arsenic
-
మీ రైస్లో ఆర్సెనిక్ ఉందా!?
వరి. విశ్వవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలకు నిత్యం కడుపునింపే అమృతం. ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఎన్ని చిరుతిళ్లు, ఇతర చల్లనిపానీయాలు తాగినా కాస్తంత వరి అన్నంతో భోజనం చేస్తేనే కడుపు నిండిన సంతృప్తికర భావన కల్గుతుంది. జీవకోటి ప్రాణాలు నిలుపుతున్న వరిలో ఇప్పుడు అత్యంత విషపూరిత ఆర్సెనిక్ మూలకం స్థాయిలు ఎక్కువ అవుతున్నట్లు తాజా అధ్యయనం ఒకటి చేదు నిజాన్ని బయటపెట్టింది. యథేచ్ఛగా జరుగుతున్న మానవ కార్యకలాపాలు, అడవుల దహనం, శిలాజ ఇంధనాల వాడకంతో వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. ఇప్పుడీ వాతావరణ మార్పుల విపరిణామాలు వరి పంటలపై పడుతున్నాయని స్పష్టమైంది. వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగి, కార్భన్డయాక్సైడ్, కర్భన ఉద్గారాల స్థాయిలు పెరగడంతో వాటి కారణంగా పొల్లాల్లో మట్టి, నీటి నుంచి ఆర్సెనిక్ మూలకం అత్యధికంగా వరిధాన్యంలోకి చేరుతోంది. విషాల రారాజుగా పేరొందిన ఆర్సెనిక్ పాళ్లు వరిలో పెరిగితే ఆరోగ్యంపై దాని దు్రష్పభావాలు దారుణంగా ఉంటాయి. ఆర్సెనిక్ స్థాయి పెరిగిన వరి అన్నాన్ని ఆహారంగా తీసుకుంటే చర్మ, ఊపిరితిత్తుల సంబంధ క్యాన్సర్లతో పాటు ఎన్నోరకాల తీవ్ర ఆరోగ్య సమస్యలు మనిషిని చుట్టుముట్టడం ఖాయం. రక్తసరఫరా, రోగ నిరోధక వ్యవస్థలు, కాలేయం, మూత్రపిండాలు, మూత్రాశయం, చర్మం, ప్రోస్టేట్ గ్రంథి వంటి శరీర భాగాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. హృద్రోగ సమస్యతోపాటు మధుమేహ వ్యాధి ప్రబలే ప్రమాదముంది. గర్భిణుల్లో పిండం సరిగా ఎదగపోవడం, అకాల మరణాలు సంభవించే ముప్పు ఉంది. వాతావరణ మార్పుల కారణంగా వాతావరణంలోని వెలువడుతున్న అధిక కర్భన ఉద్గారాలు, ఉష్ణోగ్రతల పెరుగుదలతో అమృతాహారం కాస్తా విషాహారంగా మారుతున్న వైనాన్ని శాస్త్రవేత్తలు వివరించారు. కొలంబియా విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల బృందం చేసిన ఈ అధ్యయన ఫలితాలు ‘లాన్సెట్ ప్లానిటరీ హెల్త్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అకర్బన ఆర్సెనిక్తో మరింత ప్రమాదం ఆర్సెనిక్ కర్భన, అకర్బన రూపాల్లో సహజంగానే నేల పొరల్లో ఉంటుంది. మానవునికి అకర్బన ఆర్సెనిక్తో పోలిస్తే అకర్బన ఆర్సెనిక్తో ముప్పు చాలా ఎక్కువ. వరిపంట మడుల్లో నీటితో నింపినప్పుడు మట్టిలోని ఆర్సెనిక్ వరినాట్ల ద్వారా వరిధాన్యంలోకి చేరుతుంది. అధ్యయనంలో భాగంగా పదేళ్లపాటు చైనాలో వేర్వేరు వాతావరణ పరిస్థితుల్లో సాగుచేస్తున్న 28 రకాల వరి వంగడాలపై శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, వాతావరణంలో కార్భన్డయాక్సైడ్ స్థాయిలు పెరిగినప్పుడు ఆర్సెనిక్ శోషణ స్థాయిలూ పెరుగుతున్నాయి. దీంతో వరి ధాన్యంలో ఆర్సెనిక్ స్థాయిలు ఎక్కువవుతున్నాయి. ఇలాగే కొనసాగితే ఒక్క చైనాలోనే వరి అన్నం తినడం వల్ల 1.93 కోట్ల క్యాన్సర్ కేసులు పెరుగుతాయని న్యూయార్క్లోని కొలంబియా వర్సిటీలోని వాతావరణ ఆరోగ్య శాస్త్ర సహాయ అధ్యాపకులు, ఈ పరిశోధనలో సహ రచయిత లెవీస్ జిస్కా చెప్పారు. ఉష్ణోగ్రత మరో 2 డిగ్రీల సెల్సియస్ పెరిగితే మరో పాతికేళ్లలో వాతావరణంలో కార్బన్డయాక్సైడ్ ప్రతి 10 లక్షలకు 200 పాళ్లు ఎక్కువవుతుందని ఆయన పేర్కొన్నారు. మతలబు అంతా వరిమళ్లలోనే వేల సంవత్సరాల క్రితం వరిసాగు లేదు. అక్కడక్కడా పెరిగిన వరికంకుల నుంచే వరిధాన్యాన్ని సేకరించి వండుకుని తిన్నారు. ఆ వరిమొక్కల మొదళ్ల వద్ద ఎలాంటి నీరు నిల్వ ఉండేదికాదు. ఇప్పుడు నాగరిక సమాజంలో మడులు కట్టి నీటిని నిల్వచేసి వరిసాగు చేస్తున్నారు. వరి మొక్కల మొదళ్ల వద్ద పూర్తిగా నీరు ఉంటుంది. దీంతో మట్టిలో సహజ ఆక్సిజన్ ఉండదు. దీంతో మొక్క వేర్ల వద్ద అన్ఎరోబిక్ బ్యాక్టీరియా శక్తి సంగ్రహణ కోసం ప్రత్యామ్నాయంగా ఆర్సెనిక్ అణువులను లాగేస్తుంది. అలా గతంలో పోలిస్తే ఆర్సెనిక్ వరిధాన్యంలోని వచ్చి చేరుతోంది. కాలుష్యం, తదితర మానవ ప్రేరేపిత వాతావరణ మార్పుల కారణంగా నేలలో కర్భన ఉద్గారాలు పెరిగి, ఉష్ణోగ్రత ఎక్కువై ఈ ఆర్సెనిక్ సంగ్రహణ రేటు పెరుగుతోంది. అరికట్టే మార్గాలున్నాయి వరిధాన్యంలోని ఆర్సెనిక్ వంట ద్వారా ఒంటిలోకి చేరకుండా అడ్డుకునే చిట్కాలున్నాయి. బ్రౌన్ రైస్తో పోలిస్తే తెల్ల బియ్యంలో పోషకాలు తక్కువ. అలాగే ఆర్సెన్ పాళ్లు కూడా తక్కువే. అందుకే బ్రౌన్రైస్ బదులు తెల్ల అన్నం తింటే కాస్త దీని ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. ఇతర రకాలతో పోలిస్తే బాస్మతి రకం బియ్యంలోనూ ఆర్సెనిక్ తక్కువగా ఉంటుంది. ఆగ్నేయాసియా, అమెరికా, యూరప్ దేశాల్లోని రకాలతో పోలిస్తే తూర్పు ఆఫ్రికాలో దొరికే వరిలో ఆర్సెనిక్ తక్కువగా ఉంటోంది. ‘‘ అప్పటికే మరుగుతున్న నీటిలో బియ్యాన్ని పోసి ఉడకబెట్టండి. ఒక ఐదు నిమిషాల తర్వాత ఆ నీటినంతా పారబోయండి. తర్వాత మళ్లీ కొత్తగా నీళ్లు జతచేసి అన్నం వండండి. గంజి వార్చకండి’’ అని బ్రిటన్లోని షెఫీల్డ్ యూనివర్సిటీ పరిశోధకులు చెప్పారు. ‘‘ వండటానికి ముందు బియ్యాన్ని బాగా కడగండి. తర్వాత ఒక పాలు బియ్యానికి, ఆరు పాళ్ల నీటిని జతచేసి వండండి’’ అని బ్రిటన్ ఆహార ప్రమాణాల ప్రాధికార సంస్థ సూచించింది.బ్రౌన్ రైస్ కంటే తెల్ల అన్నమే మంచిది ! ‘‘బ్రౌన్ రైస్లో అకర్బన ఆర్సెనిక్ ఎక్కువగా ఉంటుంది. తెల్ల అన్నంలో ఇది తక్కువగా ఉంటుంది. విషపూరిత ఆర్సెనిక్ కోణంలో చూస్తే ఆహారంగా బ్రౌన్ రైస్ కంటే పాలిష్ చేసిన తెల్ల అన్నమే మంచిది’’ అని శాస్త్రవేత్తలు చెప్పారు. తెల్ల అన్నంతో పోలిస్తే ముడి అన్నం, బ్రౌన్ రైస్ మంచివి అంటూ జనం కొత్తపోకడలో వెళుతున్న ఈ తరుణంలో శాస్త్రవేత్తలు తెల్ల అన్నమే ఉత్తమమని చెప్పడం గమనార్హం. ‘‘ వరిధాన్యంలో ఆర్సెనిక్ స్థాయిని తేల్చేందుకు ప్రపంచంలో విస్తృతస్థాయిలో జరిగిన తొలి అధ్యయనం ఇది’’ అని బెల్ఫాస్ట్లోని క్వీన్స్ యూనివర్సిటీ బయోలాజికల్ సైన్సెస్ విభాగ ప్రొఫెసర్ ఆండ్రూ మెహార్గ్ చెప్పారు. రంగు, రుచి, వాసన ఉండదు ఆర్సెనిక్ విషపూరితమైనదని ప్రాచీన మానవులకు కూడా తెలుసు. ఇది ఎలాంటి రంగు, రుచి, వాసన ఉండదు. ప్రాచీనకాలంలో రోమ్, యూరప్ దేశాల్లో శత్రువులను చంపేసేందుకు ఆర్సెనిక్ను ఇచ్చేవారని కథలు కథలుగా చెప్పేవారు. అయితే అత్యల్ప స్థాయిలో దీనిని తీసుకుంటే వెంటనే ఎలాంటి ప్రభావం చూపించదుగానీ స్లో పాయిజన్లా పనిచేసి దీర్ఘకాలంలో శరీరంపై తీవ్ర దు్రష్పభావాలను చూపిస్తుంది. అకర్బన ఆర్సెనిక్ అణువులు మానవశరీరంలోని జీవఅణువులతో అత్యంత సులభంగా బంధం ఏర్పర్చుకుంటాయి. కర్బన ఆర్సెనిక్ సహజంగా శిలలు, నేలల్లో ఉంటుంది. అకర్బన ఆర్సెనిక్ ఎక్కువగా గనుల తవ్వకం, బొగ్గును కాల్చడం ఇతర పారిశ్రామిక కార్యకలాపాల వల్ల వాతావరణంలోకి చేరుతుంది. ఇది నీటిలో కరుగుతుంది. పారిశ్రామిక వ్యర్థాలు నదీజలాల్లోకి పారి ఆ నీటితో పండించే పంటల ద్వారా మానవ శరీరాల్లోకి చేరుతోంది. దక్షిణ అమెరికా, దక్షిణ, మధ్యాసియా దేశాల్లోని భూగర్భ జలాల్లోనూ అకర్బన ఆర్సెనిక్ ఉంటోంది. అమెరికాలో దాదాపు 21 లక్షల మంది ప్రజలు ఇలా అకర్బన∙ఆర్సెనిక్ ఉన్న నీటినే తాగుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిమితులను దాటిన ఆర్సెనిక్ ఉన్న జలాలనే ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల మంది జనం తాగుతున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
బియ్యాన్ని తప్పనిసరిగా కడగాలా? నిపుణులు ఏమంటున్నారంటే..!
మన భారతదేశంలో బియ్యమే ప్రధాన ఆహారం. ఎన్ని వెరైటీ టిఫిన్లు తిన్నా.. నాలుగు మెతుకులు కడిపులో పడితేనే హాయిగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనకు మంచి శక్తినిచ్చి ఎక్కువ సేపు పనిచేయగలిగే సామర్థ్యాన్ని అందించేది బియ్యం మాత్రమే. అలాంటి బియ్యాన్ని వండటానికి ముందు తప్పనిసరిగా కడగాల్సిందేనా? మరి నిపుణులు ఏమంటున్నారు..? ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలకు బియ్యమే ప్రధాన ఆహారం. ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన మంచి ఆహారం. కార్బోహైడ్రైట్లకు మూలం. పైగా శరీరానికి తక్షణ శక్తి ఇచ్చే పౌష్టికమైన ఆహారం కూడా. మనల్ని శక్తిమంతంగా ఉండేలా చేసేది, చక్కగా ఫిట్నెస్పై దృష్టిసారించి కసరత్తులు చేయడానికి తోడ్పడేది అయిన బియ్యంలో మెగ్నీషియం, సెలీనియం, మాంగనీస్, ఫైబర్, బీ విటమిన్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. అలాంటి బియ్యాన్ని వండడానికి ముందు కడగడం అవసరమా అంటే..? ఎందుకు కడగాలంటే.. నిపుణులు తప్పనిసరిగా బియ్యాన్ని వండటానికి ముందు కడగాల్సిందేనని చెబుతున్నారు. ఆర్సెనిక్ వంటి విష పదార్థాలు ఉంటాయని, అందువల్ల కడగాలని తెలిపారు. నానాబెట్టి కడగడం ఇంకా మంచిదని, దీనివల్ల ఆ బియ్యంలో ఉన్న ఆర్సెనిక్, మట్టి వంటివి నీటిలో కరిగి సులభంగా కరిగి బయటకి వెళ్లిపోతాయని అన్నారు. ఇలా చేస్తే ఆరోగ్యానికి హాని కలిగించే ధూళి, గులకరాళ్లు, మిగిలిపోయిన శిథిలాలు వంటి అవాంఛనీయ పదార్థాలు ఏమైనా ఉన్నా కడగడం వల్ల నీళ్ల ద్వారా బయటకు వెళ్లిపోయి బియ్యం చక్కగా క్లీన్ అవుతాయని పేర్కొన్నారు. ఇలా కడిగితే ఆ బియ్యంపై ఉండే పిండిలాంటి పదార్థం బయటకు పోయి అన్నం చక్కగా అతుక్కోకుండా పొడిపొడిగా ఉటుందని చెప్పారు. అలాగే ఇలా వాష్ చేస్తే మైక్రో ప్లాస్టిక్లను ఈజీగా తొలగించగలమని అన్నారు. ముఖ్యంగా పారిశ్రామిక వ్యర్థాలు, మైనింగ్ కార్యకలాపాలు, బొగ్గును కాల్చడం వంటి వాటివల్ల భూగర్భజలాల్లోకి ఆర్సెనిక్ సులభంగా ప్రవేశిస్తుంది. పలితంగా భారీగా నీటి కాలుష్యం ఏర్పడుతుంది. అక్కడ నుంచి ఆ నీరు కాస్త పంట నీటి పారుదలకు, వంట కోసం ఉపయోగించే వాటిలోకి సరఫరా అవుతుంది. అందులోనూ వరి మరీ ఎక్కువగా ఆర్సెనిక్ కలుషితానికి గురవ్వుతుంది. ఎందుకంటే..? వరిపోలాలకు నీటి అవసరం ఎక్కువ, పైగా వరదల టైంలో ముంపునకు గురవ్వుతాయి కూడా. అలా.. ఈ ఆర్సెనిక్ వాటిలో ఎక్కువగా ఉంటుంది. ఆర్సెనిక్ వల్ల వచ్చే సమస్యలు ఎరుపు లేదా వాపు చర్మం కొత్త మొటిమలు లేదా గాయాలు పొత్తికడుపు నొప్పి వికారం, వాంతులు అతిసారం అసాధారణ గుండె లయ కండరాల తిమ్మిరి వేళ్లు, కాలి జలదరింపు చర్మం నల్లబడటం గొంతు నొప్పి నిరంతర జీర్ణ సమస్యలు మొదలైనవి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, దీర్ఘకాలిక లక్షణాలు మొదట చర్మంపై కనిపిస్తాయి. ఆ తర్వాత ఇలా బహిర్గతం అయిన ఐదు ఏళ్లలోపు అందుకు సంబంధించిన కేసులు, మరణాలు నమోదవ్వుతాయి. అందువల్ల ఆరోగ్యకరమైన, రుచికరమైన అన్నం తినాలనుకుంటే బియ్యాన్ని తప్పనిసరిగా శభ్రంగా కడగాలని నిపుణులు చెబుతున్నారు. గుర్తుంచుకోవలసిన విషయాలు.. ఆరోగ్యకరమైన, రుచికరమైన అన్నం తయారీకి గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ రోగులు వంటి వారు గ్లూకోజ్ కంటెంట్ తక్కువగా ఉండాలనుకుంటే.. నానాబెట్టి చక్కగా కడిగి వండుకోవాలని సూచిస్తున్నారు. బరువు తగ్గాలనుకునేవారు బ్రౌన్ రైస్ వంటి వాటిని తినండి. బ్రౌన్రైస్ వైట్రైస్ కంటే ఎక్కువ ఫైబర్, ప్రోటీన్లను కలిగి ఉంటుంది. (చదవండి: జైల్లో బరువు తగ్గిన కేజ్రీవాల్:మధుమేహం కారణమా?) -
అమ్మో ఆర్సెనిక్!
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాలపై ఆర్సెనిక్ పంజా విసురుతోంది. భూగర్భ జలాలను అధికంగా తోడేస్తుండటంవల్ల కొన్ని ప్రాంతాల్లో జలమట్టం ప్రమాదకర స్థాయికి పడిపోయింది. ఆ ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో విషపూరితమైన ఆర్సెనిక్ మూలాలు కన్పిస్తున్నాయి. బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) ప్రమాణాల ప్రకారం లీటర్ నీటిలో 0.01 మిల్లీ గ్రాముల్లోపే ఆర్సెనిక్ మూలాలు ఉండొచ్చు. కానీ.. గుంటూరు జిల్లాలోని రెండుచోట్ల.. నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కోచోట, తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో రెండుచోట్ల భూగర్భ జలాల్లో బీఐఎస్ ప్రమాణాల కంటే అధికంగా ఆర్సినిక్ మూలాలున్నాయని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) గుర్తించింది. ఈ నీటిని తాగినా, ఆ నీటితో సాగుచేసిన పంటల ఉత్పత్తులను తిన్నా మనుషులు, పశువుల జీర్ణ, శ్వాసకోస వ్యవస్థ అతలాకుతలమవుతుందని.. బోన్మ్యారో (ఎముక మజ్జ), చర్మ క్యాన్సర్ బారినపడే అవకాశం ఉంటుందని వైద్య, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 20 రాష్ట్రాల్లోని 222 ప్రాంతాల్లో అధికం 1980లో పశ్చిమ బెంగాల్లోని భాగీరథి నదీ తీరంలో సీడబ్ల్యూసీ నిర్వహించిన అధ్యయనంలో ఆర్సెనిక్ మూలాలు తొలిసారి బయటపడ్డాయి. దాంతో దేశవ్యాప్తంగా సీడబ్ల్యూసీ వీటిపై క్రమం తప్పకుండా అధ్యయనం చేస్తోంది. తాజాగా నిర్వహించిన అధ్యయనంలో 20 రాష్ట్రాల్లోని 222 ప్రాంతాల్లో ఆర్సెనిక్ ప్రభావం అధికంగా ఉన్నట్లు తేలింది. లీటర్ నీటిలో 0.01 నుంచి 0.05 మిల్లీగ్రాముల వరకూ ఆర్సెనిక్ విషమూలాలు ఉన్నాయని సీడబ్ల్యూసీ వెల్లడించింది. పశి్చమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, అసోం, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో దీని ప్రభావం అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. బోరు బావుల నీటితో అధ్యయనం ఇక ఏపీలో 13 జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో బోరు బావుల నుంచి నీటిని సేకరించిన సీడబ్ల్యూసీ.. వాటిలో ఆర్సెనిక్ మూలాలపై లోతుగా అధ్యయనం చేసింది. ఆ అధ్యయనంలో వెల్లడైన అంశాలివీ.. ► గుంటూరు రూరల్ మండలం ఎటుకూరులో బోరు బావుల నుంచి సేకరించిన నీటిలో ఒక లీటర్లో 0.01 మిల్లీ గ్రాములు ఉన్నట్లు తేలింది. చేబ్రోలు మండలం వడ్డమూడిలో 0.02 మిల్లీ గ్రాములున్నట్లు వెల్లడైంది. ► అలాగే, నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరాటంపాడులో 0.03 ఉన్నట్లు గుర్తించారు. ► కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రత్న గ్రామంలో 0.02 మీల్లీ గ్రాములు ఉంది. ► ఇక తెలంగాణాలోని పది ఉమ్మడి జిల్లాల్లోనూ సీడబ్ల్యూసీ విస్తృతంగా అధ్యయనం చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చివ్వేముల మండలం కుడాకుడా, సూర్యాపేటలలో సేకరించిన బోరు బావుల నీటిలో లీటర్లో 0.01, 0.02 మిల్లీగ్రాముల ఆర్సినిక్ ఉన్నట్లు గుర్తించారు. ఉపరితల జలాలే సురక్షితం కాగా, ఆర్సెనిక్ మూలాలు బహిర్గతమైన ప్రాంతాల్లో భూగర్భ జలాలను తాగడానికి, పంటల సాగుకు వినియోగించవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సీడబ్ల్యూసీ సూచించింది. ఆ ప్రాంతాల్లో పంటల సాగుకు ఉపరితల, నదీ జలాలను సరఫరా చేయాలని కోరింది. భూగర్భ జలాలను పెంపొందించే చర్యలను చేపట్టడం ద్వారా జలమట్టాన్ని పెంచవచ్చునని.. తద్వారా ఆర్సెనిక్ ప్రభావాన్ని తగ్గించవచ్చునని తెలిపింది. -
అన్నం వండి ఆర్సెనిక్ వార్చేయండి!
మీరు నమ్మినా, నమ్మకున్నా మనం తినే అన్నంలో భయంకరమైన విషం ఉందంటున్నారు ఆహార, రసాయన నిపుణులు. దాని పేరే ఆర్సెనిక్. ఆ విషం విషయమేమిటో తెలుసుకోవాలంటే అసలు ముందుగా ఆర్సెనిక్ అంటే ఏమిటో తెలుసుకుంటే మంచిది. పూర్వకాలంలో రాజరిక పరిపాలన సమయంలో, అంతఃపుర కుట్రల్లో ప్రత్యర్థులను నిశ్శబ్దంగా మట్టుబెట్టడానికి ఉపయోగించే విషమే ఆర్సెనిక్. ఇది ఎంత ప్రభావవంతమైనదంటే నెమ్మదిగా ఇస్తూపోతే స్వాభావిక మరణంలా అనిపించేలా మృత్యువు పాలవుతారు. లేదా పెద్దమోతాదులో ఇస్తే ఠక్కున మృతిచెందుతారు. ప్రముఖ నియంత నెపోలియన్ ఆర్సెనిక్ పాయిజనింగ్తో మరణించాడనే మాట ఒకటి ప్రచారంలో ఉంది. ఇక జేమ్స్బాండ్ సినిమాల్లోని గూఢచారులు శత్రువుల చేతికి చిక్కినప్పుడు ఒక విషపు మాత్రను నోట్లో వేసుకొని మరణిస్తుంటారు. ఇందుకోసం ఉపయోగించే విషాలలో ఒకటి సైనైడ్ కాగా రెండోది ఆర్సెనిక్. అయితే శత్రువులను తుదముట్టించడం కోసం ఉపయోగించేందుకు ఆర్సెనిక్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా అన్నం పెడితే సరిపోతుందా అన్న పరిస్థితి ఇటీవల మన సమాజం ముందుంది. కాస్త అతిశయోక్తిగా అనిపించినా ఇది నిజం అంటున్నారు ఆహార, రసాయన నిపుణులు. రసాయన ఎరువులు, పురుగుమందులతో మట్టిలోకి అన్ని విషాలతో పాటు ఆర్సెనిక్ ఇంకుతోంది. అది మళ్లీ మొక్కల్లోంచి మనుషుల దేహాల్లోకి వచ్చి ప్రమాదఘంటికలను మోగిస్తోందని వారు హెచ్చరిస్తున్నారు. ఆ ప్రమాదం నుంచి తప్పుకోవడం ఎలాగో కూడా సూచిస్తున్నారు. ఆ విషయాలను తెలుసుకునేందుకు పుణేలోని నేషనల్ కెమికల్ లేబరేటరీకి చెందిన నిపుణులు చెబుతున్న అంశాలివి... రసాయనిక ఎరువుల, పురుగుమందుల విస్తృత ఉపయోగంతో మనం తినే వరి అన్నం, బంగాళదుంపలు తదితర ఆహార పదార్థాల్లోకి విషం... అందునా ప్రమాదకరమైన ఆర్సెనిక్ విషం చేరే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల డయాబెటిస్, క్యాన్సర్ వ్యాధులు వంటి వ్యాధులు ప్రబలే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు పుణేలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ కెమికల్ లేబరేటరీ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఓ. జి. బి. నంబియార్. మనం తినే ఆహారంలోని విషపదార్థాలపై అనేక ఆసక్తికరమైన అంశాలను ఆయన వెల్లడించారు. మన దేహం నుంచి వ్యర్థాల రూపంలో విసర్జితమైపోయే ఆర్సెనిక్తోపాటు మనకు అవసరమైన థయామిన్ పోషకం దేహం నుంచి అతిగా బయటకు వెళ్లిపోతుండడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే దీనికి విరుగుడు కూడా ఆయన సూచిస్తున్నారు. వరి అన్నం వండినప్పుడు గంజి వార్చితే బియ్యంలోని ఆర్సెనిక్ విషం చాలా వరకు పోతుందని ఒక పరిష్కారం చెబుతున్నారు. అయితే మరికొన్ని ప్రత్యామ్నాయ ఆహారాలను ఆయన సూచిస్తున్నారు. థయామిన్ పుష్కలంగా ఉండే కొర్రలు వంటి చిరుధాన్యాలను ప్రధాన ఆహారంగా తీసుకుంటే ఆర్సెనిక్ బాధ తప్పుతుందని, థయామిన్ కొరత ఉండదు కాబట్టి డయాబెటిస్ సమస్య కూడా రాకుండా ఉంటుందని ఆయన అంటున్నారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన ప్రకృతి ఆహారోత్సవంలో పాల్గొన్న డాక్టర్ నంబియార్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. వివరాలు.. ఆయన మాటల్లోనే.. ►మనిషి దేహంలోకి వరి అన్నం, బంగాళదుంపల ద్వారా ఆర్సెనిక్ విషం ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించే ఆ ఆర్సినిక్ రక్తంలోని థయామిన్ను మూత్రం ద్వారా అతిగా బయటకు వెళ్లిపో యేలా చేస్తుం టుంది. ధయామిన్ మనకు ఉపయోగకరమైన, అత్యంత కీలకమైన పోషకం. అది పోవడం మనకు నష్టం. ►ఆహారంలో ఆర్సినిక్ ఉన్నప్పుడు థయామిన్ ఎంత ప్రభావపూర్వకంగా పనిచేయాలో అంతగా పనిచేయదు. దాంతో మన శరీరంలో స్రవించిన ఇన్సులిన్ కూడా ఎంత ప్రభావవంతగా ఉండాలో అంత ప్రభావవంతంగా తన కార్యకలాపాలు సాగించలేదు. ఫలితంగా ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ వస్తుంది. సరిగ్గా ఇలాంటి పరిణామమే టైప్–2 డయాబెటిస్లోనూ ఉంటుంది. ►ఇక డయాబెటిస్ రోగుల దేహంలో వారి అవసరాలతో పోలిస్తే కేవలం 20% మాత్రమే థయామిన్ అందుబాటులో ఉంటుంది. ►థయామిన్ గ్లూకోజ్తో జత చేరినప్పుడే జీవక్రియ సక్రమంగా జరుగుతుంది. అయితే థయామిన్ లోపం వల్ల జీవక్రియలు సక్రమంగా జరగకపోవడంతో పాటు అనేక వరస పరిణామాలు సంభవిస్తాయి. ►2012–15 మధ్యకాలంలో అమెరికాకు చెందిన ఎఫ్.డి.ఎ. 1200 రకాల వరి బియ్యంపై అధ్యయనం చేసి... వరి బియ్యంలో అధికపాళ్లలో ఆర్సెనిక్ విషం ఉందని నిర్ధారణ చేసింది. ►చాలా మంది ఆరోగ్యం కోసం పాలిష్ చేసిన బియ్యం కంటే పాలిష్ చేయని ముడిబియ్యాన్ని వాడుతుంటారు. పాలిష్ చేసిన బియ్యంలో పోషకాలు వెళ్లిపోతాయని, అదే ముడిబియ్యంలో పోషకాలు చాలావరకు పోవని చాలామందిలో ఒక అభిప్రాయం ఉంది. అయితే పాలిష్ చెయ్యని ముడిబియ్యంలో ఆర్సెనిక్ విషం మరింత ఎక్కువగా ఉంటుంది. బియ్యం పైపొరలో ఆర్సెనిక్ విషం ఎక్కువగా ఉంటుంది. ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి ఆర్సనిక్ విష ప్రభావాలు తగ్గించే దిశగా మరికొన్ని పరిశోధనలూ జరుగుతున్నాయంటున్నారు డాక్టర్ నంబియార్. వాటి గురించి ఆయన చెబుతున్న అంశాలివి... ► రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడుతున్నప్పటి నుంచి, అధిక దిగుబడి వరి వంగడాలను వాడుతున్నప్పటి నుంచి ఆర్సెనిక్ విషం వరి అన్నంలో ఎక్కువ మోతాదులో ఉంటున్నదేమో అనే విషయంపై ఇంకా అధ్యయనం చేయాల్సి ఉంది. ∙ఒక బాక్టీరియా ద్రావణాన్ని ఉపయోగించడం ద్వారా వరి మొక్కల వేళ్లు ఆర్సెనిక్ విషాన్ని మట్టి నుంచి పీల్చుకోకుండా ఉండే ఒక సాగు పద్ధతిపై నా అధ్యయనం ఇంకా కొనసాగుతోంది. ఇది విజయవంతమైతే ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు మేలు జరుగుతుంది. అయితే ఈ పరిశోధన పూర్తికావడానికి ఇంకా కొన్నాళ్ల సమయం పడుతుంది ∙ వరి బియ్యం, బంగాళదుంపలు, ఇతర ధాన్యాలు, మూత్రం, నీరు, గోళ్లు, వెంట్రుకలలో ఆర్సెనిక్ ఎంత ఉన్నదీ 20 నిమిషాల్లో తెలిపే ఒక కిట్ (క్వాంటిటేటివ్ ఆర్సెనిక్ మోనిటర్)ను నేను కనుగొన్నాను. యునిసెఫ్ ఆర్థిక సహాయంతో బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్లలో తాగునీటిలో ఆర్సెనిక్పై పరిశోధనలో భాగంగా 2000 సంవత్సరంలో దీన్ని కనుగొన్నాను. దీన్ని సాధారణ వ్యక్తి ఎవరైనా ఉపయోగించి ఆయా ఆహార పదార్థాల్లో ఆర్సెనిక్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు ∙డయాబెటిక్ రోగులు బెన్ ఫో థయామిన్ (విటమిన్ బి1) 200 ఎం.జి. టాబ్లెట్ను భోజనంతో పాటుగా (రోజుకు రెండు) తీసుకోవచ్చు. వట్టి థయామిన్ మాత్ర తీసుకోవడం కన్నా కొవ్వులో కరిగే థయామిన్ డెరివేటివ్ను వాడటం మంచిది. భయం లేదు... జాగ్రత్తలివే... ►కొర్రలు వంటి చిరుధాన్యాలు థయామిన్ అధికపాళ్లలో కలిగి ఉంటాయి గాకీ ఆర్సెనిక్ను ఏమాత్రం కలిగి ఉండవు. ఇలాంటి విషం లేని వాటిని ప్రధాన ఆహారంగా తీసుకుంటే సమస్య ఉండదు. అయితే, వరి బియ్యం తినటం అనేది అనాదిగా మన ఆహారపు అలవాటు. వరి బియ్యం తినటాన్ని వెంటనే మానుకోలేం. కాబట్టి వరి బియ్యాన్ని ఆరు రెట్లు ఎక్కువ నీరు పోసి ఉడికించి... గంజి వార్చి పారబోస్తే అన్నంలోని ఆర్సెనిక్ చాలా వరకు పోతుంది. అయితే ఇలా వార్చిన గంజి పశువులకు కూడా మంచిది కాదు. ∙వరి మొక్కల వేళ్ల మారిదిగానే బంగాళదుంప మొక్కల వేళ్లు కూడా ఆర్సెనిక్ విషాన్ని మట్టి నుంచి ఎక్కువగా గ్రహిస్తుంటాయి. బంగాళదుంపల్లో 70 శాతం నీరుంటుంది. బంగాళదుంప చిప్స్లో ఆర్సెనిక్ విషం పాళ్లు ఎక్కువగా ఉంటాయి. బంగాళదుంపను కోసి బాగా కడిగితే ఆర్సెనిక్ పోతుంది. కడగకుండా అలాగే వేపితే ఆర్సెనిక్ అందులోనే ఉండిపోతుంది. ∙గర్భవతులు వరి బియ్యంతో వండిన అన్నం అసలు తినకుండా చిరుధాన్యాలు తదితర ఆహార ధాన్యాలు తినటం మంచిది. ఐదేళ్ల లోపు పిల్లలకు కూడా వరి అన్నం తినిపించకుండా ఉంటేనే మంచిది. వారికి మొదటినుంచి చిరుధాన్యాలతో చేసిన వంటకాలు తినిపించడం మంచిది. -
అన్నంలో పాషాణం అవుట్!
నీటిని నిల్వగట్టే పద్ధతిలో సాగైన బియ్యం ద్వారా మనిషి దేహంలోకి ప్రవేశించే పాషాణం(ఆర్సెనిక్) అనే భార ఖనిజం.. గుండె, మధుమేహ, నాడీమండల వ్యాధులు, ఊపిరితిత్తుల, మూత్రకోశ క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమవుతోంది. ఇతర ఆహార పంటల కన్నా నీటిని నిల్వగట్టే పద్ధతిలో సాగయ్యే వరి మొక్కలు పది రెట్లు అధికంగా పాషాణాన్ని గ్రహిస్తున్నాయని ఐరోపా ఆహార ప్రమాణ సంస్థ లెక్క తేల్చింది. ప్రపంచంలో సగం మందికి ప్రధానాహారమైన బియ్యంలో నుంచి పాషాణాన్ని తీసెయ్యడం ఎలా? అన్నం వండే ప్రక్రియలో మార్పులు చేయడం ద్వారా పాషాణం పీడ విరగడ చేయొచ్చని శాస్త్రవేత్తలు జరిపిన తాజా పరిశోధనలో వెల్లడైంది. ఉత్తర ఐర్లాండ్లోని క్వీన్స్ యూనివర్సిటీ పరిశోధక బృందం ఈ విషయంలో మంచి ఫలితాలు సాధించింది. అన్నం ఉడుకుతున్నంత సేపూ ఆ పాత్రలో నుంచి నీటిని నిరంతరం ప్రవహింపజేయడం ద్వారా అన్నంలో పాషాణాన్ని మూడొంతులకు పైగా తగ్గించగలిగారు. ఈ పరిశోధనలో భాగంగా ప్రత్యేకమైన కుక్కర్ను ఆవిష్కరించారు. క్వీన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ వృక్ష, భూ సాంకేతిక ఆచార్యుడు ఆండీ మొహ్రాగ్, ఆహారంలో ముఖ్యంగా బియ్యంలోకి చేరిన పాషాణాన్ని తొలగించేందుకు జరుగుతున్న పరిశోధనల్లో ఇది మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఆరుతడి పద్ధతిలో రసాయనిక పురుగు మందులు వాడకుండా సాగు చేసిన బియ్యంలో ఆర్సెనిక్ బెడద అసలుండదా? తక్కువగా ఉంటుందా? అన్న ప్రశ్నలకు పరిశోధకులు సమాధానాలు వెతకాల్సి ఉంది. -
‘పొగ’ చూరిపోకండి... మసిబారిపోకండి
ఈ నెల 31‘యాంటీ టొబాకో డే’ ఒక ఫ్యాషన్గా మొదలయ్యే పొగతాగడం అన్న అలవాటు తల వెంట్రుకల దగ్గర్నుంచి మొదలై శరీరంలోని అన్ని భాగాలనూ దెబ్బతీస్తుంది. అన్ని పనులనూ అతి చులాగ్గా, అతి చురుగ్గా చేసే కార్యసాధకులు పొగతాగుతారనే తరహా ప్రకటనలతో యువత దీనిపట్ల ఆకర్షితమవుతుంటుంది. అంతే... పొగతాగడం వల్ల వాళ్లు చురుగ్గా నిర్వహించగలిగే చాలా చిన్న చిన్న పనులు కూడా ఒక దశ తర్వాత అతి కష్టంగా మారతాయంటే అతిశయోక్తి కాదు. అంతెందుకు ఊపిరి తీయడం కూడా అంతులేని భారంగా పరిణమించేంతగా పొగాకు దెబ్బతీస్తుంది. శరీరంలో తలవెంట్రుకల మొదలు కాలిగోటి వరకు ఉండే భాగాలతో పాటు అంతర్గతంగా ఉండే అనేక కీలక శరీర వ్యవస్థలు ఎలా దెబ్బతింటాయన్న అంశంపై అవగాహన కలిగించేదే ఈ ప్రత్యేక కథనం. పొగ... అనేక హానికర రసాయనాల మిశ్రమం పొగ వదులుతుండటం మనకు చాలా స్టైల్గా కనిపించవచ్చేమోగానీ... అందులోని రసాయనాలు ఎంత హానికరమో వర్ణించడానికి మాటలు చాలవు. ఒక సిగరెట్ పొగలో 7,000కు పైగా హానికర రసాయనాలు ఉంటాయి. వాటితో పాటు క్రోమియం, ఆర్సెనిక్, లెడ్, క్యాడ్మియం వంటి ప్రమాదకరమైన లోహాలూ ఉంటాయి. అంటే మనం నేరుగా లోహాలను శరీరంలోకి స్వీకరిస్తున్నామంటే ఎంత ప్రమాదమో ఆలోచించుకోవచ్చు. ఇలాంటి వాటినా మనం స్వీకరించేది! సిగరెట్ పొగ వదలడం చాలా ఫ్యాషనబుల్గా కనిపించవచ్చు. కానీ ఆ పొగలో ఏముంటాయో, అవి ఎందుకు ఉపయోగిస్తారో తెలుసుకుంటే మళ్లీ సిగరెట్ ముట్టాలంటేనే అసహ్యం అనిపిస్తుంది. ఉదాహరణకు... ఫార్మాల్డిహైడ్: సిగరెట్ పొగలో ఉండే ఫార్మాల్డిహైడ్ అన్న రసాయనాన్ని మృతదేహాలను సంరక్షించేందుకు వాడతారు. అనేక జువాలజీ ల్యాబ్లలో విద్యార్థులకు చూపించడానికి అనేక జీవుల మృతదేహాలను గాజుకుప్పెల్లో భద్రపరిచే విషయం తెలిసిందే. ఈ ఫార్మాల్డిహైడ్ ద్రావణంలోనే వాటిని ఉంచుతారు. బెంజీన్: మనం రోజూ వాడే పెట్రోలు, గ్యాస్లలో ఉండే వ్యర్థ పదార్థం ఇది. మనం ఆఘ్రాణించడానికి విముఖత చూపే విచిత్రమైన వాసనను వెలువరుస్తూ ఉంటుందిది. పొలోనియమ్: ఇది రేడియోధార్మిక పదార్థం. రేడియోధార్మికత వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అన్న విషయం తెలిసిందే. వినైల్ క్లోరైడ్: ఈ రసాయనాన్ని ప్లాస్టిక్ పైపులు, ప్లాస్టిక్ ఉపకరణాలు తయారు చేయడానికి వాడతారు. అంటే ఒకరకంగా చెప్పాలంటే సిగరెట్ తాగడం అంటే ఈ ప్లాస్టిక్ను శరీరంలోకి ఆహ్వానించడం లాంటిదే. అనేక వ్యాధులకూ కారణమే! పొగతాగడం కేవలం క్యాన్సర్లను మాత్రమే గాక... అనేక వ్యాధులనూ ప్రేరేపిస్తుంది. గుండెపోటు, రక్తపోటు, పక్షవాతంతో పాటు మధుమేహం వచ్చేలా చేస్తుందీ అలవాటు. మామూలు వారితో పోలిస్తే పొగతాగే అలవాటు ఉన్నవారిలో డయాబెటిస్ వచ్చేందుకు 30 - 40 శాతం వరకు ఎక్కువ అవకాశాలున్నాయి. ఇక పొగతాగడం మన పూర్తి వ్యాధి నిరోధకశక్తిని దెబ్బతీసి మరిన్ని వ్యాధులకు కారణం కావచ్చు. అనేక క్యాన్సర్లకు కారణం ఈ పొగ... సిగరెట్ తాగే వారికి వచ్చే ప్రధాన వ్యాధి క్యాన్సర్. అది ఎన్ని రూపాల్లో వస్తుందో ఊహించడమూ కష్టమే. సాధారణంగా పొగ దుష్ర్పభావాల వల్ల నోటి క్యాన్సర్లు, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్లను అందరూ ఊహిస్తారు. కానీ నిజానికి ఈ కింది క్యాన్సర్లన్నింటికీ పొగతాగే అలవాటే ప్రధాన కారణం. అవి... మూత్రాశయ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ (ప్రధానంగా ఆక్యూట్ మైలాయిడ్ ల్యుకేమియా) పెద్దపేగు క్యాన్సర్ మలద్వార క్యాన్సర్ ఈసోఫ్యాగియల్ క్యాన్సర్ మూత్రపిండాల క్యాన్సర్ యురేటర్ క్యాన్సర్ లారింజ్ క్యాన్సర్ కాలేయ క్యాన్సర్ ఓరోఫ్యారింజియల్ క్యాన్సర్స్ (గొంతు, నాలుక, అంగిలి, టాన్సిల్స్... అన్ని రకాల క్యాన్సర్లను కలగలిపి ఇలా పిలుస్తారు) పొట్టలో ఏ భాగానికైనా క్యాన్సర్ రావచ్చు (స్టమక్ క్యాన్సర్) ట్రాకియా, బ్రాంకస్, లంగ్ క్యాన్సర్స్. పొగతాగే తండ్రుల వల్ల పుట్టబోయే పిల్లల్లో క్యాన్సర్! బ్రాడ్ఫోర్ట్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం తల్లిదండ్రుల్లో పొగతాగే అలవాటు ఉంటే పిల్లలకు క్యాన్సర్లు... అందునా ప్రధానంగా ల్యుకేమియా వచ్చే అవకాశం ఎక్కువని తేలింది. దీనికి కారణాన్ని కూడా పరిశోధకులు చెబుతున్నారు. తమ జన్యువులను పిల్లలకు అందించే వీర్యకణాల్లోని డీఎన్ఏ... పొగ వల్ల దెబ్బతింటుంది. దాంతో లోపభూయిష్టమైన డీఎన్ఏ వల్ల పిల్లల్లో క్యాన్సర్ అవకాశాలు ఎక్కువ. అయితే ఈ రిస్క్ను తప్పించుకునేందుకు ఒక ఉపాయం కూడా ఉంది. దంపతులు గర్భధారణకు ప్లాన్ చేసుకున్న సమయం కంటే... కనీసం మూడు నెలల ముందే పొగతాగే అలవాటు మానేస్తే ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టే అవకాశం ఉందని చెబుతున్నారు ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న డాక్టర్ డయానా యాండర్సన్. ఒక వీర్యకణం ఉద్భవించాక అది పూర్తిస్థాయిలో పరిణతి చెందేందుకు కనీసం మూడు నెలల సమయం అవసరం. అందుకే కనీసం మూణ్ణెల్ల పాటు పొగతాగే అలవాటుకు దూరంగా ఉంటే డీఎన్ఏ దెబ్బతిన్న వీర్యకణాల స్థానంలో ఆరోగ్యకణాలు వస్తాయి కాబట్టి పిల్లల్లో క్యాన్సర్ అభివృద్ధి చెందే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయంటున్నారామె. తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికైనా పొగతాగకుండా ఉండాలని ఈ అధ్యయనం చెబుతోంది. మరింత ప్రమాదం ప్యాసివ్ స్మోకింగ్... కొందరు నేరుగా సిగరెట్ తాగకపోయినా... పొగతాగే వాళ్ల సాన్నిహిత్యంలో ఉంటుంటారు. ఫలితంగా పొగతాగడం వల్ల కలిగే దుష్ర్పభావాలన్నీ వీళ్లపైనా ఉంటాయి. పైగా సెకండ్హ్యాండ్ స్మోకింగ్గా పిలిచే ఈ ప్రక్రియ వల్ల ప్రమాద తీవ్రత మరింత ఎక్కువ. ఈ ప్యాసివ్ స్మోకింగ్కు ప్రధానంగా ఇంట్లోని అమాయకమైన పిల్లలు ఎక్కువగా గురవుతుంటారు. ఫలితంగా సిగరెట్ వల్ల పెద్దలకు వచ్చేందుకు అవకాశాలున్న వ్యాధులన్నీ పిల్లలకు సైతం వాళ్ల ప్రమేయం లేకుండానే రావచ్చు. తల్లిదండ్రుల ధూమపానంతో పిల్లల్లో కలిగే దుష్పరిణామాలు అకస్మాత్తుగా ఆస్తమా కనిపించడం శ్వాసకోశవ్యాధులు చెవి ఇన్ఫెక్షన్లు అకస్మాత్తుగా పిల్లలు మృతిచెందడం (దీన్నే సడన్ ఇన్ఫ్యాంట్ డెత్ సిండ్రోమ్ -సిడ్స్ అంటారు). పొగతాగే అలవాటున్న తల్లిదండ్రుల పిల్లలకు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు 25% నుంచి 30% అదనంగా ఉంటాయి. మహిళలూ... తస్మాత్ జాగ్రత్త! పురుషులతో పోలిస్తే మహిళల్లో పొగతాగే అలవాటు బాగా తక్కువే. అయితే సిటీల్లోని నాగరక సమాజంలో కొందరు స్త్రీలతో పాటు, ఉత్తరాంధ్రకు సంబంధించిన కొన్ని జిల్లాల్లో అడ్డపొగాకు పేర పొగతాగే అలవాటు మహిళల్లోనూ ఉంది. ఇక గర్భవతి అయిన మహిళకు పొగతాగే అలవాటు ఉంటే దాని దుష్పరిణామాలు మరీ మరీ ఎక్కువ. గర్భవతులైన మహిళల్లో పొగతాగడం వల్ల కనిపించే దుష్ర్పభావాల్లో కొన్ని... నెలలు నిండటానికి ముందే ప్రసూతి (ప్రీ-టర్మ్ డెలివరీ) మృతశిశువు జన్మించడం (స్టిల్ బర్త్) పుట్టిన శిశువు బరువు బాగా తక్కువగా ఉండటం పుట్టిన శిశువు అకస్మాత్తుగా చనిపోవడం (దీన్నే సిడ్స్ లేదా క్రిబ్ డెత్ అంటారు) ముత్యాల గర్భం (దీన్నే ఎక్టోపిక్ పెగ్నెన్సీ అంటారు) పుట్టిన పిల్లల్లో గ్రహణం మొర్రి కనిపించడం (క్లెఫ్ట్ ప్యాలెట్). ఇక మహిళలకు పొగతాగే అలవాటు ఉంటే వారి ఎముకల సాంద్రత వేగంగా తగ్గిపోయి పెళుసుబారి, తేలిగ్గా విరిగిపోతాయి. సిగరెట్ మానేస్తే...తక్షణం కలిగే ప్రయోజనాలు మీరు చాలాకాలం మీ కుటుంబంతో, మీ మిత్రులతో సురక్షితంగా, ఆరోగ్యంగా జీవిస్తారు. మీ పిల్లల పుట్టిన రోజులను చాలా చూస్తారు. మీరు జబ్బుపడే రోజులు తగ్గుతాయి. మీరు మందులకూ, చికిత్సలకూ పెట్టే ఖర్చూ చాలా వరకు తగ్గుతుంది. మీరు మరింత శక్తిమంతంగా ఉంటారు. మీరు తేలిగ్గా శ్వాసిస్తారు. అన్ని రకాల రుచులూ, వాసనలూ గ్రహిస్తారు. మీ రిటైర్మెంట్ తర్వాతి జీవితం చాలా హాయిగా ఉంటుంది. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి వెంట్రుకలనూ రాల్చేసే పొగ పొగతాగడం వల్ల వయసు పైబడటం అన్నది చాలా సాధారణ ప్రక్రియ అనీ, దాంతో చర్మం ప్రభావితమవుతుందన్నది తెలిసిందే. ఇదే ప్రభావం తలపైన ఉండే చర్మానికీ వర్తిస్తుంది. దాంతో ఆ భాగంలోని చర్మానికి వయసు త్వరగా మీద పడటంతో తలవెంట్రుకలు రాలిపోవడం చాలా సాధారణం. దీంతో పాటు తల వెంట్రుకలను పట్టి ఉంచే హెయిర్ ఫాలికిల్ తాలూకు డీఎన్ఏ బలహీనమవుతుంది. దాంతోపాటు హెయిర్ ఫాలికిల్ నుంచి వెంట్రుకకు రక్తసరఫరా దెబ్బతినడం కూడా వెంట్రుకను పూర్తిగా పెరగనివ్వకుండా చేసి, మధ్యలోనే తెగిపోయేలా చేస్తుంది. అందుకే పొగతాగేవారి వెంట్రుకలు పెళుసుగా మారి తమ పెరుగుదల చక్రం (సైకిల్) పూర్తి చేయకుండానే చిట్లిపోతాయి. దాంతో పొగతాగేవారి వెంట్రుకలు పలచబారిపోతాయి. కొందరిలో బట్టతల వచ్చే అవకాశం కూడా ఉంటుంది. పొగచూరిపోయే కళ్లు పొగతాగేవారి కంట్లో ఉండే పారదర్శకమైన లెన్స్ త్వరగా తన పారదర్శకతను కోల్పోతుంది. దాంతో వారికి ‘క్యాటరాక్ట్’ చాలా త్వరగా వచ్చేస్తుంది. మామూలుగానూ క్యాటరాక్ట్ వచ్చే అవకాశాలున్నా... పొగతాగడం వల్ల అవి రెట్టింపవుతాయి. ఈ అలవాటు కారణంగా ‘మాక్యులార్ డీజనరేషన్’ అనే వ్యాధి వచ్చి రెటీనాపై బ్లైండ్స్పాట్స్ ఏర్పడతాయి. మామూలుగానూ వయసు పెరగడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. కానీ పొగతాగే అలవాటు వల్ల వయసు త్వరగా పైబడటం అనే పరిణామం జరిగి అది ఈ ‘మాక్యులార్ డీజనరేషన్’కు దారితీస్తుంది. పొగతాగే అలవాటు ఉండి డయాబెటిస్తో బాధపడుతున్నవారిలో డయాబెటిక్ రెటినోపతికి కారణమై అది అంధత్వానికి దారితీసే అవకాశాలు మరింత ఎక్కువ. చెవులు... పొగలు పొగతాగే అలవాటు లేనివారితో పోలిస్తే పొగ తాగే వారిలో వినికిడి సమస్యలు వచ్చే అవకాశాలు 75 శాతం ఎక్కువ. సిగరెట్లో ఉండే ఫార్మాల్డిహైడ్, ఆర్సెనిక్, వినైల్ క్లోరైడ్, అమోనియాలతో పాటు నికోటిన్నూ కలుపుకుని ‘ఒటో టాక్సిక్’ పదార్థాలుగా పేర్కొంటారు. అంటే అవి వినికిడి శక్తిని లోపింపజేస్తాయన్నమాట. దీంతోపాటు పొగతాగే అలవాటు వల్ల శరీరాన్ని సమతౌల్యంతో (బ్యాలెన్స్డ్) గా ఉంచే మధ్యచెవిలోని యంత్రాంగం దెబ్బతిని, ఒళ్లు నిలకడగా ఉండే శక్తి కొరవడవచ్చు. అంతేకాదు. చెవిలో గుయ్ అంటూ శబ్దం వచ్చే టినైటిస్ అనే జబ్బు కూడా రావచ్చు. పొగలొదిలే ముక్కు... వాసన శక్తి తగ్గు సిగరెట్ పొగలను ధారాళంగా వదులుతుండే వారు నోట్లోంచే గాక... ముక్కుల్లోంచి వాటిని వదిలేస్తుంటారు. దాంతో ముక్కులో ఉండే అతి సునిశితమైన వాసనను గ్రహించే యంత్రాంగం దెబ్బతింటుంది. అంతేకాదు... ముక్కులోపలి పొరలను రక్షిస్తూ ఉండే పొరలు తీవ్రంగా నష్టపోవడంతో పాటు ముక్కులోంచి తలలో ఉండే గాలి గదులైన సైనస్లు కూడా దెబ్బతింటాయి. ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియాను నిరోధించే శక్తి కూడా ముక్కు కోల్పోతుంది. క్రానిక్ సైనుసైటిస్ అనే దీర్ఘకాలిక వ్యాధి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే. నోరు... నష్టపోయే తీరే వేరు పొగతాగడం అనే ప్రక్రియ నేరుగా నోటి ద్వారానే జరుగుతుంది కాబట్టి అన్ని అవయవాల కంటే నష్టం జరిగే అవకాశాలు నోటికే ఎక్కువ. పైగా నోటిలో సున్నితమైన మ్యూకస్ పొరలు ఉంటాయి. వీటిలో నోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలూ ఎక్కువే. పైగా వేర్వేరు జిల్లాల్లో ఉంటే రకరకాల పొగాకు వినియోగ అలవాట్ల (అంటే అడ్డపొగ తాగడం, బీడీలు కాల్చడం, గుట్కా తినడం వంటివాటి) వల్ల మన రాష్ట్రంలో నోటి క్యాన్సర్ కేసులు చాలా ఎక్కువ. నోటికి జరిగే నష్టాలు చాలా ఉన్నా వాటిలో ప్రధానమైనవి... నోటిలో ‘ల్యూకోప్లాకియా’ అనే పుండ్ల వంటివి ఏర్పడి, అవి క్యాన్సర్గా రూపొందవచ్చు. నోటి దుర్వాసన (హ్యాలిటోసిస్)కు అవకాశాలు చాలా ఎక్కువ. నోటిలో ఉండే పంటి చిగుళ్ళు, పలువరస ప్రభావితమై పళ్లు, చిగుళ్ళ వ్యాధులు (పెరియో డాంటల్ డిసీజెస్) రావచ్చు. చిగుళ్ళపై మచ్చలు రావడం (స్మోకర్స్ మెలనోసిస్), పళ్లు పసుపుపచ్చగా మారడం వంటి ప్రమాదాలు చాలా ఎక్కువ. నాలుకపై ఉండే అతి చిన్న చిన్న బుడిపెలపై బ్యాక్టీరియా, ఈస్ట్, నోటిలోని వ్యర్థాలు చిక్కుకుపోవడంతో నాలుక నల్లగా మారే ‘బ్లాక్ హెయిరీ టంగ్’ అనే కండిషన్కు దారితీయవచ్చు. నోటిలో ఉండే పైభాగమైన అంగిలి తన మృదుత్వాన్ని కోల్పోయి, పాలిపోయినట్లుగా తెల్లగా మారిపోయే ‘స్మోకర్స్ ప్యాలెట్’ అనే కండిషన్కు అవకాశాలు చాలా ఉంటాయి. నోటిలో ఉండే లాలాజల గ్రంథుల పనితీరు, ప్రభావం దెబ్బతిని కేవలం నోరు మాత్రమే గాక... అది మొత్తం జీర్ణవ్యవస్థపైనా దుష్ర్పభావం చూపవచ్చు. గొంతులో వాయురూప గరళం... పొగ నోటి ద్వారా పీల్చే సిగరెట్ పొగ మొదట ప్రవేశించేది గొంతులోకే కావడంతో నోటికి ఎంతగా నష్టం చేకూరుతుందో, గొంతుకూ అంతగానే నష్టం జరుగుతుంది. పొగపీల్చగానే అందులోని ఫార్మాల్డిహైడ్, ఆక్రోలీన్ అనే రసాయనాలు గొంతును మండిస్తాయి. స్వరం కూడా మారిపోయి దీర్ఘకాలంలో బొంగురుగానూ, చాలా లోగొంతుకతోనూ మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది. గొంతులోని లారింజ్స్ దెబ్బతిని లారింజైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధికి దారితీయవచ్చు. ఇక గొంతులో గడ్డలకూ, గొంతు క్యాన్సర్కు అవకాశాలు చాలా చాలా ఎక్కువ. మెదడుపై పొగ ప్రభావం సిగరెట్ పొగ మెదడుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. పొగతాగిన కొద్దిసేపటికే కొద్దిపాటి మత్తు కలగడంతో ఆ అలవాటు ఉన్నవారు దాని ప్రభావాన్ని గ్రహించగలరు. ఈ కిక్ తాపత్రయంతో పొగకు అలవాటు పడ్డవారిలో మెదడుపై అది చూపే అనేక రకాల దుష్ర్పభావాలను తెలుసుకుంటే పొగ తాగాలంటేనే భయం వేస్తుంది. అంత దారుణంగా ఉంటాయా ప్రభావాలు. ఉదాహరణకు పొగతాగేవారిలో రక్తనాళాలు సన్నబారే ప్రమాదం ఉన్నందున, అది మెదడు రక్తనాళాల్లో జరిగితే పక్షవాతం వచ్చి కదలలేక, కాళ్లూ చేతులు ఆడక - జీవితాంతం మరొకరిపై ఆధారపడుతూ జీవించాల్సి రావచ్చు. 65 ఏళ్లు దాటాక చాలామందిలో వచ్చే పక్షవాతానికి పొగతాగే అలవాటే ప్రధాన కారణం. ఇక ఒకసారి సిగరెట్లోని నికోటిన్కు మెదడు బానిస అయితే ఎలాగోలా సిగరెట్ తాగేందుకు వెంపర్లాడేలా అనేక మాయలు చేస్తుంది మెదడు. దీన్నే ‘క్రేవింగ్ ఎఫెక్ట్’ అంటారు. అందుకే సిగరెట్కు బానిస కాకుండా దాన్ని వదిలేయడం మేలు. శరీరంలోని ఏ భాగాన్ని నియంత్రించే రక్తనాళాలు మెదడులో సన్నబడ్డాయో, ఆ అవయవం పనితీరు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. గుండె, రక్తప్రసరణ వ్యవస్థపైనా... ప్రభావం గుండెపోటునూ, రక్తప్రసరణ వ్యవస్థను పొగతాగే అలవాటు అత్యంత తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ అలవాటు అనేక రకాల గుండెజబ్బులకు (కార్డియో వాస్క్యులర్ డిసీజెస్కు) కారణమవుతుంది. పొగవల్ల గుండెపై పడే దుష్ర్పభావాలలో కొన్ని... గుండెపోటు (హార్ట్స్ట్రోక్), గుండెకు సంబంధించిన రక్తనాళాల వ్యాధులు రావచ్చు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు సన్నబడితే గుండె శాశ్వతంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అంతేకాదు... ఇలా ఈ రక్తనాళాలు సన్నబారడం వల్ల రక్తం మరింత వేగంగా ప్రవహిస్తుంది. దాంతో రక్తపోటు పెరుగుతుంది. ఇక రక్తపోటు అన్నది నిశ్శబ్దంగా, పైకి ఏమాత్రం కనిపించకుండా శరీరంలోని అనేక కీలక అవయవాలను దెబ్బతీసి, మరణానికి కారణమవుతుందన్న విషయం తెలిసిందే. అందువల్లనే దాన్ని సెలైంట్ కిల్లర్గా అభివర్ణిస్తారు. అంతే పొగ తాగే అలవాటు రక్తపోటుకూ కారణమవుతుందన్నమాట. పొగ తాగే అలవాటు వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే అవకాశాలు ఉన్నాయి. వీటినే బ్లడ్క్లాట్స్గా అభివర్ణిస్తారు. ఈ రక్తపు క్లాట్స్ శరీరంలోని ఏయే భాగాల్లోని రక్తనాళాల్లో కనిపిస్తే, ఆయా భాగాలు శాశ్వతంగా చచ్చుబడిపోయే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ఈ క్లాట్స్ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో ఏర్పడితే గుండె కండరానికి తగిన ఆక్సిజన్ అందకపోవచ్చు. ఫలితంగా గుండె కండరం శాశ్వతంగా చచ్చుబడిపోయే ప్రమాదం ఉంది. ఈ రక్తపు గడ్డలు కాళ్లకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో ఏర్పడితే కాళ్లూ చచ్చుబడిపోయే ప్రమాదం ఉంది. ఊపిరితిత్తులను దెబ్బతీసి... ఊపిరి తీసేయవచ్చు నోరు, గొంతు తర్వాత పొగ నేరుగా ప్రవేశించేది ఊపిరితిత్తుల్లోనికే. దాంతో పొగ ఊపిరితిత్తుల్లోని ట్రాకియా, ల్యారింజ్స్తో పాటు గాలిని లోపలికీ, బయటకూ తీసుకెళ్లే ఎయిర్వేస్, ఊపిరితిత్తుల్లో ఉండే గాలిగదులు (ఎయిర్ స్యాక్స్)... వీటన్నింటినీ దెబ్బతీస్తుంది. పొగ ఫలితంగా ఊపిరితిత్తులు దెబ్బతిని ఈ అలవాటు ఉన్నవారిలో సీఓపీడీ, బ్రాంకైటిస్ అనే వ్యాధులకు దారితీయవచ్చు. అప్పటికీ ఈ అలవాటు మానకపోతే క్రమంగా ఊపిరితిత్తుల సామర్థ్యం దెబ్బతిని ఒక్క అడుగు వేసినా ఆయాసపడే దశకు చేరుకుంటారు. అంతేకాదు సిగరెట్ అలవాటు వల్ల ప్రాణాంతకమైన ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడం చాలా ఎక్కువ. ఇక ఆస్తమా ఉన్నవారికి ఉండే ధూమపానం అలవాటు వాళ్ల పరిస్థితిని మరింత తీవ్రతరం చేసి, జీవితాన్ని నరకప్రాయం చేస్తుంది. మూత్రపిండాలకు దెబ్బే! పొగతాగడం వల్ల రక్తనాళాలు సన్నబారిపోతాయన్న విషయం తెలిసిందే. పైగా అలా సన్నబారిపోవడంతో అక్కడ రక్తపోటు విపరీతంగా పెరుగుతుందన్న విషయం కూడా తెలిసిందే. మూత్రపిండాల్లో రక్తాన్ని శుద్ధి చేసే రక్తనాళాలు అతి సన్నగా ఉంటాయి. ఫలితంగా మూత్రపిండాల్లోని అతి సన్నటి రక్తనాళాలు చిట్లిపోయి, మూత్రపిండాలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. పురుషుల్లో లోపించే సెక్స్ సామర్థ్యం సిగరెట్ తాగే అలవాటుతో రక్తనాళాలు సన్నబడడమనే పరిణామం ఒకవేళ పురుషాంగంలో జరిగితే అక్కడికి తగినంత రక్తం చేరే అవకాశాలు లేక అంగస్తంభన సమస్యలు వస్తాయి. అంతేకాదు... పొగతాగే అలవాటు వల్ల వీర్యకణాల కదలికలు, వీర్యం నాణ్యత తగ్గిపోతాయి. దాంతో పిల్లలుపుట్టే అవకాశాలూ గణనీయంగా తగ్గుతాయి. ప్రోస్టేట్ గ్రంథిపై ప్రతికూల ప్రభావం పొగతాగడం ప్రోస్టేట్ క్యాన్సర్కు పెద్ద రిస్క్ ఫాక్టర్. ఓ వ్యక్తి తాగిన సిగరెట్లు ఎన్ని అనే కొలతకు ఒక ప్రవూణం ఉంది. ఆ కొలత పేరే ‘ప్యాక్ ఇయుర్’. ఒక వ్యక్తి రోజుకో ప్యాకెట్ చొప్పున ఏడాది పాటు తాగిన సిగరెట్లను ఒక ‘ప్యాక్ ఇయుర్’ అంటారు. అంటే... ఉదాహరణకు ఓ వ్యక్తి రోజుకు రెండు పెట్టెలు తాగుతాడనుకుందాం. అప్పుడు ఆర్నెల్ల వ్యవధిలో తాగే సిగరెట్లే ఓ ‘ప్యాక్ ఇయుర్’ అవుతాయున్నవూట. ఇలా ఓ వ్యక్తి తాలూకు ప్యాక్ ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ ప్రోస్టేట్పై దాని ప్రభావం తాలూకు దుష్పరిణామాలు అంతకంతకూ రెట్టింపవుతూ, అదే నిష్పత్తిలో పెరుగుతూ పోతాయన్న మాట! స్మోకింగ్ను పూర్తిగా మానేయడం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్ను గణనీయం తగ్గించుకోవచ్చు. ‘పొగ’చూరి... పెళుసుబారిపోయే ఎముకలు ఎముకలు పటిష్ఠంగా ఉండాలంటే అందులో క్యాల్షియం ఎక్కువగా చేరుతుండాలి. ఈ పని రక్తప్రసరణ వ్యవస్థ ద్వారా జరుగుతుంది. కానీ పొగతాగే అలవాటు ఉన్నవారిలో ఎముకలకు అందాల్సిన పోషకాలు తగ్గుతూ పోతాయి. దాంతో ఎముకల సాంద్రత తగ్గుతుంది. ఫలితంగా అవి పెళుసుబారిపోయి తేలిగ్గా విరిగిపోతాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్కు ప్రధాన కారణం పొగతాగే అలవాటే. చర్మానికి పొగబెట్టే సిగరెట్ పొగతాగడం వల్ల చర్మం ముడుతలు తీవ్రతరమవుతాయి. పొగలోని హానికర రసాయనాలూ, శరీరంలో జరిగే జీవక్రియల నుంచి వెలువడే హానికర పదార్థాలను బయటికి తొలగించే యంత్రాంగం బలహీనంగా మారడంతో చర్మం తన వయసు కంటే ముందుగానే వృద్ధాప్యానికి లోనవుతుంది. దాంతో పొగతాగేవారు తమ వాస్తవ వయసు కంటే పెద్దవారిగా కనబడటం చాలా సాధారణం. పాదాలకూ రిస్కే! పొగతాగే అలవాటు ఉన్నవారిలో రక్తనాళాలు సన్నబడతాయి కాబట్టి పాదాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు సన్నబడితే ఒక్కోసారి పాదం కుళ్లిపోవడానికి (గ్యాంగ్రీన్కు) దారితీస్తుంది. డయాబెటిస్ సమస్య ఉన్నవారికి పొగతాగే అలవాటు ఉంటే ఈ ముప్పు మరీ ఎక్కువ. దీన్ని పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్ అని అంటారు. ఒకవేళ సమస్య కేవలం పొగతాగేవారిలో కేవలం ఆ అలవాటు కారణంగానే రావచ్చు. అలాంటి సమస్యను బర్జర్స్ డిసీజ్ అంటారు. పాదాలను రక్షించుకుని చివరివరకూ మీ పాదాలపై మీరు నిలబడాలంటే తక్షణం పొగతాగే అలవాటును వదులుకోవాల్సిందే. మీకు సిగరెట్ అలవాటు ఉంటే పైన చెప్పిన కారణాలన్నింటి వల్ల దాన్ని తక్షణం మానేయండి. ఒకవేళ ఆ అలవాటే ఇప్పటి దాకా లేకపోతే ఎప్పుడూ దాన్ని ముట్టుకోకండి.