మలిసంధ్యలో ఏదీ మనశ్శాంతి?
బనశంకరి: శరీరంలో శక్తి ఉన్నంతకాలం కుటుంబ ఉన్నతికి పాటుపడి మలిసంధ్యలో విశ్రాంతి తీసుకుందామనుకుంటే ఇంటి పోరు తప్పడం లేదు. ఇళ్లలో వృద్ధులపై దాడులు, వేధింపులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అశక్తులు కావడంతో అడ్డుకోలేక, దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడడమే వారికి మిగిలింది. హైటెక్ సిటీలో డబ్బు, ఆస్తి కోసం సంతానమే ఈ వేధింపులకు పాల్పడుతున్నారు. వృద్ధుల సహాయవాణి కేంద్రం గణాంకాలు ఈ చేదు నిజాల్ని బయటపెట్టాయి.
ఐదేళ్లలో 64 వేల ఫిర్యాదులు
సమస్యల్లో ఉన్న వృద్ధుల కోసం నైటింగేల్స్ వైద్యకీయ ట్రస్ట్ అనే ఎన్జీఓ కలిసి సహాయవాణి కేంద్రాన్ని ప్రారంభించింది. వృద్ధులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే సహాయవాణి 1090, లేదా టోల్ ఫ్రీ నంబరు 22943226కి చేయవచ్చు. గత ఐదేళ్లలో 64,455 ఫోన్ కాల్స్ అందాయి. ఇందులో వేధింపులు, నిర్లక్ష్యం, దౌర్జన్యాలకు సంబంధించి 1,717 ఫిర్యాదులు ఉన్నాయి. ఆస్తి కోసం దూషణ కేసులు 244 నమోదయ్యాయి. మౌఖికంగా 311 ఫిర్యాదులు వచ్చాయి.
నిరాదరణ, ఆస్తి కోసం దూషణలు
80 శాతం ఫిర్యాదులు నిరాదరణ, దౌర్జన్యం, డబ్బు లేదా ఆస్తికోసం డిమాండ్, వంచన, దూషణలకు గురవుతున్నట్లు ఉన్నాయి. గత 20 ఏళ్లలో 2.35 లక్షలమంది సీనియర్ సిటిజన్లు 1090 సహాయవాణిని సంప్రదించారు. 2021 మే నెల చివరికి 10,591 తీవ్రమైన ఫిర్యాదులు నమోదయ్యాయి. 69 శాతం కేసుల్లో బాధితులకు సహాయం అందించినట్లు సిబ్బంది తెలిపారు.
(చదవండి: రోగులపై ప్రత్యక్ష ప్రయోగాలొద్దు)