writes to PM
-
శశికళ రాజకీయ చతురత!
చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ మరోసారి తన రాజకీయ చతురత ప్రదర్శించారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి తాను పెట్టుకున్న ముహుర్తానికి కేంద్రం పరోక్షంగా ఆటంకాలు కల్పించినా ఆమె నిబ్బరం కోల్పోలేదు. రాజకీయ వర్గాలు శశికళ ప్రమాణస్వీకార ముహుర్తం గురించి చర్చోపచర్చలు జరుపుతుంటే ఆమె మాత్రం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖాస్త్రం సంధించారు. రాజకీయాలకు సంబంధం లేని అంశం మీద లేఖ రాసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. శ్రీలంక అదుపులోకి తీసుకున్న 35 మంది తమిళ మత్స్యకారులు, 120 పడవలను వెంటనే విడిపించేందుకు ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆమె లేఖ రాశారు. తమిళ రాజకీయమంతా తన చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో శశికళ విభిన్నంగా స్పందించడం ఆమె విలక్షణతను చాటిచెబుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జల్లికట్టు నిషేధం ఎత్తివేయాలని కోరుతూ ఇంతకుముందు ప్రధాని మోదీకి శశికళ లేఖ రాసిన సంగతి తెలిసిందే. మరోవైపు సీఎంగా శశికళ ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకోవాలని ఆమె ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి, ప్రధాని జోక్యం కోరాలని భావిస్తున్నారు. శశికళ ముఖ్యమంత్రి కాకుండా చూడాలని కోరుతూ అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
స్కూల్ కంటే ర్యాలీ ముఖ్యమా? మోదీకి విద్యార్థి లేఖ..
ఖాంద్వాః ఓ ఎనిమిదో తరగతి విద్యార్థి మోదీ అంకుల్ అంటూ.. ప్రధానికి రాసిన లేఖతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మా స్కూల్ కంటే మీకు ర్యాలీ ముఖ్యమా అంటూ విద్యార్థిని ప్రశ్నించిన తీరుకు.. అసలేమైందంటూ ఆరా తీసింది. ప్రధాని సభకోసం విద్యార్థుల స్కూల్ బస్సులు తరలించడంపై ఆగ్రహం చెందిన విద్యార్థి తీరుకు యంత్రాంగం దిగొచ్చింది. మధ్యప్రదేశ్ అలీరాజ్ పూర్ జిల్లా జోత్రాడా గ్రామంలో ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. చంద్రశేఖర్ అజాద్ స్వగ్రామమైన భాబ్రాగ్రామంలో ఆయనకు నివాళులు అర్పించిన అనంతరం.. నిర్వహించే సభకు జిల్లా ప్రజలను తరలించేందుకు స్థానిక యంత్రాంగం స్కూలు బస్సులన్నింటినీ తరలించింది. అంతేకాదు స్కూళ్ళకు మంగళవారం, బుధవారం సెలవులను కూడా ప్రకటించారు. దీంతో స్థానిక విద్యా కుంజ్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న దేవాంశ్ జైన్ ఆందోళన చెందాడు. ప్రధాని సభకోసం స్కూలుకు సెలవు ఇవ్వడాన్ని తట్టుకోలేకపోయాడు. పరిస్థితికి నివారణా మార్గం ఏమిటా అని ఆలోచించాడు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అన్నట్లుగా ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకే లేఖ రాశాడు. మా చదువులు కంటే మీ మీటింగులు ముఖ్యమా అంటూ లేఖలో సూటిగా ప్రశ్నించాడు. మీరు అమెరికాలో ప్రసంగించినప్పడు కూడా భారీగా జనం తరలి వచ్చినట్లు చూశాను. కానీ వారంతా స్కూలు బస్సుల్లో అక్కడి వచ్చినట్లు మాత్రం చూడలేదు. మరి ఇండియాలో ఇలా ఎందుకు జరుగుతోంది? అని మోదీని ప్రశ్నించిన దేవాంశ్.. తనను తాను మోదీ అభిమానిగా పరిచయం చేసుకున్నాడు. రేడియోలో వచ్చే 'మన్ కీ బాత్' ఎప్పుడూ మిస్ అవ్వకుండా వింటానని లేఖలో పేర్కొన్నాడు. మీరు కాంగ్రెస్ నాయకుల్లా కాక మా చదువుల విషయంలో శ్రద్ధ తీసుకోండి అంటూ దేవాంశ్ లేఖలో వివరించాడు. అలాగే మా స్కూల్ బస్సులను తీసుకోవద్దని శివరాజ్ మామా (ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్) కు కూడా చెప్పండి అంటూ విన్నవించాడు. విద్యార్థి లేఖ సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో జిల్లా కలెక్టర్ అప్రమత్తమై.. ప్రధాని బాభ్రా పర్యటనకోసం తీసుకున్న స్కూలు బస్సులను వెంటనే వెనక్కు ఇచ్చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని పర్యటనలో చట్ట వ్యతిరేక చర్యలు ఎదురుకాకుండా అసిస్టెంట్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ సునీల్ గౌడ్ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.