టీఆర్ఎస్ సభ సైడ్లైట్స్
కళాకారులు బతుకమ్మలు, బోనాలు, పోతురాజుల విన్యాసాలు, పీర్ల ఊరేగింపుతో ఆటపాటల మధ్య సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
కేసీఆర్ రాక సందర్భంగా ఆకాశంలో మిరుమిట్లు గొలిపేలా కార్యకర్తలు బాణసంచా పేల్చారు.
అమెరికా, లండన్ టీఆర్ఎస్ శాఖల అధ్యక్షులు తెచ్చిన తెల్ల పావురాలను కేసీఆర్ ఎగరేశారు.
సభకు ముందు లంబాడీ భాషలో పాడిన పాట లకు లంబాడా మహిళలు నృత్యాలు చేశారు.
పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మహబూబ్నగర్ ఎంపీ జితేందర్రెడ్డి కళాకారులతో కలసి ఆడిపాడారు
మహిళలు తెచ్చిన బతుకమ్మలను పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్గౌడ్ నెత్తిన ఎత్తుకొని సభా ప్రాంగణంలో సందడి చేశారు.
‘ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన గానమా..పోరు తెలంగాణమా’ పాటకు హోంమంత్రి నాయిని వేదికపై స్టెప్పులేశారు.
కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డిలు బోనాలు ఎత్తి కళాకారులు, కార్యకర్తలకు ఘన స్వాగతం పలికారు.
కళాకారులు ఎల్లమ్మ, మైసమ్మలను స్తుతిస్తూ పాడిన పాటలకు పలువురు మహిళా కార్యకర్తలు శివసత్తుల్లా పూనకం వచ్చి ఊగారు.
పముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ‘అన్నా మా కేసీఆర్.. మనకోసం వచ్చేనన్నా..’ పాటల సీడీని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఆవిష్కరించారు.
సభకు వచ్చే కార్యకర్తలు అల్వాల్, తార్నాక, చేవెళ్ల మార్గాల్లో చిక్కుకుపోయారని వారిని ట్రాఫిక్ చిక్కుల నుంచి తప్పించి సభా ప్రాంగణానికి చేర్చాలంటూ సభ నిర్వాహకులు వేదికపై నుంచి పలుమార్లు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు, ఎల్ఈడీ లైట్లు, ఫ్లడ్లైట్లు సభా ప్రాంగణాన్ని ధగధగలాడేలా చేశాయి.
జై మిషన్ కాకతీయ సీడీని ఇరిగేషన్ మంత్రి హరీష్రావు వేదికపై నుంచి ఆవిష్కరించారు.