NLD
-
మళ్లీ మయన్మార్ సూకీదే
మయన్మార్లో ఈ నెల 8న జరిగిన ఎన్నికల్లో వరసగా రెండోసారి కూడా ఆంగ్సాన్ సూకీ నాయకత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ(ఎన్ఎల్డీ) విజయం సాధించింది. పార్లమెంటులోని మొత్తం 664 స్థానాల్లో ప్రజలు ఎన్నుకోవడానికి కేటాయించినవి 476. అందులో ఎన్ఎల్డీ 346 గెల్చుకుందంటే సూకీపై ప్రజా విశ్వాసం చెక్కుచెదరలేదని అర్థం. అయిదు దశాబ్దాల సైనిక నియంతృత్వానికి ముగింపు పలుకుతూ అయిదేళ్లక్రితం జరిగిన ఎన్నికల్లో ఆమెకు ఇదే స్థాయిలో సీట్లు లభించాయి. ప్రభుత్వం ఏర్పర్చడానికి కావలసిన కనీస మెజారిటీ 322. పార్లమెంటులోని మిగిలిన స్థానాలకు సైనిక ప్రతినిధులుంటారు. సైన్యం వత్తాసువున్న యూనియన్ సాలిడారిటీ అండ్ డెవెలప్మెంట్ పార్టీ(యూఎస్డీపీ)కి 25 స్థానాలు మాత్రమే లభించాయి. ఈసారి దానికి కూడా ప్రభుత్వంలో చోటివ్వబోతున్నారు. పేరుకు మయన్మార్లో ప్రజాస్వామ్య వ్యవస్థ వున్నట్టు కనబడు తున్నా అది పూర్తిగా సైన్యంనీడలోనే మనుగడ సాగించాలి. ఏమాత్రం తేడా వున్నట్టు కనబడినా సైన్యం పంజా విసురుతుంది. ఎన్ఎల్డీ సాగించిన గత అయిదేళ్ల పాలన అంత సంతృప్తికరంగా ఏమీ లేదు. అందుకు ఆ ప్రభుత్వానికున్న పరిమితులే కారణం. అధ్యక్షుడు విన్ మింట్, ఉపాధ్యక్షుడు హెన్రీ వాన్ షియోలే చేతుల మీదుగా పాలన సాగినా వారు స్టేట్ కౌన్సెలర్గా వ్యవహరించే సూకీ మార్గదర్శకత్వంలోనే పనిచేస్తున్నారు. ఆమె పూర్తి స్థాయిలో అధ్యక్షురాలైతే పాలనపై తమ పట్టు జారుతుందన్న భయంతో సైన్యం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంది. విదేశీయుల్ని పెళ్లాడినా, విదే శాల్లో పుట్టిన పిల్లలున్నా అలాంటివారు అధ్యక్ష పీఠానికి అనర్హులవుతారంటూ 2008లో రూపొందిం చిన రాజ్యాంగంలో నిబంధన విధించారు. ఆ తర్వాతే 2015లో సైనిక పాలకులు ఎన్నికలకు సిద్ధపడ్డారు. అలాగే పార్లమెంటు మొదలుకొని కింది స్థాయి చట్టసభల వరకూ 75 శాతం స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగేలా, మిగిలిన 25 శాతం స్థానాల్లో సైన్యం నామినేట్ చేసేవారు సభ్యుల య్యేలా మరో నిబంధన పొందుపరిచారు. ఈ 25 శాతం స్థానాలకూ ఎన్నికలు జరగవు. రాజ్యాంగంలో మరో చిత్రమైన నిబంధన కూడా వుంది. హోంమంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, సరిహద్దు వ్యవహారాల మంత్రిత్వ శాఖలపై పూర్తి పెత్తనం సైన్యానిదే. ఈ నిబంధనల చక్ర బంధంలో ఏ ప్రభుత్వమైనా సవ్యంగా పాలన సాగించగలదా? గత అయిదేళ్లుగా ఎన్ఎల్డీ ప్రభుత్వం ఒకరకంగా అయోమయావస్థను ఎదుర్కొంది. అయితే ఇందుకు సూకీని కూడా తప్పుబట్టాలి. పరిస్థితులు సక్రమంగా లేవనుకున్నప్పుడు వాటిని మార్చడానికి పోరాడాలి. అందరినీ కూడగట్టి విజయం సాధించాలి. వాస్తవానికి సూకీ నేపథ్యం అటువంటిదే. బ్రిటిష్ జాతీయుణ్ణి పెళ్లాడి బ్రిటన్లో స్థిరపడిన సూకీ అస్వస్థురాలైన తల్లిని చూసేందుకు 1988లో మయన్మార్ వెళ్లినప్పుడు అక్కడి నిర్బంధ పరిస్థితులను