లో మెరుగ్గా రాణిస్తున్నారు.– రమేశ్ లోగనాథన్, ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్, కో–ఇన్నోవేషన్స్, ట్రిపుల్ఐటీ–హైదరాబాద్ -
చుట్టు పక్కల చూడరా..!
కర్నూలు: మానవ సంబంధాల పేరుతో మనిషన్నవాడు మాయమవుతున్నాడు. అందరూ బాగుంటేనే సమాజం అన్న ధోరణి నుంచి నా కుటుంబం బాగుంటే చాలనే ధోరణితో జీవిస్తున్నాడు. ఈ క్రమంలో చివరికి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లలను సైతం దూరం చేసుకుంటున్నాడు. కేవలం భార్యాబిడ్డలు బాగుంటే చాలని అనుకుంటున్నారు. ఒకప్పుడు పక్కింట్లో పెళ్లంటే ఆ వీధిలో ఉన్న వారందరూ తలోచేయి వేసి ఇంట్లో మనుషుల మాదిరిగా పనులు చేసేవారు. ఇప్పుడు అయిన వారు కూడా చుట్టపుచూపుగా వస్తున్నారు. అయిన వారు అందరూ ఉన్నా పనులన్నీ ఈవెంట్ మేనేజర్లు చూసుకుంటున్నారు. పట్టణీకరణ పేరుతో మనుషులు దూరం అవుతున్నారు. కానీ ఇప్పటికీ పల్లెలు, పట్టణాల్లోని మురికివాడల్లో ఒకప్పటి అనుబంధాలు, ఆత్మీయతలు కొనసాగుతుండటం గమనార్హం. ఉన్నత చదువులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు మనుషులను దూరం చేయడానికా లేదా దగ్గర చేయడానికా అని ఆనాటి పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం ఎవ్వరికై నా ఏదైనా కష్టం వస్తే బంధువుల కంటే ముందు ఇరుగుపొరుగు వారే ముందుగా వచ్చి ఆదుకునేవారు. ఇంట్లో ఎవ్వరైనా చనిపోతే పక్కింటి వారే ఆ కుటుంబానికి అవసరమైన ఏర్పాట్లు చేసేవారు. ఇప్పుడు అపార్ట్మెంట్లలో, అద్దె ఇళ్లల్లో సైతం మృతదేహాన్ని ఉండనీయని పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం, చిన్న కుటుంబాలు ఏర్పడటం, చిన్నతనంలో పిల్లలను హాస్టల్లో, వృద్ధాప్యంలో పెద్దలను ఆశ్రమాల్లో ఉంచడంతో కుటుంబ విలువలు తగ్గిపోతున్నాయి. ఉన్నత చదువుల పేరుతో ఆధునికత సంతరించుకోవడంతో ఎవ్వరికి వారే అన్న రీతిలో సమాజంలో జీవిస్తున్నారు. సమాజంలో ప్రస్తుతం మానవసంబంధాలు ఎలా ఉన్నాయో ఈ సంఘటనలే నిదర్శనం. నంద్యాల పట్టణంలో ఇటీవల ఓ వ్యక్తి తన కుమారుడి వివాహం చేశారు. బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఎక్కువ మంది వస్తారని పెద్ద ఫంక్షన్ హాల్, పెళ్లి భోజనంలో రకరకాల స్వీట్లు, వంటకాలు ఏర్పాటు చేశారు. అయితే పెళ్లి ముందు రోజు కూడా పెద్దగా బంధువులు, మిత్రులు రాలేదు. తలంబ్రాల సమయానికి హడావుడిగా వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించి తెచ్చిన గిఫ్ట్లను చేతిలో పెట్టి వెళ్లిపోయారు. ఆహార పదార్థాలు భారీగా మిగిలిపోవడంతో అనాథశ్రమానికి పంపించేశారు. కర్నూలు నగరానికే చెందిన రాజ్కుమార్ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. మూడేళ్ల క్రితం అతని తల్లి అనారోగ్యంతో మరణించింది. విషయం తెలిసిన ఇంటి యజమాని మృతదేహాన్ని ‘మా ఇంట్లో ఉంచొద్దని, మీ బంధువుల ఇళ్లకు తీసుకెళ్లు’ అని గొడవ చేశాడు. ఎంత నచ్చజెప్పినా వినలేదు. దీంతో తప్పనిసరై నగరంలోని తన సోదరుని ఇంటికి అప్పటికప్పుడు మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.ఎమ్మిగనూరుకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి పిల్లల చదువుల కోసం కర్నూలులో ఉంటున్నారు. ఆ వీధిలో అతను దాదాపు పదేళ్లుగా ఉంటున్నాడు. అయితే చుట్టు పక్కల వారితో ఇంత వరకు ఆయన మాట్లాడలేదంటే ఆశ్చర్యం కలగకమానదు. ఉదయాన్నే విధులకు వెళ్లడం, సాయంత్రం ఇంటికి రావడం, కుటుంబీకులతో గడుపుతారు. పక్క ఇళ్లల్లో శుభకార్యం జరిగినా వెళ్లింది లేదు.. ఆపద వచ్చినా పలకరించింది లేదు.నిలవని ప్రేమ వివాహాలు..తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమవివాహాలు చేసుకోవడం ఇటీవల కాలంలో అధికమైంది. కొందరు తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటుండగా మరికొందరు ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటూ వేరుగా ఉంటున్నారు. ఆ తర్వాత ఏడాది, రెండేళ్లకే విడిపోయి తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరుకుంటున్నారు. ప్రతి పోలీస్స్టేషన్లో వారానికి రెండు, మూడు కేసులైనా అమ్మాయి మిస్సింగ్ అని నమోదవుతున్నాయి. ఇలాంటి ఘటనలు ఇటీవల అధికంగా చూస్తున్న పోలీసులు చాలా మంది అమ్మాయిని వెతకడం అటుంచి రెండురోజులకు వారే వస్తారులే అన్న ధోరణితో మాట్లాడుతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో వచ్చే చిన్న చిన్న మనస్పర్థలను సర్దిచెప్పేవారు లేక రెండు, మూడేళ్లకే విడిపోతున్నారు. పోలీస్స్టేషన్లు, వన్స్టాప్ సెంటర్లు, ఐసీడీఎస్ కార్యాలయాల్లో ఇలాంటి వారికి కౌన్సిలింగ్ నిర్వహించే ఉదంతాలు ఇటీవల అధికమయ్యాయి.పలకరించి ఎన్నాళ్లైందో..ఒకప్పుడు ఇంటికి బంధువులు, స్నేహితులు వస్తే గంటల తరబడి మాట్లాడుకుంటూ ఉండిపోయేవారు. సమయానికి భోజనం చేయాలన్న విషయం కూడా మరిచిపోయేవారు. కుటుంబంతో పాటు ఊళ్లో, సమాజంలో ముచ్చట్లు, రాజకీయాలు, సినిమాలు అన్నీ ఈ మాటల్లో కనిపించేవి. కానీ ఇప్పుడు ఇంటికి ఎవ్వరైనా వస్తే ముఖస్తుతిగా పలకరించి రెండు నిమిషాలు మాట్లాడి వదిలేస్తున్నారు. ఎవ్వరి మొబైల్లో వారు బిజీగా గడుపుతున్నారు. ఎదురుగా ఉన్న వారిని పలకరించే సమయం లేకపోయినా ఎక్కడా కనిపించని వారిని సోషల్ మీడియాలో పలకరించుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు.కష్టమొస్తే భరోసానిచ్చే చేతుల్లేవు..నాగరికత వెంట పరుగులు పెడుతున్న మనుషుల మధ్య దూరం మరింత పెరుగుతోంది. ఉన్నత చదువులు, ఉద్యోగాల పేరుతో ఎవ్వరికి వారు వేరుగా ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అపార్ట్మెంట్లో 40కి పైగా కుటుంబాలున్నా.. కష్టమొస్తే పలకరించేవారు ఎవ్వరూ రాని పరిస్థితి నెలకొంది. కానీ పండుగలు, చిన్నచిన్న శుభకార్యాలు మాత్రం చేసుకుని ఎంజాయ్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఎవ్వరికై నా ఆరోగ్యం బాగాలేకపోతే అయిన వారే పలకరించే దిక్కులేదు. బంధువులు, స్నేహితులు సైతం సోషల్ మీడియాలో మాత్రమే పరామర్శలు చేస్తున్నారు. ఇంటికి వచ్చి ధైర్యం చెప్పేవారు కరువైపోయారు. -
నేరాల్లో మరో కోణం!
సాక్షి, అమరావతి /హైదరాబాద్: చిల్లర దొంగతనాలు మొదలు రూ.కోట్లు కాజేసిన సైబర్ కేటుగాళ్ల ఉదంతాల వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది కాలంలో వివిధ నేరాలు చోటుచేసుకున్నాయి. అందుకు సంబంధించి బోలెడు ఎఫ్ఐఆర్లు సైతం నమోదయ్యాయి. కానీ వాటిలో కొన్ని విచిత్రమైన కేసులు పోలీసులను ఆశ్చర్యపరిచాయి. ఇంతకీ ఆ విచిత్ర కేసులేమిటంటే.. సైనేడ్ హత్యలుగుంటూరు జిల్లాలో ఓ తల్లీ కూతురు, వారి స్నేహితురాలు పాల్పడ్డ సైనేడ్ హత్యలు సంచలనం రేపాయి. ఈ ఏడాది సెప్టెంబరులో నాగూర్ బి అనే మహిళ అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తుతో మొత్తం కుట్ర బయటపడింది. తెనాలికి చెందిన ముడియా రమణమ్మ, ఆమె కూతురు వెంకటేశ్వరి, వారి స్నేహితురాలు గునగప్ప రజినీ ముందస్తు పన్నాగంతో నాగూర్బీ అనే మహిళతో పరిచయం పెంచుకున్నారు. ఆమె బంగారం కాజేయాలని భావించారు.నాగూర్బీని నమ్మించి ఆటోలో ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లారు. దారిలో ఆటో డ్రైవర్తో బ్రీజర్ కొనిపించారు. ఆ బ్రీజర్లో సైనేడ్ కలిపి నాగూర్బీతో బలవంతంగా తాగించి హత్య చేశారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను కాజేశారు. పోలీసుల దర్యాప్తులో ఈ ముఠా అంతకుముందు కూడా ఇదే రీతిలో చేసిన హత్యలు కూడా బయటపడ్డాయి. నాగమ్మ అనే మహిళ నుంచి వెంకటేశ్వరి రూ.20 వేలు అప్పు తీసుకుంది. ఆ అప్పును ఎగవేసేందుకు సైనేడ్ కలిపిన కూల్ డ్రింక్ తాగించి నాగమ్మను హత్య చేసింది. 2022లో వెంకటేశ్వరి తన అత్త సుబ్బలక్ష్మిని కూడా ఇలానే సైనేడ్ కలిపిన కూల్ డ్రింక్ తాగించి హత్య చేసింది. తెనాలికి చెందిన మోషే అనే వ్యక్తి తన భార్యను తీవ్రంగా వేధించేవాడు. అతని ఇన్సూరెన్స్, పెన్షన్ డబ్బులు పంచుకోవాలనే ఒప్పందంతో రమణమ్మ, వెంకటేశ్వరి.. మోషే భార్యతో కలసి అతడిని హత్య చేశారు. రమణమ్మ, వెంకటేశ్వరి, రజినీ, ఆటో డ్రైవర్తోపాటు సైనేడ్ విక్రయించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.దొంగ నోట్లు ఆశ చూపి..‘రూ.లక్ష ఇస్తే రూ.3 లక్షల దొంగనోట్లు ఇస్తాం’ అని ఆశ చూపించి స్నేహితుడిని హత్య చేసిన ఉదంతం కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. కర్నూలు జిల్లా ఆస్పరిలో పెంటయ్య అనే రైతు అప్పుల పాలయ్యాడు. తన పొలాన్ని రూ.17.50 లక్షలకు విక్రయించాడు. ఆ సొమ్మును కాజేయాలని అతని స్నేహితులు బోడిగుండ నరసింహుడు, హనుమంతు భావించారు. ‘రూ.లక్ష ఇస్తే రూ.3 లక్షల దొంగనోట్లు ఇస్తాం... దాంతో నీ అప్పులన్నీ తీరిపోతాయి’ అని ఆశ చూపించారు. డబ్బులు పట్టుకుని ఆలూరు మండలం హళేబీడుకు రమ్మన్నారు. వారి మాటలు నమ్మిన పెంటయ్య రూ.7.50 లక్షలు తీసుకుని వెళ్లారు.అక్కడ స్నేహితులు ఆయనతో సైనైడ్ కలిపిన మద్యాన్ని బలవంతంగా తాగించి హత్య చేశారు. పెంటయ్య మృతదేహాన్ని సమీపంలోని పంపయ్య ఆచారి అనే వ్యక్తి పొలంలో పూడ్చి పెట్టారు. అందుకుగాను ఆచారికి కొంత సొమ్ము ముట్టజెబుతామన్నారు. రెండు రోజుల తర్వాత దుర్వాసన వస్తుండటంతో బోడిగుండ నరసింహుడు, హనుమంతు, పంపయ్య ఆచారీలు ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి ఆటోలో ఆస్పరి మండలంలోని చిన్న హోతూరు వంక వద్దకు తీసుకెళ్లి ముళ్ల పొదల్లో పడేసి వెళ్లారు. మృతదేహాన్ని సమీప గ్రామస్తులు గుర్తించడంతో పోలీసులు కేసు నమోదైంది. బోడిగుండ నరసింహుడు, హనుమంతు, పంపయ్య ఆచారీలను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.డామిట్.. కథ అడ్డం తిరిగింది!వదిన ఆస్తిని కాజేయడం కోసం భీమవరంలో ఓ వ్యక్తి పన్నిన ‘మృతదేహం పార్సిల్’ పన్నాగం విస్మయ పరిచింది. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలానికి చెందిన శ్రీధర్ వర్మకు ఇద్దరు భార్యలతోపాటు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. తన రెండో భార్య రేవతి తల్లిదండ్రుల ఆస్తిపై అతను కన్నేశాడు. ఆ ఆస్తిలో తన రెండో భార్య అక్కకు కూడా వాటా ఉంది. దాంతో ఆమె వాటాను కూడా దక్కించుకోవడం కోసం ఓ ఎత్తుగడ వేశాడు. ఆమె (వదిన) నిర్మిస్తున్న ఇంటి కోసం రెండుసార్లు క్షత్రియ ఫౌండేషన్ పేరుతో నిర్మాణ సామగ్రిని పంపించాడు. మూడోసారి నిర్మాణ సామగ్రి పేరుతో ఓ మృతదేహాన్ని పార్సిల్ చేసి పంపాడు. అందుకోసం తన ప్రియురాలితో కలసి తన గ్రామానికి చెందిన మద్యానికి బానిసైన యువకుడిని హత్య చేశాడు.అతని మృతదేహాన్ని తన వదిన ఇంటికి పార్సిల్ పంపాడు. రూ.1.30 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆ పార్సిల్లో ఓ లేఖ రాసి పెట్టాడు. ఆ పార్సిల్ చూడగానే వదిన భయపడి తనకు ఫోన్ చేసి పిలుస్తుందని.. ఆమెకు సహకరించినట్టుగా నటించి రూ.1.30 కోట్లు సర్దుబాటు పేరుతో ఆమె ఆస్తిని దక్కించుకోవాలన్నది శ్రీధర్ వర్మ పన్నాగం. అయితే తీవ్ర ఆందోళన చెందిన ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. దీంతో మొత్తం కుట్ర బట్టబయలైంది. కాగా, ఆస్తి మొత్తం దక్కాక ఇద్దరు భార్యలను కూడా వదిలించుకుని ప్రియురాలు సుష్మాతో ఉడాయించాలని శ్రీధర్ వర్మ భావించాడు. దీంతో శ్రీధర్ వర్మ, అతని రెండో భార్య రేవతి, ప్రియురాలు సుష్మాలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు.మద్యంపై మక్కువతో.. పనిచేస్తున్న సంస్థలకు సున్నం పెట్టే వాళ్లు.. అన్నం పెట్టిన ఇంట్లోనే కన్నం వేసిన వాళ్ల గురించి అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. సాధారణంగా ఆయా నేరాల్లో సొమ్ము కాజేయడమే నిందితుల ప్రధాన ఉద్దేశంగా ఉంటుంది. కానీ జూబ్లీహిల్స్ రోడ్ నం.10లోని ఆర్యూ పబ్లో పనిచేసే వినీత్కుమార్ అనే సెక్యూరిటీ గార్డు వెరైటీ చోరీకి పాల్పడ్డాడు. ఖరీదైన విదేశీ మద్యం తాగడం కోసం ఇద్దరు స్నేహితులతో కలిసి అర్ధరాత్రి దాటాక పబ్లోకి ప్రవేశించి రాయల్ సెల్యూట్, చివాస్ రీగల్, మొహిట్ చాన్ దాన్ బాటిళ్లను ఎత్తుకెళ్లాడు. పనిలో పనిగా పారిపోవడానికి ఉపయోగపడుతుందని రూ.2 లక్షల నగదు కూడా కొట్టేశాడు.మాస్టార్కు ఎదురైన ప్రేమ వేధింపులుబస్టాప్ లాంటి ప్రదేశాల్లో రోడ్సైడ్ రోమియోల ఆగడాల గురించి.. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే కీచకులుగా మారిన ఉదంతాల గురించి అప్పుడప్పుడూ వింటుంటాం. కానీ హైదరాబాద్ అశోక్నగర్లోని ఓ కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్న ఓ గురువుపై మనసు పారేసుకున్న ఓ యువతి తన ప్రేమను నిరాకరించాడన్న కోపంతో ఆయనపై క్షక్షగట్టింది. లెక్చరర్తోపాటు ఆయన కుమార్తె ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసింది. దీనిపై బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించడంతో ఆ యువతి చివరకు జైలుపాలైంది.హుస్సేన్సాగర్లో ‘90 ఎంఎల్’స్టోరీసాధారణంగా ప్రేమ వ్యవహారాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. కానీ ఓ మందుబాబు మాత్రం మద్యం మత్తులో హుస్సేన్సాగర్లోకి దిగి ‘చుక్క’కావాలంటూ పోలీసులకు చుక్కలు చూపించాడు. నడుము లోతు నీళ్లున్న ప్రాంతంలో అతడు నిల్చుని ఉండటాన్ని చూసిన పర్యాటకులు ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నాడనుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ట్యాంక్బండ్ వద్దకు చేరుకున్న ఓ కానిస్టేబుల్ నీటిలోకి తాడు విసిరి, దాన్ని పట్టుకుని పైకి రావాల్సిందిగా యువకుడిని కోరాడు. కానీ అందుకు నిరాకరించిన మందుబాబు.. తనకు ‘90 ఎంఎల్’ ఇస్తేనే బయటకు వస్తానంటూ మొండికేశాడు. చివరకు గంటన్నరపాటు సాగిన డ్రామా అనంతరం పోలీసులు అతన్ని బయటకు రప్పించారు.‘అతడి’పైనా అత్యాచార యత్నంయువతులు, మహిళలపై అత్యాచారాలు, అత్యాచారయత్నాలకు సంబంధించిన కేసులు నేటికీ నమోదవుతుండటం చాలవన్నట్లు ఇద్దరు మహిళలు ఓ పురుషుడిపై అత్యాచారయత్నం చేయడం, నగ్నంగా వీడియోలు తీసి అతన్ని బెదిరించడం సనత్నగర్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సదరు వ్యక్తికి మసాజ్ థెరపిస్టుగా పరిచయమైన ఓ మహిళ.. భరత్నగర్ కాలనీకి చెందిన మరో మహిళను పరిచయం చేసింది. ఇద్దరూ కలిసి అతన్ని భరత్నగర్ కాలనీలోని మహిళ ఇంటికి తీసుకెళ్లి మసాజ్ పేరుతో దుస్తులు విప్పించి అత్యాచారానికి యత్నించారు. అతడు నిరాకరించడంతో నగ్న వీడియోలను తీసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి కొంత డబ్బు గుంజారు. ఆపై ఇంకా డబ్బివ్వాలని డిమాండ్ చేయడంతో ఈ ‘లైంగిక వేధింపులు’తట్టుకోలేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.ఆమె అలా... అతడు ఇలాభిన్న మనస్తత్వాలుగల భార్యభర్తల్ని మనం చూస్తూనే ఉంటాం. హైదరాబాద్ లోని రామాంతపూర్లో నివసించే ఓ ‘విపరీత’జంట వ్యవహారం ఉప్పల్ ఠాణా అధికారుల దృష్టికి వచ్చింది. గతంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో హౌస్ కీపర్గా పనిచేసిన మహిళ మద్యానికి బానిసగా మారింది. నిత్యం మద్యం తాగి రోడ్లపై న్యూసెన్స్ చేస్తూ పోలీసులకు చిక్కేది. అంతటితో ఆగకుండా ఏకంగా పోలీసుస్టేషన్కే వచ్చి న్యూసెన్స్ చేసి వెళ్తుండటం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఆమె భర్త కూడా తక్కువేం కాదు.. చుట్టుపక్కల కాలనీల్లోని ఇళ్ల గోడలు దూకి చెప్పులు, బూట్లు చోరీ చేసేవాడు. సీసీ కెమెరాల ఆధారంతో ఒకరోజు అతని ఇంటిపై దాడి చేసిన స్థానికులు వందల జతల పాదరక్షలు గుర్తించి పోలీసులకు అప్పగించారు. -
శిలాశాసనులు ఈ తండ్రీకొడుకులు
తెనాలి: శిలాశాసనులీ తండ్రీ కొడుకులు...వారసత్వంగా వస్తున్న శిల్పకళను ఏడుతరాలుగా కొనసాగిస్తున్న సృజనకారులు. ఫైబర్, కాంస్యం, ఐరన్స్క్రాప్, త్రీడీ విగ్రహాలతో తమ సృజనకు టెక్నాజలీని జోడిస్తున్నారు. వైవిధ్యమైన శిల్పాలను రూపొందిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని గడిస్తున్నారు. ఆ క్రమంలో భారత రాజ్యాంగ ఆమోద వజ్రోత్సవాల వేళ ‘భారతరత్న’ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలతో ప్రదర్శన ఏర్పాటుచేశారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్తో సహా పలు రికార్డుల సాధనకు ప్రయత్నిస్తున్నారు.తెనాలికి చెందిన సూర్య శిల్పశాల అధినేత కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన కుమారులు రవిచంద్ర, శ్రీహర్షలు శిల్పకళను కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. ఫైబర్, కాంస్య విగ్రహాలతో కాటూరి వెంకటేశ్వరరావు రాణిస్తుంటే, కోల్కతాలో ఫైనార్ట్స్లో పీజీ చేసిన కొడుకు రవిచంద్ర ఆ కళకు మరింత వన్నెలు తెస్తున్నారు. ఇనుప వ్యర్థ్యాలతో భారీ విగ్రహాలను తయారుచేస్తూ దేశవిదేశీయులను ఆకర్షిస్తున్నారు. అతడి సోదరుడు శ్రీహర్ష త్రీడీ టెక్నాలజీలో అతి సూక్ష్మ విగ్రహాల్నుంచి భారీ విగ్రహాల వరకు తీర్చిదిద్దుతున్నారు. వీరి విగ్రహాలు దేశంలోని అనేక నగరాల్లో ప్రతిష్టకు నోచుకోవటమే కాకుండా, విదేశాల్లోనూ కొలువుదీరాయి. తమ విగ్రహాలతో తెనాలిలో కాటూరి ఆర్ట్ గ్యాలరీని ఏర్పాటుచేసి, తమ కళానైపుణ్యాన్ని అక్కడ ప్రదర్శిస్తున్నారు.ప్రస్తుతం భారత రాజ్యాంగ ఆమోద వజ్రోత్సవాలను దేశమంతటా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలతో ప్రదర్శన నిర్వహించాలని తలపోశారు. అనుకున్నదే తడవుగా గత కొద్దినెలలుగా తీవ్రంగా శ్రమించారు. యాభై విగ్రహాలతో కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనను బుధవారం సాయంత్రం ఏర్పాటుచేశారు. ఫైబర్, కాంస్య విగ్రహాలు రకరకాల సైజుల్లో ఇందులో కొలువుదీర్చారు. అడుగు ఎత్తు నుంచి 30 అడుగు ఎత్తు వరకు అంబేడ్కర్ విగ్రహాలను ఇందులో చేర్చారు. వీటిలో అడుగు ఎత్తులో ఉన్న బస్ట్ సైజువి త్రీడీ టెక్నాలజీతో రూపొందించారు. వీటితోపాటు కుర్చీలో కూర్చున్న భంగిమ నుంచి నిలుచున్న విగ్రహాలూ రకరకాల సైజుల్లో ఈ ప్రదర్శనలో చోటుచేసుకుని చూపరులను ఆకర్షిస్తున్నాయి. తమ శిల్పకళా నైపుణ్యానికి కాటూరి శిల్పకారులు అభినందనలు అందుకుంటున్నారు.సూర్య శిల్పశాలతో విగ్రహాల రూపకల్పనలో కొనసాగుతున్న కాంటూరి వెంకటేశ్వరరావు ఆ వంశంలో ఆరోతరం వారు. ఏడోతరానికి చెందిన ఆయన ఇద్దరు కుమారులూ, వారసత్వంగా వస్తున్న శిల్పకళనే వృత్తిగా చేసుకోవటం విశేషం! వెంకటేశ్వరరావు తాత చంద్రయ్య సిమెంటు విగ్రహాలు, దేవాలయాల నిర్మాణం, దేవతా విగ్రహాలను తయారుచేసేవారు. తండ్రి కోటేశ్వరరావు రాజకీయ నేతల విగ్రహాలను కేవలం సిమెంటుతోనే చేసేవారు. వెంకటేశ్వరరావు ఆ విగ్రహాలతోనే ఆరంభించి, తన సృజనతో ఫైబర్, కాంస్య విగ్రహాల తయారీని ఆరంభించారు. కొడుకులు అందివచ్చాక నైపుణ్యం పెరిగింది. ఐరన్స్క్రాప్ వ్యర్థాలతో భారీ విగ్రహాలను తయారుచేస్తూ రవిచంద్ర, త్రీడీ టెక్నాజీలతో శ్రీహర్షలు తమ శిల్పకళకు ఆధునిక హంగులు అద్దారు. అంతర్జాతీయ గుర్తింపును సాధిస్తున్నారు. తాజా ప్రదర్శనలో ఉంచిన శిల్పాల్లో అధికశాతం హ్యాండ్వర్క్తోనే చేశారు. ఇందుకోసం 50 మందికిపైగా వర్కర్లతో 5–6 నెలలుగా కృషిచేసినట్టు చెబుతున్నారు.గిన్నిస్ బుక్ రికార్డు కోసం...– కాటూరి వెంకటేశ్వరరావు, శిల్పకారుడుశిల్పకళలో తెనాలి ఖ్యాతిని ఇనుమడింపజేయటం...గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించాలనే ప్రయత్నంతోనే ఈ ప్రదర్శన ఆరంభించాం. వీడియోలు, ఫొటోలు పంపాం. పరిశీలిస్తున్నట్టు సమాచారం పంపారు. అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ ఆఫ్ రికార్డ్స్ వారు తమ సంసిద్ధతను తెలియజేశారు. త్వరలోనే వస్తాయని ఆశిస్తున్నాం. -
