FCRA
-
ఆగిపోయిన ‘ఆంక్షల’ బిల్లు
దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నివిధాల కలిసొస్తుందో వివరించటానికి దాన్ని సమర్థించేవారు అనేకానేక కారణాలు ఏకరువు పెడతారు. కానీ ఆ ప్రతిపాదన వెనకున్న అసలు కారణమేమిటో బుధవారం హఠాత్తుగా లోక్సభలో ఆగిపోయిన విదేశీ విరాళాల నియంత్రణ(ఎఫ్సీఆర్ఏ) సవరణ బిల్లు చెప్పకనే చెబుతోంది. ఎన్నికల బెడద వల్ల తమకిష్టమైనవి అమలుచేయటం అసాధ్యం కావటమే ఆ అసలు కారణం. ఎఫ్సీఆర్ఏ చట్టాన్ని మరింత కఠినం చేస్తూ తీసుకురాదల్చిన ఈ బిల్లుపై కాంగ్రెస్, సీపీఎంలు కేరళ ఎన్నికల సభల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నందువల్ల తాత్కాలికంగా ఆపామని బుధవారం కేంద్రమంత్రి కిరణ్ రిజుజు ప్రకటించారు. క్రైస్తవ ఓటర్లు గణనీ యంగావున్న కేరళలో తమ పార్టీ ప్రాబల్యం పెరిగిందని బీజేపీ భావిస్తోంది. ఆ మత విశ్వాసాలను అనుసరించే స్వచ్ఛంద సేవాసంస్థ (ఎన్జీవో)ల కార్యకలాపాలు కూడా అక్కడ ఎక్కువే. కనుక ఈ బిల్లుపై చర్చ జరిగితే అది నష్టం తెస్తుందని పాలకపక్షం భావించినట్టు కనబడుతోంది. కేవలం ‘దుష్ప్రచారం’ వల్లనే తాత్కాలికంగా ఆపామన్న కారణం సహేతుకంగా లేదు. సాగు చట్టాల బిల్లు మొదలుకొని లేబర్ కోడ్, నిన్న మొన్నటి జీరాం జీ వరకూ ఇలాంటి ‘దుష్ప్రచారా’నికి కొదవలేదు. కానీ అవి ఆగింది లేదు.అందరినీ ఒకే గాటన కట్టవలసిన అవసరం లేదు. ఎంతో నిజాయితీగా, అంకిత భావంతో పనిచేసే ఎన్జీవోలున్నట్టే... పేరు ప్రతిష్ఠల కోసం, సాధారణ జనాన్ని ప్రభా వితం చేయటం కోసం పనిచేసే సంస్థలు కూడా ఉంటాయి. యూరప్లో ఎక్కడో మారు మూల పుట్టి మన దేశంలో అట్టడుగు వర్గాలకు ఎన్నదగిన సేవలందించిన మదర్ థెరీసాను ఆ వర్గాల ప్రజలు ‘అమ్మ’గా పిల్చుకున్నారు. అలాగే ఎప్పుడూ కరవు వాతబడే ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో దాదాపు అరవైయ్యేళ్లుగా నిరుపేద ప్రజానీకానికి భిన్నరంగాల్లో విశేష సేవలందిçస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) ఖ్యాతి అందరికీ తెలుసు. ఇదే ఎఫ్సీఆర్ఏ కింద నిరుడు ఏప్రిల్లో కేంద్రం ఆ సంస్థ అనుమ తులు నిలిపివేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పల్లె నుంచి ఢిల్లీ వరకూ నిరసనలు సాగించింది. ప్రధానికి లక్ష పోస్టు కార్డులు పంపే ఉద్యమాన్ని చేపట్టింది. చివరకు గత నెలాఖరున అనుమతులు పునరుద్ధరించారు. ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లును ఇప్పుడంటే కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నది గానీ... దాన్ని మొదట తెచ్చిందీ, కాలానుగుణంగా కఠినతరం చేసిందీ ఆ పార్టీ ప్రభుత్వాలే. 1976లో ఎమర్జెన్సీ చీకటిచాటున అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తొలిసారి ఈ చట్టాన్ని తెచ్చారు. అందుకు విదేశీ శక్తుల్ని కారణంగా చూపారు. దాన్ని 2010లో మరింత కఠినతరం చేసింది కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమే. రష్యా సహకారంతో పూర్తికావస్తున్న కూదంకుళం అణువిద్యుత్ ప్రాజెక్టుపై అమెరికా నిధులతో నడిచే స్వచ్ఛంద సంస్థలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోపించారు. ఇక ఎన్డీయే సర్కారు వచ్చాక 2016, 2018, 2020లలో ఆ చట్టానికి సవరణలొచ్చాయి. అయినా సరిపోలేదని భావించి ఈ బిల్లు తెచ్చారు. ముఖ్యంగా లైసెన్స్ రద్దయిన సంస్థల నిర్వహణకు ప్రత్యేక అధికారిని నియమించే అధికారం కేంద్రా నికిచ్చేలా సెక్షన్ 15కి చేసిన సవరణే వివాదాస్పదంగా మారింది. దానిపై సంబంధిత వర్గాలతో, పార్టీలతో చర్చించి వారిలో ఉన్నాయంటున్న అపోహలను తొలగించ టానికి ఎలాంటి ప్రయత్నం జరగకుండానే బిల్లు తీసుకురావటమే సమస్య అయింది.ఎఫ్సీఆర్ఏకు 2020 సవరణల అనంతరం ఎన్జీవోలకు విరాళాలు గణనీయంగా తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో విరాళాల రూపేణా రూ. 16,490 కోట్లురాగా, 2019–20నాటికి అది కాస్తా రూ. 2,190 కోట్లకు పడిపోయింది. ఒక అంచనా ప్రకారం గత నెలాఖరు నాటికి 21,933 ఎన్జీవోల లైసెన్సులు రద్దయ్యాయి. ప్రభుత్వాలనుంచి సాయం అందని అనేక వర్గాలు ఈ సంస్థల ద్వారా లీగల్ ఎయిడ్, వైద్యసాయం, విద్య, మౌలిక సదుపాయాలు పొందుతున్నాయి. స్వచ్ఛంద సంస్థల నిర్వహణ పారదర్శకంగా ఉండాల్సిందే. ప్రమాదకర సంస్థలని రుజువైతే వాటి కార్యకలాపాలు నిలిపేయటం కూడా తప్పు కాదు. కానీ అన్నిటినీ ఒకే గాటనకట్టి పీక నొక్కాలనుకోవటం మాత్రం సహేతుకం కాదు. -
ఫలించిన వైఎస్సార్సీపీ ప్రజా పోరాటం
సాక్షి, అనంతపురం/అమరావతి: వైఎస్సార్సీపీ అలుపెరగని పోరాటం ఫలించింది. కరువు సీమకు కల్పతరువుగా మారిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) సంస్థపై ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ (ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్) కింద అననుమతులను పునరుద్ధరించింది. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు రాయలసీమలోని మరిన్ని ప్రాంతాల్లో ఆర్డీటీ సేవలు యథాతథంగా అందుబాటులోకి రానున్నాయి. 2031 వరకు ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల గొంతుకగా వైఎస్సార్సీపీ చేసిన పోరాటం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరించిందని ప్రజలు, మేధావులు స్పష్టం చేస్తున్నారు. దీనిని కూడా క్రెడిట్ చోరీ చేసేందుకు చంద్రబాబు, లోకేశ్ ప్రయతి్నస్తున్నారంటూ మండిపడుతున్నారు. 2025లో ఆర్డీటీ ఖాతాలు ఫ్రీజ్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) అనంతపురంలో 1969లో ఏర్పాటైంది. నాటినుంచి ఉమ్మడి అనంతపురం జిల్లావ్యాప్తంగా పేదలను ఆదుకునేందుకు ఏటా రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్లు వెచ్చిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలాంటి సంస్థను చంద్రబాబు ప్రభుత్వం పీకల్లోతు కష్టాల్లోకి నెట్టింది. 2025 ఏప్రిల్ 21న కేంద్రం ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించకపోవడంతో ఆర్డీటీ విదేశీ ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయి. దీంతో పేద, మధ్యతరగతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఆ సంస్థ పథకాలు అందక వారంతా నిరాశ, నిస్పృహలకు లోనయ్యారు. పేదలు పడుతున్న కష్టాలను గుర్తించిన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజా పోరాటాలు చేపట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ బాధ్యతలను మాజీ ఎంపీ తలారి రంగయ్యకు అప్పగించగా.. ఆయన పార్టీ నేతలు, ప్రజలతో కలిసి ఆందోళనలు, ర్యాలీలు, ధర్నాలు, నిరసనల కార్యక్రమాలు చేపట్టారు. లక్ష పోస్టుకార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టి ప్రధానమంత్రికి విజ్ఞప్తులు పంపారు. కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలవడంతోపాటు ఢిల్లీలో పార్లమెంట్ వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలపై స్పందించిన కేంద్రం ఎట్టకేలకు ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించింది. ఆర్డీటీ పరిరక్షణకు కృషి చేయాల్సిన టీడీపీ నాయకులు ఒక్కరోజు కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టలేదు. వైఎస్ జగన్ అభినందనలు ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ కోసం అలుపెరగని పోరాటం చేసిన మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్యకు పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్చేసి అభినందించారు.వైఎస్ జగన్ ఆశీస్సులు.. ప్రజల మద్దతుతోనే విజయం 1969 నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలకు సేవలు అందిస్తున్న గొప్ప సంస్థ ఆర్డీటీ అని, అలాంటి సంస్థకు ఎఫ్సీఆర్ఏ నిలిపివేయడంతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పోరాటం చేపట్టి విజయం సాధించామని మాజీ ఎంపీ తలారి రంగయ్య, అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజనాథ్ స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో వారు మాట్లాడుతూ.. ‘పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆశీస్సులు.. ప్రజల మద్దతుతో విజయం సాధించాం.10 నెలల నిరంతర పోరాట ఫలితంగా కేంద్రం ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించడం శుభపరిణామం. చంద్రబాబు ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డంకులు సృష్టించినప్పటికీ ప్రజల మద్దతుతో పోరాటాన్ని కొనసాగించాం. దీని ఫలితంగానే కేంద్రం ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించింది. ఉద్యమానికి అండగా నిలిచిన మాజీ సీఎం వైఎస్ జగన్కు, సహకరించిన ప్రజా సంఘాలకు, జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఈ విజయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు క్రెడిట్ చోరీకి ప్రయత్నించడం దారుణం. అనంతపురం జిల్లా ప్రజలు కూటమి నేతల తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆర్డీటీ పరిరక్షణ కోసం కూటమి నేతలు చేసిందేమీ లేదు’ అని స్పష్టం చేశారు. -
ప్రధాని మోదీకి వైఎస్ జగన్ కృతజ్ఞతలు
తాడేపల్లి: రూరల్ డెవలప్ ట్రస్ట్(ఆర్డీటీ)కి ఎఫ్సీఆర్ఏ((ఫారీన్ కంట్రిబ్యూషన్ రెగ్యులర్ యాక్ట్) పర్మిషన్లు రెన్యువల్ చేయడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఉమ్మడి అనంతపురం జిల్లాలో విద్య ,వైద్యం, పర్యావరణం, సామాజిక అభివృద్ధిలో ఆర్డీటీ సేవలు కొనసాగేందుకు, తద్వారా పేదల అభ్యున్నతికి ఈ అనుమతులు మేలు చేస్తాయన్నారు. ఈ విషయంలో కూడా చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని విమర్శించారు వైఎస్ జగన్. నిజంగా చంద్రబాబు కృషి ఉంటే పర్మిషన్ల రెన్యువల్కు ఏడాదికాలం ఎందుకు పట్టిందని వైఎస్ జగన్ ప్రశ్నించారు.చంద్రబాబు పట్టించుకోకపోవడం వల్లే వైఎస్సార్సీపీ, ప్రజా సంఘాలు ఉద్యమం చేయాల్సి వచ్చిందన్నారు వైఎస్ జగన్. క్రెడిట్ చోరీ చేయడంలో చంద్రబాబును మించినవారు లేరని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT)కి FCRA పర్మిషన్లు రెన్యువల్ చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీగారికి, కేంద్ర హోంమంత్రి అమిత్షా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉమ్మడి అనంతపురం జిల్లాలో విద్య, వైద్యం, పర్యావరణం, సామాజికాభివృద్ధిలో RDT సేవలు కొనసాగేందుకు, తద్వారా పేదల… pic.twitter.com/FFrb8rpPfO— YS Jagan Mohan Reddy (@ysjagan) March 24, 2026 ఇదీ చదవండి:ఫలించిన వైఎస్సార్సీపీ పోరాటం -
ఫలించిన వైఎస్సార్సీపీ పోరాటం
తాడేపల్లి: వైఎస్సార్సీపీ పోరాటం ఫలించింది.. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్(ఆర్డీటీ) సేవలకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ (ఫారీన్ కంట్రిబ్యూషన్ రెగ్యులర్ యాక్ట్) పునరుద్ధరణ ఇవ్వడం శుభపరిణామమని వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా నేతలు హర్షం వ్యక్తం చేశారు. కరువు జిల్లా అనంతపురంలో మళ్లీ యథాతథంగా ఆర్డీటీ సేవలు అందుబాటులోకి రానున్నాయని.. ఇది ప్రజలు, వైఎస్సార్సీపీ పోరాట ఫలితమేనని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి సాకె శైలజనాథ్, అలాగే అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య స్పష్టం చేశారు. కానీ దీన్ని కూడా క్రెడిట్ చోరీ చేసేందుకు చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రెస్మీట్లో అనంతపురం జిల్లా నేతలు ఇంకా ఏమన్నారంటే..వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రజా ఉద్యమం: వెంకట్రామిరెడ్డికరువు సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న అనంతపురం జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) ప్రజలకు జీవనాధారంగా నిలిచింది. భూగర్భ జలాల పెంపు, హరిజన–గిరిజనులు సహా పేదల అభ్యున్నతికి సంస్థ చేసిన సేవలు అమూల్యం. అయితే 2025 ఏప్రిల్ 21న కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ నిలిపివేయడంతో సంస్థ సేవలు నిలిచిపోయి జిల్లా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లాలో భారీ స్థాయిలో ఉద్యమాలు చేపట్టాం. ఆర్డీటీ సంస్థ ప్రారంభించిన కళ్యాణదుర్గం నుంచి పోరాటం మొదలు పెట్టేందుకు మాజీ ఎంపీ రంగయ్య నేతృత్వంలో బైక్ ర్యాలీలు, 19 రోజుల పాదయాత్ర, నిరసన కార్యక్రమాలు నిర్వహించాం.పాదయాత్రకు కూటమి ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డంకులు సృష్టించినప్పటికీ ప్రజల మద్దతుతో పోరాటాన్ని కొనసాగించాం. లక్ష పోస్టుకార్డుల ఉద్యమం ద్వారా ప్రధాన మంత్రికి నేరుగా వినతులు పంపడం, అలాగే కేంద్ర మంత్రి అమిత్షాను కలిసి వినతిపత్రం అందజేయడం వంటి చర్యలతో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చాం. ఈ సమగ్ర పోరాట ఫలితంగానే కేంద్రం ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరిస్తూ ఆర్డీటీ సేవలు కొనసాగించేలా నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తూ, ఈ ఉద్యమానికి అండగా నిలిచిన పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి, సహకరించిన ప్రజా సంఘాలు, జిల్లా ప్రజలకు అనంత వెంకట్రామిరెడ్డి అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. క్రెడిట్ చోరీ కూటమి నేతలకు అలవాటుగా మారింది: శైలజనాథ్రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) సంస్థకు ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ లభించడం శుభపరిణామం. అయితే వెంటనే కూటమి ప్రభుత్వం ఈ విజయాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు క్రెడిట్ చోరీకి ప్రయత్నించడం దురదృష్టకరం. అనంతపురం జిల్లా ప్రజలు కూటమి నేతల తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. క్రెడిట్ చోరీ వారికి అలవాటైందని చర్చించుకుంటున్నారు. ఆర్డీటీ పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ నేతలు, ప్రజాసంఘాలు కలిసి సంవత్సరం పాటు పోరాటం చేసింది. కానీ కూటమి నేతలు ఒక్క నిరసన కూడా చేపట్టలేదు. 2025 ఏప్రిల్ 21న కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏను నిలిపివేసినప్పుడు రాష్ట్రం, కేంద్రంలో కూటమి ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయన్నది కూటమి నేతలు మరచిపోయారు. ఏడాది పాటు నిధులు లేక ఆర్డీటీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. సేవా కార్యక్రమాలు నిలిచిపోవడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.కేంద్రంపై ఒత్తిడి తెచ్చాంవైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం నుంచి ఉద్యమాన్ని ప్రారంభించాలని తలారి రంగయ్యకు ఆ బాధ్యతలు అప్పగించాం. పాదయాత్రలు, బైక్ ర్యాలీలు, లక్ష పోస్టుకార్డుల ఉద్యమం, ఢిల్లీలో నిరసనలు వంటి కార్యక్రమాలతో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చాం. అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఇది ప్రజల పోరాట ఫలితం. కూటమి నేతలు ఎలాంటి పోరాటం చేయకపోయినా తమ వల్లే సాధ్యమైందని చెప్పుకోవడం సిగ్గుచేటు. కేంద్రంలో భాగస్వాములైన టీడీపీ నేతలు క్రెడిట్ చోరీకి పాల్పడటం విడ్డూరం. ప్రజల పక్షాన సేవలు అందిస్తున్న ఆర్డీటీకి భవిష్యత్తులో ఇలాంటి అవరోధాలు కలగకూడదని విజ్ఞప్తి చేస్తూ, ఏ సమస్య వచ్చినా వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని సాకె శైలజనాథ్ స్పష్టం చేశారు.వైఎస్ జగన్ ఆశీస్సులు..ప్రజల మద్దతుతో విజయం: తలారి రంగయ్యరూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) 1969 నుంచి ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తున్న గొప్ప సంస్థ. అలాంటి సంస్థకు ఎఫ్సీఆర్ఏ నిలిపివేయడంతో సమస్యలు తలెత్తినప్పుడు, పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం. 2025 మే 17న బైక్ ర్యాలీ, జూన్లో 19 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించాం, పోలీసులు అడ్డుకున్నప్పటికీ ప్రజల మద్దతుతో వైఎస్ జగన్ ఆశీస్సులతో పోరాటాన్ని కొనసాగించి విజయం సాధించాం. అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు, లక్ష పోస్టుకార్డుల కార్యక్రమం నిర్వహించడంతో కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. ఈ నెల 16న కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలిసి వినతిపత్రం అందజేయడంతో పాటు పార్లమెంట్లో పార్టీ ఎంపీలతో కలిసి నిరసన చేపట్టాం. 10 నెలల నిరంతర పోరాట ఫలితంగానే కేంద్రం ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించడం శుభపరిణామం.ఈ విజయాన్ని ప్రజల గెలుపుగా అభివర్ణిస్తూ, శాంతియుత, గాంధేయ మార్గంలో సాధించిన ఫలితమని తలారి రంగయ్య పేర్కొన్నారు. ఆర్డీటీ పరిరక్షణ కోసం పోరాడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. -
RDTకి విదేశీ నిధుల అడ్డంకి? బాబు కుట్రలపై ప్రజాసంఘాల ఫైర్
-
విదేశాల్లో బంధువులున్నారా? మీకో గుడ్న్యూస్: నిబంధనలు మారాయ్!
సాక్షి,న్యూఢిల్లీ: విదేశీ విరాళాల స్వీకరణ నియంత్రణ (ఎఫ్సీఆర్ఏ) చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా సవరించింది. ఈ మేరకు విదేశాలలో నివసిస్తున్న భారతీయులు, వారి బంధువులకు శుభవార్త అందించింది. తాజా సవరణతో ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం అందించాల్సిన అవసరం లేకుండానే పది లక్షల రూపాయల వరకు భారతీయ బంధువులకు, కుటుంబీకులకు విదేశాల్లో ఉంటున్న వారు పంపించుకోవచ్చు. ఇప్పటివరకు ఈ పరిమితి కేవలం లక్ష రూపాయలు మాత్రమే. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. అంతేకాదు సవరించిన నిబంధనల ప్రకారం, లబ్ధిదారులు ఏడాదిలో రూ.10 లక్షలకు మించి నిధులు అందిన 90 రోజుల్లోగా ప్రభుత్వానికి అధికారికంగా వెల్లడించేలా నిబంధనలు మార్చింది. ఇప్పటివరకు ఈ వ్యవధి 30 రోజులు మాత్రమే. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఎ)కి సంబంధించిన కొన్ని నిబంధనలను మంత్రిత్వ శాఖ సవరించింది. దీనికి సంబంధించిన ఫారిన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) సవరణ నిబంధనలు, 2022 గెజిట్ నోటిఫికేషన్ను హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. కాగా విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం 2011లో, రూల్ 6 ప్రకారంలో ఏ వ్యక్తి అయినా తన బంధువుల నుండి ఒక ఆర్థిక సంవత్సరంలో లక్ష కంటే ఎక్కువ లేదా దానికి సమానమైన విదేశీ విరాళాన్ని స్వీకరిస్తే, అటువంటి సహకారం అందిన 30 రోజులలోపు కేంద్రానికి వివరాలు తెలియజేయాల్సి ఉండింది. ప్రస్తుత నిబంధన ప్రకారం 10 లక్షలకు మించి విదేశీ నిధులను స్వీకరిస్తే 90 రోజులలోపు సమాచారాన్ని కేంద్రానికి అందించాలి. అదేవిధంగా, ఎఫ్సీఆర్ఏ నిధులను స్వీకరించడానికి 'రిజిస్ట్రేషన్' లేదా 'ముందస్తు అనుమతి' పొందే నిబంధన 9కి కూడా మార్పులు చేసింది. సంబంధిత వ్యక్తులు, సంస్థలు లేదా ఎన్జీవోలు తమకు అందిన నిధులు, బ్యాంకు ఖాతా సమాచారాన్ని హోంమంత్రిత్వ శాఖకు అందించే గడువు 45 రోజులకు పెంచింది. ఇప్పటివరకు ఇది 30 రోజులు మాత్రమే. ఎన్జీవోలు లేదా సంస్థలు, వ్యక్తులు విదేశీ నిధులను స్వీకరణకు సంబంధించి తన అధికారిక వెబ్సైట్లో ప్రతీ త్రైమాసికంలో వివరాలను అందించాలనే మరో నిబంధనను కూడా తొలగించింది. ఒక వేళ బ్యాంకు ఖాతా, పేరు, చిరునామా లేదా విదేశీ నిధులు మారిన పక్షంలో, ఆ సమాచారాన్ని మునుపటిలా 15 రోజుల ముందు కాకుండా 45 రోజులలోపు అందించాలి. అలాగే ఆయా నిధుల వినియోగంపై ఆడిటెడ్ స్టేట్మెంట్ అందించడానికి ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటి నుంచి 9 నెలల సమయం ఉంటుంది. -
మిషనరీస్ ఆఫ్ చారిటీకి లైసెన్స్ పునరుద్ధరణ
న్యూఢిల్లీ: మదర్ థెరిస్సా స్థాపించిన ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ(ఎంఓసీ)’ ఎన్జీవోకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. విదేశీ విరాళాల స్వీకరణకు సంబంధించిన ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ను కేంద్ర హోం శాఖ శుక్రవారం పునరుద్ధరించింది. విదేశీ విరాళాల స్వీకరణ నియంత్రణ(ఎఫ్సీఆర్ఏ యాక్ట్) చట్టం కింద సంస్థ లైసెన్స్ను పునరుద్ధరించిన నేపథ్యంలో ఇకపై విదేశీ విరాళాలను అందుకునే హక్కులు ఎంఓసీకి దక్కాయి. కోల్కతా కేంద్రంగా పనిచేసే ఎంఓసీ సంస్థకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకుల ఖాతాలో నిల్వ ఉన్న నగదు మొత్తాలను వినియోగించుకునే అవకాశం చిక్కింది. నిరుపేదలకు శాశ్వత సేవే ఆశయంగా నోబెల్ గ్రహీత మదర్ థెరిస్సా 1950లో కోల్కతాలో మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థను నెలకొల్పారు. ‘నాటి నుంచి దశాబ్దాలుగా కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు ఇకమీదటా కొనసాగుతాయి. లైసెన్స్ పునరుద్ధరించారనే వార్త మా సంస్థకు నిజంగా పెద్ద ఊరట. లైసెన్స్ రాని ఈ రెండు వారాలూ దేశీయ విరాళాలతో మాకు పూర్తి సహాయసహకారాలు అందించిన దాతల దాతృత్వం అమూల్యం’ అని ఎంఓసీ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఎంఓసీకి వచ్చిన గత విదేశీ విరాళాలకు సంబంధించి కొంత ప్రతికూల సమాచారం ఉందనే కారణంతో 2021 డిసెంబర్ 25న క్రిస్మస్ రోజునే ఆ సంస్థ లైసెన్స్ రెన్యువల్ దరఖాస్తును కేంద్ర హోం శాఖ తిరస్కరించడం తెల్సిందే. దీంతో దేశవ్యాప్తంగా విపక్షాలతోపాటు భిన్న వర్గాల నుంచి మోదీ సర్కార్పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇన్నాళ్లూ ముస్లింలను వేధించిన బీజేపీ సర్కార్ తాజాగా క్రిస్టియన్ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుందని విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో లైసెన్స్ను పునరుద్ధరించడం గమనార్హం. భారత్లోని ఏదైనా ఎన్జీవో.. విదేశీ విరాళాలను పొందాలంటే లైసెన్స్ తప్పనిసరి. తప్పుగా కనబడింది.. 15 రోజుల్లో ఒప్పయిందా?: తృణమూల్ ఎంపీ డిరెక్ విరాళాల్లో అసంబద్ధ సమాచారం ఉందంటూ దరఖాస్తును తిరస్కరించిన 15 రోజుల్లోనే మళ్లీ లైసెన్స్ను కట్టబెట్టడంలో ఆంతర్యమేమిటని మోదీ సర్కార్ను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డిరెక్ ఓబ్రియన్ సూటిగా ప్రశ్నించారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో క్రిస్టియన్ల ఓట్లను రాబట్టేందుకే కేంద్ర ప్రభుత్వం యూ టర్న్ తీసుకుందన్నారు. క్రైస్తవుల ప్రేమకు మోదీ తలొగ్గారన్నారు. ‘పవర్ ఆఫ్ లవ్ గ్రేటర్ దన్ ది పవర్ ఆఫ్ 56 ఇంచెస్’ అని ట్వీట్చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీనుద్ధేశిస్తూ 56 అంగుళాల ఛాతి అని గతంలో వ్యాఖ్యానించడం తెల్సిందే. -
ఐఐటీ ఢిల్లీకి విదేశీ విరాళాలు బంద్
న్యూఢిల్లీ: లైసెన్స్ రెన్యువల్ కాని కారణంగా దేశంలోని 5,789 ఎన్జీవో సంస్థలు విదేశీ విరాళాలను అందుకునే అవకాశాన్ని కోల్పోయాయి. ఐఐటీ ఢిల్లీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ), జామియా మిలియా ఇస్లామియా, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ తదితర ప్రముఖ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. విదేశీ విరాళాల నియంత్రణ(ఎఫ్సీఆర్ఏ యాక్ట్) చట్టం కింద లైసెన్స్ పునరుద్ధరణకు నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేయకపోవడం, చేసుకున్న దరఖాస్తు తిరస్కరణ, తదితర కారణాలతో ఈ సంస్థల లైసెన్స్ రెన్యువల్ కాలేదని కేంద్ర హోం శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సంస్థల గత లైసెన్స్ శనివారం(జనవరి ఒకటిన) ముగిసింది. ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్, లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆక్స్ఫామ్ ఇండియా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్, గోద్రేజ్ మెమోరియల్ ట్రస్ట్, ది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ, జేఎన్యూలోని న్యూక్లియర్ సైన్స్ సెంటర్, లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్ ఫౌండేషన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిషర్మెన్స్ కోఆపరేటివ్స్, భారతీయ సంస్కృతి పరిషద్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాల లైసెన్స్ గడువు ముగిసింది. భారత్లోని ఎన్జీవోలు విదేశీ విరాళాలను సమీకరించాలంటే ఎఫ్సీఆర్ఏ కింద దరఖాస్తు చేసుకుని లైసెన్స్ను కలిగి ఉండటం తప్పనిసరి. శుక్రవారం నాటికి వీటి సంఖ్య 22,762కాగా శనివారం తర్వాత వీటి సంఖ్య 16,829కి తగ్గింది. -
ఆమ్నెస్టీ కార్యాలయంపై సీబీఐ దాడులు
సాక్షి, బెంగళూరు: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బెంగళూరు, ఢిల్లీలోని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కార్యాలయాలపై శుక్రవారం దాడులు నిర్వహించింది. దాడులపై అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ సీబీఐ అధికారులు ఆరుగురు ఇవాళ ఉదయం 8.30 గంటలకు బెంగళూరు ఆమ్నెస్టీ కార్యాలయానికి చేరుకున్నారని, సాయంత్రం అయిదు గంటల వరకు సోదాలు కొనసాగించారని తెలిపారు. భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతిసారీ వేధింపులకు గురవుతున్నామని సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. తమ సంస్థ భారతీయ, అంతర్జాతీయ చట్టాలకు పూర్తిగా అనుగుణంగా పనిచేస్తోందని పేర్కొంది. గత ఏడాది కూడా విదేశీ మారకద్రవ్యాల ఉల్లంఘన (ఫెరా) కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. 2010లో ఫారన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సీఆర్ఏ) లైసెన్స్ రద్దు కేసుతో ముడిపడి ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. -
జైసింగ్ దంపతుల ఇళ్లపై సీబీఐ దాడులు
న్యూఢిల్లీ: ప్రముఖ సుప్రీంకోర్టు మహిళా న్యాయవాది, మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ ఇందిరా జైసింగ్, ఆమె భర్త ఆనంద్ గ్రోవర్లపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) దాడులు నిర్వహించింది. విదేశీ నిధుల చట్టం నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై ఈ దాడులు జరిగాయి. గురువారం తెల్లవారుజామున 5గంటలకు ఢిల్లీలోని ఇందిరా జైసింగ్ ఇల్లు, జంగ్పురాలో లాయర్స్ కలెక్టివ్ స్వచ్ఛంద సంస్థ ఆఫీస్, ముంబైలోని మరో ఆఫీస్లో దాడులు నిర్వహించినట్లు సీబీఐ ప్రకటించింది. ఆనంద్ గ్రోవర్ తన ఆధ్వర్యంలో నడుస్తోన్న లాయర్స్ కలెక్టివ్ స్వచ్ఛంద సంస్థకు వచ్చిన విదేశీ విరాళాలను దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. 2006 నుంచి 2014 మధ్య ఆనంద్ గ్రోవర్ తన స్వచ్ఛంద సంస్థ ద్వారా రూ.32.39 కోట్లకుపైగా అవకతవకలకు పాల్పడ్డారని హోం శాఖ ఫిర్యాదిచ్చింది. దీంతో సంస్థ అధ్యక్షుడు గ్రోవర్పై విదేశీ సహకార నియంత్రణ చట్టాన్ని(ఎఫ్సీఆర్ఎ) ఉల్లంఘించారన్న ఆరోపణల కింద సీబీఐ కేసు నమోదు చేసింది. దీనిలో భాగంగానే గురువారం సోదాలు నిర్వహించింది. ఫిర్యాదులో ఇందిరను నిందితురాలిగా పేర్కొనలేదు. 2009–14లో అదనపు సొలిసిటర్ జనరల్గా ఇందిర పనిచేశారు. ఈ ఆరోపణలను ఖండిస్తూ ఇందిర, గ్రోవర్, లాయర్స్ కలెక్టివ్ తరఫున ఓ ప్రకటన వెలువడింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఓ మాజీ ఉద్యోగి చేసిన లైంగిక ఆరోపణల కేసును ఇందిర వాదిస్తుండడంతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని సంయుక్త ప్రకటన పేర్కొంది. ఖండించిన రాజకీయ పార్టీలు.. సీబీఐ దాడులు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. సీబీఐ దాడులను టీఎంసీ, ఎస్పీ, సీపీఐ, సీపీఎంలకు చెందిన ఎంపీలు మూకుమ్మడిగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం తన అధికారాలను పూర్తిస్థాయిలో దుర్వినియోగం చేస్తోందన్నారు. ఈ మేరకు వారంతా ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు. -
ఇందిరా జైసింగ్ నివాసంలో సీబీఐ దాడులు
న్యూఢిల్లీ : విదేశీ నిధుల దుర్వినియోగం ఆరోపణలతో సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్, ఆమె భర్త ఆనంద్ గ్రోవర్లపై సీబీఐ గురువారం దాడులు నిర్వహించింది. ఢిల్లీలోని ఇందిరా జైసింగ్ నివాసం, ఎన్జీవో ఆఫీస్, ముంబయిలోని మరో ఆఫీసులో గురువారం ఉదయం 5గంటలకు దాడులు నిర్వహించినట్లు సీబీఐ పేర్కొంది. లాయర్స్ కలెక్టివ్ పేరిట ఎన్జీవోను స్థాపించి విదేశీ సహకార నియంత్రణ చట్టాన్ని(ఎఫ్సీఆర్ఎ) ఉల్లఘించారన్న ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే ఆనంద్గ్రోవర్ పై కేసు నమోదైనట్లు వెల్లడించింది. 2006 నుంచి 2014 మధ్య ఆనంద్ గ్రోవర్ 'లాయర్ కలెక్టివ్' ఎన్జీవో సంస్థ ద్వారా దాదాపు రూ.32 కోట్ల అవకతవకలకు పాల్పడ్డారని హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు ఇచ్చింది. అయితే ఫిర్యాదులో ఇందిరా జైసింగ్ను నిందితురాలిగా పేర్కొనలేదని, కానీ లాయర్స్ కలెక్టివ్ నుంచి ఆమెకు రూ.96.60లక్షలు ముడుపులు అందినట్లు ఆరోపణలు వచ్చాయని సీబీఐ స్పష్టం చేసింది. మరోవైపు ఇందిరా జైసింగ్ 2009 నుంచి 2014 వరకు అదనపు సొలిసిటర్గా భాద్యతలు నిర్వహించిన సమయంలో తన విదేశీ పర్యటనలకు సంబంధించిన ఖర్చులను హోంశాఖ అనుమతి లేకుండానే ఎన్జీవో సంస్థ నుంచి పొందినట్లు సీబీఐ తెలిపింది. సీనియర్ న్యాయవాది ఇందిరాజైసింగ్ పై సీబీఐ నిర్వహించిన దాడులను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. ' రాజ్యాంగ విలువలను కాపాడడానికి వాళ్ల జీవితం మొత్తాన్ని అంకితం చేశారని, అటువంటి వారిపై అభియోగం మోపడం చాలా భాదాకరమని' కేజ్రీవాల్ ట్విటర్లో పేర్కొన్నారు. -
'కేసు తెలియదుగానీ సస్పెన్షన్ మాత్రం సరికాదు'
న్యూఢిల్లీ: ఇస్లాం మత వివాదాస్పద ప్రచారకుడు జకీర్ నాయక్ స్వచ్ఛంద సంస్థకు అనుమతిచ్చి సస్పెండ్కు గురైన కేంద్ర హోంశాఖ అధికారులకు హోంశాఖ మాజీ కార్యదర్శి దన్నుగా నిలిచారు. వారిని సస్పెండ్ చేయడం సరైన నిర్ణయం కాదని అన్నారు. ఏదైన ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించాలంటే కేంద్ర హోంశాఖ నుంచి అనుమతి తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా విదేశాల నుంచి నిధులు పొందే సంస్థలు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్(ఎఫ్సీఏ) ప్రకారం లైసెన్స్ తీసుకోవాలి. అయితే, జకీర్ నాయక్ కూడా ఇస్లామిక్ రిసెర్చ్ ఫౌండేషన్ పేరిట ఓ స్వచ్చంద సంస్థను స్థాపించి ఎఫ్సీఏ అనుమతి కోరగా దానికి అప్పుడు ఉన్న హోంశాఖ అధికారులు లైసెన్స్ ఇచ్చారు. అయితే, జకీర్ నాయక్ ఇటీవల రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ వివాదాలకు తెరతీసిన విషయం తెలిసిందే. దీంతో జకీర్ నాయక్ పై చర్యలు తీసుకోవడంలో భాగంగా ఆయన స్వచ్చంద సంస్థ గుర్తింపు రద్దు చేశారు. దానికి అనుమతిచ్చిన నలుగురు అధికారులను ఈ నెల(సెప్టెంబర్) 1న సస్పెండ్ చేశారు. దీనిపై హోంశాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై స్పందించారు. 'జకీర్ నాయక్పై కేసు వివరాలు ఏమిటో నాకు తెలియదు. కానీ సస్పెండ్ చేయడం సరికాదు. అలాంటి చర్యలు సాధారణంగా ప్రజలను నిరుత్సాహపరుస్తాయి. ఇలాంటి చర్యలే తీసుకుంటూపోతే బ్యూరోక్రసీ ఆగిపోయే ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే ఆగిపోయే ప్రమాదం ఉంది. నా అనుభవం ప్రకారం హోంశాఖ కార్యదర్శి ఇలాంటి కేసుల్లో తన అధికారులను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది' అని ఆయన చెప్పారు.


