Divestment
-
రూ. 11140 కోట్ల షేర్ అమ్మేస్తున్న రిలయన్స్
ముంబై: దేశీ పెయింట్స్ దిగ్గజం ఏషియన్ పెయింట్స్లో తనకున్న 4.9 శాతం వాటాలను విక్రయించడంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ కసరత్తు చేస్తోంది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఈ వాటా విలువ దాదాపు రూ. 11,140 కోట్లుగా ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఏకమొత్తంగా ఒకేసారి లేదా పలు డీల్స్ ద్వారానైనా ఈ లావాదేవీని నిర్వహించేందుకు బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీవోఎఫ్ఏ)ను నియమించుకున్నట్లు సమాచారం.అయితే, ప్రస్తుత మార్కెట్ ధర కంటే డిస్కౌంట్కే ఆఫర్లు వస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఎప్పుడో 17 ఏళ్ల క్రితం 2008 జనవరిలో రిలయన్స్ ఈ వాటాలను రూ. 500 కోట్లతో కొనుగోలు చేసింది. దానితో పోలిస్తే ప్రస్తుత ధర ప్రకారం దాదాపు 24 రెట్లు లాభాన్ని కంపెనీ అందుకోనుంది.పెయింట్స్ పరిశ్రమలో పోటీ తీవ్రం కావడంతో ఏషియన్ పెయింట్స్ మార్కెట్ వాటా గత ఆర్థిక సంవత్సరం 59 శాతం నుంచి 52 శాతానికి తగ్గింది. అలాగే గత ఏడాది వ్యవధిలో షేరు విలువ సుమారు 19 శాతం పైగా క్షీణించింది. దేశీయంగా నంబర్ వన్ స్థానంలో ఉన్న ఏషియన్ పెయింట్స్ అంతర్జాతీయంగా 8వ స్థానంలో ఉంది. 15 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. -
2 నెలల్లో లక్ష కోట్లు ఉఫ్!
కొద్ది నెలలుగా దేశీ స్టాక్స్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) అమ్మకాలకు తెగబడుతుండడంతో మార్కెట్లు పతనబాట పట్టాయి. 2024 అక్టోబర్ లో మొదలైన ఎఫ్పీఐల పెట్టుబడుల ఉపసంహరణ నిరవధికంగా సాగుతోంది. దీంతో స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఇండెక్సుల్లో భారీ కరెక్షన్ జరుగుతోంది.. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువలు కొత్త గరిష్టస్థాయిల నుంచి భారీగా తగ్గుముఖం పట్టాయి. సుమారు మూడేళ్లపాటు సాగిన స్టాక్ మార్కెట్ బుల్ పరుగు గత ఏడాది చివరి త్రైమాసికం నుంచి స్పీడు తగ్గింది. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో సెంటిమెంట్ బలహీనపడి మార్కెట్లు లాభాల బాట నుంచి యూటర్న్ తీసుకుని నష్టాల ప్రయాణం మొదలు పెట్టాయి. దీంతో 2024 సెపె్టంబర్ 27న చరిత్రాత్మక గరిష్టాలను తాకిన నిఫ్టీ, సెన్సెక్స్ వరుసగా తగ్గుతూ ఇప్పటివరకూ 14 శాతం పతనమయ్యాయి. బేర్ ట్రెండ్వైపు మళ్లాయి! కారణాలు ఇవీ...మూడేళ్లుగా అలుపెరుగని లాభాల పరుగు తీసిన నిఫ్టీ, సెన్సెక్స్ ప్రభావంతో లార్జ్ క్యాప్స్తోపాటు.. పలు మధ్య, చిన్నతరహా స్టాక్స్ సైతం భారీగా ఎగశాయి. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లు ఖరీదుగా మారినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో తలెత్తిన ప్రపంచ రాజకీయ, భౌగోళిక అనిశి్చతులు సెంటిమెంటును బలహీనపరిచాయి. యూఎస్ ప్రెసిడెంట్గా రిపబ్లికన్ ట్రంప్ ఎన్నికవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు అధికమయ్యాయి. ట్రంప్ విధానాలపై అంచనాలతో డాలరు బలపడటం, ట్రెజరీ ఈల్డ్స్ మెరుగుపడటం రూపాయినీ దెబ్బతీసింది. అధికారం చేపట్టాక భారత్సహా పలు దేశాలపై ట్రంప్ ప్రతీకార టారిఫ్లకు దిగడం ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. మరోపక్క జీడీపీ వృద్ధికి దన్నుగా చైనా సహాయక ప్యాకేజీలకు ప్రకటించింది. భారత్తో పోలిస్తే చౌకగా ట్రేడవుతున్న చైనా స్టాక్స్ విదేశీ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఇవి చాలదన్నట్లు దేశ జీడీపీ వృద్ధి కొంత నెమ్మదించడం, అంచనాలు అందుకోని దేశీ కార్పొరేట్ల క్యూ3 ఫలితాలు తదితర అంశాలు ఎఫ్పీఐలను నిరాశపరచినట్లు వివరించారు. దీంతో ప్రధాన ఇండెక్సులను మించి మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు పతనమవుతున్నట్లు తెలియజేశారు. నేలచూపుల తీరిదీ బీఎస్ఈ ప్రధాన ఇండెక్స్ సెన్సెక్స్ గత సెపె్టంబర్ 27న 85,978 వద్ద స్థిరపడింది. ఇదే రోజు నిఫ్టీ 26,277కు నిలిచింది. ఇవి సరికొత్త రికార్డులుకాగా.. ఈ స్థాయి నుంచి నిఫ్టీ 3,730 పాయింట్లు(14 శాతం) పతనమైంది. సెన్సెక్స్ 11,376 పాయింట్లు(13 శాతం) కోల్పోయింది. వెరసి గతేడాది అక్టోబర్ నుంచి మార్కెట్లు బేర్ ట్రెండ్లో సాగుతున్నాయి. గత అక్టోబర్ మొదలు అమ్మకాలు కొనసాగిస్తున్న ఎఫ్పీఐలు కొత్త ఏడాది(2025)లో ఇప్పటివరకూ రూ. 1.07 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం! ఫలితంగా ఈ జనవరి మొదలు ఇప్పటివరకూ సెన్సెక్స్ 3,537 పాయింట్లు(4.5 శాతం) పడిపోయింది. ఈ బాటలో నిఫ్టీ 1,097 పాయింట్లు(4.6 శాతం) వెనకడుగు వేసింది.నిపుణుల అంచనాలు నిజానికి మార్కెట్లలో నెలకొన్న దిద్దుబాటు పలు అంశాల కలయికతో జరుగుతుందని మాస్టర్ ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ పునీత్ సింఘానియా పేర్కొన్నారు. అధిక శాతం బ్లూచిప్ కంపెనీలు అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడం సెంటిమెంటును దెబ్బతీసినట్లు తెలిపారు. వీటికితోడు ట్రంప్ టారిఫ్ భయాలు, దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనం వంటి అంశాలు విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలకు కారణమవుతున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ వివరించారు. దీంతో మార్కెట్లు సాంకేతికంగా బలహీనపడినట్లు చెప్పారు. చైనాతో పోలిస్తే దేశీ మార్కెట్లు ఖరీదుగా ఉండటంతో ఎఫ్పీఐలు అమ్మకాలకే ప్రాధాన్యమిస్తున్నట్లు మెహతా ఈక్విటీస్ రీసెర్చ్ సీనియర్ వీపీ ప్రశాంత్ తాప్సీ పేర్కొన్నారు. భారీగా పుంజుకుంటున్న డాలరు, యూఎస్ బాండ్ ఈల్డ్స్, రూపాయి క్షీణత, ఖరీదుగా మారిన దేశీ ఈక్విటీలు ఎఫ్పీఐల అమ్మకాలకు కారణమనేది విశ్లేషకులు అభిప్రాయం.భారత్ బేర్ వర్ధమాన మార్కెట్లలో చూస్తే ప్రధానంగా ఆసియా దేశాలలో భారత్ నుంచే ఎఫ్పీఐలు అత్యధిక శాతం పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. థాయ్లాండ్, దక్షిణ కొరియా, మలేసియా తదితర మార్కెట్లతో పోలిస్తే 2025 తొలి రెండు నెలల్లో దేశీ స్టాక్స్లో భారీగా విక్రయాలు చేపట్టారు. ఆసియా దేశాలను పరిగణిస్తే ఫిలిప్పీన్స్లో అతితక్కువ అమ్మకాలు నమోదుకాగా.. భారత్లో అత్యధిక విక్రయాలకు తెరతీశారు. నిజానికి గత మూడేళ్లలో ఎఫ్పీఐలను అత్యధికంగా ఆకట్టుకున్న భారత్ ఇటీవల పలు కారణాలతో పెట్టుబడులను కోల్పోతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే ఆసియాలో మెటల్స్ ఎగుమతులతో చైనా, ఎల్రక్టానిక్స్లో వియత్నాం వంటి దేశాలు ట్రంప్ ప్రతీకార టారిఫ్లను అధికంగా ఎదుర్కోవలసి ఉంటుందని తెలియజేశారు. ఈ అంశంలో భారత్ పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ డాలర్, ట్రెజరీ ఈల్డ్స్ తదితర పలు ఇతర కారణాలతో ఎఫ్పీఐలు విక్రయాలకు పాల్పడుతున్నట్లు వివరించారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
బీపీసీఎల్ ప్రెవేటైజేషన్కు బ్రేక్: ఎందుకంటే?
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్యూ దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) ప్రైవేటైజేషన్ ప్రతిపాదనకు బ్రేక్ పడింది. దాదాపు 53 శాతం వాటాను విక్రయించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం విరమించుకుంది. ఇంధన ధరలపై స్పష్టత లేకపోవడం వంటి సమస్యలపై ఇద్దరు బిడ్డర్లు వాకౌట్ చేయడంతో కేవలం ఒక బిడ్డర్ మాత్రమే పోటీలో ఉన్నారు. దీంతో ప్రైవేటీకరణకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో నెలకొన్న పరిస్థితులరీత్యా ప్రస్తుతం ప్రయివేటైజేషన్ ప్రక్రియలో పాల్గొనలేమంటూ అత్యధిక శాతం బిడ్డర్లు అశక్తతను వ్యక్తం చేసినట్లు దీపమ్ పేర్కొంది. కంపెనీలో ప్రభుత్వానికిగల మొత్తం 52.98% వాటాను విక్రయించేందుకు తొలుత ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. ఇందుకు వీలుగా 2020 మార్చిలోనే ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్కు ఆహ్వానం పలికింది. అదే ఏడాది నవంబర్కల్లా కనీసం మూడు సంస్థలు బిడ్స్ దాఖలు చేశాయి. అయితే ఇంధన ధరల విషయంలో స్పష్టత లేకపోవడంతో రెండు సంస్థలు రేసు నుంచి వైదొలగాయి. దీంతో ఒక కంపెనీ మాత్రమే బరిలో నిలిచింది. ఫలితంగా డిజిన్వెస్ట్మెంట్పై ఏర్పాటైన మంత్రివర్గ కమిటీ ప్రైవేటైజేషన్ ప్రక్రియ రద్దుకు నిర్ణయించినట్లు దీపమ్ వెల్లడించింది. పరిస్థితుల ఆధారంగా ఈ అంశంపై భవిష్యత్లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలియజేసింది. బీపీసీఎల్లో ప్రభుత్వ వాటా కొనుగోలుకి వేదాంతా గ్రూప్, యూఎస్ వెంచర్ ఫండ్స్ అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ ఇంక్, ఐ స్క్వేర్డ్ క్యాపిటల్ అడ్వయిజర్స్ ఈవోఐలను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో బీపీసీఎల్ షేరు 0.5% నీరసించి రూ. 325 వద్ద ముగిసింది. శుక్రవారం స్వల్ప లాభంతో అక్కడే కదలాడుతోంది. -
ఐడీబీఐ జోరు
ముంబై: ప్రభుత్వరంగ సంస్థ ఐడీబీఐ బ్యాంక్ వాటా విక్రయ ప్రకటనతో మార్కెట్లో దూసుకుపోతోంది. 2.34లాభంతో 74.35 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 5శాతానికి పైగా ఎగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ)లో 1.5 శాతం వాటాను వాటా విక్రయించినట్లు వెల్లడించింది. 6.75 లక్షల షేర్లు టీఐఎంఎఫ్ హోల్డింగ్స్కు విక్రయించినట్లు బీఎస్ఈకి ఫైలింగ్ లో తెలిపింది. దీంతో ఐడీబీఐ బ్యాంక్ షేరు పట్ల భారీ ఆసక్తి నెలకొంది. గతంలో ప్రభుత్వ రంగ కంపెనీ ఎల్ ఐసీకి దాదాపు 9లక్షల షేర్లను(2శాతం) విక్రయించిన సంస్థ తాజాగా టిఐఎంఎఫ్ హోల్డింగ్స్ కు భారీ వాటాను విక్రయించింది. దీంతో గత ఏడాది కాలంగా స్తబ్దుగా ఉన్న ఐడీబీఐ షేర్లు గురువారం నాటి మార్కెట్లో పుంజుకున్నాయి. కాగా బ్యాడ్ లోన్ల కారణంగా గత ఏడాది 13 శాతం వృద్ధితో పోలిస్తే ఇవాల్టి జోరుతో కలిపి ఈ ఏడాది 3శాతం మాత్రమే వృద్ధి చెందింది. -
నెలాఖర్లో సెయిల్ డిజిన్వెస్ట్మెంట్
న్యూఢిల్లీ: ఈ నెల 24-26 మధ్య ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్లో డిజిన్వెస్ట్మెంట్ జరిగే అవకాశముందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. దీనిలో భాగంగా ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) మార్గంలో ప్రభుత్వం 5% వాటాకు సమానమైన 20.65 కోట్ల షేర్లను విక్రయించనున్నట్లు తెలిపారు. బీఎస్ఈలో మంగళవారంనాటి ముగింపు ధర రూ. 77.15 ప్రకారం చూస్తే డిజిన్వెస్ట్మెంట్ ద్వారా ప్రభుత్వానికి రూ. 1,600 కోట్లు లభించే అవకాశముంది. ఇందుకు ఇప్పటికే రోడ్షోలు పూర్తయినట్లు ప్రభుత్వ అధికారి వెల్లడించారు. వెరసి సెయిల్ ద్వారా ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియకు ఊపునివ్వనున్నట్లు పేర్కొన్నారు. నిజానికి సెయిల్లో 10.82% వాటాను విక్రయించేందుకు 2012 జూలైలోనే కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీనిలో భాగంగా 2013 మార్చిలో తొలి దశకింద 5.82% వాటాను అమ్మివేసింది కూడా. లక్ష్యంవైపు చూపు ఈ ఆర్థిక సంవత్సరం(2014-15)లో ఎంపిక చేసిన ప్రభుత్వ రంగ సంస్థల్లో(పీఎస్యూలు) వాటాల విక్రయం ద్వారా రూ. 43,425 కోట్లను సమీకరించాలని బడ్జెట్లో ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. దీనిలో 30% వరకూ అంటే రూ. 18,000 కోట్లను ఒక్క ఓఎన్జీసీ ఇష్యూ ద్వారానే సమకరించేందుకు అవకాశముంది. కాగా, డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ప్రభుత్వం సెయిల్, ఓఎన్జీసీలతోపాటు, కోల్ ఇండియా, ఎన్హెచ్పీసీ, పీఎఫ్సీ, ఆర్ఈసీలలో వాటాలను విక్రయించేందుకు నిర్ణయించింది. ప్రభుత్వ సంస్థల్లో డిజిన్వెస్ట్మెంట్కు ఓఎఫ్ఎస్ మార్గాన్ని ఎంచుకుంది. రిటైల్ ఇన్వెస్టర్లకు అధిక అవకాశాలను కల్పించే బాటలో ప్రభుత్వం రిటైల్ కోటాను పెంచడమేకాకుండా ఆఫర్ ధరలో డిస్కౌంట్ను సైతం అందిస్తోంది. సాధారణంగా ఓఎఫ్ఎస్కు ధరను ఒక రోజు ముందు మాత్రమే ప్రకటిస్తోంది. ఇక ఇష్యూ తేదీని రెండు రోజుల ముందు ప్రకటించనుంది. సెబీ ఓకే ఓఎఫ్ఎస్ ద్వారా షేర్ల విక్రయాన్ని చేపట్టేందుకు టాప్-100 కంపెనీలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 2013 జనవరిలో అనుమతించింది. ఓఎఫ్ఎస్లో భాగంగా లిస్టెడ్ కంపెనీలు షేర్ల అమ్మకాన్ని వేలం ద్వారా నిర్వహిస్తాయి. మరోవైపు పబ్లిక్కు కనీసం 25% వాటా కల్పించేందుకు వీలుగా ఓఎఫ్ఎస్ను చేప్టేందుకు పీఎస్యూలకు సైతం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. -
కోల్ ఇండియా డిజిన్వెస్ట్మెంట్ కోసం రోడ్షోలు
న్యూఢిల్లీ: కోల్ ఇండియాలో దాదాపు రూ. 9,129 కోట్ల మేర వాటాల విక్రయానికి సంబంధించి డిజిన్వెస్ట్మెంట్ విభాగం విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా జర్మనీ, బ్రిటన్, అమెరికా, కెనడా, నెదర్లాండ్స్ వంటి అయిదు రాష్ట్రాల్లో రోడ్షోలు నిర్వహించనున్నది. అమెరికాలోని న్యూయార్క్, బోస్టన్, శాన్ ఫ్రాన్సిస్కోలో రోడ్షోలు నిర్వహిస్తున్నట్లు, అటుపైన కెనడాలోని టొరంటో, బ్రిటన్లోని లండన్లోనూ వీటిని నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. డిజిన్వెస్ట్మెంట్ విభాగం (డీవోడీ) అధికారులతోపాటు కోల్ ఇండియా సీఎండీ తదితరులు ఇందులో పాల్గొంటున్నారు. ప్రస్తుతం కోల్ ఇండియాలో ప్రభుత్వానికి 90 శాతం వాటాలు ఉన్నాయి. ముందుగా 10 శాతం వాటాలు విక్రయించాలని భావించినప్పటికీ, కార్మికులు ఆందోళనకు దిగడంతో వెనక్కి తగ్గి అయిదు శాతాన్ని విక్రయించేందుకు కసరత్తు చేస్తోంది. గత నెల తలపెట్టిన మూడు రోజుల సమ్మెను కార్మికులు డిసెంబర్ 17కి వాయిదా వేసుకున్నారు. 2010లో కోల్ ఇండియాలో 10 శాతం వాటాల విక్రయం ద్వారా కేంద్రం రూ. 15,199 కోట్లు సమీకరించింది. ఈ ఆర్థిక సంవత్సరం డిజిన్వెస్ట్మెంట్ మార్గంలో రూ. 40,000 కోట్లు సమీకరించాలని నిర్దేశించుకున్న ప్రభుత్వం ఇప్పటిదాకా రూ. 1,300 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. ఈ నేపథ్యంలో కోల్ ఇండియాలో డిజిన్వెస్ట్మెంట్ అత్యంత భారీది కానుంది.