మహిళా సంఘాలకు ‘సౌరశక్తి’
● జిల్లాలో రెండు యూనిట్ల ఏర్పాటుకు కసరత్తు ● నాలుగు గ్రామ సమాఖ్యల ఎంపిక ● స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి
కై లాస్నగర్: స్వయం సహాయక సంఘాల్లో(ఎస్హెచ్జీ)ని మహిళలు మరింత ఆర్థికాభివృద్ధి సాధించేలా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కుసుమ్ పేరిట కొత్త పథకాన్ని అమలు చేస్తోంది. 33కేవీ విద్యుత్ సబ్స్టేషన్ల పరిధిలో సోలార్ (సౌరశక్తి) ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో విద్యుత్ ఉ త్పత్తి పెంచడంతో పాటు వారి అభ్యున్నతికి అండగా నిలవాలని నిర్ణయించింది. జిల్లాలో పది యూనిట్ల లక్ష్యం కాగా తొలి విడతగా రెండు ఏ ర్పాటు చేసేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ కసరత్తు చేపట్టింది. వాటికి సంబంధించిన డీపీఆ ర్ సిద్ధమవుతోంది. అంతర్జాతీయ మహిళా ది నోత్సవం సందర్భంగా పనులు ప్రారంభించా లని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
రెండు ప్లాంట్లు ఇలా..
జిల్లాలో రెండు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో కూడిన రెండు సోలార్ప్లాంట్లను ఇంద్రవెల్లి, తలమడుగులో ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు ఆసక్తి, ఉత్సాహంగా పనిచేసే ఇంద్రవెల్లి మండలంలోని దస్నాపూర్, పిట్టబొంగరంతో పాటు తలమడుగు మండలంలోని కజ్జర్ల, దేవాపూర్ ఎస్హెచ్జీలను ఎంపిక చేశారు. ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేయనున్న ప్లాంట్కు దస్నాపూర్లోని సర్వేనంబర్ 255లో గల నాలుగు ఎకరాల స్థలాన్ని గుర్తించారు. తలమడుగు మండలానికి సంబంధించి కజ్జర్ల శివారు సర్వేనంబర్ 141లోని ఎనిమిది ఎకరాల స్థలాన్ని గుర్తించారు. రెవెన్యూ, డీఆర్డీఏ, విద్యుత్, రెడ్కో, ఇరిగేషన్ శాఖల అధికారులు సంయుక్తంగా స్థల పరిశీలన చేపట్టి ఎంపిక చేశారు. ఈ రెండు స్థలాలను ఆ గ్రామ సమాఖ్యలకు కేటాయిస్తూ ప్రత్యేక ఐడీ(రిజిస్ట్రేషన్) నంబర్లను కేటాయించారు. అలాగే ప్లాంట్ నుంచి సమీపంలోని సబ్స్టేషన్ వరకు ప్రత్యేకంగా విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తారు. అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ను సబ్స్టేషన్కు మళ్లించి రైతులకు అందజేయనున్నారు. 25ఏళ్ల పాటు ప్రాజెక్ట్ నిర్వహణను ఆయా సంఘాలే పర్యవేక్షించాల్సి ఉంటుంది. తద్వారా ఏటా ఆయా సంఘాలకు రూ.లక్షల్లో ఆదాయం సమకూరి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడనుంది.
ప్రభుత్వానిదే ప్రత్యేక చేయూత
ఒక్కో ప్లాంట్ను రూ.3కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్నారు. దీనికి గాను కేంద్ర ప్రభుత్వం 30శాతం సబ్సిడీ అందజేయనుంది. బ్యాంకు రుణాల ద్వారా ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్లకు లబ్ధిదారు వాటాగా రూ.70లక్షలను ఆ సమాఖ్య సంఘాలు తొలుత చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆదిలాబాద్ జిల్లా పేదరికంతో పాటు వెనుకబడినది కావడంతో ప్రభుత్వం ప్రత్యేక చేయూత అందించాలని నిర్ణయించింది. కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (సీఐఎఫ్) నుంచి ప్రభుత్వమే ఆయా సంఘాలకు రుణ ప్రతిపాదికన వాటిని అందజేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించిన డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)ను సిద్ధం చేస్తున్నారు. అది పూర్తయ్యాక అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఈనెల 8న పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ డీపీఆర్ సిద్ధం కానట్లైతే ప్రారంభంలో జాప్యమయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
ఆర్థిక భారం తగ్గించేలా...
జిల్లాలో ప్రాజెక్టులు, కాలువలు అంతగా లేకపోవడంతో వ్యవసాయ ఆధారితంగానే పంటల సాగు జరుగుతుంది. ఇందుకు యాసంగిలో సాగు చేసే రైతులు విద్యుత్ ఆధారిత బోరు మోటార్ల ద్వారా పంటలకు నీటినందిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వీటికి విద్యుత్ సరఫరా ఉచితంగా అందజేస్తుంది. ఇందుకుగాను ప్రభుత్వంపై ప్రతినెల రూ.కోట్లలో ఆర్థిక భారం పడుతుంది. దీన్ని అధిగమించడంతో పాటు మహిళలకు ఆర్థిక చేయూతనందించేలా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయిస్తోంది. ఇందులో ఉత్పత్తి అయ్యే యూనిట్కు రూ.3.13పైసల చొప్పున ప్రభుత్వమే తిరిగి కొనుగోలు చేస్తోంది. దీంతో విద్యుత్ ఖర్చు తక్కువై ప్రభుత్వానికి ఆర్థికభారం తగ్గనుండటంతో పాటు మహిళలకు ఉపాధి లభించనుంది.
తొలివిడతలో రెండు ఏర్పాటు
జిల్లాలో పది సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తొలివిడతగా రెండు ఏర్పాటు చేసేలా కార్యాచరణ సిద్ధం చేశాం. ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్న గ్రామ సమాఖ్యల గుర్తింపుతో పాటు వాటి ఏర్పాటుకు అవసరమైన స్థలాలను కూడా ఎంపిక చేశాం. అయితే ప్రభుత్వం నుంచి వాటి ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్ అందాల్సి ఉంది. అది వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆదేశాలకు అనుగుంగా పనులు ప్రారంభిస్తాం. ఇది మహిళల ఆర్థికాభివృద్ధికి ఎంతగానో
తోడ్పడనుంది.– రాథోడ్ రవీందర్, డీఆర్డీవో
మహిళా సంఘాలకు ‘సౌరశక్తి’
Comments
Please login to add a commentAdd a comment