separate high court
-
ఉద్యమానికి తాత్కాలిక విరామం
-
ఉద్యమానికి తాత్కాలిక విరామం
29 నుంచి విధుల్లో చేరతామని తెలంగాణ న్యాయవాదుల ప్రకటన హైకోర్టు ఏర్పాటుపై ప్రధాని, సీజేఐ హామీని విశ్వసిస్తున్నట్టు వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు తెలంగాణ న్యాయవాదులు చేపట్టిన ఉద్యమానికి తాత్కాలికంగా విరామం ప్రకటించారు. హైకోర్టు ఏర్పాటు చేయడంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన హామీని, అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన హామీని విశ్వసించి ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ నెల 29న విధుల్లో చేరుతున్నామని తెలంగాణ న్యాయవాదులు మంగళవారం ఏపీ భవన్లో మీడియాకు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల ముగింపులోపు హైకోర్టు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. అప్పటికీ కాకుంటే మరోసారి ఉద్యమిస్తామని హెచ్చరించారు. హైకోర్టు విభజన కోరుతూ తెలంగాణ న్యాయవాదులు సోమవారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద మహాధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ సంఘాలు, టీఆర్ఎస్ ఎంపీలతో చర్చించిన తరువాత ఉద్యమానికి తాత్కాలిక విరామం ఇస్తున్నట్టు న్యాయవాదులు ప్రకటించారు. హైకోర్టు తప్పక ఏర్పాటవుతుంది: ఎంపీ సీతారాం నాయక్ ప్రత్యేక హైకోర్టు కోసం ఉద్యమించిన తెలంగాణ న్యాయవాదులు ప్రధాని మోదీ, సీజేఐ హామీలతో ఉద్యమాన్ని విరమించడం అభినందనీయమని ఎంపీ సీతారాం నాయక్ కొనియాడారు. హైకోర్టు ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, తెలంగాణ హైకోర్టు కచ్చితంగా ఏర్పాటవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై అన్ని రకాలుగా ఒత్తిడి తెస్తోందన్నారు. బంజారాల పెద్ద పండుగైన తీజ్ను ఢిల్లీలో జరపడానికి స్థానికంగా ఉంటున్న బంజారా సోదరులు డా.రవి, డా.ఆర్య ముందుకు రావడం ఆహ్వానించదగిందన్నారు. విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్, వరంగల్ జిల్లా పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు శ్రీధర్రావ్ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రమంత్రిపై న్యాయవాదుల ఫిర్యాదు
హైదరాబాద్: తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు విషయంలో చొరవ తీసుకుంటానని ఇచ్చిన హామీని అమలు చేయని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడపై చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాదులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరు నెలల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ వచ్చిన కేంద్రమంత్రి హామీ ఇచ్చారని వారు గుర్తు చేశారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం సరూర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
లాయర్ జయవింధ్యాల దీక్ష భగ్నం
హైదరాబాద్: హైకోర్టు లాయర్ జయ వింధ్యాల చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు, జడ్జిలపై సస్పెన్షన్ ఎత్తి వేయాలనే డిమాండ్లతో ఆమె మంగళవారం మధ్యాహ్నం నుంచి హైకోర్టులోని 11వ నంబర్ కోర్టు ఆవరణలో దీక్ష ప్రారంభించారు. అర్థరాత్రి చార్మినార్ మహిళా పోలీసులు ఆమె దీక్ష భగ్నం చేసి, అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. -
పార్లమెంట్లో TRS సభ్యుల ఆందోళన
-
ఐడీ కార్డు ఉంటేనే కోర్టులోకి అనుమతి
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కోర్టు ముందు 144 సెక్షన్ అమలు అవుతోంది. ఐడీ కార్డులు ఉన్నవారినే కోర్టులోనికి అనుమతి ఇస్తున్నారు. రెండు రోజుల క్రితం ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయలంటూ తెలంగాణ న్యాయవాదులు ఆందోళనకు దిగన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ లాయర్లపై దాడి చేశారు. దాంతో కోర్టు పరిసరాల్లో బందోబస్తును కట్టుదిట్టం చేశారు. మరోవైపు చార్మినార్ సిటీ సివిల్ కోర్టు వద్ద కూడా పోలీసులు మోహరించారు. మేజిస్ట్రేట్ను అడ్డుకుంటారనే సమాచారంతో ముందస్తు భద్రతను పెంచారు. ఐడీ కార్డులు ఉన్నవారిని మాత్రమే కోర్టులోకి అనుమతించాలని సూచనలను పోలీసులు అమలు చేస్తున్నారు. కాగా జంటనగరాల కమిషనరేట్ల పరిధిలో భద్రతను పెంచినట్లు సీపీ తెలిపారు. -
రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద ఉద్రిక్తత
-
రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద శుక్రవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. కోర్టులోకి న్యాయమూర్తులు వెళ్లకుండా తెలంగాణ ప్రాంత న్యాయవాదులు అడ్డుకున్నారు. కోర్టు గేటు మూసివేసి అక్కడ బైఠాయించారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా వారిపై లాయర్లు కోడిగుడ్లు విసిరారు. దాంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఎట్టకేలకు ఆందోళన చేస్తున్న న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడనుంచి తరలించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ తెలంగాణలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసేవరకూ తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
'చలో హైకోర్టు '.. ఉద్రిక్తత
సీజేను అడ్డుకున్న న్యాయవాదులు ఆరో నంబర్ గేట్ వద్ద దీక్షా శిబిరం న్యాయవాదులను అరెస్ట్ చేసిన పోలీసులు నిరసనగా నేడు కోర్టుల్లో విధుల బహిష్కరణ జిల్లాల్లోనూ పలు చోట్ల లాయర్ల అరెస్టులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాదులు తలపెట్టిన చలో హైకోర్టు నినాదాలు, అరెస్టులతో సాగింది. చలో హైకోర్టు సందర్భంగా న్యాయవాదులు గురువారం పెద్ద సంఖ్యలో కోర్టు వద్దకు చేరుకున్నారు. హైకోర్టు ఆరో నంబర్ గేట్ వద్ద దీక్షా శిబిరంలో న్యాయవాదులు బైఠాయించి నినాదాలు చేశారు. హైకోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీసులు మోహరించి అడ్డుకున్నారు. దీక్షా శిబిరంలో తెలంగాణ న్యాయవాదుల జేఏసీ చైర్మన్ ఎం. రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర హైకోర్టు ఏర్పాటును కోరుతూ శాంతియుతంగా దీక్ష చేస్తున్న తమను పోలీసులు అన్యాయంగా అడ్డుకుంటున్నారన్నారు. న్యాయవాదుల అరెస్ట్ను నిరసిస్తూ ఆగస్టు 1న తెలంగాణలోని కోర్టుల్లో విధులను బహిష్కరించి కోర్టుల ముందు ప్రధాన న్యాయమూర్తి దిష్టిబొమ్మ దహనం చేయాలని పిలుపునిచ్చారు. హైకోర్టు ఆరో నంబర్ గేట్ వద్ద నిర్వహించిన దీక్షను పోలీసులు అడ్డుకొని న్యాయవాదులను అరెస్ట్ చేశారు. రోడ్డుపై బైఠాయించిన న్యాయవాదులతో పాటు దీక్ష శిబిరంలోకి చొరబడిన పోలీసులు న్యాయవాదులను వాహనంలోకి ఈడ్చుకెళ్లారు. అరెస్టయిన న్యాయవాదులను కంచన్బాగ్, ఫలక్నుమా పోలీస్స్టేషన్లకు తరలించారు. ప్రభుత్వం నుంచి హమీ వచ్చేంత వరకు దీక్ష నిర్వహిస్తామని పోలీస్స్టేషన్లో బైఠాయించారు. సీజేను అడ్డుకున్న న్యాయవాదులు... చలో హైకోర్టుపై ఉదయం 10.30 గంటలకే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి ప్రధాన న్యాయమూర్తిని కలిశారు. కాగా నిరసనలో భాగంగా జేఏసీ నేతలు ప్రధాన న్యాయమూర్తి కోర్టుకు వెళ్లి విధుల బహిష్కరణకు సహకరించాలని కోరారు. విధులకు ఆటంకం కలిగించడం సరికాదని సీజే స్పష్టం చేశారు. మరికొందరు న్యాయవాదులు ప్రధాన న్యాయమూర్తి కోర్టుకెళ్లి జై తెలంగాణ నినాదాలు చేయడంతో సీజే తన చాంబర్కు వెళ్లిపోయారు. ఇతర కోర్టుల వద్దకూ వెళ్లి ఆందోళనకు మద్దతివ్వాలని న్యాయమూర్తులను కోరగా వారు విధులు బహిష్కరణ సరికాదని తిరస్కరించారు. కోర్టు నిర్వహణకు ఆటంకం ఏర్పడుతుండడంతో వారు కూడా తమ చాంబర్లలోకి వెళ్లిపోయారు. మధ్యాహ్నం తిరిగి విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి కేసులు వాదించేందుకు న్యాయవాదులు రాని కేసుల్లో విచారణను పది, పన్నెండు వారాలకు వాయిదా వేసుకుంటూ వెళ్లారు. హైకోర్టు వద్ద భారీ బందోబస్తు... హైకోర్టు ప్రధాన ద్వారాలతో పాటు మదీనా చౌరస్తా, పేట్లబురుజు, పురానాపూల్, సిటీ సివిల్ కోర్టుల వద్ద దక్షిణ మండలం పోలీసుల ఆధ్వర్యంలో భారీ బలగాలను మోహరించారు. నగర పోలీసులతో పాటు ఏపీఎస్పీ, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్, టాస్క్ఫోర్స్తో భారీ బందోబస్తును నిర్వహించారు. నగర జాయింట్ కమిషనర్ (సీఏఆర్ హెడ్ క్వార్టర్స్) ఎం. శివ ప్రసాద్, దక్షిణ మండలం డీసీపీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి, టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ లింబారెడ్డిలు బందోబస్తును పర్యవేక్షించారు. ట్రాఫిక్ అంతరాయంతో వాహనదారుల ఇక్కట్లు... ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాదులు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో హైకోర్టు నుంచి మదీనా చౌరస్తా, నయాపూల్ వరకు ట్రాఫిక్ ఆగింది. న్యాయవాదులను అరెస్ట్ చేయడంతో ట్రాఫిక్ సమస్య తీరింది. జిల్లాల్లోనూ ఆందోళనలు, అరెస్టులు..... ఇదిలా ఉండగా హైకోర్టుకు వచ్చేందుకు బయలుదేరిన వివిధ జిల్లాల్లోని న్యాయవాదులను ఎక్కడికక్కడే పోలీసులు అరెస్టులు చేశారు. రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు గురువారం కోర్టు విధులను బహిష్కరించారు. కోర్టు భవనం ముందుకు చేరుకుని కేంద్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.