Refinery Plant
-
టెర్మినల్ నుంచి బంక్ దాకా ప్రతీ చుక్కకూ లెక్క!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహనంలో ఇంధనం కావాల్సి వస్తే సమీపంలోని ఫిల్లింగ్ స్టేషన్కు వెళతాం. పెట్రోల్ లేదా డీజిల్ కావాల్సినంత కొట్టించి డబ్బులు కట్టి బయటకు వస్తాం. ఇందులో కొత్తేమి ఉంది అనే కదా మీ సందేహం. అక్కడికే వస్తున్నాం.. ఎక్కడో తయారైన ఇంధనం వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి మనదాకా వస్తోంది. ఈ ప్రయాణంలో నాణ్యత, పరిమాణంలో ఎటువంటి రాజీ లేకుండా కస్టమర్కు కల్తీ లేని ఇంధనం చేరేందుకు చమురు కంపెనీలు, డీలర్లు నిరంతరం తీసుకుంటున్న చర్యల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? రిఫైనరీ నుంచి టెర్మినల్.. అక్కడి నుంచి ఫిల్లింగ్ స్టేషన్ (Filling Station). ఇలా వినియోగదారుడి వాహనంలోకి ఇంధనం చేరే వరకు కంపెనీల నిఘా కళ్లు వెంటాడుతూనే ఉంటాయన్న సంగతి చాలా మందికి తెలియదు. తేడా వస్తే రద్దు చేస్తారు.. చక్రం తిరిగితేనే వ్యవస్థ పరుగెడుతుంది. ఇంధన అమ్మకాలు పెరిగాయంటే ఆర్థిక వ్యవస్థ బాగున్నట్టు. అందుకే ఆయిల్ కంపెనీలు బాధ్యతగా వ్యవహరిస్తున్నాయి. సాంకేతికతను ఆసరాగా చేసుకుని దేశంలోని మారుమూలన ఉన్న పల్లెకూ నాణ్యమైన ఇంధనాన్ని చేర్చాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాయి. పరిమాణంలో తేడా రాకుండా న్యాయబద్ధంగా కస్టమర్ చెల్లించిన డబ్బులకు తగ్గట్టుగా ఇంధనం అందిస్తున్నాయి. పైగా ప్రభుత్వ నియంత్రణలోనే చమురు వ్యాపారాలు సాగుతుంటాయి. దీంతో రెవెన్యూ, పోలీసు, తూనికలు కొలతల శాఖకు చెందిన అధికారులు సైతం తనిఖీలు చేపడుతుంటారు. ఈ క్రమంలో ఏమాత్రం తప్పు జరిగినా ఆయిల్ కంపెనీలు కఠిన చర్యలకు దిగుతున్నాయి. ఫిల్లింగ్ స్టేషన్లో స్టాక్లో కొద్ది తేడా వచ్చినా భారీ జరిమానా లేదా డీలర్షిప్ రద్దుకు వెనుకాడడం లేదు. ఇంధనం రవాణా చేసే ఏజెన్సీలు చేతివాటం ప్రదర్శిస్తే బ్లాక్ లిస్టులో పెడతాయి. దేశవ్యాప్తంగా ఉన్న 88 వేల బంకుల్లో ఎక్క డో ఒక దగ్గర జరిగిన తప్పును మొత్తం పరిశ్రమకు ఆపాదించకూడదన్నది కంపెనీలు, డీలర్ల వాదన. ఫిల్లింగ్ స్టేషన్లలో ఇవి తప్పనిసరి → మంచి నీరు → వాష్ రూమ్స్ → ఫిర్యాదుల పుస్తకం → ఫస్ట్ ఎయిడ్ → ఫ్రీ ఎయిర్ కోసం టైర్ ఇన్ఫ్లేటర్ → సీసీ కెమెరాలు → ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఇసుకటెర్మినల్ నుంచి బంక్ దాకా.. అయిల్ కంపెనీకి చెందిన టెర్మినల్స్ నుంచి వివిధ ప్రాంతాల్లోని బంకులకు ఇంధనం సరఫరా అవుతుంది. ఇంధనం కేటాయించగానే సంబంధిత ఫిల్లింగ్ స్టేషన్ (బంక్) యజమానికి ఆయిల్ టెర్మినల్ నుంచి సందేశం వెళుతుంది. అలాగే ట్యాంకర్ బయలుదేరగానే, బంక్కు చేరిన వెంటనే మెసేజ్ వస్తుంది. టెర్మినల్ నుంచి బంక్ వరకు ట్యాంకర్ ప్రయాణాన్ని జీపీఎస్ (GPS) ఆధారంగా ట్రాక్ చేస్తారు. ఇచ్చిన రూట్ మ్యాప్లోనే ట్యాంకర్ వెళ్లాలి. మరో రూట్లో వెళ్లినట్టయితే తదుపరి లోడ్కు అవకాశం లేకుండా ఆ వాహన ఏజెన్సీని బ్లాక్ చేస్తారు. నిర్ధేశించిన ప్రాంతంలోనే డ్రైవర్లు భోజనం చేయాల్సి ఉంటుంది. మార్గ మధ్యలో వాహనం ఆపినా కారణం చెప్పాల్సిందే. ఇక బంక్ వద్దకు ట్యాంకర్ చేరగానే నిర్ధేశించిన స్థలంలో కాకుండా మరెక్కడైనా పార్క్ చేసినా ఫిల్లింగ్ స్టేషన్పై చర్యలుంటాయి. బంక్ యజమాని ఓటీపీ ఇస్తేనే ట్యాంకర్ తెరుచుకుంటుంది. అన్లోడ్ అయ్యాక ట్యాంకర్లో నిల్ స్టాక్ అని కంపెనీకి సమాచారం ఇవ్వాలి. ఫిల్లింగ్ స్టేషన్లో ఇలా.. బంకులోని ట్యాంకులో ఎంత ఇంధనం మిగిలి ఉంది, లోడ్ ఎంత వచ్చింది, అమ్మకాలు.. అంతా పారదర్శకం. గణాంకాలు అన్నీ ఎప్పటికప్పుడు కంపెనీ, డీలర్ వద్ద ఆన్లైన్లో దర్శనమిస్తాయి. ట్యాంకర్ తీసుకొచ్చిన స్టాక్లో తేడా ఉంటే ఇన్వాయిస్పైన వివరాలు పొందుపరిచి కంపెనీకి సమాచారం ఇవ్వాలి. ఇలా ప్రతీ చుక్కకూ లెక్క ఉంటుంది. మీటర్ తిరిగిన దానికి తగ్గట్టుగా బంకు ట్యాంకులో ఖాళీ కావాలి. స్టాక్లో తేడా 2 శాతం మించకూడదు. మించితే జవాబు చెప్పాల్సిందే. అంతేకాదు రూ.3 లక్షల వరకు పెనాల్టీ భారం తప్పదు. తరచుగా కంపెనీకి చెందిన సేల్స్ ఆఫీసర్ తనిఖీ చేస్తుంటారు. థర్డ్ పార్టీ నుంచి, అలాగే ఇతర ఆయిల్ కంపెనీల నుంచి కూడా తరచూ తనిఖీలు ఉంటాయి. ఆ మూడు సంస్థలదే.. దేశంలో మొత్తం ఇంధన రిటైల్ పరిశ్రమలో ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలైన బీపీసీఎల్, ఐవోసీఎల్, హెచ్పీసీఎల్ వాటా ఏకంగా 90% ఉంది. కంపెనీల వెబ్సైట్స్ ప్రకారం ఐవోసీఎల్కు 37,500లకుపైగా, బీపీసీఎల్కు 22,000ల పైచిలుకు, హెచ్పీసీఎల్కు 17,000 లకుపైగా ఫ్యూయల్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రైవేటు సంస్థలు జియో–బీపీ, నయారా, షెల్ సైతం ఈ రంగంలో పోటీపడుతున్నాయి. చదవండి: రోడ్డుపై, నీటిపై నడిచే వెహికల్దేశవ్యాప్తంగా నిర్వహణ మాత్రమే బంకుల యజమానులది. మౌలిక వసతుల ఏర్పాటు, మెషినరీ, ఇంధనంపై సర్వ హక్కులూ పెట్రోలియం కంపెనీలదేనని వ్యాపారులు చెబుతున్నారు. నిర్వహణకుగాను ప్రతి నెల డీలర్కు వేతనం కింద కంపెనీలు రూ.27,500 చెల్లిస్తున్నాయి. డీలర్లకు లీటరు పెట్రోల్ అమ్మకంపై రూ.3.99, డీజిల్పై రూ.2.51 కమిషన్ ఉంటుంది.వేగానికీ పరిమితులు.. ట్యాంకర్ గంటకు 60 కిలోమీటర్ల వేగాన్ని మించకూడదు. ఒక్క వాహనం నిబంధనలు అతిక్రమించినా ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీనే రద్దు చేస్తారు. టెర్మినల్ నుంచి సుదూర ప్రాంతంలో ఫిల్లింగ్ స్టేషన్ ఉన్నట్టయితే.. డ్రైవర్లకు భోజనానికి 45 నిముషాలు, టీ తాగడానికి 15 నిముషాలు సమయం ఇస్తారు. నిర్ధేశిత సమయం మించితే కంపెనీ నుంచి ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ యజమానికి మెయిల్, ఎస్ఎంఎస్ వెళుతుంది. ఆలస్యానికి కారణం తెలపాల్సిందే. రాత్రి 12 నుంచి ఉదయం 5 మధ్య రవాణా నిషేధం. వయబిలిటీ స్టడీలో లోపాలు.. మోసాలకు తావు లేకుండా కస్టమర్లకు నాణ్యమైన ఇంధనం అందుతోందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం ఇచ్చే ప్రకటనలో సంబంధిత ప్రాంతంలో ఇంత మొత్తంలో విక్రయాలు జరుగుతాయని కంపెనీ ఇచ్చే అంకెలకు, వాస్తవ అమ్మకాలకు భారీ వ్యత్యాసం ఉంటోంది. వయబిలిటీ స్టడీ సక్రమంగా జరగడం లేదు. ప్రకటన ఆధారంగా ముందుకొచ్చి బంక్ ఏర్పాటు చేసి నష్టాలు మూటగట్టుకుంటున్న యజమానులు ఎందరో. – మర్రి అమరేందర్ రెడ్డి, తెలంగాణ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్. బంకు యజమానులే బాధ్యులా? డ్రైవర్లు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా వర్షాకాలంలో ట్యాంకర్ లోపలికి నీరు చేరే అవకాశం ఉంది. ఇథనాల్ మిశ్రమంలో తేడాలున్నా సమస్యకు దారి తీస్తుంది. బంకుల్లోని ట్యాంకులు స్టీలుతో తయారయ్యాయి. తుప్పు పడితే ట్యాంకులో చెమ్మ చేరుతుంది. ఇదే జరిగితే ఆ నీరు కాస్తా బంకులోని ట్యాంకర్కు, అక్కడి నుంచి కస్టమర్ వాహనంలోకి వెళ్లడం ఖాయం. ఈ సమస్యకు పరిష్కారంగా హెచ్డీపీఈతో చేసిన ట్యాంకులను బంకుల్లో ఏర్పాటు చేయాల్సిందిగా విన్నవిస్తున్నా కంపెనీల నుంచి స్పందన లేదు. రవాణా ఏజెన్సీ తప్పిదం, మౌలిక వసతుల లోపం వల్ల సమస్య తలెత్తినా బంకు యజమానిని బాధ్యులను చేస్తున్నారు. – రాజీవ్ అమరం, జాయింట్ సెక్రటరీ, కన్సార్షియం ఆఫ్ ఇండియన్ పెట్రోలియం డీలర్స్. -
మరిన్ని అణ్వాయుధాలపై దృష్టి: కిమ్
సియోల్: ఉత్తరకొరియా మొట్టమొదటి సారిగా రహస్య యురేనియం శుద్ధి కేంద్రాన్ని బయటి ప్రపంచానికి చూపింది. ఆదేశాధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ ఇటీవల అణ్వాయుధాల తయారీలో వినియోగించే యురేనియం శుద్ధి కేంద్రాన్ని సందర్శించినట్లు అధికార కేసీఎన్ఏ తెలిపింది. ‘నిపుణుల కృషిని కిమ్ కొనియాడారు. పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా, మిత్ర దేశాల నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు మరిన్ని అణ్వాయుధాల అవసరం ఉంది. వీటి తయారీకి ప్రయత్నాలు సాగించాలంటూ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు’అని వెల్లడించింది. యురేనియం శుద్ధి కేంద్రంలోని పొడవైన బూడిదరంగు పైపుల వరుసల మధ్య కిమ్ తిరుగుతున్న ఫొటోలను కేసీఎన్ఏ బయటపెట్టింది. ఈ కేంద్రం ఎక్కడుంది? కిమ్ ఎప్పుడు పర్యటించారు? అనే వివరాలను మాత్రం పేర్కొనలేదు. అయితే, యోంగ్బియోన్లోని ప్రధాన అణుశుద్ధి కేంద్రమా కాదా అనే విషయాన్ని నిపుణులు పరిశీలిస్తున్నారు. ఫొటోల్లోని వివరాలను బట్టి ఉత్తరకొరియా సిద్ధం చేసిన అణు బాంబులు, శుద్ధి చేసిన ఇంధనం పరిమాణం వంటి అంశాలపై ఒక అంచనాకు రావచ్చని చెబుతున్నారు. ఉత్తరకొరియా మొదటిసారిగా 2010లో యోంగ్బియోన్ యురేనియం శుద్ధి కేంద్రాన్ని గురించిన వివరాలను వెల్లడించింది. -
Russia-Ukraine war: డోన్బాస్పై రష్యా సేనల గురి
కీవ్: ఉక్రెయిన్లోని మారియుపోల్ సిటీని విజయవంతంగా స్వాధీనం చేసుకున్న రష్యా దళాలు ఇక తూర్పున పారిశ్రామిక ప్రాంతమైన డోన్బాస్సై ప్రధానంగా గురిపెట్టాయి. క్షిపణుల వర్షం కురిపించాయి. అత్యాధునిక ఆయుధాలతో దాడికి దిగాయి. డోన్బాస్లో రష్యా అనుకూల వేర్పాటువాదులు అధికంగా ఉండడం పుతిన్ సైన్యానికి కలిసొచ్చే అంశమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు లుహాన్స్క్ ప్రావిన్స్లోని ముఖ్య నగరం సీవిరోడోంటెస్క్లో పాగా వేయడానికి రష్యా సేనలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. డోన్బాస్లో ఒక భాగమైన డోంటెస్క్ ప్రావిన్స్లోని స్లోవానిస్క్లో మళ్లీ దాడులు ప్రారంభిస్తామని రష్యా సైన్యం ప్రకటించింది. డోంటెస్క్లో శనివారం రష్యా బాంబు దాడుల్లో ఏడుగురు పౌరులు మరణించారని, మరో 10 మంది గాయపడ్డారని స్థానిక గవర్నర్ వెల్లడించారు. బొహోరోడిచిన్ గ్రామంలోని ఓ చర్చిలో తలదాచుకుంటున్న 100 మంది క్రైస్తవ మతాధికారులు, పిల్లలను అధికారులు ఖాళీ చేయించారు. ఇక్కడ రష్యా వైమానిక దాడులు సాగిస్తుండడమే ఇందుకు కారణం. మారియుపోల్ అజోవ్స్టల్ స్టీల్ప్లాంట్ నుంచి 2,500 మంది ఉక్రెయిన్ సైనికులను ఖైదీలుగా అదుపులోకి తీసుకున్నామని రష్యా స్పష్టం చేసింది. దీంతో సదరు సైనికుల కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తమ వారిని వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. త్వరగా ఈయూలో చేర్చుకోండి: జెలెన్స్కీ డోన్బాస్లో ప్రస్తుతం పరిస్థితి ఆందోళకరంగానే ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరించారు. ఆయన తాజాగా దేశ ప్రజలను ఉద్దేశించి వీడియో సందేశం విడుదల చేశారు. రష్యా సేనలను ఉక్రెయిన్ను దళాల కచ్చితంగా ఓడిస్తాయని పేర్కొన్నారు. రష్యా దండయాత్ర నేపథ్యంలో తమ దేశాన్ని సాధ్యమైనంత త్వరగా యూరోపియన్ యూనియన్(ఈయూ)లో చేర్చుకోవాలని జెలెన్స్కీ మరోసారి కోరారు. ఈ విషయంలో ఈయూలోని 27 సభ్యదేశాలు వెంటనే చొరవ తీసుకోవాలని విన్నవించారు. ఈయూలో ఉక్రెయిన్ చేరికకు కనీసం 20 ఏళ్లు పడుతుందని ఫ్రాన్స్ మంత్రి క్లెమెంట్ బ్యూనీ చెప్పారు. ఏడాది, రెండేళ్లలో ఈయూలో ఉక్రెయిన్ భాగస్వామి అవుతుందనడం ముమ్మాటికీ అబద్ధమేనన్నారు. సిరియా నుంచి బ్యారెల్ బాంబు నిపుణులు సిరియా నుంచి రష్యాకు మద్దతుగా 50 మంది బ్యారెల్ బాంబు నిపుణులు వచ్చినట్లు ఉక్రెయిన్ నిఘా వర్గాలు వెల్లడించాయి. వీరు తయారు చేసిన బాంబులు సిరియాలో పెను విధ్వంసం సృష్టించాయి. రష్యాకు అపజయమే: అండ్రెజ్ డుడా పోలండ్ అధ్యక్షుడు అండ్రెజ్ డుడా ఆదివారం కీవ్లో పర్యటించారు. ఉక్రెయిన్ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించారు. ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యాకు విజయం దక్కదని జోస్యం చెప్పారు. యుద్ధం ప్రారంభమయ్యాక ఉక్రెయిన్ పార్లమెంట్లో మాట్లాడిన తొలి విదేశీ నేత డుడానే. -
పెట్రోలియం రిఫైనరీలో అగ్నిప్రమాదం
ముంబై: ముంబైలోని భారత్ పెట్రోలియం శుద్ధి కర్మాగారంలో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 43 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో 22 మందికి ప్రాథమిక చికిత్స అనంతరం ఇంటికి పంపించామని, 21 మందిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించామని ఆరో జోన్ డిప్యూటీ కమిషనర్ షహజి ఉమాప్ తెలిపారు. తూర్పు ముంబైలోని చెంబూర్లోని కర్మాగారంలో మధ్యాహ్నం సంభవించిన పేలుడు కారణంగా మంటలు చెలరేగాయి. హైడ్రోక్రాకర్ ప్లాంట్లోని కంప్రెషర్ షెడ్ల వేడి, ఒత్తిడి వల్ల పేలుడు సంభవించినట్లు సంస్థ తెలిపింది. -
ముంబైలోని పెట్రోలియం రిఫైనరీలో అగ్నిప్రమాదం
ముంబై: దేశ ఆర్థిక రాజధానిలో భారత్ పెట్రోలియం శుద్ధి కర్మాగారంలో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 43 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో 22 మందికి ప్రాథమిక చికిత్స అనంతరం ఇంటికి పంపించామని, 21 మందిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించామని ఆరో జోన్ డిప్యూటీ కమిషనర్ షహజి ఉమాప్ తెలిపారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తూర్పు ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో ఉన్న కర్మాగారంలో మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో సంభవించిన పేలుడు కారణంగా మంటలు చెలరేగాయి. తొమ్మిది ఫైర్ ఇంజన్లు, రెండు ఫోమ్ ఇంజన్లు, రెండు జంబో ట్యాంకర్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. హైడ్రోక్రాకర్ ప్లాంట్లోని కంప్రెషర్ షెడ్ల వేడి, ఒత్తిడి వల్ల పేలుడు సంభవించినట్లు సంస్థ తెలిపింది. పేలుడు ధాటికి రిఫైనరీకి 500 మీటర్ల పరిధిలో గల భవనాల అద్దాలు పగిలిపోయినట్లు స్థానికులు చెప్పారు. -
కాకినాడ - విశాఖ మధ్యలో హెచ్పీసీఎల్ రిఫైనరీ
* 15 మిలియన్ టన్నులసామర్థ్యంతో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ * భాగస్వామ్య కంపెనీతో త్వరలో ఒప్పందం * అక్టోబర్లో ఇండియా కెమ్ 2014 ఎగ్జిబిషన్ * కేంద్ర రసాయనాలు, పెట్రోకెమికల్స్ * కార్యదర్శి ఇంద్రజిత్ పాల్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాకినాడ-విశాఖ మధ్యలో హిందుస్థాన్ పెట్రోలియం(హెచ్పీసీఎల్) కొత్త రిఫైనరీ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే విశాఖపట్నంలో ఉన్న రిఫైనరీని విస్తరించడంతో పాటు కొత్తగా మరో రిఫైనరీని ఏర్పాటు చేయడానికి పనులు వేగంగా జరుగుతున్నట్లు కేంద్ర రసాయనాలు, పెట్రోకెమికల్స్ కార్యదర్శి ఇంద్రజిత్ పాల్ తెలిపారు. 15 మిలియన్ టన్నుల సామర్థ్యంతో గ్రీన్ఫీల్డ్ రిఫైనరీని ఏర్పాటు చేయడానికి సాధ్యాసాధ్యాలకు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక తయారవుతోందని, వచ్చే ఒకటి రెండు నెలల్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందన్నారు. మరో కంపెనీతో కలిసి ఈ రిఫైనరీ ఏర్పాటు చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు పాల్ తెలిపారు. హెచ్పీసీఎల్కి ఇప్పటికే వైజాగ్లో ఉన్న రిఫైనరీ సామర్థ్యాన్ని పెంచుతోంది. రిఫైనరీ ఏర్పాటుకు సంబంధించి భూమి, తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో హెచ్పీసీఎల్ చర్చలు జరుపుతోందని, గెయిల్తో కలిసి ఈ రిఫైనరీ ఏర్పాటు జరగవచ్చని కంపెనీకి చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇండియాకెమ్ 2014 పేరుతో అక్టోబర్ 9 నుంచి 11 వరకు జరిగే ఎగ్జిబిషన్కు సంబంధించి వివరాలను తెలియచేయడానికి గురువారం హైదరాబాద్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్ మాట్లాడుతూ కొత్త కెమికల్ పాలసీని త్వరలోనే కేంద్రానికి సమర్పించనున్నట్లు తెలిపారు. దేశీయంగా రసాయనాల ఉత్పత్తి పెంచడం ద్వారా ఎగుమతి, దిగుమతుల మధ్య వున్న వ్యత్యాసాన్ని తగ్గించడం ఈ పాలసీ ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం వార్షిక ఎగుమతుల విలువ రూ. 1.78 లక్షల కోట్లు వుండగా, రూ. 2.34 కోట్ల దిగుమతులు జరుగుతున్నాయి. ఈ ఎగ్జిబిషన్లో 13 దేశాలకు సంబంధించిన 274 మంది పాల్గొంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జె.ఎస్.వి. ప్రసాద్ మాట్లాడుతూ విశాఖ కాకినాడ పెట్రోకెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ పెట్టుబడులకు అనువైనదని ఇప్పటికే 6,000 ఎకరాలను ప్రభుత్వం సేకరించిందన్నారు. ఈ రీజియన్లో రెండు ఫార్మా సెజ్లతో పాటు నాలుగు ఆర్థిక మండళ్లు ఉన్నట్లు ఆయన తెలిపారు.