KVIC
-
చర్మకారులకు పాద‘రక్ష’!
రాయదుర్గం: పురాతన పద్ధతుల్లో చెప్పులు కుడుతూ ఎదుగూ బొదుగూ లేకుండా బతుకుతున్న చర్మకారుల జీవితాలకు కొత్త ‘కళ’ను అద్దుతోంది ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ). ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్డీడీఐ)తో కలిసి చర్మకారులకు ఆధునిక పద్ధతులపై శిక్షణ ఇచ్చి సొంతంగా తయారీ యూనిట్లు నెలకొల్పుకునేందుకు చేయూతనందిస్తోంది. ఆధునిక డిజైనింగ్పై శిక్షణ చర్మకార వృత్తిని కొనసాగిస్తున్నవారితోపాటు వృత్తిని వదిలేసినా దానిపై ఆసక్తిగల వారిని కొందరిని ఎంపిక చేసి గత డిసెంబర్ 9 నుంచి ఈ జనవరి 3వ తేదీ వరకు మూడు విడతలలో 25 రోజుల పాటు రాయదుర్గంలోని ఎఫ్డీడీఐలో శిక్షణ ఇచ్చారు. ఆధునిక కాలానికి తగినట్లుగా చెప్పులు, షూల డిజైనింగ్.. వాటిని నాణ్యతతో తయారు చేయటంపై మెళకువలు నేర్పారు. ఎఫ్డీడీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నరసింహుగారి తేజ్లోహిత్రెడ్డి ఆధ్వర్యంలో ఎఫ్డీడీఐ ఫ్యాకల్టీ అబ్దుల్ రహమాన్, చంద్రమణి, కన్వర్సింగ్, ఇళయరాజా పర్యవేక్షణలో ఈ శిక్షణ కొనసాగింది. షూ తయారీలో శుద్ధి చేసిన చర్మాన్ని కటింగ్ చేసే ప్యాటర్న్, బాటమ్ ఫిట్టింగ్, అప్పర్ మేకింగ్, స్టిచ్చింగ్ వంటి అంశాలలో అవగాహన కల్పించారు. శిక్షణ పూర్తయిన తర్వాత వారు తయారు చేసిన ఉత్పత్తులతో ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. లిడ్క్యాప్కు పూర్వవైభవం తేవాలి ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు తరచూ నిర్వహిస్తూ చేతి వృత్తి కళాకారులను ప్రోత్సహించాలని ఇక్కడ శిక్షణ పొందినవారు కోరుతున్నారు. శిక్షణ పొందినవారు సొంతంగా యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీపై రుణ సౌకర్యం, ఆధునిక యంత్రాలు అందించాలని విన్నవించారు. అలాగే లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (లిడ్క్యాప్)కు పూర్వవైభవం తీసుకొస్తే చర్మకారులకు మరింత మేలు జరుగుతుందని పేర్కొంటున్నారు. ప్రత్యేక కోర్సులతో శిక్షణఎఫ్డీడీఐ హైదరాబాద్ క్యాంపస్లో నిష్ణాతులైన ఫ్యాకల్టీతో చర్మకారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. ప్రత్యేక కోర్సులను నిర్వహించి వీరికి శిక్షణ అందించాం. భవిష్యత్తులో కూడా మరిన్ని శిక్షణా కార్యక్రమాలు చేపట్టేందుకు ఫ్యాకల్టీ సిద్ధంగా ఉన్నారు. – డాక్టర్ నరసింహుగారి తేజ్ లోహిత్రెడ్డి, ఎఫ్డీడీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నేను టూరిజమ్లో పీజీ చేసి పర్యాటక శాఖలో గైడ్గా పనిచేసే లైసెన్స్ పొందాను. అయితే వంశపారంపర్యంగా వచ్చిన చర్మకార వృత్తిలో కొనసాగాలనుకున్న నాకు.. ఎఫ్డీడీఐలో శిక్షణ తీసుకునే అవకాశం వచ్చింది. ప్రభుత్వం రుణసౌకర్యం కల్పిస్తే సొంతంగా యూనిట్ పెట్టి నేను ఎదగటంతోపాటు కొంతమందికి ఉపాధి కల్పిoచాలన్నదే నా లక్ష్యం. –క్రాంతి, శిక్షణ తీసుకున్న చర్మకార కళాకారుడు, సికింద్రాబాద్మాదాపూర్లో పాత చెప్పులు కుడుతూ, చెప్పులు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించేవాణ్ణి. ఎఫ్డీడీఐ శిక్షణతో షూ కూడా తయారు చేయడం నేర్చుకున్నాను. అంతేకాదు ఏదో సాధించాలనే పట్టుదల వచ్చింది. ఇక్కడ శిక్షణ పొందిన మరికొందరితో కలిసి ఒక తయారీ యూనిట్ ఏర్పాటు చేసి ఉపాధి పొందడంతోపాటు నలుగురికి ఉపాధి కల్పిoచాలని ఉంది. –పవన్కుమార్, చర్మకారుడు, మాదాపూర్20 ఏళ్లుగా చర్మకార పనిచేస్తున్నా. సాధారణ చెప్పుల తయారీ, మరమ్మతులు, పాలిష్ వంటివి మాత్రమే చేయగలిగేవాణ్ణి. ఎఫ్డీడీఐలో శిక్షణ పొందాక రకరకాల డిజైన్లలో షూస్ తయారీతో పాటు కటింగ్, స్టిచ్చింగ్ చేసే స్థాయికి ఎదిగాను. ఇప్పటి తరంవారికి కూడా నచ్చేలా షూలు తయారు చేయగలననే నమ్మకం వచి్చంది. ప్రభుత్వం రుణం, యంత్రాలు అందిస్తే సొంతంగా యూనిట్ ఏర్పాటు చేసుకుంటా. ఇలాంటి శిక్షణ అందరికీ ఇస్తే మా కులవృత్తి కనుమరుగు కాకుండా ఉంటుంది. –తుకారామ్, చర్మకారుడు, ఈసీఐఎల్ -
మల్బరీ, ‘తేనె’ కంచెలతో ఏనుగుల దాడులకు చెక్!
ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో అడవులకు దగ్గరగా నివసించే రైతులు, గ్రామీణుల జీవనం ప్రాణసంకటంగా మారుతోంది. పలువురు ఏనుగుల దాడిలో పంటలను, ఆస్తులతోపాటు ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు కూడా తరచూ వింటూనే ఉన్నాం. మన దేశంలో ఏనుగుల దాడుల్లో ఏటా దాదాపు 500 మంది మృత్యువాతపడుతున్నారు. 2015–2020 మధ్యలో సుమారు 2,500 మంది ఏనుగుల దాడుల్లో చనిపోయారని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కర్ణాటకలోనే అత్యధికంగా 170 మంది చనిపోయారు. ప్రజల ప్రతి దాడుల్లో ఈ ఐదేళ్లలో 500 వరకు ఏనుగులు కూడా చనిపోయాయి. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఏనుగుల దాడి సంఘటనలు వేసవిలో ఏటేటా పెరుగుతున్నాయి. కొందరు రైతులు ప్రాణాలు కోల్పోయారు కూడా. ఏనుగులు–మనుషుల మధ్య సంఘర్షణను నివారించడానికి లేదా తగ్గించడానికి అనేక పద్ధతులు అందుబాటులో వున్నాయి. ఊళ్ల చుట్టూ పెద్ద కందకాలు తవ్వటం, శిక్షణ ఇచ్చిన ఏనుగులతో అటవీ ఏనుగుల గుంపులను పారదోలటం వంటి నివారణ చర్యలు ఉన్నా ఫలితం అంతగా ఉండటం లేదు. అయితే, రెండు పరిష్కార మార్గాలున్నాయి. తేనెటీగల కంచెలతో చెక్! ఈ నేపథ్యంలో ఏనుగులు పొలాల్లోకి, జనావాసాల్లోకి చొరబడే సరిహద్దు ప్రాంతాల్లో తేనెటీగల పెట్టెలతో కూడిన కంచెల (బీ–ఫెన్సెస్)ను ఏర్పాటు చేయటం అనే పద్ధతి ఒకటుంది. తేనెటీగల ధ్వని వినిపించగానే ఏనుగులు వెనక్కి వెళ్లిపోతున్నాయి. ఆఫ్రికా దేశాల్లో ఈ పద్ధతి చాలా సంవత్సరాలుగా అమలు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఈ పద్ధతిని గతంలోనే కేరళలో అమలు చేశారు. ఈ నేపథ్యంలో గత ఏడాది ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కెవిఐసి) కర్ణాటకలోని కొడగు జిల్లాలో ‘రీ–హేబ్’ పేరిట పైలట్ ప్రాజెక్టులో భాగంగా తేనెటీగల కంచెలు ఏర్పాటు చేసి పంటలపై, గ్రామీణులపై ఏనుగుల దాడులను విజయవంతంగా నివారించగలిగారు. తేనెటీగల గుంపులు శబ్దం చేసుకుంటూ ఏనుగులను చుట్టుముట్టి శబ్ధం చేస్తూ, వాటి తొండాల్లోకి, కళ్లలోకి దూరి ఇబ్బంది పెట్టడం వల్ల ఏనుగులు భయపడి వెనక్కి వెళ్లిపోతున్నట్లు గుర్తించారు. తేనెటీగల కంచెల ఏర్పాటుకు ఖర్చు తక్కువే కాకుండా ఏనుగులకు కూడా ఎటువంటి హానీ జరగదు. అంతేకాకుండా తెనెటీగల పెట్టెల ద్వారా తేని వస్తుంది కాబట్టి గ్రామీణులకు ఆదాయమూ లభిస్తుంది. పెద్ద కందకాలు తవ్వటం, సాధారణ కంచెలు ఏర్పాటు చేయటం వంటి చర్యల కన్నా తేనెటీగల కంచెలకు తక్కువ ఖర్చవుతుందని, ఫలితం బాగుందని కెవిఐసి తెలిపింది. పంటలను, రైతుల ప్రాణాలను కాపాడేందుకు ఈ తేనెటీగల కంచెల ఏర్పాటును ఏనుగులతో సమస్య ఉన్న ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తామని అప్పటి కేంద్ర ఎం.ఎస్.ఎం.ఈ. శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. మల్బరీ ఆకులను ఏనుగులు ముట్టవు! అయితే, ఏనుగులు తినని పంటలను ఆయా ప్రాంతాల్లో కంచె పంటగా సాగు చేయటం ద్వారా వాటి రాకను అడ్డుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మిరప, అల్లం, ఉల్లి, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా, పూల పంటలను ఏనుగులు తినవు. కానీ, తొక్కి పాడు చేస్తాయి. ఏనుగులు తినని, పాడు చేయని పంటలేమైనా ఉన్నాయా? అని బెంగళూరులోని కేంద్రీయ ఔషధ–సుగంధ మొక్కల పరిశోధనా సంస్థ (సీమాప్) శాస్త్రవేత్తలు డా. ఆర్. రవి కుమార, డా. ఎన్.డి. యోగేంద్ర కర్నాటకలోని కావేరి వన్యప్రాణుల అభయారణ్యం బెల్ట్లో ఐదేళ్లు పరిశోధన చేశారు. మల్బరీ ఆకులను ఏనుగులు అసలు తినవని, ఈ చెట్ల జోలికి కూడా రాకుండా దూరంగా వెళ్లపోతున్నట్లు వారు కనుగొన్నారు. మల్బరీ మొక్కలను పట్టు పురుగులకు మేతగా వేస్తుంటాం. పండ్లలో పోషకాలు ఉంటాయి. లేత ఆకులు, కాండంతో రుచికరమైన కూర వండుకోవచ్చు. మల్బరీ ఆకుతో కషాయం చేసుకోవచ్చు. పశువులు, గొర్రెలు, మేకలు, కుందేళ్లకు మల్బరీ ఆకులను మేపవచ్చు. సులభంగా జీర్ణమవుతుంది, ఈ ఆకుల్లో ప్రోటీన్ 15% నుండి 28% వరకు ఉంటుంది. అద్భుతమైన అమైనో ఆమ్లం ఉంటుంది. హానికరమైన పదార్థాలు లేవు. ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. కాండం ముక్కను నాటితే చాలు. మొక్క వేగంగా పెరుగుతుంది. అయితే, ఇతర శాకాహార పశువులు ఇష్టంగా తినే మల్బరీ ఆకులకు ఏనుగులు మాత్రం ముట్టుకోవు. ఈ ఆకుల్లో మోరిన్ బి–సిటోస్టెరాల్ వంటివి ఉండటం వల్ల కావచ్చని సీమాప్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. మల్బరీ సాగు మానవ–ఏనుగుల సంఘర్షణలను నియంత్రణలో ఉపయోగపడటంతో పాటు బహుళ ప్రయోజనాలతో కూడిన సుస్థిర జీవనోపాధిని అందిస్తుందని డా. రవి కుమార, డా. యోగేంద్ర సూచిస్తున్నారు. ఇలాఉండగా.. గ్రామీణాభివృద్ధి అధికారులు కోరితే సమస్యాత్మక గ్రామాల పొలిమేరల్లో ‘తేనెటీగల కంచె’ల ఏర్పాటుపై దృష్టి సారిస్తామని విజయవాడలోని కేవీఐసీ డైరెక్టర్ డా. గ్రీప్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. ఆయన ఈ–మెయిల్: sohyderabad.kvic@gov.in – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
గాంధీ స్థానంలో మోదీ
ముంబై: ఖాదీ, గ్రామీణ పరిశ్రమల సంస్థ(కేవీఐసీ) కొత్త ఏడాది కేలండర్, డైరీలపై ఖాదీకి మారుపేరైన జాతిపిత మహాత్మాగాంధీ బొమ్మను పక్కనపెట్టి ప్రధాని మోదీ బొమ్మను అచ్చేసింది. కుర్తా, ఓవర్కోటు దుస్తుల్లో ఉన్న మోదీ రాట్నంతో నూలు వడుకుతున్న చిత్రాన్ని పంచవన్నెలతో ప్రచారంలోకి తెచ్చింది. వీటిలో ఎక్కడా గాంధీ బొమ్మ లేకపోవడం విశేషం. వీటిని చూసి ముంబైలోని సంస్థ ప్రధాన కార్యాలయ ఉద్యోగులు కొందరు నోరెళ్లబెట్టారు. గురువారం ముఖాలకు నల్లగుడ్డలు కట్టుకుని మౌన నిరసన తెలిపారు. గాంధీ చిత్రాలతో వీటిని పునర్ముద్రించాలని డిమాండ్ చేశారు. మోదీ బొమ్మ ముద్రణను కేవీఐసీ చైర్మన్ వినయ్ సమర్థించుకున్నారు. -
పొందూరు ఖాదీకి విశిష్ట గుర్తింపు
• పొందూరు ఖాదీకి పేటెంట్ హక్కును కల్పించిన కేంద్ర ప్రభుత్వం • వారసత్వ, సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నంగా గుర్తింపు • ఖాదీ కార్మికులను ఆదుకునేందుకు హెరిటేజ్ క్లస్టర్ ఏర్పాటుకు సన్నాహాలు పొందూరు: పొందూరు ఖాదీకి భారత ప్రభుత్వం విశిష్ట గుర్తింపునిచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఖాదీ విలేజ్ ఇండ్రస్ర్ కమిషన్(కేవీఐసీ) చైర్మెన్ సక్సేనాలు పొందూరు ఖాదీని వారసత్వ, సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నంగా గుర్తించారు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం పొందూరు ఖాదీకి పేటెంట్ హక్కును ప్రకటించింది. దీనిక సంబంధించిన వస్త్రాలపై ముద్రించేందుకు ఖాదీ లోగో ( చిహ్నం)ను ఏర్పాటు చేశారు. ఫైన్ ఖాదీ వస్త్రాలు నేసిన కార్మికులకు సంబంధించి నేత పనివారికి 10 శాతం, వడుకు పనివారికి 20 శాతం మజూరీలు పెంచేందుకు సమాలోచనలు చేస్తున్నట్టు ఇటీవల సందర్శించిన కేవీఐసీ డివిజనల్ డైరెక్టర్ ఎం.భూమయ్య వెల్లడించారు. స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించిన ఖాదీ... విదేశీ వస్తు బహిష్కరణలో భాగంగా ఖాదీ వస్త్రాలు దేశ ప్రజల్లో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించాయి. ఉప్పు సత్యాగ్రహానికి తోడుగా మన ఖాదీ వస్త్రాలను మనమే ధరించాలనే నినాదం తారాస్థాయికి చేరుకోవడంతో ఖాదీ ఉద్యమానికి నాంది పలికింది. ఆ నేపధ్యంలో పొందూరు ఖాదీపై గాంధీ దృష్టి కేంద్రీకరించి, అతని మనుమడు దేవదాస్ గాంధీని 1921లో పొందూరుకు పంపించారు. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా పొందూరు ఖాదీ వస్త్రాలు చలామనీ అయ్యాయి. భూదాన ఉద్యమంలో భాగంగా ఆచార్య వినోభాబావే పొందూరు గ్రామాన్ని సందర్శించినప్పుడు 1955 అక్టోబర్ 13న చేనేత సంఘ భవనానికి శంకుస్థాపన చేశారు. కేవీఐసీ (ఖాదీ గ్రామోద్యోగ కమిషన్) ఆధ్వర్యంలో ఏఎఫ్కేకే (ఆంధ్రాపైన్ ఖాధీ కార్మిక అభివృద్ధి సంఘం)గా నామకరణం చేసింది. ఈ సంఘం పరిధిలో సుమారు 26 గ్రామాల ప్రజలు జీవనం సాగిస్తున్నారు. వందమంది నేతకార్మికులు, 900 మంది నూలు వడుకువారు ఎనిమిది మండలాల్లో విస్తరించి ఉన్నారు. ఖాదీ ఉత్పత్తుల అమ్మకాలకు జిల్లాలో ఒక ఉత్పత్తి విక్రయశాల, 4 ఉత్పత్తి కేంద్రాలు, 9 విక్రయాల ఖాధీ బాండాగారాలు ఏర్పాటు చేశారు. చేపముల్లే సాధనంగా... నాణ్యమైన పత్తి నుంచి దారం తీసి ఖద్దరు వస్త్రాన్ని తయారుచేయడం ఇక్కడ నేత కార్మికుల ప్రత్యేకత. ఖద్దరు ఉత్పత్తుల తయారీకి చేపముల్లే సాధనంగా ఉపయోగించడం విశేషం. చేపముల్లుతో శుభ్రం చేసిన పత్తిని చేతితో వడికి నూలును తీసి చేమగ్గంపై వస్త్రం నేస్తారు. ఇదే అసలైన పొందూరు ఖాదీ. మిషన్మీద నూలును తీసి వస్త్రాన్ని తయారు చేసి నకిలీ ఖాదీని విక్రయిస్తూ కార్మికుల పొట్టకొట్టేయడం వ్యాపారుల చేస్తున్న దుర్మార్గం. దీనిని నియంత్రించేందుకే కేంద్ర ప్రభుత్వం పొందూరు ఖాదీకి పేటేంట్ హక్కును కల్పించింది. వాస్తవానికి ఖాదీ కార్మికులు అర్ధాకలితో జీవిస్తున్నారు. పేటెంట్ హక్కుతో పాటు మజూరీలు పెంచితేనే వారు మనుగడ సాగించేందుకు అవకాశం ఉంటుంది.