కోళ్లకు ‘యాంటిబయాటిక్స్’ అవాస్తవం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోళ్లకు రోగాలు వచ్చినప్పుడు మినహా సాధారణ పరిస్థితుల్లో యాంటిబయాటిక్స్ వాడడం లేదని పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల సెంటర్ ఫర్ సైన్స్, ఎన్విరాన్మెంట్(సీఎస్ఈ) ఢిల్లీ ప్రాంతంలో చేపట్టిన అధ్యయనంలో కోళ్లలో యాంటిబయాటిక్స్ అవశేషాలు ఉన్నాయని తేలిన సంగతి తెలిసిందే.
అయితే రిపోర్టులో ఉన్న అవశేషాల స్థాయి యూరోపియన్ ప్రమాణాలకు లోబ డే ఉందని తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి.రంజిత్ రెడ్డి వెల్లడించారు. అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ వి.హర్షవర ్ధన్రెడ్డి, జనరల్ సెక్రటరీ జి.రమేష్బాబు, జాయింట్ సెక్రటరీ సి.మధుసూధన్రావు, పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ డి.సుధాకర్, జనరల్ సెక్రటరీ కేఎస్ రెడ్డి, నెక్ హైదరాబాద్ జోన్ వైస్ చైర్మన్ కేవీఎస్ సుబ్బరాజు, వీహెచ్ గ్రూప్ జీఎం ఎస్.బాలసుబ్రమనియన్తో కలిసి బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు.
అక్కడ అప్రాధాన్యం..: లక్షల టన్నుల్లో చికెన్ లెగ్స్ అమెరికా గిడ్డంగుల్లో 5 ఏళ్లపైబడి నిల్వ ఉన్నాయి. వీటిని కిలోకు రూ.24-48లకే వివిధ దేశాలకు అమెరికా ఎగుమతి చేస్తోందని పౌల్ట్రీ ప్రతినిధులు తెలిపారు. భారత్కు చికెన్ లెగ్స్ దిగుమతి నిర్ణయం గనక అమలైతే దేశీయ కోళ్ల పరిశ్రమ కుదేలవడం ఖాయమని అన్నారు. దిగుమతయ్యే చికెన్పై యాంటీ డంపింగ్ డ్యూటీ విధించాలని వారు డిమాండ్ చేశారు. మూడేళ్లుగా గిట్టుబాటు ధర రావడం లేదని పేర్కొన్నారు. ధాన్యం ధరలు పెరగడంతో కిలో కోడికి రూ.10 నష్టపోతున్నామని పేర్కొన్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణానికిగాను ఒక్కో కోడిపైన రూ.6 దాకా పౌల్ట్రీ యజమానులు వడ్డీ చెల్లిస్తున్నారన్నారు.