శివయ్య ప్రీతికి ‘శంఖు’ నాదం : దంపతులకు అవార్డు
రాజమహేంద్రవరం రూరల్: శివయ్యను ప్రసన్నంచేసుకునేందుకు భక్తులు అనేకమార్గాలను అనుసరిస్తారు. శంఖాన్ని ఏకబిగిన పూరిస్తూ మహాదేవుడిని ఆనందింపచేస్తారు మరికొందరు. శ్వాసను బిగించి ఏకధాటిగా దాదాపు ఇరవై నిముషాల పాటు శంఖాన్ని పూస్తూ తమ భక్తిని ప్రదర్శిస్తున్న ఎస్పీఎఫ్ కమాండెంట్ నర్సింహరావు, అలివేలు మంగాదేవి దంపతులకు ఆధ్మాత్మిక సంపూర్ణత్వంతో పాటు, భౌతికంగా కూడా అవార్డులు వరిస్తున్నాయి. వీరు చేసే ఆధ్యాత్మిక సేవ అవార్డుల కోసం కాకపోయినప్పటికీ శంఖనాదంలో వీరి నిపుణతకు హైదరాబాదుకు చెందిన విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ కామధేను –2024 అవార్డ్స్లో భాగంగా జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది. ఆదివారం (డిసెంబరు 14) హైదరాబాద్లో నిర్వహించే కార్యక్రమంలో నరసింహారావు దంపతులు ఈపురస్కారాన్ని అందుకోనున్నారు.ఈ సందర్భంగా తమ ఆధ్యాత్మిక మార్గం, శంఖునాదం సాధన గురించి నర్సింహరావు మాటల్లో.. డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా పి.గన్నవరం తమ స్వగ్రామం. ప్రస్తుతం రాజమహేంద్రవరంలో ఏపి ప్రత్యేక రక్షణ దళం(ఏపీఎస్పీఎఫ్) కమాండెంట్గా విధులు నిర్వహిస్తున్నా. తన భార్య అలివేలు మంగాదేవి గృహిణి. తమకు శివుడు అంటే ఎనలేని భక్తి. తాను 1989లో పశ్చిమబెంగాల్ సిలిగురి ప్రాంతంలో సరిహద్దు భద్రత దళంలో పనిచేసే సమయంలో బెంగాలీ పూజారి చక్రవర్తి వద్ద శంఖం పూరించడంలో మెలుకువలు నేర్చుకున్నాను. అదే స్పూర్తితో తన భార్య మంగాదేవికి కూడా ఈ విద్యలో పట్టుసాధించారు. దీంతో తమకు ‘అఖండ శంఖారావ యుగళం’గా పేరొచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు, కేరళ,తమిళనాడు ,కర్ణాటక, డిల్లీ, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో 35 ఏళ్లుగా సొంత ఖర్చులతో ఇంతవరకు నాలుగువేలకు పైగా కార్యక్రమాలు తమ శంఖారావంతో ఆరంభమయ్యాయంటారు ఈ దంపతులు ఇంకా గోదావరి,కృష్ణాపుష్కరాలు, ఇబ్రహీంపట్నం పవిత్ర నదీసంగమ అనుసంధానం వంటి పెద్దపెద్ద కార్యక్రమాల్లో శుభసూచికంగా అఖండ శంఖారావం పూరించాం. ఈసందర్బంగా పలు సంస్థల నుంచి గౌరవ డాక్టరేట్లు, అవార్డులు, సత్కారాలు, సువర్ణ ఘంటాకంకణాలు లభించాయన్నారు. ఇదంతా కేవలం సాధనతోనే సాధ్యమైందని, పదేళ్లపాటు దీన్ని సాధన చేశామని నరసింహారావు దంపతులు పేర్కొన్నారు.