Revenue recovery
-
వడపోత తర్వాతే రుణమాఫీ
ఏపీ సర్కారుకు కోటయ్య కమిటీ నివేదిక బోగస్ అఫిడవిట్ ఇస్తే 18 శాతం వడ్డీతో రికవరీకి సూచన హైదరాబాద్: రైతు రుణాల మాఫీకి వడపోత విధానం అవలంబించాలని కోటయ్య కమిటీ సూచించింది. కాకుండా బోగస్ అఫిడవిట్లు ఇచ్చి న రైతులపై రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించాలని పేర్కొంది. వ్యవసాయ, మహిళా సంఘాల రుణాల మాఫీపై కోటయ్య కమిటీ సోమవారం 67 పేజీలతో కూడిన తుది నివేదికను ఏపీ సీఎం చంద్రబాబుకు సమర్పించింది. ఆ నివేదికలో ఆర్బీఐతో జరిపిన చర్చలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆయా రంగాల రుణాలు, నిధుల సమీకరణ, రుణ మాఫీకి అర్హులు, అనర్హులు, దరఖాస్తు వంటి అంశాలను పేర్కొంది. మొత్తం వ్యవసాయ రుణాలు ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.87,612.25 కోట్లు ఉన్నట్లు నివేది కలో పేర్కొన్నారు. ఇందులో పంట, బంగారం రుణాలు రూ.60,659.44 కోట్లు ఉన్నాయి. 7,72,412 మహిళా సంఘాల పేరు మీద మార్చి నెలాఖరు నాటికి రూ.13,764 కోట్ల రుణాలున్నాయి. లక్ష రూపాయల వరకు మహిళా సంఘాల రుణమాఫీని వర్తింప చేస్తే రూ.7,724 కోట్లు అవుతుంది. షరతులు విధిం చడం ద్వారా మొత్తం రుణ మాఫీని రూ.33 వేల కోట్లకు పరిమితం చేయాలని కోటయ్య కమిటీ పేర్కొంది. చేనేత రూ.168 కోట్లను, గొర్రెలు, మేకలు, పందుల కోసం తీసుకున్న రుణాలకు రుణ మాఫీ వర్తింప చేయాలని కోటయ్య కమిటీ సూచించింది. నివేదికలోని ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి. పంట రుణాలు, బంగారం రుణాలు, పంట తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు, రైతు మిత్ర గ్రూపులు, సంయుక్త రైతుల రుణాలకు, కిసాన్ క్రెడిట్ దారుల రుణాలకు. స్వల్ప కాలిక రుణాలను మధ్యకాలిక రుణంగా మార్చిన రుణాలకు రుణ మాఫీ వర్తింపు.కుటుంబం యూనిట్గా రుణమాఫీ అమలు. కుటుంబంలో ఎంతమంది రుణాలు ఎన్ని బ్యాంకుల్లో తీసుకున్నా రుణ పరిమితికి లోబడి మాత్రమే రుణ మాఫీ వర్తింపు. కుటుంబం అంటే భార్యా, భర్త, మైనర్ పిల్లలు. ఏ రుణం అయినా రుణ పరిమితికి మించి ఆ కుటుంబంలో జరగదు.ఈ ఏడాది మార్చి వరకు ఉన్న రుణాలకు సంబంధించి ప్రతీ కుటుంబం దరఖాస్తుతోపాటు ఆయా కుటుంబసభ్యుల పేరిట ఎంత రుణం ఉందో అఫిడవిట్ను సమర్పించాలి. తప్పుడు అఫిడవిట్ ఇస్తే వారిపై చర్యలు తీసుకోవాలి. 18 శాతం వడ్డీతో తిరిగి రాబట్టాలి.బ్యాంకు ఖాతాలకు రైతు ఆధార్, పాసుపుస్తకం నంబర్ల అనుసంధానం -
ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీపై ఆర్ఆర్యాక్ట్
సాక్షి, నెల్లూరు : జిల్లాలోని పొదలకూరు మండలం ప్రభగిరిపట్నం వద్ద ఉన్న ఎన్సీఎస్ చెక్కర ఫ్యాక్టరీ 2012-13 సంవత్సరానికి సంబంధించి రైతులకు చెల్లించాల్సిన సుమారు రూ.14 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో ప్రభుత్వం రెవెన్యూ రికవరీ చట్టం (ఆర్ఆర్ యాక్ట్) 9వ సెక్షన్ ప్రయోగించింది. ఇందులో భాగంగా మొదటి విడతలో ఫ్యాక్టరీకి చెందిన వాహనాలు, మొలాసిస్ను వేలం వేయాలని నిర్ణయించింది. ఈ నెల 21న ఫ్యాక్టరీలోనే వేలంపాట నిర్వహించనున్నారు. తొలి వేలం పాటలో రెండు బొలేరో జీపులు, ఒక బొలేరో క్యాంపర్ జీపు, ఒక మారుతి ఎస్టీమ్తో పాటు 194.230 మెట్రిక్ టన్నుల మొలాసిస్ను వేలం వేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. చెరకు కమిషన్ ఆధ్వర్యంలో ఈ వేలం పాటలు జరగనున్నాయి. అప్పటికీ బకాయిలు చెల్లించేందుకు యాజమాన్యం ముందుకు రాకపోతే రెండో విడతలో ఫ్యాక్టరీ మిషనరీని స్వాధీనం చేసుకోనున్నట్లు సమాచారం. రైతులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.13 కోట్ల 80 లక్షల 55 వేలను ఫ్యాక్టరీ సామగ్రిని వేలం వేసి చెల్లిస్తారు. రైతు బకాయిల రికవరీకి గత నెల 15న వేలం పాట జరగాల్సి ఉన్నా ఫ్యాక్టరీ యాజమాన్యం హైకోర్టుకు వెళ్లి మూడు విడతల్లో బకాయిలు చెల్లిస్తామని ఒప్పుకుని అనుమతి పొందింది. దీంతో వేలం పాట వాయిదా పడింది. అయితే కోర్టు ఉత్తర్వులను ఫ్యాక్టరీ యాజమాన్యం పాటించక పోవడంతో ఆర్ఆర్ యాక్ట్ అమలుకు అధికారులు శ్రీకారం చుట్టారు. నెల్లూరు షుగర్ కేన్ అసిస్టెంట్ కార్యాలయం అధికారులు ఈ నెల 21న తొలుత ఫ్యాక్టరీ సామగ్రి వేలానికి సిద్ధమయ్యారు. కోవూరు ఫ్యాక్టరీ బకాయిల సంగతేంది? ప్రైవేటు ఫ్యాక్టరీ అయిన ఎన్సీఎస్ ఫ్యాక్టరీ బకాయిల చెల్లింపు విషయం సీరియస్గా తీసుకున్న అధికారులు మరి ప్రభుత్వ అనుబంధమైన సహకార రంగానికి చెందిన కోవూరు షుగర్ ఫ్యాక్టరీ రైతులకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో మాత్రం స్పందించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోవూరు షుగర్ ఫ్యాక్టరీ 2012-13 ఏడాదికి సంబంధించి రైతులకు రూ.7 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉంది. కోవూరు షుగర్ ఫ్యాక్టరీకి నాలుగేళ్లుగా పాలకవర్గం ఎన్నికలు జరగేదు. దీంతో ఫ్యాక్టరీకి జిల్లా కలెక్టరే చైర్మన్గా ఉంటున్నారు. రైతులకు మాత్రం బకాయిలు ఇప్పటికీ అందలేదు. కలెక్టర్ స్పందించాలని రైతులు కోరుతున్నారు.