కూంబింగ్ నిలిపివేశాం: ఏపీ డీజీపీ
విజయవాడ: మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ పోలీసుల అదుపులో లేరని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు చెప్పారు. ఏవోబీ ఎన్కౌంటర్ ఆర్కే లక్ష్యంగా జరగలేదని స్పష్టం చేశారు. ఏవోబీలో భారీ ఎత్తున మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం రావడంతో పోలీసు బలగాలు కూంబింగ్కు వెళ్లాయని, మావోయిస్టులు ఎదురుకావడం వల్లే ఎదురుకాల్పులు జరిగాయని డీజీపీ వివరించారు.
భారీ ఎత్తున అత్యాధునిక ఆయుధాలు లభించాయని, దీన్నిబట్టి అక్కడ మావోయిస్టు అగ్రనేతలు ఉండే అవకాశముందని డీజీపీ చెప్పారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో కూంబింగ్ నిలిపివేశామని తెలిపారు. ఆర్కే నుంచి మావోయిస్టులకు సమాచారం లేకపోవడం వల్లే పోలీసుల అదుపులో ఉన్నాడని ఆరోపిస్తున్నారని డీజీపీ సాంబశివరావు చెప్పారు.