Pinnamaneni siddhartha Medical college
-
డ్రెయిన్లోకి దూసుకెళ్లిన కారు.. వైద్య విద్యార్థి దుర్మరణం
బాపట్లటౌన్: గుంటూరు జిల్లా బాపట్ల వద్ద పేరలి డ్రెయిన్లోకి ఆదివారం ఉదయం కారు దూసుకుపోయిన ప్రమాదంలో వైద్యవిద్యార్థి బీదవోలు శ్రీనిధిరెడ్డి (22) మృతిచెందారు. మరో ఏడుగురు వైద్యవిద్యార్థులు గాయపడ్డారు. వారిని మత్స్యకారులు రక్షించారు. కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలోని పిన్నమనేని సిద్ధార్థ వైద్యకళాశాలకు చెందిన ఎంబీబీఎస్ మూడో సంవత్సరం విద్యార్థులు యర్రబల్లి సాయికేశవ్ (కూకట్పల్లి, హైదరాబాద్), బీదవోలు శ్రీనిధిరెడ్డి (ఎల్బీనగర్, హైదరాబాద్), గునుపాటి ఉదయ్కిరణ్రెడ్డి (గుంటూరు), గంధం లీలాశంకర్ బ్రహ్మయ్య (భీమవరం), వీరమాచి భానుప్రకాష్ (నాగపూర్, మహారాష్ట్ర) ఒక గదిలో ఉంటున్నారు. వీరికి సీనియర్లయిన చింతపట్ల కీర్తిరావు, దేవరకొండ నిహారిక, కంబంపాటి సాయితులసి మరో గదిలో ఉంటున్నారు. వీరంతా సూర్యలంక బీచ్లో ఉదయించే సూర్యుడిని చూడాలని నిర్ణయించుకున్నారు. అందరూ కలిసి యర్రబల్లి సాయికేశవ్కు చెందిన కారులో శనివారం అర్ధరాత్రి 1.15 గంటలకు బయలుదేరి ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు సూర్యలంక తీరానికి చేరుకున్నారు. కొంతసేపు అక్కడున్నారు. విజయవాడలో మరో కార్యక్రమం ఉండటంతో తిరుగుపయనమయ్యారు. సూర్యలంక నుంచి బాపట్ల వైపు వస్తుండగా ఆదర్శనగర్ సమీపంలోని పేరలి డ్రైయిన్ బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి కారు ఒక్కసారిగా అదుపుతప్పింది. బీదవోలు శ్రీనిధిరెడ్డి నడుపుతున్న కారు రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి డ్రెయిన్లోకి దూసుకెళ్లింది. ఆ సమీపంలోని హోటల్లో టీ తాగేందుకు వచ్చిన ఆదర్శనగర్కు చెందిన మత్స్యకారులు కొక్కిలిగడ్డ నాగశ్రీను, సంగాని శేషు, చింతా లక్ష్మణ ఈ ప్రమాదాన్ని గమనించి వెంటనే డ్రెయిన్లోకి దూకి ఒక్కొక్కరిని ఒడ్డుకు చేర్చారు. గాయపడిన ఎనిమిదిమందినీ 108 సహాయంతో చికిత్స నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. అప్పటికే శ్రీనిధిరెడ్డి మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. కారును క్రేన్తో బయటకు తీయించిన రూరల్ సీఐ కె.శ్రీనివాసరెడ్డి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కారులో రెండు సెల్ఫోన్లు, ఒక బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురి ప్రాణాలు కాపాడిన మత్స్యకారులను సీఐ అభినందించారు. -
వైద్యరంగంలో మార్పులు రావాలి
చిన్న ఆవుటపల్లి (గన్నవరం రూరల్) : మెడికల్ గ్రాడ్యుయేట్ల వైద్య సమర్థతను పెంచేందుకు మార్పులు రావాలని మంత్రి కామినేని శ్రీనివాస్ ఆకాంక్షించారు. శనివారం డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆప్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఆప్టిమైజింగ్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ కాంపిటెన్సీ ఎస్ఎస్మెంట్ నేషనల్ సెమినార్ ఒమేగా–16ను ఆయన ప్రారంభించారు. ఈ సెమినార్లో దేశంలోని పలు యూనివర్సిటీలకు చెందిన వైస్ చాన్సలర్లు, ప్రొఫెసర్లు, వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సెమినార్ రికమండేషన్లను ప్రభుత్వానికి పంపాలని కోరారు. ప్రస్తుతం నడుస్తున్న కాంపిటెన్సీ అసెస్మెంట్లో మార్పుల కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ సెమినార్ల వల్ల సమర్థమైన వైద్యులు తయారవుతారన్నారు. ప్రభుత్వపరంగా అందరికీ వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆస్పత్రుల్లో ప్రసవాల శాతం నూరు శాతానికి చేరుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో 1400 ఆస్పత్రుల్లో ఉచిత రోగ నిర్ధారణ కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ సెమినార్ల వల్ల వైద్యరంగంలో చేపట్టబోయే నూతన ఆవిష్కరణలకు ఆలోచనలు వస్తాయని, మరిన్ని జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఉదయం నుంచి నిపుణుల ప్రసంగాలు కొనసాగాయి. ప్రొఫెసర్ ఐవీ రావు, రామనారాయణ్, సుధాకర్ నాయక్, సేతు రామన్, అనంత కృష్ణన్, బాల సుబ్రమనియన్, జి.ఈశ్వర్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ రావిరాజ్, కళాశాల డైరెక్టర్ జనరల్ డాక్టర్ సి.నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ మూర్తి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్వీ కృష్ణారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.