female actress
-
పెళ్లెప్పుడంటే...?
సాయిపల్లవి తన వ్యక్తిగత విషయాలను మీడియాతో చాలా అరుదుగా మాత్రమే పంచుకుంటుంది. పెళ్లెప్పుడని ఆమెను అడిగితే, కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. ఈ నేపథ్యంలోనే సాయిపల్లవి ఇష్టాయిష్టాలు, ఆమె జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..⇒ తల్లిదండ్రులను, పుట్టిన ఊరిని విడిచి పెట్టడం సాయిపల్లవికి ఇష్టం లేదు. పెళ్లి తర్వాత తనని అన్నీ విడిచి రమ్మని చెప్పే వారిని అసలు పెళ్లే చేసుకోనని ‘అస్ట్రో ఉలగం’ అనే తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.⇒ సాయిపల్లవిది బడగ గిరిజన కుటుంబం. ఆమె తల్లి రాధామణి సాయిబాబా భక్తురాలు. అందుకే, ఆమె పేరులో ‘సాయి’ అని చేర్చారు.⇒ డ్యాన్స్ అంటే పిచ్చి, కేవలం టీవీలో మాధురీ దీక్షిత్, ఐశ్వర్యా రాయ్ డ్యాన్స్ వీడియోలను చూస్తూ డ్యాన్స్ నేర్చుకుంది. మెడిసిన్ చదువులో చేరడానికి ముందు ‘ధామ్ ధూమ్’, ‘కస్తూరిమాన్’ అనే తమిళ సినిమాల్లో నటించింది.⇒ మొదటిసారి టీ రుచి చూసింది ‘ప్రేమమ్’ సినిమా షూటింగ్ సెట్లోనే.. అప్పటి వరకు ఆమెకు టీ, కాఫీ అలవాటే లేదు. హీరోయిన్గా అదే ఆమె మొదటి సినిమా.⇒ భాష ఏదైనా తన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండే పాత్రలనే ఎంపిక చేసుకుంటారట సాయిపల్లవి.⇒ అసలైన అందం మనిషి మనసులో ఉంటుందని, రూ. 2 కోట్ల విలువైన బ్యూటీ ప్రోడక్ట్ యాడ్ను తిరస్కరించింది.⇒ బన్తో తయారుచేసే ఆహారం, కొబ్బరి నీళ్లు ఇష్టం. వంట వండటం, తోటపని, తేనెటీగల పెంపకం ఆమెకు ఇష్టమైన పనులు.⇒ దైవ భక్తి ఎక్కువ. తన తాతయ్య ఇచ్చిన రుద్రాక్ష మాలను ఎప్పుడూ చేతికి ధరిస్తుంది.⇒ సినిమాల్లోకి రాకముందు సాయిపల్లవి చేసిన ఓ డ్యాన్స్ వీడియో వైరల్గా మారింది. అప్పుడే ఇకపై శరీరం ఎక్కువగా కనిపించేలా దుస్తులు వేసుకోకూడదని నిర్ణయించుకుంది. అందుకే, ఎక్కువ సంప్రదాయ దుస్తుల్లోనే కనిపిస్తుంది.⇒ ప్రస్తుతం బుజ్జితల్లిగా ‘తండేల్’ చిత్రంతో ప్రేక్షకులను అలరిస్తోంది. బాలీవుడ్లో ‘రామాయణ’ అనే పాన్ ఇండియా సినిమాలోనూ నటిస్తోంది. -
కె విశ్వనాథ్.. ఆయన సృష్టించిన అద్భుత స్త్రీ పాత్రలివే..!
పాశ్చాత్య సంగీతపు పెనుతుఫానుకు అరచేతులు అడ్డుపెడుతుంది ఒక స్త్రీ. ఒక గొప్ప నాట్యకారుడి అంతిమ రోజులను అర్థమంతం చేస్తుంది మరో స్త్రీ. తనలోని కళను తాను కనుగొనడానికి గొప్ప సంఘర్షణ చేస్తుంది ఒక స్త్రీ. వ్యసనపరుడైన భర్తను సంస్కరించడానికి ఎడబాటు నిరసనను ఆశ్రయిస్తుంది మరో స్త్రీ. ప్రేమకు కులం లేదు అనే స్త్రీ... వరకట్నం వద్దు అనే స్త్రీ.. మందమతితో జీవితాన్ని పునర్నిర్మించుకునే స్త్రీ. అతడు చూపిన స్త్రీలు ఆత్మాభిమానం కలిగిన స్త్రీలు. ఆత్మవిశ్వాసాన్ని కలిగిన స్త్రీలు. భారతీయ సంస్కృతిని గౌరవించాలనుకునే స్త్రీలు. అలాంటి వారి పాత్రలను తీర్చిదిద్దిన కె.విశ్వనాథ్ సినిమాలను ఓసారి గుర్తు చేసుకుందాం. ‘శంకరాభరణం’లో మంజుభార్గవి ఆమెకు సంగీతం, నృత్యం అంటే ప్రాణం. కాని తల్లి ఆమెను ఒక వేశ్యను చేయాలనుకుంటుంది. బలవంతంగా ఆమెపై అత్యాచారం జరిగేలా చూస్తుంది. ఆమె కడుపున నలుసు పడుతుంది. కాని అది ఇష్టం లేని సంతానం. ఒక పాము కాటేస్తే వచ్చిన గర్భం. పుట్టబోయేది కూడా పామే. ఆమె అబార్షన్ చేయించుకోదు. ఆత్మహత్య చేసుకోదు. ఆ బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డకు సంగీతం నేర్పిస్తుంది. తరువాత తను దేవుడిగా భావించే శంకరశాస్త్రి దగ్గరకు పంపి ఆయన శిష్యుడిగా మారుస్తుంది. బయట దారిలో కనిపిస్తే ‘పాము’ పామే అవుతుంది. కాని శివుని మెడలో ఉండి కనిపిస్తే ‘శంకరాభరణం’ అవుతుంది. అథోముఖమైన తన జీవితాన్ని ఊర్థ్వంలోకి మార్చుకుని సంతృప్తి పొందిన ఆ స్త్రీ ‘శంకరాభరణం’లో మంజుభార్గవి. ఆ పాత్రను అంత తీక్షణంగా, ఔన్నత్యంగా తీర్చిదిద్దినవారు దర్శకడు కె.విశ్వనాథ్. ఒక కళాకారున్ని తెలుసుకోవాలంటే అతడు పుట్టించిన పాత్రలను చూడాలి. మహిళల పట్ల అతడి దృక్పథం తెలియాలంటే అతడు సృష్టించిన మహిళా పాత్రలను చూడాలి. కె.విశ్వనాథ్ సృష్టించిన మహిళా పాత్రలు ప్రేక్షకులకు నచ్చిన పాత్రలు. ప్రేక్షకులు మెచ్చిన పాత్రలు. అంతేకాదు పరోక్షంగా తమ ప్రభావాన్ని వేసే పాత్రలు. ‘శుభలేఖ’ సినిమాలో సుమలత ‘శుభలేఖ’ సినిమాలో సుమలత లెక్చరర్. ఎంతో చక్కని అమ్మాయి. ఆమెతో జీవితం ఏ పురుషుడికైనా అపురూపంగా ఉండగలదు. కాని ఆమెను కోడలిగా తెచ్చుకోవడానికి బోలెడంత కట్నం అడుగుతాడు ఆ సినిమాలో పెద్దమనిషి సత్యనారాయణ. డబ్బు, కానుకలు, కార్లు... ఒకటేమిటి అడగనిది లేదు. ఆత్మాభిమానం ఉన్న ఏ అమ్మాయి అయినా ఊరుకుంటుందా? సుమలత తిరగబడుతుంది. సంతలో పశువును కొన్నట్టు వరుణ్ణి కొననని చెప్పి సంస్కారం ఉన్న వ్యక్తి హోటల్లో వెయిటర్ అయినా సరే అతణ్ణే చేసుకుంటానని చిరంజీవిని చేసుకుంటుంది. మనిషికి ఉండాల్సిన సంస్కార సంపదను గుర్తు చేస్తుంది ఈ సినిమాలో సుమలత. ‘సాగర సంగమం’లో జయప్రద ‘సాగర సంగమం’లో జయప్రద ఫీచర్ జర్నలిస్ట్. చదువుకున్న అమ్మాయి. భారతీయ కళలు ఎంత గొప్పవో తెలుసు. అందుకే కమల హాసన్లోని ఆర్టిస్ట్ను గుర్తించింది. అతన్ని ఇష్టపడటం, కోరుకోవడం జరక్కపోవచ్చు. అతడి కళను ఇష్టపడటం ఆపాల్సిన అవసరం లేదని గ్రహిస్తుంది. విఫల కళాకారుడిగా ఉన్న కమల హాసన్ చివరి రోజులను అర్థవంతం చేయడానికి అతడిలోని కళాకారుణ్ణి లోకం గుర్తించేలా చేయడానికి ఆమె ప్రయత్నిస్తుంది. తన కుమార్తెనే అతని శిష్యురాలిగా చేస్తుంది. ఆమె రాకముందు అతడు తాగుబోతు. కాని మరణించే సమయానికి గొప్ప కళాకారుడు. స్త్రీ కాదు లత. ఒక్కోసారి పురుషుడే లత. ఆ లతకు ఒక దన్ను కావాలి. ఆ దన్ను జయప్రదలాంటి స్త్రీ అని ఆ సినిమాలో విశ్వనాథ్ చూపిస్తారు. ‘సప్తపది’లో ఆ అమ్మాయి అతడి కులాన్ని చూడదు. అతడి చేతిలోని వేణువునే చూస్తుంది. ఆ వేణునాదాన్నే వింటుంది. ఏడడుగుల బంధంలోకి నడవాలంటే కావాలసింది స్త్రీ, పురుషుల మధ్య ఏర్పడే పరస్పర ప్రేమ, గౌరవం. అంతే తప్ప కులం, అంతస్తు కాదు. సంప్రదాయాల కట్టుబాట్లు ఉన్న ఇంట పుట్టినా హృదయం చెప్పిందే చేసిందా అమ్మాయి. ఆమె ప్రేమను లోకం హర్షించింది. స్వర్ణకమలం’లో భానుప్రియ యువతకు లక్ష్యం ఉందా? కళ పట్ల అనురక్తి ఉందా? తమలోని కళను కాకుండా కాసులను వెతికే వేటను కొనసాగిస్తే అందులో ఏదైనా సంతృప్తి ఉందా? ‘స్వర్ణకమలం’లో గొప్ప నాట్యగత్తె భానుప్రియ. కాని ఆ నాట్యాన్ని ఆమె గుర్తించదు. ఆ కళను గుర్తించదు. ఒక కూచిపూడి నృత్యకళాకారిణిగా ఉండటం కన్నా హోటల్లో హౌస్కీపింగ్లో పని చేయడమే గొప్ప అని భావిస్తుంది. ఆ అమ్మాయికి ధైర్యం ఉంది. తెగువ ఉంది. చురుకుదనం ఉంది. టాలెంట్ ఉంది. స్వీయజ్ఞానమే కావాల్సింది. కాని చివరలో ఆత్మసాక్షాత్కారం అవుతుంది. తను గొప్ప డ్యాన్సర్ అవుతుంది. మూసలో పడేవాళ్లు మూసలో పడుతూనే ఉంటారు. కొత్తదారి వెతికినవారు భానుప్రియ అవుతారు. మీరు మాత్రమే నడిచే దారిలో నడవండి అని చెప్పిందా పాత్ర. ‘స్వాతిముత్యం’లో రాధిక లైఫ్లో ఒక్కోసారి ఆప్షన్ ఉండదు. మనం టిక్ పెట్టేలోపలే విధి టిక్ పెట్టేస్తుంది. ‘స్వాతిముత్యం’లో రాధికకు భర్త చనిపోతాడు. ఒక కొడుకు. ఆ కష్టం అలా ఉండగానే మందమతి అయిన కమల హాసన్ తాళి కట్టేస్తాడు. అంతవరకూ ఆమె జీవితం ఏమిటో ఆమెకు తెలియదు. ఇప్పుడు ఒక మీసాలు లేని, ఒక మీసాలు ఉన్న పిల్లాడితో కొత్త జీవితం నిర్మించుకోవాలి. ఆమె నిర్మించుకుంటుంది. అతణ్ణి కర్తవ్యోన్ముఖుణ్ణి చేస్తుంది. అడ్డంకులను జయించుకుంటూ అతడి ద్వారా తన జీవితాన్ని జయిస్తుంది. స్థిర సంకల్పం ఉంటే కష్టాలను దాటొచ్చని చెబుతుంది. కె.విశ్వనాథ్ మహిళా పాత్రలలో స్వాతిముత్యంలో రాధిక పాత్ర మర్చిపోలేము. 'శృతిలయలు' లో సుమలత ‘శృతిలయలు’లో సుమలత భర్త రాజశేఖర్. కళకారుడు. కాని స్త్రీలోలుడు అవుతాడు. వ్యసనపరుడవుతాడు. లక్ష్యరహితుడవుతాడు. అతన్ని సరిచేయాలి. దానికి ఇంట్లో ఉండి రాద్ధాంతం పెట్టుకోదు ఆమె. కొడుకును తీసుకుని దూరం జరుగుతుంది. హుందాగా ఉండిపోతుంది. ఎదురు చూస్తుంది. ఏ మనిషైనా బురదలో ఎక్కువసేపు ఉండలేరు. రాజశేఖర్ కూడా ఉండలేకపోతాడు. మగాడికి గౌరవం కుటుంబంతోనే అని గ్రహిస్తాడు. మగాడికి గౌరవం భార్య సమక్షంలోనే అని గ్రహిస్తాడు. మగాడికి గౌరవం ఒక లక్ష్యంతో పని చేయడమే అని గ్రహిస్తాడు. ఆమె పాదాల దగ్గరకు తిరిగి వస్తాడు. విశ్వనాథ్ సృష్టించిన స్త్రీలు లౌడ్గా ఉండరు. కాని వారు స్పష్టంగా ఉంటారు. సౌమ్యంగా ఉంటారు. స్థిరంగా సాధించుకునే వ్యక్తులుగా ఉంటారు. సమాజంలో స్త్రీలకు ఉండే పరిమితులు వారికి తెలుసు. కాని వాటిని సవాలు చేయడం పనిగా పెట్టుకోకుండా ఆ ఇచ్చిన బరిలోనే ఎలా విజయం సాధించాలో తెలుసుకుంటారు. విశ్వనాథ్ స్త్రీలు తెలుగుదనం చూపిన స్త్రీలు. మేలిమిదనం చూపిన స్త్రీలు. అందమైన స్త్రీలు... రూపానికి కాని... వ్యక్తిత్వానికి కాని! -
కరోనా పాజిటివ్.. నిద్ర పట్టడం లేదు: నటి
డెహ్రాడూన్: తనకు తన కుటుంబ సభ్యులకు కరోనా అని తేలడంతో నిద్ర పట్టడం లేదని ప్రముఖ సీరియల్ నటి మోహేనా కుమారి పేర్కొన్నారు. దీనిపై ఆమె మంగళవారం తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ.. ‘నిద్రపట్టడం లేదు.. ఈ ప్రారంభ రోజులు మా అందరికి ముఖ్యంగా చిన్నవారికి, పెద్దవారికి చాలా కష్టంగా ఉంది. ఈ విపత్కర పరిస్థితుల నుంచి మేమంతా త్వరలో బయటపడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ప్రస్తుతం మేము బాగానే ఉన్నాము. ఈ విషయంలో దేనిపై మాకు ఫిర్యాదు చేసే హక్కు లేదు. ఎందుకంటే ఇంతకన్నా కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నవారు సమాజంలో చాలా మంది ఉన్నారు’ అంటూ ఆమె ఇన్స్టాలో రాసుకొచ్చారు. (మాకు కరోనా పాజిటివ్గా తేలింది: నటి) అంతేగాక తన కుటుంబమంతా కరోనా బారిన పడిన విషయం తెలిసి సన్నిహితులు, బంధువులు త్వరలో కోలుకోవాలని ఆశిస్తున్నామంటు వారికి క్షేమ సందేశాలు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోహేనా ‘‘మా కుటుంబం మహమ్మారి నుంచి కోలుకోవాలని ప్రార్థిస్తూ.. సందేశాలు పంపిస్తున్న వారందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్న. మీ మెసేజ్లు మాలో ఆత్మవిశ్వాన్ని నింపుతున్నాయి’’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. కాగా తనతో పాటు తన భర్త సూయేష్ రావత్, ఆయన తండ్రి, ఉత్తరాఖండ్ పర్యటక శాఖ మంత్రి సత్పాల్ మహరాజ్కు, ఆయన భార్యకు కూడా కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ తేలిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారు, వారి బంధువులు 41 మంది క్వారంటైన్లో ఉన్నారు. (మంత్రి భార్యకు కరోనా: 41 మంది క్వారంటైన్) View this post on Instagram 🙏🏽 A post shared by Mohena Kumari Singh (@mohenakumari) on Jun 1, 2020 at 3:16pm PDT -
మాకు కరోనా పాజిటివ్గా తేలింది: నటి
ముంబై: ‘యెహ్ రిష్తా క్యా కెహల్తా హై’ ఫేం నటి మోహనా కుమారి సింగ్తో పాటు ఆమె కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఈ సందర్భంగా మోహనా కుమారి మాట్లాడుతూ.. ‘ఇది నిజం. నాకు, నా కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం మేమందరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాము. మాకు కరోనా లక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయని.. త్వరలోనే కోలుకుంటామని వైద్యులు తెలిపారు. మేము అదే నమ్ముతున్నాం’ అన్నారు. తొలుత ఆమె అత్త అమృత రావత్ కరోనా బారిన పడ్డారు. ఆమెను రిషికేశ్లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. మోహనా కుటుంబంలో పని చేస్తున్న వారికి కూడా కరోనా పాజిటటివ్గా తేలడంతో వారంతా ప్రస్తుతం క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నారు. గత ఏడాది అక్టోబర్లో మోహనా ఉత్తరాఖండ్ పర్యాటక మంత్రి సత్పాల్ మహారాజ్ కుమారుడు సుయేష్ రావత్ని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె తన భర్త, కుటుంబంతో కలిసి డెహ్రాడూన్లో నివసిస్తోంది. (ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత) -
'పారితోషికం నచ్చితేనే ఓకే చెప్పండి'
ముంబై: బాలీవుడ్ హీరోయిన్లకు ఓ హీరో బాసటగా నిలుస్తున్నాడు. హీరోలతో పాటు హీరోయిన్లకు సమాన వేతనాలు చెల్లించాలని పేర్కొన్నాడు. సమాన వేతన చట్టం తరహాలో ఏదైనా ఓ విధానం రావాలని కోరుకుంటున్న బాలీవుడ్ నటుడు, నిర్మాత ఫర్హాన్ అక్తర్. 'పార్క్ అవెన్యూ' ప్రాడక్ట్ లాంచ్ కార్యక్రమంలో గురువారం పాల్గొన్న అక్తర్ కొన్ని విషయాలను ప్రస్తావించాడు. 'బాగ్ మిల్కా బాగ్'తో తనకుంటూ అభిమానులను సంపాదించుకున్నాడు ఈ హీరో. హీరోల స్థాయిలో తమకు పారితోషికాలు అందించాలంటూ హీరోయిన్లు అడగుతున్నారని చెప్పాడు. తాము ఎందులోనూ తక్కువ కాదని, సమాన పారితోషికం ఇవ్వాలని హీరోయిన్లు కోరుకుంటున్నారు.. ఇందుకు తాను మద్దతు ఇస్తానన్నాడు. ఒకవేళ తన సినిమాలలో నటించే హీరోయిన్లు అడిగితే వారికి తగిన పారితోషికం ఇవ్వడం ఇష్టమేనన్నాడు. నిర్మాతలు ఇస్తున్నది తగిన పారితోషికం కాదని వారు భావిస్తే ఆ సినిమాలకు నో చెప్పడం మంచిదంటూ సూచించాడు. ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమేనని, ఇష్టం ఉన్నవారు తన సలహా ఫాలో అవ్వొచ్చని చెప్పాడు. ఆడ, మగ అనే భేదం లేకుండా సినీ ఇండస్ట్రీలో చాలా మంది నైపుణ్యం ఉన్న నటీనటులు ఉన్నారని ఫర్హాన్ చెప్పుకొచ్చాడు.