Malayalees
-
హైదరాబాద్లో కేరళ భవన్
నిరుపేద మలయాళీలకు పక్కా ఇళ్లు కట్టిస్తాం: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో మలయాళీ అసోసియేషన్ భవనం కోసం మహేంద్రహిల్స్లో ఎకరం భూమి కేటాయించి, దాని నిర్మాణానికి కోటి రూపాయల నిధులు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. నగరంలో నివసిస్తున్న నిరుపేద మలయాళీలకు పక్కా ఇళ్లు కట్టిస్తానని సీఎం హామీ ఇచ్చారు. కేరళ ప్రభుత్వ సహకారంతో నగరంలోని మలయాళీ అసోసియేషన్(సీటీఆర్ఎంఏ) ఆధ్వర్యంలో ఆదివారం బాలానగర్లోని నవీన సాంస్కృతిక కళా కేంద్రంలో కేరళీయం-2015 పేరుతో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్లో సుమారు 4 లక్షల మంది కేరళీయులు ఉన్నారని, వారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. తన చాంబర్లోనూ ఓఎస్డీగా కేరళకు చెందిన ప్రియాంక అద్భుతంగా సేవలందిస్తున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీవీ యాంకర్ సుమతో పాటు పలువురు కేరళ ప్రముఖులను కేసీఆర్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కేరళ మంత్రి కె.సి.జోసఫ్, ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
ఓనమాలు నేర్పిన ఓనమ్
ఓనమ్... మళయాళీలు పది రోజుల పాటు... వేడుకగా, ఘనంగా జరుపుకునే అతి పెద్ద పండుగ... రకరకాల వంటలతో, సంప్రదాయ నృత్యాలతో... ఆటలతో... పడవల పోటీలతో... పులి వేషాలతో... తెలుగువారి దసరాలను త లపించే పండుగ... ఇంటికి పంటలు చేరి భోగభాగ్యాలతో తులతూగే పండుగ... రేపు ‘ఓనమ్’... తెలుగింటి కోడలుగా మనలో ఒకరైపోయిన పరహారణాల కేరళ కుట్టి సుమ ‘సాక్షి’కి చెప్పిన ఓనమ్ పండుగ కబుర్లు... మీరు మలయాళీ ఇంటి ఆడపడుచు! తెలుగింటి కోడలు! మరి ఓనమ్ బాగా సెలబ్రేట్ చేస్తారా? సుమ: నేను చిన్నతనం నుంచీ ఇక్కడే అంటే హైదరాబాద్లోనే ఉంటున్నాను. మా పెళ్లయినప్పటి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఓనమ్ పండుగ వేడుకగా జరుపుకుంటున్నాను. మా ఇంట్లో అటు తెలుగు పండుగలు, ఇటు కేరళ పండుగలు - రెండూ బాగా చేసుకుంటాం. కిందటేడాది మానాన్నగారు పోవడంతో ఆ ఒక్క సంవత్సరమే చేయలేదు. పండుగను ఎలా జరుపుకుంటారు? సుమ: ఓనమ్ పండుగ పది రోజులూ ఇంటి ముందర కళ్లాపి జల్లి, నేల తడిగా ఉండగానే పువ్వులతో పూక్కళమ్ చేస్తారు. అంటే పూల ముగ్గులాంటిదన్నమాట. సాధారణంగా అందరూ పది రోజులూ చేస్తారు. అయితే నేను నా షూటింగులలో బిజీగా ఉంటాను కాబట్టి ఒక్కరోజు మాత్రమే రకరకాల పూలతో అందంగా అలంకరించి, ఆనందిస్తాను. ఓనమ్ సందర్భంగా ప్రత్యేక వంటలు ఏమేం చేస్తారు? సుమ: ఈ పండుగకు సాధారణంగా 13 రకాల వంటకాలు చేస్తారు. మేం మాత్రం అవియల్, ఓలెన్, ఇంజుప్పులి, పాలడ పాయసం, కరి (సెనగపప్పు వంటకం), అనాస లేదా మామిడికాయతో పచ్చడి చేస్తాం. ప్రతి ఏడాదీ ఈ వంటలన్నీ నేనే చేస్తాను. ఈసారి మా అమ్మ కూడా నా దగ్గరే ఉన్నారు కనుక ఇద్దరం కలిసి చేసుకుంటాం. ఓనమ్ నాడు మీ ఆచారవ్యవహారాలు ఎలా ఉంటాయి? సుమ: ఈ పండుగ నాడు అప్పడం కంపల్సరీ. అరటిపండు (వేందరప్పళన్) ను ఇడ్లీ రేకులలో ఉంచి ఆవిరి మీద ఉడికించి తింటాం. ఈ అరటిపండును నెల రోజుల పసి పాపలకు కూడా పెట్టచ్చు. ఇది చాలా బలాన్నిస్తుంది. ఆవిరి మీద ఉడకపెట్టడం వలన ఇందులోని పోషకాలు ఎక్కడికీ పోవు. ఓనమ్ పండుగకు తప్పనిసరిగా అరటి ఆకులోనే భోజనం చేస్తాం. నాకు అందులో తినడమంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆకులో పాలడ పాయసం వేసుకుని అది అటూ ఇటూ జారిపోతూ ఉంటే చేత్తో గబగబ దగ్గరకు లాక్కుంటూ తినడం భలే సరదాగా ఉంటుంది. నేను కొంచెం చిలిపి పనులు చేస్తుంటాను. నా ఆకు క్లీన్గా ఉండాలని, (నవ్వుతూ) నేను అన్నం తినడం పూర్తయిన తర్వాత, నా ఆకులో ఉన్న కరివేపాకు, పచ్చి మిర్చి వంటి వాటిని పక్క వాళ్ల ఆకులలోకి వాళ్లు చూడకుండా తోసేస్తాను. ఈ పండుగకు ప్రత్యేకంగా ముండుమ్ వేష్టి ధరిస్తాం (ఇది ఓనమ్ ప్రత్యేకం). ఇంతకీ మీరు మొట్టమొదటసారి వంట చేసినప్పుడు మీ అనుభవం ఏమిటి? సుమ: పెళ్లయిన పదిహేను రోజులకు మొదటిసారి రాజీవ్ నన్ను పచ్చి మిర్చి పచ్చడి చేయమన్నారు. ఆయన కోరిక మేరకు వంట చేయడానికి వంట గదిలోకి సంతోషంగానే అడుగుపెట్టాను. రాజీవ్ ఉద్దేశం కొబ్బరిలో పచ్చి మిర్చి కలిపిన పచ్చడి! కానీ నేను కేవలం పచ్చి మిర్చితో అనుకుని, పచ్చి మిర్చిలో ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా తిప్పి అన్నంలో వడ్డించాను. ఆ పచ్చడి కలుపుకుని తినేసరికి, ఇంక చూడాలి... రాజీవ్ కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. నా కళ్లలోనూ బాధతో నీళ్లు తిరిగాయి. రాజీవ్కి అందరు దేవుళ్లతో పాటు, మా కుటుంబ సభ్యులూ కళ్ల ముందు సాక్షాత్కరించారు. మరి, ఆ తరవాత వంట నేర్చుకున్నారా? సుమ: ఆ తరవాత అనుభవం మీద అదే వచ్చేసింది. వంట చేయడం నాకు ఇష్టమే. కానీ సమయం మాత్రం లేదు. పండుగలకు, వంటమనిషి ఊరెళ్లినప్పుడు, పిల్లలు అడిగితే చేసిపెట్టడం... అంతే తప్ప మిగతా సమయాల్లో వంట చేయాల్సిన అవసరం ఉండదు. మలయాళీలు అన్ని వంటల్లోనూ కొబ్బరి నూనె ఎక్కువగా వాడతారంటారు? సుమ: కొలెస్ట్రాల్ చింత పెరిగిపోవడంతో, ఇప్పుడు కొబ్బరి నూనెతో వంటలు చేయడం బాగా తగ్గిపోయింది. కొన్ని ప్రత్యేకమైన