పాక్‌ రెక్కలు కత్తిరించాం | Pakistan air defence system destroyed by India | Sakshi
Sakshi News home page

పాక్‌ రెక్కలు కత్తిరించాం

May 11 2025 2:21 AM | Updated on May 11 2025 3:17 AM

Pakistan air defence system destroyed by India

మన లాస్ట్‌ పంచ్‌ అదిరింది 

వైమానిక, రాడార్‌ కేంద్రాలు నేలమట్టం

యుద్ధ విరమణకు కొద్ది గంటల ముందు దాయాదికి మన సైన్యం ఘనంగా లాస్ట్‌ పంచ్‌ ఇచ్చింది. ఏకంగా ఆరు కీలక పాకిస్తానీ వైమానిక స్థావరాలను నేలమట్టం చేసింది. వాటితో పాటు మరో రెండుచోట్ల రాడార్‌ వ్యవస్థలను కూడా ధ్వంసం చేసింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక వాటిపై అత్యంత కచ్చితత్వంతో కూడిన వైమానిక దాడులతో పాక్‌కు కోలుకోలేని నష్టం మిగిల్చింది. 

అత్యాధునిక వైమానిక స్థావరాలతో సహా పాక్‌లో ఏ ప్రాంతమూ సురక్షితం కాదని మరోసారి రుజువు చేసింది. ఎనిమిది కీలక సైనిక స్థావరాలపై జరిగిన దాడుల్లో ఏ ఒక్కదాన్నీ పాక్‌ సైన్యం కనీస స్థాయిలో కూడా అడ్డుకోలేకపోయింది. దీనిపై సోషల్‌ మీడియాలో మీమ్స్‌ వెల్లువెత్తుతున్నాయి. తమ దేశ భద్రత అక్షరాలా గాల్లో దీపమేనని మరోసారి తేలిపోయిందని పాక్‌ పౌరులు కూడా వాపోతున్నారు. సామాన్యులను వేధించడానికే తప్ప యుద్ధానికి తమ సైన్యం పనికిరాదంటూ అక్కడి నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సైన్యం కదలికలను అడ్డుకునేందుకే?
పాక్‌కు చెందిన కీలక వైమానిక స్థావరాలపై భారత్‌ భారీ స్థాయిలో దాడికి వెనక ప్రబల కారణాలే ఉన్నట్టు చెబుతున్నారు. శనివారం ఉదయం నుంచే తన సైన్యాన్ని వీలైనంతగా భారత సరిహద్దులకు తరలించేందుకు పాక్‌ సిద్ధమైందని నిఘా వర్గాలు కేంద్రానికి సమాచారమిచ్చాయి. దాంతో ఉద్రిక్తతలను మరింత పెంచేందుకే పాక్‌ నిర్ణయించుకుందని స్పష్టమైపోయింది. 

దాంతో సైనిక తరలింపులను అడ్డుకోవడమే లక్ష్యంగా అప్పటికప్పుడు వైమానిక స్థావరాలను మన బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయి. అత్యాధునిక దీర్ఘశ్రేణి క్షిపణులు వాటిని గురి తప్పకుండా ఢీకొట్టి శిథిలాల దిబ్బలుగా మార్చేశాయి. తద్వారా పదాతి దళానికి అతి కీలకమైన వైమానిక దన్ను అందకుండా చేశాయి. అంతేగాక పాక్‌ యుద్ధ సన్నద్ధతపైనే చావుదెబ్బ కొట్టాయి. ‘‘ఈ పరిణామం వల్లే మరో గత్యంతరం లేక పాక్‌ కాళ్ల బేరానికి వచ్చింది. సాయంత్రానికల్లా కాల్పుల విరమణకు ఒప్పుకుంది’’ అని రక్షణ నిపుణులు చెబుతున్నారు.

వైమానిక స్థావరాలు
చకాలా
నూర్‌ ఖాన్‌ ఎయిర్‌బేస్‌గా పిలుస్తారు. పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో రావల్పిండిలో ఆ దేశ సైనిక ప్రధాన కార్యాలయానికి ఆనుకుని ఉంటుంది. ఆ దేశానికి అత్యంత కీలకమైన వైమానిక స్థావరమిది. వాయుసేన కార్యకలాపాలతో పాటు వీఐపీల రవాణా తదితరాలు కూడా ఇక్కడినుంచే కొనసాగుతాయి. 

ప్రధాని తదితర అత్యున్నత స్థాయి రాజకీయ నాయకులు, అత్యున్నత సైనికాధికారుల ప్రయాణాలకు ఉపయోగించే ఆధునిక విమానాలకు ఇది విడిది కేంద్రం. సీ–130, ఐఎల్‌–78 విమానాలకు స్థావరం. పాక్‌ ఎయిర్‌ మొబిలిటీ కమాండ్‌కు ప్రధాన కేంద్రం కూడా. భారత్‌తో 1965, 1971 యుద్ధాల్లో ఈ బేస్‌ అత్యంత కీలక పాత్ర పోషించింది. భారత్‌పై జరిపిన డ్రోన్‌ దాడులను ఇక్కడినుంచే పర్యవేక్షించారు. సైనిక విమానాల ఏరియల్‌ రీ ఫ్యూయలింగ్, రవాణా తదితర కార్యకలాపాలకు ఇది ప్రధాన బేస్‌. పాక్‌ వైమానిక దళానికి చెందిన ఆరు అత్యాధునిక ట్రాన్స్‌పోర్ట్‌ స్క్వాడ్రన్లకు అడ్డా. 

అంతేగాక ఎయిర్‌ఫోర్స్‌లో చేరేవారికి పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చే పాక్‌ వైమానిక దళ (పీఏఎఫ్‌) కాలేజీ కూడా ఇక్కడే ఉంది. అంతేగాక పాక్‌ వైమానిక దళానికి అతి కీలకమైన ఎయిర్‌బార్న్‌ అర్లీ వార్నింగ్‌ అండ్‌ కంట్రోల్‌ (ఏఈడబ్ల్యూఈ) ‘సాబ్‌ ఎరీఐ’ వ్యవస్థకు కేంద్రం. కనుక చకాలా బేస్‌ అత్యాధునిక రక్షణ వలయం నడుమ ఉంటుంది. అంత కీలకమైన ఎయిర్‌బేస్‌పైనే మన వైమానిక దళం భారీ ఎత్తున దాడి చేసి ధ్వంసం చేసింది. తద్వారా పాక్‌లో ఏ సైనిక స్థావరం కూడా సురక్షితం కాదని దాయాదికి స్పష్టమైన సందేశమిచ్చింది.

రఫీకీ
పంజాబ్‌ ప్రావిన్స్‌లో జాంగ్‌ జిల్లాలోని షోర్‌కోట్‌లో ఇస్లామాబాద్‌కు 330 కి.మీ. దూరంలో ఉంటుంది. తొలుత షోర్‌కోట్‌ బేస్‌గా పిలిచేవారు. తర్వాత 1965 యుద్ధంలో మరణించిన స్క్వాడ్రన్‌ లీడర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ రఫీకీ పేరు పెట్టారు. చైనా నుంచి పాక్‌ కొనుగోలు చేసిన జేఎఫ్‌–17, మిరాజ్‌ వంటి అత్యాధునిక ఫైటర్‌ జెట్లు ఉండేదిక్కడే. వీటితోపాటు రవాణా తదితర అవసరాలకు వాడే సైనిక హెలికాప్టర్లకు కూడా రఫీకీ ఎయిర్‌బేస్‌ ప్రధాన కేంద్రం. ఇది సెంట్రల్‌ పంజాబ్‌లో అత్యంత వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. 10 వేల అడుగుల పొడవైన రన్‌వే, దానికి సమాంతరంగా ట్యాక్సీవే దీని ప్రత్యేకతలు. దాంతో ఇక్కడి యుద్ధ విమానాలు భారత సరిహద్దులపై దాడులకు అతి తక్కువ సమయంలో సన్నద్ధం కాగలవు. పాకిస్తాన్‌ రక్షణ నెట్‌వర్క్‌లో అతి కీలకమైన భాగమిది.

మురీద్‌
చక్వాల్‌ జిల్లాలో ఉన్న వైమానిక స్థావరం. పలు వైమానిక స్క్వాడ్రన్లకు కూడా నిలయం. దేశీయ షాపర్‌–1, తుర్కియే నుంచి తెచ్చుకున్న బైరక్తర్‌ టీబీ2, అకిన్సీ డ్రోన్లతో పాటు మానవ రహిత విమానాలు/యుద్ధ విమానాలు (యూఏవీ/యూసీఏవీ) తదితరాలకు కూడా ఇదే కేంద్రం. మూడు రోజులుగా భారత్‌పై జరిగిన దాడుల్లో కీలక పాత్ర పోషించింది. మనపైకి దూసుకొచ్చిన డ్రోన్లను ఇక్కడినుంచే ప్రయోగించారు. పాక్‌ డ్రోన్‌ వార్‌ఫేర్‌కు చక్వాల్‌ ప్రధాన కేంద్రంగా మారింది. డ్రోన్ల పర్యవేక్షణ, నిఘా సమాచార సేకరణతో పాటు దాడుల వంటివాటికి కూడా బేస్‌ ఇదే. డ్రోన్ల వాడకంలో సైనిక శిక్షణ కూడా ఇక్కడే ఇస్తుంటారు. మనపై డ్రోన్‌ దాడులకు ప్రతి చర్యగా మురీద్‌ ఎయిర్‌ బేస్‌ను సైన్యం లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసింది. మతిలేని దాడులకు గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది.

రహీం యార్‌ఖాన్‌
దక్షిణ పంజాబ్‌లో రహీం యార్‌ఖాన్‌ నగరంలోని వైమానిక స్థావరం. రాజస్తాన్‌ సరిహద్దులకు సమీపంలో ఉంటుంది. తూర్పు పాకిస్తాన్‌ మీదుగా మన సరిహద్దులపై దాడులకు అత్యంత అనువుగా ఉంటుంది. రాజస్తాన్‌లోని శ్రీగంగానగర్, జైసల్మేర్‌ వంటి పట్టణాలపై వైమానిక దాడులు ఇక్కడినుంచే జరిగాయి. ఇక్కడినుంచి పౌర విమానాల రాకపోకలు కూడా జరుగుతుంటాయి. మన వైమానిక దాడులతో ఈ బేస్‌తో పాటు ఇక్కడి రన్‌వే కూడా పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తోంది.

సుక్కుర్‌
భొలారీ ఎయిర్‌బేస్‌గా పిలుస్తారు. సింధ్‌ ప్రావిన్స్‌లో కరాచీ, హైదరాబాద్‌ నడుమ జంషోరో జిల్లాలో ఉంటుంది. పాక్‌కు జీవనాడి వంటి కరాచీ నగర రక్షణను కట్టుదిట్టం చేసే లక్ష్యంతో 2017లో ఈ ఎయిర్‌బేస్‌ను ఏర్పాటు చేశారు. సదరన్‌ ఎయిర్‌ కమాండ్‌ పరిధిలోకి వస్తుంది. ఆపరేషనల్‌ కన్వర్షన్‌ యూనిట్‌ తాలూకు 19 స్క్వాడ్రన్‌కు కేంద్రం. ఎఫ్‌–15ఏ, ఎఫ్‌–16, కొన్ని జేఎఫ్‌–17లతో పాటు ఏడీఎఫ్‌ యుద్ధ విమానాలకు విడిది కేంద్రం. పాక్‌ సైన్యం ఉపరితల ఆపరేషన్లకు అత్యవసరమైన లాజిస్టిక్‌ సపోర్ట్‌ తదితరాల్లో దీనిది కీలకపాత్ర. పాక్‌ వైమానిక స్థావరాలన్నింట్లోనూ అత్యాధునికమైనదిగా దీనికి పేరు. ఇక్కడ ఎస్‌ఏఏబీ 2000 ఎయిర్‌బార్న్‌ అర్లీ వార్నింగ్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టం (ఏఈడబ్ల్యూసీఎస్‌) ఉంది.

రాడార్‌ కేంద్రాలు
సియాల్‌కోట్‌
పంజాబ్‌లోని సియాల్‌కోట్‌ వైమానిక కేంద్రంలో ఉంది. ఇక్కడ ఒక అంతర్జాతీయ విమా నాశ్రయం, మరో సైనిక విమానాశ్రయం ఉన్నాయి. ఇక్కడి రాడార్‌ కేంద్రం వైమానికంగా పాక్‌కు అతి కీలకమైనది. దాన్ని ధ్వంసం చేసిన నేపథ్యంలో ఇక్కడి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పౌర విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది.

పస్రూర్‌
ఇది కూడా పంజాబ్‌లోనే సియాల్‌కోట్‌ జిల్లాలో ఉంది. ఇక్కడి రాడార్‌ కేంద్రాన్ని కూడా మన వైమానిక దళం నేలమట్టం చేసింది.

చునియన్‌
పంజాబ్‌ ప్రావిన్స్‌లో లాహోర్‌కు 70 కి.మీ. దూరంలో చునియన్‌ వద్ద ఉంటుంది. పాక్‌లోని ప్రాథమిక వైమానిక స్థావరాల్లో ఒకటి.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement