Sengottaiyan
-
ఆన్లైన్ క్లాస్లు వద్దు.. ఓకే!
సాక్షి, చెన్నై: ఆన్లైన్ తరగతుల నిర్వహణ గురించి ఒకే రోజు విద్యా మంత్రి సెంగోట్టయన్ చేసిన రెండు రకాల వ్యాఖ్యలు సర్వత్రా విస్మయంలో పడేశాయి. ఉదయాన్నే ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన మంత్రి, సాయంత్రం అనుమతులు ఇస్తున్నామని ప్రకటించడం గమనార్హం. లాక్డౌన్ సడలింపుల ప్రక్రియ సాగుతున్నా, ఇప్పట్లో విద్యా సంస్థలు తెరచుకునే అవకాశాలు లేవు. దీంతో ఆయా విద్యా సంస్థలు ఆన్లైన్ తరగతులపై దృష్టి పెట్టాయి. జూన్ నుంచి ప్రైవేటు విద్యా సంస్థలు మెజారిటీ శాతం ఆన్లైన్ తరగతుల నిర్వహణకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభం, విద్యా వ్యవహారాల పర్యవేక్షణకు ఓ ఉన్నత స్థాయి కమిటీని సీఎం పళనిస్వామి రంగంలోకి దించారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక మేరకు స్కూళ్ల రీ ఓపెనింగ్ ఆగస్టులో ఉండ వచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ సమాచారంతో ప్రైవేటు సీబీఎస్ఈ, మెట్రిక్యులేషన్ యాజమాన్యాలు ఆన్లైన్ తరగతులు అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్లు పంపించే పనిలో పడ్డాయి. (వారిద్దరూ అమ్మ వారసులే) మాట మార్చేశారు.. జూన్ ఒకటి నుంచి ఈ తరగతుల నిర్వహణ వేగం పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో బుధవారం ఉదయం విద్యా మంత్రి సెంగోట్టయన్ మీడియాతో మాట్లాడుతూ ఆన్లైన్ తరగతులపై ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. ప్రైవేటు విద్యా సంస్థలు ఆన్లైన్ క్లాసులు అంటూ వేధింపులు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఇబ్బందులు కల్గించే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్న హెచ్చరికలు చేశారు. అయితే, సాయంత్రానికి మాట మార్చేశారు. ఆన్లైన్ తరగతుల నిర్వహణకు అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించారు. (విమానం ఎక్కుతానని ఎప్పుడూ అనుకోలేదు ) అయితే, ఉపాధ్యాయుల్ని స్కూళ్లకు రప్పించడం, అక్కడి నుంచి తరగతులు నిర్వహించే రీతిలో చర్యలు తీసుకుంటే చర్యలు తప్పదన్న హెచ్చరిక చేశామని దాట వేశారు. ఉన్న చోట నుంచే ఆన్లైన్లో తరగతుల్ని నిర్వహించుకోవచ్చని, ఇందుకు ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు విధించలేదన్నారు. పాఠశాలలను తెరిచే విషయంగా ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా, అన్ని సమీక్షల మేరకు సీఎం పళనిస్వామి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఉన్న చోటే పరీక్షలు.. పదో తరగతి విద్యార్థులకు ఊరట కల్గించే ఉత్తర్వులు వెలువడ్డాయి. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జూన్ 15 నుంచి జరగనున్న విషయం తెలిసిందే. కంటైన్మెంట్ జోన్లలో ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పరీక్షా కేంద్రాల ఏర్పాటు సాగుతున్నాయి. అలాగే, అనేక మంది విద్యార్థులు పరీక్షలు ఓ చోట రాయాల్సి ఉండగా, వారు మరో చోట నివాసం ఉండడం, మరో ప్రాంతానికి వెళ్లి ఉండడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రం తాజాగా ఓ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు ప్రస్తుతం ఎక్కడైతే ఉన్నారో, అక్క డి పరీక్షా కేంద్రంలోనే పరీక్షలు రాసుకోవచ్చని కేంద్ర మానవ వనరుల శాఖ ప్రకటించింది. ఇక, పదీ పరీక్షలు రాయనున్న విద్యార్థుల్ని మానసికంగా సిద్ధం చేయడానికి తగ్గట్టు వారికి ప్రత్యేకంగా కథల్ని వినిపించే రీతిలో సరికొత్త యాప్లు తెరపైకి రావడం విశేషం. -
ఓపీఎస్.. ఈపీఎస్.. మధ్యలో సెంగొట్టియాన్
-
ఓపీఎస్.. ఈపీఎస్.. మధ్యలో సెంగొట్టియాన్
చెన్నై : తమిళనాట రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేపుతున్నాయి. విలీనమైన ఈపీఎస్-ఓపీఎస్లు చిన్నమ్మ శశికళ కుటుంబాన్ని పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి వెలివేశారు. అమ్మ జయలలిత మరణం తర్వాత ముఖ్యమంత్రిగా రాత్రికి రాత్రి పదవి స్వీకరించి, అనంతరం జరిగిన పరిణామాల్లో పార్టీకి, సీఎం పదవికి కూడా దూరమైన పన్నీర్ సెల్వం.. ఎలాగైనా ఆ పదవిని మరోసారి చేపట్టాలన్న ఆశతో ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి పదవి తనకే ఉంచి.. ప్రధాన కార్యదర్శి పదవి తీసుకోవాలని ఓపీఎస్కు పళనిస్వామి ఆఫర్ ఇచ్చారు. సరిగ్గా ఇదే అంశం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ప్రధాన కార్యదర్శి పదవి మీద సీనియర్ నాయకుడు సెంగొట్టియాన్ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ పదవిని పన్నీర్ సెల్వానికి ఇస్తే ఆయన సంగతి ఏమవుతుందో తెలియాల్సి ఉంది. తాను ఈ పదవికి పోటీలో ఉన్నానని సెంగొట్టియాన్ ముందునుంచే చెబుతున్నారు. కానీ ఆయనకు ఇప్పుడు కొత్త చిక్కులు ఎదురయ్యేలా ఉన్నాయి. రెండు వర్గాల డిమాండ్లతో తమిళ రాజకీయాలు మరోమారు ఆసక్తికరంగా మారాయి. ఈ డిమాండ్ల నేపథ్యంలో చర్చలకు ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేయాలని రెండు వర్గాలు నిర్ణయించాయి. -
మధుసూదనన్ ను తొలగించిన చిన్నమ్మ
-
మధుసూదనన్ ను తొలగించిన చిన్నమ్మ
తమిళనాట రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. ఇన్ని రోజులు శశికళ వర్గంలో ఉంటూ వచ్చిన, పార్టీ సీనియర్ నేత ఇ.మధుసూదనన్ గురువారం పన్నీర్ సెల్వం గూటికి చేరడంతో ఆయనపై చిన్నమ్మ కొరడా ఝుళిపించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో మధుసూదనన్ను అన్నాడీఎంకే నుంచి తప్పించింది. ప్రిసీడియం చైర్మన్ పదవితో పాటు పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తున్నట్టు అన్నాడీఎంకే శుక్రవారం ప్రకటించింది. మధుసూదనన్ స్థానంలో సెంగొట్టయ్యన్ను నియమిస్తున్నట్టు ప్రటించింది. శశికళ వర్గంలో ఉంటూ వచ్చిన మధుసూదనన్ ఒక్కసారిగా అమ్మ విశ్వాసపాత్రుడు పన్నీర్ వర్గంలో చేరారు. శశికళ కుటుంబసభ్యులు పెత్తనం భరించలేకే తాను అక్కడి నుంచి వచ్చేశానని, పన్నీర్ సెల్వానికి జరిగిన అవమానం రేపు తనకూ జరగొచ్చన్న అంచనాయే తనను బయటకు రప్పించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మధుసూదనన్ పన్నీర్ వర్గంలోకి వెళ్లడంతో ఆయనకు అనూహ్య మద్దతు పెరుగుతూ వస్తోంది. దీంతో మధుసూదనన్ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు అన్నాడీఎంకే పేర్కొంది. అయితే పార్టీ నిబంధనల ప్రకారం అన్నాడీఎంకేకు ప్రధాన కార్యదర్శిగా పదవి చేపట్టే వాళ్లు ఐదేళ్లు పార్టీలో యాక్టివ్ మెంబర్గా ఉండాలని, యాక్టివ్ మెంబర్ కాకుండానే శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదా చేపట్టినట్టూ మరోవైపు నుంచి చిన్నమ్మపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే శశికళకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కూడా చేజారే అవకాశముంటోంది. -
అన్నాడీఎంకేతోనే గ్రామీణాభివృద్ధి సాధ్యం
వేలూరు, న్యూస్లైన్: అన్నాడీఎంకే ప్రభుత్వంతోనే గ్రామీణాభివృద్ధి సాధ్యమని వేలూరు పార్లమెంట్ అభ్యర్థి సెంగొట్టవన్ తెలిపారు. శనివారం ఉదయం నియోజక వర్గం లోని మేల్ మనూర్, కీల్ మనూర్, పొయిగై, అమ్ముండి తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. మూడేళ్ల అమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు పలు సంక్షేమ పథకాలను పొందారని వీటిని ప్రతి ఓటరు గుర్తించుకోవాలన్నారు. ప్రస్తుతం అన్ని గ్రామాల్లోను సిమెంట్ రోడ్లు, తాగునీటి ట్యాంకర్లున్నాయంటే అందుకు ముఖ్యమంత్రి జయలలితనే కారణమన్నారు. ఎన్నికల సమయంలో పలు పార్టీలు ఎన్నో ఉచిత హామీలిస్తుంటారని వాటిని ప్రజలు నమ్మవద్దన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి కూడా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత అన్నాడీఎంకే ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఓటర్లు ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాష్ట్ర, గ్రామీణాభివృద్ధిని గుర్తు తెచ్చుకొని ఓటు వేయాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో డెప్యూటీ మేయర్ ధర్మలింగం, జిల్లా జాయింట్ కార్యదర్శి మునెమ్మ, ఆవిన్ పాలడెరుురీ చైర్మన్ వేలయగన్, సర్పంచ్ సెల్వి, మాజీ కౌన్సిలర్ జిజిఆర్ రవి, కాట్పాడి యూనియన్ చైర్మన్ రాజ, అన్నాడీఎంకే నాయకులు పాల్గొన్నారు. -
పథకాలను చూసి ఓటేయండి
వేలూరు, న్యూస్లైన్: రాష్ట్రంలో అమ్మ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను చూసి ప్రజలు ఓట్లు వేయాలని అన్నాడీఎంకే పార్లమెంట్ అభ్యర్థి సెంగొట్టవన్ ఓటర్లను అభ్యర్థించారు. వేలూరు కార్పొరేషన్లో గురువారం ఉదయం ప్రచారం నిర్వహించారు. అమ్మ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు చేయాలంటే ఓటర్లు రెండాకుల గుర్తుపై ఓట్లు వేయాలని కోరారు. ఒక్క అవకాశం కల్పిస్తే వేలూరు కార్పొరేషన్లోని తాగునీటి సమస్యతోపాటు పలు సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే డాక్టర్ విజయ్ మాట్లాడుతూ కార్యకర్తలందరూ ఇంటింటికీ వెళ్లి అమ్మ సంక్షేమ పథకాల కరపత్రాలను ఆయుధంగా తీసుకొని ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు వేయాలని కోరాలన్నారు. ఈ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాటిని పరిష్కరించడంలో ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారని నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే వారితో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆయనతో పాటు మేయర్ కార్తియాయిని, డెప్యూటీ మేయర్ ధర్మలింగం, మాజీ కౌన్సిలర్ జీజీ రవి, జననీ బిగ్ బజార్ అధినేత సతీష్కుమార్, విజయకుమార్, కౌన్సిలర్లు, అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.