సమస్యలు పరిష్కరిస్తాం | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరిస్తాం

Published Fri, Mar 14 2025 12:28 AM | Last Updated on Fri, Mar 14 2025 12:27 AM

సమస్యలు పరిష్కరిస్తాం

సమస్యలు పరిష్కరిస్తాం

అనంతపురం అర్బన్‌: రవాణా సంబంధిత సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. గురువారం ఆయన ఆకాశవాణి కేంద్రం నుంచి ‘అనంతమిత్ర ఫోన్‌ఇన్‌’ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 17 మంది ఫోన్‌ ద్వారా సమస్యలను విన్నవించారు. కార్యక్రమంలో డీటీసీ వీర్రాజు, ఆల్‌ఇండియా రేడియో ప్రోగ్రాం డైరెక్టర్‌ నాగేశ్వరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఫిర్యాదుల్లో కొన్ని...

ఫిర్యాదుదారు: నా పేరు వెంటరాముడు. మాది గార్లదిన్నె మండలం కోటంక గ్రామం, అనంతపురం నుంచి మా గ్రామానికి 2014లో రెండు బస్సులు తిరిగేవి. ప్రస్తుతం విద్యార్థుల కోసం ఉదయం, సాయంత్రం మాత్రమే తిప్పుతున్నారు. పురుషులు దాదాపు 20 కిలోమీటర్లు బైకులో వెళుతున్నారు. మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్రామానికి అదనపు ట్రిప్పులు నడిపేలా చర్యలు తీసుకోండి.

కలెక్టర్‌: ఆర్టీసీ అధికారులు మీ ప్రాంతాన్ని పరిశీలిస్తారు. అవసరమైతే మరో బస్సును గ్రామానికి నడిపేలా చర్యలు తీసుకుంటారు.

ఫిర్యాదుదారు: నా పేరు బాబు. అనంతపురం రూరల్‌ మండలం ఆకుతోటపల్లి. ఇంటెల్‌ కళాశాల రోడ్డులో పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. ఈ రోడ్డు దాటుకోవడానికి విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. డివైడర్లు, స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేస్తే సౌకర్యంగా ఉంటుంది.

కలెక్టర్‌: మీరు చెబుతున్న ప్రదేశాన్ని రవాణా, పోలీసు శాఖల అధికారులు పరిశీలిస్తారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.

ఫిర్యాదుదారు: నా పేరు మహబూబ్‌బాషా. మాది గార్లదిన్నె. చిన్న పిల్లలు వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. హెల్మెట్‌ లేకుండా వాహనాలను నడపుతున్న వారికి పోలీసులు ఫైన్‌ వేస్తూ ‘మీ సేవ’లో కట్టాలని చెబుతున్నారు. అక్కడి వెళితే ఫైన్‌తో పాటు అదనంగా రూ.30 కట్టాల్సి వస్తోంది. అలా కాకుండా ఒక యాప్‌ ఉన్నట్లయితే దాని నుంచి ఫైన్‌ కడితే రూ.30 మిగులుతాయి. ఈ సౌకర్యాన్ని కల్పించాలి.

కలెక్టర్‌: ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలి. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వడం నేరం. మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్‌ ఇప్పిస్తాం. యాప్‌ ద్వారా ఫైన్‌ కట్టే సౌలభ్యం కల్పించే అంశాన్ని పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తా.

తాగునీటి ఎద్దడి తలెత్తకూడదు

‘వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకూడదు. మరమ్మతు పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలి’ అని కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ సంబంధిత అఽధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో శ్రీ సత్యసాయి నీటి సరఫరా ప్రాజెక్టు బోర్డు కమిటీ సమావేశాన్ని జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయగిరిజమ్మతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా పైప్‌లైన్ల ఏర్పాటు, దెబ్బతిన్న పైప్‌లైన్ల మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ సురేష్‌, సీఈఓ రామచంద్రారెడ్డి, ఎస్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ శేషాద్రిశేఖర్‌, హెచ్‌ఎల్‌సీ ఎస్‌ఈ రాజశేఖర్‌, డీపీఓ నాగరాజునాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement