cards playing
-
Lockdown: కాలక్షేపం పేరిట కాయ్ రాజా కాయ్..
కాలక్షేపమే కొంపముంచుతోంది. సరదాగా మొదలుపెట్టిన పేకాట వ్యసనంగా మారుతోంది. మూడుముక్కలాట సామాన్యుల జేబులను గుల్ల చేస్తోంది. కష్ట పడకుండా సంపాదించాలనే తాపత్రయంతో ఎంతో మంది ఆటకు బానిసలవుతూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కరోనా వేళ అందరూ ఇంటిపట్టునే ఉండటంతో ఈ ఆట మరింత ఎక్కువైంది. అద్దె ఇళ్లు, నిర్మానుష్య ప్రదేశాలు పేకాట స్థావరాలకు వేదికలవుతుండగా, లక్షల్లో నగదు చేతులు మారుతోంది. జిల్లా వ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఒకచోట పేకాటరాయుళ్లు పట్టుబడటమే ఇందుకు నిదర్శనం. - మెదక్ రూరల్ జిల్లాలో మూడు రాజాలు, ఆరు రాణులుగా పేకాట కొనసాగుతుంది. మూడేళ్ల పోలీస్ రికార్డులతో పోలిస్తే జిల్లాలో పేకాట కేసుల సంఖ్య, పట్టుబడిన వారి సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. 2019లో 36 పేకాట కేసులు నమోదవగా, 191 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకొని కోర్టుకు తరలించగా, రూ.4,46,722 జరిమానా విధించారు. అదే విధంగా 2020లో మొత్తం 90 కేసులు నమోదవగా, 552 మందిని కోర్టులో హాజరుపరచగా, రూ.13,52,789 జరిమానా విధించారు. అలాగే 2021లో ఇప్పటి వరకు మొత్తం 9 కేసులు నమోదు కాగా, 57 మందిని కోర్టుకు తరలించగా రూ. 97,700లను జరిమానా విధించారు. కొంపముంచుతున్న కాలక్షేపం.. జిల్లాలో లాడ్జీలు, అద్దె ఇళ్లు, వ్యవసాయ క్షేత్రాలు, అటవీ, నిర్మానుష్య ప్రాంతాలను అడ్డాలుగా ఏర్పరుచుకొని యథేచ్ఛగా పేకాటను కొనసాగిస్తున్నారు. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా రహస్యంగా పేకాట ఆడుతుండటం వల్ల లక్షల్లో నగదు చేతులు మారుతున్నాయి. మెదక్ పట్టణంతో పాటు నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట, అల్లాదుర్గ్, టేక్మాల్, రేగోడ్, కౌడిపల్లి, కొల్చారం, శంకరంపేట, చేగుంట, హవేళిఘణాపూర్ తదితర ప్రాంతాల్లో విచ్చలవిడిగా పేకాట ఆడుతున్నారు. కాలక్షపం పేరిట మొదలైన పేకాట ఎంతో మంది సామాన్యుల జీవితాలను రోడ్డుపాలు చేస్తుంది. తనఖా పెట్టి మరీ.. పేకాటరాయుళ్లు తమ స్థోమతను బట్టి రౌండ్ రౌండ్కు డబ్బులను పెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఇలా సుమారు రూ. 20 వేల నుంచి రూ. 2 లక్షల వరకు ఆటను కొనసాగిస్తుంటారు. పేకాటలో డబ్బులను పోగొట్టుకున్న కొందరు తిరిగి ఆట ఆడి సంపాదించాలనే కోరికతో తమ వద్ద ఉన్న సెల్ఫోన్లను, వాహనాలతో పాటు ప్రాపర్టీ డాక్యుమెంట్లను సైతం వడ్డీ వ్యాపారుల వద్ద తనఖా పెట్టి ఆటను కొనసాగిస్తూ సర్వం కోల్పోతున్నారు. ఇంకొందరు ఆటకు అవసరమైన డబ్బుల కోసం ఇంట్లో తల్లిదండ్రులు, భార్య పై వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు పేకాటకు బానిసలుగా మారి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కరోనా వేళ పెరిగిన ఆట.. కరోనా పేకాటరాయుళ్లకు కలిసొచ్చిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో వ్యాపారాలు అంతంత మాత్రంగానే జరగడం, స్కూళ్లు, కాలేజీలు మూతపడగా, ఆయా శాఖల కార్యాలయాలు అడపాదడపా కొనసాగుతున్నాయి. కర్ఫ్యూలు, లాక్డౌన్లతో పేకాటరాయుళ్లకు కావాల్సినంత సమయం దొరుకుతుంది. దీంతో కొందరు గుంపులుగా ఒక చోటకు చేరి అడ్డూఅదుపు లేకుండా పేకాటను కొనసాగిస్తున్నారు. పోలీసుల కళ్లు కప్పి తమ స్థావరాలను మార్చుకుంటూ రహస్యంగా పేకాటను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు ప్రత్యేక దృష్టిసారించి పేకాటను నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. చట్టరీత్యా చర్యలు తప్పవు.. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. పోలీసు ప్రత్యేక బృందాలు, సిబ్బంది పకడ్బందీగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే పలుచోట్ల పేకాట స్థావరాలను గుర్తించడంతో పాటు పేకాట, బెట్టింగ్లకు పాల్పడుతున్న వ్యక్తుల పై కేసులు నమోదు చేయడం జరిగింది. ఇలాంటివి ఏమైనా ప్రజల దృష్టికొస్తే 100 డయల్ చేయాలి లేదా దగ్గరలోని పోలీసులకు తెలియజేయాలి. సమాచారం ఇచి్చన వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. - చందనాదీప్తి, ఎస్పీ -
టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి అరెస్ట్
పరిగి: టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. పరిగి ఎస్ఐ శ్రీనివాసులు నేతృత్వంలో ఆదివారం మండల వ్యాప్తంగా విస్తృత దాడులు నిర్వహించి, ఎనిమిది మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. కొడిగెనహళ్లి శివారులోని పెట్రోల్ బంక్ సమీపంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. కొడిగెనహళ్లికి చెందిన రామాంజినేయులు, జయరాం, బాబాఫకృద్దీన్లను అరెస్టు చేసి, వారి వద్ద రూ.1450 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో టీడీపీ ఎంపీటీసీ–1 అభ్యర్థి ఎల్.రామాంజినేయులు ఉన్నారు. శాసనకోటలో మరో ఐదుగురు అరెస్ట్ శాసనకోట గ్రామ శివారులోని పేకాట స్థావరంపై దాడులు నిర్వహించామని ఎస్ఐ తెలిపారు. కృష్ణమూర్తి, నరసింహప్ప, సంజీవప్ప, నరసింహప్ప, నారాయణప్ప అనే ఐదుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేసి, వారి వద్ద రూ.1370 నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. -
పేకాటరాయుళ్లపై పోలీసుల దాడులు
సత్తెనపల్లి: పట్టణంలో రహస్యంగా కోతముక్క పేకాట ఆడుతున్నారని జిల్లా రూరల్ ఎస్పీ సీహెచ్ వెంకటప్పలనాయుడుకు వచ్చిన సమాచారం మేరకు పేకాటరాయుళ్లపై పట్టణ పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని కూరగాయల మార్కెట్ షాపు నెంబర్–18 ఎదుట కోతముక్కతో కూడిన పేకాట ఆడుతున్నారని తెలియడంతో సత్తెనపల్లి అర్బన్ సీఐ శరత్బాబు నేతృత్వంలో పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. కోతముక్క ఆడుతున్న ఐదుగురిని రెడ్ హ్యండెడ్ గా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.13,150 నగదు స్వాధీన పర్చుకున్నారు.పట్టుబడిన వారిలో 12వ వార్డు టీడీపీ కౌన్సిలర్ సరికొండ వెంకటేశ్వర రాజు (మార్కెట్ రాజు) ఉండడం పట్టణంలో చర్చనీయాంశ మైంది. సరికొండ వెంకటేశ్వరరాజుతో పాటు గౌస్, రాములు, కోటేశ్వరరావు, ఖాదర్వలి ఉన్నట్టు సీఐ శరత్బాబు తెలిపారు. అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు 12వ వార్డు కౌన్సిలర్ వెంకటేశ్వరరాజును కేసు నుంచి తప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ఎస్పీ నుంచి స్థానిక పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఉండటంతో సాధ్యం కాలేదుపేకాట,పట్టణంలో ఇటీవలి కాలంలో కోతముక్క, బెట్టింగులు, అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడ జరిగినా వాటిల్లో అధికార పార్టీ నేతలు ఉంటుండడం గమనార్హం. -
హైటెక్ పేకాట.. కోట్లు దండుకుంటున్న వైనం
సాక్షి, హైదరాబాద్: నగరంలో హైటెక్ పేకాట ముఠా గుట్టు రట్టయింది. అత్యాధునిక సాంకేతిక పరికరాలతో పేకాట నిర్వహిస్తూ.. ప్రజలకు కుచ్చుటోపీ పెడుతున్న మోసగాళ్లను జుబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. మైక్రో సెన్సార్లు, డిజిటల్ కనెక్షన్లు, ముబైల్ ఫోన్లతో ట్యాగింగ్ చేసి అత్యాధునిక రీతిలో ఈ ముఠా పేకాట నిర్వహిస్తోంది. ఈ హైటెక్ బాగోత ద్వారాకోట్ల రూపాయలు నిర్వాహకులు దండుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు. హైటెక్ పేకాట నిర్వహిస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. -
టీడీపీ ఎంపీ కార్యాలయంలో జూదం
-
అపార్ట్మెంట్లో వాచ్మన్ నిర్వాకం
సాక్షి,సిటీబ్యూరో: ఓ అపార్ట్మెంట్ పెంట్హౌస్లో గుట్టుగా సాగుతున్న పేకాట శిబిరంపై మధ్య మండల టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. నిర్వాహకుడైన అపార్ట్మెంట్ వాచ్మెన్తో పాటు ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు డీసీపీ రాధాకిషన్రావు ఆదివారం వెల్లడించారు. గుల్బర్గాకు చెందిన అబ్దుల్ ఖదీర్ నాలుగేళ్ల క్రితం నగరానికి వలసవచ్చాడు. నెలకు రూ.6,500 జీతానికి చిరాగ్ అలీ లైన్లో ఉన్న ఓ అపార్ట్మెంట్ వద్ద వాచ్మెన్గా పని చేస్తున్నాడు. ఈ జీతంతో కుటుంబ పోషణ భారంగా మారడంతో తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గాలు అన్వేషించాడు. ఈ నేపథ్యంలో కొన్నాళ్ళుగా ఖాళీగా ఉన్న అపార్ట్మెంట్ పెంట్హౌస్లో మూడు నెలలుగా తనకు పరిచయస్తులైన పేకాట రాయుళ్ళతో పాటు వారి స్నేహితులను రప్పించి అర్ధరాత్రి వేళల్లో వారితో మూడు ముక్కలాటలు ఆడించి కమీషన్లు తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగా శనివారం అర్ధరాత్రి వివిధ ప్రాంతాలకు చెందిన ఏడుగురిని రప్పించిన ఖదీర్ వారితో పేకాట ఆడిస్తున్నట్లు సమాచారం అందడంతో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాస్రావు నేతృత్వంలోని బృందం దాడి చేసింది. నిర్వాహకుడు ఖదీర్ సహా ఎనిమిది మందిని అరెస్టు చేసింది. వీరి నుంచి రూ.32,640 నగదు తదితరాలు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం అబిడ్స్ పోలీసులకు అప్పగించింది. -
రాష్ట్ర సరిహద్దుల్లో జూదం జోరు
రూ.1.39 లక్షల స్వాదీనం నెల్లిపాక (రంపచోడవరం) : రాష్ట్ర విభజన తరువాత రాష్ట్ర సరిహద్దుల్లో జూదం జోరందుకుంది. ఆంధ్రా సరిహద్దులు ఎటపాక సమీప తోటలు, అటవీప్రాంతాలను తెలంగాణ బడాబాబులు పేకాట స్థావరాలుగా ఎంచుకుంటున్నారు. ఎటపాకలోని పాల్రాజ్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని మామిడితోటలో పేకాట స్థావరంపై మంగళవారం రాత్రి డీఎస్పీ దిలీప్కిరణ్, ఎటపాక సీఐ రవికుమార్ సిబ్బందితో దాడి చేశారు. ఈ దాడితో పారిపోతున్న వారిని పోలీసులు వెంటపడి పట్టుకున్నారు. 17 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.1.39 లక్షలు, 5 ద్విచక్ర వాహనాలు, 20 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు. నిందితులను కోర్టుకు పంపినట్టు చెప్పారు. దాడిలో పట్టుబడిన వారిలో తెలంగాణలోని దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరం, సీతారాంపురం, భద్రాచలం, పాల్వంచ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్టు చెప్పారు.