తిరుమల వెంకన్నకు సమైక్య సెగ
తిరుపతి : అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి సమైక్య సెగ తగిలింది. దాంతో వెంకన్న భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం అర్థరాత్రి నుంచి 24 గంటల పాటు తిరుపతి-తిరుమల మధ్య టాక్సీలను ప్రయివేట్ ట్రాన్స్పోర్ట్ జేఏసీ నిలిపివేసింది. ప్రయివేటు వాహనాలు నిలిచిపోవటంతో తిరుమలపై తీవ్ర ప్రభావం చూపింది.
ఆర్టీసీ కూడా పరిమితంగానే బస్సులను నడుపుతుండటంతో అలిపిరి బస్టాండ్ భక్తులతో కిటకిటలాడుతోంది. మరోవైపు అలిపిరి వద్ద ట్యాక్సీ యాజమాన్యాలు ప్రయివేట్ వాహనాలను నిలిపివేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఆర్టీసీ, ప్రయివేటు వాహనాలు నిలిచిపోవటంతో భక్తులు కాలినడకన తిరుమలకు చేరుకుంటున్నారు.
కాగా చిత్తూరు జిల్లావ్యాప్తంగా 18వ రోజు కూడా బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కాగా, పాఠశాలలు ఇంకా తెరుచుకోలేదు. ఇక ఏపీ ఎన్జీవోల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు అయిదో రోజుకు చేరుకున్నాయి. మున్సిపల్ కార్యాలయం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు 17వ రోజుకు చేరుకోగా, కేబుల్ ఆపరేటర్లు చేపట్టిన దీక్ష 12వ రోజుకు చేరింది. ఎస్వీయూలో దీక్షలు 13వ రోజుకు, రెవెన్యూ ఉద్యోగుల ఆధ్వరంలో చేపట్టిన దీక్షలు మూడో రోజుకు చేరాయి. విద్యుత్ కార్మికుల ఆధ్వర్యంలో ఎనిమిదో రోజుకు చేరగా, సిమ్స్, రుయా వద్ద దీక్షలు కొనసాగుతున్నాయి.