Advertisement
Tricolor Flag
-
2023లో ఎవరెస్ట్ను ఎందరు అధిరోహించారు? సరికొత్త రికార్డు ఏమిటి?
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని గడచిన 70 ఏళ్లలో అధిరోహించిన వేలాది మంది పర్వతారోహకులు సరికొత్త రికార్డులు సృష్టించారు. వీరిలో పలువురు భారతీయులు కూడా ఉన్నారు. గత 70 ఏళ్లలో సుమారు ఏడు వేల మంది పర్వతారోహకులు ఎవరెస్ట్ను అధిరోహించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కరుగుతున్న హిమానీనదాలు, మంచు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ, పర్వతారోహణ సంఘం ఈ సంవత్సరం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన 70వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. 2023లో నలుగురు భారతీయులతో సహా దాదాపు 500 మంది పర్వతారోహకులు ఈ ఎత్తయిన శిఖరాన్ని అధిరోహించారు. న్యూజిలాండ్కు చెందిన ఎడ్మండ్ హిల్లరీ, నేపాల్కు చెందిన షెర్పా టెన్జింగ్ నార్గే 8,848.86 మీటర్ల ఎత్తయిన ఎవరెస్ట్ పర్వతాన్ని 1953, మే 29న ఆవిష్కరించారు. ఎవరెస్ట్ పర్వతాన్ని నేపాలీ భాషలో సాగరమాత అని అంటారు. ఎడ్మండ్-నార్జ్ 1953లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తర్వాత దాదాపు 7000 మంది పర్వతారోహకులు ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. ఇప్పటివరకూ 300 మందికి పైగా పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారని అధికారిక సమాచారం. 2023లో మొత్తం 478 మంది పర్వాతారోహకులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఈ ఏడాది నలుగురు భారతీయులు ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోగా, ఒకరు ప్రాణాలు కోల్పోయారు. భారత్కు చెందిన యాషి జైన్, మిథిల్ రాజు, సునీల్ కుమార్, పింకీ హారిస్ మే 17న ప్రపంచంలోనే ఎత్తయిన ఈ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. భారత పర్వతారోహకురాలు సుజానే లియోపోల్డినా మే 18న ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద శిఖరాన్ని అధిరోహించే ప్రయత్నంలో మరణించారు. ఈ ఏడాది ఎవరెస్ట్ పర్వతారోహణ యాత్రలో నలుగురు నేపాలీలు, ఒక భారతీయ మహిళ, ఒక చైనీస్ సహా 11 మంది పర్వతారోహకులు మరణించారు. ఎనిమిది మంది గల్లంతయినట్లు అధికారులు తెలిపారు. 2023లో నేపాల్కు చెందిన కమీ రీటా షెర్పా (53) ఎవరెస్ట్ శిఖరాన్ని 28 సార్లు అధిరోహించి, సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇది కూడా చదవండి: 2023లో భారత్- చైనా సంబంధాలు ఎలా ఉన్నాయి? -
వైరల్ 75 కాదు 25!
సాధారణంగా 75 సంవత్సరాల వయసులో కొద్దిదూరం నడిచినా ఆయాసపడుతుంటారు. అస్సాంలోని దిబ్రూఘర్కు చెందిన 75 సంవత్సరాల హీర బోరా అలా కాదు. ఆరోగ్యకరమైన జీవనశైలి విషయంలో యువతను చైతన్యవంతం చేయడానికి త్రివర్ణ పతాకం చేతబూని పదికిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. ‘ఆమె వయసు 75 నుంచి 25కు వచ్చింది’ అంటూ నెటిజనులు స్పందించారు. -
Azadi Ka Amrit Mahotsav: దేశానికి పండుగొచ్చింది
న్యూఢిల్లీ: దేశానికి పండుగ కళ వచ్చేసింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు త్రివర్ణ పతాక శోభ ఉట్టిపడుతోంది. మువ్వన్నెల రెపరెపలతో ప్రతీ ఇల్లు కళకళలాడుతోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృతోత్సవ్లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. దేశంలోని ప్రతీ ఇంటిపై జాతీయ జెండా సమున్నతంగా ఎగరాలన్న ఉద్దేశంతో 13వ తేదీ నుంచి 15 వరకు ప్రతీ ఒక్కరూ ఇళ్లపై జాతీయ జెండాని ఆవిష్కరించాలని కేంద్రం పిలుపునిచ్చింది. ఈ పిలుపునందుకొని రాజకీయ నాయకుల దగ్గర నుంచి సామాన్యుల వరకు ఎంతో ఉత్సాహంగా జాతీయ జెండాని ఆవిష్కృతం చేస్తున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రొఫైల్ పిక్చర్స్ కింద జాతీయ జెండా ఇమేజ్లను ఉంచుతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన సతీమణితో కలిసి ఢిల్లీలోని తన నివాసంపై మువ్వన్నెల జెండా ఎగురవేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రం మంత్రులు నేతలు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘జాతీయ జెండా మనకి గర్వకారణం. భారతీయులందరినీ సమైక్యంగా ఉంచుతూ స్ఫూర్తి నింపుతుంది. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన త్యాగధనుల్ని అందరం స్మరించుకుందాం’’ అని షా ట్వీట్ చేశారు. గత పది రోజుల్లోనే పోస్టాఫీసుల ద్వారా ఒక కోటి జాతీయ జెండాలను విక్రయించినట్టుగా పోస్టల్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఇక గ్రామాలు, పట్టణాల్లోనూ జాతీయ జెండాకు సేల్స్ విపరీతంగా పెరిగాయి. ఢిల్లీలోని కేజ్రివాల్ ప్రభుత్వం 25 లక్షల జెండాలను విద్యార్థులకు పంపిణీ చేస్తోంది. గుజరాత్లో ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ విద్యార్థులకు జెండాలు పంచారు. ప్రొఫైల్ పిక్చర్ని మార్చిన ఆరెస్సెస్ ఎట్టకేలకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సామాజిక మాధ్యమాల్లో తన అకౌంట్లలో ప్రొఫైల్ పిక్చర్లో జాతీయ జెండాను ఉంచింది. ఆజాదీ కా అమృతోత్సవ్ వేడుకల్లో భాగంగా అందరూ జాతీయ జెండాలను ప్రొఫైల్ పిక్లుగా ఆగస్టు 2 నుంచి 15వరకు జాతీయ జెండాని ఉంచాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చినప్పటికీ ఆరెస్సెస్ ఇన్నాళ్లూ పట్టించుకోలేదు. కాషాయ రంగు జెండానే ఉంచింది. దీంతో ఆరెస్సెస్పై విమర్శలు వెల్లువెత్తాయి. హర్ ఘర్ కా తిరంగా కార్యక్రమంతో ఆర్సెసెస్ తన ప్రొఫైల్ పిక్లో జాతీయ జెండాను ఉంచింది. -
Mann ki Baat:‘త్రివర్ణ పతాకాన్ని మీ ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకోండి’
న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న క్రమంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఆగస్టు 2 నుంచి 15 తేదీ వరకు వివిధ సోషల్ మీడియాల్లో తమ ప్రొఫైల్ పిక్చర్గా త్రివర్ణ పతాకాన్ని పెట్టుకోవాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 91వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం వివిధ అంశాలపై మాట్లాడారు. 75 ఏళ్ల స్వాతంత్య్రానికి గుర్తుగా దేశంలోని 75 రైల్వే స్టేషన్లకు స్వాతంత్య్ర సమరయోదుల పేర్లు పెట్టినట్లు గుర్తు చేశారు. అలాంటి స్టేషన్లను పిల్లలు సందర్శించాలని సూచించారు. ‘దేశం కోసం ప్రాణత్యాగం చేసిన షాహీద్ ఉద్ధమ్ సింగ్ జీకి సంతాపం తెలుపుతున్నాం. ఆజాదీకా అమృత్ మహోత్సవం ఒక ఉద్యమంగా సాగుతుండటం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరు భాగస్వాములై.. ఆగస్టు 2-15 వరకు తమ ప్రొఫైల్ పిక్చర్గా మువ్వన్నెల జెండాను పెట్టుకోవాలి. అలాగే.. ఆగస్టు 13 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో భాగమై.. మీ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలి.’ అని ప్రజలను కోరారు ప్రధాని మోదీ. హిమాచల్ప్రదేశ్లో జరుగుతున్న మిజార్ మేళాను వీలైతే సందర్శించాలని ప్రజలను కోరారు మోదీ. మరోవైపు.. పీవీ సింధూ, నీరజ్ చోప్రాలకు శుభాకాంక్షలు తెలిపారు. యూకేలోని బర్మింగ్హామ్లో జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులు గొప్ప ఆట తీరును ప్రదర్శించాలని ఆకాక్షించారు. ఇదీ చదవండి: Mann Ki Baat: ‘ఎమర్జెన్సీ’లో ప్రజాస్వామ్యాన్ని అణచే యత్నం -
జాతీయ జెండాపై కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ జెండాకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్లాగ్ కోడ్కు స్వల్ప మార్పులు చేసింది. ఇకపై మువ్వన్నెల జెండాను పగలే కాకుండా రాత్రివేళ కూడా ఎగురవేయవచ్చు. అలాగే కేవలం చేతితో తయారు చేసిన కాటన్ జెండాలనే కాకుండా.. మెషీన్లతో చేసే పాలిస్టర్ జెండాలను కూడా ఉపయోగించవచ్చు. ఈమేరకు ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002, ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ 1971కు సవరణలు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఇప్పటివరకు వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా జాతీయ జెండాను సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకే ఎగురవేసేందుకు అనుమతి ఉంది. పాలిస్టర్, మెషీన్లతో తయారు చేసిన జెండాలను ఉపయోగించడానికి వీల్లేదు. అయితే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమానికి పిలుపునిచ్చింది కేంద్రం. దేశంలోని ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఫ్లాగ్ కోడ్కు మార్పులు చేసింది. చదవండి: అందుకే నా కూతుర్ని టార్గెట్ చేశారు: స్మృతి ఇరానీ -
Nature Tricolor Photo: ప్రకృతి దిద్దిన మువ్వన్నెల జెండా
ప్రకృతి చిత్రవిచిత్రాలు చేస్తుంది. అందుకు నిదర్శనం ఈ చిత్రం. అస్తమయానికి ముందుగా సూర్యుడు పులుముకున్న సింధూరం. సముద్రపు అలల నురగల శ్వేతవర్ణం. సాగర తీరాన పరుచుకున్న పచ్చదనం. ఆకాశం, నీరు, నేల.. ప్రకృతి సమస్తం మువ్వన్నెల జెండాను ప్రతిబింబిస్తోంది కదా! ఈ చిత్రాన్ని ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ప్రకృతి రూపొందించిన మన త్రివర్ణ పతాకం’అంటూ కామెంట్ను జత చేశారు. Our Pride, Our Tiranga! 🇮🇳 #AmritMahotsav #MomentsWithTiranga #HarGharTiranga Image Courtesy: @singhsanjeevku2 pic.twitter.com/pUdBNt8C03 — MyGovIndia (@mygovindia) July 10, 2022 -
భారత మాతకు దివ్య హారతి
సాక్షి, హైదరాబాద్: భారత మాత వేషధారణలో 1,500 మంది విద్యార్థులు.. మూడు రంగుల వస్త్రధారణతో త్రివర్ణ పతాక ఆకృతి.. గంభీరంగా భారతమాత విగ్రహం.. దేశ ఔన్నత్యాన్ని చాటే సాంస్కృతిక కార్యక్రమాలు.. ఇవన్నీ భారత మాతకు దివ్య హారతినిచ్చాయి. దేశంలోనే మొదటిసారిగా శుక్రవారం హైదరాబాద్లోని నెక్లెస్రోడ్డులో ఉన్న పీపుల్స్ ప్లాజాలో భారత మాతకు హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతమాత ఫౌండేషన్ చైర్మన్ కిషన్రెడ్డి ఆధ్వర్యంలో స్వామి పరిపూర్ణానంద స్వామి ఆశీస్సులతో జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగగా... రాత్రి 9.15 నిమిషాలకు భారతమాతకు హారతి, త్రివర్ణ పతాక హారతి, గంగా హారతి, గోప్రకృతి హారతి, మహనీయుల హారతి, భారత రత్న హారతి, త్రివిధ దళాల హారతి, వేద హారతి నిర్వహించారు. గర్వంగా చెప్పుకొందాం.. అందరం భారతీయులమని సగర్వంగా చెప్పుకొందామని.. విశ్వగురువుగా అడు గులు వేసే శక్తి ఈ దేశానికి ఉందని స్వామి పరిపూర్ణానంద స్వామి పేర్కొన్నారు. స్త్రీజాతికి ప్రథమ స్థానం ఇచ్చిన దేశం మనదని, మానవత్వమనే సందేశాన్ని పంచి.. మంచి, మర్యాదలను పెంచిందని చెప్పారు. భారతదేశం విలువ తెలియాలంటే.. దేశం దాటి ఇతర దేశాలకు వెళ్లాలని, ఒకటి రెండు రోజుల్లోనే మన దేశం విలువ తెలుస్తుందని స్పష్టం చేశారు. స్వామి వివేకానంద ఎన్ని దేశాలు చుట్టినా.. చివరికి భారత గడ్డ మీద విమానం దిగగానే భూమిని ముద్దాడారని గుర్తుచేశారు. కార్యక్రమం అనంతరం పలువురు ప్రముఖులను కిషన్రెడ్డి సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ రామచందర్రావు, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్రావు తదితరులు పాల్గొన్నారు. భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో హారతి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం 15 వందల మంది విద్యార్థినులు ఒకే చోట భారత మాత వేషధారణతో నిర్వహించిన ‘భారతమాతకు హారతి’కార్యక్రమానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం లభించింది. -
ప్రతిసృష్టికి రంగం సిద్ధమైందా?
2014 ‘శాస్త్ర’ రౌండప్ అంతరిక్షంపై జ్ఞానం మరింత పెరిగిన ఏడాది ఇది...శాస్త్ర, సాంకేతిక ప్రపంచాల్లోనూ మనిషి సత్యాన్వేషణ మరింత పదునెక్కింది. చిక్కుముళ్లను విప్పే ప్రయత్నాలు ఊపందుకోగా... చికాకుపెట్టే వ్యాధులకు చెక్ పెట్టడంలోనూ ఎంతో కొంత విజయం సాధించాడు. మొత్తమ్మీద శాస్త్ర రంగంలో ఈ ఏడాది పరిణామాలు... ఎంతో మోదం... కొంచెం ఖేదం అని చెప్పకతప్పదు అదెలాగో.. ఆ ఘన విజయాలేమిటో... నిరాశపరిచిన అంశాలేమిటో మీరే చూడండి మరి....! టూకీగా... ⇒ మనిషి మెదళ్ల మాదిరిగా పనిచేసే మైక్రోచిప్లను అంతర్జాతీయ సంస్థ ఐబీఎం ఈ ఏడాది తొలిసారి డిజైన్ చేసింది. ⇒ వినూత్నమైన సాఫ్ట్వేర్ సాయంతో ఇంజినీర్లు ఒకదానితో ఒకటి సహకరించుకునే రోబోలకు రూపకల్పన చేశారు. ఈ రోబోల బృందానికి సమాచార సేకరణతోపాటు ప్రత్యేక ఆకారాల్లోకి మారిపోయే సామర్థ్యం ఉంటుంది. ⇒ కొండంత సైజున్న రాక్షసబల్లులు కాలక్రమంలో అందమైన పక్షుల్లా ఎలా మారిపోయాయో శాస్త్రవేత్తలు ఈ ఏడాది వివరించారు. ఇండొనేషియాలోని గుహల్లో కనిపించిన కుడ్యచిత్రాలు మనిషి సాంస్కృతిక జీవన కాలాన్ని నాలుగు రెట్లు వెనక్కు నెట్టాయి. ⇒ పాత జ్ఞాపకాలను చెరిపేసి, కొత్త వాటిని మెదళ్లలోకి జొప్పించేందుకు ఎలుకలపై జరిగిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ⇒ అద్దె గర్భంలో పిండాలను పెంచి జన్మనివ్వడం గురించి మనకు తెలుసు. అయితే ఈ ఏడాది తొలిసారి ఓ మహిళ వేరొకరి గర్భాశయాన్ని అమర్చుకుని దానిద్వారా బిడ్డను ప్రసవించింది. టెస్ట్ట్యూబ్లలో కాకుండా సొంతంగా బిడ్డను కనాలనుకునే మహిళల (గర్భాశయ లోపాలున్నవారు లేదా అసలు గర్భాశయమే లేనివారు) ఆశలు నెరవేరే సమయం దగ్గరలోనే ఉందన్నమాట. ⇒ ఉపగ్రహమంటే భారీసైజుండాలన్న భావనకు ఫుల్స్టాప్ పడిన సంవత్సరం కూడా ఇదే. కేవలం పది సెంటీమీటర్ల సైజు... ఇంకా చెప్పాలంటే ఓ స్మార్ట్ఫోన్ సైజు మాత్రమే ఉండే ఉపగ్రహాలు ఎన్నో ఈ ఏడాది నింగికెగశాయి. అంతరిక్షంపై త్రివర్ణ పతాకం.... అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ తన ముద్రను బలంగా చాటిన సంవత్సరమిది. గత ఏడాది ప్రయోగించిన మామ్ ఉపగ్రహాన్ని కూడా అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టగలగడం మన సాంకేతిక పరిజ్ఞానానికి మేలిమి నిదర్శనం. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన అన్ని రంగాల్లోనూ తనదైన పరిణితిని కనపరచిన ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన క్రయోజెనిక్ ఇంజిన్ను కూడా పరీక్షించి చూసింది. దీంతోపాటు ప్రాంతీయ జీపీఎస్ వ్యవస్థకు అవసరమైన రెండు ఉపగ్రహాలను ప్రయోగించింది. ఈ వ్యవస్థ ద్వారా ప్రజలతోపాటు మిలటరీ అవసరాలు కూడా అనేకం తీరతాయని అంచనా. అడకత్తెరలో భూమి భవిష్యత్తు... భూ తాపోన్నతి, దాని విపరిణామాల గురించి ప్రపంచానికి తెలియజేసిన ఇంటర్గవర్నమెంటల్ ప్యానెల్ ఫర్ క్లైమెట్ ఛేంజ్ (ఐపీసీసీ) తాజాగా 2014లో పూర్తిస్థాయి నివేదికను సమర్పించింది. ధనిక, పేద దేశాల తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను గణనీయంగా తగ్గించుకోకపోతే 2100 నాటికి భూమి సరిదిద్దుకోలేని పరిస్థితికి చేరుకుంటుందని ఈ తాజా నివేదిక స్పష్టంగా హెచ్చరించింది. పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని, లేకుంటే వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రమవుతుందని తెలిపింది. మరోవైపు ఈ నెలలో పెరూ రాజధాని లిమాలో సమావేశమైన ప్రపంచదేశాలు వాతావరణ మార్పులను సమర్థంగా ఎదుర్కొనే విషయంలో స్థూలంగా ఒక అంగీకారానికి వచ్చాయి. ప్రతిసృష్టికి కొత్త రెక్కలు... సృష్టికి ప్రతిసృష్టి చేయాలన్న మనిషి ఆశలకు కొత్త రెక్కలు వచ్చిన ఏడాది ఇది. కృత్రిమ జీవశాస్త్ర రంగంలో నమోదైన రెండు ఘన విజయాలు భవిష్యత్తులో కొత్తరకం జీవజాతుల సృష్టికి నాందీ వాక్యం పలికాయి. మే లో కాలిఫోర్నియా శాస్త్రవేత్తల బృందం తొలిసారి ప్రకృతిలో ఇప్పటివరకూ లేని విధంగా మొత్తం ఆరు రసాయనలతో ఈ కోలీ సూక్ష్మజీవి డీఎన్ఏను మార్చేశారు. దీని ద్వారా భవిష్యత్తులో వినూత్న లక్షణాలున్న మూలకాలు, పదార్థాలను తయారు చేయడం వీలవుతుందని అంచనా. మరోవైపు ఈ ఏడాది మార్చిలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందమొకటి కృత్రిమ ఈస్ట్ క్రోమోజోమ్ను అభివృద్ధి చేయడంలో విజయం సాధించారు. ఇది భవిష్యత్తులో చౌకైన వ్యాక్సీన్లు, జీవ ఇంధనాల తయారీకి ఉపయోగపడుతుందని అంచనా. అంతరిక్షంలో చీకటి వెలుగులు... అంతర్జాతీయ స్థాయిలో అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు సాధించాయి. ప్రైవేట్ కంపెనీలు పోటాపోటీగా జరుపుతున్న ప్రయోగాలు కొన్ని విజయం సాధించగా మరికొన్ని చతికిలబడ్డాయి. వర్జిన్ గలాటిక్ అంతరిక్ష నౌక నవంబరు నెలలో నింగికెగసి ముక్కలై నేలకొరిగింది. ఈ సంఘటనలో ఇద్దరు పెలైట్లు మరణించారు. మరోవైపు ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మూడుసార్లు సామగ్రి రవాణా చేయగలిగింది. అక్టోబరులో జరిగిన నాలుగో ప్రయత్నం మాత్రం బెడిసికొట్టింది. ఇంకోవైపు అంతరిక్ష వాహక నౌకలన్నీ మూలనపడ్డ నేపథ్యంలో నాసా అభివృద్ధి చేసిన సరికొత్త వాహకనౌక ఓరియన్ తొలి ప్రయోగం విజయవంతం కావడం విశేషం. తోకచుక్కపై మనిషి ముద్ర... తోకచుక్కను పూర్తిగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నం జరిగింది. రోసెట్టా అనే అంతరిక్ష నౌక నవంబరు 12న 67పీ పేరుగల తోకచుక్కను సమీపించింది. ఆ వెంటనే దాంట్లోంచి ఫిలే ప్రొబ్ వేరుపడింది. దీంతో పరిశోధకుల్లో ఉత్సాహం ఉరకలెత్తినా, వెంటనే దాంతో సంబంధాలు తెగిపోవడంతో ఉసూరుమన్నారు. లభించిన కొద్ది సమయంలోనే శాస్త్రవేత్తలు వీలైనంత ఎక్కువ సమాచారాన్ని సేకరించారు. ఈ పరిశోధనల కారణంగా తోకచుక్కల్లోనూ కర్బన ఆధారిత మూలకాలు ఉన్నట్లు స్పష్టమైంది. భూమిపై కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడ్డ నీటికి కూడా తోకచుక్కలు కారణం కాకపోవచ్చునని తేలింది. మధుమేహానికి మూలకణ చికిత్స! హార్వర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అక్టోబరులో మధుమేహంపై కీలక పరిశోధనలో విజయం సాధించారు. క్లోమగ్రంథిలోని బీటా కణాలు రక్తంలోని గ్లూకోజ్ మోతాదులను నియంత్రిస్తూంటాయి. అయితే టైప్-1 మధుమేహ వ్యాధిగ్రస్థుల్లోని రోగ నిరోధక వ్యవస్థ ఈ బీటా కణాలను నాశనం చేస్తూంటుంది.ఈ సమస్యను అధిగమించేందుకు హార్వర్డ్ శాస్త్రవేత్తలు పిండమూల కణాలనే బీటా కణాలు మార్చేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. రోగి శరీరంలోకి జొప్పించేందుకు సరిపడా కణాలను తయారుచేయగలిగినప్పటికీ ఈ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు మరికొంత సమయం పట్టవచ్చు. తొడుక్కునే గాడ్జెట్ల హవా... టెక్నాలజీ రంగంలో ఈ ఏడాది స్మార్ట్ఫోన్ల స్థానాన్ని తొడుక్కునే గాడ్జెట్లు (వేరబుల్ గాడ్జెట్స్)లు ఆక్రమించాయి. దిగ్గజ కంపెనీలన్నీ ఏదో ఒక రూపంలో స్మార్ట్వాచీలు, ఫిట్నెస్ గాడ్జెట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టాయి. మూర్ఛరోగ లక్షణాలు మొదలుకొని గుండెచప్పుడును నిరంతరం పరిశీలించడం వరకూ రకరకాల పనులు చేసిపెట్టగల ఈ గాడ్జెట్లు కొత్త సంవత్సరంలోనూ సంచలనాలు సృష్టిస్తాయనడంలో సందేహం లేదు. యువరక్తం మంచిదే..! ఈ ఏడాది జరిగిన ఓ ప్రయోగం మొత్తం పరిస్థితిని మార్చేసింది. స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు జంతువులపై జరిపిన ప్రయోగాల్లో యువరక్తంతో వృద్ధాప్య లక్షణాలను వెనక్కు తిప్పవచ్చునని నిరూపించారు. యువరక్తం లేదా రక్తంలోని కొన్ని రకాల పదార్థాలను ముసలి ఎలుకల్లోకి చేర్చినప్పుడు వాటి మెదడు క్రియలు మళ్లీ చురుకెత్తాయని, కండరాల పటుత్వం కూడా పెరిగిందని స్టాన్ఫర్డ్ ప్రయోగాలు నిరూపించాయి. అంటే వృద్ధాప్య సమస్యలకు యువరక్తం విరుగుడుగా పనిచేస్తుందన్నమాట. మానవుల్లోనూ ఇదే రకమైన ఫలితాలు వస్తే..? ఏమో! కొత్త సంవత్సరంలో చూద్దాం!! అంకెల్లో 2014 30.1 కోట్లు... ఈ ఏడాది చివరి మూడు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోయిన స్మార్ట్ఫోన్ల సంఖ్య ఇది. ప్రముఖ నెట్ సెకూరిటీ సంస్థ గార్ట్నర్ అంచనాల ప్రకారం ఇది గత ఏడాది కంటే 20 శాతం ఎక్కువ. మూడేళ్లలోపు మొబైల్ ఫోన్లలో స్మార్ట్ఫోన్ల వాటా ప్రస్తుతపు 66 శాతం నుంచి 90 శాతానికి పెరుగుతుందని అంచనా. రూ.1500.. మన జన్యుక్రమ సమాచారాన్ని ఏడాదిపాటు భద్రంగా దాచి ఉంచేందుకు గూగుల్ జినోమిక్స్ వసూలు చేసే మొత్తమిది. ఈ సమాచారంతో రాబోయే జబ్బుల గురించి ముందే తెలుసుకోవచ్చు. మేలైన చికిత్స మార్గాలూ వెతుక్కోవచ్చు. ఇదిలా ఉంటే బ్రిటిష్ ప్రభుత్వం ప్రపంచంలోనే తొలిసారిగా లక్ష మంది పౌరుల జన్యుక్రమాలను నమోదు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 440 కోట్ల టెరాబైట్లు.. ఫేస్బుక్ కామెంట్లు మొదలుకొని వికీపీడియాలోని సమాచారం వరకూ డిజిటల్ ప్రపంచం మొత్తమ్మీద నిక్షిప్తమై ఉన్న ఇన్ఫర్మేషన్ మోతాదు ఇది. ఇంటర్నేషన్ డేటా కార్పొరేషన్ అంచనా ప్రకారం ఈ సమాచారం ఏడాదికి 40 శాతం చొప్పున పెరుగుతోంది. 2030 చైనా విడుదల చేసే గ్రీన్హౌస్ వాయువుల మోతాదు పతాక స్థాయికి చేరే ఏడాది ఇది. భూతాపోన్నతి ప్రమాదం ముంచుకొస్తున్న నేపథ్యంలో ఈ అంకెకు ఎంతో ప్రాధాన్యముంది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చైనా ఆర్థిక వ్యవస్థ అంతే వేగంగా వాతావరణానికి హాని చేసే విషవాయువులను వెదజల్లుతోంది. 1990 నుంచి ఏటా పెరుగుతున్న ఈ ఉద్గారాలకు కళ్లెం వేయకపోతే కష్టమే. ఉద్గారాల తగ్గింపునకు అమెరికా, చైనాలు ఒక ఒప్పందానికి రావడం పర్యావరణపరంగా ఈ ఏడాది హాట్టాపిక్గా నిలిచింది. 40 శాతం సోలార్ ప్యానెల్స్ ఈ ఏడాది సృష్టించిన రికార్డు ఇది. తమపై పడే సూర్యరశ్మిలో విద్యుత్తుగా మార్చే సామర్థ్యం 40 శాతానికి చేరింది. రేపటి హరివిల్లు... 2009లో కనుక్కున్న పెరోవిస్కైట్, కాడ్మియం టెలూరైడ్ వంటి పదార్థాల కారణంగా ఇది సాధ్యమైంది. ప్రస్తుతం ఎంత మంచి సోలార్ ప్యానెల్ సామర్థ్యమైనా 15 శాతానికి మించని నేపథ్యంలో ఇది నిజంగానే శుభవార్త. 2014... వాతావరణ రికార్డులు నమోదు చేయడం మొదలుపెట్టిన తరువాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరం ఇదే. ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో ఉష్ణోగ్రత రికార్డులు బద్దలైపోగా, అదే సమయంలో కొన్నిచోట్ల అతిశీతల వాతావరణం, కాశ్మీర్ వంటిచోట్ల కుంభవృష్టి, వరదలతో వాతావరణం మనిషిని బెంబేలెత్తించింది. రేపటి హరివిల్లు... అంధత్వంపై మలి సమరం.. అంధత్వంపై మనిషి మలిసమరం కొత్త ఏడాదిలో మొదలుకానుంది. ప్రపంచంలోనే మొదటిసారిగా ప్యారిస్లో జన్యుశాస్త్రం ఆధారంగా అంధత్వ నివారణ ప్రయోగాలు జరగనున్నాయి. కళ్లల్లో కాంతికి స్పందించే కణాల్లో తేడా వస్తే వచ్చే అంధత్వం (రెటినిటిస్ పిగ్మెంటోసా) ఉన్నవారిపై జెన్సైట్ అనే సంస్థ ఈ ప్రయోగాలు చేయనుంది. వెలుతురు పడగానే స్పందించి ప్రత్యేకమైన ప్రొటీన్లను తయారు చేసే ఓ జన్యువును జొప్పించడం ద్వారా కోల్పోయిన దృష్టిని తిరిగి తేగలమని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. ఈ రకమైన ప్రయోగం మృతుల నుంచి వెలికితీసిన కనుగుడ్లలో విజయం సాధించినప్పటికీ సాధారణ మానవుల్లో ఎలా పనిచేస్తుందో స్పష్టంగా తెలియదు. పైగా ఈ ప్రయోగం తరువాత కనిపించే దృశ్యాలు కేవలం బ్లాక్ అండ్ వైట్లో మాత్రమే ఉంటాయన్న అంచనాలున్నాయి. మెదడుకు అందే కాంతి సంకేతాల తీవ్రతను మార్చడం ద్వారా ఈ సమస్యను మార్చవచ్చునని జెన్సైట్ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్లూటో తొలిఫోటో ఈ ఏడాదే... మన సౌరకుటుంబంలోని చిట్టచివరి ఖగోళ వస్తువు... ప్లూటో ఫోటో ఇప్పటివరకూ మన వద్ద లేదంటే ఆశ్చర్యమేస్తుంది. కానీ వచ్చే ఏడాది ఈ పరిస్థితి మారనుంది. నాసా ప్రయోగించిన న్యూహొరైజన్స్ ప్రోబ్ తొలిసారి ఈ మినీగ్రహం ఫొటోను తీసి పంపనుంది. జూలై 14న ఆ గ్రహం దగ్గరగా వెళ్లినప్పుడు అత్యంత స్పష్టమైన ఫొటోలు తీయడం వీలవుతుందని, ఫిబ్రవరి నుంచి మే నెల మధ్యలో కొంత తక్కువ రెజల్యూషన్ గల ఫొటోలు లభిస్తాయని నాసా చెబుతోంది. మలేరియా టీకా వచ్చేస్తోంది.. ఏటా లక్షల మంది మరీ ముఖ్యంగా పిల్లల ప్రాణాలు బలితీసుకుంటున్న మలేరియా మహమ్మారిని అంతమొందించే దిశగా అభివృద్ధి చేసిన తొలి టీకా 2015లో అందుబాటులోకి రానుంది. గ్లాస్గో స్మిత్క్లైమ్ బీచెమ్ (జీఎస్కే) కంపెనీ ‘పాథ్ మలేరియా ఇనిషియేటివ్’ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేసిన ఈ టీకాను ఆఫ్రికాలోని 11 దేశాల్లో దాదాపు 15 వేల మందిపై ప్రయోగించి చూశారు. ముందుగా యూరోపియన్ దేశాల్లో వినియోగంలోకి తీసుకువస్తారు. ఆ తరువాత ఆఫ్రికాదేశాల్లోనూ అందుబాటులోకి వస్తుంది.