నేరుగా చూశారు. పౌరజీవనాన్ని అస్తవ్యస్థం చేస్తున్న సైనిక పాలకులపై పోరాడేందుకు సిద్ధపడ్డారు. ఆమె నాయకత్వంలో సాగిన ప్రజాందోళనకు తలొగ్గి 1990లో సైనిక పాలకులు తొలిసారి ఎన్నికలు నిర్వహించారు. వారు ఎన్ని అవరోధాలు సృష్టించినా ఆమె నాయకత్వంలోని ఎన్ఎల్డీ 80 శాతం స్థానాలు చేజిక్కించుకుంది. ఫలితాలు వెలువడిన వెంటనే సైనిక పాలకులు ఎన్నికలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆమెను అరెస్టు చేశారు. మధ్యలో ఒకటి రెండుసార్లు విడుదల చేసినా ఆమెకు వస్తున్న మద్దతు చూసి బెంబేలెత్తి మళ్లీ మళ్లీ అరెస్టు చేసేవారు. అయిదేళ్ల జైలు జీవితం తర్వాత పదిహేనేళ్లపాటు ఆమె గృహ నిర్బంధంలో మగ్గారు. మధ్యలో అస్వస్థుడిగా వున్న తన భర్తను చూడటానికి బ్రిటన్ వెళ్తానన్నా ఆమెను అనుమతించలేదు. ఆమె ఆరోగ్యం క్షీణిస్తున్నదని వార్తలు వెలువడ్డాక అంతర్జాతీయంగా వచ్చిన వత్తిళ్ల పర్యవసానంగా తప్పనిసరై 2010లో ఆమెను విడుదల చేశారు. ఇలా సైన్యంపై ఇరవైయ్యేళ్లపాటు పోరాడి సైన్యం మెడలు వంచిన సూకీ... అధికారంలో కొచ్చాక మెతకగా వ్యవహరించడం మొదలెట్టారు. మైనారిటీలైన రోహింగ్యాలపై దారుణమైన హింసాకాండ అమలు చేస్తున్నా అదేమని ఖండించలేదు. వారి ఇళ్లు తగలబెట్టి, నరమేథం సాగిస్తున్నా, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా, రోహింగ్యాలు ప్రాణభయంతో దేశం విడిచివెళ్లేలా చేస్తున్నా ఆమె మౌనం వహించారు. పైగా రోహింగ్యాలదే తప్పన్నట్టు మాట్లాడారు. రోహింగ్యాలు, ఇతర మైనారిటీ వర్గాలు ఎక్కువగా నివసించే ప్రాంతాలైన రఖినే, కచిన్, కయిన్, బగోలను ‘ఘర్షణ ప్రాంతాలు’గా ముద్రేసి ఎన్నికలు నిలిపివేసినా ఆమె ప్రశ్నించలేదు. ఆ సంగతలావుంచి తాను అధ్య క్షురాలు కాకుండా అడ్డుపడుతున్న నిబంధనపైగానీ... కీలకమైన హోంశాఖ, రక్షణ శాఖ తదితరాలు సైన్యం చేతుల్లో ఉండటంపై గానీ ఆమె పోరాడ లేకపోయారు. ఒక్కమాటలో సర్దుకుపోయే మనస్తత్వాన్ని అలవాటు చేసుకున్నారు. నోబెల్ శాంతి బహుమతి పొందిన ఒకనాటి సూకీలో ఇంత మార్పేమిటని ప్రపంచ ప్రజానీకం విస్తుపోయే రీతిలో ఆమె వ్యవహరిస్తున్నారు. మయన్మార్ సైన్యం దుర్మార్గాల పర్యవసానంగా దేశం విడిచిన రోహింగ్యాల్లో మన దేశానికి 40,000 మంది, బంగ్లాదేశ్కు 10 లక్షలమంది వచ్చారు. ఇప్పటికీ దేశంలో 600 మంది రాజకీయ ఖైదీలున్నారు. పరస్పరం సంఘర్షించుకుంటున్న భిన్న తెగల మధ్య సఖ్యత తీసుకురావడానికి, వెనకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి ఎన్ఎల్డీ ప్రభుత్వం చెప్పుకోదగ్గ కృషి చేసింది. సైన్యం అకృత్యాలను చూసీచూడనట్టు వదిలేస్తున్నదన్న విమర్శలున్నా ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు అంతర్జాతీయంగా ప్రశంసలు పొందాయి. అక్కడ మన దేశం పెట్టుబ డులు కూడా గణనీయంగానే వున్నాయి. యధాప్రకారం అక్కడ పాగావేయాలని చైనా చూస్తోంది. ఈ విషయంలో మనం అప్రమత్తంగా వుండక తప్పదు. -
అధినేత్రి ఏ మంత్రిత్వశాఖ తీసుకుంటారు..?
నేపిదా: దేశంలో దశాబ్దాలపాటు సాగిన సైనిక పాలనకు మయన్మార్ లో తెరపడి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. అయితే సైనిక రాజ్యాంగం నిబంధనల వల్ల ఆంగ్ సాన్ సూచీ అధ్యక్ష పదవికి అనర్హురాలయ్యారన్న విషయం తెలిసిందే. 1962 తర్వాత మయన్మార్ కొత్త అధ్యక్షుడిగా ఆంగ్ సాన్ సూచీ ప్రధాన అనుచరుడు, గతంలో ఆమెకు డ్రైవర్గా పని చేసిన టిన్ క్వా(69) ఎన్నికయ్యారు. నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్డీ) అధినేత్రి, ఉద్యమ నాయకురాలు ఆంగ్ సాన్ నూతన ప్రభుత్వంలో ఏ పదవి స్వీకరిస్తారన్న దానిపై అక్కడ చర్చ జరగుతుంది. ఆమె విదేశాంగశాఖ మంత్రిగా బాధ్యతలు చేపడతారని ఎన్ఎల్డీ పార్టీ అధికార ప్రతినిధి జా మింట్ మాంగ్ పేర్కొన్నారు. ఆరుగురు క్యాబినెట్ సభ్యుల పేర్లను స్పీకర్ ఎదుట ప్రకటించారు. అయితే ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఎవరికి ఏ శాఖ దక్కుతుందో చెప్పలేము, కానీ ఆమెకు విదేశాంగశాఖ అప్పగిస్తే ఇతర మంత్రులతో కలిసి బాధ్యతలు నిర్వహించేందుకు వీలుగా ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. సైనిక మద్దతుగల ప్రస్తుత అధ్యక్షుడు థీన్ సేన్ స్థానంలో(పదవీకాలం ముగియడంతో) క్వా ఈ నెల 30న అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. అనంతరం ఆంగ్ సాన్ సూచీ ఏ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారో తెలుస్తుంది. -
ఆ ప్రజా వనితకు దేశ అధ్యక్ష పదవి?
నెపిడా: మయన్మార్ ప్రజస్వామిక ప్రతీక అంగ్ సాన్ సూకి మయన్మార్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టేందుకు ముందడుగు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అక్కడ ఆమెకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నట్లు రెండు వార్తా చానెళ్లు తెలిపిన కథనాలు స్పష్టం చేస్తున్నాయి. అంగ్ సాన్ సూకి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు రాజ్యాంగ పరంగా ఉన్న అడ్డంకిని తొలగించేందుకు అటు సూకి, ఆ దేశ మిలటరీ వర్గాల మధ్య సానుకూల చర్చలు జరిగినట్లు ఆ చానెళ్లు తెలిపాయి. గత ఏడాది నవంబర్ 8న మయన్మార్ లో జరిగిన ఎన్నికల్లో సూకి పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసి (ఎన్ఎల్డీ) భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సూకికి రాజ్యాంగపరంగా ఇబ్బంది కూడా ఉంది. ఆ రాజ్యాంగంలోని నిబంధన 59(ఎఫ్) విదేశీయులను భర్తగా చేసుకున్న ఓ వ్యక్తి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు అనుమతించదు. సూకి భర్త ఓ బ్రిటన్ దేశానికి చెందిన వాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా. మయన్మార్లో ప్రజాస్వామ్య బద్ధంగా ఉద్యమించడంలో సూకిది కీలక పాత్ర. ఆమెను ఓ గొప్ప వ్యక్తిగా ఆ దేశ ప్రజలు భావిస్తారు. కానీ, అలాంటి వ్యక్తికి తమను పాలించే అవకాశం లేకపోవడం కూడా అక్కడి ప్రజలకు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ దేశ ఉన్నత మిలటరీ విభాగంతో గత కొద్ది రోజులుగా జరుపుతున్న చర్చలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, రాజ్యాంగంలోని ఆ ఆర్టికల్ ను తొలగించేందుకు యోచన చేస్తున్నారని తెలిసింది. అయితే, సూకి అధ్యక్ష బాధ్యతల అంశంపై ఇప్పుడే అధికారికంగా ప్రకటన చేయడం తొందరపాటు చర్య అవుతుందని అక్కడి ఓ న్యాయ ప్రముఖుడు అన్నారు. -
సూచీ శకం ప్రారంభం!
-
సూచీ శకం ప్రారంభం!
♦ మయన్మార్ ఎన్నికల్లో ఆమె పార్టీకి పూర్తి మెజారిటీ! ♦ అధికార సైనిక కూటమికి చుక్కెదురు యాంగూన్: మయన్మార్ ఎన్నికల్లో ప్రతిపక్ష నేత, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత అంగ్సాన్ సూచీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఆఫ్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) చరిత్రాత్మక విజయం దిశగా దూసుకెళ్తోంది. మొదటి విడత సీట్లలో యాంగూన్లోని 57 పార్లమెంట్ స్థానాలకు గానూ 56 సీట్లను ఎన్ఎల్డీ గెలుచుకుంది. 44 దిగువ సభ స్థానాలను, 12 ఎగువ సభ స్థానాలను గెలుచుకున్నట్లు ఎన్ఎల్డీ ప్రకటించింది. ఒక పార్లమెంటు సీటును యూఎస్డీపీ గెలుచుకుంది. యాంగూన్ ప్రాంతీయ పార్లమెంటులోని 90 స్థానాలకు గానూ అత్యధికంగా 87 సీట్లలో ఎన్ఎల్డీ విజయం సాధించింది. మయన్మార్లో ప్రధాన ఎన్నికలతో పాటు ప్రాంతీయ పార్లమెంట్లకూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించారు. పూర్తిస్థాయి ఓట్ల లెక్కింపుకు 10 రోజుల సమయం పడ్తుందని ఆదివారం పోలింగ్ అనంతరం ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఫలితాల సరళి నేపథ్యంలో ఎన్ఎల్డీ పార్టీ కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఎర్ర చొక్కాలతో పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. దశాబ్దాల ప్రత్యక్ష, పరోక్ష సైనిక పాలన నుంచి స్వేచ్ఛ పొందబోతోందన్న ఉత్సాహం వారిలో కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 70% పైగా సీట్లను సాధించనున్నామని ఎన్ఎల్డీ అధికార ప్రతినిధి విన్ టీన్, 90% పైగా గెలుస్తామని మరో అధికార ప్రతినిధి న్యాన్ విన్ విశ్వాసం వ్యక్తం చేశారు. అధికారం చేపట్టేందుకు అందుబాటులో ఉన్న పార్లమెంటు సీట్లలో కనీసం 67% సీట్లను ఎన్ఎల్డీ గెల్చుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులోనూ అధికారం కోల్పోకుండా ఉండే ఉద్దేశంతో 25% సీట్లను అధికార యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ (యూఎస్డీపీ)కి కట్టబెడ్తూ రాజ్యాంగంలో రాసుకున్నారు. అందువల్ల మొత్తం 664 పార్లమెంట్ స్థానాల్లో కనీసం 67% సీట్లను ఎన్ఎల్డీ సాధించగలిగితేనే.. అధికార యూఎస్డీపీ, దాని సైనిక మిత్రపక్షాలను ఓడించగలుగుతుంది. గెలిచినా సూచీ అధ్యక్షురాలు కాలేరు ఈ ఎన్నికల్లో ఎన్ఎల్డీ గెలిచినా పార్టీ అధినేత అంగ్సాన్ సూచీ (70) దేశాధ్యక్షురాలు కాలేరు. మయన్మార్ రాజ్యాంగం ప్రకారం జీవిత భాగస్వామి విదేశీయులైనా, విదేశీ పౌరసత్వం గల పిల్లలున్నా.. ఆ వ్యక్తి దేశానికి అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలు కావడానికి వీల్లేదు. సూచీ దివంగత భర్త బ్రిటన్కు చెందిన వారు. ఆమె పిల్లలిద్దరికీ బ్రిటిష్ పౌరసత్వం ఉంది. ఎన్నికల్లో ఎన్ఎల్డీ గెలిస్తే.. అధ్యక్షురాలిగా కాకున్నా.. దేశ అత్యున్నత నాయకురాలిగా దిశానిర్దేశం చేస్తానని సూచీ స్పష్టం చేశారు.