indiramma homes scheme
-
ఆ జాబితా పరిగణించం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పేదల ఇళ్లకు సంబంధించిన ఇందిరమ్మ పథకం అమలు విషయంలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మళ్లీ పేచీ నెలకొంది. గ్రామీణ ప్రాంత ఇళ్లకోసం అందిన సుమారు 30 లక్షల దరఖాస్తులపై సర్వే చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. 23 లక్షల దరఖాస్తుదారులను అర్హులుగా గుర్తించి, జాబితా సిద్ధం చేసింది. ఆ దరఖాస్తులను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది.అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేను తాము పరిగణనలోకి తీసుకోబోమని.. తాము రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ఆధారంగా మళ్లీ సర్వే చేసి వివరాలు అందజేయాలని కేంద్రం తేల్చిచెప్పింది. దీనితో కంగుతినడం రాష్ట్ర ప్రభుత్వం వంతు అయింది. అన్ని లక్షల దరఖాస్తులకు సంబంధించి కేంద్ర యాప్తో మళ్లీ సర్వే చేయటం ఇప్పటికిప్పుడు అయ్యే పనికాదు. మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది.కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అందితే.. లబ్ధి దారులకు మొదటి విడత సొమ్ము అందజేసేందుకు సిద్ధమైంది. అలాంటిది కేంద్రం పెట్టిన మెలికతో గందరగోళం మొదలైంది. కేంద్రం నుంచి అందే నిధుల కోసం.. దాదాపు పుష్కర కాలం తర్వాత రాష్ట్రంలో మళ్లీ ఇందిరమ్మ పేరుతో పేదల ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తెలంగాణ పరిధిలో దాదాపు 19 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించారు. ఇప్పుడు వచ్చే నాలుగేళ్లలో దాదాపు 20 లక్షల ఇళ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో వీలైనన్ని నిధులను కేంద్రం నుంచి పొందాలని నిర్ణయించింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద 20 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కోరింది.ఎన్ని ఇళ్లు మంజూరు చేస్తుందనేది కేంద్రం ఇప్పటివరకు స్పష్టం చేయలేదు. పైగా ఒక్క ఇల్లు కూడా అనర్హుల చేతికి అందకూడదని, కేంద్రం ఖరారు చేసిన నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, అనర్హులకు ఇళ్లు మంజూరు చేసినట్టు తేలితే నిధులు ఇవ్వబోమని షరతులు పెట్టింది. దీనికి అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం.. అక్రమాలకు తావు లేకుండా చూడాలని అధికారులను అప్రమత్తం చేసింది. కానీ సర్వే విషయంలోనే ఇప్పుడు చిక్కు వచి్చంది. కేంద్రం రూపొందించిన యాప్తో మళ్లీ సర్వే.. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకోసం ప్రభుత్వానికి దాదాపు 30 లక్షల దరఖాస్తులు అందాయి. కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన పరిశీలనాంశాల ఆధారంగా అధికార యంత్రాంగం ఇటీవలే దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి.. 23 లక్షల మందిని అర్హులుగా గుర్తించింది. ఇందులో 19.50 లక్షల మంది సొంత జాగా ఉన్నవారుకాగా.. మూడున్నర లక్షల మంది సొంత భూమి లేనివారు.రాష్ట్రం తాజాగా ఈ వివరాలను కేంద్రానికి అందజేసి నిధులు మంజూరు చేయాలని కోరింది. అయితే తాము రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ఆధారంగా ఈ సర్వే జరగనందున పరిగణనలోకి తీసుకోబోమని, ఆ మొబైల్ యాప్ ద్వారా మళ్లీ సర్వే చేసి వివరాల జాబితా సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రం ప్రామాణికంగా నిర్ధారించిన అంశాలనే పరిగణనలోకి తీసుకుని సర్వే చేశామని, వివరాల్లో ఎలాంటి తేడా ఉండదని.. దీన్ని గుర్తించి ఆ జాబితాను కేంద్ర ప్రభుత్వ యాప్తో అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.అయినా కేంద్రం ససేమిరా అంటున్నట్టు తెలిసింది. దరఖాస్తుల్లో బ్యాంకు ఖాతా, ద్విచక్ర వాహనాలు, పన్ను చెల్లింపు వంటి వివరాలేవీ లేవని, అవి లేకుండా జాబితా తీసుకోబోమని స్పష్టం చేసినట్టు సమాచారం. ఇవి పెద్దగా తేడా చూపే అంశాలు కాదని, ఇళ్లను మంజూరు చేసేనాటికి ఆ వివరాలను కూడా అప్లోడ్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కోరినట్టు తెలిసింది. కేంద్రం సానుకూలంగా స్పందించి నిధులు ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావంతో ఉన్నా... కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. కేంద్ర నిధులు రాకుంటే పథకం భారమే! పట్టణ ప్రాంత ఇళ్లకు కేంద్రం యూనిట్ కాస్ట్ను రూ.లక్షన్నరగా ఖరారు చేసింది. దీనితో వీలైనన్ని ఎక్కువ ఇళ్లను పట్టణ ప్రాంత ఖాతా కింద పొందాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే దేశవ్యాప్తంగా మంజూరు చేసే పట్టణ ప్రాంత ఇళ్లలో 4 శాతాన్ని తెలంగాణకు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఇది చాలా తక్కువని, సంఖ్య మరింత పెంచాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది.కానీ స్పష్టత రావాల్సి ఉంది. ఇక గ్రామీణ ప్రాంత ఇళ్లకు సంబంధించి యూనిట్ కాస్ట్ రూ.73 వేలుగా ఉంది. ఈ నిధులన్నా పొందుదామంటే కేంద్రం పెట్టిన మెలిక కలవరపెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. కేంద్రం నుంచి సాయం అందని పక్షంలో మొత్తం నిధులను రాష్ట్రమే భరించాల్సి వస్తుంది. అది పెద్ద భారంగా మారుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
తెలంగాణకు కేంద్రం షాక్.. మీరు అడిగినన్ని ఇళ్లు ఇవ్వం
సాక్షి, హైదరాబాద్: పట్టణ ప్రాంతాలను పెంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం భారీగా నిధులు పొందాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నంపై కేంద్రం నీళ్లు జల్లింది. కేంద్రం నుంచి భారీగా ‘పట్టణ ప్రాంత పేదల ఇళ్ల’ నిధులు సాధించి ఇందిరమ్మ పథకం ఖర్చును భారీగా తగ్గించుకోవాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి షాకిచ్చింది. పట్టణప్రాంత ఇళ్ల నిర్మాణం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఐదేళ్లకు రూ.15 వేల కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించగా, కేంద్రం తాజాగా చెప్పిన లెక్క ప్రకారం రూ.6 వేల కోట్లు మాత్రమే దక్కుతాయని తేలింది. దీంతో ఇళ్ల పథకం అమలులో రాష్ట్ర ఖజానాపై భారం పడబోతోంది. అనుకున్నదొకటి, జరిగింది మరొకటి.. పీఎంఏవై కింద దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో కోటి, గ్రామీణ ప్రాంతాల్లో 2 కోట్ల ఇళ్లు నిర్మించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పేదింటి పథకాలకు ఈ మొత్తాన్ని కేటాయిస్తుంది. పీఎంఏవైలో అర్బన్లో యూనిట్ కాస్ట్ రూ.లక్షన్నరగా ఉండగా, రూరల్లో రూ.72 వేలుగా ఉంది. దీంతో ఎక్కువ నిధుల కోసం అర్బన్ యూనిట్లు ఎక్కువగా పొందాలని తెలంగాణ నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రంలో పట్టణ ప్రాంత విస్తీర్ణం, జనాభా ఎక్కువగా ఉందని చూపేందుకు ఇటీవల పట్టణ ప్రాంత అభివృద్ధి సంస్థలను అమాంతం పెంచేసింది. గతంలో 9 పట్టణ ప్రాంత అభివద్ధి సంస్థలు ఉండగా, వాటిని 28కి పెంచింది. ఫలితంగా వేల సంఖ్యలో గ్రామ పంచాయతీలు ‘పట్టణ’ పరిధిలోకి చేరాయి. వీటి ఆధారంగా రాష్ట్రానికి 10 లక్షల అర్బన్ యూనిట్లు కేటాయించాలని, వీటికి రూ.లక్షన్నర చొప్పున రూ.15 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. ఈ నిధులు వస్తే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రంపై భారం తగ్గుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి గరిష్టంగా రూ.5 లక్షలు ఖర్చు చేయాలని నిర్ణయించినందున, ఒక్కో ఇంటికి రూ.లక్షన్నర చొప్పున ఖర్చు తగ్గుతుంది. కానీ, కేంద్రం దేశంలోని మొత్తం పట్టణ జనాభాలో తెలంగాణ వాటా కేవలం 4 శాతమని తేల్చింది. ఈ లెక్కన రాష్ట్రానికి 4 లక్షల యూనిట్లు, రూ.6 వేల కోట్లు రానున్నాయి. ఇదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం అధికంగా ఉంటుంది. కేంద్రం నుంచి నిధులు బాగా తగ్గనుండటంతో, సొంతంగా నిధులు సమీకరించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. దీంతో కేంద్రంపై మళ్లీ ఒత్తిడి పెంచి మనసు మార్చాలని భావిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో.. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 2 కోట్ల ఇళ్లను నిర్మించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకోగా,. తెలంగాణకు సంవత్సరానికి లక్షన్నర వరకు మంజూరయ్యే అవకాశం ఉంది. కానీ, వీటి లెక్కలను మాత్రం కేంద్రం ఇంకా తేల్చలేదు. అర్బన్ యూనిట్లతో పోలిస్తే ఇవి రెట్టింపు సంఖ్యలో మంజూరవుతాయని రాష్ట్రం అంచనా వేస్తోంది. వీటి యూనిట్ కాస్ట్ తక్కువ అయినందున, వాటి వల్ల రాష్ట్ర ఖజానాకు అంతగా ఉపయోగం ఉండదు. చాలా రాష్ట్రాల్లో రూ.2.5 లక్షలే.. చాలా రాష్ట్రాల్లో పేదల ఇళ్ల నిర్మాణ పథకం యూనిట్ కాస్ట్ రూ.రెండున్నర లక్షలుగా ఉంటోంది. పట్టణ ప్రాంతాల్లో అయితే.. కేంద్రం ఒక్కో ఇంటికి రూ.లక్షన్నర ఇస్తుంటే, మిగతా మొత్తాన్ని రాష్ట్రం భరిస్తే సరిపోయేది. కానీ, మన రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ కాస్ట్ను రూ.5 లక్షలుగా ఖరారు చేసింది. పట్టణ ప్రాంత ఇళ్ల యూనిట్ కాస్ట్ను కేంద్రం రూ.2.25 లక్షలకు పెంచుతుందని తొలుత ప్రచారం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన యూనిట్ కాస్ట్లో 45 శాతం కేంద్రమే భరించినట్టవుతుందని భావించింది. కానీ, కేంద్రం ఆ యూనిట్ కాస్ట్ను పెంచకుండా రూ.లక్షన్నరనే కొనసాగించి తొలి షాక్ ఇవ్వగా, ఇప్పుడు యూనిట్ల సంఖ్యను తగ్గించి రెండో షాక్ ఇచి్చంది. కాగా, కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ కేంద్రం వద్ద పలుకుబడి ఉపయోగించి ఈ యూనిట్ల సంఖ్యను పెంచేలా చూడాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. -
‘ఎస్కలేషన్’ పేర నొక్కేశారు!
రాజీవ్ స్వగృహలో భారీ కుంభకోణం ఒకే ఫైలుతో రూ.70 కోట్ల చెల్లింపులు రెండో దఫాలో రూ.150 కోట్లకు ఎసరు కిరణ్కుమార్ రాజీనామాకు ముందు చక్రం తిప్పిన నేత, ఇద్దరు ఉన్నతాధికారులు రాష్ట్రపతిపాలన సమయంలో రెండో ఫైలును పక్కనపెట్టిన గవర్నర్ సంబంధం లేని ఉత్తర్వులను వర్తింపజేసి మరీ స్వాహా తాజాగా దాన్ని గుర్తించిన గృహ నిర్మాణ శాఖ వివరాలు తిరగదోడుతున్న తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కట్టని ఇళ్లకు కూడా బిల్లులు చెల్లించిన వ్యవహారంపై ఒకవైపు సీఐడీ దర్యాప్తు చేస్తున్న తరుణంలో రాజీవ్ స్వగృహ పథకంలో కూడా ఓ భారీ కుంభకోణం వెలుగుచూసింది. సంబంధం లేని ఉత్తర్వులను ఆసరా చేసుకుని ఆగమేఘాల మీద దాన్ని రాజీవ్ స్వగృహకు వర్తింపచేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని స్వాహాచేసిన వ్యవహారమిది. కిరణ్కుమార్రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయడానికి కొన్ని రోజుల ముందు జరిగిన ఈ తతంగాన్ని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తిరగదోడుతోంది. కాంట్రాక్టర్లతో లాలూచీపడ్డ ఉన్నతాధికారులు, నేతలు దగ్గరుండి మరీ కథ నడిపిన ఈ వ్యవహారంలో ఇప్పటికే దాదాపు రూ.70 కోట్ల ప్రజాధనం కాంట్రాక్టర్ల పాలు కాగా, మరో ఫైలును గవర్నర్ నరసింహన్ నిలిపివేయటంతో రూ.150 కోట్ల మేర చెల్లింపులు నిలిచిపోయాయి. ఇప్పుడు ఈ ఫైలు గృహనిర్మాణ శాఖకు చేరటంతో గుట్టురట్టయింది. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం కూపీలాగుతోంది. ఇవీ వివరాలు... నిర్మాణ సామగ్రి ధరలు పెరిగితే కాస్ట్ ఎస్కలేషన్ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. ప్రభుత్వపరంగా జరిగే నిర్మాణాలకు సంబంధించి ఇందుకు అవకాశం కల్పిస్తూ అప్పటి ప్రభుత్వం 2009లో ఉత్తర్వు (నం.35) జారీ చేసింది. సిమెంటు, స్టీలుతోపాటు ఇసుక, ఇటుక, విద్యుత్తు ఉపకరణాలు, ఫ్లోరింగ్ మెటీరియల్, శానిటరీ ఫిట్టింగ్స్, రంగులు, లేబర్ చార్జీలు... ఇలా అన్ని రకాల అంశాలకు మార్కెట్లో మెటీరియల్ ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కాంట్రాక్టర్లకు అదనపు మొత్తం చెల్లిస్తుంది. అప్పట్లో దీన్ని రాజీవ్ స్వగృహకు కూడా వర్తింపచేయాలని కాంట్రాక్టర్లు కోరారు. ప్రభుత్వ నిధులు కాకుండా, ప్రజల నుంచి వసూలు చేసిన మొత్తంతో స్వగృహ పనులు చేస్తున్నందున ఈ ఉత్తర్వుల పరిధిలోకి స్వగృహను చేర్చొద్దంటూ నాటి కార్పొరేషన్ అధికారులు పేర్కొనటంతో ప్రభుత్వం దాన్ని స్వగృహకు వర్తింపచేయలేదు. కానీ కిరణ్కుమార్రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేసే ముందు ఓ ప్రజాప్రతినిధి, ఇద్దరు ఉన్నతాధికారులు ఆగమేఘాల మీద ఆ ఉత్తర్వులను స్వగృహకు వర్తింపజేసేలా చక్రం తిప్పారు. ఈ తతంగంలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయనే తీవ్ర ఆరోపణలున్నాయి. దీన్ని ఆధారం చేసుకుని స్వగృహ ప్రాజెక్టు పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు భారీ మొత్తంలో అదనపు చెల్లింపులు జరిపేందుకు వేగంగా రంగం సిద్ధం చేశారు. విచిత్రమేంటంటే... ఈ నిర్ణయం వెలువడ్డాక జరిగే పనులకే ఉత్తర్వులను వర్తింపజేయాల్సి ఉన్నప్పటికీ, గతంలో జరిగిన పనులకూ దాన్ని అమలు చేశారు. ఒకే ఫైలుతో రూ.70 కోట్లు చెల్లింపు... సరిగ్గా ఇదే తరుణంలో స్వగృహ సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఆ సమయంలో ప్రభుత్వం రూ.105 కోట్లను రుణంగా ఇచ్చింది. దీంతో ఆగిపోయిన నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత రెండోసారి రూ.240 కోట్లను ఇచ్చింది. ఈ రెండో కోటా నిధుల నుంచి రూ.70 కోట్లను జీఓ 35 ప్రకారం కాంట్రాక్టర్లకు అదనంగా చెల్లించేశారు. ఆ తర్వాత అధికారులు రూ.425 కోట్లతో మరో ఫైలును సిద్ధం చేసి అందులో కాంట్రాక్టర్లకు రూ.150 కోట్లను చెల్లించేలా ఏర్పాటు చేశారు. అప్పుడే తెలంగాణ విభజన అంశం తెరపైకి రావటంతో కేంద్రం రాష్ట్రపతిపాలన విధించింది. దీంతో అధికారులు హడావుడిగా ఆ ఫైలును గవర్నర్ నరసింహన్కు పంపి ఆమోదముద్ర వేయించాలనుకున్నారు. కానీ ఆయన దాన్ని పరిశీలించి పెద్దమొత్తానికి సంబంధించిన అంశం కావటంతో... కొత్త ప్రభుత్వం కొలువుదీరాక నిర్ణయం తీసుకుంటుందని చెప్పి తిప్పిపంపారు. దీంతో రూ.150 కోట్ల చెల్లింపు నిలిచిపోయింది. ఇప్పుడు ఆ ఫైలు తెలంగాణ ప్రభుత్వం దృష్టికొచ్చింది. దీంతో కూపీలాగితే ఈ వ్యవహారం వెలుగు చూసింది. తొలుత ప్రభుత్వం రుణంగా ఇచ్చిన రూ.105 కోట్ల నుంచి కూడా కాంట్రాక్టర్లకు ‘ఎస్కలేషన్’పేరుతో ఎంతిచ్చారనే వివరాలను గృహనిర్మాణ శాఖ అధికారులు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు.