మొల్లమాంబ మహోన్నతురాలు | - | Sakshi
Sakshi News home page

మొల్లమాంబ మహోన్నతురాలు

Published Fri, Mar 14 2025 12:29 AM | Last Updated on Fri, Mar 14 2025 12:28 AM

మొల్లమాంబ మహోన్నతురాలు

మొల్లమాంబ మహోన్నతురాలు

అనంతపురం అర్బన్‌: మొల్లమాంబ మహోన్నతురాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ గిరిజమ్మ కొనియాడారు. గురువారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొల్లమాంబ జయంత్యుత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌తో పాటు అసిస్టెంట్‌ కలెక్టర్‌ బి.వినూత్న ముఖ్యఅతిథులుగా హాజరై మొల్లమాంబ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ మొల్లమాంబ రాయలసీమలో జన్మించడం గర్వకారణమన్నారు. వాల్మీకి రామాయణం సామాన్యులకు అర్థమయ్యేలా తెలుగులో రచించారని, ఆమె రాసిన రామాయణం మొల్ల రామాయణంగా ప్రసిద్ధి గాంచిందన్నారు. మొల్లమాంబ చరిత్రను భావితరాలకు అందించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. కుమ్మరుల సమస్యలను సంఘం నాయకులు, కులపెద్దలు తన దృష్టికి తీసుకొచ్చారని, వారి అభ్యున్నతికి సంపూర్ణంగా కృషి చేస్తానని కలెక్టర్‌ చెప్పారు. అనంతరం బాలికల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీఆర్‌ఓ ఎ.మలోల, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ రాధిక, కుమ్మర శాలివాహన రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు కుమ్మర ఓబుళపతి, జిల్లా అధ్యక్షుడు రామాంజినేయులు, నాయకులు ఓబులేసు, పోతులయ్య, వెంకటరమణ, రమణ, బానుకోట రామాంజినేయులు, గోపాల్‌, సహకార సంఘాల నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంస్కృతి ప్రతిబింబించేలా ‘కాఫీ టేబుల్‌ బుక్‌’

జిల్లాలో చారిత్రాత్మక సంస్కృతి ప్రతిబింబించేలా ప్రత్యేకంగా ‘కాఫీ టేబుల్‌ బుక్‌’ రూపొందించాలని కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరన్స్‌ హాల్‌లో జిల్లా టూరిజం కౌన్సిల్‌ (డీటీసీ) సమావేశం నిర్వహించారు. అధికారులు, ఇంటాక్‌ సభ్యులు, కన్సల్టెన్సీ ప్రతినిధులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చారిత్రక కట్టడాలు, సందర్శన స్థలాలు, వ్యవసాయం, పంటలు, పర్యాటకం, దేవాలయాలు, ప్రాచీన చెరువులు, హస్త కళలు, సంప్రదాయ వంటలు, సంస్కృతి సమాచారం సేకరించాలన్నారు. కన్సల్టెన్సీ ప్రతినిధులతో సమన్వయం చేసుకుని సమగ్ర ‘కాఫీ టేబుల్‌ బుక్‌’ను రూపొందించి, సందర్శకులకు అందుబాటులో ఉండేలా ఇన్‌స్టిట్యూట్లు, విశ్వవిద్యాలయాలు, ప్రాంగణాల్లో ఉంచాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ వినూత్న, పురావస్తు శాఖ ఏడీ రజిత, పర్యాటక శాఖ అధికారి జయకుమార్‌, దేవదాయశాఖ అధికారి ఆదిశేషునాయుడు, ఇంటాక్‌ కన్వీనర్‌ రామ్‌కుమార్‌, ఇతర అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ గిరిజమ్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement