radar system
-
పాక్ రెక్కలు కత్తిరించాం
యుద్ధ విరమణకు కొద్ది గంటల ముందు దాయాదికి మన సైన్యం ఘనంగా లాస్ట్ పంచ్ ఇచ్చింది. ఏకంగా ఆరు కీలక పాకిస్తానీ వైమానిక స్థావరాలను నేలమట్టం చేసింది. వాటితో పాటు మరో రెండుచోట్ల రాడార్ వ్యవస్థలను కూడా ధ్వంసం చేసింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక వాటిపై అత్యంత కచ్చితత్వంతో కూడిన వైమానిక దాడులతో పాక్కు కోలుకోలేని నష్టం మిగిల్చింది. అత్యాధునిక వైమానిక స్థావరాలతో సహా పాక్లో ఏ ప్రాంతమూ సురక్షితం కాదని మరోసారి రుజువు చేసింది. ఎనిమిది కీలక సైనిక స్థావరాలపై జరిగిన దాడుల్లో ఏ ఒక్కదాన్నీ పాక్ సైన్యం కనీస స్థాయిలో కూడా అడ్డుకోలేకపోయింది. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. తమ దేశ భద్రత అక్షరాలా గాల్లో దీపమేనని మరోసారి తేలిపోయిందని పాక్ పౌరులు కూడా వాపోతున్నారు. సామాన్యులను వేధించడానికే తప్ప యుద్ధానికి తమ సైన్యం పనికిరాదంటూ అక్కడి నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సైన్యం కదలికలను అడ్డుకునేందుకే?పాక్కు చెందిన కీలక వైమానిక స్థావరాలపై భారత్ భారీ స్థాయిలో దాడికి వెనక ప్రబల కారణాలే ఉన్నట్టు చెబుతున్నారు. శనివారం ఉదయం నుంచే తన సైన్యాన్ని వీలైనంతగా భారత సరిహద్దులకు తరలించేందుకు పాక్ సిద్ధమైందని నిఘా వర్గాలు కేంద్రానికి సమాచారమిచ్చాయి. దాంతో ఉద్రిక్తతలను మరింత పెంచేందుకే పాక్ నిర్ణయించుకుందని స్పష్టమైపోయింది. దాంతో సైనిక తరలింపులను అడ్డుకోవడమే లక్ష్యంగా అప్పటికప్పుడు వైమానిక స్థావరాలను మన బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయి. అత్యాధునిక దీర్ఘశ్రేణి క్షిపణులు వాటిని గురి తప్పకుండా ఢీకొట్టి శిథిలాల దిబ్బలుగా మార్చేశాయి. తద్వారా పదాతి దళానికి అతి కీలకమైన వైమానిక దన్ను అందకుండా చేశాయి. అంతేగాక పాక్ యుద్ధ సన్నద్ధతపైనే చావుదెబ్బ కొట్టాయి. ‘‘ఈ పరిణామం వల్లే మరో గత్యంతరం లేక పాక్ కాళ్ల బేరానికి వచ్చింది. సాయంత్రానికల్లా కాల్పుల విరమణకు ఒప్పుకుంది’’ అని రక్షణ నిపుణులు చెబుతున్నారు.వైమానిక స్థావరాలుచకాలానూర్ ఖాన్ ఎయిర్బేస్గా పిలుస్తారు. పాక్ రాజధాని ఇస్లామాబాద్కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో రావల్పిండిలో ఆ దేశ సైనిక ప్రధాన కార్యాలయానికి ఆనుకుని ఉంటుంది. ఆ దేశానికి అత్యంత కీలకమైన వైమానిక స్థావరమిది. వాయుసేన కార్యకలాపాలతో పాటు వీఐపీల రవాణా తదితరాలు కూడా ఇక్కడినుంచే కొనసాగుతాయి. ప్రధాని తదితర అత్యున్నత స్థాయి రాజకీయ నాయకులు, అత్యున్నత సైనికాధికారుల ప్రయాణాలకు ఉపయోగించే ఆధునిక విమానాలకు ఇది విడిది కేంద్రం. సీ–130, ఐఎల్–78 విమానాలకు స్థావరం. పాక్ ఎయిర్ మొబిలిటీ కమాండ్కు ప్రధాన కేంద్రం కూడా. భారత్తో 1965, 1971 యుద్ధాల్లో ఈ బేస్ అత్యంత కీలక పాత్ర పోషించింది. భారత్పై జరిపిన డ్రోన్ దాడులను ఇక్కడినుంచే పర్యవేక్షించారు. సైనిక విమానాల ఏరియల్ రీ ఫ్యూయలింగ్, రవాణా తదితర కార్యకలాపాలకు ఇది ప్రధాన బేస్. పాక్ వైమానిక దళానికి చెందిన ఆరు అత్యాధునిక ట్రాన్స్పోర్ట్ స్క్వాడ్రన్లకు అడ్డా. అంతేగాక ఎయిర్ఫోర్స్లో చేరేవారికి పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చే పాక్ వైమానిక దళ (పీఏఎఫ్) కాలేజీ కూడా ఇక్కడే ఉంది. అంతేగాక పాక్ వైమానిక దళానికి అతి కీలకమైన ఎయిర్బార్న్ అర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ (ఏఈడబ్ల్యూఈ) ‘సాబ్ ఎరీఐ’ వ్యవస్థకు కేంద్రం. కనుక చకాలా బేస్ అత్యాధునిక రక్షణ వలయం నడుమ ఉంటుంది. అంత కీలకమైన ఎయిర్బేస్పైనే మన వైమానిక దళం భారీ ఎత్తున దాడి చేసి ధ్వంసం చేసింది. తద్వారా పాక్లో ఏ సైనిక స్థావరం కూడా సురక్షితం కాదని దాయాదికి స్పష్టమైన సందేశమిచ్చింది.రఫీకీపంజాబ్ ప్రావిన్స్లో జాంగ్ జిల్లాలోని షోర్కోట్లో ఇస్లామాబాద్కు 330 కి.మీ. దూరంలో ఉంటుంది. తొలుత షోర్కోట్ బేస్గా పిలిచేవారు. తర్వాత 1965 యుద్ధంలో మరణించిన స్క్వాడ్రన్ లీడర్ సర్ఫరాజ్ అహ్మద్ రఫీకీ పేరు పెట్టారు. చైనా నుంచి పాక్ కొనుగోలు చేసిన జేఎఫ్–17, మిరాజ్ వంటి అత్యాధునిక ఫైటర్ జెట్లు ఉండేదిక్కడే. వీటితోపాటు రవాణా తదితర అవసరాలకు వాడే సైనిక హెలికాప్టర్లకు కూడా రఫీకీ ఎయిర్బేస్ ప్రధాన కేంద్రం. ఇది సెంట్రల్ పంజాబ్లో అత్యంత వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. 10 వేల అడుగుల పొడవైన రన్వే, దానికి సమాంతరంగా ట్యాక్సీవే దీని ప్రత్యేకతలు. దాంతో ఇక్కడి యుద్ధ విమానాలు భారత సరిహద్దులపై దాడులకు అతి తక్కువ సమయంలో సన్నద్ధం కాగలవు. పాకిస్తాన్ రక్షణ నెట్వర్క్లో అతి కీలకమైన భాగమిది.మురీద్చక్వాల్ జిల్లాలో ఉన్న వైమానిక స్థావరం. పలు వైమానిక స్క్వాడ్రన్లకు కూడా నిలయం. దేశీయ షాపర్–1, తుర్కియే నుంచి తెచ్చుకున్న బైరక్తర్ టీబీ2, అకిన్సీ డ్రోన్లతో పాటు మానవ రహిత విమానాలు/యుద్ధ విమానాలు (యూఏవీ/యూసీఏవీ) తదితరాలకు కూడా ఇదే కేంద్రం. మూడు రోజులుగా భారత్పై జరిగిన దాడుల్లో కీలక పాత్ర పోషించింది. మనపైకి దూసుకొచ్చిన డ్రోన్లను ఇక్కడినుంచే ప్రయోగించారు. పాక్ డ్రోన్ వార్ఫేర్కు చక్వాల్ ప్రధాన కేంద్రంగా మారింది. డ్రోన్ల పర్యవేక్షణ, నిఘా సమాచార సేకరణతో పాటు దాడుల వంటివాటికి కూడా బేస్ ఇదే. డ్రోన్ల వాడకంలో సైనిక శిక్షణ కూడా ఇక్కడే ఇస్తుంటారు. మనపై డ్రోన్ దాడులకు ప్రతి చర్యగా మురీద్ ఎయిర్ బేస్ను సైన్యం లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసింది. మతిలేని దాడులకు గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది.రహీం యార్ఖాన్దక్షిణ పంజాబ్లో రహీం యార్ఖాన్ నగరంలోని వైమానిక స్థావరం. రాజస్తాన్ సరిహద్దులకు సమీపంలో ఉంటుంది. తూర్పు పాకిస్తాన్ మీదుగా మన సరిహద్దులపై దాడులకు అత్యంత అనువుగా ఉంటుంది. రాజస్తాన్లోని శ్రీగంగానగర్, జైసల్మేర్ వంటి పట్టణాలపై వైమానిక దాడులు ఇక్కడినుంచే జరిగాయి. ఇక్కడినుంచి పౌర విమానాల రాకపోకలు కూడా జరుగుతుంటాయి. మన వైమానిక దాడులతో ఈ బేస్తో పాటు ఇక్కడి రన్వే కూడా పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తోంది.సుక్కుర్భొలారీ ఎయిర్బేస్గా పిలుస్తారు. సింధ్ ప్రావిన్స్లో కరాచీ, హైదరాబాద్ నడుమ జంషోరో జిల్లాలో ఉంటుంది. పాక్కు జీవనాడి వంటి కరాచీ నగర రక్షణను కట్టుదిట్టం చేసే లక్ష్యంతో 2017లో ఈ ఎయిర్బేస్ను ఏర్పాటు చేశారు. సదరన్ ఎయిర్ కమాండ్ పరిధిలోకి వస్తుంది. ఆపరేషనల్ కన్వర్షన్ యూనిట్ తాలూకు 19 స్క్వాడ్రన్కు కేంద్రం. ఎఫ్–15ఏ, ఎఫ్–16, కొన్ని జేఎఫ్–17లతో పాటు ఏడీఎఫ్ యుద్ధ విమానాలకు విడిది కేంద్రం. పాక్ సైన్యం ఉపరితల ఆపరేషన్లకు అత్యవసరమైన లాజిస్టిక్ సపోర్ట్ తదితరాల్లో దీనిది కీలకపాత్ర. పాక్ వైమానిక స్థావరాలన్నింట్లోనూ అత్యాధునికమైనదిగా దీనికి పేరు. ఇక్కడ ఎస్ఏఏబీ 2000 ఎయిర్బార్న్ అర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టం (ఏఈడబ్ల్యూసీఎస్) ఉంది.రాడార్ కేంద్రాలుసియాల్కోట్పంజాబ్లోని సియాల్కోట్ వైమానిక కేంద్రంలో ఉంది. ఇక్కడ ఒక అంతర్జాతీయ విమా నాశ్రయం, మరో సైనిక విమానాశ్రయం ఉన్నాయి. ఇక్కడి రాడార్ కేంద్రం వైమానికంగా పాక్కు అతి కీలకమైనది. దాన్ని ధ్వంసం చేసిన నేపథ్యంలో ఇక్కడి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పౌర విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది.పస్రూర్ఇది కూడా పంజాబ్లోనే సియాల్కోట్ జిల్లాలో ఉంది. ఇక్కడి రాడార్ కేంద్రాన్ని కూడా మన వైమానిక దళం నేలమట్టం చేసింది.చునియన్పంజాబ్ ప్రావిన్స్లో లాహోర్కు 70 కి.మీ. దూరంలో చునియన్ వద్ద ఉంటుంది. పాక్లోని ప్రాథమిక వైమానిక స్థావరాల్లో ఒకటి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
చైనాకు చెక్.. పుతిన్తో భారత్ భారీ ఒప్పందం
ఢిల్లీ: భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రష్యా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో రాజ్నాథ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, రక్షణ సహాకారంపై చర్చించారు. రష్యా స్నేహితులకు భారత్ అన్నివేళలా అండగా నిలుస్తుందని రాజ్నాథ్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో రష్యాతో భారత ప్రభుత్వం భారీ రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది.రష్యా పర్యటనలో రాజ్నాథ్ సింగ్ కీలక ఒప్పందంపై చర్చించారు. రాడార్ వ్యవస్థకు సంబంధించిన భారీ రక్షణ ఒప్పందాన్ని రష్యాతో భారత్ కుదుర్చుకుంది. సుమారు నాలుగు బిలియన్ డాలర్ల ఖరీదైన ఒప్పందం తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. లాంగ్ రేంజ్ వార్నింగ్ రాడార్ వ్యవస్థ వోరోనెజ్ రాడార్(Radar Voronezh)ను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయనున్నది. ఆ ఒప్పందానికి చెందిన సంప్రదింపులు తుది దశలో ఉన్నట్లు భారత ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.దేశ రక్షణ విషయంలో కేంద్రం టెక్నాలజీని పెంచే ఉద్దేశంతో ముందడుగు వేసింది. మిస్సైల్ బెదిరింపుల్ని గుర్తించి, ట్రాక్ చేసేందుకు సామర్థ్యాన్ని పెంచుకోవాలని భారత్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే రాడార్ వ్యవస్థ కొత్త టెక్నాలజీపై ఫోకస్ పెట్టింది. అయితే, అల్మాజ్-ఆంటే కార్పొరేషన్ కంపెనీ వోరోనేజ్ రేడార్లను ఉత్పత్తి చేస్తున్నది. ఏరోస్పేస్ ఎక్విప్మెంట్, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిస్సైల్ సిస్టమ్స్, రేడార్ల ఉత్పత్తిలో ఆ సంస్థ అగ్రస్థానంలో ఉన్నది.Russia is talks to sell gigantic radar to india.Almaz-Antey’s Voronezh radar detects missiles, aircraft, and threats up to 6,000–8,000 km, supporting Russia’s missile defence network. pic.twitter.com/AmCWaX01Rs— Abhimanyu Manjhi (@AbhimanyuManjh5) December 10, 2024ఈ నేపథ్యంలోనే సుదీర్ఘ దూరం నుంచి క్షిపణుల కదలికల్ని రాడార్లతో పసికట్టేందుకు ఈ కొనుగోలు చేపట్టనున్నారు. అధునాతన రాడార్ వ్యవస్థ చైనా, దక్షిణ, మధ్య ఆసియా, హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఎక్కడి నుంచి అయినా ముప్పును గుర్తించగలదు. దాదాపు 8 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలిస్టిక్ క్షిపణులు, విమానాలను వోరోనేజ్ రాడార్ వ్యవస్థ గుర్తిస్తుందని అధికారులు అంటున్నారు. కొన్ని దేశాల వద్దే ఉన్న ఇలాంటి టెక్నాలజీని ఇప్పుడు భారత్ కూడా సొంతం చేసుకోనున్నట్లు రష్యా చెబుతోంది.ఇక, ఇటీవల అల్మేజ్-ఆంటే బృందం భారత్లో పర్యటించింది. మేకిన్ ఇండియాలో భాగంగా సుమారు 60 శాతం రాడార్ వ్యవస్థను భారతీయ కంపెనీల ఉత్పత్తులతోనే నిర్మించనున్నారు. కర్నాటకలోని చిత్రదుర్గలో దీన్ని ఇన్స్టాల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ అడ్వాన్స్డ్ డిఫెన్స్ , ఏరోస్పేస్ సౌకర్యాలు ఉన్నాయి. -
వాతావరణ సమాచారం ఇక నిరంతరం
సాక్షి, విశాఖపట్నం: కచ్చితమైన వాతావరణ అంచనాల్లో భారత వాతావరణ విభాగానికి (ఐఎండీకి) ప్రపంచ దేశాల్లో పేరుంది. ఇప్పుడు తాజాగా అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఐఎండీ మరింత ముందుకెళ్తోంది. వాతావరణ సమాచారాన్ని విస్తృతం చేయడంపైనా దృష్టిసారిస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా రాడార్ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ప్రస్తుతమున్న రాడార్ కేంద్రాలను ఆధునీకరించడంతోపాటు కొత్త రాడార్ కేంద్రాలను కూడా ఏర్పాటుచేస్తోంది. తూర్పు తీర ప్రాంతంలో అత్యదిక సామర్థ్యం కలిగిన ఎస్–బ్యాండ్ డాప్లర్ వెదర్ రాడార్ కేంద్రాలు విశాఖపట్నం, మచిలీపట్నం, చెన్నై, కోల్కతాల్లో ఉన్నాయి. వీటి పరిధి 500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఆయా కేంద్రాల పరిధిలో అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపాన్ల స్థితిగతులు, వాటి తీవ్రత, ప్రభావం, గమనం, గాలుల తీవ్రత, వర్షపాతం వంటి వాటిని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ద్వారా అంచనావేస్తూ ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారాన్ని తెలియజేస్తాయి. వాయుగుండాలు, తుపానులు తీరానికి ఎంత దూరంలో ఉన్నాయో, ఎంత ఎత్తులో ఉన్నాయో, ఎక్కడ తీరాన్ని దాటుతాయో గుర్తిస్తాయి. అంతేకాదు.. రాడార్ కేంద్ర స్థానం నుంచి 18 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న మేఘాల తీరుతెన్నులనూ రికార్డు చేస్తాయి. స్వదేశీ పరిజ్ఞానంతోనే.. ఈ నేపథ్యంలో.. ఐఎండీ ఇప్పుడు కోల్కతా, చెన్నై సహా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, మచిలీపట్నం డాప్లర్ వెదర్ రాడార్ కేంద్రాల ఆధునీకరణకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న డాప్లర్ రాడార్ పరికరాలు, యంత్ర సామగ్రికి బదులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యంత్ర పరికరాలను అమర్చనున్నారు. ప్రస్తుతం నడుస్తున్న డాప్లర్ రాడార్ స్టేషన్లు విదేశీ టెక్నాలజీతో ఏర్పాటుచేసినవే. అయితే, ఆధునీకరణలో భాగంగా ఏర్పాటయ్యేవి మాత్రం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనవే ఉండనున్నాయి. వీటిలో సింగిల్ యాంటెన్నాలకు బదులు డ్యూయెల్ పోలరైజ్డ్ యాంటెన్నాలు ఏర్పాటుచేస్తారని భావిస్తున్నారు. త్వరలో పాతవాటి స్థానంలో కొత్తవి అమర్చనున్నారు. ఇవీ ప్రయోజనాలు.. ప్రస్తుతమున్న డాప్లర్ వెదర్ రాడార్ కేంద్రాలు ప్రతి గంటకూ వాతావరణ సమాచారాన్ని అందిస్తున్నాయి. ఆధునీకరణలో భాగంగా కొత్త యంత్ర పరికరాలను ఏర్పాటుచేస్తారు. వీటితో ఇకపై నిరంతరం రాడార్ కార్యకలాపాలు కొనసాగుతాయి. ఫలితంగా అంతరాయం లేకుండా ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే వీలుంటుంది. అంతేకాదు.. వాతావరణ పరిస్థితులను బట్టి మరింత కచ్చితమైన సమాచారాన్ని తెలుసుకోవడానికి వినియోగించుకుంటారు. రెండు దశాబ్దాల క్రితం నాటివి.. నిజానికి.. విశాఖపట్నం, మచిలీపట్నం డాప్లర్ వెదర్ రాడార్ కేంద్రాలు దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటయ్యాయి. ఇప్పుడు వాటిలో పనిచేస్తున్న యంత్ర పరికరాలకు అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు వాటి స్థానంలో కొత్తవి అమరిస్తే మరి కొన్నేళ్లపాటు అవాంతరాల్లేకుండా కచ్చితత్వంతో కూడిన వాతావరణ సమాచారం నిరంతరం అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. -
‘రష్యా’కే టోకరా వేశాడు..
న్యూ ఢిల్లీలోని రష్యన్ రాయబార కార్యాలయాన్నే మోసగించి 42,500 అమెరికన్ డాలర్లు( రూ.28 లక్షలు) కొట్టేశాడో మోసగాడు. కార్యాలయంలో రాడార్ వ్యవస్థ ఏర్పాటుకు ఆన్లైన్ ద్వారా పనులు చేజిక్కించుకున్న గుంటూరు జిల్లాకు చెందిన కోరే రంగబాబు...ముందుగా డబ్బులు తీసుకుని పనులు చేయకుండా తప్పించుకోవడంతో రష్యన్ కార్యాలయ సెక్రటరీ తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన నగర పోలీసులు గుంటూరు జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతంలో రంగబాబును గుర్తించి పట్టుకున్నారు. గచ్చిబౌలి: న్యూఢిల్లీలోని రష్యన్ రాయబారి కార్యాలయంలో రాడార్ ఏర్పాటుకు ఆన్లైన్లో పనులు చేజిక్కించుకున్న వ్యక్తి మొత్తం డబ్బులు తీసుకుని పరారు కాగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని డబ్బు రికవరీ చేసినట్లు రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్లో వివరాలు వెల్లడించారు. న్యూ ఢిల్లీలోని రష్యన్ రాయబారి కార్యాలయంలో ఎస్ఐఆర్ గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ ఏర్పాటు కోసం 2016 మే నెలలో ఆన్లైన్ టెండర్లు పిలిచారు. సరూర్నగర్లోని కేఆర్బీ జీఈఐఓ సర్వీసెస్ సీఈఓగా వ్యవరిస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన కోరే రంగబాబు ఆన్లైన్ రాడార్ ఏర్పాటు టెండరు దాఖలు చేసి 42,500 అమెరికన్ డాలర్లు(రూ.28 లక్షలు)లకు కోట్ చేసి పనులు దక్కించుకున్నారు. మొత్తం డబ్బు తన ఖాతాలో జమ చేస్తేనే పనులను ప్రారంభిస్తానని చెప్పడంతో రష్యన్ ఫెడరేషన్ రాయబార కార్యాలయం సదరు మొత్తాన్ని రంగబాబు అకౌంట్లోకి బదిలీ చేసింది. జీఎస్టీ కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో మరికొంత డబ్బు కావాలని కోరగా, రష్యన్ అధికారులు అంగీకరించలేదు. దీంతో అతను పనులు ప్రారంభించకపోగా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో సదరు కార్యాలయం సెక్రెటరీ ఇగోర్ బోల్డిరేవ్ 2017 సెప్టెంబర్ 29న తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేయగా, సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హుడా కాలనీలో అతడికోసం గాలించగా ఆఫీస్ ఖాళీ చేసి వెళ్లినట్లు గుర్తించారు. గుంటూరులోని మారుమూల ప్రాంతంలో రంగబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు తీసుకున్న మొత్తాన్ని రష్యన్ ఫెడరేషన్ రాయబారి అకౌంట్లోకి జమ చేయించినట్లు తెలిపారు. దేశ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా రంగబాబు వ్యవహరించాడని కేసును దర్యాప్తు చేసిన డీసీపీ వెంకటేశ్వర్ రావు, ఏసీపీ వేణుగోపాల్, సీఐ రంగస్వామిలను సీపీ అభినందించారు. డబ్బు తిరిగి అకౌంట్లో జమ కావడంతో కోర్టులో కేసు ఉపసంహరించుకోనున్నట్లు తెలిపారు. చాలా మంది వద్ద డబ్బులు తీసుకొని మోసాలకు పాల్పడటం గొడవ చేస్తే డబ్బులు తిరిగి ఇవ్వడం రంగబాబుకు పరిపాటేనని పోలీసులు పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులకు ప్రశంస... సీపీ మహేశ్ భగవత్తో పాటు రష్యన్ ఫెడరేషన్ రాయబారి కార్యాలయం సెక్రెటరీ ఇగోర్ బోల్డిరేవ్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. రష్యన్ ఫెడరేషన్ రాయబారి నికోలాస్ కుదసెవ్ అభినందనలు తెలిపిన లేఖను చదివి వినిపించారు. తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేసిన తీరును ప్రశంసించినట్లు ఆయన పేర్కొన్నారు. -
రాజధానిలో రాడార్ వ్యవస్థ
సాక్షి, అమరావతి: జపాన్లో పరిశోధన చేసిన అత్యాధునిక రాడార్ వ్యవస్థను ఏపీ రాజధాని అమరావతిలో నెలకొల్పడానికి ఆ దేశానికి చెందిన సుమితోమో కార్పొరేషన్లోని తోషిబా గ్రూపు ముందుకు వచ్చింది. గురువారం అమరావతి అభివృద్ధి సంస్థ చైర్మన్ లక్ష్మీపార్థసాథిని ఈ బృందం అధికారులు కలుసుకున్నారు. ముందుగా లక్ష్మీపార్థసార«థి తోషిబా అధికారులకు రాజధాని అమరావతి భౌగోళిక వైవిధ్యం, అక్కడి సహజ వనరులు, రాజధాని బృహత్తర ప్రణాళికలను వివరించారు. అనంతరం తోషిబా ప్రతినిధులు భారీ వర్షాలను ముందే గ్రహించి వాటిని అదుపు చేయగల అత్యాధునిక సాంకేతిక పద్ధతితో రూపొందించిన రాడార్ వ్యవస్థలోని ప్రధాన అంశాలను చైర్పర్సన్కు వివరించారు. ఈ వ్యవస్థను మన వాతావరణానికి అనుసంధానం చేయవచ్చని వివరించారు. అలాగే రాడార్ ఏర్పాటుకు సాంకేతిక, ఆర్థిక సహకారం అందిస్తామని ప్రతిపాదించారు. దీనిపై లక్ష్మీపార్థసార«థి సంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతిలోని కొండవీటి వాగు వరద ముంపు నివారణకు ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. -
‘బరాక్ 8’ విజయవంతం
ముంబై: యుద్ధ నౌకల్లో ఉపయోగించే మరో క్షిపణిని భారత నేవీ విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి గగన తలంలోకి ప్రయోగించే 70 కిలోమీటర్ల పరిధి(రేంజ్) ఉన్న బరాక్ 8 క్షిపణిని ‘ఐఎన్ఎస్ కోల్కతా’ నౌకలో పరీక్షించింది. దీన్ని భారత్, ఇజ్రాయెల్ సంయుక్తంగా అభివృద్ధిపరిచాయి. ఉపరితలం నుంచి గగన తలంలోకి ప్రయోగించే క్షిపణుల్లో ఇది అత్యంత పరిధి కలిగి ఉందని నేవీ అధికారులు పేర్కొంటున్నారు. అరేబియా మహా సముద్రంలో మంగళవారం, బుధవారం రెండు క్షిపణులను విజయవంతంగా పరీక్షించినట్లు తెలిపారు. దీంతో పాటు క్షిపణులను గుర్తించి, ప్రమాదాలను పసిగట్టే రాడార్ వ్యవస్థను కూడా అభివృద్ధిపరిచారు. ఈ రాడార్ వ్యవస్థ ద్వారా 250 కిలోమీటర్లకు పైగా పరిధిలో వందలాది శత్రు క్షిపణులు, అనుమానాస్పద విమానాలు, డ్రోన్లను ఒకేసారి గుర్తించవచ్చు.