ఎంపీ గారూ.. అభివృద్ధి అంటే తెలుసా..?
ఎమ్మెల్యే జీవన్రెడ్డి
జగిత్యాల అర్బన్ : అభివృద్ధి అంటే ఏమిటో ముందుగా తెలుసుకుని, ఆ తర్వాత ఏ విషయమైనా మాట్లాడాలని జగిత్యాల ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఎంపీ కవితను ఉద్దేశించి అన్నారు. మంగళవారం ఆయన పట్టణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏడాదిలోనే రూ.470 కోట్ల వెచ్చించి ఎంతో అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకోవడం కాదన్నారు. అభివృద్ధిలో రెండు రకాలు ఉంటాయని అన్నారు. కేవలం ఆసరా, జీవనభృతి, ఇతరత్ర సంక్షేమ ఫలాలను సైతం అభివృద్ధే అనుకుంటే పొరపాటన్నారు.
ఈ ఏడాదిలో జగిత్యాల నియోజకవర్గంలో ఎలాంటి పనులు చేపట్టారో, అవి ప్రజల దరికి ఏమేరకు చేరయో వివరిస్తే.. అదే అభివృద్ధి అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో విడాకులు పొందిన మహిళలు, జోగినులకు పింఛన్లు మంజూరు చేశామని, ఇప్పుడు వాటిని తొలగించడం ఏమిటన్నారు. బీడీకార్మికులందరికీ జీవనభృతి అందించాలని సూచించారు. బోర్నపల్లి వంతెనకు జీవన్రెడ్డి విజ్ఞప్తి మేరకే రూ.70 కోట్లు మంజూరు చేశానని కేసీఆర్ సాక్షాత్తు అసెంబ్లీతోపాటు వివిధ సమావేశాల్లో ప్రస్తావించారనే విషయూన్ని గుర్తించాలని సూచించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆహ్వానిస్తే మంత్రివర్గంలో చేరతాననడం సంతోషకరమని, కానీ ముందుగా జగిత్యాల బైపాస్రోడ్డు రైల్వేస్టేషన్ సమీపంలోని బారికేడ్లు తొలగించేలా కృషి చేయాలన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జగిత్యాలకు అగ్రికల్చర్ కళాశాల, జేఎన్టీయూ కళాశాల, మంత్రిగా శాతావాహన యూనివర్సిటీ, కోరుట్లలో వెటర్నరీ కళాశాల కోసం కృషి చేశానని జీవన్రెడ్డి తెలిపారు.
ఎంపీ కనీసం చెరుకు రైతుల బకాయిలు చెల్లించలేదన్నారు. కవితకు మంత్రి పదవీ కోసం కేంద్రంలో ప్రాణహిత- చేవెల్ల ప్రాజెక్ట్ను సీఎం ఫణంగాపెట్టారని ఆరోపించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, ఎంపీపీ గర్వందుల మానస, నాయకులు బండ శంకర్, దామోదర్రావు, గాజుల రాజేందర్, ముకేశ్కన్నా తదితరులు పాల్గొన్నారు.