Wedding expenses
-
కల్యాణం క‘మనీ’యం
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు.. ఇప్పుడీ రెండూ బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోయాయి. ముఖ్యంగా పెళ్లి ఖర్చులు తడిసి మోపెడై చుక్కలు తాకుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్లని, డెస్టినేషన్ వెడ్డింగ్లని ఎవరూ, ఎక్కడా తగ్గేదే లేదంటున్నారు. ఈ మధ్య జరిగిన కుబేరుడు ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి ఏకంగా రూ.5,000 కోట్లు ఖర్చయిందని అంచనా. బడా వ్యాపారవేత్తల పెళ్లిళ్ల భారీ ఖర్చుల విషయాన్ని అలా ఉంచితే.. మామూలు జనం కూడా ఎక్కడా తగ్గడం లేదు. దీంతో సగటు వివాహ ఖర్చు ఏకంగా రూ.32 లక్షలు దాటిపోయింది.దేశంలో వివాహ వేడుకల ముఖచిత్రం వేగంగా మారిపోతోంది. జీవితకాల జ్ఞాపకం కోసం ఖర్చుకు వెనుకాడొద్దనే ధోరణి పెరుగుతోంది. దీంతో సగటు వివాహ వేడుకల ఖర్చు 2023లో రూ.28 లక్షలుగా ఉంటే.. గతేడాది 14 శాతం పెరిగి రూ.32 లక్షల నుంచి రూ.35 లక్షలకు చేరినట్టు వెడ్డింగ్ టెక్నాలజీ ప్లాట్ఫాం వెడ్డింగ్ వైర్ ఇండియా నివేదిక చెబుతోంది. దీని ప్రకారం.. 2022–2024 మధ్య కాలంలో పెళ్లి ఖర్చు ఏకంగా 28 శాతం పెరిగింది.2023–24లో వివాహ వేడుకల పరిశ్రమ సుమారు రూ.10.9 లక్షల కోట్లు దాటిపోయినట్టు ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ జెఫరీస్ అధ్యయనంలో వెల్లడైంది. మరోవైపు అతిథుల విషయంలోనూ పెళ్లివారి ధోరణి మారుతోంది. భారీగా 300 మందికిపైగా అతిథులతో జరుపుకొనే వివాహాల సంఖ్య గతేడాది 16 శాతం పెరిగింది. అదే సమయంలో తక్కువ మందితో 100 మందిలోపు అతిథులతో జరుపుకొనే పెళ్లిళ్లు 27 శాతం పెరిగాయి. మొత్తమ్మీద పెళ్లిళ్లకు సగటున గెస్ట్ లిస్ట్ 119గా ఉన్నట్టు నివేదిక పేర్కొంది.కొత్త డెస్టినేషన్లపై మక్కువ..లగ్జరీ విషయంలో రాజీ పడకుండా, మరీ ఎక్కువ మందితో గందరగోళం తలెత్తకుండా కాస్తంత ప్రైవసీ కోరుకుంటున్నవారు పెరుగుతున్నారు. ఈ క్రమంలో దేశీయంగా కొత్త డెస్టినేషన్లు తెరపైకి వస్తున్నాయి. హడావుడిగా ఉండే సాధారణ వెడ్డింగ్ స్పాట్లతో పోలిస్తే ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే ప్రాంతాల వైపు మొగ్గుచూపే వారు పెరుగుతున్నారు. సాధారణంగా జైపూర్, గోవా, ఉదయ్పూర్ వంటి ప్రాంతాల ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ.. మరిన్ని కొత్త ప్రాంతాలూ వెడ్డింగ్ డెస్టినేషన్లుగా తెరపైకి వస్తున్నాయి. ఉత్తరాఖండ్లోని నైనిటాల్, డెహ్రాడూన్.. కేరళలోని వయనాడ్ వంటి ప్రాంతాలపై ఆసక్తి పెరుగుతోంది.కొత్త కాన్సెప్టులతో.. ఖర్చు తగ్గించుకునేలా.. భారీ ఖర్చు పెట్టి పెళ్లి చేసుకోవడమే కాదు.. ఖర్చును బాగా తగ్గించుకోవాలనుకునే వారూ ఉంటున్నారు. దీంతో వీక్ డే వెడ్డింగ్లనే కాన్సెప్టులూ ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. ఆదివారాలు, సెలవు రోజులైతే పొలోమంటూ అందరూ వచ్చేసి, ఖర్చులు పెరిగిపోతాయనే ఉద్దేశంతో ఆఫీసులు ఉండే రోజుల్లో పెళ్లిళ్లను ఫిక్స్ చేసుకుంటున్నారు కొందరు. ఇందుకోసం సోమవారం, మంగళవారాలు పాపులర్ చాయిస్గా ఉంటున్నాయి. వీకెండ్ వెడ్డింగ్లతో పోలిస్తే ఇవి తక్కువ ఖర్చులో అయిపోతున్నాయి.నవంబర్ టు మార్చ్.. కోటి పెళ్లిళ్లు..సీజన్లపరంగా చూస్తే శీతాకాలంలో పెళ్లికి మొగ్గు చూపే వారు ఎక్కువగా ఉంటున్నారు. మంచి ముహుర్తాలు ఉండటంతో నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరిపై ఆసక్తి ఉంటోంది. 2024లో జరిగిన పెళ్లిళ్లలో 18.5 శాతం ఒక్క నవంబర్లోనే జరిగాయి. మొత్తమ్మీద నవంబర్–మార్చి మధ్య ఏటా కోటిపైగా పెళ్లిళ్లు జరుగుతున్నాయని అంచనా. ఆలిండియా ట్రేడర్ల సమాఖ్య గణాంకాల ప్రకారం.. 2023లో పెళ్లిళ్లకు మంచి ముహుర్తాలున్న 23 రోజుల్లో ఏకంగా రూ.4.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. అలాంటిది గతేడాది నవంబర్–డిసెంబర్ వెడ్డింగ్ సీజన్లో 35లక్షల పెళ్లిళ్లు జరిగిన నేపథ్యంలో.. రెండు నెలల వ్యవధిలోనే ఇంతకుమించి బిజినెస్ జరిగి ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.స్టాక్ మార్కెట్లో పెళ్లి సందడి..వివాహాల సంబంధ థీమ్తో లాభపడే స్టాక్స్ కూడా కొన్ని ఉన్నాయని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వెడ్డింగ్ ప్లానింగ్, కేటరింగ్, ఫొటోగ్రఫీ, జ్యుయలరీ.. ఇలా పెళ్లిళ్లకు సంబంధించి వివిధ రకాల సర్వీసులు అందించే కంపెనీల షేర్లలోనూ సందర్భానుసారం పెట్టుబడులు పెట్టి లాభాలు గడించవచ్చని పేర్కొంటున్నారు. వేదాంత ఫ్యాషన్స్, కల్యాణ్ జ్యువెలర్స్, ఇండియన్ హోటల్స్, టైటాన్ తదితర స్టాక్స్ ఈ జాబితాలో ఉన్నాయని అంటున్నారు.ఆహారం తర్వాత పెళ్లిళ్ల ఖర్చే ఎక్కువ..దేశంలో ఫుడ్–గ్రోసరీ ఇండస్ట్రీ తర్వాత అత్యధికంగా పెళ్లిళ్ల పరిశ్రమ విలువే అత్యధికమని జెఫరీస్ అధ్యయనంలో తేలింది. ఆ వ్యయాల విలువను చూస్తే...పరిశ్రమ విలువ (రూ.లక్షల కోట్లలో)ఫుడ్–గ్రోసరీ 56.9పెళ్లిళ్లు 10.9వస్త్రాలు, యాక్సెసరీస్ 7జ్యువెలరీ 6.5ఫర్నీచర్, హోం 3.5కన్సూమర్ పరికరాలు 3.2మొబైల్ ఫోన్లు 2.7హెల్త్, బ్యూటీ కేర్ 2.7ఫుట్ వేర్ 0.9 -
పెళ్లి మంటపాల్లో ‘డబ్బు’ వాద్యాలు
‘మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్’ అన్నమాట ఎంతవరకు నిజమో కానీ పెళ్లి వేడుకకు ఆకాశమే హద్దుగా మారిందన్నది మాత్రం వంద శాతం నిజం! కిందటేడు అంటే 2024లో ఒక్క నవంబర్, డిసెంబర్ నెలల్లోనే 4.8 లక్షల పెళ్లిళ్లయ్యాయి. అవి ఆరు లక్షల కోట్ల వ్యాపారం చేశాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ నివేదిక! దీని ప్రకారం ఈ మొత్తం 4.8 లక్షల్లో రూ. 3 లక్షల నుంచి రూ. కోటి వరకు ఖర్చు పెట్టిన వివాహాలున్నాయి. ఈ లెక్క చూశాక తెలిసింది కదా.. పెళ్లి ఖర్చుకు ఆకాశమే హద్దు అని! ఆచార సంప్రదాయాలు, వ్యవహారాలు, పెట్టుపోతలు ఇవన్నీ ఆడంబరాలుగా మారి పెళ్లిఖర్చును పెంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లి అనేది ఒక పెద్ద పరిశ్రమగా మారిపోయింది. జనవరి 30 నుంచి పెళ్లి ముహూర్తాలు మొదలయ్యాయి. మార్చి 10 వరకు సందడే సందడి! ఆ సందర్భంగా మ్యారేజ్ ఇండస్ట్రీ, మధ్యతరగతి (Middle Class) మీద ప్రభావం వంటివి స్పృశిస్తూ ఒక కథనం..మన దేశంలో సగటు వివాహ ఖర్చు.. ఒక ఇంటి ఏడాది ఆదాయం కంటే మూడు రెట్లు ఎక్కువ! అది మన దేశ వెడ్డింగ్ ఇండస్ట్రీని (Wedding Industry) దాదాపు రూ. లక్షాపదమూడు కోట్లతో ప్రపంచంలోని అతిపెద్ద పరిశ్రమల్లో ఒకటిగా చేర్చింది. ఇది అమెరికా వెడ్డింగ్ మార్కెట్ (US Wedding Market) కన్నా రెండింతలు పెద్దది. కోవిడ్ తర్వాత పెళ్లి వ్యయం మరింత ప్రియం అయింది. అతిథుల సంఖ్య తగ్గింది. కానీ ఖర్చు నయా పైసా కూడా తగ్గలేదు. ఇదివరకు ఆడపిల్ల పెళ్లంటే బంధువులు, స్నేహితులు అన్నిరకాలుగా అండగా నిలిచి ఉన్నదాంట్లో ఆ వేడుకను సంప్రదాయబద్ధంగా జరిపించి తల్లిదండ్రులు తేలికపడేలా చేసేవారు. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వారైతే ఇల్లు వాకిలి, పొలమూ పుట్రా అమ్మడమో, తాకట్టు పెట్టడమో చేసి పెళ్లి జరిపించేవారు.అప్పుడు వరకట్నాలు లాంఛనాలు, బంగారం కిందే జమయ్యేవి. ఇప్పుడా సీన్ మారిపోయింది. అమ్మాయిలూ ఉద్యోగాలు చేస్తున్నారు. పర్ఫెక్ట్ ప్లాన్తో ఉంటున్నారు. ఆ ప్రణాళికలో పెళ్లికీ ప్రయారిటీ ఇస్తున్నారు. హల్దీ, మెహందీ, సంగీత్, పెళ్లి కూతురు– పెళ్లికొడుకు సహా పెళ్లిని అయిదు రోజుల ఈవెంట్స్తో ఘనంగా జరిపించుకోవాలనుకుంటున్నారు. ఫొటోలు, వీడియోలే కాదు సోషల్ మీడియా షాట్స్, రీల్స్గానూ ప్రెజెంట్ చేయాలనుకుంటున్నారు.వీటన్నిటి ఖర్చు కోసం కొలువు తొలిరోజు నుంచే ఆదా చేయడం మొదలు పెడ్తున్నారు. అలా పెళ్లి ఖర్చును అమ్మాయిలు తమ ఖాతాలో వేసుకుంటున్నారు. కట్నకానుకలను మాత్రం తల్లిదండ్రులు తమ బాధ్యతగా భావిస్తున్నారు. అవి స్థిర, చరాస్తులుగా రూపాంతరం చెందాయి. అమ్మాయి పేరు మీదే ఉంటున్నాయి. అవీ పెళ్లి ఖర్చులో భాగమయ్యి, తల్లిదండ్రులు పెట్టే ఖర్చుల జాబితాలో చేరుతున్నాయి. అయితే ఇవి మ్యారేజ్ ఇండస్ట్రీలో కలవని అదనపు ఖర్చన్నమాట. బ్యాచిలర్.. బ్యాచిలరేట్ పార్టీలు కూడా.. దేశంలో సగటు మధ్యతరగతి కుటుంబం కూడా పెళ్లి మీద భారీగా ఖర్చుపెడుతోందంటోంది సీఏఐటీ సర్వే! తెలుగు రాష్ట్రాల్లో అయితే అది కనిష్టంగా రూ. 30 లక్షలు. పెళ్లి వేదిక, వచ్చే అతిథుల సంఖ్య, వంటకాల సంఖ్య, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సోషల్ మీడియా రీల్స్, షాట్స్ వగైరాలను బట్టి ఈ బడ్జెట్ పెరుగుతుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination Wedding) అయితే అది రూ. కోటి దాటుతోంది. ఈ ΄్యాకేజ్లో బ్యాచ్లర్, బ్యాచ్లరెట్ ట్రిప్స్ కూడా ఉన్నాయి.ఇప్పుడు పెళ్లి ఖర్చును వధూవరులిద్దరూ సమంగా పెట్టుకునే ఆనవాయితీ మొదలైంది. ఇది ఒకందుకు మంచి పరిణామంగానే భావించినా.. అసలు పెళ్లనేది వ్యక్తిగత లేదా రెండు కుటుంబాలకు చెందిన వ్యవహారం. దానికి అంతంత ఖర్చుపెట్టాల్సిన అవసరం ఏముందని అబీప్రాయపడుతున్నారు సోషల్ ఇంజినీర్స్. ఫలానా వాళ్ల పిల్లల పెళ్లి కన్నా గొప్పగా తమ పిల్లల పెళ్లి చేయాలని తల్లిదండ్రులు, తమ స్నేహితులు.. కొలీగ్స్ కన్నా ఘనమనిపించుకోవాలని వధూవరులు.. పోటీలకు పోతూ, ఉన్న సేవింగ్స్ అన్నీ ఊడ్చేసుకుని.. అప్పులు కూడా తెచ్చుకుని మరీ పెళ్లి చేస్తున్నారు.. చేసుకుంటున్నారు.ఎస్బీఐ సహా పేరున్న ప్రైవేట్ బ్యాంకులన్నీ పెళ్లిళ్లకు లోన్స్ ఇస్తున్నాయి. పర్సనల్ లోన్ ఖాతాను పెంచడంలో వీటి పాత్ర గణనీయం. కస్టమ్ వెడ్డింగ్ లోన్ప్రోడక్ట్స్ బ్యాంకుల డిమాండ్నూ పెంచుతున్నాయి. ఈ అప్పులను తీర్చడానికి ఉన్న ఆస్తులను అమ్ముకుంటున్నారు. తల్లిదండ్రులు ప్రభుత్వోద్యోగులైతే ఆ అప్పులు తీర్చడానికి అవినీతికి పాల్పడిన దాఖలాలూ ఉన్నాయంటున్నారు సోషల్ ఇంజినీర్స్. ఈ అప్పులతో కొత్త పెళ్లిజంట మధ్యలో కూడా స్పర్థలు వచ్చి విడాకుల దాకా వెళ్లిన సంఘటనలూ ఉన్నాయని చెబుతున్నారు.ఇవీ ఉన్నాయి.. ఈ ఘనమైన మాయకు ఇరుగు పొరుగు, బంధుగణం, తోటివాళ్లే కాదు సినిమాలు, సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లూ బాధ్యులు. ‘మురారి’ సినిమా వచ్చిన కొత్తలో మాట.. ఒక ప్రోగ్రెసివ్ కుటుంబంలోని అమ్మాయి ‘మురారీ’ సినిమాలో పెళ్లి సీన్స్కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి.. తన పెళ్లి ఆ సినిమాలో చూపించినట్టే జరగాలని పట్టుబట్టి మరీ ఆ తరహాలోనే పెళ్లి చేసుకుంది. తల్లిదండ్రులు తమ అమ్మాయి పెళ్లికోసం అప్పట్లోనే అయిదు లక్షల రూపాయలు అప్పు చేయాల్సి వచ్చింది. ఇందులో బాలీవుడ్ పాత్రా ఉంది. ఈ మెహందీ, హల్దీ, సంగీత్, డిజైనర్ వేర్ వంటివన్నీ దాని పుణ్యమే! వెడ్డింగ్ ప్లానర్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్, థీమ్ థింగ్స్, ప్రీ వెడ్డింగ్ షూట్, రీల్స్, షాట్స్ లాంటి వాటన్నిటికీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఓటీటీ సిరీస్ల ప్రభావం కారణమంటున్నారు ట్రెండ్ ఎనలిస్ట్లు.వృథా కూడా అదే స్థాయిలో!ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.7 బిలియన్ టన్నులు అంటే మనిషి పండించే పంటలో మూడొంతులు వృథా అవుతోందట. ఈ వృథాలో అధిక వాటా పెళ్లిళ్లు లాంటి వేడుకలదే! అందులో మనమేం తక్కువలేం! ఈ వృథా వల్ల ఇంకొకరి ఆహారపు హక్కును మనం హరించినట్టే! అంతేకాదు.. ఈ ట్రెండ్ ధరలనూ ప్రభావితం చేసి నిత్యవసరాలను అందుకోలేనంత ఎత్తులో పెట్టేస్తోంది. ఇకో ఫ్రెండ్లీ యువత అంతా లగ్జరీ వైపే చూస్తోందని ఆందోళన చెందక్కర్లేదు. పెళ్లనేది పూర్తి వ్యక్తిగత వ్యవహారంగా భావించి రిజిస్టర్ మ్యారేజ్తో ఒక్కటవుతున్న జంటలూ ఉన్నాయి. తమ పెళ్లికి ఆత్మీయులు, సన్నిహితుల ఆశీస్సులు అవసరమనుకునేవారు దాన్ని కుటుంబ వేడుకకే పరిమితం చేసుకుంటున్నారు. అనవసర ఖర్చు లేకుండా, స్థానికంగా దొరికే వస్తువులతోనే పర్యావరణహితంగా మలచుకుంటున్నారు. ఈ జంటలే భవిష్యత్ జంటలకు మార్గదర్శకంగా నిలవాలని ఆశిద్దాం! ఈ మెహందీ, హల్దీ, సంగీత్, డిజైనర్ వేర్ వంటివన్నీ సినిమాల పుణ్యమే! వెడ్డింగ్ ప్లానర్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్, థీమ్ థింగ్స్, ప్రీ వెడ్డింగ్ షూట్, రీల్స్, షాట్స్ లాంటి వాటన్నిటికీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఓటీటీ సిరీస్ల ప్రభావం కారణమంటున్నారు ట్రెండ్ ఎనలిస్ట్లు. – సరస్వతి రమ⇒ పెరుగుతున్న పెళ్లి ఖర్చును అదుపు చేయాల్సిందిగా 2017లో రంజిత్ రంజన్ అనే కాంగ్రెస్ ఎంపీ పార్లమెంట్లో ‘ప్రివెన్షన్ ఆఫ్ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ ఆన్ స్పెషల్ అకేషన్స్’ అనే ప్రైవేట్ బిల్ను ప్రవేశపెట్టాడు. దీనిప్రకారం పెళ్లికి అతిథుల సంఖ్య వందకు, పదిరకాల వంటకాలు, కానుకల విలువ రూ. 2,500కు మించరాదు. ఎవరైనా పెళ్లి మీద రూ. 5 లక్షలకు మించి ఖర్చు పెడితే పది శాతం డబ్బును ప్రభుత్వ సంక్షేమ నిధికి ఇవ్వాలి. అలా జమ అయిన మొత్తాన్ని ప్రభుత్వం ఏటా పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఖర్చుపెట్టాలి. కానీ ఈ బిల్లు ఆమోదం పొందలేదు. చదవండి: పుస్తకాలు మా ఇంటి సభ్యులు⇒ 1993లో నాటి ఒడిశా ముఖ్యమంత్రి బిజు పట్నాయక్.. పెళ్లికి ముందు పెళ్లిలో రూ. 25 వేలకు మించి ఖర్చు చేయకూడదంటూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాడు. కానీ అదీ పాస్ అవలేదు.కన్స్ట్రక్టివ్గా ఇన్వెస్ట్ చేసుకోవాలిసంపాదించుకుంటున్నాం కదాని ఉన్న సేవింగ్స్ అన్నిటినీ పెళ్లి అట్టహాసాలకే ఖర్చు చేయడం కరెక్ట్ కాదు. ఉన్న వాళ్లు ఎంత ఖర్చుపెట్టుకున్నా పర్లేదు. కాని వాళ్లను మిడిల్క్లాస్ పీపుల్ ఫాలో అయితేనే తర్వాత ఆర్థికంగా, ఎమోషనల్గా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పులు చేసి మరీ మన చుట్టూ ఉన్నవాళ్లను మెప్పించడం వల్ల మన ఇల్లు గుల్లవడం తప్ప పైసా ప్రయోజనం ఉండదు. పెళ్లి తర్వాత ఇల్లు, పిల్లలు .. వాళ్ల చదువులు లాంటి ఎన్నో బాధ్యతలుంటాయి. వాటి కోసం సేవింగ్స్ని ప్లాన్ చేసుకోవాలి. కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఆచితూచి మదుపు చేసుకోవాలి. దానివల్ల మనం సంతోషంగా ఉండటమే కాదు ప్రకృతి వనరులను, శ్రమను గౌరవించిన వాళ్లమవుతాం! – డాక్టర్ కస్తూరి అలివేలు, అసోసియేట్ప్రోఫెసర్, డీన్, డీజీఎస్ సెస్, హైదరాబాద్.డిమాండ్ పెరిగిందిపెళ్లి ఫొటో, వీడియోగ్రఫీలు తక్కువలో తక్కువ రెండు లక్షల నుంచి మొదలు ఈవెంట్స్ కవరేజ్ను బట్టి బడ్జెట్ పెరుగుతుంది. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కోసం స్టూడియోస్ కూడా ఉన్నాయి. డబ్బుండి, టైమ్ లేని వాళ్లు ఆ స్టూడియోస్లో షూట్స్ని ప్రిఫర్ చేస్తుంటే.. డబ్బు, టైమ్ రెండూ ఉన్నవాళ్లు విదేశాలకూ వెళ్లి షూట్ చేయించుకుంటున్నారు. మొత్తం మీద ఫొటో, వీడియోగ్రాఫర్స్తోపాటు ఈ స్టూడియోస్కీ డిమాండ్ బాగా పెరిగింది. – వీఎన్ రాజు, వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్కాంప్రమైజ్ అవ్వట్లేదువెడ్డింగ్ సెలబ్రేషన్స్ విషయంలో ఎవరూ కాంప్రమైజ్ అవట్లేదు. కోవిడ్ తర్వాత ఈ ట్రెండ్ మరీ ఎక్కువైంది. పెళ్లికి వచ్చే అతిథులు తగ్గారు కానీ.. వేడుకల విషయంలో మాత్రం ఎవరూ వెనకడుగు వేయట్లేదు. మధ్యతరగతి వాళ్లు కూడా వెడ్డింగ్ ప్లానర్ని పెట్టుకుంటున్నారు. ఎంత తక్కువనుకున్నా 30 లక్షల నుంచి మొదలవుతోంది వెడ్డింగ్ బడ్జెట్. డెస్టినేషన్ వెడ్డింగ్స్ అయితే 50.. 60 లక్షలు ఇంకా ఆపై కూడా ఉంటోంది. ఇదివరకు ఈవెంట్స్ అన్నీ ఫొటోలు, వీడియోలకే పరిమితమై ఉండేవి. ఇప్పుడు రీల్స్, షాట్స్లో సోషల్ మీడియాలోనూ ప్రెజెంట్ చేయాలనుకుంటున్నారు.బ్రైడ్ అండ్ గ్రూమ్ కొత్త కొత్త ఐడియాలతో వచ్చి వాటిని అమలు చేయడానికి ప్లాన్లు అడుగుతున్నారు. పీర్స్ కన్నా డిఫరెంట్గా ఉండాలనీ, తామే ఒక కొత్త ట్రెండ్ సెట్ చేయాలనే ఆలోచనతో వస్తున్నారు. ఎంతైనా ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నారు. దీంతో వెడ్డింగ్ ప్లానర్స్కి డిమాండ్ పెరుగుతోంది. వాళ్లమధ్య పోటీ కూడా ఎక్కువే ఉంటోంది. కొంచెం క్రియేటివిటీ ఉంటే చాలు వెడ్డింగ్ ప్లానర్ అనే బోర్డ్ పెట్టేసుకుంటున్నారు. – వర్ధమాన్ జైన్, వెడ్డింగ్ ప్లానర్ -
తరం మారుతున్నది.. స్వరం మారుతున్నది
పెళ్లి అంటే వధువు తల్లిదండ్రులకే అన్ని రకాలుగా భారం. కట్నం ఇవ్వాలి.. పెళ్లి ఖర్చులు పెట్టుకోవాలి.. సంసారానికి కావాల్సిన సరంజామా సమకూర్చాలి. కానీ నేటి తరం భిన్నమైన మార్గంలో పయనిస్తోందని తాజా సర్వేలో వెల్లడైంది. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియా లెండ్స్ సంస్థ యువత మనోగతం తెలుసుకునేందుకు ఓ సర్వే నిర్వహించింది. 2018–19 సంవత్సరంలో యువతరం పెట్టుకున్న రుణాల దరఖాస్తుల్లో 20 శాతం వారి పెళ్లి కోసమేనని వెల్లడైంది. జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకం లాంటి పెళ్లి ఖర్చును తమ సొంత డబ్బుతోనే చేసుకోవాలన్న ఆలోచన నేటి తరంలో పెరుగుతున్నట్లు వెల్లడించింది. ఇక యువతీ యువకుల్లో ప్రపంచాన్ని చుట్టేసి రావాలన్న కోరిక బాగా ఉంది. రుణాల కోసం వచ్చిన దరఖాస్తుల్లో ప్రయాణాల కోసమే 70 శాతం దాకా ఉన్నాయి. మిగిలినవన్నీ విద్యా రుణాలు, సొంతంగా కొత్త కంపెనీలు పెట్టేందుకు ఉన్నాయి. ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రోనగరాల్లో 25–30 ఏళ్ల వయసు మధ్యనున్న వారు దేని కోసం రుణాలు తీసుకుంటున్నారో తెలుసుకునేందుకు సర్వే నిర్వహించారు. ‘ఈ తరం పిల్లలు తమ కాళ్ల మీద తాము నిలబడాలని అనుకుంటున్నారు. తమ పెళ్లి కోసం రుణాలు తీసుకోవడం గతంలో ఎప్పుడూ లేదు. అమ్మాయి తల్లిదండ్రులే అన్నీ చేయాలన్న ధోరణిలో బాగా మార్పు వస్తోంది’అని ఇండియాలెండ్స్ సంస్థ సీఈవో రవ్ చోప్రా చెప్పారు. ముంబైలో అత్యధికంగా 22 శాతం పెళ్లి కోసం రుణాలు తీసుకుంటే.. హైదరాబాదీల్లో 20 శాతం మంది ప్రయాణాల కోసమే లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారట. -
కులాంతరంవైపే యువతరం
భారతీయ యువతరంలో టెక్నాలజీ చైతన్యం నింపుతోందా? ఇందుకు అవుననే సమాధానమిస్తోంది ఢిల్లీ కేంద్రంగా ‘‘పల్స్ ఆఫ్ ద నేషన్’’పేరుతో జరిగిన తాజా అధ్యయనం. ఇన్షార్ట్స్ అనే న్యూస్ యాప్ ద్వారా జరిపిన ఈ సర్వేలో 18 నుంచి 35 ఏళ్లలోపు 1,30,000 మంది పాల్గొంటే అందులో 70 శాతం మంది కులాంతర వివాహాలకు సుముఖంగా ఉన్నట్టు తేలింది. అలాగే పెళ్లయ్యాక మహిళలు తమ ఇంటిపేరు మార్చుకోవాల్సిన అవసరం లేదని కూడా 70 శాతం మంది పురుషులు అభిప్రాయపడ్డారు. పెళ్లి ఖర్చులు వధువు తరఫు వారే భరించాలన్న సనాతన భావజాలానికి భిన్నంగా సర్వేలో పాల్గొన్న పురుషులు స్పందించారు. వారిలో 90 శాతం మంది పెళ్లి ఖర్చులను పంచుకుంటామని చెప్పడం భారతీయ యువతరంలో చైతన్యానికి ఉదాహరణగా సర్వే సంస్థ అభిప్రాయపడింది. దాదాపు 84 శాతం మంది మహిళలు తమ భర్తలు తమకన్నా తక్కువ ఆదాయం ఉన్నా అదేం పట్టించుకోబోమని పేర్కొన్నారు. 7 శాతం మంది పురుషులు మాత్రం తమకన్నా తమ భార్యలకు ఎక్కువ ఆదాయం ఉండటం అభ్యంతరకరమన్నారు. పెళ్లిళ్లు, ఒకే కులం వారిని వివాహం చేసుకోవడం, భార్యలు నిర్వహించాల్సిన పాత్రలు, ఆస్తి హక్కు వంటి విషయాలపై భారతీయుల్లో కనిపించే సంప్రదాయ ఆలోచనలకు భిన్నంగా యువతరం స్పందించడం గమనార్హం. -
నోట్లు.. పాట్లు..
పరిగి: ఈ చిత్రంలో నిల్చుని వినయంగా వేడుకుంటున్న వ్యక్తి పేరు శంకర్. సొంతూరు వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం ముజాహి ద్పూర్ అనుబంధ దాశ్యనాయక్ తండా. శంకర్ సోదరుడు బాల్రాజ్ వివాహం శుక్రవారం జరగనుంది. పెళ్లి ఖర్చుల కోసం రూ.లక్ష సిద్ధం చేసుకుని ఇంట్లో దాచుకున్నారు. ఇంతలో రూ. 500, రూ.1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో ఏం చేయాలో పాలుపో లేదు. గురువారం ఇదిగో ఇలా పరిగి ఎస్బీహెచ్ (ఏడీబీ)కి వచ్చాడు. బ్యాంకు మేనేజర్ను కలసి రూ.లక్ష డిపాజిట్ చేసుకుని కొత్త నోట్లు ఇవ్వాలని ప్రాధేయపడ్డాడు. నిబంధనలు దాటి తాను ఏమీ చేయలేనని..డిపాజిట్ చేసుకుని రూ.4 వేలు మాత్రమే ఇవ్వగలనని బ్యాంకు మేనేజర్ ఫకీరయ్య సమాధానం ఇచ్చారు. దీంతో చేసేదిలేక శంకర్ ఇంటిముఖం పట్టాడు. -
‘కల్యాణ లక్ష్మి’కి దరఖాస్తు ఇలా..
నిర్మల్ అర్బన్ : పెళ్లి వేడుకలు నేడు ఖరీదయ్యాయి. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా వ్యయాలు పెరిగిపోయాయి. ఫంక్షన్ హాళ్లు, కార్డుల పంపిణీ, బట్టల కొనుగోలు, సామగ్రి, నిత్యావసర సరుకులు.. ఇలా అన్ని ధరలు పెరిగిపోయాయి. దీంతో నిరుపేదలు, ఎస్సీ, ఎస్టీలు వివాహ ఖర్చులకు అప్పుల పాలయ్యేవారు. మరి కొందరు ఆర్థిక భారాన్ని భరించే స్థోమత లేక పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాల్సి వచ్చేది. ఇలాంటి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘కల్యాణ లక్ష్మి’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీల వివాహానికి ప్రభుత్వం రూ.51వేల ఆర్థిక సహాయం అందజేస్తోంది. ఇది కాస్తా ఊరటనివ్వడంతో పాటు కొందరికి వరంగా మారింది. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ.. ‘కల్యాణలక్ష్మి’ పథకం ద్వారా లబ్ధి పొందే వారు ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వధూవరుల పూర్తి వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అనంతరం దాని ప్రతిని సమీపంలోని సాంఘిక సంక్షే మ శాఖ కార్యాలయంలో అందజే యాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న పత్రాలతో పాటు వధువుకు సంబంధించిన కులం, ఆదాయం, నివాసం, ఆధార్కార్డు, బ్యాంక్ అకౌంట్, మొదటి వివాహంగా వీఆర్వో, గజిటెడ్ అధికారులతో వేర్వేరుగా ధ్రువీకరించిన పత్రాలు, అబ్బాయికి సంబంధించిన ఆధార్కార్డు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం తదితర పూర్తి వివరాల జిరాక్స్ ప్రతులతో దరఖాస్తులు అందజేయాలి. అలాగే వెడ్డింగ్ కార్డును జతపరిచి పెళ్లికి ముందే అధికారులకు అప్పగించాలి. రూ.2లక్షల వార్షికాదాయం ఉన్న వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. 2014 అక్టోబర్ 2వ తేదీ తర్వాత పెళ్లి చేసుకున్న వారూ దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు తమ పెళ్లి ఫొటో, పెళ్లి పత్రికను దరఖాస్తుతో జతపరచాల్సి ఉంటుంది. పరిశీలన పూర్తయిన వెంటనే మంజూరు.. సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకు దరఖాస్తులు అందిన వెంటనే క్షేత్ర స్థాయిలో పూర్తి పరిశీలన చేపడతారు. అందించిన వివరాలు సరియైనవో.. కాదో.. తేల్చుకుని ఉన్నతాధికారులకు నివేదిస్తారు. అనంతరం జిల్లా కార్యాలయం నుంచి నిధులు మంజూరవుతాయి. నేరుగా రూ.51 వేలు వధువు బ్యాంక్ అకౌంట్లో జమవుతాయి. ఈ పథకం అమలుకు నిధుల కొరత ఏమీ లేదని.. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారందరికి పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం జిల్లాకు సుమారు రూ.6 కోట్ల బడ్జెట్ కేటాయింపు జరిగిందని పేర్కొన్నారు. అవగాహన కల్పిస్తే మేలు.. పేద, నిరుపేదలైన దళితుల కోసం ప్రవేశపెట్టిన ‘కల్యాణ లక్ష్మి’ పథకంపై ప్రజల్లో అవగాహన కొరవడింది. ఎవరికి దరఖాస్తులు అందించాలో.. ఎక్కడ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. దరఖాస్తులను తహశీల్దార్ కార్యాలయాల్లో అందజేయడంతో అవి సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయానికి చేరడానికి, దరఖాస్తుల పరిశీలనకు తీవ్ర జాప్యం జరుగుతుందనే ఆరోపణలున్నాయి. ‘కల్యాణ లక్ష్మి’ పథకంపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను చేపడితే ప్రయోజనకరంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. దళితుల్లో ఎక్కువ మంది నిరక్ష్యరాస్యులుండడం, దరఖాస్తులను ఆన్లైన్లో అందించలేక పోవడం, ఏయే పత్రాలు జతపర్చాలన్న విషయాలు తెలియకపోవడంతో పథకాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారనే విమర్శలున్నారుు. ప్రభుత్వ ఆశయం నెరవేరాలంటే అధికారులు దళితులను మరింత చైతన్యపరచాల్సిన అవసరముందని పలువురు పేర్కొంటున్నారు. 51 దరఖాస్తులు అందాయి - మహ్మద్ అబ్దుల్ అలీం, అసిస్టెంట్ సాంఘిక సంక్షేమశాఖ అధికారి, నిర్మల్ ఇప్పటివరకు 51 దరఖాస్తులు అందగా 38 పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదించాం. మిగిలిన వాటికి సంబంధించి దరఖాస్తుదారుల నుంచి మరికొన్ని వివరాలు, పత్రాలు అందాల్సి ఉంది. అవి అందిన వెంటనే క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిస్తాం.అన్ని పత్రాలు అందజేసిన వారికి ఇప్పటికే ఆర్థికసాయం మంజూరైంది. -
మా పెళ్లికి రండి... ఖర్చులు చెల్లించండి!
ధోరణి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పుడొక చిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. మామూలుగానైతే, శుభలేఖలో ‘అందరికీ ఆహ్వానం’ ‘మీ రాక మాకు సంతోషకరం’ ఇలాంటి వాక్యాలు కనిపిస్తాయి. లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం... ఇలాంటి వాక్యాలతో పాటు- ‘పెళ్లి ఖర్చులకు మీ వంతుగా సహకారం అందించండి’ ‘హనీమూన్ ఖర్చులకు సహాయం అందించండి’ లాంటి వాక్యాలకు తోడు బ్యాంకు ఎకౌంట్ నంబర్ కూడా ఇస్తున్నారు. విశేషమేమిటంటే, ఇలాంటి పెళ్లిళ్లకు ఎవరూ ముఖం చాటేయడం లేదు. తమ వంతుగా సహకారం అందిస్తున్నారు. శుభలేఖలో వినోదం ఖర్చులు సమర్పించిన వారు, విందు ఖర్చులు సమర్పించినవారు, బ్యాండు ఖర్చులు సమర్పించినవారు లాంటి కొత్త మాటలు కనిపిస్తున్నాయి. శుభలేఖలో ప్రచురించే ఖర్చుల జాబితాలో తమ పేరును చూసుకోవడానికి చాలామంది తాపత్రయపడుతున్నారు. ‘‘ఇది ఖర్చు అనుకోవడం లేదు. నాకు దక్కిన అదృష్టం అనుకుంటున్నాను’’ అంటున్నాడు లెమన్స్ (ఫ్రాన్స్) పట్టణానికి చెంది మైఖేల్ అనే ఉద్యోగి. తన మిత్రుడి పెళ్లికి అయిన విందు ఖర్చును తానే భరించాడు. ఇటీవలే లండన్లో పెళ్లి చేసుకున్న జంట కూడా ఇలాంటి ప్రయత్నమే చేసింది. పెళ్లి ఖర్చులు పోను అదనంగా కొంత డబ్బు మిగిలింది. ఆ మొత్తాన్ని ఒక అనాథాశ్రమానికి ఇచ్చారు. ఈ పెళ్లికి తన వంతు డబ్బు ఇచ్చిన డెల్విన్ను ఈ ధోరణి గురించి అడిగినప్పుడు - ‘‘ఇది ఆహ్వానించదగిన పరిణామం. పెళ్లి కోసం అప్పు చేయడం కంటే, సన్నిహితులు తలా ఒక చేయి వేస్తే అప్పు చేయాల్సిన అవసరం ఉండదు. ఆత్మీయతను చాటుకున్నట్లుగా కూడా ఉంటుంది. వచ్చే సంవత్సరం నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నా ద్వారా సహాయం పొందిన వారు రేపు నాకు కూడా సహాయపడతారు కదా’’ అంటున్నాడు. పాశ్చాత్య దేశాల్లో ఇటీవల కాలంలో పెళ్లి చేసుకుంటున్న అయిదుగురిలో నలుగురు ఈ ధోరణినే అనుసరిస్తున్నారు. పెళ్లికి అవసరమైన ఖర్చులు భరించగలిగే స్థోమత ఉన్నప్పటికీ, ప్రముఖుల పెళ్లిళ్ల మాదిరిగా ఆడంబరంగా జరుపుకోవాలనుకునే వారు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. ‘‘ఈ విధానం వల్ల ఎవరికీ ఏ ఇబ్బందీ లేదు’’ అంటున్నాడు చార్లెట్ అనే ప్రముఖ వెడ్డింగ్ ప్లానర్. పెళ్లికి తన వంతు డబ్బు ఇచ్చిన డెల్విన్ను ఈ ధోరణి గురించి అడిగినప్పుడు - ‘‘ఇది ఆహ్వానించదగిన పరిణామం. పెళ్లి కోసం అప్పు చేయడం కంటే, సన్నిహితులు తలా ఒక చేయి వేస్తే అప్పు చేయాల్సిన అవసరం ఉండదు. ఆత్మీయతను చాటుకున్నట్లుగా కూడా ఉంటుంది. వచ్చే సంవత్సరం నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నా ద్వారా సహాయం పొందినవారే రేపు నాకు కూడా సహాయపడతారు కదా’’ అంటున్నాడు.