breaking news
Small farmers
-
మారుతున్న వాతావరణం, చిన్నరైతుకు పెద్ద కష్టం!
చిన్న కమతాల రైతులు... ప్రపంచ వ్యవసాయ రంగంలో అతి కీలకపాత్ర నిర్వహిస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులు ప్రపంచవ్యాప్తంగా సగంపైగా ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులు వనరుల కొరత, అధిక ఖర్చులు, దగ్గర్లో సరైన మార్కెట్ సదుపాయాల్లేకపోవటంతో పాటు అనూహ్య ప్రతికూల వాతావరణం వంటి ముఖ్యమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. చిన్న తరహా కుటుంబ రైతులకు రక్షణ కల్పించాలంటే... మొదట వాతావరణ మార్పు ప్రభావాలకు తట్టుకునేలా సాగు పద్ధతిని మార్చుకునేలా వారికి సహాయం చెయ్యటం అతి ముఖ్యమైన విషయం. వాతావరణ మార్పు ప్రభావాలకు తట్టుకునేలా వీరికి సాయం చెయ్యాలంటే ఎంత డబ్బు (దీన్నే ‘వాతావరణ ఆర్థిక సహాయం’ అంటారు) అవసరం అవుతుంది? అనేది ఆసక్తికరమైన చర్చ. ఇప్పుడు ఇదంతా ఎందుకు చర్చకొస్తోందంటే.. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 30వ సర్వసభ్య వాతావరణ శిఖరాగ్రసభ (కాప్ 30) వచ్చే నెలలో బ్రెజిల్లో జరగనుంది. కాప్ 30 ఎజెండాలో చిన్న కమతాల రైతులకు ‘వాతావరణ ఆర్థిక సహాయం’ ఒక కీలకాంశంగా ఉంది. అయితే, చిన్న రైతులను వాతావరణ విపత్తుల నుంచి కాపాడుకోవటానికి కేటాయింపులను పెంచటంతో పాటు ప్రత్యేకంగా ‘రైతు నిధి’ని ఏర్పాటుతో న్యాయం చెయ్యాలని ఎఫ్ఎఫ్సీఏ పిలుపునిస్తోంది .చిన్న విస్తీర్ణంలో భూమిని సాగు చేసుకునే రైతు కుటుంబాలు ప్రపంచ ఆహార వ్యవస్థకు చాలా ముఖ్యమైనవి. ప్రధానంగా కుటుంబ శ్రమపై ఆధారపడే ఈ కుటుంబాలు వ్యవసాయం కొనసాగిస్తున్నాయి. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా, పసిఫిక్లలో 9.5 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులు ఉన్నారు. ఈ చిన్న కమతాలే 250 కోట్ల మందికి జీవనాధారంగా నిలుస్తున్నాయి. ప్రపంచంలో ఉత్పత్తయ్యే ఆహారంలో సగానికి సగం వీరే చెమటోడ్చి పండిస్తున్నారు. అయినప్పటికీ పేదరికం, పరిమిత మార్కెట్ సదుపాయాలు, వాతావరణ మార్పుల దుష్ప్రభావాలు వంటి తీవ్రమైన సమస్యలను చిన్న కమతాల సేద్యం ఎదుర్కొంటున్నదని క్లైమేట్ ఫోకస్ ఫర్ ది ఫ్యామిలీ ఫార్మర్స్ ఫర్ క్లైమేట్ యాక్షన్ (ఎఫ్ఎఫ్సీఏ) తాజా అధ్యయన నివేదిక తేల్చి చెప్పింది. చిన్న రైతులకు అవసరమైన దానిలో 1% కూడా వాతావరణ సహాయం అందటం లేదని, కేవలం 0.36% మాత్రమే అందుతోందని స్పష్టం చేసిందీ నివేదిక. ప్రభుత్వాలు ప్రజలకు, భూగోళానికి హానికరమైన రీతిలో అందిస్తున్న వ్యవసాయ సబ్సిడీల తీరును మార్చి ఉపయోగించుకోటం, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలను సంస్కరించటం, అవసరమైన నిధులను సమీకరించడానికి న్యాయమైన పన్నులపై దృష్టి పెట్టటం ద్వారా చిన్న సన్నకారు రైతులకు వాతావరణ మార్పుల నుంచి రక్షణ కల్పించవచ్చని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.హెక్టారుకో కాఫీ ఖర్చు!ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు అనుగుణంగా చిన్న తరహా రైతులకు సహాయం చేయడానికి ఏటా 44,300 కోట్ల డాలర్లు అవసరమని ఫ్యామిలీ ఫార్మర్స్ ఫర్ క్లైమేట్ యాక్షన్ తాజా నివేదిక వెల్లడించింది. వాతావరణ మార్పులకు తట్టుకునేందుకు చిన్న రైతులకు సహాయం చేయటానికి అయ్యే ఖర్చు తలకుమించిన భారమేమీ కాదని తేల్చింది. ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం ప్రజలకు, గ్రహానికి హాని కలిగించే వ్యవసాయ సబ్సిడీల కోసం ఖర్చు చేసే 47,000 కోట్ల డాలర్ల కంటే తక్కువేనని బ్రెజిల్లో అంతర్జాతీయ వాతావరణ శిఖరాగ్ర సదస్సు కాప్ 30కి ముందు విడుదల చేసిన ఈ విశ్లేషణ నివేదిక వివరించింది. ప్రపంచ ఆహార భద్రత, పర్యావరణ సుస్థిరత సాధన కృషిలో వారి పాత్రను నొక్కి చెబుతూ, ఈ రైతులకు మద్దతు ఇవ్వడానికి నిధులను దారి మళ్లించాలని ΄ాలకులను నివేదిక కోరుతోంది. ప్రపంచంలోని ఆహారంలో సగం ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, 250 కోట్ల మంది జీవనోపాధికి తోడ్పడుతున్నప్పటికీ, తీవ్రతరం అవుతున్న కరువులు, వరదలు, తుఫానులకు తట్టుకునేలా చిన్న రైతులకు అవసరమైన వాతావరణ ఆర్థిక సహాయంలో 0.36 శాతం మాత్రమే లభిస్తున్న విషయాన్ని పాలకులు గుర్తెరగాలని నివేదిక ఎత్తిచూపింది.వాతావరణ మార్పులను ఎదుర్కొనేలా చిన్న రైతులను సంసిద్ధం చెయ్యటానికి, కాలుష్యాన్ని తగ్గించేలా వ్యవసాయ పద్ధతులను మార్చుకోవటానికి, డిజిటల్ వాతావరణ సేవలను మెరుగుపరచడానికి సముచిత రీతిన ప్రత్యేక ఆర్థిక సాహాయం చెయ్యాల్సిన అవసరం ఉంది. 10 హెక్టార్ల కంటే తక్కువ విస్తీర్ణంలో సాగు చేసే చిన్న రైతులకు హెక్టారుకు సగటున ఏడాదికి 953 డాలర్లు అవసరం అవుతుంది. అంటే.. రోజుకు 2.19 డాలర్లు. ఇది జర్మనీలో ప్రజలు ఒక కప్పు కాఫీ తాగటానికి వెచ్చించే ఖర్చుతో సమానమని నివేదిక స్పష్టం చేసింది. చిత్తశుద్ధి ఉంటే చిన్న రైతులను ఆదుకోవటం ఎంత సులభమో ఈ నివేదికను బట్టి అర్థమవుతుంది.ఆహార భద్రత కోసం పెట్టుబడిక్లైమేట్ ఫోకస్ ఫర్ ది ఫ్యామిలీ ఫార్మర్స్ ఫర్ క్లైమేట్ యాక్షన్ (ఎఫ్ఎఫ్సీఏ) నివేదికలో పలువురి అభిప్రాయాలకు చోటు కల్పించారు. ‘ఇది దాతృత్వం కాదు. ఇది ప్రపంచ ఆహార భద్రత కోసం పెట్టే పెట్టుబడి’ అని 2.5 కోట్ల చిన్న రైతులకు ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పు ఆఫ్రికా రైతుల సమాఖ్య అధ్యక్షురాలు ఎలిజబెత్ న్సిమదాల అన్నారు. ‘చిన్న రైతులు ప్రపంచంలోని సగం ఆహారాన్ని ఉత్పత్తి చేస్తారు. ప్రపంచ ఆహార సరఫరా గొలుసులకు వీళ్లే కేంద్రంగా ఉన్నారు. వారిని నిలబెట్టేలా పెట్టుబడి పెట్టడం అందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది’ అన్నారామె.కొత్త ప్రపంచ వాతావరణ ఫైనాన్స్ రోడ్మ్యాప్పై వచ్చే నెలలో బ్రెజిల్లో జరిగే కాప్ 30లో చర్చించాలనే చర్చ ముగింపు దశకు చేరుకున్న దశలో ఈ నివేదిక వెలువడింది. అయితే, అంతర్జాతీయంగా వాతావరణ మార్పుల్ని ఎదుర్కొనేందుకు విడువలవుతున్న నిధుల్లో చిన్న రైతులకు ఎంత అందుతున్నదీ ఎవరూ లెక్కలు తీయట్లేదు. ఈ నేపథ్యంలో కాప్ 30లో కూడా చిన్న రైతుల ప్రయోజనాలను మళ్లీ పక్కన పెట్టబడతారని కొందరు ఆందోళన చెందుతున్నారు.ఆదాయంలో 40% వెచ్చిస్తున్న రైతులు2021లో అంతర్జాతీయ సమాజం ఇచ్చిన వాతావరణ ఆర్థిక సహాయంలో కేవలం 159 కోట్ల డాలర్లు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా చిన్న రైతులు, గ్రామీణ సంఘాలకు చేరాయని ఎఫ్ఎఫ్సీఏ వెల్లడించింది. రైతులు వాతావరణ మార్పులను తట్టుకోవటానికి మెరుగైన నీటి΄ారుదల, నేల సంరక్షణ, పంటల వైవిద్యీకరణ వంటి అనుకూల చర్యల కోసం సమిష్టిగా తమ సొంత ఆదాయంలో నుంచి 36,800 కోట్ల డాలర్లను ఖర్చు చేశారు. ఈ మొత్తం వారి వార్షిక ఆదాయంలో 40 శాతం వరకు ఉంటుందని నివేదిక పేర్కొంది. ‘చిన్న రైతులపై పెట్టుబడి పెట్టడం ఆర్థిక అవసరం మాత్రమే కాదు, పర్యావరణ అత్యవసరం’ అని దక్షిణ బ్రెజిల్కు చెందిన ఇంటర్–కాంటినెంటల్ నెట్వర్క్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మర్ ఆర్గనైజేషన్స్ ప్రతినిధి థేల్స్ మెండోన్సా అన్నారు. ‘ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ పనికి మద్దతు ఇవ్వటం ద్వారా కరువును అధిగమించి సమృద్ధి సాధించవచ్చు’ అన్నారు. హానికరమైన వ్యవసాయ సబ్సిడీలను దిశ మార్చి ఉపయోగించాలలని, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలను సంస్కరించాలని, అవసరమైన నిధులను సమీకరించడానికి న్యాయమైన పన్నులు విధించాలని నివేదిక ప్రభుత్వాలను కోరింది. చిన్న రైతులకు అందించే 44,300 కోట్ల డాలర్ల వార్షిక పెట్టుబడి అభివృద్ధి చెందుతున్న దేశాలు రుణ చెల్లింపుల కోసం ఏటా ఖర్చు చేసే దానిలో మూడింట ఒక వంతు కంటే తక్కువే. 25 అతిపెద్ద ఆహార సంస్థల వార్షిక ఆదాయంలో 25%కు సమానం అని నివేదిక వివరించింది.3.8 లక్షల కోట్ల డాలర్ల నష్టంవాతావరణ విపత్తుల వల్ల వ్యవసాయ రంగానికి సంవత్సరానికి 12,300 కోట్ల డాలర్ల నష్టం జరుగుతోంది. గత 30 సంవత్సరాలుగా 3.8 లక్షల కోట్ల డాలర్ల మేరకు పంటలకు, పశువులకు నష్టం జరిగిందని నివేదిక అంచనా వేసింది. చిన్న రైతులకు తోడ్పడేలా పెట్టుబడి పెట్టడం వల్ల వరి, గోధుమ, కోకో, కాఫీ వంటి కీలక వస్తువుల సరఫరా గొలుసులను భద్రపరచడంతో పాటు వాతావరణ విపత్తుల్లో వ్యవసాయ నష్టాలను తగ్గించడంలో సహాయపడుతుంది.రైతుల కోసం ప్రత్యేక నిధిదీర్ఘకాలిక గ్రాంట్లు, సులభ రుణాలను నేరుగా రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, సహకార సంస్థలకు అందించడానికి రైతు సంస్థల నేతృత్వంలోని రైతు సాధికారత నిధిని ఏర్పాటు చెయ్యాలని ఎఫ్ఎఫ్సీఏ నివేదిక పిలుపునిచ్చింది. ‘వాతావరణ సంబంధ వత్తిళ్లు ఎదుర్కొంటూ నష్ట΄ోతున్న చిన్న సన్నకారు రైతులకు సులభంగా రుణాలను అందించేందుకు ప్రభుత్వాలు నిబంధనలను సులభతరం చేయాలని ఆసియా రైతు సంఘం సెక్రటరీ జనరల్ ఎస్తేర్ పెనునియా కోరుతున్నారు. రైతుల నేతృత్వంలోనే ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తే గొప్ప ప్రభావం ఉంటుందన్నారు. దక్షిణాసియా, ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికా, సబ్–సహారా ఆఫ్రికా బ్యాంకుల్లో 16 శాతం మాత్రమే చిన్న రైతులకు రుణాలు ఇస్తున్నాయని నివేదిక పేర్కొంది. బ్రెజిల్ అధ్యక్షతన నవంబర్ 10న ప్రారంభమయ్యే కాప్ 30 ఎజెండాలో ప్రకృతికి అనుకూల వ్యవసాయ పద్ధతులను, చిన్న సన్నకారు రైతులకు మద్దతు ఇచ్చే అంశాలకు ప్రాధాన్యత ఉండటం శుభసూచకం. ‘ఆకలిని ఎదుర్కోవడానికి, పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించ డానికి, మన ఆహార భవిష్యత్తును భద్రపరచడానికి చిన్న సన్నకారు రైతులకు మద్దతు ఇవ్వడం అతి ముఖ్యం’ అని న్సిమదాల అన్నారు. వాతావరణ మార్పుల నుంచి చిన్న కమతాల సేద్యాన్ని ఇప్పుడు రక్షించుకోక΄ోతే భవిష్యత్తులో అందుకు చెల్లించే మూల్యం చాలా ఎక్కువగా ఉంటుంది.చిన్న రైతులు ఎవరు? చిన్న రైతులు ఎవరనే ప్రశ్నకు అన్ని దేశాలకూ వర్తించే నిర్దిష్ట నిర్వచనం అంటూ లేదు. అది దేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. సాధారణంగా 1 నుంచి 10 హెక్టార్ల (హెక్టారుకు దాదాపు 2.5 ఎకరాలు) భూమిలో పంటలు పండించే రైతులను / రైతు కుటుంబాలను స్మాల్ హోల్డర్ ఫార్మర్స్ అని అంతర్జాతీయంగా వ్యవహరిస్తుంటారు. అయితే, ఎక్కువ దేశాల ప్రభుత్వాలు 2 హెక్టార్ల కంటే తక్కువ భూమిని కలిగిన రైతులను చిన్న రైతులుగా గుర్తిస్తున్నాయి. మన దేశంలో చిన్న, సన్నకారు రైతులంటే 2 హెక్టార్ల లోపు భూమి కలిగి ఉన్నవారు. దేశ వ్యవసాయ ఆధారిత జనాభాలో 85% కంటే ఎక్కువ మంది వీరే. కానీ, సగం కంటే తక్కువ భూమి మాత్రమే వీరికి ఉంది.వాతావరణ ఆర్థిక సహాయం హెక్టారుకు రూ. 84 వేలు కావాలి! ఫ్యామిలీ ఫార్మర్స్ ఫర్ క్లైమేట్ యాక్షన్ (ఎఫ్ఎఫ్సీఏ) అనే అంతర్జాతీయ సంస్థ తాజాగా జరిపిన ఒక విశ్లేషణ ప్రకారం.. వాతావరణ విపత్తుల నుంచి చిన్న, సన్నకారు రైతులను కాపాడుకోవటానికి సంవత్సరానికి 44,300 కోట్ల డాలర్ల ‘వాతావరణ ఆర్థిక సహాయం’ అవసరం ఉంది. ప్రజలకు, భూగోళానికి హానికరమైన వ్యవసాయ సబ్సిడీలపై అంతర్జాతీయంగా ఖర్చు చేస్తున్న 47,000 కోట్ల డాలర్ల కంటే ఇది తక్కువేనని కూడా ఈ నివేదిక లెక్క తేల్చింది. సింపుల్గా చెప్పాలంటే.. 1 హెక్టార్ పొలానికి ఏటా సగటున 953 డాలర్ల (రూ. 84 వేల) పెట్టుబడి అవసరం అవుతుంది. అంతర్జాతీయ సమాజం నుంచి ఇప్పుడు కూడా కొద్ది మొత్తంలో కొన్ని దేశాల్లో రైతులకు సహాయం అందుతోంది. అయితే, చిన్న రైతులకు అవసరమైన దానిలో 1% కూడా అందటం లేదు. ఇంకా చె΄్పాలంటే.. కేవలం 0.36% మాత్రమే! చిన్న రైతులను వాతావరణ విపత్తుల నుంచి కాపాడుకోవటానికి ‘రైతు నిధి’ ఏర్పాటు చెయ్యటం ద్వారా న్యాయం చెయ్యాలని ఫ్యామిలీ ఫార్మర్స్ ఫర్ క్లైమేట్ యాక్షన్ (ఎఫ్ఎఫ్సీఏ) పిలుపునిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చిన్న రైతులకు అవసరమైన నిధులు1. ఉత్తర ఆఫ్రికా: ఆహారోత్పత్తిని వాతావరణ విపత్తుల నుంచి రక్షించడానికి సంవత్సరానికి 889 కోట్ల డాలర్లు అవసరం. ఉదాహరణకు.. 2022–23 కరువు కారణంగా ట్యునీషియాలో ఆహారధాన్యాల ఉత్పత్తిలో 70% తగ్గింది.2. తూర్పు ఆఫ్రికా: వ్యవసాయ రంగం సుస్థిరతకు సంవత్సరానికి 3,460 కోట్ల డాలర్లు అవసరం. 75% కంటే ఎక్కువ మంది ప్రజలకు వ్యవసాయరంగమే ఉపాధికల్పిస్తుంది.3. మధ్య ఆఫ్రికా: వాతావరణ విపత్తుల్ని తట్టుకోవటానికి వ్యవసాయానికి సంవత్సరానికి 292 కోట్ల డాలర్లు అవసరం. కాంగో నదీ పరివాహక ప్రాంతంలోని ప్రపంచంలో రెండో అతిపెద్ద ఉష్ణమండల వర్షారణ్యాన్ని పునరుద్ధరించడానికి, రక్షించడానికి ఈ నిధులు అవసరం.4. దక్షిణ ఆఫ్రికా:కటిక కరువు వల్ల పంట ఎండిపోకుండా కాపాడటానికి సంవత్సరానికి 1,320 కోట్ల డాలర్లు అవసరం. కరువు వల్ల 2023–24లో 2.1 కోట్ల మంది పిల్లలు పోషకాహార లోపంతో అల్లాడారు.5. పశ్చిమ ఆఫ్రికా: 20 లక్షల కోకో రైతుల జీవనోపాధిని కాపాడటానికి సంవత్సరానికి 1,111 కోట్ల డాలర్లు అవసరం. అంతేకాదు, యూరప్లోని 5,000 కోట్ల డాలర్ల చాక్లెట్ పరిశ్రమ భవిష్యత్తును కా΄ాడటానికి కూడా ఈ నిధులు సహాయపడతాయి.6. మధ్య అమెరికా – మెక్సికో: ప్రపంచంలోనే అత్యంత వాతావరణ విపత్తులకు గురయ్యే ప్రాంతాల్లో కూడా ‘డ్రై కారిడార్’ ఒకటి. అక్కడి కోటికి పైగా ప్రజల జీవనోపాధిని కాపాడుతూ, ఆహార కొరత రాకుండా కాపాడటానికి సంవత్సరానికి 1,209 కోట్ల డాలర్లు అవసరమవుతాయి.7. దక్షిణ అమెరికా: సంవత్సరానికి 1,295 కోట్ల డాలర్ల వ్యవసాయ ఎగుమతులను (కొలంబియా 320 కోట్ల డాలర్ల కాఫీ పంట సహా) కాపాడడంలో సహాయపడతాయి.8. ఆగ్నేయాసియా: 69 కోట్ల మంది ప్రజలు చిన్న, సన్నకారు రైతులు పండించే ఆహారోత్పత్తులపై 90% మేరకు ఆధారపడుతున్నారు. వీరికి ఆహార కొరత రాకుండా చూడటానికి సంవత్సరానికి18,918 కోట్ల డాలర్లు అవసరం.9. పసిఫిక్: చిన్న, సన్నకారు రైతుల వ్యవసాయాన్ని రక్షించడానికి సంవత్సరానికి 8 కోట్ల డాలర్లు అవసరం. ఈ ప్రాంత స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయానికి 17.7% వాటా ఉంది. – నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
సేద్యానికి నోట్ల సెగ..
సాక్షి, న్యూఢిల్లీ : నోట్ల రద్దుతో చిన్న రైతులు చితికిపోయారని వ్యవసాయ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కమిటీకి సమర్పించిన నివేదికలో పేర్కొంది. నోట్ల రద్దుపై విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ బ్లాక్ మనీ నియంత్రించేందుకు ఇది అవసరమని ఇన్నాళ్లూ మోదీ సర్కార్ సమర్ధించగా తాజాగా నోట్ల రద్దుతో రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయని ఈ నిర్ణయం వెలువడిన రెండేళ్ల తర్వాత వ్యవసాయ మంత్రిత్వ శాఖ తేల్చిచెప్పింది. విత్తనాలు, ఎరువులు కొనేందుకు నగదుపై ఆధారపడే చిన్న రైతులు నోట్ల రద్దు నిర్ణయం ఫలితంగా సమస్యలు ఎదుర్కొన్నారని నివేదిక వెల్లడించింది. రబీ సీజన్కు ముందు నగదు కొరతతో లక్షలాది రైతులు విత్తనాలు, పురుగుమందులు కొనుగోలు చేయలేకపోయారని పార్లమెంటరీ కమిటీకి ఇచ్చిన నివేదికలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేర్కొంది. నోట్ల రద్దు అమలైన సమయంలో రైతులు వారి ఖరీఫ్ దిగుబడులను అమ్ముకోలేక, రబీ పంటలను సాగుచేయలేక సమస్యల్లో కూరుకుపోయారని తెలిపింది. రైతుల చేతిలో ఉన్న నగదంతా నోట్ల రద్దుతో చెల్లుబాటు కాకుండా పోయిందని నివేదిక పేర్కొంది. ప్రభుత్వం సైతం విత్తనాలను విక్రయించలేదని, తమ పొలాల్లో పనిచేసే కార్మికులకు వేతనాలు చెల్లించాల్సి క్రమంలో పెద్ద రైతులు సైతం నగదు కొరతతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని వెల్లడించింది. నగదు కొరతతో నేషనల్ సీడ్ కార్పొరేషన్కు చెందిన 1.38 లక్షల క్వింటాళ్ల గోధుమ విత్తనాలు విక్రయానికి నోచుకోలేదని తెలిపింది. పాతనోట్లతోనూ గోధుమ విత్తనాలు కొనుగోలు చేయవచ్చని ప్రభుత్వం తర్వాత సడలింపు ఇచ్చినా పరిస్థితి మెరుగుపడలేదని పేర్కొంది. -
పలుకుబడికే ఉపాధి పనులు
నేరడిగొండ : దేవుడు వరమ్మిచినా.. పూజారి కరుణించలేదన్న చందంగా ఉంది.. అధికారుల నిర్లక్ష్యంతో మహాత్మా గాంధీ ఉపాధిహామీ ఫలాలు రైతులకు అందడం లేదు. ఈ పథకం కాగితాలకే పరిమితమైంది. ప్రభుత్వం ఈజీఎస్లో రైతులకు ఎన్నో రకాల వ్యవసాయ అనుబంధ పనులు చేర్చి నిధులు కేటాయిస్తోంది. కానీ సంబంధిత అధికారులు, ఉపాధి సిబ్బంది పట్టించుకోకపోవడంతో ఈ పథకం కొందరికే పరిమితమైంది. వ్యవసాయంపైనే ఆధారపడ్డ రైతులకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. ఉపాధిలో వివిధ వ్యవసాయ ఆధారిత పనులు చేర్చుతూ ప్రణాళిక సిద్ధం చేసింది. గతంలో రైతుల అభివృద్ధికి ఆ పథకం ద్వారా ఒకట్రెండు పనులు మాత్రమే చేపట్టింది. కానీ ప్రస్తుతం వాటి సంఖ్యను పెంచి రైతుల అభివృద్ధికి బాసటగా నిలుస్తోంది. రైతులకు చేరువకాని వైనం... రాజకీయంగా ఎంతోకొంత పలుకుబడి, అధికారులతో కాస్తోకూస్తో పరిచయం ఉన్నవారికి మాత్రమే ఉపాధిహామీ పథకం ద్వారా కల్పిస్తున్న ఫలాలు అందుతున్నాయి. చదువురాని సన్న,చిన్నకారు రైతులకు మాత్రం ఏమీ దక్కడంలేదు. ఎలాగో ఒకలా ఈ పథకాల గురించి తెలుసుకొని స్థానిక ఉపాధిహామీ సిబ్బందిని అడిగితే ఆ పని ఈయేడాది కాదు, వచ్చే యేడాది చూద్దాములే అంటూ దాటవేస్తున్నారు. లేకపోతే ఈ పనికి ఇంత ఖర్చు అవుతుందని, ఆ పని అంత అవుతుందని ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర నుంచి మండలస్థాయి అధికారుల వరకు లెక్కలువేసి మరీ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వారి ఖర్చులు ఇవ్వలేని సన్న, చిన్నకారు రైతులకు ఉపాధి ఫలాలు అందని ద్రాక్షలా మారాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవగాహన కరువు.. ఉపాధిహామీ పథకం ద్వారా అనేక రకాలుగా రైతులకు ప్రయోజనం కలిగే విధంగా పనులు చేపడుతున్నప్పటికీ అవగాహన కల్పించకపోవడంతో రైతులకు ప్రయోజనం కలగడం లేదు. ఆసక్తి ఉన్న కొందరు రైతులకు అధికారులు సహకారం ఇవ్వకపోయినా సొంత ఖర్చులతో పాంపండ్లు నిర్మించుకుంటున్నారు. అధికారులు ఉపాధిహామీ పథకం ద్వారా రైతుల సంక్షేమం కోసం చేపట్టే పనులపై విస్తతంగా ప్రచారం చేపట్టాలని గ్రామాల్లో సన్న, చిన్నకారు రైతులకు సైతం పనులు, పథకాలు అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు. -
చిన్నరైతులకు రుణమాఫీ చేయండి: హైకోర్టు
