kartosat 2D
-
ఇస్రోకు ‘వంద’నం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రక విజయం నమోదైంది. ఇస్రో తన వందో ఉపగ్రహంతో పాటు మరో 30 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి విజయవంతంగా పంపింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట వేదికగా 28 గంటల కౌంట్డౌన్ తర్వాత శుక్రవారం ఈ ప్రయోగం జరిగింది. నాలుగు ప్రయోగ దశల్లో మండిన పీఎస్ఎల్వీ సీ–40 వాహకనౌక కార్టోశాట్–2 సిరీస్లోని మూడో ఉపగ్రహంతో పాటు 30 మైక్రో, నానో ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యల్లోకి చేర్చింది. దీంతో అంతరిక్ష రంగంలో, వాణిజ్య ఉపగ్రహాల ప్రయోగాల్లో ఇస్రో తన సమర్ధతను మరోసారి చాటుకున్నట్లయింది. పీఎస్ఎల్వీ రాకెట్తో చేపట్టిన ప్రయోగాల్లో అత్యంత సుదీర్ఘ కాలం కొనసాగిన ప్రయోగం ఇదే. ప్రయోగం విజయవంతమైనందుకు రాష్ట్రపతి కోవింద్ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. మైలురాయిగా 100వ ఉపగ్రహం... నాలుగు నెలల క్రితం నావిగేషన్ ఉపగ్రహం ఐఆర్ఎన్ఎస్ఎస్–1హెచ్ ప్రయోగ సందర్భంగా ఎదురైన వైఫల్యాన్ని పక్కనపెట్టి ఇస్రో తాజా విజయాన్ని అందుకుంది. ఈసారి అంతరిక్షంలోకి పంపిన ఉపగ్రహాల్లో దేశీయంగా రూపొందించిన వందో ఉపగ్రహం ఉండటం ఒక మైలురాయిగా నిలిచిపోయింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 9.28 గంటలకు పీఎస్ఎల్వీ సీ–40 31 ఉపగ్రహాలతో నింగికెగిసింది. 17 నిమిషాల్లోనే కార్టోశాట్ ఉపగ్రహాన్ని 505 కి.మీ ఎత్తులోని సూర్యానువర్తిత ధృవకక్ష్యలో చేర్చింది. తర్వాత ఏడు నిమిషాల వ్యవధిలో భారత్కు చెందిన ఒక నానో ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన 28 పేలోడ్లను ఒకదాని తర్వాత మరోదాన్ని కక్ష్యల్లో విడిచిపెట్టింది. మిగిలిన ఏకైక(వందో ఉపగ్రహం) ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చడానికి కొంత సమయం పట్టింది. ఇందుకోసం ప్రయోగం ప్రారంభమైన సుమారు 105 నిమిషాల తరువాత రాకెట్ నాలుగో దహన దశను రెండుసార్లు పునఃప్రారంభించారు. చివరి దశను పూర్తిచేయడానికి సుమారు 2 గంటల 21 నిమిషాలు పట్టింది. అత్యంత ఎక్కువ సమయం తీసుకున్న పీఎస్ఎల్వీ మిషన్ ఇదే. ఇస్రో చైర్మన్గా చివరి ప్రయోగాన్ని విజయవంతంగా ముగించిన కిరణ్ కుమార్ సహచరులతో కలసి సంతోషం పంచుకున్నారు. కార్టోశాట్–2 వెంట ప్రయాణించిన ఉపగ్రహాల్లో కెనడా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, కొరియా, యూకే, అమెరికాలకు చెందిన మూడు మైక్రో, 25 నానో ఉపగ్రహాలున్నాయి. కొత్త ఏడాది కానుక ఇదే: ఇస్రో చైర్మన్ ప్రయోగం పూర్తయిన తరువాత ఇస్రో చైర్మన్ కిరణ్ మీడియాతో మాట్లాడుతూ...ఇస్రో కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించిందని అన్నారు. కార్టోశాట్ ఉపగ్రహాన్ని దేశానికి కానుకగా ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. తాము ప్రయోగించిన 100 ఉపగ్రహాల్లో విద్యార్థులు తయారుచేసిన వాటన్నింటికీ చోటిచ్చామని తెలిపారు. చంద్రుడిపై అధ్యయనం కోసం చేపట్టబోయే రెండో ప్రయోగం చంద్రయాన్–2 మిషన్కు ఏర్పాట్లు సజావుగానే జరుగుతున్నాయని వెల్లడించారు. ఫ్లైట్ మోడల్స్ను వివిధ దశల్లో పరీక్షిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది నుంచి నెలకో ప్రయోగం చొప్పున జరిపేందుకు సన్నద్ధమవుతున్నామని వెల్లడించారు. తాజా ప్రయోగానికి ఎంత వ్యయమైందని ఓ విలేకరి అడగ్గా... ఖర్చు కన్నా మన రాకెట్ల సాయంతో వాణిజ్యపరంగా ఉపగ్రహాలను పంపించేందుకు ఎన్ని దేశాలు ముందుకొస్తున్నాయన్నదే ముఖ్యమని చెప్పారు. జీఎస్ఎల్వీ ఎంకే2, ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఐ ప్రయోగాలు త్వరలో జరుగుతాయని తెలిపారు. బంగారు భవితకు సూచిక: మోదీ ఇస్రో వందో ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం సంస్థ విజయాలు, అంతరిక్ష రంగంలో దేశ బంగారు భవిష్యత్కు సూచిక అని ప్రధాని మోదీ అభివర్ణించారు. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలుపుతూ...తాజా విజయంతో ప్రజలు, రైతులు, మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఇస్రో కృషిని అభినందించిన కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: పీఎస్ఎల్వీ–సీ 40 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అభినందించారు. మన శాస్త్రవేత్తల కృషి మరవలేనిదని, ఇది మన దేశానికి గర్వకారణమని ఆయన కొనియాడారు. ఇస్రోకు జగన్ శుభాకాంక్షలు... సాక్షి, హైదరాబాద్: ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలను అభినందించారు. ఇస్రో భవిష్యత్లో మరిన్ని అద్భుత ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. -
నింగిలోకి దూసుకెళ్లిన సీ-37
-
నేడే ఇస్రో అద్వితీయ ప్రయోగం
-
ఒక రాకెట్.. 104 ఉపగ్రహాలు!
► నేడే ఇస్రో అద్వితీయ ప్రయోగం ► ఉదయం 9.28కి నింగిలోకి దూసుకెళ్లనున్న పీఎస్ఎల్వీ సీ 37 రాకెట్ ► రికార్డు స్థాయిలో ఒకే ప్రయోగంలో కక్ష్యలోకి 104 ఉపగ్రహాలు ► కార్టోశాట్ 2డీ సహా మూడు స్వదేశీ శాటిలైట్లు అంతరిక్ష ప్రయోగాల్లో అప్రతిహతంగా దూసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో మైలురాయికి చేరువైంది. ప్రపంచస్థాయి ప్రయోగాలకు వేదికైన షార్ నుంచి, గెలుపు గుర్రం పీఎస్ఎల్వీ సీ 37 రాకెట్ ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. రికార్డు స్థాయిలో ఒకే ప్రయోగం ద్వారా 104 ఉపగ్రహాలను గ‘ఘన’ ప్రయాణానికి సిద్ధం చేసింది. బుధవారం ఉదయం 9.28 గంటలను ఇందుకు ముహూర్తంగా నిర్ణయించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే అత్యధిక సంఖ్యలో ఉపగ్రహాలను నింగికి పంపిన దేశంగా భారత్ చరిత్ర సృష్టిస్తుంది. ఇస్రో ఘన చరిత మరోసారి ప్రపంచానికి తేటతెల్లమవుతుంది. ఆల్ ది బెస్ట్ ఇస్రో టీమ్..! ఆల్ ది బెస్ట్ ఇండియా..!! శ్రీహరికోట (సూళ్లూరుపేట): రికార్డు స్థాయిలో ఒకే రాకెట్తో 104 ఉపగ్రహాలను నింగికి మోసుకెళ్లే అద్వితీయ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి బుధవారం ఉదయం 9.28 గంటలకు పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందుకు సంబంధించిన కౌంట్డౌన్ ను మంగళవారం ఉదయం 5.28 గంటలకు ప్రారంభించారు. దాదాపు 28 గంటల కౌంట్డౌన్ నంతరం పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ప్రయోగం నాలుగు దశల్లో, 28.42 నిమిషాల్లో పూర్తయ్యేలా ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. ఇది పీఎస్ఎల్వీకి 39వ ప్రయోగం. ఈ ప్రయోగం ద్వారా మూడు స్వదేశీ, 101 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. 714 కిలోల బరువైన కార్టోశాట్ 2డీ, ఇస్రో నానో శాటిలైట్స్ అయిన ఐఎన్ ఎస్–1ఏ, ఐఎన్ ఎస్–1బీలు స్వదేశీ ఉపగ్రహాలు. విదేశీ ఉపగ్రహాల్లో 96 అమెరికాకు చెందినవి కాగా, ఇజ్రాయెల్, కజకిస్తాన్ , నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యూఏఈ దేశాలకు చెందిన ఒక్కో ఉపగ్రహం కూడా ఈ ప్రయోగంలో పాలుపంచుకుంటున్నాయి. కార్టొశాట్ 2డీ ఉపగ్రహం రిమోట్ సెన్సింగ్ సేవలను ఐదేళ్ల పాటు అందిస్తుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే ఒకే రాకెట్తో 104 ఉపగ్రహాలను పంపిన తొలిదేశంగా భారత్ చరిత్ర సృష్టిస్తుంది. గతంలో రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ ఒకే రాకెట్తో 37 ఉపగ్రహాలను విజయవంతంగా పంపించింది. జూన్ 2015లో ఇస్రో సైతం ఒకే ప్రయోగంలో 23 శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. మంగళవారం ఉదయం కౌంట్డౌన్ ప్రారంభమైన వెంటనే రాకెట్కు నాలుగో దశలో అవసరమైన 2.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ దశలో మోనో మిథైల్ హైడ్రోజన్ (ఎంఎంహెచ్), మిక్స్డ్ ఆక్సిడైజడ్ ఆఫ్ నైట్రోజన్ (ఎంఓఎన్ –3) ఇంధనాన్ని నింపారు. అనంతరం నాలుగో దశకు అన్ని పరీక్షలు చేసి బాగుంది అని నిర్ధారించుకున్నాక సోమవారం రాత్రి రెండోదశలో అవసరమైన 42 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టారు. అనంతరం ఇంధనం నింపే ప్రక్రియను పూర్తి చేసి రాకెట్కు అవసరమైన హీలియం, నైట్రోజన్ గ్యాస్ ఫిల్లింగ్.. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను అప్రమత్తం చేసి ప్రయోగానికి సిద్ధమవుతారు. కాగా, మంగళవారం సాయంత్రం ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్కుమార్ షార్ చేరుకుని కౌంట్డౌన్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం రాకెట్కు తుదివిడత తనిఖీలు నిర్వహించారు. ఆ తరువాత సహచర సైంటిస్టులతో సమీక్ష నిర్వహించారు. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమవ్వాలని దేశవ్యాప్తంగా ప్రజలు పూజలు, ర్యాలీల ద్వారా తమ ఆకాంక్షలను వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో సైతం దీనిపై భారీ చర్చ సాగుతోంది. శ్రీవారి చెంత పూజలు సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో పీఎస్ఎల్వీ సీ–37 నమూనా రాకెట్కు మంగళవారం పూజలు నిర్వహించారు. మంగళవారం ఇస్రో డైరెక్టర్లు జయరామన్, డాక్టర్ కనుంగో, డాక్టర్ జగదీశ్ శ్రీవారిని దర్శించుకున్నారు. నమూనా రాకెట్తో శ్రీవారి పాదాల చెంత పూజలు నిర్వహించారు.