Nawab Shafat ali khan
-
ఆడపులి కోసం వేట షురూ..!
సాక్షి, సిటీబ్యూరో: సిటీ హంటర్ నవాబ్ షఫత్ అలీ ఖాన్ మహారాష్ట్రలో మరో ఆపరేషన్ చేపట్టారు. యవత్మాల్ జిల్లాలో మ్యానీటర్గా మారి బీభత్సం సృష్టిస్తున్న ఆడపులి కోసం శనివారం వేట ప్రారం భించారు. ఇదే రాష్ట్రంలోని థూలే జిల్లాలో మ్యానీటర్గా మారిన ఓ చిరుతను గత శనివారం మట్టుపెట్టారు. ఈ ఆపరేషన్ ముగించుకుని సిటీకి వచ్చిన అలీ ఖాన్ శనివారం మళ్లీ యవత్మాల్ చేరుకున్నారు. తమ తొలి ప్రాథాన్యం ఆ పులికి మత్తుమందు ఇచ్చి (ట్రాంక్విలైజింగ్) పట్టుకోవడమే అని ఆయన ఆదివారం ‘సాక్షి’కి ఫోన్లో తెలిపారు. యవత్మాల్ జిల్లాలోని పంథర్కావ్డా, తెపీశ్వర్ గ్రామాలకు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తొలిసారిగా 2014లో ఓ ఆడపులి ప్రవేశించింది. అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాలు అప్పట్లో తొలిసారిగా ఈ పులిని చిత్రీకరించాయి. గత ఏడాది హఠాత్తుగా మ్యానీటర్గా మారిన ఈ ఆడపులి గ్రామాలపై దాడులు ప్రారంభించింది. తొలినాళ్ళల్లో పొలాలు, ఇళ్ళ బయట ఉన్న పశువులు, మేకల్ని చంపేది. అయితే పశువులు, మేకల కోసం జనావాసాల మధ్య సంచరించడంతో దీనికి మనుషులంటే భయంపోయింది. దీంతో కనిపించిన వారిపై దాడి చేసి చంపడం మొదలెట్టింది. గత ఏడాది నలుగురిని చంపిన ఈ ఆడ పులి అనేక మందిని గాయపరిచింది. కొన్నాళ్ళ పాటు స్తబ్ధుగా ఉన్న ఈ పులి ఈ నెల మొదటి వారం నుంచి మళ్ళీ విజృంభించింది. తొమ్మిది రోజుల వ్యవధిలో ఏకంగా ఐదుగురిని చంపేసింది. వీరిలో ముగ్గురి మృతదేహాలను అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్ళి తినేసింది. గత శనివారం అడాన్ గ్రామ శివార్లలో ఓ రైతుపై దాడి చేసి చంపేసిన ఈ పులి అతడి ఎడమకాలను పూర్తిగా తినేసింది. ఈ ఘటనతో ఈ గ్రామంతో పాటు పంథర్కావ్డా, తెపీశ్వర్ గ్రామాల్లోనూ ఉద్రిక్తత నెలకొంది. దీంతో స్థానికులు అటవీ శాఖ అధికారులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. దీనిపై స్పందించిన అధికారులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారం రోజులు ప్రయత్నించినా కనీసం దాని ఆచూకీ కూడా కనిపెట్టలేకపోయారు. దీంతో యవత్మాల్ డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ కేఎం అపర్ణ హైదరాబాద్కు చెందిన నవాబ్ షఫత్ అలీ ఖాన్ను ఆహ్వానించారు. శనివారం అక్కడకు చేరుకున్న ఆయన ఆదివారం నుంచి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అలీ ఖాన్ ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ... ‘ప్రాథమికంగా ఆ పులి ఆచూకీని కనిపెట్టాలి. పగటిపూట ఎక్కడ తల దాచుకుంటోందో గుర్తించాలి. ఆపై అది మ్యానీటర్గా మారడానికి కారణాలను విశ్లేషించాలి. ఈ పులికి మత్తుమందు ఇచ్చి బంధించడానికే తొలి ప్రాధాన్యం ఇస్తూ ఆపరేషన్ చేపట్టాం’ అన్నారు. -
సమాజం కోసమే...వేట
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్కు చెందిన హంటర్ నవాబ్ షఫత్ అలీ ఖాన్ బీహార్ రాష్ట్రంలో మరో వేట ప్రారంభించారు. అక్కడి మకామా ప్రాంతంలో పంట పొలాలను ధ్వంసం చేస్తున్న నీల్గాయిల వేట ప్రారంభించారు. ఈ విషయంపై గురువారం కేంద్ర మంత్రులు మేనకాగాంధీ, ప్రకాష్ జవదేకర్ మధ్య మాటల యుద్ధం జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాలు..మకామా ప్రాంతంలోని అడవుల నుంచి బయటకు వచ్చి సమీపంలోని పొలాలపై నీల్గాయిలు దాడి చేసి ధ్వంసం చేస్తున్నాయి. తీవ్రంగా నష్టపోతున్న రైతులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. వాటిని కట్టడి చేయడానికి ఎన్ని చర్యలు తీసుకున్నా సాధ్యం కాకపోవడంతో ఆ ప్రభుత్వం హైదరాబాద్కు చెందిన ప్రముఖ వేటగాడు షఫత్ అలీ ఖాన్ను పిలిచింది. దీంతో ఆయన ఆదివారం అక్కడికి చేరుకుని రాష్ట్ర అటవీ శాఖ అధికారులతో చర్చించారు. పరిస్థితుల్ని అధ్యయనం చేసిన తర్వాత నీల్గాయిలను అవసరమైన సంఖ్యలో కాల్చిచంపడమే పరిష్కారమని నిర్ణయించారు. దీనికి బీహార్ ప్రభుత్వంతో పాటు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ సైతం అనుమతి తెలపడంతో అలీ ఖాన్ తన ఆపరేషన్ ప్రారంభించారు. మకామా అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాల్లో కాపుకాసిన ఆయన నాలుగు రోజుల్లో 300 నీల్గాయిలను చంపారు. ఈ విషయంపై ఓ జాతీయ ఛానల్ గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రిగా ఉన్న జంతు ప్రేమికురాలు మేనకాగాంధీని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే ఆమె తన సహచర మంత్రి ప్రకాష్ జవదేకర్తో పాటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ను ‘వేట’పై తీవ్రంగా విమర్శించారు. దీనికి జవదేకర్ సైతం ఘాటుగా స్పందించడంతో జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. మేనకాగాంధీ సదరు జాతీయ ఛానల్తో మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి వచ్చిన షూటర్ కుటుంబం మూడు తరాలుగా జంతువుల్ని వేటాడుతోందని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ‘సాక్షి’ ఫోన్ ద్వారా షఫత్ అలీ ఖాన్ను సంప్రదించగా... ‘మూడు తరాల నుంచి మా కుటుంబం వేటాడుతోంది సమాజం కోసమే. మ్యానీటర్స్గా మారిన పులులు, చిరుతలతో పాటు అమాయకుల్ని పొట్టనపెట్టుకున్న ఏనుగుల్ని మాత్రమే చంపాం. ప్రతి అంకంలోనూ ఆయా ప్రభుత్వాలు అధికారికంగా కోరి, అవసరమైన అన్ని అనుమతులు ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ పని చేస్తున్నాం. పట్టుకోవడం, మత్తు ఇవ్వడం సాధ్యం కాని పక్షంలోనే ఆఖరి అవకాశంగా ఆయా జంతువుల్ని చంపాల్సి వస్తోంది. మకామాలో నిరుపేద రైతులు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలోనే నీల్గాయి(బ్లూబుల్స్)లను వేటాడాల్సి వస్తోంది. ఏసీ గదుల్లో కూర్చునే వారు క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలియక, అర్థం చేసుకోలేక కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు’ అని అన్నారు. -
మృగరాజు.. నవాబ్ షఫత్ అలీఖాన్
హైదరాబాద్: ఈ మృగరాజు పేరు నవాబ్ షఫత్ అలీఖాన్. మన హైదరాబాదీయే. దేశంలోనే పేరెన్నికగన్న లెసైన్డ్స్ వేటగాడు. జనావాసాల్లోకి చొరబడి మనుషుల్ని చంపే పెద్దపులులను మట్టుబెట్టడం ఈయన ప్రత్యేకత. ఇలా దేశంలో పలు రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఇప్పటిదాకా తొమ్మిది పులులను హతమార్చాడు. ప్రస్తుతం ఊటీలో ఓ పులి పని పట్టేందుకు వెళ్లాడు. ఇంతలోనే ఉత్తరప్రదేశ్ నుంచి పిలుపు వచ్చింది. మురాదాబాద్, సంభాల్ జిల్లాల్లో సంచరిస్తున్న ఓ పులి నెలరోజుల్లోనే ఆరుగురిని దారుణంగా చంపింది. దీంతో యూపీ సర్కారు ఈయనను సంప్రదించింది. ఊటీ పులి సంగతి చూసి ఉత్తరప్రదేశ్ వెళ్తానని చెబుతున్నాడు అలీఖాన్!