చిన్న, సన్నకారు రైతులకు రూ. 50 వేల వరకు ఉన్న రుణాలను రద్దుచేయాలని, లేదా రుణాలను వాయిదా పద్ధతిలో చెల్లించేందుకు అనుమతించాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. రైతులు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నందువల్ల అత్యవసరంగా ఒక రైతు కమిషన్ ఏర్పాటుచేసి, పంటల బీమా పథకాన్ని అమలుచేయాలని తెలిపింది. భారతీయ గోవంశ్ రక్షణ్ సంవర్ధన పరిషత్ దాఖలుచేసిన పిటిషన్ను విచారించిన సందర్భంగా జస్టిస్ రాజీవ్ శర్మ, జస్టిస్ సురేశ్వర్ ఠాకూర్లతో కూడిన డివిజన్ బెంచి ఈ ఆదేశాలు జారీచేసింది. ఇక్కడి భౌగోళిక పరిస్థితుల కారణంగా రైతులు వర్షాలపైనే ఆధారపడ్డారని కోర్టు వ్యాఖ్యానించింది. రైతుల కష్టాలను తీర్చేందుకు ఇంతవరకు సరైన వేదిక లేదని, వాళ్ల ప్రయోజనాలను కాపాడాటం ప్రభుత్వ బాధ్యత అని బెంచి తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటుచేసే కమిషన్ల ప్రతిపాదనలను ఆమోదించాలని, ఒకవేళ ఆమోదించకపోతే అందుకు తగిన కారణాలు కూడా చెప్పాలని కోర్టు చెప్పింది. కనీసం రూ. 50 వేల వరకు ఉన్న రుణాలను వెంటనే మాఫీ చేయాలని, కాని పక్షంలో వాటి మీద వడ్డీరేటును తగ్గించి, వాయిదాల్లో చెల్లించేందుకు అనుమతించాలని ప్రభుత్వానికి తెలిపింది. కేసు తదుపరి విచారణను జూన్ 13కు వాయిదా వేసింది. పట్టణ ప్రాంతాల్లో పశువల షెడ్లను కట్టేందుకు మూడు నెలల్లోగా పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, పశుసంవర్ధక శాఖలు ఒక్కోటి రూ. 5 కోట్ల చొప్పున కేటాయించాలని ఆయా శాఖల అదనపు ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. -
రైతుల కడుపు కొట్టద్దు
బెంగళూరు : చిన్న రైతులు సాగు చేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం యత్నిస్తే పోరాటం చేయాల్సి వస్తుందని మాజీ ప్రధాని హెచ్.డీ. దేవెగౌడ హెచ్చరించారు. శనివారం ఆయన ఇక్కడి పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చిన్న రైతులు పోరంబోకు భూములు, అటవీ ప్రాంతానికి చెందిన భూములను అక్రమించుకుని వ్యయసాయం చేసుకుంటున్నారని అన్నారు. ఈ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చెయ్యడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఈ విషయంపై సీఎంకు లేఖ రాశానని దేవెగౌడ అన్నారు. చిన్న రైతుల భూములు లాక్కొని ప్రభుత్వం ముందు బడా బాబుల భూములు లాక్కుంటే అందరికి మంచి జరుగుతుందన్నారు. బెంగళూరు న గరంలో, పరిసర ప్రాంతాలలో అనేక ఎకరాల భూములు ఆక్రమించుకున్నారని ఏ.టీ. రామస్వామి, బాలసుబ్రమణ్యం కమిటీలు ఇప్పటికే నివేదిక సమర్పించారని గుర్తు చేశారు. ఈ భూములు ఆక్రమించుకున్నవారిలో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్తో పాటు ఇతర పార్టీల నాయకులు ఉన్నా సరే వారిపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని దేవెగౌడ చెప్పారు. సమావేశంలో జేడీఎస్ పార్టీ నాయకులు వై.వీ.ఎస్ దత్తా, నారాయణరావ్, రతన్సింగ్ తదితరులు పాల్గొన్నారు.


