● నేడు ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం ● తొలిసారిగా అధికారికంగా నిర్వహణ ● ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ● మంత్రి సీతక్క, ప్రజాప్రతినిధుల రాక | - | Sakshi
Sakshi News home page

● నేడు ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం ● తొలిసారిగా అధికారికంగా నిర్వహణ ● ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ● మంత్రి సీతక్క, ప్రజాప్రతినిధుల రాక

Published Sun, Apr 20 2025 2:01 AM | Last Updated on Sun, Apr 20 2025 2:01 AM

● నేడ

● నేడు ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం ● తొలిసార

ఆ ఘటనలో నా భర్త

చనిపోయిండు..

ఇంద్రవెల్లి ఘటనలో నా భర్త కొద్దు చనిపోయిండు. ఆ తరువాత నేను కూలినాలి చేసి నా కొడుకును పెంచి పెద్ద చేసిన. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక నా భర్త మరణాన్ని గుర్తించిండ్రు. ఇంటి స్థలం ఇచ్చిండ్రు. ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేసిండ్రు. ఐటీడీఏ ద్వారా రుణం ఇస్తే నా కొడుకుకు ఉపాధి దొరుకుతది.

– సెడ్మాకి లచ్చుబాయి, తాటిగూడ

నా కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి

నాడు ఇంద్రవెల్లిలో సంతకు నా భర్త శంభుతో కలిసి వెళ్లిన. అక్కడి నుంచే ఇద్ద రం మీటింగ్‌కు వెళ్లి నం. ఆ సందర్భంగా పోలీసుల కాల్పుల్లో నా కుడి చేయికి గాయమైంది. నా భర్తకు కూడా తుపాకీ బుల్లెట్ల గాయంతో ఇంటికొచ్చి కొద్ది రోజుల తరువాత చనిపోయిండు. చేతికి గాయం కారణంగా ఇప్పటికీ నేను ఏ పని చేయలేకపోతున్న. ఉన్న ఒక్క కొడుకు కూడా అనారో గ్యంతో చనిపోయిండు. కోడలు వద్ద ఉంటూ కాలం వెల్లదీస్తున్న. ప్రభుత్వం ఇస్తున్న పింఛన్‌ కూడా రావట్లేదు. చాలా కష్టంగా ఉంది. ప్రభుత్వం గుర్తించి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి నా కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్న.

– మడావి జంగుబాయి,

కన్నాపూర్‌ గ్రామస్తురాలు

సాక్షి, ఆదిలాబాద్‌/ఇంద్రవెల్లి: ఇంద్రవెల్లి మురిసిపోతుంది. నేడు అమరవీరుల సంస్మరణ దినోత్సవా నికి సిద్ధమైంది. ఏటా మాదిరిగానే కాకుండా ఈ సారి ఓ ప్రత్యేకత ఉంది. 43 ఏళ్లుగా నిర్బంధాలు, ఆంక్షల మధ్య అమరవీరులకు నివాళులు అర్పించగా, ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా సంస్మరణ వేడుకలను నిర్వహిస్తోంది. కొద్దిరోజులుగా జిల్లా అధికారులే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఫలితంగా ఈ సారి స్వేచ్ఛగా నివాళులు అర్పించవచ్చన్న మురిపెం ఆదివాసీల్లో కనిపిస్తోంది.

స్మృతివనంలో కళకళలాడుతున్న స్తూపం ..

ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం.. ఆదిలాబాద్‌ నుంచి ఉట్నూర్‌ వెళ్లే మార్గ మధ్యలో ఇంద్రవెల్లి గ్రామ శివారులో నిలువెత్తుగా దర్శనమిస్తోంది. అయితే ఇన్నాళ్లుగా ఆ స్తూపం ఆవరణలో అభివృద్ధి మచ్చుకు కనిపించేది కాదు. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి ఇంద్రవెల్లి ప్రాంతం, ఆదివాసీల అభ్యున్నతిపై దృష్టి సారించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తొలుత ఇక్కడికే విచ్చేశారు. ఆ సమయంలోనే స్తూపం వద్ద అభివృద్ధి పనుల కోసం దాదాపు రూ.కోటి కేటాయించారు. ఆ నిధులతో అక్కడ ఎకరం స్థలంలో అమరవీరుల స్మృతివనం అభివృద్ధి చేశారు. అందులో భాగంగా చుట్టూ ప్రహరీ నిర్మించారు. కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం కూడా పూర్తి చేశారు. ఈ సారి సంస్మరణ దినోత్సవంను అధికారికంగా ఘనంగా నిర్వహించేందుకు కలెక్టర్‌ రాజర్షి షా, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా కొద్ది రోజులుగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం నిర్వహించనున్న కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సీతక్క, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఉమ్మడి జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.

భూమి, భుక్తి, విముక్తి కోసం...

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో 1981 ఏప్రిల్‌ 20న జరిగిన సంఘటనకు నేటితో 44 ఏళ్లవుతుంది. భూమి, భుక్తి, విముక్తితో పాటు స్వయం పరిపాలన కోసం ఆదివాసీలు పోరాటం చేశారు. అటవీ అధికారులు, షావుకార్ల దౌర్జన్యం నశించాలనే డిమాండ్‌తో గిరిజన రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నాడు ఇంద్రవెల్లిలో సభ ఏర్పాటు చేశారు. దీనికి పీపుల్స్‌వార్‌ మద్దతునిచ్చింది. అప్పట్లో ప్రభుత్వం సభ నిర్వహణకు అనుమతినిచ్చినట్టే ఇచ్చి ఆ తర్వాత రద్దు చేసింది. విషయం తెలియక ఆదివాసీగూడేల నుంచి పెద్ద ఎత్తున సభకు తరలివచ్చారు. అయితే సభాస్థలాన్ని ఖాళీ చేయాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో ఆదివాసీలు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇలా ఘర్షణ వాతావరణంలో పోలీసులు కాల్పులు జరపడంతో పలువురు ఉద్యమకారులు (15 మంది అధికారికంగా) మృతి చెందారు. కాల్పుల ఘటనలో అమరులైన ఆదివాసీల స్మారకార్థం రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి వద్ద 80 అడుగుల స్తూపం నిర్మించారు. ఆ తర్వాత ప్రభుత్వాలు స్తూపం వద్ద సంస్మరణ దినోత్సవం నిర్వహణపై నిషేధాజ్ఞలు విధించాయి. దీంతో ఏళ్ల పాటు ఏప్రిల్‌ 20 వచ్చిందంటే అక్కడ భారీ ఎత్తున పోలీసుల బందోబస్తు కనిపించేది. స్తూపాన్ని 1986 మార్చిలో గుర్తు తెలియని వ్యక్తులు డైనమెట్లతో పేల్చారు. గిరిజనులు ఆందోళనతో 1987లో ప్రభుత్వం ఐటీడీఏ నిధులతో రెండోసారి నిర్మించింది. 2015 నుంచి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇవ్వకపోయినా ఆంక్షలు సడలించింది. అయితే పోలీసు బందోబస్తు మాత్రం అదే రీతిలో ఉండేది. ఈ ఏడాది మాత్రం అలాంటివేమి లేకుండా ఆదివాసీలు స్వేచ్ఛగా నివాళులు అర్పించేందుకు సిద్ధమయ్యారు.

చివరి దశకు స్మృతి వనం పనులు

నాటి అమరుల కుటుంబీకులతో పాటు గాయాలైన వారిని ఏ ప్రభుత్వం కూడా ఆదుకోలేదు. నాలుగేళ్ల క్రితం అప్పటి ఎంపీ సోయం బాపూరావ్‌ అమరుల కుటుంబీకులకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెంచారు. స్తూపం వద్ద స్మృతి వనం ఏర్పాటుకు రూ.97లక్షల నిధులు కేటాయించారు. చుట్టూ ప్రహరీతో పాటు కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం, స్తూపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసి సుందరంగా తీర్చిదిద్దారు. ప్రభుత్వం వద్ద ఉన్న రికార్డుల ప్రకారం 15 మంది అమరవీరుల కుటుంబీకులకు మండలంలోని ముత్నూర్‌ సమీపంలో గతేడాది ఇళ్ల స్థలాలు కేటాయించి హక్కు పత్రాలు అందించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. ఇటీవల ఆ పనులను ప్రారంభించారు.

ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం

నేడు అధికారికంగా నివాళులు

నేడు ఉదయం 11 గంటలకు అధికారికంగా నిర్వహించనున్న సంస్మరణ సభకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ఉమ్మడి జిల్లా నుంచి ఆదివాసీలు తరలివచ్చి నివాళులర్పించనున్నారు. మంత్రి చేతుల మీదుగా అమరుల కుటుంబీకులకు ట్రైకా ర్‌ ద్వారా రూ.10 లక్షల చొప్పున రుణ సౌకర్యం కల్పించనున్నారు. కాగా, నాటి ఘటనలో గాయపడిన వారిని కూడా ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

1981 ఏప్రిల్‌ 20 జల్‌..జంగల్‌...జమీన్‌ కోసం ఉద్యమించిన అడవిబిడ్డలపై అప్పటి సర్కారు తుపాకీ ఎక్కుపెట్టింది. తూటాల వర్షం కురిపించింది. హక్కుల సాధనలో 15 మంది గిరిజనులు అమరులయ్యారు. వారి రక్తపుటేరులతో తడిసిన వనసీమ ఎర్రబారింది. అడవిబిడ్డల అమరత్వం నింగికెగిసింది. అగ్ని శిఖలా ఇంద్రవెల్లిలో అమరుల స్తూపమై నిలి చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి ప్రభుత్వాల పాలనలో స్వేచ్ఛగా నివాళులర్పించలేని దుస్థితి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం కొంతమేర సడలింపు ఇచ్చింది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరవీరుల స్తూపం వద్ద స్మృతి వనం ఏర్పాటుకు నిర్ణయించింది. అలాగే సంస్మరణ దినోత్సవాన్ని ఈ ఏడాది అధికారికంగా నిర్వహించేందుకు సన్నద్ధమైంది.

● నేడు ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం ● తొలిసార1
1/4

● నేడు ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం ● తొలిసార

● నేడు ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం ● తొలిసార2
2/4

● నేడు ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం ● తొలిసార

● నేడు ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం ● తొలిసార3
3/4

● నేడు ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం ● తొలిసార

● నేడు ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం ● తొలిసార4
4/4

● నేడు ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం ● తొలిసార

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement