International Dance Day
-
International Dance Day ఆదిమ వారసత్వం నృత్యం
వినసొంపైన సంగీతం వినబడితే శరీరం అప్రయత్నంగా లయ బద్ధంగా కదులుతుంది. దానినే ‘నృత్యం’ అంటారు. 1760లో రచయిత, ఆధునిక ఫ్రెంచ్ నృత్య నాటికల సృష్టికర్త అయిన జీన్ జార్జెస్ నోవెర్రీ జన్మదినాన్ని పురస్కరించుకొని యునెస్కో ఏప్రిల్ 29ని ‘అంత ర్జాతీయ నృత్య దినోత్సవం’గా ప్రకటించింది. నృత్య కళారూపాలను నివేదించడానికీ; ప్రపంచీకరణను, రాజకీయ, సాంస్కృతిక, జాతి అడ్డంకులను అధిగమించడానికీ... నృత్య రీతులు గల ప్రజలందరినీ ఒకే చోటికి తేవడానికీ కృషి చేయడం ఈ దినోత్సవ లక్ష్యం. ఇంట ర్నేషనల్ డ్యాన్స్ కమిటీ ప్రవేశపత్రం ఆధారంగా ప్రతీ ఏటా ఒక అద్భుతమైన నృత్య దర్శకుడు లేదా నర్తకుడిని ఎంపిక చేసి ఆ రోజు వారి సందేశాన్ని అందించడానికి ఆహ్వానిస్తారు. ఆదిమ సంస్కృతికి చిహ్నంనృత్యం. అదివాసీలు ప్రకృతిని, సూర్యుని, చంద్రుని దేవుళ్ళుగా భావించేవారు. కొన్ని తెగల వారు ప్రత్యేకించి (గోత్రం పరంగా) కొన్ని జంతువులను మాత్రమే దేవుళ్ళుగా పూజిస్తూ వాటి మాంసాన్ని ముట్టరు. రాతి యుగం నాటి ఫ్రాన్స్, స్పెయిన్, ఇండియా వంటి దేశాలలోని కొండ గుహలలో ఆదిమ మానవుల వేట, నాట్యం, దృశ్యాలు కన్పిస్తున్నాయి. వీటిని బట్టి ఆదిమ కాలం నుండి నాట్యం అనేది ప్రస్తుత మానవునికి వారసత్వంగా లభించిందని చెప్పవచ్చు. నృత్యం లేకుండా ఆదివాసీలలో ఏ సంబురాలూ జరుగవు. మన తెలుగు రాష్ట్రాల్లోని ఆదిమ తెగలలో థింసా, గుస్సాడీ, రేలా, దండారీ, కొమ్ము నృత్యాలు ప్రసిద్ధి. అయితే భరతనాట్యం, కూపూడి, ఒడిస్సీ, మణిపురి, మోహినీ ఆట్టం వంటి భారతీయ శాస్త్రీయ నృత్యాలుగా పిలిచేవాటికే ప్రపంచవ్యాప్తంగా మం గుర్తింపు ఉంది. భారతీయ నాట్య ప్రపంచంలో చిందు బాగోతుల వారు ఆడే ఆట, పులినృత్యం వంటి ఎన్నో జానపద నృత్యాలూ ఉన్నాయి. అయితే అనేక నృత్య రీతులు ఇప్పుడు కనుమరుగవ్వడం విచారకరం. భారతీయసంస్కృతి -సంప్రదాయాలలో భాగమైన నృత్యకళను రక్షించుకోవా లంటే సంబంధిత నృత్య కళాకారులకు ప్రభుత్వం సరైన జీవనభృతి కల్పించాలి.– గుమ్మడి లక్ష్మీనారాయణ, సామాజిక రచయిత (నేడు అంతర్జాతీయ నృత్య దినోత్సవం) -
నాట్యవేదం జీవననాదం
సర్వ శాస్త్ర సంపన్నంసర్వ శిల్ప ప్రవర్తకంనాట్యాఖ్యం పంచమం వేదంసేతిహాసం కరోమ్యహమ్పంచమవేదంగా పరిగణించదగిన సమస్త శిల్ప శాస్త్రేతిహాసాల సమాహారమైన నాట్యశాస్త్రాన్ని భరతముని మనకు అందించాడు. ఆరు లలితకళలలో నాట్యం ఒకటైనా, నాట్యకళకు మిగిలిన కళలు లేకుండా నాట్యం పరిపూర్ణం కాదు. మిగిలిన కళలన్నీ నాట్యానికి హంగులు సమకూర్చేవే! నాట్యం సమాహార కళ. సహస్రాబ్దాల కిందటే నాట్యానికి శాస్త్రబద్ధత ఏర్పడినా, నాట్యం పండిత పామర జనరంజకమైన కళ. ఆబాల గోపాలాన్నీ అలరించే అద్భుతమైన కళ.ఏప్రిల్ 29 అంతర్జాతీయ నాట్య దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.సంగీతం మాదిరిగానే నాట్యం కూడా విశ్వజనీనమైన కళ. వివిధ నాగరికతలలో ఆయా ప్రాంతాలకు తగినట్లుగా రూపుదిద్దుకున్న నాట్యకళ కాలానుగుణంగా అనేక మార్పులకు లోనైంది. నాట్యకళ పుట్టు పూర్వోత్తరాల గురించి ఇదమిత్థంగా చెప్పడం సాధ్యం కాదు గాని, నాట్యం తొలిసారిగా శాస్త్రీయ రూపాన్ని సంతరించుకున్నది మాత్రం మన భారతదేశంలోనే! దాదాపు రెండువేల ఏళ్ల కిందటే భరతముని సంస్కృతంలో ‘నాట్యశాస్త్రం’ రచించాడు. నాట్యకళకు సంబంధించి ప్రపంచంలో ఇదే తొలి శాస్త్రీయ గ్రంథం. రెండువేల ఏళ్ల కిందటే నాట్యం శాస్త్రీయ రూపాన్ని సంతరించుకున్నదంటే, నాట్యం ఉనికి అంతకు చాలా ముందు నుంచే ఉండవచ్చని ఊహించవచ్చు. మన పురాణాలలో నాట్య ప్రస్తావన కనిపిస్తుంది. పరమశివుడిని నాట్యానికి ఆదిదేవుడిగా పరిగణిస్తారు. శివుడిని నటరాజ రూపంలో కూడా ఆరాధిస్తారు. శివతాండవంతో పాటు కాళీయమర్దనం చేసిన తాండవకృష్ణుడి లీలావినోదం మన పురాణాల్లో ఉంది. అజ్ఞాతవాస కాలంలో బృహన్నలగా మారిన అర్జునుడు నాట్యాచార్యుడిగా విరాటరాజు కూతురు ఉత్తరకు నాట్యం నేర్పించిన ఉదంతం మహాభారతంలో ఉంది. మన పురాణాల ప్రకారం స్వర్గలోకంలోని అప్సరసలందరూ నర్తకీమణులే! నాట్యకళ ప్రాచీనతకు మన పురాణేతిహాసాలే సాక్ష్యాలు. కాలగతిలో జరిగిన అనేక పరిణామాలకు భారతదేశంలోని శాస్త్రీయనృత్యం రకరకాలుగా రూపాంతరాలు చెందింది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విలక్షణమైన శాస్త్రీయనృత్యంగా పరిణామం చెందింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ మన దేశంలోని ఎనిమిది రకాల నాట్యశైలులను శాస్త్రీయ నృత్యాలుగా గుర్తించింది. ఈ ఎనిమిది రకాల శాస్త్రీయ నృత్యాలలో అనేక మంది కళాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. ఇప్పటికీ ఎందరో యువతరం కళాకారులు ఈ శాస్త్రీయ నృత్యాలలో జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలు చేస్తూ, నాట్యకళలో భారతదేశ ఖ్యాతిని చాటి చెబుతున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎనిమిది రకాల శాస్త్రీయ నృత్యరీతులు, వాటి కథా కమామిషు తెలుసుకుందాం..