వంటకాలకు మాత్రమే కొబ్బరి నూనె వాడతున్నాం. మీ జీవితంలో ఓనమ్ పండుగ పోషించిన ప్రత్యేక పాత్ర గురించి ఎక్కడో విన్నాం... సుమ: అవును. సికింద్రాబాద్లో మలయాళీలకు ప్రత్యేకంగా ‘కేరళ అసోసియేషన్’ అని ఒకటి ఉంది. దానికి మా నాన్నగారు మేనేజర్గా ఉండేవారు. అక్కడ ప్రతి యేడూ ఓనమ్ పండుగనాడు ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి. ఏమాత్రం భయపడకుండా నేను వాటిలో పాల్గొనేదాన్ని. అందువల్ల నాకు స్టేజ్ ఫియర్ పోయింది. అలా నా ప్రతిభ నిరూపించుకునే అవకాశం ఓనమ్ పండుగ వల్లే వచ్చింది. ఇప్పుడు యాంకర్గా ఇంత సక్సెస్ సాధించగలిగానంటే అందుకు కారణం ఓనమ్ పండుగే. అలా ఓనమ్ నుంచి ఓనమాలు నేర్చుకున్నాను. - సంభాషణ: డా. వైజయంతి పాలడ పాయసం కావలసినవి: పాలడ (రైస్ అడ) - ముప్పావు కప్పు (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది); నెయ్యి - 2 టీ స్పూన్లు; జీడిపప్పు పలుకులు - టేబుల్ స్పూను; కిస్మిస్ - టేబుల్ స్పూను; పాలు - 2 కప్పులు; బెల్లం తురుము - పావు కప్పు; ఏలకులపొడి - పావు టీ స్పూను తయారీ: రైస్ అడను రెండు కప్పుల వేడి నీళ్లలో సుమారు పది నిమిషాలు నానబెట్టాలి పది నిమిషాల తర్వాత అవి బాగా పొంగి కనపడతాయి. అప్పుడు నీళ్లు వడకట్టి చల్ల నీళ్లలో వేసి వార్చాలి బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు పలుకులు, కిస్మిస్ వేసి దోరగా వేయించి తీసేయాలి ఒక పాత్రలో పాలు, బెల్లం తురుము, ఏలకుల పొడి, నానబెట్టి తీసిన పాలడ వేసి బాగా కలిపి సన్న మంట మీద ఉంచి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి బాగా ఉడికిన తర్వాత దించి, వేయించి ఉంచుకున్న జీడిపప్పు పలుకులు, కిస్మిస్ వేసి అందించాలి. ఇంజిప్పులి కావలసినవి: నూనె - 5 టేబుల్ స్పూన్లు; అల్లం - అర కేజీ (సన్నగా తురమాలి); ఉప్పు - తగినంత; ఆవాలు - టీ స్పూను; కొబ్బరి ముక్కలు - 2 కప్పులు; కరివేపాకు - 2 రెమ్మలు; చిన్న ఉల్లిపాయలు - పావు కేజీ; పచ్చి మిర్చి - 4 (ముక్కలు చేయాలి); పసుపు - అర టీ స్పూను; ధనియాల పొడి - 3 టేబుల్ స్పూన్లు; కారం - 2 టేబుల్ స్పూన్లు; చింతపండు - 100 గ్రా. (నానబెట్టాలి); బెల్లం తురుము - తగినంత తయారీ: బాణలిలో నూనె వేసి వేడి చేయాలి అల్లం తురుము వేసి వేయించి, ఉప్పు జత చేసి దోరగా వేయించి దించి పక్కన ఉంచాలి మిగిలిన నూనెను బాణలిలో వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి కొబ్బరి ముక్కలు జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాక కరివేపాకు జత చేయాలి చిన్న ఉల్లిపాయలు, పచ్చి మిర్చి తరుగు వేసి వేయించాలి పసుపు, ధనియాల పొడి, కారం వేసి వేయించాలి వేయించి ఉంచుకున్న అల్లం తురుము, చింతపండు పులుసు వేసి బాగా కలిపి సన్న మంట మీద ఉడికించాలి బెల్లం తురుము వేసి మరో ఐదు నిమిషాలు ఉంచి దించేయాలి. చక్క ఎరిసెరి కావలసినవి: పచ్చిగా ఉన్న పనస తొనలు - పావు కేజీ; కారం - అర టీ స్పూను; పసుపు - పావు టీ స్పూను; ఉప్పు - తగినంత; కొబ్బరి తురుము - అర కప్పు; జీలకర్ర - పావు టీ స్పూను; మిరియాల పొడి - పావు టీ స్పూను; పచ్చి మిర్చి - 2; కొబ్బరినూనె - టేబుల్ స్పూను; ఆవాలు - అర టీ స్పూను; ఎండు మిర్చి - 4; చిన్న ఉల్లి పాయలు - 5; కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు; కరివేపాకు - రెండు రెమ్మలు తయారీ: ముందుగా పనస తొనలలోని గింజలు వేరు చేసి తొనలను నాలుగైదు ముక్కలుగా కట్ చేయాలి ఒక పాత్రలో పనస ముక్కలు, కారం, పసుపు, ఉప్పు, నీళ్లు వేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచి మూత పెట్టి ఉడకించాలి కొబ్బరి తురుము, పచ్చి మిర్చి, జీలకర్ర, మిరియాల పొడి, రెండు టీ స్పూన్ల నీళ్లు మిక్సీలో మెత్తగా చేసి పక్కన ఉంచాలి పనస ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత కొబ్బరి పేస్ట్ వేసి బాగా కలిపి మరో రెండు నిమిషాలు ఉడికించి దించేయాలి మరొక బాణలిలో కొబ్బరినూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ఎండు మిర్చి ముక్కలు, చిన్న ఉల్లిపాయలు, కొబ్బరి తురుము, కరివేపాకు జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి ఉడికించి ఉంచుకున్న పనస ముక్కల మిశ్రమం వేసి బాగా కలిపి దించేయాలి అన్నంలోకి వేడివేడిగా వడ్డించాలి. -
సంప్రదాయానికి పట్టుగొమ్మ
ఓనమ్ స్పెషల్ ప్రకృతి అంతా ఒక చోటే కొలువుదీరిందా అని ఆశ్చర్యపోయేటంత అందం కేరళ సొంతం. ప్రాకృతిక పరంగానే కాకుండా సంప్రదాయానికీ ఈ నేల పెట్టింది పేరు. ‘ఏ దేశమేగినా, ఎందుకాలిడినా’ తమ సంస్కృతినీ సంప్రదాయాన్నీ కాపాడుకోవడం మలయాళీల ప్రత్యేకత. తెలుగురాష్ట్రాలలో మలయాళీలూ సందడి చేస్తున్నారు. వారి పండగలలో ప్రధానమైన ఓనమ్, వారి ఆహార్యమూ తెలుగువారినీ ఆకట్టుకుంటుంది. ఓనమ్ సందర్భంగా మలయాళీల కట్టూబొట్టు గురించి... పాల మీగడను పోలి ఉండే పంచెకు బంగారపు జరీ అంచు, అదే పోలికతో ఉండే ఉత్తరీయం మలయాళీల సంప్రదాయ వస్త్రధారణలో ప్రధానమైనవి. చెడు ఆలోచనలను, చెడు భావనలను తొలగించి హృదయాన్ని నూతనంగా చేయటమే ఈ వస్త్రాలు ధరించడంగా కేరళవాసులు భావిస్తారు. ప్రాచీనం.. ముండు.. కసవు అంటే బంగారు అంచు. ముండు అంటే పంచె, నెరయాతుమ్ అంటే ఉత్తరీయం. కసవు చీరలు, పంచెలు, ఉత్తరీయం.. తేలికగా ఉండటమే కాదు, జరీ అంచులు మెరుస్తూ ఉంటాయి. ఇవి పూర్తిగా పర్యావరణ అనుకూల కాటన్ వస్త్రాలు. వీటిని సంప్రదాయ చీరలుగా, డ్రెస్లుగా ఉపయోగిస్తారు. ముండు, నెరయాతుమ్ ధరించి నూనె పెట్టి విడిచిన పొడవాటి కురులలో మల్లెపూలను ధరించిన మలయాళీ మహిళ అందానికి ప్రతిరూపంగా నిలుస్తుంది. నుదుటిపై చిన్న బొట్టు, కళ్లకు కాటుక, బంగారు ఆభరణాలు ప్రత్యేకతను చాటుతుంటాయి. ఈ కాంబినేషన్ ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. మగవారు ముండును లుంగీగాను, నెరయాతుమ్ను భుజాల చుట్టూ ధరిస్తారు. ఈ వస్త్రాలు ఒక్క ఓనమ్ పండగకే కాదు, వారంలో రెండు సార్లు ధరించాలి అనే నియమం కూడా కేరళలో అనుసరిస్తున్నారు. ప్రతి వేడుకలోనూ ‘కసవు’ చీరలకు ప్రథమ స్థానం ఇవ్వడం వీరి ప్రత్యేకత. కేరళ చేనేత వస్త్రాలకు ఓ ప్రత్యేకత ఉందని, శిశువు గర్భస్థ దశలో ఉండగా స్త్రీ ఈ వస్త్రాలను ధరిస్తే పుట్టబోయే బిడ్డకు కామెర్లు రావని చెబుతారు. అంటే ఈ వస్త్రం ఆరోగ్య ప్రదాయిని అన్నమాట. ఆధునిక పద్ధతుల్లో ముండు వస్త్రాన్ని నడుముకు చుట్టుకొని, నెరియాతు ఎడమ భుజం మీదుగా పమిటలా వేసుకుంటున్నారు. ఇది తెలుగింటి లంగా ఓణీని తలపిస్తుంది. చేనేత చీరలకు కేరళ పెట్టింది పేరు. ఇక్కడ బలరాం పురం, కన్నూర్, కూతంపల్లి, చెన్నమంగళం, కాసర్ గోడ్ వస్త్రాలకు అక్కడి రాష్ట్రంలోనే గాక విదేశాలలో కూడా మంచి పేరుంది. కేరళ సంస్కృతికి అద్దం పట్టేవిధంగా ఈ చీరల నేత ఉంటుంది. బలంపురంలో వెదురుతో సూపర్ ఫైన్ కాటన్ను తయారుచేస్తారు. ఈ ప్రాంతం చీరలకు, ఇతర నూలు వస్త్రాలకు ప్రసిద్ధి. పర్యావరణానికి అనుకూలంగా వస్త్రాల నేత ఉంటుంది. కన్నూర్ ప్రాంతం నుంచి జపాన్, హాంగ్కాంగ్, యూరప్, మధ్య ఆసియా దేశాలకు వస్త్రాలను ఎగుమతి చేస్తారు. త్రిసూర్ జిల్లాలోని కూతంపల్లి ‘కసవు’ చేనేతకు ప్రసిద్ధి. డబుల్ ధోతి, సెట్ ముండు, వేస్టీ, సెట్ శారీ, లుంగీ, చుడీదార్ వస్త్రాలను తయారుచేస్తారు. ఓనమ్, విషు, క్రిస్ట్మస్ పండుగల సమయాల్లో కూతంపల్లి వస్త్రాలకు ప్రజలు మొగ్గుచూపుతారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల వారు ‘కసవు’ చీరల వైపు ఆసక్తిచూపుతారు. వీటి ధరలు ఒక్కొక్కటి రూ.300/- నుంచి లభిస్తాయి. మహాబలి కేరళ రాజ్యానికి రాజు. ఇతని పరిపాలన కేరళలో స్వర్ణయుగంగా భావిస్తారు. బలి ఆగమనాన్ని పురస్కరించుకొని కేరళవాసులు సంబరం జరుపుకునే పండగే ఓనమ్. కేరళ ఘనమైన సంస్కృతీ వారసత్వంగా ఈ పండగ విశిష్టతను పొందింది. మలయాళీల ప్రాచీన వస్త్ర వైభవంగా ముండు, నెరియాతుమ్ పద్ధతులను విశేషంగా చెప్పుకుంటారు. జరీ అంచు గల ‘కసవు’ చీరలను అతివలు వేడుకలలో తప్పనిసరిగా ధరిస్తారు. స్త్రీలు, పురుషులు ముండు పంచెలను ధరిస్తారు. స్త్రీలు సంప్రదాయ పద్ధతిలో ముండు (పంచె)ను ధరించి, ఉత్తరీయం (నెరియాత్తు) కుచ్చిళ్లుగా మలచి, జాకెట్టులోకి ముడుస్తారు. ఈ పద్ధతి బౌద్ధ, జైన విధానాలను అనుసరించి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆభరణాల ప్రత్యేకత కేరళ ఆభరణాలలో పెద్ద పెద్ద హారాలు ప్రత్యేకమైనవి. వీటిలో ముఖ్యమైనవి- కసు మాల(కాసులపేరు), పలాక్కమాల, నాగపడగ తాళి, కరిమని మాల, ముళ్లమొట్టు మాల, చేరుతళి, అడ్డియాల్, కశలి, పూతలి, జుంకీలు.. మొదలైనవి. కేరళ స్త్రీ వద్ద వీటిలో కనీసం ఒక్కటైన తప్పనిసరిగా ఉంటుంది. కేరళ కుటుంబాలు ఇప్పటికీ సంప్రదాయ ఆభరణాలనే ఇష్టపడుతున్నాయి. దాదాపు అన్ని రకాల ఆభరణాలలోనూ దేవాలయ శిల్ప కళ కనబడుతుంది. టెంపుల్ జువెల్రీలో విళక్కు మాల, ఎరుక్కుంపుమాల, సరపోలి మాల, వివదల మాల, మణి మాల.. ముఖ్యమైనవి. దాదాపు అన్ని ప్రసిద్ధ దేవాలయాలలోనూ తిరువాభరణం ధరించిన దేవతా మూర్తులు కనిపిస్తారు. మన సంప్రదాయ వైభవాన్ని కళ్లకు కట్టే ఓనమ్ లాంటి వేడుకలకు వన్నెతెచ్చేవి సంప్రదాయ వస్త్రాలే. అలాంటి వస్త్రకళను వేనోళ్ల పొగడటమే కాదు, వేనవేలఏళ్లు ఆ కళను కాపాడుకుందాం అనే మలయాళీల మాట ఆచరణలో చూపాల్సిందే! - నిర్మలారెడ్డి తెలుపు, బంగారు వర్ణంలో ఉండే కేరళ చీరలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. చీరగానే కాకుండా వీటిని అనార్కలీ డ్రెస్, లంగా ఓణీలుగానూ తీర్చిదిద్దుకోవచ్చు. జరీ అంచుపైన జర్దోసి, మిర్రర్ వర్క్.. చేయవచ్చు. నీలం, ఎరుపు, ఆకుపచ్చ, నలుపు.. ఇలా ముదురు రంగు కాంబినేషన్స్ ఎంచుకొని కేరళ చీరలు, డ్రెస్ల మీద ధరించవచ్చు. - అర్చితా నారాయణమ్, ఫ్యాషన్ డిజైనర్ ముండు అంటే పంచె. నెరియాతుమ్ అంటే పై వస్త్రధారణ. ఈ రెండు వస్త్రాలను ఉపయోగించి చేసే కట్టును ‘ముండు నెరియాతుమ్’ అంటారు. కేరళవాసుల సంప్రదాయ వస్త్రమైన ముండు దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీన సాంప్రదాయికతకు మిగిలిన ఆనవాలు. -
వైభవంగా ఓనం
బెంగళూరులోని మలయాళీలు సోమవారం భక్తి శ్రద్ధలతో ఓనం పండుగను ఆచరించారు. సంప్రదాయ నార చీరలను ధరించి మహిళలు పూల రంగవల్లుల మధ్య దీపాలను ఉంచి వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడి మైమమరచిపోయారు. కేరళీయులకు అత్యంత ఇష్టుడైన రాజు మహా బలి ఇంటికి పునరాగమనాన్ని ‘తిరుఓనం’గా ఈ పండుగను ఆచరించడం ఆనవాయితీ. -
10రోజులపాటు ఓనమ్ పండుగ సంబరాలు