High growth
-
చేవ కలిగిన చేప!
సాక్షి, అమరావతి: చేపలు సాగు చేసే రైతులకు శుభవార్తే. వ్యాధులు సోకని హై గ్రోత్ చేపలు మార్కెట్లోకి రాబోతున్నాయి. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ (సిఫా) అభివృద్ధి చేసిన ఈ చేప విత్తనాలు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వ్యాధుల నియంత్రణకే ఖర్చెక్కువ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో 5.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతుండగా, దాంట్లో, 2.30 లక్షల ఎకరాల్లో చేపలు (Fishes) సాగవుతున్నాయి. మరోవైపు ఇన్ల్యాండ్ పబ్లిక్ వాటర్ బాడీస్లో కూడా చేపలు సాగవుతుంటాయి. ప్రధానంగా బొచ్చె (కట్ల), రాగండి (రోహు), మోసులు, రూప్ చంద్, ఫంగస్, పండుగప్ప, కొర్రమేను, తలాపియా వంటి వివిధ రకాల చేపలు సాగులో ఉన్నాయి. వీటిలో ప్రధానంగా కట్ల, రోహూ రకాల చేపలే ఎక్కువగా సాగులో ఉన్నాయి. ఏటా 45 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి అవుతుండగా, 70 నుంచి 80 శాతం ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకే ఎగుమతి అవుతుంటాయి.1980వ దశకంలో అభివృద్ధి చేసిన ఈ రకాలు దాదాపు 40 ఏళ్లుగా సాగులో ఉండడం, వీటిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడంతో పాటు ఏటా పెరుగుతున్న వ్యాధులు రైతులకు పెనుసవాల్గా మారాయి. పేను, రెడ్ డిసీజ్, గిల్ ఫ్లూక్స్, ఆర్గులస్ (ఫిష్లైస్) వంటి వివిధ రకాల వ్యాధుల నియంత్రణకు ఏటా లక్షలాది రూపాయలు ఖర్చుచేస్తున్నారు. లీజుతో కలిపి ఎకరాలో చేపలసాగుకు రూ.3 లక్షల వరకు ఖర్చవుతుంటే దాంట్లో రూ.30 వేల నుంచి రూ.40వేల వరకు ఈ వ్యాధుల నియంత్రణకే ఖర్చుచేయాల్సి వస్తుంది. పదేళ్ల కృషి ఫలితం వ్యాధులను సమర్ధవంతంగా ఎదుర్కొనే ప్రత్యామ్నాయ రకాల అభివృద్ధి కోసం దశాబ్ద కాలం పాటు సిఫా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు ఫలించాయి. వ్యాధులు దరిచేరని ఐదో తరానికి చెందిన అమృత బొచ్చె, జయంతి రాగండి రకాలను అభివృద్ధి చేశారు. క్షేత్రస్థాయి పరీక్షల అనంతరం పలుచోట్ల ప్రయోగాత్మకంగా పరీక్షించి విజయవంతం చేశారు. చేపల ఉత్పత్తిలో దేశంలోనే ఆగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఈ చేపల విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సీడ్ పునరుత్పత్తి కోసం బాపట్లకు చెందిన హేచరీతో అవగాహనా ఒప్పందం చేసుకున్నారు. ప్రస్తుతం సాగులో ఉన్న బొచ్చె, రాగండి చేపలు 10–12 నెలలకు కిలో నుంచి కిలోన్నర పెరిగితే, అమృత బొచ్చె, జయంతి రాగండి చేపలు కేవలం 6–8 నెలల కాలంలోనే కిలోకి పైగా ఎదుగుతాయి. అదే ఏడాది పాటు సాగు చేస్తే 2–2.5 కేజీల పెరుగుదలతో 30–40 శాతం హై గ్రోత్ కలిగి ఉంటాయి. సంప్రదాయ చేపలకు ఎక్కువగా సోకే రెడ్ డిసీజ్, పేను వ్యాధులు వీటికి సోకవు. ఈ కారణంగా ఎకరాకు మందులకు ఉపయోగిస్తున్న వ్యయాలు రూ.20వేల నుంచి రూ.30వేల వరకు ఆదా అవుతుంది. పైగా 6–8 నెలల్లోనే పట్టుబడికి రావడంతో సమయం కలిసొస్తుంది. అంటే సగటున రెండేళ్లకు మూడు పంటలు వేయొచ్చు. లేదంటే ఏడాది పాటు పెంచితే, వీటి గ్రోత్ కారణంగా 30–40 శాతం అదనంగా ఆదాయం వస్తుంది. ఇవి చూడడానికి గులాబీ రంగులో ఉంటాయి. పొడవు ఎక్కువగా, వెడల్పు తక్కువగా ఉంటాయి. బాణం ఆకారంలో నోరు కలిగి ఉంటుంది. సాధారణ బొచ్చె, రాగండి చేపల కంటే చాలా పెద్ద సైజులో ఉంటాయి. పాలీకల్చర్కు ఎంతో అనువైనవి.చదవండి: గడ్డి భూముల్లో హాయ్, హాయ్నాణ్యమైన సీడ్ అందించాలి.. నేను మూడు దశాబ్దాలుగా దాదాపు 150 ఎకరాల్లో చేపల సాగులో చేస్తున్నా. ప్రస్తుతం సాగులో ఉన్న కట్ల, రోహూ రకాలు దాదాపు 40 ఏళ్లపాటు సాగులో ఉండడం, పిల్లల ఉత్పత్తిలో ఇన్బ్రీడింగ్ వల్ల వ్యాధి నిరోధకశక్తి తగ్గిపోయింది. ఏటా వీటికి సోకే వ్యాధుల నియంత్రణకు వాడే మందుల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీనితో పెట్టుబడి భారం పెరుగుతోంది. వీటికి ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేసిన అమృత కట్ల, జయంతి రోహూ రకాలను సాధ్యమైనంత త్వరగా అందించగలిగితే చేప రైతులు నిలదొక్కుకోగలుగుతారు. జెనెటికల్లీ ఇంప్రూవ్డ్ బ్రూడర్స్ ద్వారా నాణ్యమైన సీడ్ ఉత్పత్తికి సిఫా తోడ్పాటు అందించాలి. – పి.బోసురాజు, కార్యదర్శి ఏపీ ఫిష్ ఫార్మర్స్ అసోసియేషన్ చేప రైతులకు నిజంగా వరం సిఫా అభివృద్ధి చేసిన అమృత కట్ల, జయంతి రోహు రకాలు చేపల రైతులకు నిజంగా వరం. ఇవి ఐదో తరానికి చెందిన రకాలు. జెనెటికల్లీ ఇంప్రూవ్డ్ రకాలు కావడంతో వ్యాధులు దరిచేరవు. ఆ మేరకు పెట్టుబడి ఆదా అవుతుంది. ఇప్పటికే బాపట్లలోని హేచరీలకు బ్రూడర్లు అందించాం. వచ్చే సీజన్ నుంచి ఈ చేప పిల్లలు పూర్తి స్థాయిలో రైతులకు అందుబాటులోకి వస్తాయి. – డాక్టర్ రమేష్ రాథోడ్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ సిఫా -
ఆడి కార్ల అమ్మకాలు అదుర్స్
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి గడిచిన తొమ్మిది నెలల్లో రికార్డు స్థాయిలో కార్లను విక్రయించింది. వార్షిక ప్రాతిపదికన ఈ జనవరి –సెప్టెంబర్ మధ్య 88% వృద్ధితో మొత్తం 5,530 కార్లను అమ్మినట్లు కంపెనీ ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో 2,947 కార్లను డెలివరీ చేసింది. క్యూ8 ఈ–ట్రాన్, క్యూ8 స్పోర్ట్బ్యాక్ ఈ–ట్రాన్, క్యూ3, క్యూ3 స్పోర్ట్బ్యాక్లతో పాటు ఏ4, ఏ6, క్యూ5 మోడళ్లకు కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభించినట్లు తెలిపింది. ‘‘ఎస్యూవీల విభాగపు అమ్మకాల వృద్ధి 187% నమోదైంది. రానున్న పండుగ సీజన్ కారణంగా నెలకొనే డిమాండ్తో ఈ ఏడాది మొత్తం విక్రయాల వృద్ధిని కొనసాగిస్తాము’’ అని ఆడి ఇండియా అధినేత బల్బీర్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. బలమైన డిమాండ్, లగ్జరీ కార్ల మార్కెట్ విస్తరణతో పాటు మెరుగైన ఆర్థిక స్థితిగతులు కార్ల అమ్మకాల పెరుగుదలకు కారణమయ్యాయని బల్బీర్ సింగ్ వివరించారు. -
‘టీకా’ వేశాం.. ఢోకాలేదు
న్యూఢిల్లీ: కరోనా వైరస్పరమైన సవాళ్లను అధిగమిస్తూ భారత్ అధిక వృద్ధి బాటలో ముందుకు దూసుకెళ్లనుంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఎకానమీగా తన స్థానాన్ని నిలబెట్టుకోనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 9.2%, వచ్చే ఆర్థిక సంవత్సరం 8–8.5% స్థాయిలో వృద్ధి సాధించనుంది. భారీ స్థాయిలో కొనసాగుతు న్న టీకాల ప్రక్రియ, సరఫరా తరఫున సమస్యల పరిష్కారానికి అమలు చేస్తున్న సంస్కరణలు, నిబంధనల సరళీకరణ, భారీ ఎగుమతుల వృద్ధి వంటివి ఇందుకు దోహదపడనున్నాయి. సోమ వారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2021–22 ఆర్థిక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఎకానమీకి తోడ్పాటునిచ్చేందుకు, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆర్థికపరంగా తగినంత వెసులుబాటు ఉందని సర్వే పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నెలకొన్న పరిస్థితులను విశ్లేషిస్తూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో తీసుకోతగిన చర్యలను సూచించే దీన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. మంగళవారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో పెట్టుబడులకు, ఉపాధి కల్పనకు ఊతమిచ్చేలా మంత్రి తగు ప్రతిపాదనలు చేస్తారన్న అంచనాలు నెలకొన్న నేపథ్యంలో సర్వేలోని అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అదుపులోనే ద్రవ్యోల్బణం.. సరఫరా వ్యవస్థను మెరుగ్గా నిర్వహించడంతో పాటు ఇంధనాలపై సుంకాలను తగ్గించడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా ధరలు దాదాపు అదుపులోనే ఉన్నాయని సర్వే పేర్కొంది. వంటనూనెలు, పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకోవాల్సి రావడం వల్ల రేట్లు పెరిగిపోయాయని .. కానీ ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరించి కొంత మేర కట్టడి చేసిందని తెలిపింది. రిస్కులూ ఉన్నాయ్.. ఇంధన ధరలు అధిక స్థాయిల్లో ఉంటున్న నేపథ్యంలో దిగుమతిపరమైన ద్రవ్యోల్బణం కాస్త ఆందోళనకరంగా ఉండవచ్చని ఆర్థిక శాఖ ముఖ్య ఆర్థిక సలహాదారు, ఎకనమిక్ సర్వే ప్రధాన రూపకర్త సంజీవ్ సన్యాల్ పేర్కొన్నారు. భారత్ తన ఇంధన అవసరాల కోసం 85% పైగా దిగుమతులపైనే ఆధారపడాల్సి ఉంటున్న సంగతి తెలిసిందే. ఇంధన ధరలు అధికంగా ఉంటే ద్రవ్యోల్బణ రేటు కూడా భారీగా ఎగుస్తుంది. ‘‘ప్రపంచ ఎకానమీకి ఇది కష్టకాలం. మహమ్మారి కారణంగా తలెత్తిన అనిశ్చితితో ప్రస్తుతం ఏర్పడిన అవాంతరాలే కాకుండా దీర్ఘకాలికంగా కూడా ప్రభావాలు ఉండనున్నాయి. టెక్నాలజీలు, వినియోగదారుల ధోరణులు, సరఫరా వ్యవస్థలు, భౌగోళిక రాజకీయాం శాలు, వాతావరణం మొదలైన వాటన్నింటిలోనూ వేగవంతంగా మార్పులు వచ్చిన కారణంగా కోవిడ్ అనంతర ప్రపంచం గురించి అనిశ్చితి నెలకొంది’’ అని సన్యాల్ తెలిపారు. ముడి చమురు ధరలు బ్యారెల్కు ప్రస్తుతం 90 డాలర్ల స్థాయిలో తిరుగాడుతున్నప్పటికీ.. వచ్చే ఏడాది 70–75 డాలర్ల శ్రేణిలో ఉండొచ్చని సర్వే అంచనా వేసింది. అలాగే వర్షపాతం సాధారణంగానే ఉంటుందని, అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకులు లిక్విడిటీ ఉపసంహరణను ఎకాయెకిన కాకుండా క్రమపద్ధతిలోనే చేయవచ్చని పేర్కొంది. అంతర్జాతీయంగా ఇంకా అనిశ్చితి నెలకొందని, మిగతా దేశాల్లో అధిక వడ్డీ రేట్లు గానీ లభిస్తే భారత్ నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోయే అవకాశాలు ఉన్నాయని పరోక్షంగా పేర్కొంది. సర్వేలో పేర్కొన్న 2022–23 వృద్ధి.. ప్రపంచ బ్యాంకు అంచనాలకు అనుగుణంగా, ఎస్అండ్పీ.. మూడీస్ అంచనాలకన్నా కాస్త అధికంగానే ఉన్నప్పటికీ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) 9% కన్నా తక్కువగానే ఉండటం గమనార్హం. ప్రైవేట్ పెట్టుబడుల జోరు.. ఎకానమీ పునరుజ్జీవానికి దోహదపడే స్థాయిలోనే ఆర్థిక స్థితిగతులు ఉండటంతో వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రైవేట్ పెట్టుబడులు పుంజుకోగలవని సర్వే తెలిపింది. పన్ను వసూళ్లు మెరుగుపడటంతో ప్రభుత్వం తగు స్థాయిలో వ్యయాలు చేసేందుకు వెసులుబాటు లభించగలదని పేర్కొంది. క్రిప్టో కరెన్సీ పట్ల తటస్థ విధానం: సంజీవ్ సన్యాల్ దేశ ఆర్థిక స్థిరత్వంపై క్రిప్టో కరెన్సీల ప్రభావం ఉంటుంది కనుక.. వాటి నియంత్రణ విషయంలో తటస్థ వైఖరిని ప్రభుత్వం తీసుకుంటుందని సంజీవ్ సన్యాల్ అన్నారు. ప్రస్తుతానికి దేశంలో క్రిప్టో కరెన్సీల నిషేధం, అనుమతికి సంబంధించి ఎటువంటి చట్టాలు అమల్లో లేవు. సోమవారం పార్లమెంట్కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన ఆర్థిక సర్వేలోనూ క్రిప్టోల ప్రస్తావన లేకపోవడంపై సన్యాల్ మీడియా సమావేశంలో స్పందించారు. ‘మీకు తెలిసిందే ఈ అంశంపై ప్రభుత్వంలోను, ఆర్థిక శాఖ పరిధిలో, పార్లమెంట్లోనూ చర్చ నడుస్తోంది. ఆర్థిక స్థిరత్వ సమస్యలున్నాయి. మరోవైపు ఆవిష్కరణల కోణంలో చర్చ కూడా నడుస్తోంది. కనుక తటస్థ విధానాన్ని ఈ విషయంలో తీసుకోవడం జరుగుతుంది’ అని సన్యాల్ వివరించారు. సర్వేలో ఇతర హైలైట్స్.. ► ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ కరోనా పూర్వ స్థాయికి పుంజుకున్నాయి. 2022–23లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎకానమీ సర్వసన్నద్ధంగా ఉంది. ► కరోనా సవాళ్లను అధిగమించేందుకు ఇతర దేశాల తరహాలో ముందస్తుగా ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించడం కాకుండా భారత్ .. ఎప్పటికప్పుడు మారే పరిస్థితులకు అనుగుణంగా విధానాలను అమలు చేసింది. డిమాండ్ నిర్వహణ కాకుండా సరఫరా వ్యవస్థపరమైన సంస్కరణలతో మహమ్మారి సృష్టించిన సమస్యలను ఎదుర్కొంది. ► భారీ ఎగుమతుల వృద్ధి, మరింతగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం దగ్గర ఉన్న వెసులుబాటు తదితర అంశాలు వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధికి తోడ్పడనున్నాయి. ► ఆర్థిక వ్యవస్థ మంచి స్థితిలో ఉండటంతో ప్రైవేట్ రంగ పెట్టుబడులు కూడా పుంజుకుని ఎకానమీ పునరుజ్జీవానికి దోహదపడగలవు. ► అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లోటు, రుణ భారాలు భారీగా పెరిగిపోయినప్పటికీ 2021–22లో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపడనుంది. ► విదేశీ మారకం నిల్వలపరంగా ‘బలహీనమైన అయిదు’ దేశాల్లో ఒకటిగా కొనసాగిన భారత్ ప్రస్తుతం అత్యధికంగా ఫారెక్స్ నిల్వలున్న దేశాల్లో నాలుగో స్థానానికి ఎదిగింది. దీంతో విధానపరంగా మరింత మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు వెసులుబాటు లభించనుంది. ► బేస్ ఎఫెక్ట్ కారణంగానే టోకు ధరల ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉంటోంది. ఇది క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ► అంతర్జాతీయంగా కంటైనర్ మార్కెట్లో అవాంతరాలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సముద్ర వాణిజ్యంపై ఈ ప్రభావం కొనసాగనుంది. మహమ్మారి తొలగితే పెట్టుబడులు రయ్: నాగేశ్వరన్ కరోనా మహమ్మారి నియంత్రణలోకి వస్తే సానుకూల పెట్టుబడుల వాతావరణం జోరందుకుని, ఉద్యోగ కల్పనకు దారితీస్తుందని నూతనంగా నియమితులైన కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) ఎ.అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. తక్కువ ఆదాయ వర్గాల వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. దేశంలో ఎక్కువ ఉపాధి కల్పించే నిర్మాణ రంగం ఇప్పటికే పుంజుకోవడం మొదలైనట్టు చెప్పారు. ‘‘ప్రభుత్వం 4 అంచెల విధానం అనుసరిస్తోంది. అనిశ్చిత సమయాల్లో ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా బాధిత వర్గాలకు అండగా నిలవడం. అదే సమయంలో ఆర్థిక స్థిరత్వంపై దృష్టి పెట్టడం. మహమ్మారి కారణంగా నిర్మాణాత్మక, సరఫరా వైపు సంస్కరణల అవకాశాలను విడిచిపెట్టకపోవడం.. ఇలా ఎన్నో చర్యలు తీసుకుంది. సంస్కరణల ప్రక్రియపై ఎంతో శ్రద్ధ, ప్రాధాన్యం చూపిస్తోంది’ అని చెప్పారు. ‘‘ప్రపంచ ఎకానమీకి ఇది కష్టకాలం. పలు దఫాలుగా విజృంభిస్తున్న మహమ్మారి కారణంగా తలెత్తిన అనిశ్చితితో ప్రస్తుతం ఏర్పడిన అవాంతరాలే కాకుండా దీర్ఘకాలికంగా కూడా ప్రభావాలు ఉండనున్నాయి. టెక్నాలజీలు, వినియోగదారుల ధోరణులు, సరఫరా వ్యవస్థలు మొదలైన వాటన్నింటిలోనూ వేగవంతంగా మార్పులు వచ్చిన కారణంగా కోవిడ్ తర్వాత ప్రపంచమంతా అనిశ్చితి నెలకొన్నా భారత్ వీటిని అధిగమిస్తోంది ’’ – ఎకనమిక్ సర్వే ప్రధాన రూపకర్త సంజీవ్ సన్యాల్ ఈసారి 9.2%, వచ్చేసారి 8.5%.. 2021–22 సర్వే అంచనా ► కరోనా కష్టకాలంలోనూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఎకానమీగా భారత్ స్థానాన్ని నిలబెట్టుకోనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 9.2%, వచ్చే ఆర్థిక సంవత్సరం 8–8.5% స్థాయిలో వృద్ధి సాధించనుంది. ► భారీ స్థాయిలో కొనసాగుతున్న టీకాల ప్రక్రియ, సరఫరా తరఫున సమస్యల పరిష్కారానికి అమలు చేస్తున్న సంస్కరణలు, నిబంధనల సరళీకరణ, భారీ ఎగుమతుల వృద్ధి తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. సోమవారం పార్ల మెంటులో ప్రవేశపెట్టిన 2021–22 ఆర్థిక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ► 2025 ఆర్థిక సంవత్సరానికల్లా 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్ ఎదగాలని నిర్దేశించుకున్న క్రమంలో మౌలిక సదుపాయాల కల్పనపై 1.4లక్షల కోట్ల డాలర్లు వెచ్చించాల్సి ఉంటుంది. ► ఎయిరిండియా విక్రయ వ్యవహారం.. డిజిన్వెస్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం నిధులు సమకూర్చుకునేందుకే కాకుండా ప్రైవేటీకరణ ప్రక్రియకు గణనీయంగా ఊతం ఇవ్వగలదు. ► ఈ ఆర్థిక సంవత్సరం వ్యవసాయ రంగం 3.9 శాతం వృద్ధి సాధించే అవకాశం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 3.6 శాతం. ఈ నేపథ్యంలో పంటల్లో వైవిధ్యానికి, వ్యవసాయ అనుబంధ రంగాలకు, నానో యూరియా వంటి ప్రత్యామ్నాయ ఎరువులకు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలి. -
అధిక వృద్ధికి 4 థీమ్లు..
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ రాబోయే రోజుల్లో అధిక వృద్ధి వ్యూహాల్లో భాగంగా ప్రధానంగా నాలుగు అంశాలపై మరింతగా దృష్టి పెట్టనుంది. డిజిటల్, కొత్త ఇంధనాలు, దీటైన సరఫరా వ్యవస్థ, ఆరోగ్యం వీటిలో ఉండనున్నాయి. దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులను ఉద్దేశించి ఇచ్చిన నూతన సంవత్సర సందేశంలో టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఈ విషయాలు వెల్లడించారు. వైరస్ వ్యాప్తికి సంబంధించి కొత్త వేరియంట్లు వచ్చినా ఎదుర్కొనే విధంగా ఇటు సమాజం, అటు వ్యాపారాలు సన్నద్ధమై ఉండాలని ఆయన సూచించారు. గత ఏడాది అనుభవాలను ప్రస్తావిస్తూ.. గ్రూప్ స్వరూపం ప్రస్తుతం మరింత సరళంగా, ఆర్థికంగా పటిష్టంగా మారిందని చంద్రశేఖరన్ చెప్పారు. ‘కొత్త టెక్నాలజీల తోడ్పాటుతో కర్బన ఉద్గారాలను నియంత్రించడంలోనూ, మన కంపెనీలు ప్రయోజనాలు అందిపుచ్చుకోవడంలోనూ చెప్పుకోతగ్గ పురోగతి సాధించగలిగాం. ఎయిరిండియాను దక్కించుకోవడం ఈ ఏడాది అత్యంత కీలకమైన మైలురాయి. ఇది చరిత్రాత్మక సందర్భం‘ అని ఆయన పేర్కొన్నారు. కొత్త థీమ్లకు టాటా గ్రూప్ సంస్థలు ఇప్పటికే అలవాటుపడుతున్నాయని, పటిష్టమైన పనితీరు కనపరుస్తున్నాయని వివరించారు. రాబోయే రోజుల్లో 5జీ మొదలుకుని టాటాన్యూ (డిజిటల్ ప్లాట్ఫాం), టాటా ఎలక్ట్రానిక్స్ వంటి వివిధ విభాగాలు ఈ నాలుగు థీమ్స్తో గణనీయంగా ప్రయోజనం పొందగలవని చంద్రశేఖరన్ చెప్పారు. వైరస్పై ఆధారపడి ఉంటుంది.. 2024 నాటికి 3 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలన్న దేశ లక్ష్యాలను సాధించడంలో టాటా గ్రూప్ తన వంతు పాత్ర పోషించగలదని చంద్రశేఖరన్ వివరించారు. ‘సరళతర .. సుస్థిరమైన విధానాలను పాటిస్తూ, అధునాతన సాంకేతికతను వినియోగిస్తూ మరింత ముందుకు వెళ్లేందుకు కృషి చేయాలి. అలా చేయగలిగితే మన కంపెనీని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలం. అయితే, ఈ ఆకాంక్షలన్నీ కూడా ఒక అంశంపై ఆధారపడి ఉంటాయి. అదేంటంటే కరోనావైరస్తో కలిసి జీవించడాన్ని నేర్చుకోవడం. కొత్తగా మరింత వ్యాప్తి చెందినా, మరిన్ని వేరియంట్లు వచ్చినా ఎదుర్కొనగలిగేందుకు వ్యాపారాలు, సమాజం అలవాటుపడగలగాలి. సర్వసన్నద్ధంగా ఉండగలగాలి. ఒమిక్రాన్ విషయంలో ఇది కనిపిస్తోంది. దేశీయంగా భారీ స్థాయిలో అమలు చేసిన టీకాల పథకం ఒక రక్షణ గోడను నిర్మించింది. ఇప్పటివరకూ వ్యాప్తి తీవ్రత ఒక మోస్తరుగానే ఉన్నట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అలసత్వం మంచిది కాదు‘ అని చంద్రశేఖరన్ చెప్పారు. కోవిడ్–19 కారణంగా కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కష్టకాలంలో వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడటంలో తోడ్పాటునిచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు. -
కంపెనీలు లాభాలు పెంచి చూపిస్తాయ్
- అవినీతి విధానాలకు పాల్పడతాయ్ - ఎర్నస్ట్ అండ్ యంగ్ సర్వే న్యూఢిల్లీ: అధిక వృద్ధిని కనపర్చాల్సిన ఒత్తిడి కారణంగా చాలా మటుకు కంపెనీలు లాభాలు పెంచి చూపడం, అవినీతి విధానాలకు పాల్పడటం వంటివి చేస్తున్నాయని దేశీయంగా అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు భావిస్తున్నారు. అలాగే, వ్యాపారాలకు సంబంధించి లంచాలివ్వడం, అవినీతికి పాల్పడటం మొదలైనవి సర్వసాధారణమని వారు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ అకౌంటెన్సీ సంస్థ ఈవై(ఎర్నస్ట్ అండ్ యంగ్)నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారిలో 80% మంది ఈ విధమైన అభిప్రాయాలు వెల్లడించారు. కంపెనీలు తమ పనితీరును ఉన్నదానికంటే ఎక్కువగా చూపిస్తుంటాయని, ఇందుకోసం అవి ఆర్థిక ఫలితాల్లో అవకతవకలకు పాల్పడుతుంటాయని 40% మంది భావిస్తున్నట్లు ఈవై పేర్కొంది. అనేక సవాళ్లతో కూడిన పరిస్థితుల నడుమ కంపెనీలు నడుస్తున్నాయని, వ్యాపారంలో వృద్ధి కనపర్చేందుకు కొంగొత్త ఆదాయ మార్గాలు అన్వేషించడం కోసం యాజమాన్యంపై తీవ్ర ఒత్తిడి ఉంటోందని వివరించింది. నైతికతపై పెరుగుతున్న అవగాహన .. వ్యాపారాల్లో నైతిక విలువల గురించి అవగాహన పెరుగుతోన్నట్లు సర్వే ద్వారా వెల్లడైందని ఈవై పార్ట్నర్ అర్పిందర్ సింగ్ తెలిపారు. నియంత్రణ సంస్థలు మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటంతో పరిస్థితులు మారుతున్నాయని, ఇది భారతీయ వ్యాపారాలపై సానుకూల ప్రభావం చూపుతోందని ఆయన పేర్కొన్నారు. సర్వే ప్రకారం.. భారత్ ఊహించిన దానికంటే తక్కువ ఆర్థిక వృద్ధి సాధిస్తోందని 67 శాతం మంది భావిస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీలు నైతిక నియమావళికి కట్టుబడి ఉండాలంటే మరింత కసరత్తు చేయాల్సి ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. కొంగొత్త ఆదాయ అవకాశాలను అన్వేషించాలంటూ మేనేజర్లపై తీవ్ర ఒత్తిడి ఉంటోందని 81 శాతం మంది తెలిపారు. అధిక రిస్కులున్న మార్కెట్లలోకి ప్రవేశించాలంటూ ఒత్తిడి పెరుగుతోందని 66 శాతం మంది పేర్కొన్నారు. కంపెనీలు వ్యక్తిగత బహుమతులు, నగదు చెల్లింపులు ఇవ్వడం లేదా వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం సాధారణమేనని 59 శాతం మంది ఉద్యోగులు చెప్పారు. భారత్తో పాటు యూరప్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలోని మొత్తం 38 దేశాల్లో ఈవై ఈ సర్వే నిర్వహించింది. సుమారు 3,800 మంది ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు.