T.sudharshan reddy
-
అప్పుడే ఆమ్యామ్యా..!
ఉద్యోగంలో చేరి నెలైనా కాకుండానే... కనీసం మొదటి నెల వేతనమైనా అందుకోకుండానే.. అవినీతి మకిలీ అంటించుకున్నాడో వీఆర్వో. కంప్యూటర్ పహణీలో పేరు నమోదు చేసేందుకు ఓ రైతు నుంచి రూ.2 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు తంగళ్లపల్లి వీఆర్వో గుర్రం రాజుగౌడ్. కోహెడ : ఏసీబీ డీఎస్పీ టి.సుదర్శన్గౌడ్ కథనం ప్రకారం.. తంగళ్లపల్లికి చెందిన పెద్ది ఎల్లయ్య అనే రైతుకు గ్రామంలోని సర్వేనంబర్ 726లో 2.05 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పట్టాదారు పాస్పుస్తకాలు ఉన్నాయి. 1బీ రిజిష్టర్లో కూడా నమోదై ఉంది. కంప్యూటర్ పహణీలో పేరు రాకపోవడంతో అందులో నమోదు కోసం ఎల్లయ్య పెద్దకొడుకు కుమార్ వీఆర్వో రాజుగౌడ్ను సంప్రదించాడు. రూ.2 వేలు ఇస్తే నమోదు చేస్తానని వీఆర్వో చెప్పాడు. పహణీలో పేరు కోసం గతంలో రూ.500 తీసుకున్నాడని, ఇప్పుడు కంప్యూటర్ పహణీలో నమోదుకు మళ్లీ డబ్బులు అడగడంతో ఏసీబీని ఆశ్రయించాడు. వారు సూచన మేరకు శుక్రవారం గ్రామంలో వీఆర్వో రాజుకు కుమార్ డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం వీఆర్వోను తహశీల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చారు. శనివారం ఏసీబీ కోర్టులో రిమాండ్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. దాడుల్లో సీఐ సతీశ్చందర్రావు, ఎస్సై రమణమూర్తి, శ్రీనివాస్రాజ్ ఉన్నారు. లంచం కోసం పీడిస్తున్నవారి భరతం పడతామని డీఎస్పీ తెలిపారు. లంచం అడిగేవారిపై తమకు ఫిర్యాదు చేయాలని లేదా 9440446150 నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ్చఛిఛజుటఃజఝ్చజీ. ఛిౌఝకు సమాచారం అందించాలన్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు పొంది, 1బీలో ఉన్న రైతులకు సంబందించిన భూమి వివరాలు ఉచితంగా కంప్యూటర్ పహణీలో పొందుపరుస్తారని తెలిపారు. -
ఏసీబీకి చిక్కిన ఎలిగేడ్ ఎంఈవో
కరీంనగర్ క్రైం, న్యూస్లైన్ : ఎలిగేడ్ మండల ఇన్చార్జి విద్యాధికారి ఎర్రం రమేశ్ ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుల వద్ద రూ.10వేలు లంచం తీసుకుంటూ బుధవారం రాత్రి కరీంనగర్లో ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ టి.సుదర్శన్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ విద్యానగర్కు చెందిన రమేశ్బాబు షీలా ఆర్గనైజేషన్ రూరల్ టెక్నాలజీ అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నాడు. రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో బడి మానివేసిన విద్యార్థుల వివరాలు సేకరిస్తున్నారు. ఎలిగేడ్, జూలపల్లి మండలాల విద్యార్థుల వివరాలను సేకరించే ప్రాజెక్టును షీలా ఆర్గనైజేషన్ రూరల్ టెక్నాలజీ సంస్థ చేపట్టింది. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత బిల్లుల కోసం రమేశ్బాబు ఆయా గ్రామాల్లో విద్యార్థుల సర్వే చేపట్టినట్టు సర్పంచులు, కార్యదర్శుల సంతకాలు తీసుకున్నారు. వీటిని చివరకు ఎంఈవో ఆమోదం తెలిపితే బిల్లులు మంజూరు అవుతాయి. ఇందుకోసం రమేశ్బాబు ఎలిగేడ్ మండల ఇన్చార్జి ఎంఈవోగా పనిచేస్తున్న సుల్తాన్పూర్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఎర్రం రమేశ్ను సంప్రదించాడు. సంతకాల కోసం తనకు రూ.10 వేలు ఇవ్వాలని రమేశ్ డిమాండ్ చేస్తూ ఫైళ్లను పెండింగ్లో పెట్టాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారి సూచన మేరకు.. లంచం డబ్బులు ఇస్తానంటూ బుధవారం ఎంఈవోకు ఫోన్ చేశాడు. కరీంనగర్ జ్యోతినగర్లో నివాసం ఉంటున్న ఎంఈవో రమేశ్ రాత్రి 8గంటల ప్రాంతంలో కరీంనగర్ కూరగాయల మార్కెట్లోని శ్రీరామ సైకిల్ స్టోర్ వద్దకు రమ్మని అక్కడ తన బావ సదాశివరెడ్డి ద్వారా రూ.10వేలు తీసుకున్నాడు. వెంటనే ఏసీబీ అధికారులు రంగప్రవేశం చేసి ఎంఈవో రమేశ్, సదాశివరెడ్డిని పట్టుకున్నారు. డబ్బును స్వాధీనం చేసుకుని నిందితులను ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఇద్దరిపైనా కేసు నమోదు చేసి గురువారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని సుదర్శన్గౌడ్ తెలిపారు.