భరతనాట్యంభరతముని రచించిన నాట్యశాస్త్రం ఆధారంగా రూపొందించిన ప్రాచీన నాట్యశైలి భరతనాట్యం. ఇది తమిళనాడులో పుట్టింది. కణ్ణగి విషాదగాథపై రచించిన తమిళ పౌరాణిక గ్రంథాలు ‘సిలప్పటిగారం’లోను, ‘మణిమేగలై’లోను భరతనాట్య ప్రస్తావన కనిపిస్తుంది. ఈ గ్రంథం క్రీస్తుశకం రెండోశతాబ్ది నాటిది. ఆ తర్వాతి కాలంలో దక్షిణాదిలో వెలసిన వివిధ దేవాలయాల గోడలు, స్తంభాలపై ఉన్న నాట్యభంగిమలు భరతనాట్య నృత్యభంగిమలకు నిదర్శనంగా నిలుస్తాయి. నటరాజ రూపంలోని శివుడి 108 భంగిమలనే భరతనాట్యంలో ‘కారణ’భంగిమలుగా పరిగణిస్తారు. రాచరికాలు కొనసాగిన కాలంలో వివిధ రాజ్యాలలో భరతనాట్యానికి రాజాదరణ ఉండేది. ఆనాటి కాలంలో దేవాలయ సంప్రదాయాలలో భాగంగా దేవదాసీలు భరతనాట్య పరంపరను కొనసాగించారు. బ్రిటిష్ పరిపాలన మొదలయ్యాక మన దేశంలోని శాస్త్రీయ నృత్యరీతులకు గడ్డుకాలం మొదలైంది. ఒక దశలో బ్రిటిష్ ప్రభుత్వం దేవాలయాల్లో దేవదాసీల నాట్య ప్రదర్శనలను నిషేధించింది. ఆదరణ కరవై, దారుణమైన గడ్డు పరిస్థితులు తలెత్తినా, ఎందరో నాట్య కళాకారులు ఈ పరంపర అంతరించిపోకుండా కాపాడగలిగారు. వారి కృషి ఫలితంగానే, ఈనాడు భారతీయ శాస్త్రీయ నృత్యాలు అంతర్జాతీయ స్థాయిలో వెలుగొందగలుగుతున్నాయి. దేవాలయాల్లో నాట్య ప్రదర్శనల నిషేధం తర్వాత ఇరవయ్యో శతాబ్ది తొలిరోజుల్లోనే నాట్య కళాకారులు రంగస్థల ప్రదర్శనలు ఇవ్వడం మొదలైంది. అప్పట్లో రుక్మిణీదేవి అరండేల్, తంజావూరు బాలసరస్వతి వంటి కళాకారిణులు భరతనాట్యంలో అగ్రగాములుగా రాణించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన శాస్త్రీయ నృత్యరీతులకు పునరుజ్జీవం మొదలైంది. ఆరితేరిన గురువుల ఆధ్వర్యంలో నాట్య శిక్షణ కేంద్రాలు ప్రారంభయ్యాయి. క్రమంగా దేశ విదేశాల్లోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో కూడా భారతీయ శాస్త్రీయ నృత్యానికి చోటు దక్కింది. చైనాకు చెందిన ఝాంగ్ జున్ 1950లలోనే భరతనాట్యాన్ని చైనాకు పరిచయం చేశారు. చైనాలో ఆమె చేసిన ప్రదర్శన అక్కడివారిని అబ్బురపరచింది. యామినీ కృష్ణమూర్తి, మల్లికా సారాభాయ్, పద్మా సుబ్రహ్మణ్యం, అలమేల్ వల్లి వంటి కళాకారులు భరతనాట్యం ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు. నర్తకీమణులైన వైజయంతిమాల, హేమమాలిని వంటి సినీతారల వల్ల భరతనాట్యానికి జనాదరణ మరింతగా పెరిగింది. పలువురు విదేశీ విద్యార్థులు కూడా భరతనాట్యాన్ని శ్రద్ధగా నేర్చుకుంటున్నారు. వారిలో కొందరు ప్రదర్శనల్లోనూ రాణిస్తున్నారు.కూచిపూడిమన తెలుగునేల మీద పుట్టిన శాస్త్రీయ నృత్యరీతి కూచిపూడి. కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామంలో ఈ నృత్యశైలి రూపుదిద్దుకోవడంతో దీనికి ఆ పేరు వచ్చింది. క్రీస్తుశకం పదో శతాబ్ది నాటికే కూచిపూడి నృత్యం ఉన్నట్లు రాగిరేకుల శాసనాల ద్వారా తెలుస్తోంది. ద్వైత సన్యాసి నరహరి తీర్థుల శిష్యులలో ఒకరైన సిద్ధేంద్ర యోగి పదిహేడో శతాబ్దిలో ఆధునిక కూచిపూడి నృత్యశైలికి పూర్తిస్థాయిలో రూపకల్పన చేశారు. వైష్ణవ సంప్రదాయ ప్రభావం వల్ల కూచిపూడి నృత్యంలో కృష్ణుడి లీలావిలాసాలే ప్రధానాంశాలు. కృష్ణలీలల నృత్యాభినయం తంజావూరు ప్రాంతంలో ‘భాగవత మేళా’గా పేరుపొందింది. కూచిపూడి నృత్య కళాకారులు తెలుగునేల మీద భాగవతులుగా, తమిళనాడులో భాగవతార్లుగా పేరుపొందారు. నారాయణ తీర్థులు రచించిన కృష్ణలీలా తరంగిణిని కూచిపూడి భాగవతులు విరివిగా ప్రదర్శించేవారు. అప్పట్లో కళింగరాజ్యం మొదలుకొని తంజావూరు రాజ్యం వరకు వీరికి గొప్ప ఆదరణ ఉండేది. బ్రిటిష్ కాలంలో మిగిలిన నృత్యరీతుల మాదిరిగానే కూచిపూడి కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. అయినా, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, వెంపటి వెంకటనారాయణ శాస్త్రి, వెంపటి చిన వెంకటరామయ్య శాస్త్రి వంటి వారు కూచిపూడి సంప్రదాయం కొడిగట్టిపోకుండా కాపాడారు. స్వాతంత్య్రానంతరం ఇంద్రాణి రహమాన్, యామినీ కృష్ణమూర్తి, శోభా నాయుడు వంటివారు విదేశాల్లో ప్రదర్శనలు చేసి, కూచిపూడి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చారు. వారి ప్రభావంతో పలువురు విదేశీ విద్యార్థులు కూడా కూచిపూడి నృత్యం పట్ల ఆకర్షితులై నేర్చుకోవడం, ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు.ఒడిస్సీఒడిశాలో పుట్టిన శాస్త్రీయ నృత్యశైలి ఒడిస్సీ. కళింగ రాజ్యంలో క్రీస్తుశకం ఆరో శతాబ్ది నుంచి తొమ్మిదో శతాబ్ది మధ్య కాలంలో ఒడిస్సీ నృత్యశైలి ప్రత్యేకమైన శాస్త్రీయ నృత్యంగా రూపుదిద్దుకుంది. ఒడిస్సీ నృత్య ప్రస్తావన ఆనాటి జైన, బౌద్ధ గ్రంథాలలో కూడా కనిపిస్తుంది. పూరీ, కోణార్క తదితర దేవాలయాల రాతి గోడలు, స్తంభాలపై కనిపించే నాట్య భంగిమలు ఒడిస్సీ నృత్యశైలి ప్రాచీనతకు నిదర్శనంగా నిలుస్తాయి. పదిహేడో శతాబ్ది వరకు ఒడిస్సీ నృత్యానికి రాజాదరణ బాగా ఉండేది. పద్నాలుగో శతాబ్దిలో ఖుర్దా రాజు ఒడిస్సీ నృత్యంలో ‘గొటిపువొ’ సంప్రదాయాన్ని బాగా ప్రోత్సహించారు. గురుకులంలో పరంపరాగతంగా నృత్యశిక్షణ పొందే బాలురను ‘గొటిపువొ’ అంటారు. బ్రిటిష్ కాలంలో గడ్డు పరిస్థితులు ఎదురైనా, ఎందరో కవులు, పండితులు, నర్తకులు ఒడిస్సీ నృత్య సంప్రదాయం కనుమరుగు కాకుండా కాపాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ‘కవిచంద్ర’ కాళీచరణ్ పట్నాయక్ వంటి కవి పండితులు, కేలూచరణ్ మహాపాత్రో, పంకజ్చరణ్ దాస్, సంజుక్తా పాణిగ్రాహి, సోనాల్ మాన్సింగ్ తదితరులు ఒడిస్సీ నృత్యానికి పునరుజ్జీవం కల్పించి, అంతర్జాతీయ గుర్తింపు దక్కేందుకు దోహదపడ్డారు. కథాకళికేరళకు చెందిన శాస్త్రీయ నృత్యశైలి కథాకళి. ‘అట్టకథ’ సాహిత్య రూపంలోని నృత్యరూపకాలను కథాకళి కళాకారులు ప్రదర్శిస్తారు. ఇతర శాస్త్రీయ నృత్యరీతులతో పోల్చుకుంటే కథాకళి నర్తకుల వేషధారణ చాలా విభిన్నంగా ఉంటుంది. ‘కుటియాట్టం’, ‘కృష్ణన్ అట్టం’ అనే ప్రాచీన సంస్కృత నాటక ప్రదర్శన ప్రక్రియల నుంచి పదహారో శతాబ్ది నాటికి కథాకళి ప్రత్యేక నృత్యశైలిగా రూపు దిద్దుకుంది. రసాభినయానికి అన్ని శాస్త్రీయ నృత్యరీతుల్లోనూ ప్రాధాన్యం ఉన్నా, ముద్రలు, భంగిమలు వంటి అంశాలకు కూడా సమాన ప్రాధాన్యం ఉంటుంది. కథాకళిలో మాత్రం నవరసాభినయానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. కేరళ ప్రాంతంలోని ట్రావెన్కోర్, పాలక్కాడ్ సంస్థానాలు కథాకళి నృత్యాన్ని బాగా ఆదరించాయి. కథాకళి నృత్యంలో గురుకుల పరంపరలో శిష్యులను తయారు చేసే పద్ధతి పంతొమ్మిదో శతాబ్ది వరకు సాగింది. స్వాతంత్య్రానంతరం కథాకళి కళాకారులు ఒకవైపు సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే, మరోవైపు ఆధునికతను అందిపుచ్చుకుని అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. కాలమండలం గోపి, కోట్టక్కల్ శివరామన్ వంటి కళాకారులు కథాకళి ఖ్యాతిని ఖండాంతరాలకు చాటారు.మణిపురిఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో పుట్టిన శాస్త్రీయ నృత్యశైలి మణిపురి. దీనినే ‘మణిపురి రాసలీల’ అని, ‘జాగోయి రాస్’ అని కూడా అంటారు. మణిపురి నృత్యానికి మూలాలు ప్రాచీన మైతేయి నాగరికతలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. పద్దెనిమిదో శతాబ్దికి చెందిన మైతేయి రాజు చింగ్ థాంగ్ ఖోంబా ప్రస్తుతం ఉన్న మణిపురి నృత్యశైలికి నియమ నిబంధనలను రూపొందించారు. మణిపూర్ రాజ్యాన్ని పరిపాలించిన ఆయన ‘రాజర్షి భాగ్యచంద్ర’గా పేరుపొందారు. మణిపురి నృత్యంలో ఎక్కువగా కృష్ణ లీలలను, భాగవత గాథలను ప్రదర్శిస్తారు. జానపద మూలాల నుంచి రూపొందిన అరుదైన శాస్త్రీయ నృత్యశైలిగా మణిపురి నృత్యానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. బ్రిటిష్ ప్రభుత్వం 1891లో మణిపూర్ రాజ్యాన్ని తన సామ్రాజ్యంలో కలిపేసుకున్నాక మణిపురి నృత్యానికి వైభవం సన్నగిల్లింది. అప్పట్లో ‘విశ్వకవి’ రవీంద్రనాథ్ టాగోర్ మణిపురి నృత్యానికి పునరుజ్జీవం కల్పించేందుకు ఎనలేని కృషి చేశారు. రాజ్కుమార్ సింఘజిత్ సింగ్, దర్శనా ఝావేరీ, కళావతీ దేవి, బింబావతి దేవి, నిర్మలా మెహతా వంటి నర్తకులు మణిపురి నృత్యానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం తీసుకొచ్చారు.సాత్త్రియాఈశాన్య భారతదేశానికి చెందిన మరో శాస్త్రీయ నృత్యశైలి సాత్త్రియా. అసోంలోని సంప్రదాయ ‘అంకియా నాట’ అనే ఏకాంకిల ప్రదర్శనలో భాగంగా ‘భావన’ పేరుతో నృత్యాలను ప్రదర్శించేవారు. ‘అంకియా నాట’ ప్రక్రియను పదిహేనో శతాబ్దికి చెందిన కవి పండితుడు, సంగీతకారుడు, నర్తకుడు అయిన శంకరదేవ్ రూపొందించారు. కాలక్రమేణా ‘సత్త్ర’ అనే వైష్ణవ మఠాలలో ‘అంకియా నాట’ ఏకాంకిలను పూర్తిగాను, ఒక్కోసారి ‘భావన’ నృత్యాన్ని విడిగాను ప్రదర్శించేవారు. కొంతకాలానికి ఈ ప్రక్రియ నుంచి నృత్యం విడివడి ప్రత్యేక శైలిగా రూపొందింది. ‘సత్త్ర’లలో ప్రదర్శించడం వల్ల ఈ నృత్యశైలికి ‘సాత్త్రియా’ అనే పేరు వచ్చింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ 2000 సంవత్సరంలో ‘సాత్త్రియా’ను శాస్త్రీయ నృత్యంగా గుర్తించింది. అప్పటి నుంచి సాత్త్రియా నృత్యానికి ప్రాచుర్యం మొదలైంది. శరోది సైకియా, ఇందిరా బోరా, అనితా శర్మ, అన్వేషా మహంతా తదితరులు సాత్త్రియా నృత్యానికి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు తీసుకొచ్చారు.మోహినీయాట్టంకేరళలో పుట్టిన మరో శాస్త్రీయ నృత్యశైలి మోహినీయాట్టం. క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృతం పంచిపెట్టడానికి శ్రీమహావిష్ణువు దాల్చిన మోహినీ అవతారం నుంచి మోహినీయాట్టం నృత్యానికి ఆ పేరువచ్చింది. కేరళలోనే రూపొందించిన కథాకళి అభినయ ప్రధానమైన నృత్యశైలి అయితే, మోహినీయాట్టం లాస్య ప్రధానమైనది. ఇదివరకు ఎక్కువగా మహిళలే మోహినీయాట్టం నృత్యాన్ని ప్రదర్శించేవారు. ఇటీవలి కాలంలో పురుషులు కూడా దీనిని నేర్చుకుని, ప్రదర్శిస్తున్నారు. వైష్ణవ సంప్రదాయంలోని పురాణగాథలకు సంబంధించిన గీతాలకు అనుగుణంగా ఈ నాట్యాన్ని ప్రదర్శిస్తారు. క్రీస్తుశకం పన్నెండో శతాబ్ది నుంచి పద్దెనిమిదో శతాబ్ది వరకు అనేక పరిణామాలకు లోనై ఈ నృత్యం ప్రత్యేక శైలిగా ఆవిర్భవించింది. పద్దెనిమిదో శతాబ్ది నాటి నృత్యశాస్త్ర గ్రంథం ‘బలరామ భారతం’ ఈ నృత్యాన్ని ‘మోహినీ నటనం’గా అభివర్ణించింది. స్వాతంత్య్రానికి ముందు ట్రావెన్కోర్ సంస్థానాధీశులు కథాకళితో పాటు మోహినీయాట్టం నృత్యాన్ని కూడా సమాదరించారు. స్వాతంత్య్రానంతరం మోహినీయాట్టం అంతర్జాతీయ వేదికలపైకి కూడా చేరుకుంది. సునందా నాయర్, కళామండలం కల్యాణకుట్టి అమ్మ, గోపికా వర్మ, జయప్రభా మేనన్, పల్లవి కృష్ణన్ వంటి నర్తకులు మోహినీయాట్టం నృత్యానికి దేశ దేశాల్లో ప్రాచుర్యం కల్పించారు.ప్రపంచవ్యాప్తంగా ఎన్నో శాస్త్రీయ, జానపద నృత్యరీతులు ఉన్నాయి. కాలానుగుణంగా మరెన్నో అధునాతన నృత్యశైలులు పుట్టుకొస్తున్నాయి. సంగీతంలాగానే నృత్యం కూడా సహజ భావోద్వేగాలతో ముడిపడిన కళ. వయోభేదం లేకుండా పిల్లలు, పెద్దలు ఆస్వాదించే కళ. నాట్యవేదం ఆబాల గోపాలానికీ జీవననాదం.కథక్ఉత్తరాదిలో ప్రజాదరణ పొందిన శాస్త్రీయనృత్య శైలి కథక్. కథక్ సహా వేర్వేరు శాస్త్రీయ నృత్యరీతులన్నిటికీ భరతుడి నాట్యశాస్త్రమే ప్రామాణిక గ్రంథం. ఉత్తరాదిలో భక్తి ఉద్యమం మొదలైన తొలినాళ్లలో– సుమారు క్రీస్తుశకం పద్నాలుగో శతాబ్ది కాలంలో వారణాసిలో కథక్ ప్రత్యేక నృత్యశైలిగా రూపుదిద్దుకుంది. భక్తి ఉద్యమ ప్రభావం కారణంగా కథక్ నృత్యంలో రాధాకృష్ణుల లీలా వినోదాలు, భాగవత గాథలు ప్రధాన ప్రదర్శనాంశాలుగా కనిపిస్తాయి. తొలినాళ్లలో ఆలయాలకు పరిమితమైన కథక్ నృత్యానికి మొఘల్ కాలంలో రాజాదరణ లభించింది. కథక్ నర్తకులకు రాజ దర్బారులో నాట్య ప్రదర్శనలు చేసే అవకాశం లభించింది. భారతీయ సంప్రదాయ పద్ధతికి తోడుగా పర్షియన్ శైలిని కలుపుకొని కథక్ ఒక విలక్షణ శాస్త్రీయ నృత్యశైలిగా రూపుదిద్దుకుంది. బ్రిటిష్ కాలంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నా, స్వాతంత్య్రానంతరం పునరుజ్జీవం పొందింది. బ్రిటిష్ కాలంలో నిరాదరణకు గురైన సంప్రదాయ కళలను ప్రోత్సహించే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం 1956తో ఖైరాగఢ్లో ఇందిరా కళా సంగీత విశ్వ విద్యాలయం ప్రారంభిం చింది. ఇందులో కథక్ నృత్యానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. కథక్ డిగ్రీ కోర్సుకు సిలబస్ను ప్రఖ్యాత నర్తకుడు పురు దధీచ్ రూపొందించారు. స్వాతంత్య్రానంతరం ఎందరో కళాకారులు కథక్ నృత్యానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు. బిర్జూ మహారాజ్, సితారా దేవి, గోపీకృష్ణ వంటి ఎందరో నర్తకుల కృషి ఫలితంగా కథక్ నృత్యం దేశ విదేశాలకు పాకింది. -
అల్లు అర్జున్కు నెట్ఫ్లిక్స్ స్పెషల్ విషెస్.. దేనికంటే ?
కరోనా కల్లోలంతో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో థియేటర్లకు ప్రత్యామ్నాయంగా ఓటీటీ ప్లాట్ఫ్లామ్లు మారిన సంగతి తెలిసిందే. ఈ ఓటీటీ ప్లాట్ఫ్లామ్లలో ప్రత్యేక కాన్సెప్ట్లతో సినిమాలు రూపొందిస్తోంది నెట్ఫ్లిక్స్. సినిమాలతోపాటు విభిన్న జోనర్లో వెబ్ సిరీస్లు తెరకెక్కిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఈ దిగ్గజ సంస్థ స్టైలిష్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు స్పెషల్ శుభాకాంక్షలు తెలిపింది. శుక్రవారం (ఏప్రిల్ 29) ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే అని తెలిసిన విషయమే. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేసింది. అంతేకాకుండా బన్నీతోపాటు మరో ముగ్గురు తారలకు ఈ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పింది. బాలీవుడ్ సీనియర్ బ్యూటీఫుల్ మాధురి దీక్షిత్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, అల్లు అర్జున్, బీటౌన్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్కు స్పెషల్గా విష్ చేసింది నెట్ఫ్లిక్స్. చదవండి: రిలీజైన నెలలోనే అత్యధిక వ్యూస్ సాధించిన ఓటీటీ సిత్రాలు.. ఈ విషెస్తోపాటు ది ఫేమ్ గేమ్, మేర్సల్, అలా వైకుంఠపురములో, లక్ష్య చిత్రాల్లోని వారి డ్యాన్స్ స్టెప్పుల ఫొటోలను షేర్ చేసింది. ఈ పోస్ట్ చేస్తూ 'ప్రతి ఒక్కరీకీ హ్యాపీ ఇంటర్నేషనల్డ్యాన్స్ డే. కానీ ప్రత్యేకంగా వీరికి..' అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ సినిమాలన్ని నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే మాధురి దీక్షిత్, విజయ్, బన్నీ, హృతిక్ రోషన్ డ్యాన్స్లో తమదైన ప్రత్యేకతను చాటిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల నెట్ఫ్లిక్స్ 3 నెలల్లో సుమారు 2 లక్షల సబ్స్క్రైబర్స్ను కోల్పోయింది. చదవండి: అమ్మో జాంబీలు.. నిద్రలోనూ వెంటాడే వెబ్ సిరీస్లు.. Happy International Dance Day to everyone, but especially to them 💃🕺 pic.twitter.com/zOcVDtQNJZ — Netflix India (@NetflixIndia) April 29, 2022 -
International Dance Day: కాలు సిందు తొక్కేలా దుమ్మారం రేగినట్టు..
సినిమా పాటలే కాదు.. ఈమధ్య లోకల్ బీట్స్ కూడా హుషారుగా జనాలతో గంతులేయిస్తున్నాయి. అందుకు సోషల్ మీడియా కారణం అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్.. ఇలా షార్ట్ వీడియో యాప్స్ ద్వారా ఆ బీట్లు దేశం దాటి విదేశాలకు చేరిపోతున్నాయి. ప్రత్యేకించి స్టెప్పులు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇవాళ ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే(ఏప్రిల్ 29). ఈ సందర్భంగా ఈ మధ్యకాలంలో అలా వైరల్ అయిన కొన్ని పాటలపై లుక్కేద్దాం. అరబిక్ కుతు.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన బీస్ట్ చిత్రంలోని సాంగ్. సినిమా రిలీజ్కు ముందే ఈ సాంగ్ యూట్యూబ్ రికార్డులతో పాటు సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అనిరుధ్ కంపోజ్ చేసిన ఈ సాంగ్కు లిరిక్స్ హీరో శివకార్తికేయన్ రాయగా, అనిరుధ్-జోనితా గాంధీ కలిసి పాడారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. జానీ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు మాత్రం ఉర్రుతలూగించాయనే చెప్పాలి. నాటు నాటు దేశంలోని యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి డైరెక్షన్, మల్టీస్టారర్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. వాటిని అందుకుంటూ దాదాపు అన్ని భాషలలో భారీ విజయమే అందుకుంది ఈ చిత్రం. ఇదిలా ఉంటే.. చంద్రబోస్ సాహిత్యం అందించిన నాటు నాటు సాంగ్.. కీరవాణి కంపోజిషన్కి కాల భైరవ, రాహుల్ సిప్లీగంజ్లు గాత్రం అందించారు. ప్రేమ రక్షిత్ కంపోజ్ చేసిన నాటు స్టెప్పులకు తారక్, రామ్ చరణ్ల అడుగులు తోడై.. ఆడియొన్స్తో ఈలలు వేయించాయి. ఇది కూడా చదవండి: ఏళ్లుగా వెంటాడుతున్న సెంటిమెంట్, ఆచార్య బయటపడేనా? శ్రీవల్లి సాంగ్ తగ్గేదే లే అంటూ దేశం మొత్తం పుష్పమేనియాతో ఊగిపోయింది చాలాకాలం. రగ్గుడ్ లుక్లో బన్నీ స్టయిల్, ముఖ్యంగా డైలాగులు పుష్ప కు భారీ విజయాన్ని కట్టబెట్టాయి. ఇంకోవైపు ఈ సినిమాలోని పాటలు కూడా భాషలకతీతంగా ప్రేక్షకుల్ని ఉర్రుతలూగించాయి. జానీ మాస్టర్ కంపోజ్ చేసిన శ్రీవల్లి సాంగ్లో పుష్పరాజ్ వేసిన స్టెప్పులు ఖండాంతరాలు దాటి.. క్రీడాకారులు, ఇతర సెలబ్రిటీలు అనుకరించిన సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అడిపోలి.. మ్యూజికల్ ఆర్టిస్ట్ సిద్ధూ కుమార్ కంపోజ్ చేసి.. డైరెక్ట్ చేసిన మలయాళం సాంగ్ ‘అడిపోలి’. వినీత్ శ్రీనివాసన్, శివాంగి అందించిన గాత్రం.. ట్రెడిషనల్ సెట్స్లో అదిరిపోయే బీట్స్తో కిందటి ఏడాదిలోనే రిలీజ్ అయిన ఈ సాంగ్ బాగా ఫేమ్ అయ్యింది. కచ్చాబాదామ్ .. పచ్చి పల్లీలు అమ్ముకునే పశ్చిమ బెంగాల్ వాసి ‘భూబన్ బద్యాకర్’ కచ్చా బాదామ్ అంటూ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ పాట రీమిక్స్ దెబ్బకు భూబన్ జీవితం మారిపోవడంతో పాటు ఆ పాట ఇవాళ్టికి క్రేజ్ తగ్గట్లేదు.. ఇంకా ట్రెండింగ్లో కొనసాగుతూనే ఉంది. పైగా ఇన్ఫ్లూయెన్సర్ అంజలీ అరోరా హాట్ స్టెప్పులనే ప్రతీ ఒక్కరూ ఫాలో అయిపోతున్నారు. మోడ్రన్ బ్యాలె డ్యాన్స్ సృష్టికర్త జీన్ జార్జెస్ నోవెర్రే జయంతి సందర్భంగా ప్రతీ ఏడాది ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. యూనెస్కో సహకారం, డాన్స్ కమిటీ ఆఫ్ ది ఇంటర్నేషన్ థియేటర్ ఇనిస్టిట్యూట్ ‘ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే’ను ఘనంగా నిర్వహిస్తుంటుంది. నృత్యంలో పాల్గొనడం, నృత్య విద్యను ప్రోత్సహించడం ఈ రోజు లక్ష్యం. నృత్యాన్ని ఒక కళ రూపంగా గుర్తించడంతో పాటు అందులోని వైవిధ్యాన్ని, అందాన్ని మరింత ప్రదర్శించేలా డ్యాన్స్ డేను నిర్వహిస్తుంటారు. చదవండి: కన్నడలో లక్ పరీక్షించుకోనున్న కమెడియన్ -
నిహారిక, యశ్ల డ్యాన్స్ చూశారా?
లాక్డౌన్ కారణంగా షూటింగ్స్ లేకపోవడంతో ఇంటికే పరిమితమయ్యారు నిహారిక కొణిదెల. ఈ మెగా వారసురాలు సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్గా ఉంటూ అభిమానులను ఎప్పటికప్పుడు అలరిస్తూ ఉంటారు. తాజాగా డ్యాన్స్ కొరియోగ్రాఫర్ యశ్తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు నిహారిక. అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా యశ్తో కలిసి కాలు కదిపారు. ‘చెలి’ చిత్రంలోని మనోహర పాటకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మ్యాజిక్తో ఈ వీడియోను రూపొందించారు. రొమాంటిక్గా సాగే ఈ పాటకు నిహారిక, యశ్లు చేసిన డ్యాన్స్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘ముద్దపప్పు ఆవకాయ’ వెబ్సిరీస్తో నటిగా తెరంగేట్రం చేస్తూ కెమెరా ముందుకు తొలిసారి వచ్చారు నిహారిక. అనంతరం అదే ఏడాది ‘ఒక మనసు’ చిత్రంతో హీరోయిన్గా మరో ముందుడుగు వేశారు. ఆ తర్వాత ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ చిత్రాల్లో నటించినప్పటికీ అనుకున్నంత సక్సెస్ అందుకోలేకపోయారు. కాగా గతేడాది విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో అథితి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. రెబల్స్టార్ ప్రభాస్ను నిహారిక పెళ్లి చేసుకోబోతోందనే వార్తలను తాజాగా ఆమె ఖండించిన విషయం తెలిసిందే. చదవండి: రొమాంటిక్ సినిమాల్లో నటిస్తా: నిహారిక అక్కా మీరు నిజంగానే సిగరెట్ తాగారా? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_881252745.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మాధురితో ఏక్.. దో.. తీన్
మనిషిని కడిగేసే శానిటైజర్.. డ్యాన్స్. శుభ్రమైపోతాయి బాడీ అండ్ మైండ్.. డ్యాన్స్ చేసినా.. డ్యాన్స్ చూసినా! ‘తాం.. దిగిదిగి తాం.. దిగిదిగి.. తాం..’ ఇదొకటే కాదు డ్యాన్స్కి తాళం. మనసు ఉద్వేగాన్ని తెరిచే ప్రతిదీ! ‘సాగర సంగమం’లో ఇన్విటేషన్ చూసి కమల్హాసన్ మనసు నాట్యం చేస్తుంది. నేడూ రేపు మనతో డ్యాన్స్ చేయించడానికి అలాంటి ఇన్విటేషన్నే ఇస్తున్నారు మాధురీ దీక్షిత్. నిలువనివ్వనిదేదో డ్యాన్స్లో ఉంది. రక్తప్రసరణలా నృత్యప్రసరణ! మనిషిని నిటారుగా ఉండనివ్వదు. కొద్దిగా వచ్చినవాళ్లను కూడా క్రీస్తుపూర్వపు నృత్య పండితుడు భరతముని ఆవహించి ఆడించేస్తాడేమో! ‘సాగర సంగమం’లో కమల్హాసన్కి భరతనాట్యం వచ్చు. కూచిపూడి వచ్చు. కథాకళి వచ్చు. కథక్ కూడా కొంచెం వచ్చు. కొంచెంతో తృప్తిపడడు. దాహం. నృత్యదాహం. డబ్బులుండవు. గురువుగారికి సేవచేసి రుణం తీర్చుకుంటానని చెప్పి కథక్ క్లాసులకు ఎంట్రీని ఇప్పించుకుంటాడు. ఆ ఆనందంలో డాన్స్ చేస్తుంటాడు. ‘‘సరే పదా’’ అంటాడు శరత్బాబు వచ్చి. ‘నువ్వు వెళ్లు.. ’ అంటాడు.. చేత్తో ‘వెళ్లు’ అని అభినయిస్తూ. ‘‘సరే, అట్టాగే మణిపురి, భోజ్పురి, ఒడిస్సీ, అస్సాం, గుస్సాం, బుస్సాం.. అవి కూడా నేర్చుకో. దాంతోనే జీవితమంతా సరిపోతుంది. తొందరగా ఇంటికొచ్చి ఏడువ్’’ అనేసి తను వెళ్లిపోతాడు శరత్బాబు. డ్యాన్సే జీవితం అనుకున్నప్పుడు జీవితమంతా డాన్స్కే సరిపోవడం అంటూ ఏముంటుంది? అయితే కమల్ని గానీ, మాధురీ దీక్షిత్ని గానీ.. కోర్సు పూర్తయింది కదా.. అని వదిలేసి పోదు డ్యాన్స్. ఆడిస్తుంది. ఓ పెద్ద వేదిక మీద గిర్రున తిరిగి అలసి పడిపోయేంత వరకు. ‘‘అవునూ.. ప్రతి సంవత్సరం ఆలిండియా మ్యూజిక్ ఫెస్టివల్స్, డాన్స్ ఫెస్టివల్ జరుగుతాయంటారు.. అంత గొప్పగా ఉంటాయా?’’.. సాగర సంగమంలోనే.. జయప్రద అడుగుతుంది కమల్ని. ‘మరీ! చాలా విశేషం కదండీ. ఎక్కడెక్కడి నుంచో కళాకారులు, దేశదేశాల రాయబారులు, ప్రత్యేక ఆహ్వానితులు, ఒక్కోసారి ప్రైమ్ మినిస్టర్ కూడానండీ. అంతమంది పెద్దవాళ్ల ఎదుట, తోటి కళాకారుల సమక్షంలో పెర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే జాతకంలో రాసి పెట్టి ఉండాలండీ’ అంటాడు. కనీసం ఆ ఫెస్టివల్స్ని చూసే భాగ్యం కూడా కలిగివుండదు కమల్కి తన లైఫ్లో. ఓసారెప్పుడో గురువుగారి దగ్గర్నుంచి ఒక్క ఇన్విటేషన్ సంపాదిస్తే, సరిగ్గా వెళ్లే టైమ్కి డబ్బుల్లేక ఆగిపోతాడు. జయప్రద అడిగితే అదే చెబుతాడు. ‘‘ఈసారి జరిగే డ్యాన్స్ ఫెస్టివల్కి నా దగ్గర కొన్ని ఇన్విటేషన్లు ఉన్నాయి. వెళతారా?’’ అని అడుగుతుంది జయప్రద. అతడా ఆశ్చర్యంలోంచి తేరుకోకముందే తన హ్యాండ్ బ్యాగులోంచి ఒక ఇన్విటేషన్ తీసి ఇస్తుంది. డాన్స్ చేసినంత పని చేస్తాడు కమల్. ఇన్విటేషన్ తీసుకుని ఒక్కో పేజీ తిప్పుతుంటాడు. లోపల అంతా ప్రపంచ ప్రసిద్ధ నాట్యకోవిదులు. యామినీ కృష్ణమూర్తి! ‘అమ్మోయ్’ అంటాడు. సోనాల్ మాన్సింగ్! ‘ఓహ్’ అంటాడు. జయప్రద కమల్ కళ్లలోకే చూస్తూ ఉంటుంది. గీతానాయర్! ‘ఆహా’ అంటాడు. గోపి కృష్ణ! ‘ఊప్..’ అంటాడు. అని, జయప్రద వైపు చూసి ‘ఈసారి అంతా పెద్దవాళ్లేనండీ’ అంటాడు. ఇంకో పేజీ తిప్పుతాడు. క్లాసికల్ డ్యాన్స్ రిసైటల్ బై.. శ్రీ బాలకృష్ణ అని ఉంటుంది!! ఆ బాలకృష్ణ కమల్హాసనే! జయప్రద వైపు చూస్తాడు. అతడి విస్మయాన్ని, అతడి ఉద్వేగాన్ని, కృతజ్ఞతను మోయలేని అతడి హృదయ భారాన్ని వ్యక్తీకరించే పనిని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా ఇళయరాజాకు అప్పగించారు కె.విశ్వనాథ్. ఆ సీన్లో కమల్లా మనం కూడా గడ్డకట్టుకుని పోతాం. జయప్రద కలవారి అమ్మాయి. ఆమె ప్రయత్నం వల్లనే కమల్కి అంతటి అవకాశం వస్తుంది. ముందే చెప్పదు. సర్ప్రైజ్ చెయ్యాలనుకుంటుంది. ఇన్విటేషన్లో డాన్స్ చేస్తున్న తన ఫొటో, తన పేరు చూస్తుంటాడు కమల్. ‘‘ఈయన కూడా చాలా పెద్ద డాన్సరే’’ అంటుంది జయప్రద ఇన్విటేషన్లో కమల్ని చూపిస్తూ. కమల్ ఏడ్చేస్తాడు. కమల్ కాదు. కమల్లోని డాన్సర్ ఏడ్చేస్తాడు. ఎంత పెద్ద లైఫ్ అచీవ్మెంట్.. కళాకారుడికి. మాధురీ దీక్షిత్ తొమ్మిదేళ్లకే కథక్ డాన్సర్. గురుపూర్ణిమ రోజు తొలి డాన్స్ ప్రదర్శన ఇచ్చింది. ‘దిస్ లిటిల్ గర్ల్ స్టోల్ ద షో’ అని ముంబైలో ఓ పత్రిక రాసింది. ఆ రోజంతా చంద్రమండలం మీదే ఉంది మాధురి. సినిమా స్టార్ కాకపోయుంటే ఆమె డ్యాన్సర్ గానీ, మైక్రోబయాలజిస్ట్ గానీ అయి ఉండేది. సినిమాలొచ్చి క్లాస్లోంచి మధ్యలోనే ఆమెను తీసుకెళ్లిపోయాయి. మైక్రోబయాలజిస్ట్ అయి ఉంటే మాధురి ఇప్పుడు కరోనా వైరస్కు వాక్సిన్ కనిపెట్టే టీమ్లో ఉండేవారేమో! అప్పుడూ ఆమెను డ్యాన్స్ వదలకపోయేది. డ్యాన్స్లో ఉన్న గొప్పతనం అది. వదిలిపెట్టదు. ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే ఈరోజు. లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి.. ఆన్లైన్లో డాన్స్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు మాధురీ.. ఈరోజు, రేపు. తన ఫస్ట్ లవ్ కథక్తో పాటు.. ‘ఏక్ దో తీన్..’ పాటలకూ ఆమె తన వెబ్సైట్లో లైవ్గా డ్యాన్స్ చేయబోతున్నారు. ‘డాన్స్ విత్ మాధురి’ ఆ ఫెస్టివల్ పేరు. కొరియోగ్రాఫర్లు సరోజ్ ఖాన్, ఫరాఖాన్, కథక్ నాట్యాచార్యులు పండిట్ బిర్జూ మహరాజ్ మరికొంతమంది దిగ్గజాలు మాధురితో కలుస్తున్నారు. హిప్హాప్లు, మసాలా భాంగ్రాలూ ఉంటాయి. డ్యాన్స్లో ఏదో ఉంది.. రక్తప్రసరణలా మనిషి లోపల నృత్యప్రసరణ లాంటిది. -
నృత్యమే ‘సత్య’మ్...
నేడు అంతర్జాతీయ నృత్య దినోత్సవం కొత్త సినిమాకు రిలీజ్ కన్నా పెద్ద పండుగ ఉందా? అంటే కాస్తంత సినీ జ్ఞానం ఉన్న ఎవరైనా ఠక్కున చెప్పే సమాధానం ఆడియో రిలీజ్. ఈ వేడుకలను భారీ సభల స్థాయికి తీసుకెళ్లి... అసలు సినిమా కన్నా కొసరుకే పెద్ద సంరంభంగా మార్చేశాయి. దాదాపు ప్రతి ఆడియో విడుదల వేడుకకీ హైదరాబాద్ వేదిక ఎలాగో... 90శాతం ఫంక్షన్లలో కనిపించే ఏకైక నృత్య బృందం సత్యా డ్యాన్స్ ట్రూప్. టెన్త్క్లాస్ పూర్తి చేయడానికి తంటాలు పడ్డ ఓ భీమవరం బుల్లోడు సృష్టించిన ఈ గ్రూప్... సినిమా వేడుకల్లో నృత్యాలు మొదలు టీవీ రియాలిటీ షోస్ దాకా అలుపెరగని జైత్రయాత్ర కొనసాగిస్తోంది. - సాక్షి, లైఫ్స్టైల్ప్రతినిధి ‘మాది భీమవరం గురూగారూ. డ్యాన్స్ పిచ్చికీ.. చదువుకీ లంకె కుదరక టెన్త్తోనే ఆపేశా. ఇంట్లో వాళ్లు చదువుకోమని వినుకొండలోని అక్కయ్య ఇంటికి పంపిస్తే... డ్యాన్స్ పిచ్చితో ముందు విజయవాడ వెళ్లా. ఆ తర్వాత ఈ సిటీకి వచ్చేశా. డ్యాన్సర్గా నా కెరీర్ 1998లో స్టార్ట్ అయింది’ అని చెప్పాడు డ్యాన్స్ మాస్టర్ సత్య అలియాస్ టి.సత్యనారాయణ. ఓ టీమ్ని విజయపథంలో నిలిపిన ఈ సక్సెస్ జర్నీ సత్య మాటల్లోనే... ‘ఫ్రెండ్స్తో కలిసి ఇందిరానగర్లోని ఇరుకు గదిలో ఉండేవాడిని. సీనియర్ కొరియోగ్రాఫర్ ముక్కురాజు మాస్టర్ దగ్గర ప్రాక్టీస్ చేశాను. రాకేష్ మాస్టర్ క్లాసెస్ తీసుకునేవారు. సుచిత్రా మాస్టర్ వంటి వారి గెడైన్స్ మంచి డ్యాన్సర్ని చేసింది. అప్పట్లో ఇక్కడ తమిళ డ్యాన్సర్లదే హవా. దీంతో మాకు ఒక పట్టాన అవకాశాలు రాలేదు. అతి కష్టం మీద డ్యాన్సర్గా కార్డు మాత్రం దొరికింది. స్మాల్ స్టెప్స్ టు బిగ్ ఈవెంట్స్.. అప్పుడంతా మద్రాస్ వాళ్లదే డామినేషన్. తెలుగు డ్యాన్సర్లకు ఖాళీ టైమ్ బాగానే ఉండేది. అలా ఖాళీగా ఉన్న మరికొందరిని కలుపుకుని డ్యాన్స్ ట్రూప్ తయారు చేశా. తక్కువ మొత్తానికి కాలేజీ, స్కూల్స్లో చిన్న చిన్న ఈవెంట్స్ చేసేవాళ్లం. తలా రూ.100, 200 వచ్చినా చాలనుకునేంత పరిస్థితి. సినిమాల సంగతెలా ఉన్నా ఈవెంట్స్కి మంచి ఫ్యూచర్ ఉంటుందని అనిపించింది. వాటి మీదే బాగా కాన్సన్ట్రేట్ చేశా. ఈవెంట్స్ బాగా పెరగడం మొదలుపెట్టాయి. అదే సమయంలో డ్యాన్స్ షోస్కి రిహార్సల్స్గా ఉపకరిస్తుందని శ్రీనగర్ కాలనీలో డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టాను. ఆడియో రిలీజ్లు పెద్ద స్థాయి ఈవెంట్స్గా మారడం అనేది 2007-2008లో మొదలైంది. అప్పటికే ఈ తరహా వేడుకల విషయంలో అనుభవం బాగా ఉండడం ఉపకరించింది. పూర్తి స్థాయి టీమ్తో వెళ్లి ఇచ్చే పెర్ఫార్మెన్స్లు సూపర్హిట్ కావడంతో ఆడియో రిలీజ్ వేడుకల ఛాన్స్లు బాగా వచ్చాయి. ఢీ వంటి టీవీ రియాలిటీ షోస్ కూడా మంచి పేరు తెచ్చాయి. ఢీ డ్యాన్స్ షోలో పార్టిసిపేట్ చేసిన ఏకైక తెలుగు డ్యాన్స్ మాస్టర్ని నేనే. మిగిలిన వాళ్లంతా వందల సినిమాలకు పనిచేసిన సీనియర్లు. నేను భలేదొంగలు సినిమాకి మాత్రమే డ్యాన్స్ మాస్టర్గా చేశాను. 100 సంవత్సరాల సినిమా వేడుకల కోసం చెన్నై వె ళ్లిన ఏకైక తెలుగు డ్యాన్స్ మాస్టర్ నేనే. దాదాపు 50 మంది హీరో, హీరోయిన్స్ నా సారథ్యంలో అక్కడ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన అనుభవం మర్చిపోలేనిది. ఆడియో వేడుక... ఆషామాషీ కాదు... సినిమాలో ఒక సాంగ్కి స్టెప్స్ డిజైన్ చేసి... కొరియోగ్రఫీకి సుమారు వారం రోజులు పడుతుంది. అలాంటిది ఒక్క ఆడియో రిలీజ్కి ఒకటి రెండు రోజులు... కొన్నిసార్లయితే ఒక్క పూట మాత్రమే మాకు టైమ్ దొరుకుతుంది. దీంతో ఒక్కరోజులోనే 6సాంగ్స్ కంపోజ్ చేయాలి. అన్ని పాటలనూ ఒక్క రోజులోనే విని... ప్రత్యక్షంగా ప్రదర్శించేయాలి. పోనీ పాల్గొనేది ఏమైనా చిన్న ప్రోగ్రామా? అంటే కాదు. పెద్ద పెద్ద సినిమా ప్రముఖులు, వేలాదిగా అభిమానులు... హాజరవుతారు. ఆడియోకుతగ్గ డ్యాన్స్లు లేకపోతే రక్తికట్టదు. అది సినిమా క్రేజ్ను దెబ్బతీసే ప్రమాదమూ ఉంది. మొదటి నుంచీ ఈవెంట్స్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం... ఈ ఒత్తిడిని తట్టుకోవడంలో నాకు హెల్ప్ అయింది. అందుకే ఆడియో ఆల్బమ్స్ రిలీజ్లలో దాదాపు 80శాతం నేనే చేశాను. సినిమా కన్నా కూడా లైవ్ పెర్ఫార్మెన్స్లోనే కొరియోగ్రఫీ బాగుంది అనే స్థాయిలో చేయగలిగాం. ఈవెంట్స్ సమయంలోనే దేవిశ్రీప్రసాద్ చూసి...అప్పటిదాకా ఆయన తమిళ డ్యాన్సర్లతో చేసే ఈవెంట్స్, షోస్ అన్నీ మాకు ఇచ్చారు. అమెరికాతో పాటు ఇతర దేశాల్లో ఆయన చేసిన షోస్ నాతోనే. ఇప్పుడు మా టీమ్లో దాదాపు 40 మంది ఉంటారు. వీరిలో అత్యధికులు ఫుల్టైమ్ ఎంప్లాయీస్. గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్కి చేసిన నృత్యానికి బాగా పేరొచ్చింది. ఇటీవల ఉత్తమ విలన్ ఆడియో రిలీజ్ కూడా మంచి పేరు తెచ్చింది. దాదాపు 10 దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చాం. ఒక టీవీ చానెల్ కోసం స్టైల్ అనే రియాలిటీ షోని విభిన్నంగా డిజైన్ చేశా. దాదాపు 60మందితో ఖతార్లో ప్రిలిమినరీస్, దుబాయ్లో ఫైనల్స్ చేశాం. మొత్తం15 మంది సింగర్స్, 20 మంది హీరోయిన్స్ ఇందులో ఉన్నారు. అమీర్పేటలో ప్రారంభించిన డిజోన్ డ్యాన్స్-ఫిట్నెస్ స్టూడియో ద్వారా మరింత మంది డ్యాన్స్ డ్రీమ్స్ నిజం చేయాలని అనుకుంటున్నాను. అంతేకాదు సినిమా ఆర్టిస్ట్ల కోసం ప్రత్యేకంగా రాత్రి 8 గంటల నుంచి క్లాసెస్ తీసుకుంటున్నాను. -
జీవితమే ఒక నృత్యం
నేడు అంతర్జాతీయ నృత్య దినోత్సవం డాన్స్ ఈజ్ ద హిడెన్ లాంగ్వేజ్ ఆఫ్ ది సోల్.. అంటారు. వ్యక్తిత్వ వికాసాన్ని అందించే పాఠాలు కళలే! అందులో నాట్యం వేసే ముద్రా ప్రాధాన్యమైనదే! వినోదమే ప్రధానంగా ఉన్న టీవీలో చాలా రియాలిటీ షోలకు నేటికీ డాన్సే ముఖ్యాంశం అయిందంటే దానికున్న క్రేజ్ ఎలాంటిదో అర్థమవుతోంది. అంతలా డాన్స్కి ప్రాధాన్యం లభించేలా చేసింది యునెస్కో మొదలుపెట్టిన ‘ఇంటర్నేషనల్ డాన్స్ డే’! ఈ సందర్భంగా మన శాస్త్రీయ నృత్యమైన కూచిపూడి గురించి ప్రముఖ కళాకారిణులు అచ్యుతమానస, డాక్టర్ హిమబిందు కనోజ్ల అభిప్రాయాలివి. - సరస్వతి రమ జీవించడం ఎలాగో నేర్పుతుంది: ‘కూచిపూడి మై లైఫ్’ అంటూ కూచిపూడి నృత్యాన్ని అనాథ ఆడపిల్లలకు నేర్పిస్తూ తద్వారా వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్న కూచిపూడి, భరతనాట్యం, కథక్, మోహినీ ఆట్టం కళాకారిణి అచ్యుత మానస. నాట్యం ఓ కళే కాదు, విజ్ఞానాన్ని అందించే గురువు కూడా అంటారు ఆమె. ‘‘మదర్స్ డే, ఫాదర్స్ డేలాగా డాన్స్కి ఓ డే ఉండడం నిజంగా సంతోషమే. అయితే నేనీ డేస్కి వ్యతిరేకం. నా దృష్టిలో ప్రతిరోజు మాతృదినోత్సవమే.. పితృదినోత్సవమే. డాన్స్కి సంబంధించైతే లైఫ్ ఇట్సెల్ఫ్ ఈజ్ డాన్స్. ప్రతిరోజూ నవరసాలను అనుభవిస్తుంటాం. శాస్త్రీయ నృత్యం జీవించడం నేర్పిస్తుంది. ఆత్మసంతృప్తి కలిగిస్తుంది. మన శాస్త్రీయ నృత్యాల్లో వినోదం, విద్య రెండూ ఉన్నాయి. కానీ చాలామంది కేవలం వినోదాన్నే ఆస్వాదిస్తూ అది పంచే విజ్ఞానాన్ని గమనించక నిర్లక్ష్యం చేస్తున్నారు. మన దేశం కళలకు కాణాచి. కానీ అంతటి ప్రాధాన్యం అందట్లేదు. మానసిక వికాసాన్నిచ్చే ఇలాంటి కళలను పాఠ్యాంశాల్లో భాగంగా ప్రతి ఒక్కళ్లకి నేర్పిస్తే ఈరోజు మనం ఎదుర్కొంటున్న ఎన్నో అసాంఘిక శక్తులు మటుమాయమవుతాయి. ఆ దిశగా ఆర్ట్స్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది’’ అంటారు మానస. పిల్లల వ్యక్తిత్వం వికసిస్తుంది: డాక్టర్ హిమబిందు కనోజ్ కూచిపూడిలో డాక్టరేట్ చేసిన కళాకారిణి. హైదరాబాద్లోని చందానగర్లో ‘మువ్వ నృత్యరాగ నిగమం’ను నిర్వహిస్తున్న గురువు. ‘‘నాట్యం అంటే దైవారాధన. పెద్దల పట్ల గౌరవం, ప్రకృతి పట్ల గౌరవం, ఆరాధన, మొత్తంగా విశ్వాన్నే ప్రేమించే తత్వాన్ని నేర్పిస్తుంది. మనలో కోపాన్ని, అహాన్ని తగ్గిస్తుంది. సహనాన్ని పెంచుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుతుంది. కళారూపంగా భావించి దీన్ని నేర్చుకుంటే ఓటమిని అధిగమించడమెలాగో తెలుపుతుంది. ఇవే కాదు, జీవితానికి అవసరమైన క్రమశిక్షణనూ నేర్పిస్తుంది. అందుకే నాట్యానికి వయసు అంతరం లేదు. వర్గ భేదాల్లేవ్. ఆసక్తి ఉన్న ఎవరైనా నేర్చుకోవచ్చు. మా ఇన్స్టిట్యూట్లో పిల్లలు, పెద్దలు, (తల్లీ బిడ్డల కాంబినేషనూ ఉంది) గృహిణులు, వర్కింగ్ ఉమన్ అందరూ నేర్చుకుంటున్నారు. వర్కింగ్ ఉమన్, గృహిణులు అయితే నాట్య సాధనను మంచి స్ట్రెస్ రిలీజ్గా భావిస్తున్నారు. పాఠ్యపుస్తకాలు, టీవీ తప్ప వేరే ప్రపంచమే లేకుండా పోయిన నేటి పిల్లల్లోనైతే ఈ డాన్స్ ద్వారా మార్పు తెప్పిస్తున్నాం. దీనివల్ల మన కళలు, సంస్కృతి ఏంటో తెలుసుకోగలుగుతున్నారు వాళ్లు. ఒకరితో ఒకరు కలిసిపోవడం, ఒకరికోసం ఒకరు సర్దుకుపోవడం. ఒకరు గెలిచినప్పుడు అభినందించడం, గెలిచిన వాళ్లు మిగిలినవాళ్లను ఎంకరేజ్ చేయడం వంటివీ అలవడతాయి. వీటిని పెంపొందిం చేందుకు ప్రతి ఆరునెలలకోసారి మేం పిల్లలతో డాన్స్ ప్రోగ్రామ్స్ని నిర్వహిస్తుంటాం. ఇందులో అతిథులను ఆహ్వానించడం దగ్గర్నుంచి యాంకరింగ్ చేయడం వరకు అన్నీ పిల్లలే చూసుకుంటారు. దీనివల్ల ఎవరిలో ఏ టాలెంట్ ఉందో గుర్తించుకోగలుగుతారు. ఆరోగ్యకరమైన పోటీని అలవర్చుకుంటారు. అన్నిటికీ మించి సృజన బయటకు వస్తుంది. ఏ అడ్డంకినైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని సంపాదించుకుంటారు’’ అని చెప్తారు డాక్టర్ హిమబిందు! డాన్స్ ఈజ్ డివైన్ అన్నది అందుకేనేమో! నాట్యంతో సేవచేసిన, చేస్తున్న నాట్యకళామహానుభావులు అందరికీ కళాభివందనాలు!