bhavanipuram police station
-
పోసానిపై ఆగని వేధింపులు.. మరో పీఎస్కు తరలింపు
కర్నూలు/ఎన్టీఆర్, సాక్షి: పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali)పై కూటమి సర్కార్ వేధింపులు ఆగడం లేదు. కూటమి పార్టీల నేతలు పెట్టిన కేసుల్లో ఆయనకు వరుసగా ఊరటలు దక్కుతుండడం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన్ని ఇంకో కేసులో ఇప్పుడు మరో పీఎస్కు తరలిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నరసరావుపేట పోలీసుల కస్టడీ పిటిషన్ను కోర్టు రద్దు చేసింది. దీంతో ఆగమేఘాల మీద విజయవాడ భవానీపురం పోలీసులు కర్నూల్ జైలుకు చేరుకున్నారు. ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్(PT Warrant) కింది పోసానిని హైదరాబాద్ మీదుగా విజయవాడకు తరలిస్తున్నారు. సాయంత్రంలోగా ఆయన్ని విజయవాడకు తీసుకొచ్చే అవకాశం ఉంది. కోర్టులో లేదంటే మెజిస్ట్రేట్ ఎదుట పోసానిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రిమాండ్ విధిస్తే గనుక విజయవాడ జైలుకు పోసానిని తరలిస్తారు. లేదంటే మళ్లీ కర్నూలు జైలుకే తరలిస్తారు. ఈ కేసు చాలా ముఖ్యమైందని చెబుతూ కోర్టు నుంచి భవానీపురం పోలీసులు పీటీ వారెంట్ పొందారు.ఇదిలా ఉంటే.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. పోసానికి బెయిలు ఇవ్వకూడదని పోలీసుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించినప్పటికీ.. కోర్టు పోసాని తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ... బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. ఈ కేసులోనే పోసాని ఫిబ్రవరి 26వ తేదీన అరెస్టయ్యారు. పోసానిని హైదరాబాద్లోని నివాసంలో అరెస్ట్ చేసి.. ఆ మరుసటి రోజు ఓబులవారిపల్లెకు తీసుకెళ్లారు. అటుపై పల్నాడు జిల్లా నరసరావుపేటలో, కర్నూల్ జిల్లా ఆదోనీ పీఎస్లలో నమోదైన కేసుల్లో పీటీ వారెంట్ కింద ఆయన్ని తరలించారు. ఈ కేసుల్లో ఉపశమనం కోరుతూ ఆయన వేసిన పిటిషన్లపై తీర్పు వెల్లడి కావాల్సి ఉంది. మరోవైపు హైకోర్టులోనూ ఆయన వేసిన క్వాష్ పిటిషన్ విచారణ దశలో ఉంది. -
ట్యాపింగ్ వ్యవహారంలో తదుపరి చర్యలన్నీ నిలిపివేయండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భవానీపురం పోలీస్స్టేషన్లో నమోదైన కేసులో కాల్డేటా వివరాలు ఇవ్వాలని బీఎస్ఎన్ఎల్, ఐడియా, ఎయిర్టెల్లను ఆదేశిస్తూ విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్(సీఎంఎం) కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలుపుదల చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో సీఎంఎం కోర్టులో జరుగుతున్న విచారణకు సంబంధించిన తదుపరి చర్యలను నిలిపేసింది. ఆ మూడు సర్వీస్ ప్రొవైడర్ల నుంచి కాల్డేటా తాలూకూ వివరాల సీల్డ్ కవర్లను అందుకున్న వెంటనే హైకోర్టుకు పంపాలని సీఎంఎం కోర్టును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ గురువారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ట్యాపింగ్ వ్యవహారంలో కాల్ డేటా వివరాలు ఇవ్వాలని బీఎస్ఎన్ఎల్, ఐడియా, ఎయిర్టెల్ను ఆదేశిస్తూ విజయవాడ సీఎంఎం కోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా గురువారం హైకోర్టులో లంచ్మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయమూర్తి.. ఇదే విషయంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వులే ఈ వ్యాజ్యానికి వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఈ వ్యాజ్యాన్ని కూడా గతంలో దాఖలైన పిటిషన్లతో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. -
సిట్ ఎదుట హాజరైంది ఒక్క ప్రొవైడరే..
విజయవాడ : ఫోన్ ట్యాపింగ్ కేసులో సర్వీస్ ప్రొవైడర్ల విచారణ కొనసాగుతోంది. విజయవాడ భవనీపురం పోలీస్ స్టేషన్లో సోమవారం సిట్ బృందం ఎదుట ఒక సంస్థకు చెందిన సర్వీస్ ప్రొవైడర్లు మాత్రమే హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్పై నోటీసులు అందుకున్న ఎయిర్టెల్ ప్రతినిధులు మాత్రమే విచారణకు హాజరు కాగా, మిగిలిన 11మంది సర్వీస్ ప్రొవైడర్లు హాజరు కాలేదు. కాగా తెలంగాణలో తమ ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయని ఏపీ నేతలు ...ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ పేరిట కౌంటర్ అటాక్కు దిగిన ఏపీ సర్కార్ చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కావాలనే సంక్షోభాలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఓటుకు నోటు కేసులో స్టీఫెన్సన్ వాంగ్మూలం నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమని విమర్శలు వినిపిస్తున్నాయి. కేసు న్యాయపరిధి హైదరాబాద్లో ఉండగా, ట్యాపింగ్ కేసు విచారణ విజయవాడలో ఎలా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
సర్వీస్ ప్రొవైడర్లను విచారించనున్న ఏపీ సీఐడీ
విజయవాడ : ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని సర్వీస్ ప్రొవైడర్లకు ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేసారు. విజయవాడ భవానీపురం పోలీస్స్టేషన్లో విచారణకు హాజరు కావాలని 12మంది సెల్ ఫోన్ సర్వీసు ప్రొవైడర్లకు నోటీసులు జారీ అయ్యాయి. తెలంగాణలో తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారన్న ఫిర్యాదులతో ఏపీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మంత్రి దేవినేని ఉమ ఇందుకు సంబంధించి భవనీపురం పీఎస్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సర్వీస్ ప్రొవైడర్లను నోటీసులు జారీ చేశారు. 12మంది సర్వీస్ ప్రొవైడర్లను ఏపీ సీఐడీ విచారించనుంది. -
కక్షకట్టే.. కృష్ణవంశీని చంపేశారు
విజయవాడ : విజయవాడ భవానీపురంలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం అదృశ్యమైన 9వ తరగతి విద్యార్థి కృష్ణవంశీ... అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వీటీపీఎస్ కూలింగ్ కెనాల్లో బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి చనిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వంశీకృష్ణ మృతితో భవానీపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రోజూ కళ్ల ముందే ఉండే బిడ్డ కానరానిలోకాలకు వెళ్లడంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదంటూ రోదిస్తున్నారు. తమ బిడ్డను ఎవరో కక్ష కట్టే చంపారని ఆరోపిస్తున్నారు. బాగా చదువుతాడనే అక్కసుతో తన కుమారుడిని చంపేశారని కృష్ణవంశీ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. -
విద్యార్థి కృష్ణవంశీ అదృశ్యం... పట్టించుకోని పోలీసులు
విజయవాడ: నగరంలోని పాతబస్తీ సితార సెంటర్ వద్ద విద్యార్థి కృష్ణవంశీ అదృశ్యమయ్యాడని అతడి తల్లిదండ్రులు మంగళవారం భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం మధ్యాహ్నం ఆడుకునేందుకు వెళ్లిన కృష్ణవంశీ ఆపై ఇంటికీ తిరిగి రాలేదని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం నుంచి తమ కుమారుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము పోలీసులను ఆశ్రయించామని చెప్పారు. తమ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదని వారు ఆందోళనతో తెలిపారు. నగరంలోని జీఎన్ఆర్ఎంసీ పాఠశాలలో కృష్ణవంశీ తొమ్మిదో తరగతి చదువుతున్నాడని అతడి తల్లిదండ్రులు వెల్లడించారు.