strike postponed
-
108 ఉద్యోగుల సమ్మె వాయిదా
సాక్షి, అమరావతి: 108 ఉద్యోగులు బుధవారం నుంచి తలపెట్టిన సమ్మెను వాయిదా వేసుకుంటున్నట్లు ఏపీ 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ తెలిపింది. మంగళవారం జరిగిన చర్చల్లో ప్రభుత్వం పలు డిమాండ్ల విషయంలో సానుకూలంగా స్పందించడంతో సమ్మెను వాయిదా వేసుకున్నట్టు రాష్ట్ర అధ్యక్షుడు బి.కిరణ్కుమార్ వెల్లడించారు.సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, వైద్య సేవా ట్రస్ట్ సీఈవో డాక్టర్ మంజుల చర్చలు జరిపినట్టు వివరించారు. ఈ సందర్భంగా 108 సేవలను ప్రభుత్వమే నిర్వహించడం సాధ్యపడదని వారు తేల్చి చెప్పారన్నారు. జీవో 49ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారన్నారు. కొత్త సర్వీస్ ప్రొవైడర్ను ఎంపిక చేయడానికి ఆర్ఎఫ్పీ రూపొందించే సమయంలో ఉద్యోగుల సలహాలు, సూచనలను తీసుకుని వాటిని అందులో పొందుపరుస్తామని హామీ ఇచ్చారన్నారు. చర్చల్లో ఆమోదించిన మినిట్స్ను రాతపూర్వకంగా అందించారని చెప్పారు. -
బ్యాంకుల సమ్మె వాయిదా
సాక్షి, అమరావతి: మార్చి 11 నుంచి తలపెట్టిన మూడు రోజుల బ్యాంకుల సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు యూనియన్లు ప్రకటించాయి. ఉద్యోగుల జీతాలు 15 శాతానికి పెంచడంతో పాటు ప్రధాన డిమాండ్లను పరిష్కరించేందుకు బ్యాంకు యాజమాన్యాలు అంగీకరించడంతో యూనియన్లు ఈ నిర్ణయం తీసుకున్నాయి. జీతాలు పెంచేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) అంగీకరించిందని, పనితీరు బాగున్న బ్యాంకుల్లో నిర్వహణ లాభాల్లో నాలుగు శాతాన్ని ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ఇచ్చేందుకు అంగీకరించడంతో సమ్మెను వాయిదా వేసినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బీఎస్ రాంబాబు ‘సాక్షి’తో చెప్పారు. ఐదు రోజుల పనిదినాలు తప్ప ఫ్యామిలీ పెన్షన్ దగ్గర్నుంచి అన్ని ప్రధాన డిమాండ్లను పరిష్కరించేందుకు అంగీకరించడంతో సమ్మె వాయిదా వేసి చర్చలు కొనసాగించాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. వేతన సవరణ కోసం జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో సమ్మె నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం దిగిరాకుంటే మార్చి 11 నుంచి మూడు రోజులు, ఆ తర్వాత నిరవధిక సమ్మె చేసేందుకు యూనియన్లు కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాయి. శనివారం యూనియన్లతో ఐబీఏ జరిపిన చర్చలు సానుకూలంగా ముగిసాయి. ఈ 15 శాతం వేతన పెంపుతో బ్యాంకులపై ఏడాదికి సుమారు రూ.8,000 కోట్ల భారం పడనుంది. అలాగే రూ.80,000 జీతం ఉన్న బ్యాంకు ఉద్యోగికి ఏడాదికి రూ.40 నుంచి రూ.50 వేల లాభం చేకూరనుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఐబీఏ ప్రతిపాదనలను పరిశీలించి వారం తర్వాత సమ్మెపై తుది నిర్ణయం తీసుకుంటామని యూనియన్ నేతలు వివరించారు. -
వేచిచూసే ధోరణిలో అర్చక జేఏసీ
సమ్మె యోచనపై ప్రస్తుతానికి వెనక్కు సాక్షి, హైదరాబాద్: దేవాదాయ శాఖలోని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆలయాల్లోని అర్చకులు, ఉద్యోగుల వేతనాలు పెంచే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించనప్పటికీ కొంతకాలం వేచిచూసే ధోరణి అవలంబించాలని దేవాదాయశాఖ ఆలయ ఉద్యోగులు, అర్చకుల జేఏసీ నిర్ణయించింది. ఫిబ్రవరి ఐదో తేదీ నాటికి సానుకూల నిర్ణయం ప్రకటించని పక్షంలో ఏడో తేదీ నుంచి సమ్మెకు దిగుతామని జేఏసీ గతంలో హెచ్చరించినప్పటికీ... మరికొన్ని రోజులు వేచిచూడాలని ఆదివారం బర్కత్పురాలోని అర్చక భవన్లో జరిగిన సమావేశంలో తాజాగా నిర్ణయించారు. అర్చకులు, దేవాలయ ఉద్యోగుల డిమాండ్లపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు సానుకూలంగానే ఉన్నప్పటికీ కొందరు ఆయనకు తప్పుడు సమాచారమిస్తూ పక్కదారిపట్టిస్తున్నారని జేఏసీ నేత గంగు భానుమూర్తి పేర్కొన్నారు. ఈనేపథ్యంలో నేరుగా ముఖ్యమంత్రినే కలసి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే సమ్మెకు దిగాలని భావిస్తున్నట్లు నేతలు తెలిపారు. -
ఆర్టీసీ సమ్మె యోచన వాయిదా
హైదరాబాద్: ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ(సీసీఎస్) నిధులను తిరిగి చెల్లించేందుకు అంగీకరించడంతో సమ్మెను వాయిదా వేసుకోవాలని ఆర్టీసీ కార్మికులు నిర్ణయించారు. రూ.253 కోట్ల సీసీఎస్ నిధులను ఇప్పటి వరకు ఆర్టీసీ సొంతానికి వాడుకుంది. వీటిని వెంటనే చెల్లించాలని కొంత కాలంగా కార్మికులు ఆందోళనలకు దిగినా.. యాజమాన్యం స్పందించకపోవడంతో శనివారం నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్టీసీ యాజమాన్యం హడావుడిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను సంప్రదించి సమ్మె విరమింపజేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులను చర్చలకు పిలిపించింది. ఈ నెల 20 నాటికి సీసీఎస్ నిధులను చెల్లించేందుకు సిద్ధమని ప్రకటించింది. దీంతో ఇరు ప్రాంతాల్లో సమ్మె యోచనను విరమించుకుంటున్నట్లు ఎంప్లాయీస్ యూనియన్ శుక్రవారం రాత్రి ప్రకటించింది. కాగా, సీసీఎస్ రుణాల అంశంపై స్పష్టత రావడంతో సమ్మె యోచనను విరమించుకున్న ఎంప్లాయీస్ యూనియన్ ఇతర డిమాండ్లపై శనివారం మరో సమ్మెకు సంబంధించి నోటీసు ఇచ్చేందుకు సిద్ధమైంది. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఆర్టీసీ కార్మికుల వేతన సవరణ, లీవ్ ఎన్క్యాష్మెంట్, డీఏ బకాయిల చెల్లింపు తదితర అంశాలపై ఆర్టీసీ యాజమాన్యం స్పందించని నేపథ్యంలో సమ్మెకు ఉపక్రమించాలని నిర్ణయించింది. -
విద్యుత్ సమ్మె వాయిదా
సీఎంతో సమైక్యాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చర్చలు సఫలం అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడిస్తానని సీఎం హామీ ఇచ్చారు: సాయిబాబా సమ్మె తాత్కాలికంగా వాయిదా వేశాం.. నిరసనలు కొనసాగుతాయి సమైక్యాంధ్రకు అన్యాయం జరిగితే మళ్లీ మెరుపు సమ్మె గురువారం మధ్యాహ్నం నుంచే విధుల్లోకి ఉద్యోగులు.. తొలగిన చీకట్లు సాక్షి, హైదరాబాద్: తుపాన్, పండుగల నేపథ్యంలో అత్యవసర సర్వీసులకు అంతరాయం కలగకుండా సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు సమైక్యాంధ్ర విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ(సేవ్ జేఏసీ) చైర్మన్ సాయిబాబా ప్రకటించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి ఎన్. కిరణ్కుమార్ రెడ్డితో విద్యుత్ ఉద్యోగులు గురువారం జరిపిన చర్చలు ఫలించాయి. అనంతరం సాయిబాబా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం అసెంబ్లీలో ప్రవేశపెట్టే తీర్మానాన్ని ఓడిస్తామని ముఖ్యమంత్రి తమకు హామీ ఇచ్చారన్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రిమండలి కమిటీ నివేదికకు కూడా గడువు ప్రకటించనందున తాము సమ్మెను వాయిదా వేస్తున్నామని చెప్పారు. సమైక్యాంధ్రను మోసం చేస్తే మళ్లీ మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ప్రస్తుతం చేసిన సమ్మె ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తమ వాణి వినిపించామని, ఇది కేవలం శాంపిల్ మాత్రమేనని అన్నారు. సమ్మెను తాత్కాలికంగా వాయిదావేసినా నిరసన కార్యక్రమాలు మాత్రం యథావిధిగా కొనసాగిస్తామన్నారు. తమ సమ్మె కారణంగా విద్యుత్ లేక ప్రజలు ఇబ్బందులకు గురయినప్పటికీ.. సమైక్యాంధ్ర కోసం మౌనంగానే భరించారన్నారు. విద్యుత్ సరఫరాలేక ఆస్పత్రుల్లో రోగులు, వృద్ధులు, పిల్లలు ఇబ్బందులకు గురయ్యారన్నారు. ప్రజల్ని చీకటిలో ఉంచినందుకు తమను క్షమించాలని కోరారు. ఇప్పటి వరకూ సమ్మెలో పాల్గొన్న 50 వేల మంది ఉద్యోగులూ శుక్రవారం నుంచి విధులకు హాజరుకావాలని సాయిబాబా విజ్ఞప్తి చేశారు. ఈ చర్చల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. సాహూ, ట్రాన్స్కో ఇన్చార్జి సీఎండీ మునీంద్ర, జెన్కో ఎండీ విజయానంద్, విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు శ్రీనివాసరావు, గణేశ్, నరసింహులు, అనురాధ, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. పెరిగిన డిమాండ్.. విద్యుత్ ఉద్యోగులు సమ్మెను విరమించిన నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం నుంచి విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. తిరుపతి కేంద్రంగా ఉన్న ఎస్పీడీసీఎల్లో విద్యుత్ సరఫరా చేయాల్సింది 1,700 మెగావాట్లు ఉండగా... ఏకంగా 2 వేల మెగావాట్ల విద్యుత్ను సరఫరా చేశారు. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న ఈపీడీసీఎల్ పరిధిలో 1,300 మెగావాట్లు తీసుకోవాల్సి ఉండగా.. ఏకంగా 1,600 మెగావాట్లు వినియోగించారు. దీంతో గ్రిడ్ ఫ్రీక్వెన్సీ 49.5 హెట్జ్కు పడిపోయింది. అయితే, తిరిగి విద్యుత్ కోతలు విధించడంతో సాధారణ స్థితికి చేరుకుంది. శుక్రవారం నుంచి విధుల్లో పాల్గొంటామని నేతలు ప్రకటించినప్పటికీ.. గురువారం మధ్యాహ్నం నుంచి విధుల్లో చేరారు. అనంతరం శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో ఏడు యూనిట్లకు నాలుగు యూనిట్లలో సాయంత్రానికి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. ఎగువ సీలేరు, డొంకరాయిలోనూ ఉత్పత్తి ప్రారంభమైంది. వైఎస్సార్ జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటు(ఆర్టీపీపీ)లో ఉద్యోగులు మధ్యాహ్నం నుంచి విధుల్లో చేరారు. గురువారం రాత్రి నాటికి నాలుగో యూనిట్లో ఉత్పత్తి ప్రారంభించేందుకు చర్యలు ప్రారంభించారు. విజయవాడలోని నార్లతాతారావు థర్మల్ పవర్ స్టేషన్(ఎన్టీటీపీఎస్)లో ఉద్యోగులు సాయంత్రం నుంచి విధుల్లో చేరారు. సమ్మె కాలాన్ని సెలవుగా ప్రకటించాలని కోరారు. ఇందుకు యాజమాన్యం పరిశీలిస్తామని హామీ ఇవ్వడంతో సాయంత్రం నుంచి విధులకు హాజరయ్యారు. ఇందులో కూడా విద్యుత్ ఉత్పత్తి చర్యలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం నుంచి ఉత్పత్తి ప్రారంభం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇది సరికాదు సమ్మె విరమించిన నేపథ్యంలో ప్రధాన విద్యుత్ ఉద్యోగ సంఘాలతో విద్యుత్ సౌధలో జెన్కో ఎండీ కె. విజయానంద్, ట్రాన్స్కో సీఎండీ (ఇన్చార్జి) మునీంద్రలు గురువారం సాయంత్రం సమావేశమయ్యారు. విద్యుత్ లాంటి అత్యవసర రంగం, ప్రజలకు ఎంతో అవసరమైన రంగంలో సమ్మె చేయడం సరికాదని సంఘాల నాయకులకు అధికారులు వివరించారు. మరోసారి సమ్మెకు దిగకుండా మీ సంఘంలోని కార్యకర్తలకు సూచించాలని కోరారు. ఇందుకు సంఘాల నాయకులు సమ్మతి తెలిపారు. -
ఉద్యోగుల ఆందోళనతో సగానికి పడిపోయిన విద్యుత్ ఉత్పత్తి
-
విద్యుత్ ఉద్యోగుల సమ్మె 16కు వాయిదా
హైదరాబాద్: సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల సమ్మె ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దాంతో వారు సమ్మెను వాయిదా వేసుకున్నారు. తొలుత ఈ రోజు అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభిస్తున్నట్లు సీమాంధ్ర ట్రాన్స్కో, జెన్కో ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు ఈ రోజు సాయంత్రం అధికారులతో చర్చలు జరిపారు. ఆ చర్చలు విఫలమయ్యాయి. ఆ తరువాత క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. సీఎంతో మాట్లాడిన తరువాత సమ్మె వాయిదా నిర్ణయం తీసుకున్నారు.