ID copies
-
ఎయిర్పోర్టులో మొబైల్ ఆధార్ ఓకే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ప్రవేశించడానికి ఇకపై మొబైల్ ఆధార్ను చూపిస్తే సరిపోతుందని పౌర విమానయాన భద్రతా సంస్థ తెలిపింది. ఎయిర్పోర్టులో ప్రవేశానికి పాస్పోర్ట్, ఓటర్ కార్డు, ఆధార్ లేదా మొబైల్ ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్లలో ఏదో ఒకటి సమర్పిస్తే చాలంది. పైన పేర్కొన్న వాటితో పాటు ఏదైనా జాతీయ బ్యాంకు జారీచేసిన పాస్ పుస్తకం లేదా పెన్షన్ కార్డు, వైకల్య గుర్తింపు కార్డు, కేంద్ర/రాష్ట ప్రభుత్వాలు ఇచ్చే ఐడీ కార్డులు, ప్రభుత్వ రంగ, స్థానిక, ప్రైవేటు సంస్థలు జారీ చేసే గుర్తింపు కార్డులను స్వీకరిస్తామని తెలిపింది. దివ్యాంగులు వైకల్య ఫొటో గుర్తింపు కార్డును లేదా మెడికల్ సర్టిఫికెట్ను విమానాశ్రయంలోకి వచ్చేముందు సమర్పించాల్సి ఉంటుంది. చివరికి ఇవేవీ లేకున్నా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ గ్రూప్–1 గెజిటెడ్ అధికారి జారీచేసిన గుర్తింపు కార్డును అంగీకరిస్తామని తెలిపింది. -
పెద్ద నోట్ల మార్పిడిపై ఆర్ బీఐ వివరణ
న్యూఢిల్లీ: పాత పెద్ద నోట్లను మార్చుకునేందుకు గుర్తింపు కార్డు నకలు ఇవ్వాల్సిన అవసరం లేదని భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బీఐ) స్పష్టం చేసింది. రూ. 500, రూ. వెయ్యి నోట్లు మార్చుకునేందుకు వెళ్లినవారిని కొన్ని బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఐడీ కార్డు కాపీలు ఇవ్వాలని అడుగుతున్నాయి. దీనిపై ఆర్ బీఐ వివరణయిచ్చింది. నగదు మార్పిడి సమయంలో ధ్రువీకృత ఐడీ కార్డు చూపిస్తే సరిపోతుందని, పోటోకాపీ సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఎస్ బీఐ ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు. నగదు మార్పిడి దరఖాస్తులో పేర్కొన్న నంబర్లు సరైనవా, కాదా అని సరిచూసేందుకు మాత్రమే ఐడీ కార్డు చూపించమంటున్నామని వివరణయిచ్చారు. పోటోకాపీలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే ఎస్ బీఐ సహా చాలా బ్యాంకులు ఐడీ కార్డు జిరాక్సులు అడుగుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒరిజినల్ ఐడీ కార్డులు తెచ్చిన వారిని జిరాక్సులు తేవాలని చెబుతుండడంతో అప్పటివరకు గంటల తరబడి క్యూలో నించున్న ప్రజలకు మరింత సమయం వృధా అవుతోంది. నగదు మార్పిడికి ఒరిజినల్ ఐడీ కార్డు తీసుకెళితే సరిపోతుందని, పోటోకాపీ అవసరం లేదని ఆర్ బీఐ చేసిన ప్రకటనను బ్యాంకులు, పోస్టాఫీసులు పట్టించుకుంటే ప్రజలు కష్టాలు కొంతవరకు తీరతాయి.