కొత్త ఫాస్టాగ్‌ రూల్స్‌ తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

కొత్త ఫాస్టాగ్‌ రూల్స్‌ తప్పనిసరి

Published Mon, Feb 17 2025 1:02 AM | Last Updated on Mon, Feb 17 2025 12:57 AM

కొత్త

కొత్త ఫాస్టాగ్‌ రూల్స్‌ తప్పనిసరి

హిందూపురం అర్బన్‌: జాతీయ రహదారులు, ఇతర చోట్ల టోల్‌గేట్స్‌ దాటి వెళ్లే వాహనదారులు (కార్లు, బస్సులు, లారీలు తదితర వాహనాలు) తప్పనిసరిగా సోమవారం నుంచి నూతన ఫాస్టాగ్‌ రూల్స్‌ పాటించాలి. ఈ నెల 17 నుంచి నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) కొత్త ఫాస్టాగ్‌ రూల్స్‌ అమలులోకి తెచ్చింది. ఈ విధానం ప్రకారం వాహనదారులు కొత్త చెల్లింపు విధానాలు పాటించకపోతే ఆదనంగా ఫైన్‌ చెల్లించాల్సి ఉంటుంది. ప్రధానంగా టోల్‌ ప్లాజా వద్దకు వెళ్లే 75 నిమిషాల ముందే తగిన రెండింతల మొత్తం ఫాస్టాగ్‌లో ఉండేలా రీచార్జ్‌ చేసుకోవాలి. అలాగే రవాణా కార్యాలయంలో కేవైసీ చేయించుకొని తీరాలి. కొంతమంది ఇప్పటికీ అడపాదడపా వాహనాలు బయటకు తీసి తిప్పేవారు టోల్‌ప్లాజా వద్దకు వెళ్లేందుకు 5 నిమిషాల ముందు రీచార్జ్‌ చేస్తుంటారు. ఇకమీదట అలా కుదరదు. అందుకు జాతీయ రహదారుల అధీకృత సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) స్వస్తి పలికింది. తగిన మొత్తం ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్‌ లేని పక్షంలో డబుల్‌ మొత్తం చెల్లించక తప్పదు. త్వరిత గత ప్రయాణం, డిజిటల్‌ చెల్లింపుల లావాదేవీలు ప్రోత్సహించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ ఈ నిబంధనను సోమవారం తెల్లవారుజాము నుంచి అమల్లోకి తీసుకొచ్చింది.

మెట్టినింటికి తీసుకెళ్లాలని

అడిగినందుకు దాడి

న్యాయం చేయాలంటున్న బాధితురాలు

బెళుగుప్ప: మెట్టినింటికి తీసుకెళ్లాలని అడిగినందుకు భర్తతో పాటు వారి కుటుంబ సభ్యులు చితకబాదారని బాధితురాలు సాయిలీల ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ శివ విచారణ చేపట్టారు. బాధితురాలి వివరాలమేరకు.. మండల పరిధిలోని తగ్గుపర్తికి చెందిన సాయిలీల, కణేకల్లు మండలం కలేకుర్తికి చెందిన లాలుస్వామి మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దల అంగీకారంతో గత నెల 24న పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే తగ్గుపర్తిలోని తన అక్క ఇంట్లో ఉంటున్న లాలుస్వామి.. భార్య సాయిలీల దగ్గరకు మాత్రం అప్పుడప్పుడూ వెళ్లేవాడు. అయితే మొట్టినింటికి తీసుకెళ్లాలని సాయిలీల భర్త లాలుస్వామిని అడిగింది. తన అక్కలకు, అమ్మకు తనను పెళ్లిచేసుకోవడం ఇష్టం లేదని చెప్పాడని, మెట్టినింటికి తీసుకెళ్లాలని గట్టిగా నిలదీసింది. ఈ నేపథ్యంలో సాయిలీలతో పాటు ఆమె అక్క ప్రవళ్లిక, అన్న ఎర్రిస్వామి, వదిన శిల్ప, మామ నాగరాజుపై లాలుస్వామితో పాటు వారి కుటుంబ సభ్యులు దాడి చేశారు. వారంతా గాయపడటంతో కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులే తనకు న్యాయం చేయాలని బాధితురాలు సాయిలీల విజ్ఞప్తి చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

తాడిపత్రి రూరల్‌: మండలంలోని సజ్జలదిన్నె క్రాస్‌లో ఆదివారం రంగనాయకులు(65) ద్విచక్ర వాహనంలో వెళ్తూ లారీ కింద పడి మృతి చెందినట్లు అప్‌గ్రేడ్‌ ఎస్‌ఐ కాటయ్య తెలిపారు. మండలంలోని ఆలూరుకు చెందిన రంగనాయకులు మోటర్‌ సైకిల్‌లో తాడిపత్రి నుంచి ఆలూరుకు వెళుతుండగా ప్రమాదం జరిగిందన్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు డ్రైవర్‌పై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.

గార్లదిన్నెలో మరొకరు..

గార్లదిన్నె: మండల పరిధిలోని రామ్‌దాస్‌పేట గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు... శింగనమల మండలం నిదనవాడకు చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి లాగేజీ ఆటోలో గేదేలను అనంతపురం మార్కెట్‌కు తరలిస్తున్నాడని చెప్పారు. అయితే రామ్‌దాస్‌పేట సమీపంలోకి రాగానే వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆటో బోల్తా పడిందన్నారు. దీంతో లక్ష్మీనారాయణ (45) అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురము ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కార్మికుల సమస్యలపై

అలసత్వం తగదు

కూడేరు: మండల పరిధిలోని పీఏబీఆర్‌ డ్యాం వద్ద ఏర్పాటైన శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపై అధికారులు, ప్రభుత్వం అలసత్వం వహించడం తగదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు అన్నారు. ఆదివారం ఆయన పీఏబీఆర్‌ డ్యాం వద్ద ఉన్న శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్‌ను సందర్శించారు. కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫేస్‌–4లో కళ్యాణదుర్గం , రాయదుర్గం కార్మికులకు పెండింగ్‌లో ఉన్న 6 నెలల జీతాలు, 30 నెలల ఫీఎప్‌ చెల్లించాలన్నారు. సమస్యల పరిష్కారానికై ఈ నెల 18 నుంచి కార్మికుంతా సమ్మెబాట పడుతున్నట్లు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కొత్త ఫాస్టాగ్‌ రూల్స్‌ తప్పనిసరి 1
1/2

కొత్త ఫాస్టాగ్‌ రూల్స్‌ తప్పనిసరి

కొత్త ఫాస్టాగ్‌ రూల్స్‌ తప్పనిసరి 2
2/2

కొత్త ఫాస్టాగ్‌ రూల్స్‌ తప్పనిసరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement