Advertisement
foreign brands
-
వచ్చే ఐదేళ్లలో ఐదువేల స్టోర్లు.. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే..
అభివృద్ధి చెందుతున్న ఎమర్జింగ్ ఎకానమీగా ఇండియా ఎదుగుతోంది. దాంతో అంతర్జాతీయంగా చాలాదేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షిస్తోంది. అందులో భాగంగానే గ్లోబల్ రిటైల్ కంపెనీలు ఇండియా బాట పడుతున్నాయి. దేశీయ వినియోదారులను ఆకర్షించడానికి పెద్ద మొత్తంలో స్టోర్లు ఓపెన్ చేస్తున్నాయి. యువత గ్లోబల్ బ్రాండ్లకు ఆకర్షితులు అవుతుండడంతో ఇండియాలో తమ మార్కెట్ పెంచుకోవాలని కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఈ ఏడాది ఇండియాలో విదేశీ కంపెనీలు స్టోర్లు ఓపెన్ చేయడానికి సుమారు 160 బ్రాండ్లు లోకల్ సంస్థలతో లేదా సొంతంగా స్టోర్లు పెట్టడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఫారిన్ కంపెనీలకు లోకల్ పార్టనర్లను వెతకడంలో సాయపడే ఫ్రాంచైజ్ ఇండియా హోల్డింగ్స్ తాజాగా నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం ఒక ఏడాదిలో ఇంత భారీగా ఫారిన్ బ్రాండ్లు ఇండియాకు రావడం ఇదే మొదటిసారి. విదేశీ కంపెనీలు వచ్చే ఐదేళ్లలో సుమారు 5 వేల స్టోర్లను ఓపెన్ చేస్తాయని అంచనా. ఫలితంగా దాదాపు రూ.2078 కోట్లు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇండియాలో తమ కార్యకలాపాలు సాగించాలనుకుంటున్న కంపెనీల్లో ఫుడ్ అండ్ బెవరేజెస్ సెక్టార్ సంస్థలే ఎక్కువగా ఉన్నాయని ఫ్రాంచైజ్ ఇండియా హోల్డింగ్స్ ఛైర్మన్ గౌరవ్ మౌర్య పేర్కొన్నారు. ముఖ్యంగా కేఫ్, కాఫీ చెయిన్స్ ఏర్పాటు చేయడానికి కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పారు. సాధారణంగా బర్గర్లు, పిజ్జా స్టోర్లను ఫారిన్ కంపెనీలు ఎక్కువగా ఓపెన్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటాయి. ఇదీ చదవండి: చంద్రయాన్-3.. స్లీప్మోడ్లోనూ సిగ్నల్.. ఇస్రో కీలక అప్డేట్ ఫ్రాంచైజ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, థాయ్లాండ్కు చెందిన అతిపెద్ద కాఫీ చెయిన్ కేఫ్ అమెజాన్, యూఎస్ కంపెనీ పీట్స్ కాఫీ వంటి కంపెనీలు ఈ ఏడాది ఇండియాలో తమ స్టోర్లు ఓపెన్ చేయాలని చూస్తున్నట్లు తెలిసింది. గ్లోబల్ కంపెనీలు పెద్ద మొత్తంలో కాఫీ స్టోర్లను ఓపెన్ చేయనుండడంతో స్టార్బక్స్ కూడా తన విస్తరణను వేగవంతం చేసింది. -
శ్రేయాస్ మీడియా ఇక గ్లోబల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మూవీ ఈవెంట్స్, ప్రమోషన్స్లో దేశంలో అగ్ర శ్రేణి సంస్థ శ్రేయాస్ మీడియా రూ.30 కోట్ల నిధులను సమీకరిస్తోంది. వ్యూహాత్మక, ప్రముఖ పెట్టుబడిదార్లతో ఈ మేరకు కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. మధ్య ప్రాచ్య, యూఎస్, ఏషియా పసిఫిక్తోపాటు దేశవ్యాప్తంగా విస్తరణకు తాజా నిధులను ఉపయోగిస్తామని శ్రేయాస్ గ్రూప్ ఫౌండర్ గండ్ర శ్రీనివాస్ రావు మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. హైదరాబాద్కు చెందిన శ్రేయాస్ మీడియా 2011లో ప్రారంభమైంది. దక్షిణాదిన 1,500లకుపైగా ఈవెంట్స్ను నిర్వహించింది. వీటిలో 1,000 దాకా సినిమా ప్రచార కార్యక్రమాలు ఉన్నాయి. దుబాయిలోనూ కార్యకలాపాలు ప్రారంభించింది. తెలుగుతో మొదలై దక్షిణాది భాషలకు సేవలను విస్తరించింది. గరిష్టంగా 10 కోట్ల మంది.. దక్షిణాది సినిమాలతో కలిసి పనిచేసేందుకు దేశ, విదేశీ బ్రాండ్స్ సిద్ధంగా ఉన్నాయని శ్రీనివాస్ వెల్లడించారు. ‘స్పాన్సర్స్కు సినిమాలతో పెద్ద ఎత్తున మైలేజ్ వచ్చేలా ఈవెంట్స్ చేస్తున్నాం. కార్యక్రమాల్లో సినీ తారలు ఉండడంతో బ్రాండ్స్ సులువుగా వీక్షకులకు చేరువ అవుతున్నాయి. ప్రపంచంలోనే ఇది విభిన్న కాన్సెప్ట్. నటులు, దర్శకులు, నిర్మాతలకు సామాజిక మాధ్యమాల్లో కోట్లాది మంది అభిమానులున్నారు. సినిమాతో ముడిపడి ఏ కార్యక్రమం చేసినా స్పాన్సర్ బ్రాండ్స్ కోట్లాది మందికి చేరువ అవుతున్నాయి. ఒక్కో కార్యక్రమాన్ని గరిష్టంగా 10 కోట్ల మందికిపైగా వీక్షిస్తున్నారు. అందుకే విదేశీ బ్రాండ్స్ స్పాన్సర్షిప్కు ముందుకు వస్తున్నాయి. దక్షిణాది సినిమాల గురించి దేశ, విదేశాల్లోనూ మాట్లాడుకుంటున్నారు. ఇది మాకు, బ్రాండ్స్కు గొప్ప వ్యాపార అవకాశం‘ అని ఆయన వివరించారు. కొత్త విభాగాల్లోకి ఎంట్రీ.. సినిమా ఆసరాగా కొత్త విభాగాల్లో ప్రవేశిస్తామని శ్రీనివాస్ వెల్లడించారు. ‘శ్రేయాస్ఈటీ ఓటీటీని పునర్నిర్మిస్తాం. ఇందులో భాగంగా నూతన సాంకేతికతతో ఇంటెరాక్టివ్ మూవీస్, మినీ, స్నాక్ మూవీస్తోపాటు తొలిసారిగా 8డీ మూవీస్ పరిచయం చేస్తాం. రెట్రో మూవీస్ను పొందుపరుస్తాం. కంపెనీ 2027 నాటికి ఏటా 650 సినిమా కార్యక్రమాలు, 120 మూవీ ప్రమోషన్స్ చేపట్టాలని లక్ష్యంగా చేసుకుంది. గ్రూప్ టర్నోవర్ రూ.700 కోట్లు ఆశిస్తోంది. ఇందులో మూవీ ఈవెంట్స్ వాటా రూ.285 కోట్లు ఉంటుందని అంచనా. 2021–22లో రూ.20 కోట్ల టర్నోవర్ సాధించాం’ అని చెప్పారు. –శ్రేయాస్ గ్రూప్ ఫౌండర్ గండ్ర శ్రీనివాస్ రావు -
నైకీ, హెచ్అండ్ఎం బ్రాండ్స్కు చైనా షాక్
బీజింగ్: వీగర్ ముస్లింల అణిచివేత అంశంలో చైనా వైఖరిని వ్యతిరేకిస్తున్న విదేశీ కంపెనీలను కట్టడి చేయడంపై డ్రాగన్ దేశం దృష్టి పెట్టింది. ఈ క్రమంలో హెచ్అండ్ఎం, నైకీ, జారా తదితర విదేశీ బ్రాండ్స్ .. పిల్లలకు హానికరమైన బొమ్మలు, దుస్తులు మొదలైనవి దేశంలోకి దిగుమతి చేస్తున్నాయంటూ ఆరోపించింది. ఈ వారంలో అంతర్జాతీయ బాల కార్మికుల దినోత్సవం సందర్భంగా ఇలాంటి 16 కంపెనీలకు చెందిన టీ-షర్టులు, బొమ్మలు, టూత్బ్రష్షులు మొదలైన వాటిని ‘‘నాణ్యత, భద్రత పరీక్షలో అర్హత పొందని’’ ఉత్పత్తులుగా చైనా కస్టమ్స్ ఏజెన్సీ ఒక జాబితా తయారు చేసింది. వీటిని ధ్వంసం చేయడం లేదా వాపసు పంపడం చేస్తామని పేర్కొంది. అయితే, వివాదాస్పదమైన షాంజియాంగ్ ప్రావిన్స్ పరిణామాల గురించి గానీ, విదేశీ కంపెనీల విమర్శలను గానీ ఈ సందర్భంగా ప్రస్తావించలేదు. దుస్తులు, బొమ్మల్లో హానికారకమైన అద్దకాలు, ఇతర రసాయనాలు ఉన్నాయని మాత్రమే తెలిపింది. షాంజియాంగ్ ప్రావిన్స్లో వీగర్ ముస్లింలను అణిచివేస్తూ, వెట్టిచాకిరీ చేయిస్తోందంటూ చైనా ఆరోపణలు ఎదుర్కొంటోంది. అక్కడి ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల తమపైనా విమర్శలు వస్తుండటంతో హెచ్అండ్ఎం ఇకపై షాంజియాంగ్ ప్రావిన్స్లో ఉత్పత్తయ్యే పత్తిని తమ ఉత్పత్తుల్లో వినియోగించబోమంటూ ఇప్పటికే ప్రకటించింది. ఈ ప్రకటనతో ఆగ్రహించిన చైనా ఈ-కామర్స్ కంపెనీలు తమ ప్లాట్ఫామ్స్ నుంచి హెచ్అండ్ఎం ఉత్పత్తులను తొలగించాయి. ఆ కంపెనీతో పాటు నైకీ, అడిడాస్ వంటి ఇతర విదేశీ బ్రాండ్స్కి సంబంధించిన యాప్స్ను కూడా యాప్ స్టోర్స్ తొలగించాయి. అయితే తాజా పరిణామంపై నైక్, జారా, హెచ్ అండ్ ఎం ఇంకా స్పందించలేదు. -
విదేశీ టీకాలకు మూడు రోజుల్లోనే అనుమతులు
న్యూఢిల్లీ: దేశంలో అత్యవసర వినియోగానికి విదేశీ కోవిడ్ టీకా సంస్థలు పెట్టుకునే దరఖాస్తులపై మూడు రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. విదేశీ కంపెనీలు పెట్టుకున్న పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులు అవి అందిన మూడు పనిదినాల్లోగా డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఆధ్వర్యంలో పనిచేసే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్ట్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీవో) అనుమతి మంజూరు చేస్తుందని వివరించింది. సదరు విదేశీ సంస్థ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఉత్పత్తి ప్రాంతం, ఉత్పత్తి) దిగుమతి అనుమతి పత్రాలను సీడీఎస్సీవో పరిశీలిస్తుందని పేర్కొంది. సంతృప్తికరంగా ఉంటే ఆయా కోవిడ్ టీకాలను పరిమితులకు లోబడి అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి మాత్రమే అనుమతిస్తుందని తెలిపింది. మార్గదర్శకాలకు లోబడి ఆ టీకాను వినియోగించాల్సి ఉంటుందని పేర్కొంది. విదేశీ టీకా కంపెనీలు భారత్లోని తమ అనుబంధ సంస్థ ద్వారా గానీ అధీకృత ఏజెంట్ ద్వారా గానీ సీడీఎస్సీవోకు దరఖాస్తు చేసుకోవాలనిఆరోగ్య శాఖ తెలిపింది. ‘వ్యాక్సినేషన్లో వినియోగించటానికి ముందుగా సదరు విదేశీ టీకాను 100 మంది లబ్ధిదారులకు వేసి, వారం రోజుల పరిశీలన తర్వాత ప్రభుత్వ నిపుణుల కమిటీ వారి పరిస్థితిని అధ్యయనం చేస్తుంది. ఆ టీకా రోగ నిరోధక శక్తి, భద్రతలను బేరీజు వేశాకే అనుమతి ఇస్తుంది’అని వివరించింది. సీడీఎస్సీవో ప్రోటోకాల్ ప్రకారం సదరు విదేశీ టీకాల ప్రతి బ్యాచ్ను కసౌలీలోని సెంట్రల్ డ్రగ్స్ రీసెర్చి లేబొరేటరీ(సీడీఎల్) ద్వారానే విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు అమెరికా, యూకే, జపాన్ల్లో అత్యవసర వినియోగానికి అనుమతించిన కోవిడ్ టీకాలకు దేశంలో ఫాస్ట్ట్రాక్ విధానంలో అనుమతులివ్వాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. -
విదేశీ బ్రాండ్లకు దేశీ బాండ్..!
ఫ్రాంచైజీలో ఔట్లెట్లు తెరుస్తున్న ఎల్లో టై హాస్పిటాలిటీ ⇒ ప్రస్తుతం 6 బ్రాండ్లు; ఒక్కోదానికి రూ.6–8 కోట్ల ఖర్చు ⇒ రూ.9 కోట్ల టర్నోవర్; రూ.30 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి ⇒ ‘స్టార్టప్ డైరీ’తో సంస్థ ఫౌండర్ అండ్ సీఈఓ కరన్ టన్నా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్విస్ట్ ఆఫ్ థడ్కా, వ్రాప్చిక్, ధడూం, బీబీ జాన్, బ్రోస్టర్.. ఇవేవో బాలీవుడ్ సినిమా పేర్లు అనుకునేరు. ఇవన్నీ పాపులర్ ఫుడ్ బ్రాండ్లు. వెరైటీ రుచులతో దేశీయ భోజనప్రియుల్ని వహ్వా అనిపిస్తున్నాయి. మన దేశంలో ఈ బ్రాండ్లకు అంబాసిడర్గా మారి... ఫ్రాంచైజీ విధానంలో స్టోర్లను ఏర్పాటు చేస్తోంది ‘ఎల్లో టై హాస్పిటాలిటీ’. విదేశీ బ్రాండ్లు, వాటి రుచులు, సంస్థ విస్తరణ ప్రణాళికల గురించి సంస్థ ఫౌండర్ అండ్ సీఈఓ కరన్ టన్నా ‘స్టార్టప్ డైరీ’కి వివరించారు. గుజరాత్లోని సర్దార్ పటేల్ యూనివర్సీటీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేశాక.. జనరల్ మోటార్స్, మెకెన్సీ కంపెనీల్లో పనిచేశా. 2012లో అహ్మదాబాద్ కేంద్రంగా ఆటోమొబైల్ సర్వీస్ అండ్ రిపెయిర్ చెయిన్ ‘కార్ప్లస్’ను ఆరంభించా. కానీ, తల్లిదండ్రులకు రెస్టారెంట్ ఉండటం వల్ల కావొచ్చు... ఆ రంగంలోనే ఏదో సాధించాని అనిపించేది. అహ్మదాబాద్లో పార్సీ రెస్టారెంట్ గుడీస్ను ప్రారంభించా. తర్వాత బేకరీ స్టార్టప్ ఫ్లోర్బాక్స్ను ఓపెన్ చేశా. అక్కడి నుంచి విపుల్ పటేల్కు చెందిన ఫాస్ట్ఫుడ్ చెయిన్ కచ్చీకింగ్ రెస్టారెంట్లో పార్టనర్గా జాయినయ్యా. నేను చేరిన కొత్తలో 18 ఔట్లెట్లుగా ఉన్న కచ్చీకింగ్ను రెండేళ్ల కాలంలో 200 ఔట్లెట్లకు విస్తరించా. అయినా సంతృప్తిగా లేదు. ఎందుకంటే పైన చెప్పిన సంస్థలన్నింట్లోనూ స్వదేశీ రుచులే ఉంటాయి. విదేశీ ఫుడ్ బ్రాండ్స్ రుచులు చూద్దామంటే దేశంలో ఒక్క ఔట్లెట్ కూడా లేదే అనిపించేది. అదే యెల్లో టై హాస్పిటాలిటీకి బీజం వేసింది. ఓ ప్రైవేట్ ఇన్వెస్టర్తో కలసి రూ.16 కోట్లతో ముంబై కేంద్రంగా 2015 డిసెంబర్లో యెల్లో టై హాస్పిటాలిటీని ప్రారంభించా. ఫ్రాంచైజీకి రూ.60–70 లక్షలు.. ఆయా బ్రాండ్ స్టోర్ను ఫ్రాంచైజీ విధానంలో స్థానికంగా ప్రారంభించడమే మా వ్యాపార విధానం. ఒక్కో ఔట్లెట్కు రూ.60–70 లక్షల పెట్టుబడి కావాలి. ఔట్లెట్ ఏర్పాటుకు కనీసం 1,000 చ.అ. స్థలం అవసరం. రూ.3 లక్షల నుంచి రూ.3 కోట్ల వరకు ఫ్రాంచైజీ బ్రాండ్లున్నాయి. తొలి ఏడాది ఫీజుతో పాటు నెలవారీ ఆదాయంలో వాటా ఇవ్వాల్సి ఉంటుంది. అది బ్రాండ్ను బట్టి 6–10 శాతం వరకూ ఉంటుంది. బ్రాండ్ల వారీగా చూస్తే.. బ్రోస్టర్ 6 శాతం, ధడూమ్ 8 శాతం, ట్విస్ట్ ఆఫ్ థడ్కా, బీబీ జాన్ 10 శాతంగా ఉన్నాయి. మార్చితో ముగియనున్న ఆర్ధిక సంవత్సరం నాటికి రూ.9 కోట్ల టర్నోవర్ను చేరుకుంటాం. వాహనాల్లో వంటల సరఫరా..: వంటకాల తయారీ, సరఫరా కోసం చంఢీఘడ్, హైదరాబాద్, ముంబై, రాజ్కోట్, ఢిల్లీలో వెండర్స్ ఉన్నారు. ఇక్కడి నుంచే దేశవ్యాప్తంగా ఉన్న ఔట్లెట్లకు ఫ్రోజెన్ వెహికిల్స్లో వంటకాలను సరఫరా చేస్తాం. ఎందుకంటే ఫుడ్ క్వాలిటీ, రుచిలో తేడాలుండకూడదు. మా సంస్థకు కన్సల్టెంట్గా షెఫ్ హర్పాల్ ఉన్నారు. తనయ్ గోరేగావ్కర్ మెయిన్ షెఫ్గా ఉండగా... 8 మంది ఇతర షెఫ్లున్నారు. ఫ్రాంచైజీ ఔట్లెట్ను ఏర్పాటు చేయడం నుంచి ఇంటీరియర్, బ్రాండ్ గుర్తింపు, మెనూ ఎంపిక, వంటకాల తయారీ, సరఫరా, మార్కెటింగ్ వరకు అన్ని సేవలూ అందిస్తాం. హైదరాబాద్లో బ్రోస్టర్ ఔట్లెట్.. అమెరికాకు చెందిన జెన్యూన్ బ్రోస్టర్ చికెన్ (జీబీసీ), లండన్కు చెందిన వ్రాప్చిక్, దుబాయ్కు చెందిన జస్ట్ ఫలాఫెల్. మన దేశం నుంచి చెఫ్ హర్పాల్ సింగ్కు చెందిన ట్విస్ట్ ఆఫ్ థడ్కా, బీబీ జాన్, మా సొంత బ్రాండ్ ధడూంలున్నాయి. వీటిల్లో ప్రస్తుతం బ్రోస్టర్ ఔట్లెట్ ముంబై, కోల్కతా, రాయ్పూర్, సూరత్, పట్నా, హైదరాబాద్లో, ట్విస్ట్ ఆఫ్ థడ్కా (వెజ్ బ్రాండ్) బెంగళూరు, అమృత్సర్, బీబీ జాన్ జలంధర్లో ఉన్నాయి. ఏప్రిల్లో ధడూం, ఫలాఫెల్ బ్రాండ్లను ముంబైలో, వ్రాప్చిప్ను బెంగళూరులో ప్రారంభించనున్నాం. రూ.30 కోట్ల నిధుల సమీకరణ.. ప్రస్తుతం మాకు విదేశీ బ్రాండ్లు 3, మన దేశం నుంచి 3 బ్రాండ్లతో ఒప్పందాలున్నాయి. ఒక్కో బ్రాండ్తో జీవితకాల ఒప్పందం కోసం రూ.6–8 కోట్లు ఖర్చవుతుంది. వచ్చే నెల మొదటి వారంలోగా రూ.2.72 కోట్లతో అమెరికాకు చెందిన ప్రీమియం క్లబ్ బ్రాండ్తో ఒప్పందం చేసుకోనున్నాం. మొత్తం మీద ఈ ఏడాది ముగింపు నాటికి 10 బ్రాండ్లతో ఒప్పందం చేసుకోవాలనేది లక్ష్యం. అలాగే 2017 ముగింపు నాటికి అన్ని బ్రాండ్లు కలిపి 50కి, మన బ్రాండ్లు కనీసం 5 ఔట్లెట్లు విదేశాల్లో తెరవాలని లక్ష్యించాం. అందుకే తొలిసారిగా నిధుల సమీకరణ చేయాలని నిర్ణయించాం. ఈ ఏడాది ముగింపు నాటికి ఈక్విటీ రూపంలో రూ.30 కోట్ల నిధులను సమీకరిస్తాం. అద్భుతమైన స్టార్టప్ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
భారత్ లో అత్యంత ప్రభావిత బ్రాండ్ గూగుల్
విదేశీ బ్రాండ్లదే హవా.. చిట్టచివరిలో దేశీ బ్రాండ్లు.. న్యూఢిల్లీ: దేశంలో అత్యంత ప్రభావితమైన బ్రాండ్గా గూగుల్ అవతరించింది. టాప్-10 ప్రభావిత బ్రాండ్ల జాబితాలో ఇది అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ ఇప్సో (ఐపీఎస్ఓఎస్) నివేదిక ప్రకా రం.. గూగుల్ తర్వాతి స్థానాల్లో ఫేస్బుక్, జి-మెయిల్, మైక్రోసాఫ్ట్, శాంసంగ్, వాట్స్యాప్లు ఉన్నాయి. ఇవ్వన్నీ కూడా విదేశీ బ్రాండ్లే. అంటే టాప్-6లో ఏ ఒక్క దేశీ బ్రాండ్ కూడా స్థానం పొందలేదు. జాబితాలో స్థానం పొందిన దేశీ బ్రాండ్లలో ఫ్లిప్కార్ట్ టాప్లో ఉంది. ఇది ఏడవ స్థానంలో నిలిచింది. అమెరికాకు చెందిన అమెజాన్ 8వ స్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానాల్లో ఎస్బీఐ (9వ స్థానం), ఎయిర్టెల్ (10వ స్థానం) ఉన్నాయి.