AP: Andhra Pradesh Government Hopes On Union Budget 2022 Details Inside - Sakshi

Union Budget 2022: కేంద్ర బడ్జెట్‌పై కోటి ఆశలు

Jan 31 2022 2:53 AM | Updated on Jan 31 2022 1:15 PM

Andhra Pradesh Government Hopes On Union Budget 2022 - Sakshi

సాక్షి, అమరావతి: కేంద్ర బడ్జెట్‌ను మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దానిపై కోటి ఆశలు పెట్టుకుంది. రాష్ట్ర విభజన, కరోనా వంటి వరుస దెబ్బలతో భారీగా ఆదాయం కోల్పోయిన ఏపీకి ఈ ఏడాదైనా తగిన రీతిలో కేంద్రం నిధులు కేటాయిస్తుందని ఆశిస్తోంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న పలు జాతీయ సంస్థలకు గ్రాంటు రూపంలో ఇప్పటివరకు బడ్జెట్‌లో అరకొర నిధులే కేటాయిస్తూ వచ్చారు. అయితే.. ఈసారైనా తగినన్ని నిధులు కేటాయిస్తే వాటి నిర్మాణాలు పూర్తవుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాక..  

► రాష్ట్ర విభజన జరిగిన ఆర్థిక ఏడాదిలో ఏర్పడిన రెవెన్యూ లోటును భర్తీచేస్తామని చెప్పినప్పటికీ పూర్తిస్థాయిలో దానిని ఇప్పటివరకూ భర్తీచేయలేదు. 2014–15 ఆర్థిక ఏడాది రెవెన్యూ లోటు భర్తీ కింద రాష్ట్రానికి రూ.18,830.87 కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉంది. ఈ బడ్జెట్‌లో దీని నిమిత్తం కేటాయింపుల చేస్తారన్న నమ్మకంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎందుకంటే.. బడ్జెట్‌ కేటాయింపుల ద్వారానే రెవెన్యూ లోటు భర్తీచేస్తామని విభజన సమయంలోనే కేంద్రం చెప్పింది.
► 2019–20లో ఏర్పడ్డ ఆర్థిక మందగమనం రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా రూ.34,833 కోట్లు అయితే వాస్తవంగా వచ్చింది రూ.28,242 కోట్లు. ఆ తర్వాత 2020–21లో కోవిడ్‌ పరిస్థితులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీశాయి. కేంద్ర పన్నుల్లో రూ.7,780 కోట్ల మేర నష్టం వాటిల్లింది. రాష్ట్రం ఆదాయ వనరుల నుంచి రావాల్సిన రూ.7 వేల కోట్లు కూడా రాకుండాపోయాయి. దీంతోపాటు కోవిడ్‌ నివారణా చర్యల కోసం దాదాపు రూ.8 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసింది. దీంతో రాష్ట్రానికి బడ్జెట్‌ ద్వారా అదనపు ఆర్థిక సాయం ప్రకటించాలని ఏపీ ఆర్థిక శాఖ వర్గాలు కోరుతున్నాయి. 

వెనుకబడిన జిల్లాలకు కొంతమేరైనా..
రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఉత్తరాంధ్ర, రాయలసీమలో వెనుకబడిన ఏడు జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి సాయం కింద బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఇందులో భాగంగా..  రూ.24,350 కోట్లను ఐదేళ్ల కాలవ్యవధిలో సహాయం చేయాలని కేంద్రాన్ని కోరింది. వీటిలో ఇంకా రావాల్సినవి రూ.23,300 కోట్లు ఉండగా ఇందులో కొంతమేరైనా బడ్జెట్‌లో కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. గత చంద్రబాబు ప్రభుత్వం ఆ జిల్లాలకు ఏటా రూ.50 కోట్ల ఆర్థిక సాయానికి అంగీకరించడంతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. ఈసారి బడ్జెట్‌లోనైనా దానిని సరిదిద్ది న్యాయం చేస్తారని రాష్ట్ర ప్రభుత్వం గంపెడాశలు పెట్టుకుంది.
 
పోలవరం నిధులకూ ఎదురుచూపు
జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టుకు తగినన్ని నిధులతో పాటు.. ఇప్పటికే ఉన్న బకాయిల కిందా బడెŠజ్‌ట్‌లో తగినన్ని నిధుల కేటాయింస్తారని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. 
► అలాగే, రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్‌ కాలేజీల నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇందులో కేంద్రం మూడింటికి అనుమతించింది. ఈ మూడు కాలేజీలకు బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయింపుతో పాటు మిగతా కాలేజీలకూ అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. 
► ఇక వైఎస్సార్‌ కడప స్టీల్‌ప్లాంటుతో పాటు, రామాయపట్నం పోర్టుకూ బడ్జెల్‌లో తగినన్ని నిధులు కేటాయింపులనూ ఆశిస్తోంది.
► రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు.. పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద పదేళ్లపాటు జీఎస్టీ రీయంబర్స్‌మెంట్‌.. పదేళ్లపాటు ఆదాయపు పన్ను మినహాయింపు.. 100 శాతం రీయంబర్స్‌మెంట్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంలను కేంద్ర బడ్జెట్‌లో ప్రకటిస్తారని ఎదురుచూస్తోంది. 
► వీటితోపాటు పలు విద్య, వైద్య సంస్థలకూ ప్రత్యేక కేటాయింపులనూ రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement