Registration of the series
-
టీఎస్ 03వచ్చేసింది!
సిరీస్ను విడుదల చేసిన అధికారులు మొదటి రోజు 33 రిజిస్ట్రేషన్లు.. 23 ఫ్యాన్సీ నంబర్లకు రిజర్వేషన్ తెలంగాణ సిరీస్ రావడం ఆనందంగా ఉందన్న వాహనదారులు ఖిలా వరంగల్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో వాహనాల రిజిస్ట్రేషన్ సిరీస్ కూడా మారింది. ఏపీ సిరీస్ పోయి.. టీఎస్ సిరీస్ వచ్చింది. కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం మన జిల్లాకు ‘టీఎస్ 03’ కేటారుయించగా.. అధికారులు బుధవారం నుంచి కొత్త సిరీస్ ప్రకారం వాహనాల రిజిస్ట్రేషన్ను ప్రారంభించారు. వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో రవాణా శాఖ ఉప కమిషనర్(డీటీసీ) మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ కొత్త నంబర్లను విడుదల చేశారు. జిల్లాలో మొదటి నెంబర్ ‘టీఎస్ 03 ఇఏ-0001’ను వాల్గో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ సీఈఓ అయిన హన్మకొండ వాసి గుంటి శ్రీధర్రావు దక్కించుకున్నారు. ఆ ఫ్యాన్సీ నంబర్ను శ్రీధర్రావుకు డీటీసీ అందజేశారు. ఈ సందర్భంగా డీటీసీ మాట్లాడుతూ కొత్త సిరీస్తో మొదటిరోజు 33 మంది వాహనదారులు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని, దీంతో పాటు 23 ఫ్యాన్సీ నంబర్లకు రిజర్వేషన్ చేసుకున్నారని వివరించారు. టీఎస్03 సీరీస్కు మొదటిరోజు రూ. 2.63లక్షల ఆదాయం వచ్చిందని ఆయన వెల్లడించా రు. పాత వాహనాలకు మాత్రం ఏపీ 36 సీరిస్ కొద్దిరోజుల పాటు యథావిధిగా కొనసాగనుందని తెలి పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఎంవీఐలు జయకుమార్, కొండల్రావు, రాంచందర్, సత్యనారాయ ణ, కార్యాల సిబ్బంది వాహనదారులు పాల్గొన్నారు. వాహనదారుల్లో కొత్త ఉత్సాహం టీఎస్ సిరీస్ కోసం వచ్చిన వాహనదారులతో వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. కొత్త రాష్ట్రంలో .. కొత్త వాహనాలతో.. కొత్త నెంబర్లతో వాహనదారులు ఆనందంలో ము నిగిపోయూరు. ఇప్పటికే చాలామంది కొత్త వాహనా లు కొనుగోలు చేసినా కూడా తెలంగాణ రాష్ట్ర సిరీస్ కోసం ఎదురుచూశారు. బుధవారం కొత్త నెంబర్లకు ఆర్టీఏ పచ్చజెండా ఊపడంతో ఆర్టీఏ కార్యాల యం వాహనదారులతో కిక్కిరిసిపోయింది. అయితే మొదటిరోజు టీఎస్ సిరీస్లో ఫ్యాన్సీ నంబర్ల కోసం సైతం వాహనదారులు పోటీపడ్డారు. కొంతమంది ఏకంగా ఎన్నిడబ్బులైనా చెల్లిస్తాం.. మాకు ఫ్యాన్సీ నంబర్ కేటాయించాలని విజ్ఞప్తి చేసుకున్నారు. నా అదృష్ట సంఖ్య 03 దక్కించుకున్నా.. తెలంగాణ రాష్ర్టంలో జిల్లాకు కేటాయించిన టీఎస్03కావడమే కాకుండా నా అదృష్ట సంఖ్య 3 నంబర్ నాకు దక్కడం ఆనందంగా ఉంది. ఈ ఫ్యాన్సీ నంబర్ కోసం కొన్ని రోజులుగా ఎదురుచూసిన. - తోట సునీల్, వరంగల్ టీఎస్ సిరీస్లో 6 నంబర్ గురించి ఎంతో కలగన్నాం 60 ఏళ్ల కల నెరవేరిన నేపథ్యంలో వాహనాలకు కూడా ఏపీ సిరీస్పోయి టీఎస్ సిరీస్ రావడం చాలా సంతోషంగా ఉంది. 6 మా లక్కీ నంబర్. దీని కోసం చాలా రోజులు ఎదురు చూశాం. ఆర్టీఏ అధికారులు మాకు టీఎస్03ఇఎ006 నంబర్ కేటాయించడం ఆనందంగా భావిస్తున్నాం. - ఎర్రబెల్లి స్వర్ణ, వరంగల్ నగర మాజీ మెయర్ ఆరు నెలలుగా ఎదురు చూస్తున్నా ఇరవైరోజుల క్రిత మే వాహనం కొన్నాను. టీఎస్ సిరీస్లో కొత్త ఫ్యాన్సీ నెంబర్ టీఏస్ 03ఇఎ0036 కోసం ఇన్ని రోజులు ఆగాను. ఆలస్యం అయినా కూడా నాకు మంచి అదృష్ట నంబర్ దక్కింది. -శ్రీనివాస్, ఏకశిలనగర్ తొలి నంబర్ TS 03 EA 0001 దక్కించుకున్న హన్మకొండ వాసి శ్రీధర్రావు టీఎస్ సిరీస్లో తొలి నంబర్ ‘టీఎస్ 03ఇఎ0001’ ను హన్మకొండకు చెందిన గుంటి శ్రీధర్రావు దక్కించుకున్నారు. కొత్త రాష్ట్రంలో కొత్త ఫ్యాన్సీ నంబర్ రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ నంబర్ కోసం నెలరోజులగా ఎదురు చూస్తున్నానని, జిల్లాలోనే మొదటి నంబర్ రావడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన చెప్పారు. -
కొత్త రాష్ట్రం.. కొత్త సిరీస్!
ఖమ్మం మయూరిసెంటర్, న్యూస్లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో వాహనాల రిజిస్ట్రేషన్ల సిరీస్ కూడా మారనుంది. ఇప్పటివరకు ఏపీ 20 సిరీస్తో ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్లు ఇకనుంచి టీజీ 08 పేరున జరుగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర అపాయింటెడ్ డే అయిన జూన్ 2 నుంచి ఈ సిరీస్ అమలవుతుందని ఆర్టీఏ అధికారులు చెపుతుండగా, తెలంగాణ ప్రభుత్వ అధికారిక లోగో ఆలస్యమయితే మరికొన్ని రోజులు వాయిదా పడే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అయితే, కొత్త సిరీస్ అమల్లోకి వచ్చిన తర్వాత అవిభక్త ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాహనాలకు మాత్రం పాత నంబర్లే కొనసాగనున్నాయి. (వాహనదారుల ఇష్టం మేరకు మార్చుకోవాలనుకుంటే మళ్లీ రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది) కాగా, ఈ కసరత్తు కోసం అన్ని జిల్లాల ఆర్టీఓలతో సోమవారం రవాణా శాఖ కమిషనర్ హైదరాబాద్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా నుంచి ఆర్టీఏ మోహిమీన్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఎన్ని వాహనాలు ఉన్నాయి. వాటిలో పర్మిట్లు ఉన్న వాహనాలు ఎన్ని...లేని వాటికి ఎంత సమయం పడుతుంది? అనే విషయాలపై సమావేశంలో చర్చ జరిగినట్టు తెలిసింది. లోగో ఆలస్యం అయితే... అయితే, జిల్లాలకు ఇంకా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన లేబుళ్లు, రాష్ట్రం లోగో, ఆర్సీ బుక్లు, సీ బుక్లు, అన్ని లెసైన్స్లకు కావలసిన లోగోలు ఇంకా పూర్తి స్థాయిలో రాలేదని, దీంతో కొత్త రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని సమాచారం. అప్పటి వరకు పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగిస్తారు. టీజీ 08 వచ్చే వరకు జిల్లాల్లో టీజీ అనే బ్లాంక్తో రిజిస్ట్రేషన్లు చేస్తారు. పూర్తి స్థాయిలో నంబర్ వచ్చిన తరువాత వాహనాలకు కేటాయిస్తారు. జిల్లాలోని ఆశ్వారావుపేట, కల్లూరుల్లో కొత్తగా చెక్పోస్టుల ఏర్పాటుకు ఇప్పటికే అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అయితే, అధికారికంగా ఇంకా ఉత్తర్వులు రావాల్సి ఉంది. జిల్లాలో రవాణా శాఖ కింద ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు. ఏఏ ప్రాంతం చెందినవారు ఎంత మంది? అనే వివరాలతో పాటు వాహనాల రిజిస్ట్రేషన్ వివరాలు, శాఖకు ఉన్న ఆస్తులు, ఆదాయం ఇతర వివరాలను ఆ శాఖ అధికారులు 15 రోజుల క్రితమే ప్రభుత్వానికి అందజేశారు.