
అనంతపురం: శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావుకు విలేకరి బాలమురళీధర్ మంగళవారం ఫిర్యాదు చేశారు. శింగనమలలో ఇసుక అక్రమ రవాణాపై వార్తలు ప్రచురించడంతో తనపై బండారు శ్రావణి వర్గీయులు కక్ష కట్టారని పేర్కొన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్లో నగరంలోని ఓ హోటల్లో తనపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని, ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో నాల్గో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో తనను పరుష పదజాలంతో దూషిస్తూ ఎమ్మెల్యే అనుచరుడు బాబా ఫకృద్దీన్ వలి అభ్యంతరకర పోస్టులు పెడుతున్నాడని వాపోయారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన తనకు ఏదైనా జరిగితే దానికి ఎమ్మెల్యే బండారు శ్రావణిదే పూర్తి బాధ్యత అంటూ ఫిర్యాదు చేశారు.