Vedic
-
సుజాత ఏకపాదులు
ఉద్దాలక మహర్షి కూతురు సుజాత. ఉద్దాలకుడు ఆశ్రమవాసం చేస్తూ, గురుకులం నడిపేవాడు. అతడి వద్ద ఎందరో శిష్యులు వేద శాస్త్రాలను అధ్యయనం చేస్తూ ఉండేవారు. ఉద్దాలకుడి ఆధ్వర్యంలో ఆయన శిష్యులు వేదపఠనం చేస్తున్నప్పుడు సుజాత తరచుగా అక్కడకు వచ్చి కూర్చునేది. వారి వేదపఠనాన్ని శ్రద్ధగా ఆలకిస్తూ ఉండేది. ఒకరోజు సుజాత ఎప్పటిలాగానే పండ్లు, పాలు తీసుకుని తండ్రి వద్దకు వచ్చింది. ఉద్దాలకుడు కూతురిని తల నిమిరి, పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఆమె రాకతో వేదాధ్యయనానికి కొద్ది క్షణాలు అంతరాయం కలిగింది. శిష్యుల చూపులు గురువుగారి వైపు, ఆయన గారాల కూతురి వైపు మళ్లాయి. గురువుగారి వైపు చూసే చూపులు భక్తి గౌరవాలతో నిండి ఉంటే, సుజాత వైపు చూసే చూపులు భయం భయంగా, చూసీ చూడనట్లుగా ఉండే దొంగ చూపుల్లా ఉన్నాయి. అక్కడ ఉన్న శిష్యులందరిలోనూ ఏకపాదుడి చూపుల్లో ప్రత్యేకత ఉంది. గురువుగారి వైపు అతడు చూసే చూపుల్లో భక్తి శ్రద్ధలు, సుజాత వైపు చూసే చూపుల్లో నిర్లిప్తత, నిరాసక్తత కనిపిస్తున్నాయి.శిష్యులు తిరిగి వేదాధ్యయనం ప్రారంభించారు. గురువుగారి నోటి నుంచి వచ్చే ప్రతి శబ్దాన్ని, ప్రతి స్వరాన్ని మననం చేసకుంటూ, ఒక్క పొరపాటైనా లేకుండా చెప్పగలిగేవాడు ఏకపాదుడు ఒక్కడే! గురువు ముఖతః వచ్చిన ప్రతి స్వరమూ అతడికి మరుక్షణమే కంఠస్థమయ్యేది. ఏకపాదుడు ఏకసంథాగ్రాహి.ఉద్దాలకుడు సాధుస్వభావి. శిష్యులకు ఎలాంటి ఆంక్షలు పెట్టేవాడు కాదు. అవసరమైన నియమాలను సూచనప్రాయంగా మాత్రమే చెప్పేవాడు. గురువుగారు చెప్పకపోయినా, ఏకపాదుడు స్వయంగా తనకు తానే కొన్ని నియమాలను విధించుకుని, క్రమశిక్షణతో పాటించేవాడు. గురువుగారి బోధనలను శ్రద్ధగా ఆలకిస్తూ, అధ్యయనం చేసేవాడు. ఏకపాదుడి గుణగణాలు ఉద్దాలకుడిని ఆకట్టుకున్నాయి. పసితనం నుంచే తండ్రి దగ్గర కూర్చుంటూ వేదాధ్యయనం వినడాన్ని అలవాటుగా చేసుకున్న సుజాతకు క్రమంగా ఏకపాదుడిపై ఆసక్తి పెరగసాగింది. అధ్యయనం కొనసాగుతున్నంత సేపు ఆమె ఏకపాదుడినే తదేకంగా చూడసాగేది. అతడి నిత్యకృత్యాలను గమనించడం ఆమె దినచర్యలో భాగంగా మారింది. రోజులు, నెలలు, ఏడాదులు గడిచిపోతున్నాయి. సుజాత యవ్వనంలోకి అడుగుపెట్టింది. ఏకపాదుడు యువకుడవుతున్నాడు. ఏకపాదుడిని చూడటం కోసమే సుజాత త్వరగా తన పనులు ముగించుకుని, అధ్యయనం సాగేటప్పుడు తండ్రి వద్దకు చేరేది. సుజాత రాక ఆలస్యమైతే, ఏకపాదుడి చూపులు ఆమె కోసం వెదుకులాడేవి.అధ్యయన వేళల తర్వాత మిగిలిన శిష్యులతో పాటు ఏకపాదుడు దర్భలు, అరణి, కట్టెపుల్లలు ఏరుకోవడానికి వెళ్లేవాడు. ఏకపాదుడిని సుజాత అనుసరించేది. దర్భలు, పుల్లలు ఏరుకునేటప్పుడు కూడా అతడు వేదపాఠాలను మననం చేసుకుంటూ ఉండేవాడు. తన రాకను అతడు పట్టించుకోకుంటే, సుజాతకు కోపం వచ్చేది. అయితే, అతడి ఏకాగ్రచిత్తానికి లోలోపల మెచ్చుకునేది. ఒకనాడు గురువుగారి వద్ద కూర్చున్న సుజాత వైపు నుంచి ఏకపాదుడు ఎంత ప్రయత్నించినా చూపు మరల్చుకోలేకపోయాడు. అతి ప్రయాసతో చూపులను గురువుగారి మీదకు మరల్చాడు. చిత్తాన్ని అధ్యయనంపై కేంద్రీకరించాడు. ఉద్దాలకుడు అంతా గమనిస్తూనే, ఏకపాదుడి ఏకాగ్రతకు ఎంతో ఆనందించాడు. ఉద్దాలకుడి శిష్యులలో ఏకపాదుడు మిగిలిన శిష్యులందరి కంటే మిన్నగా అధ్యయనం పూర్తి చేశాడు. అతడికి ఇక బ్రహ్మచర్యం కొనసాగించవలసిన అవసరం లేదని ఉద్దాలకుడు నిర్ణయించాడు. ఒకనాడు ఉదయాన్నే ఏకపాదుడిని పిలిచాడు. ‘నాయనా! నీ అధ్యయనం పూర్తయింది. గురుకులం విడిచి స్వతంత్రంగా నువ్వే ఇతరులకు గురుత్వం వహించే స్థాయి పొందావు. నువ్వు కోరుకున్నప్పుడు బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టి, గృహస్థాశ్రమాన్ని స్వీకరించవచ్చు’ అని చెప్పాడు. ఏకపాదుడు వినయంగా గురువుకు పాదాభివందనం చేశాడు. అదే సమయంలో ఉద్దాలకుడు తన మనసులో మాట చెప్పాలనుకున్నాడు. ‘నీకు సమ్మతమయితే, మా సుజాతకు నువ్వే తగిన వరుడివని నా నమ్మకం’ అన్నాడు.గురువుగారి మాటకు ఏకపాదుడు మహదానందం చెందాడు. ఈ సంభాషణను గుమ్మం చాటు నుంచి వింటున్న సుజాత కూడా ఆనందంలో తేలిపోయింది. గురువుగారి మాటకు ఏకపాదుడు వెంటనే బదులివ్వక నేలచూపులు చూడసాగాడు.‘ఏకపాదా! నీ అభిప్రాయం..’ అడిగాడు ఉద్దాలకుడు.‘గురువర్యా! తమరి మాట నాకు శిరోధార్యం’ అంటూ ఏకపాదుడు మరోసారి పాదాభివందనం చేశాడు.ఉద్దాలకుడు సుముహూర్తాన్ని నిర్ణయించి, తన కూతురు సుజాతను ఏకపాదుడికిచ్చి వివాహం జరిపించాడు. -
తొలి వేద గడియారం సిద్ధం.. అందుబాటులోకి ఎప్పుడంటే..
ప్రపంచంలోనే మొట్టమొదటి వేద గడియారం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో రూపొందింది. దీనిని మార్చి ఒకటిన ప్రధాని నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ సంయుక్తంగా కాళిదాస్ అకాడమీలో ప్రారంభించనున్నారు. వేద గడియారానికి సంబంధించిన ఇన్స్టలేషన్, టెస్టింగ్ వర్క్ పూర్తయింది. భారత ప్రామాణిక సమయాన్ని ఈ వేద గడియారంలో చూడవచ్చు. ఈ గడియారంలో ఒక గంట అంటే 48 నిమిషాలు. ఈ గడియారం వేద సమయంతో పాటు వివిధ ముహూర్తాలను కూడా చూపిస్తుంది. ఉజ్జయినిలో క్రేన్ సాయంతో దాదాపు 80 అడుగుల ఎత్తులో వాచ్ టవర్ పై దీనిని అమర్చారు. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ మార్చి ఒకటిన ప్రారంభించనున్నారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్ వాచ్ కానుంది. ఇది భారతీయ ప్రామాణిక సమయం (ఐఎస్టీ), గ్రీన్విచ్ మీన్ టైమ్ (జీఎంటీ) మాత్రమే కాకుండా పంచాంగంతో పాటు ముహూర్తాల గురించిన సమాచారాన్ని అందిస్తుంది. సూర్యోదయం, సూర్యాస్తమయాలే కాకుండా సూర్య , చంద్ర గ్రహణాల గురించి కూడా తెలియజేస్తుంది. కాగా వేద క్లాక్ రీడింగ్ కోసం మొబైల్ యాప్ రూపొందించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిని స్మార్ట్ఫోన్, కంప్యూటర్, టెలివిజన్ తదితర పరికరాలలో వినియోగించే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ వేద గడియారాన్ని వ్యవస్థాపించేందుకు ఉజ్జయినిలోని జివాజీ అబ్జర్వేటరీ సమీపంలో 85 అడుగుల ఎత్తైన టవర్ను నిర్మించారు. -
ప్రకృతి ఒడిలోవైదిక గ్రామం.. హైటెక్ యుగంలో ప్రాచీన జీవన విధానం
అక్కడ సెల్ఫోన్ నోటిఫికేషన్లు.. రింగ్టోన్ సౌండ్లు వినిపించవు.. టీవీలూ కనిపించవు. కానీ.. సకల చరాచర సృష్టిలో జీవులు ఉద్భవించడం నుంచి.. అస్తమించడం వరకూ విశ్వ సమాచారమంతా అక్కడి వారికి తెలుసు. మిక్సీలు.. వాషింగ్ మెషిన్లు వంటి హంగులేవీ కనిపించవు. కానీ.. పనులన్నీ చకచకా సాగిపోతాయి. అక్కడ విద్యుత్ లేదు. కానీ.. ఆ గ్రామస్తుల ఆలోచనల్లో చైతన్య కాంతి ప్రసరిస్తుంటుంది. అక్కడ వ్యాపారులు, కొనుగోలుదారులు ఎవరూ ఉండరు. అక్కడ రాజు.. కూలీ అనే వాళ్లెవరూ ఉండరు. అందరూ కూడు, గుడ్డ ప్రకృతి నుంచే పొందుతారు. తాము పండించిన వడ్లను దంచుకోగా వచ్చిన బియ్యాన్ని వండుకుతింటారు. కావాల్సిన దుస్తుల్ని సైతం స్వయంగా నేసుకుంటారు. అక్కడి ఇళ్లు కూడా గానుగలో ఆడించిన సున్నంతో వారు స్వయంగా కట్టుకున్నవే. ఇలా ఎన్నో.. ఎన్నెన్నో ప్రత్యేకతలకు నెలవైన ఆ ఊరి పేరు కూర్మ. శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలం అంతకాపల్లి కొండల మధ్య కొలువై ఉండే ఆ గ్రామంలోకి అడుగు పెడితే... సాక్షి, శ్రీకాకుళం/హిరమండలం: చుట్టూ పచ్చని కొండలు.. అందమైన ప్రకృతి. అంతేకాదు!!. ఆధునిక పద్ధతులకు దూరంగా.. సనాతన ధర్మమే వేదంగా.. ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు కూర్మ గ్రామం కూడా అక్కడే ఉంది. స్వచ్ఛమైన, పురాతన గ్రామీణ భారతీయ జీవన శైలిని అనుసరిస్తూ.. అదే మానవాళికి శ్రేయస్కరమని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈ గ్రామస్తులు. ఒత్తిళ్లతో కూడిన ఆధునిక యాంత్రిక యుగంలోనూ సనాతన ధార్మిక జీవన విధానాన్ని ఎలా సాగించవచ్చో చూపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని కూర్మ గ్రామం విశేషాలేంటంటే... పర్యాటక గ్రామంగా.. జిల్లాలో ప్రస్తుతం అతి ఎక్కువగా పర్యాటకులు సందర్శిస్తున్న గ్రామంగా కూర్మ రికార్డులోకి ఎక్కింది. గ్రామం గురించి తెలుసుకున్న ఎంతోమంది ఇక్కడికొచ్చి వీరి పద్ధతులను తెలుసుకుంటున్నారు. తమ పిల్లలకు కూడా వాటిని నేర్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు ఇక్కడే ఉండిపోవాలని భావిస్తున్నారు కూడా. ఇక్కడ కృష్ణతత్వం, వేదం, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు నేర్చుకోవడానికి విదేశీయులు సైతం వస్తున్నారు. రష్యా నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఇక్కడే ఉండిపోవటం విశేషం. ఇదే కూర్మ గ్రామం శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో హిరమండలం మండల పరిధిలోని అంతకాపల్లి సమీపంలో కొండల మధ్య సరికొత్తగా కొలువుదీరిన గ్రామమే కూర్మ. ప్రాచీన భారతీయ గ్రామీణ జీవన విధానం, సంప్రదాయాలు, పద్ధతులు, ఆహారపు అలవాట్లు, కట్టుబొట్టు, వృత్తులు.. తదితరాలన్నీ ఇక్కడ దర్శనమిస్తున్నాయి. 2018లో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్) సంస్థాపకాచార్యులైన భక్తి వేదాంతస్వామి ప్రభుపాదులు, వారి శిష్యులు ఈ గ్రామాన్ని నిర్మించారు. మొదట్లో కొద్దిమందితో ప్రారంభమైన కూర్మ గ్రామంలో ప్రస్తుతం 12 కుటుంబాలు.. 16 మంది గురుకుల విద్యార్థులు, ఆరుగురు బ్రహ్మచారులతో కలిసి 56 మంది ఉంటున్నారు. వీరంతా ఉన్నత చదువులు, పెద్ద ఉద్యోగాలతో సంపన్నశ్రేణి జీవనాన్ని అనుభవించినవారే. కానీ.. జీవిత పరమార్థం ఇది కాదని భావించిన వారంతా అన్వేషణలో భాగంగా సరికొత్త జీవన విధానాన్ని ఇక్కడ అనుసరిస్తున్నారు. చాలామంది రూ.లక్షల్లో జీతాలిచ్చే కొలువులు వదులుకుని వచ్చేశారు. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన త్రిభంగా నందదాస్, బీటెక్ చదివిన రాధాకృష్ణ చరణ్దాస్, రాధ గిరిదర్ దాస్, బీకాం చేసిన మదన్మోహన్ గిరిధర్ దాస్, కృష్ణ ప్రేమ్దాస్, పీహెచ్డీ చేసిన జయ హరిదాస్ వంటి చాలా మంది... కార్లు, బంగ్లాలు వదిలి కుటుంబ సమేతంగా ఇక్కడకు వచ్చి నివాసం ఉంటున్నారు. ఇళ్లు కూడా వారే కట్టారు ఇసుక, సున్నం, బెల్లం, మినుములు, కరక్కాయ, మెంతులు మిశ్రమంగా చేసి.. గానుగలో ఆడించి గుగ్గిలం మరగబెట్టిన మిశ్రమంతో స్వయంగా వారే ఇళ్లు కట్టుకున్నారు. ఇప్పటివరకు 13 ఇళ్లు, 4 వసతి గృహాలు, వర్ణాశ్రమ కళాశాల నిర్మించుకున్నారు. నిర్మాణంలో సిమెంట్, ఇనుము ఎక్కడా వాడలేదు. కుంకుడుకాయ రసంతో దుస్తులు ఉతుకుతారు. ప్రకృతి నుంచి లభించే పదార్థాలనే ఉపయోగిస్తున్నారు. కరెంటు వాడరు. సెల్ఫోన్లు లేవు. ఫ్రిజ్లు, వాషింగ్ మెషిన్లు, మిక్సీలు వంటివేవీ లేవు. ఇళ్లల్లో కనీసం లైట్లు, ఫ్యాన్లు కూడా లేవు. విద్యార్థులు తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, హిందీలో అనర్గళంగా మాట్లాడతారు. తెల్లవారుజామున 4.30 గంటలకే దైవానికి హారతి ఇవ్వడంతో వీరి దినచర్య ప్రారంభమవుతుంది. ఉదయం భజన, ప్రసాదం తర్వాత రోజువారీ పనులకు వెళతారు. వ్యవసాయం, ఇళ్ల నిర్మాణం, ధర్మ ప్రచారంలో గ్రామస్తులు మమేకమవుతారు. సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక్కడి గురుకులంలో విద్యార్థులకు ఉచిత చదువుతోపాటు సకల శాస్త్రాలను, వైదిక శాస్త్ర ఆధారిత విద్యా విధానం, ఆత్మ నిగ్రహం క్రమశిక్షణ, సత్ప్రవర్తన, శాస్త్ర అధ్యయనంతోపాటు వ్యవసాయం, చేతి వృత్తులు, తల్లిదండ్రులకు, గురువుకు సేవ చేయడం వంటివి నేర్పుతారు. 60 ఎకరాల్లో గ్రామాన్ని నిర్మించి.. ఇక్కడున్న వారంతా ఒడిషా, హైదరాబాద్, కడప, గుజరాత్ తదితర ప్రాంతాల నుంచి వచ్చినవారే. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్టలో ఇలాంటి గ్రామాన్ని నిర్మిద్దామని భావించారు. అక్కడ భూములకు సాగునీటి సదుపాయం లేక, సేంద్రియ పంటలు పండే పరిస్థితులు లేకపోవడం వల్ల ఇక్కడ 60 ఎకరాలు కొనుగోలు చేసి కూర్మ గ్రామాన్ని నిర్మించారు. గుజరాత్లోని నంద, పంజాబ్లోని బద్రికాశ్రమం, తమిళినాడులో పంచవటి, మధ్యప్రదేశ్లో భక్తి గ్రామాలు ఈ కూర్మ లాంటివే. కొత్తగా ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో చెక్ రిపబ్లిక్, హంగేరి దేశాల్లోనూ వీటిని ఏర్పాటు చేశారు. సరళ జీవనం, ఉన్నత చింతనం ఈ గ్రామంలో జీవించే ప్రజలు ఆచరించే ప్రత్యేకత. నిత్యావసరాలైన ఆహారం, దుస్తులు ప్రకృతి సేద్యం ద్వారా పొందుతున్నారు. రసాయనాలు లేని వ్యవసాయం చేస్తూ తమకు సరిపడా కూరగాయలు పండిస్తున్నారు. కావాల్సిన వరిని సాగు చేయటమే కాక... దుస్తులును కూడా మగ్గంపై నేసుకుంటున్నారు. జీవనశైలికి పూర్వ వైభవం పూర్వం భారత జీవన విధానంలో సుస్థిర జీవనాన్ని ఆధ్యాత్మికతతో గడిపేవారు. సంతోషం, సంతృప్తితో జీవించేవారు. యాంత్రీకరణ, రసాయనిక, ఆధునిక విధానం వచ్చాక మనిషిలో సంతోషం, సంతృప్తితో పాటు ఆధ్యాత్మికత, ఆయుష్షు తగ్గుతూ వస్తున్నాయి. ఈ విధానంలో మార్పులు తెచ్చేందుకు... ‘భారత జీవన శైలి’లో పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం – నితాయ నిమాయ్ దాస్, కూర్మ గ్రామ నివాసి ఆచరణలో చూపిస్తున్నాం భగవద్గీత ధర్మప్రచార బోధనలే కాకుండా ఆనాటి జీవన విధానాన్ని ఆచరిస్తున్నాం. సరళ జీవనానికి ఎటువంటి టెక్నాలజీ అవసరం లేదని నిరూపిస్తూ ఆధ్యాత్మిక, ధర్మ ప్రచారం, వ్యవసాయ, గో ఆధారిత జీవన విధానాన్ని ఆచరణలో చూపిస్తున్నాం. – త్రిభంగానంద్ దాస్, కూర్మ గ్రామ నివాసి భగవంతుని సేవతోనే సంతృప్తి భగవంతుని సేవతోనే సంతృప్తి చెందగలుగుతాం. కూర్మ గ్రామంలోని ప్రతి ఒక్కరూ రోజుకు ఆరు గంటల పాటు వ్యవసాయ, గో ఆధారిత సేవలు చేస్తూ మిగిలిన సమయం మెత్తం భగవంతుని సేవలో మమేకమవుతాం. శరీరం తాత్కాలికం. ఆత్మ మాత్రమే శాశ్వతం. ఆత్మను సంతోషపెట్టాలంటే భగవంతుని సేవలో ఉండాలని నమ్ముతూ, ఆచరిస్తూ జీవిస్తున్నాం. – గౌర గోపాల్దాస్, కూర్మ గ్రామ నివాసి -
వేద పండితులకు క్రికెట్ టోర్నమెంట్.. కామెంటరీ ఏ భాషలో అంటే!
మహర్షి మహేశ్ యోగి జయంతిని పురస్కరించుకుని మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్లో వేద పండితులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. టోర్నమెంట్లో పాల్గొనేందుకు ఆటగాళ్లకు ధోతీ కుర్తా డ్రెస్ కోడ్గా నిర్ణయించారు. సాధారణంగా క్రికెట్ కామెంటరీ ఇంగ్లీష్, హిందీ,తెలుగు భాషలో వింటూ ఉంటాం. కానీ ఈ టోర్నమెంట్లో సంస్కృత భాషలో కామెంటరీ చెప్పడం విశేషం. నాలుగు రోజుల పాటు ఈ టోర్నీ జరగనుంది. కాగా వైదిక కుటుంబాలలో క్రీడాస్ఫూర్తి, ప్రాచీన భాషని ప్రోత్సహించడమే ఈ టోర్నమెంట్ లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు. విజేతలకు నగదు బహుమతులు, వేద పుస్తకాలు, 100 సంవత్సరాల పంచాంగాన్ని బహుకరించారు. కాగా, సంస్కృత బచావో మంచ్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ తివారీ మాట్లాడుతూ టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులు వేదాల ప్రకారం కర్మలు చేసే వారని పేర్కొన్నారు. ఇక ఈ టోర్నమెంట్కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చదవండి: టీమిండియాకు మరో బిగ్ షాక్.. -
వేద పరీక్షలు ప్రారంభం
రాజమహేంద్రవరం కల్చరల్ : వేదశాస్త్రపరిషత్ ఆధ్వర్యంలో టి.నగÆర్Šలోని హోతావారి భవనంలో బుధవారం వేదపరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడునుంచి కూడా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. దుర్భాకుళ గురునాథ ఘనపాఠి, విష్ణుభొట్ల లక్ష్మీనారాయణ ఘనపాఠి, కడియాల సీతారామావధాని ఘనపాఠి, మంగిపూడి వేంకట శాస్త్రి ఘనపాఠి పరీక్షాధికారులుగా వ్యవహరించారు. తొలిరోజున అధర్వవేదంలో ఇద్దరు విద్యార్థులు, కృష్ణయజుర్వేదంలో సుమారు 40 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ పరీక్షలు ఈనెల 13వ తేదీ వరకు జరుగుతాయి. సంయుక్త కార్యదర్శి పీసపాటి వేంకట సత్యనారాయణశాస్త్రి, కోశాధికారి వాడ్రేవు వేణుగోపాల్, సభ్యులు కల్లూరి శ్రీరాములు తదితరులు హాజరయ్యారు. ‘క్రమ’పరీక్షకు హాజరవుతున్నాను మాది తమిళనాడుకు చెందిన కుంభకోణం పట్టణం. నా వయసు 18 సంవత్సరాలు. కృష్ణయజుర్వేదంలో క్రమ పరీక్షకు హాజరవుతున్నాను. వేదవిద్యను బోధించాలన్నది నా లక్ష్యం. -శివరామకృష్ణన్ ‘సంహిత’ పరీక్షకు హాజరవుతున్నాను మాది చెన్నయ్. నా వయసు 13 సంవత్సరాలు. కృష్ణయజుర్వేదం ‘సంహిత పరీక్ష’కు హాజరవుతున్నాను. వేదపండితుని కావాలని, వేదవిద్యను ప్రచారం చేయాలని నేను కోరుకుంటున్నాను. -వారణాసి శ్రీనాథ్