Catholic
-
ప్రజా పోప్కు అశ్రునయనాలతో తుది వీడ్కోలు
వాటికన్ సిటీ: నిరుపేదలు, అణగారిన వర్గాలకు ఆపన్నహస్తం అందించిన మానవతామూర్తి, విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది క్యాథలిక్ల అత్యున్నత మతాధికారి పోప్ ఫ్రాన్సిస్కు ప్రపంచాధినేతలు, లక్షలాది మంది అభిమానులు నేరుగా వందల కోట్ల మంది క్రైస్తవులు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాల్లో చూస్తూ తుది వీడ్కోలు పలికారు. అభిమానులు, ఆప్తులు శోకతప్త హృదయాలతో వీడ్కోలు పలికాక తాను సదా స్మరించే మేరీమాత చిత్రపటం ఉన్న సెయింట్ మేరీ మేజర్ బాసిలికా చర్చి భూగర్బంలో 88 ఏళ్ల పోప్ శాశ్వత విశ్రాంతి తీసుకున్నారు. శనివారం వాటికన్ సిటీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ అంతిమయాత్ర కొనసాగింది. పోప్ కోరిక మేరకు వాటికన్ శివారులోని రోమ్ పరిధిలోని సెయింట్ మేరీ మేజర్ బాసిలికా చర్చిలో ఆయన పార్థివదేహాన్ని ఖననం చేశారు. అత్యంత నిరాడంబరంగా ఈ కడసారి క్రతువు కొనసాగింది. ఆయన కోరిక మేరకు పోప్ సమాధి మీద లాటిన్ పదమైన ‘ఫ్రాన్సిస్క్యూస్’అనే పదాన్ని చెక్కారు. శ్వాససంబంధ వ్యాధి ముదిరి చివరకు బ్రెయిన్స్టోక్, గుండె వైఫల్యంతో ఈ నెల 21వ తేదీన పోప్ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.బరువైన హృదయాలతో బారులు తీరిన జనం అంతకుముందు సెయింట్ పీటర్స్ బాసిలికా చర్చిలో పోప్ ముఖంపై వాటికన్ మాస్టర్ ఆఫ్ సెరిమనీస్ ఆర్చ్బిషప్ డియాగో గియోవన్నీ రవెల్లీ దవళవర్ణ పట్టు వ్రస్తాన్ని కప్పారు. తర్వాత జింక్ పూత పూసిన శవపేటిక మూతను పెట్టి సీల్వేశారు. తర్వాత పోప్ పార్థివదేహాన్ని భద్రంగా ఉంచిన శవపేటికను చర్చి సహాయకులు సెయింట్ పీటర్స్ స్వే్కర్ భారీ బహిరంగ ప్రదేశానికి తీసుకొచ్చారు. అక్కడే ప్రపంచ దేశాల అధినేతలు, పలు రాజ్యాల రాజులు, పాలకులు, అంతర్జాతీయ సంస్థల అధినేతలు, ప్రతినిధులు దాదాపు 2,50,000 మంది పోప్ అభిమానులు ఆయనకు చివరిసారిగా ఘన నివాళులర్పించారు. అక్కడ ఉన్నవారిలో చాలా మంది కన్నీరుమున్నీరుగా విలపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు, భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్, బ్రిటన్ యువరాజు విలియం, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయేల్ మేక్రాన్ దంపతులు, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ దంపతులు, ఇరాన్ సాంస్కృతిక శాఖ మంత్రి సయ్యద్ అబ్బాస్ సలేహ్ షరియతా, ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలోనీ, స్లోవేకియా అధ్యక్షుడు పీటర్, ఐర్లాండ్ అధ్యక్షుడు హిగ్గిన్స్సహా 160 మంది వీవీఐపీలు ఈ కార్యక్రమంలో పాల్గొని పోప్కు అంజలి ఘటించారు. భారత్ తరఫున ముర్ముతోపాటు కేంద్రమంత్రి కిరెణ్ రిజిజు, సహాయ మంత్రి జార్జ్ కురియన్, గోవా డెప్యూటీ స్పీకర్ జాషువా డిసౌజాలు హాజరయ్యారు. పోటెత్తిన లక్షలాది మంది పోప్ అభిమానులు, క్రైస్తవులతో సెయింట్ పీటర్స్ స్క్వేర్ కిక్కిరిసిపోయింది. తోపులాట ఘటనలు జరక్కుండా అధికారులు నగరవ్యాప్తంగా భారీ ఎల్ఈడీ తెరలు ఏర్పాటుచేసి మొత్తం అంత్యక్రియల కార్యక్రమాన్ని చివరిదాకా ప్రత్యక్ష ప్రసారాలుచేశారు. సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద అధినేతలు నివాళులర్పించాక శవపేటికను ప్రత్యేకవాహనంలోకి ఎక్కించాక అంతిమయాత్ర మొదలైంది. నగరంలో దారి పొడవునా వీధుల్లో లక్షలాది మంది జనం బారులు తీరి ప్రియతమ పోప్కు ‘‘పాపా ఫ్రాన్సిస్కో’’అని నినాదాలు చేస్తూ తుది వీడ్కోలు పలికారు. పోప్గా బాధ్యతలు చేపట్టాక ఈ 12 ఏళ్ల కాలంలో పోప్చేసిన మంచి పనులను గుర్తుచేసుకున్నారు. అంత్యక్రియలు మొత్తం 91 ఏళ్ల కార్డినల్ జియోవన్నీ బటిస్టా రే మార్గదర్శకత్వంలో నిర్వహించారు. వేలాది మంది ఇటలీ పోలీసుల పహారా మధ్య ఈ అంతిమయాత్ర ముందుకు సాగింది. గగనతల రక్షణ కోసం హెలికాప్టర్లను వినియోగించారు. స్వాగతం పలికిన ఖైదీలు, ట్రాన్స్జెండర్లు ఈ అంతిమయాత్రలో స్థానికులతోపాటు ప్రపంచదేశాల నుంచి తరలివచ్చిన లక్షలాది మంది జనం రహదారికి ఇరువైపులా నిలబడి కడసారి తమ పోప్ను చూసుకోగా శవపేటికను తీసు కొచ్చిన వాహనశ్రేణి ఎట్టకేలకు సెయింట్ మేరీ మేజర్ బాసిలికా చర్చి ప్రాంగణానికి చేరుకుంది. అక్కడే వేచి ఉన్న ఖైదీలు, లింగమారి్పడి వ్యక్తులు, నిరాశ్రయులు, శరణార్థులు, వలసదారులు స్విస్ గార్డ్స్ బలగాల నుంచి పోప్ అంతిమయాత్ర బాధ్యతలను తీసుకున్నారు. పోప్ మొదట్నుంచీ అణగారిన వర్గాలతోపాటు సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్న ఖైదీ లు, ట్రాన్స్జెండర్లు, నిరాశ్రయులు, శరణార్థుల అభ్యున్నతి కోసం పాటుపడటం తెల్సిందే. చర్చి అంతర్భాగంలోని భూగర్భంలో శవపేటికను ఉంచే కార్యక్రమంలో ప్రధానంగా ఖైదీ లు, వలసదారులే పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక ప్రార్థనల అనంతరం కార్డినళ్లు, పోప్ అత్యంత సన్నిహితుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమ కవరేజీకి మీడియాను అనుమతించలేదు. వాటికన్ సిటీలో కాకుండా వేరే చోట పోప్ను ఖననం చేయడం గత వందేళ్ల చరిత్రలో ఇదే తొలిసారి. -
Ash Wednesday 2025 పవిత్ర ప్రార్థనలు
విశ్వవ్యాప్తంగా క్రైస్తవ విశ్వాసులు భక్తి శ్రద్ధలతో ఉపవాస ధ్యానంలో ఆచరించే తపస్సు కాలాన్ని ‘లెంట్ కాలం’అంటారు. లెంట్ అనే లాటిన్ మాటకు చిగురించడం అని అర్థం. ఇది బుధవారంతో ప్రారంభమవుతుంది. అందు చేత ‘భస్మ బుధవారం’ లేదా ‘బూడిద బుధ వారం’ అంటారు. లెంట్ మొత్తం నలభై రోజులు. లాటిన్ భాషలో ‘క్వాడ్రగెసిమ’ అనే మాటకు నలభై అనిఅర్థం. బైబిల్లో నలభై దినాల ఉపవాసానికి ఉదాహరణగా, మోషేనలభై దినాలు ఉపవసించి ప్రార్థన చేశాడు. ఏలియా ప్రవక్త 40 రోజులు ఉపవసించి, ప్రార్థించాడు. నోవా జలప్రళయం 40 దినాలు జరిగింది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కానానుకు 40 సంవత్సరాలు పయనించారు. ఏసు పరిచర్యకు ఉపక్రమించే ముందు 40 దినాలు ఉపవసించి ప్రార్థించాడు. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రార్థన ఉపవాస ధ్యానాలు 40 రోజులు భక్తి శ్రద్ధలతో నిష్ఠగా ఒంటిపూట సాత్వికాహారం తీసుకుని నియమబద్ధమైన జీవితం గడుపుతూ ఆచరిస్తారు.బుధవారం రోజు కొన్ని ఆలయాల్లో విశ్వాసులు తాటాకులతోగాని, కొబ్బరి ఆకులతోగాని, ఖర్జూరపు ఆకులతో చేసిన సిలువ ప్రతిమలు తెచ్చి ఉంచుతారు. వాటిని మరుసటి సంవత్సరం వరకు ఉంచి బుధవారం భస్మం చేస్తారు. ఆ బూడిదతో నుదుటపై సిలువు గుర్తు వేసుకుని లేదా తలపై చల్లుకుని బూడిద బుధవారం నుంచి శుభ శుక్రవారం వరకు జరిగే క్వాడ్రగెసిమ కాలం ధ్యానాలు ఆచరిస్తారు. లెంట్కాలం అంతా దేవాలయాల్లో నలభై అంశాలపై ధ్యానం చేస్తూ ప్రార్థనలు జరుగుతాయి. ఈ కాలంలో శుభకార్యాలు గాని, కుటుంబాల్లో జరుపుకునే ఇతర ఉత్సవాలు గాని చేయరు. భస్మ బుధవారం నుంచిశుభ శుక్రవారం వరకూ వచ్చే నలభై దినాలు ‘శ్రమల కాలం’గా పరిగణించి, ప్రక్షాళన కోసం పవిత్రపరచుకునే సంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సమాజం ఆచరిస్తుంది. శుభ శుక్రవారం అనంతరం వచ్చే శనివారాన్ని ‘లాజరస్ సాటర్ డే’ అంటారు. దీన్నే ‘నిశ్శబ్ద శనివారం’ అని కూడా పిలుస్తారు. ఏసు మరణించిన శుక్రవారం సమాధిలో ఉన్నా, శనివారం అనంతరం పునర్జీవితుడై తిరిగి లేచిన ఆదివారం ‘ఈస్టర్ ఆది వారం’గా జరిగే ప్రార్థనలతో లెంట్కాలం పూర్తవుతుంది. ఈ క్వాడ్రగెసిమ కాలం అంతా పాప ప్రక్షాళనతో పాటు వ్యక్తిగత నియమనిష్ఠలను పాటించి, ప్రపంచ శాంతి, సమసమాజ సుహృద్భావ జీవనం కలగాలని ప్రార్థనలు చేస్తారు. – ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, క్రైస్తవ సాహిత్య పరిశోధకులు (నేడు భస్మ బుధవారం) -
సామాన్యునికి సెయింట్హుడ్
వాటికన్ సిటీ: మూడు శతాబ్దాల క్రితం క్రైస్తవాన్ని స్వీకరించి, చిత్రహింసలకు గురైన తమిళనాడుకు చెందిన సాధారణ పౌరుడు దేవసహాయం పిళ్లైకి సెయింట్హుడ్ (మహిమాన్విత హోదా) లభించింది. వాటికన్ నగరంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పోప్ ఫ్రాన్సిస్ ఆయనకు మహిమాన్విత హోదా ప్రకటించారు. భారత్కు చెందిన ఒక సాధారణ పౌరుడికి కేథలిక్కు మతంలో అత్యున్నత గౌరవం దక్కడం ఇదే మొదటిసాది. దేవసహాయంతో పాటు పలు దేశాలకు చెందిన మరో తొమ్మిది మందికి సెయింట్ హోదా ఇచ్చారు. వారిలో నలుగురు మహిళలున్నారు. 1712 ఏప్రిల్ 23న కేరళలోని ట్రావెంకోర్ రాజ్యంలో హిందూ నాయర్ కుటుంబంలో దేవసహాయం జన్మించారు. ట్రావెంకోర్ రాజు మార్తాండ వర్మ సంస్థానంలో అధికారిగా పని చేశారు. క్రైస్తవం పట్ల ఆకర్షితుడై ఆ మతాన్ని స్వీకరించి ప్రబోధాలు చేయసాగారు. కోపోద్రిక్తుడైన రాజు దేవసహాయాన్ని ఊరూరా తిప్పుతూ చిత్రహింసలు పెట్టారు. అయినా ప్రజల సమానత్వంపైనే ప్రసంగాలు చేయడంతో 1752 జనవరి 14న కన్యాకుమారిలో కాల్చిచంపారు. దేవసహాయాన్ని చిత్రహింసలకు గురి చేసిన అన్ని ప్రాంతాల్లోనూ అద్భుతమైన మహిమలు జరిగాయని భారత్కు చెందిన కేథలిక్ బిషప్స్ సమాఖ్య పోప్ ఫ్రాన్సిస్ దృష్టికి తీసుకెళ్లింది. ఆ మహిమలను 2014లో పోప్ గుర్తించినట్టు వెల్లడించారు. -
నవ్వు విరిసింది
కరోనా కాదు ఇప్పుడొచ్చిన కష్టం.. మనిషికి మనిషి దూరం అవడం! కరోనా ఉన్నా.. లేకున్నా.. ‘లెప్పర్’లకు ఇది ఎప్పుడూ ఉండే కష్టమే. వాళ్లనెవ్వరూ దగ్గరికి రానివ్వరు. మనుషుల మధ్యకు చేరనివ్వరు. ఇప్పుడింకా కష్టం అయింది బతుకు. చెయ్యి చాచడానికైనా మనిషుంటేనా! ఉన్నాను.. అని వచ్చారు ఇన్నయ్య. కళ్లు మెరిశాయి. నవ్వు విరిసింది. అయినవాళ్లు ఎందరున్నా, అనుకోని పరిస్థితుల్లో కొన్నిసార్లు ఎవరూ లేనివాళ్లంగా మిగిలిపోవలసి ఉంటుంది. కరోనా వచ్చి ఇప్పుడంటే మనుషులకు మనుషులు దూరం అవుతున్నారు. ‘సెయింట్ ఆంటోని లెప్పర్ కాలనీ’ లోని యాభై మూడు కుటుంబాల వాళ్లు ఏనాడో సొంతవాళ్లకు దూరమై ఏకాకులుగా బతుకులీడుస్తున్నారు. ‘లెప్రసీ’ వారిని వేరు చేసింది. ప్రకాశం జిల్లా చీరాలకు సమీపంలో, వేటపాలెం మండలంలోని రామన్నపేటలో ఉంది ఈ కాలనీ. నెల్లూరు క్యాథలిక్ డైకోసిస్ ఈ కుటుంబాలకు నీడను ఇస్తుంటే.. వాళ్లతోనే కలిసి ఉంటున్న గుంటూరు ఇన్నయ్య.. అన్నమూ నీళ్లు ఇస్తున్నారు! ఒంట్లో బాగోలేనివాళ్లకు మందులు కూడా. ఇన్నయ్య.. రెవరెండ్ ఫాదర్ ఇన్నయ్యగా అందరికీ తెలుసు. లెప్పర్ కుటుంబాలకైతే ఆయన మానవతామూర్తే. గుంటూరు జిల్లా చేబ్రోలు దగ్గర ముట్లూరు గ్రామం ఇన్నయ్యది. చిన్నప్పుడే బాప్టిజం తీసుకున్నారు. పెద్దయ్యాక వ్యాధిగ్రస్తుల్ని గుండెల్లోకి తీసుకున్నారు. కొన్నేళ్లు ఇటలీలో ఉన్నారు. అక్కడి భాషల్ని, బాధల్ని ఇక్కడికి మోసుకొచ్చారు. ‘‘బాధ (పెయిన్) విశ్వవ్యాప్త భాష. చెప్పకుండానే అర్థమైపోతుంది’’ అంటారు ఇన్నయ్య. కరోనా వచ్చాక.. లెప్పర్ కాలనీలో ప్రతి ఒక్కరి యోగక్షేమాలను కనుక్కుంటున్నారు ఆయన. వాళ్ల భోజనానికి ఏర్పాట్లు చేయిస్తున్నారు. ‘‘వీళ్లకు సేవ చేయడం ఓ గౌరవం’’ అంటారు ఇన్నయ్య. ‘‘కష్టాలకు ఎవ్వరూ అతీతులు కాదు. కూడూ, గూడు, వనరులు, ‘నా’ అనేవాళ్లు లేని వారు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. వారికి చేదోడుగా ఉండడం మనుషులుగా మనందరి విధి’’ అని ఆయన అంటున్నారు. ‘‘టౌన్లో (చీరాల, వేటపాలెం) పరిస్థితులు బాగుంటే మాలో కొందరం ఏదో విధంగా బయటకు వెళ్లి మాకు కావాల్సిన సరకులో, డబ్బులో తెచ్చుకునే వాళ్లం. ఇప్పుడా పరిస్థితి లేదు. ఏది చేసినా మా ఫాదర్ చేయాల్సిందే. ఎలా తిప్పలు పడుతున్నారో, ఎలా చేస్తున్నారో వేళకు మాకింత తిండిపెడుతున్నారు మహానుభావుడు’’ అంటున్నారు కాలనీలో ఉండే కోటమ్మ, దుర్గయ్య, ఏసోబు తదితరులు.. ఇన్నయ్య గురించి. రాష్ట్రంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. రైళ్లలో భిక్షమెత్తే వాళ్లు మొదలు వీధుల్లో తోపుడుబండ్లపై తిరుగుతూ అర్థించే వారు, అనా«థలు, అభాగ్యులు, కుటుంబ సభ్యులు వదిలేసిన వారు... ఇలా ఎందరెందరో ఉన్న ఈ ప్రాంగణానికి ఇప్పుడీ కరోనా కాలంలో ఇన్నయ్యే అన్నీ అయ్యారు. – ఎ. అమరయ్య, సాక్షి, అమరావతి -
పోప్ ఒక వ్యవస్థ!
క్యాథలిక్ తెగకు చెందినప్పటికీ, పోప్ వ్యవస్థకు నేటికీ ప్రపంచంలో ఎంతో ఖ్యాతి ఉంది. క్యాథలిక్ చర్చిలో ఈ వ్యవస్థ పరమ పవిత్రమైనది, అత్యున్నతమైనది. పీటర్ కాలం నుంచి ఈ వ్యవస్థ ఉంది. ఆయనను జీసస్ స్వయంగా నియమించా డని (క్రీ.శ. 493) ప్రతీతి. పోప్ మతపర మైన బిరుదు కాదు. అదొక వ్యవస్థ. ఒక పీఠం. దీనికి రోమ్ ప్రధాన కేంద్రం. పాపల్ కాన్క్లేవ్ వీరిని ప్రత్యేక పద్ధతితో ఎంపిక చేస్తుంది. లాటిన్లోని పాపా (తండ్రి) అనే పదం నుంచే పోప్ పదం వచ్చింది. క్రీస్తు శకం మొదటి మూడు దశాబ్దాల నుంచి ఈ వ్యవస్థ ప్రాధాన్యం సంతరించుకుంటూ వచ్చింది. పోప్ పదవికి వచ్చిన వారికి కొన్ని కీలక చారిత్రక సందర్భాలలో ‘సమస్ పాంటిఫిక్స్’, ‘పాంటిఫిక్స్ మ్యాక్జిమస్’, ‘సెర్వస్ సెర్వోరమ్ డి’ వంటి బిరుదులను ప్రదానం చేయడం కనిపిస్తుంది. ఇన్నివేల సంవత్సరాల కాలంలో ఎందరు పోప్ పదవికి వచ్చా రన్న అంశం మీద చరిత్రకారులలో ఏకాభి ప్రాయం లేదు. కానీ పోప్ల సంఖ్యను సేకరించిన తొలి చరిత్రకారునిగా హెర్మానస్ కాంట్రాక్టస్కు పేరు ఉంది. ఆయన జాబితాలో మొత్తం 154 మంది పోప్లు ఉన్నారు. ఆఖరి పేరు సెయింట్ పదిహేనో లియో. తరువాత 20వ శతాబ్దం వరకు పోప్ల చరిత్ర, జాబితాలను పునర్ లిఖించుకుంటూనే ఉన్నారు. కేవలం 12 రోజుల నుంచి (ఏడో అర్బన్, క్రీ.శ.1590), మూడున్నర దశాబ్దాల పాటు క్రైస్తవ ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తూ ఆ పదవిలో ఉన్నవారు కనిపిస్తారు (క్రీ.శ. 752లో సెయింట్ రెండో స్టీఫెన్ ఆ పదవికి ఎంపికైన మూడో రోజునే కన్నుమూశారు. దీనితో కొందరు చరిత్ర కారులు ఆయన పేరును ఈ జాబితాలో చేర్చరు). సెయింట్ థియోడర్ (క్రీ.శ.897) 20 రోజులు, సెయింట్ వేలంటైన్ (క్రీ.శ. 827) 40 రోజులు మాత్రమే ఆ పదవిలో ఉన్నారు. ప్రస్తుతం సెయింట్ జోర్గ్ మేరియో బెర్గోగిలియో (పోప్ ఫ్రాన్సిస్) ఉన్నారు. పోప్లంతా కేవలం ఆధ్యాత్మిక కార్య కలాపాలకే పరిమితం కాలేదు. ఆయా సంక్షోభాల సమయంలో, సమరాల సమయంలో శాంతిని నెలకొల్పడానికి కృషి చేసిన వారున్నారు. కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నవారూ ఉన్నారు. రెండో జాన్పాల్ (1978-2005) ఇస్లాం, జూడాయిజంలతో, ప్రాచ్య సంప్రదాయ క్రైస్తవంతోను కేథలిక్ తెగ సంబంధాలు మెరుగు పరచడానికి కృషి చేశారు. అలాగే పోలెండ్ దేశస్థుడైన ఈ పోప్ అక్కడ కమ్యూనిజానికి వ్యతిరేకంగా వచ్చిన ఆందోళనకు మద్దతు ఇచ్చినట్టు కూడా గాథలు ఉన్నాయి. 129 దేశాలు తిరిగిన మొదటి పోప్ కూడా ఆయనే. అమెరికాలో పర్యటించిన తొలి పోప్ ఆరో పాల్, సెయింట్ జాన్ అణ్వాయుధాల తగ్గింపు కోసం తన వంతు కృషి చేశారు. సెయింట్ సైయస్ (1922-1939) నాజీజం, కమ్యూనిజాలను వ్యతిరేకించేవారని చెబుతారు.