చంద్రబాబు వైఫల్యాలపై పోరాటం
నెల్లూరు(వేదాయపాళెం) : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైఫల్యాలపై అలుపెరగని పోరాటం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. నగరంలోని మాగుంట లేఅవుట్లో ఉన్న జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం వైఎస్సార్ సీపీ అనుబంధ సంఘాల జిల్లా నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమానికి ప్రజల్లో మంచి స్పందన వస్తోందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం వద్ద ఖచ్చితమైన ధోరణిలో మాట్లాడే దమ్ము చంద్రబాబుకు లేదన్నారు. కృష్ణ పుష్కరాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు పుష్కరాల విశిష్టత చాటిచెప్పే విధంగా జరగాల్సి ఉండగా సొంత ప్రచారహోరుతో భక్తులకు ఇబ్బంది పెట్టారన్నారు. రియో ఒలంపిక్స్లో ప్రతిభచాటిన సింధూకు రూ.3కోట్లు, నివేశ స్థలం, ఉద్యోగం ప్రకటించడం తప్పు కాదని, రాష్ట్రంలో ఎందరో క్రీడాకారులకు ప్రోత్సాహం లేకపోవడంతో ప్రతిభ కనుమరుగవుతున్నారన్నారు. అమరావతిలో ఒలంపిక్స్ నిర్వహిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బాబునాయుడు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై దశలవారీగా పోరాటాలు చేయాలన్నారు. అనుబంధ సంఘాల నాయకులు, సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రణాళిక రూపొందించాలన్నారు. పార్టీ అనుబంధ సంఘాలు గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో శిక్షణ తరగతులు నిర్వహించాలని సూచించారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పి.రూప్కుమార్యాదవ్, బీసీ సెల్ జిల్లాల అధ్యక్షులు డి.భాస్కర్గౌడ్, ఎస్సీ సెల్ కె.వెంకటేశ్వర్లు, ఎస్టీసెల్ బి.వెంకటపతి, సాంస్కృతిక విభాగం సి.రమేష్బాబు, ప్రచారవిభాగం ముత్తుకుండు వెంకటరెడ్డి, విద్యార్థి విభాగం జీపీ శ్రావణ్కుమార్, మత్స్యకారుల విభాగం కె.ఆర్ముగం, వికలాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా మోహన్ పాల్గొన్నారు.