ఐపీఎల్‌కు సరికొత్తగా వైఎస్సార్‌ స్టేడియం | - | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌కు సరికొత్తగా వైఎస్సార్‌ స్టేడియం

Published Wed, Mar 5 2025 1:00 AM | Last Updated on Wed, Mar 5 2025 12:56 AM

ఐపీఎల్‌కు సరికొత్తగా వైఎస్సార్‌ స్టేడియం

ఐపీఎల్‌కు సరికొత్తగా వైఎస్సార్‌ స్టేడియం

విశాఖ స్పోర్ట్స్‌: ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆడే తొలి రెండు మ్యాచ్‌లకు విశాఖలోని వైఎస్సార్‌ ఏసీఏ వీడీసీఏ స్టేడియం సరికొత్త రూపు సంతరించుకుంటోంది. ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించి మంగళవారం జిల్లా యంత్రాగం సమావేశమైంది. ముందుగా ఆంధ్ర క్రికెట్‌ సంఘం అపెక్స్‌ కౌన్సిల్‌తో పాటు కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌, పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి, మ్యాచ్‌ నిర్వాహక కమిటీ స్టేడియంను పరిశీలించింది. మ్యాచ్‌లు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించింది. స్టేడియంలో ఆధునికీకరణ పనులు పర్యవేక్షించిన అనంతరం.. ఫ్లడ్‌లైట్ల పనితీరును పరిశీలించింది. ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా స్టేడియం, స్టేడియం బయట ఎలాంటి ఏర్పాట్లు చేయాలి? ప్రవేశా మార్గాలు ఏర్పాటు తదితర అంశాలపై కమిటీ చర్చించింది. ఈ సందర్భంగా కలెక్టర్‌, సీపీ కాసేపు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. కాగా.. ఈ నెల 24న రాత్రి ఏడు గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో సూపర్‌జెయింట్‌, 30న ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు డీసీతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లకు ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో టికెట్లు విక్రయించనున్నారు.

రూ.40 కోట్లతో స్టేడియం ఆధునికీకరణ

సాంకేతికతను అనుసంధానిస్తూ విశాఖలోని వైఎస్సార్‌ స్టేడియంను ఆధునికీకరిస్తున్నట్లు ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్‌ తెలిపారు. సీపీ, ఏసీఏ కార్యదర్శి సానా సతీష్‌బాబుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ సూచనల మేరకు స్టేడియంలో బాత్‌రూమ్‌లను పెంచి అభిమానులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. సంక్రాంతి అనంతరం ఆధునికీకరణ పనులకు శ్రీకారం చుట్టి.. స్టేడియం స్వరూపమే మార్చినట్లు చెప్పారు. దాదాపు 40 కోట్ల వరకు వెచ్చించి, తొలి దశ పనులు పూర్తి చేశామన్నారు. ఫ్లడ్‌లైట్ల కోసం రూ.9.5 కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారు. 34 వీఐపీ కార్పొరేట్‌ బాక్స్‌లతో పాటు రెండు టీమ్‌ బాక్స్‌లను సరికొత్తగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. దీంతో బీసీసీఐ సైతం ఈ ఏడాది మరిన్ని మ్యాచ్‌లను విశాఖ వేదికగా నిర్వహించేందుకు మాటిచ్చిందన్నారు. విశాఖలో మరో ఇంటిగ్రేటెడ్‌ క్రికెట్‌ స్టేడియం నిర్మాణానికి ఎటువంటి ఆలోచన లేదని ఏసీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ కార్యదర్శి సానా సతీష్‌బాబు ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రతి జిల్లాలో క్రికెట్‌ గ్రౌండ్‌ ఏర్పాటుతో పాటు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు వివరించారు. సీపీ మాట్లాడుతూ మరోసారి విశాఖ వేదికగా ఐపీఎల్‌ జరగడం శుభపరిణామన్నారు. ఆటగాళ్ల నుంచి అభిమానుల భద్రత వరకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్‌ నియంత్రణకు ఏర్పాట్లు చేస్తామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement