Union Budget 2022
-
కోవిడ్ అనంతర ఆర్థిక స్థిరత్వమే బడ్జెట్ లక్ష్యం
చెన్నై: భారత్ ఆర్థిక వ్యవస్థలో కోవిడ్–19 అనంతర స్థిరత్వమే 2022–23 వార్షిక బడ్జెట్ లక్ష్యమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 2021–22 వార్షిక బడ్జెట్ను కూడా ఇదే విధమైన లక్ష్యంతో రూపొందించడం జరిగిందనీ, దానికి కొనసాగింపే 2022–23 వార్షిక బడ్జెట్ అని ఆమె తెలిపారు. పారిశ్రామిక వేత్తలు, వాణిజ్య ప్రతినిధులతో జరిగిన ఒక సమావేశంలో ఆర్థిక మంత్రి మంగళవారం ప్రసంగించారు. ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే, ఫిబ్రవరి 1వ తేదీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2021–22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కొనసాగింపు. కోవిడ్–19 మహమ్మారి నుండి ఆర్థిక పునరుజ్జీవనం, స్థిరత్వం లక్ష్యంగా రూపొందిన బడ్జెట్ ఇది. ’ఇండియా (యట్) 100’ చొరవలో భాగంగా వ్యవసాయం వంటి వివిధ రంగాలకు సాంకేతికత సౌలభ్యత పెంచడం, వైద్యం, విద్య వంటి వాటిలో డిజిటల్ ప్రోగ్రామ్లను విస్తరించడం వంటి అంశాల ద్వారా బడ్జెట్ భవిష్యత్ చర్యలను చేపట్టింది. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం పెద్దపీట వేస్తుంది. రత్నాలు, ఆభరణాల పరిశ్రమ పురోగతిపై దృష్టి సారిస్తుంది. ఆర్థికశాఖ సీనియర్ అధికారులుసహా ఇండియా సిమెంట్స్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీనివాసన్, జీఆర్టీ జ్యువెలరీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జీఆర్ అనంత పద్మనాభన్, అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ సునీతా రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
భారీగా పామాయిల్ సాగు
న్యూఢిల్లీ: దేశీ రైతులు పండించిన నూనెగింజలను కొనుగోలు చేస్తూ వారికి మద్దతుగా నిలవాలని ప్రైవేటు కంపెనీలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. అదే సమయంలో వంట నూనెల దిగుమతులు తగ్గించుకోవాలని సూచించారు. ఇది ఇరు వర్గాలకు ప్రయోజనకరమన్నారు. భారత్ వచ్చే 3–4 ఏళ్లలో వంట నూనెల ఉత్పత్తిని 50 శాతం పెంచుకునే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్’ కార్యక్రమం కింద పెద్ద ఎత్తున పామాయిల్ సాగుకు పుష్కలంగా అవకాశాలున్నట్టు పేర్కొన్నారు. ‘వ్యవసాయ రంగంపై బడ్జెట్ 2022 సానుకూల ప్రభావం’ అనే అంశంపై ఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. ‘‘వీటికి (కాయధాన్యాలు, నూనె గింజలకు) దేశంలో భారీ డిమాండ్ ఉంది కార్పొరేట్ ప్రపంచం ముందుకు రావాలి. మీకు భరోసానిచ్చే మార్కెట్ ఉంది. దిగుమతులు చేసుకోవాల్సిన అవసరం ఎందుకు? ఎంత పరిమాణంలో కాయధాన్యాలు, నూనె గింజలను కొనుగోలు చేస్తారో రైతులకు ముందే చెప్పండి’’అని మోదీ అన్నారు. పంట నష్టానికి రక్షణగా వ్యవసాయ బీమా యంత్రాంగం ఉన్నట్టు చెప్పారు. మనమంతా కలసి పనిచేయడం ద్వారా మన దేశ అవసరాలకు కావాల్సిన ఆహార ఉత్పత్తులను స్థానికంగానే పండించేలా చూడాల్సి ఉందన్నారు. దేశ వంట నూనెల అవసరాల్లో 60–65 శాతాన్ని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితిని ప్రధాని గుర్తు చేశారు. వంట నూనెల దిగుమతి బిల్లు 2020–21 సీజన్లో రూ.1.17 లక్షల కోట్లుగా ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. చిరుధాన్యాల సంవత్సరం 2023 అధిక పోషక విలువలు కలిగిన భారతీయ మిల్లెట్స్ (చిరు ధాన్యాలు)కు బ్రాండింగ్, ప్రచారానికి సహకారం అందించాలని కార్పొరేట్ సంస్థలను ప్రధాని కోరారు. 2023 సంవత్సరాన్ని మిల్లెట్స్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించారు. నానో ఫెర్టిలైజర్ విభాగంలో కంపెనీలకు అపార అవకాశాలున్నట్టు గుర్తు చేశారు. దీనితోపాటు ఆహారశుద్ధి, ఇథనాల్ తయారీ సాగు ముఖచిత్రాన్ని మార్చేవిగా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా భూసార పరీక్షా కేంద్రాల నెట్వర్క్ ఏర్పాటుకు స్టార్టప్లు, ఇన్వెస్టర్లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భూముల సారాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. 2022–23 బడ్జెట్ భారత్ వ్యవసాయ రంగాన్ని ఆధునికంగా, స్మార్ట్గా మార్చడంపై దృష్టి సారించినట్టు ప్రధాని పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో సాగు, వాణిజ్య అంశాలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిగా మార్చేస్తుందన్నారు. అగ్రి స్టార్టప్లను ప్రోత్సహించినప్పుడే సాగులో డ్రోట్ టెక్నాలజీ మరింత అందుబాటులోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. గత మూడు నాలుగేళ్లలో 700 వ్యవసాయాధారిత స్టార్టప్లు ప్రారంభమైనట్టు చెప్పారు. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం ‘‘రైతుల ఆదాయం పెంచడం, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, రైతులకు ఆధునిక సదుపాయాలను కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశ్యం. రైతులకు అద్దెపై వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను అందించే వ్యవస్థను కార్పొరేట్లు ఏర్పాటు చేయాలి. సహజ, సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేయడంపై అవగాహన పెంచేందుకు యూనివర్సిటీలు, శాస్త్రవేత్తలు కృషి చేయాలి’’ అని ప్రధాని కోరారు. గడిచిన ఆరేళ్లలో వ్యవసాయానికి బడ్జెట్ ఎన్నో రెట్లు పెంచామని, వ్యవసాయ రుణాలు ఏడేళ్లలో రెండున్నర రెట్లు పెరిగినట్టు ప్రదాని గుర్తు చేశారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం చిన్న రైతులకు మద్దతుగా నిలుస్తోందంటూ.. 11 కోట్ల మంది రైతులకు రూ.1.75 లక్షల కోట్ల రుణాలను ఈ పథకం కింద అందించినట్టు ప్రకటించారు. చమురులో 20 శాతం ఇథనాల్ను కలిపే లక్ష్యం దిశగా పనిచేస్తున్నట్టు, ఇప్పటికే ఇది 8 శాతానికి చేరినట్టు గుర్తు చేశారు. కేంద్ర బడ్జెట్ 2022: వ్యవసాయ రంగంపై సానుకూల ప్రభావం అన్న అంశంపై జరిగిన వెబినార్లో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ -
సైన్యం ఆధునికీకరణ సరే! నిధులెక్కడ?
ఈశాన్య, వాయువ్య సరిహద్దుల్లో అణ్వాయుధ ప్రత్యర్థులైన చైనా, పాకిస్తాన్లతో ఘర్షణ వాతావరణం ఏర్పడిన నేపథ్యంలోనూ తాజా కేంద్రబడ్జెట్లో రక్షణ రంగ కేటాయింపులు తగ్గిపోవడం గమనార్హం. రక్షణరంగానికి కనీసమాత్రంగానే కేటాయింపులు పెంచుతుండటం వల్ల సైనిక బలగాల ఆధునికీకరణపై ఆర్మీ ఆశలు చెదిరిపోయాయి. పైగా సైన్యం ఆధునికీకరణకు మూలధనం కేటాయింపులు ఏమాత్రం సరిపోవు. భారత సాయుధ బలగాలు భారీ స్థాయిలో నిధులు కావాలని చేసిన డిమాండుకూ, కేంద్ర ప్రభుత్వ తాజా బడ్జెట్లో రక్షణ రంగానికి సాపేక్షికంగా చేసిన తక్కువ కేటాయింపులకూ మధ్య ఎన్నడూ లేనంత అంతరం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. దీంతో భారత సైన్యం నిర్వహణా సామర్థ్యం తీవ్రంగా ప్రభావితం కానుంది. భారత రక్షణ బడ్జెట్ మరోసారి చేదు వాస్తవాన్ని బయటపెట్టింది. భారత సాయుధ బలగాలు భారీ స్థాయిలో నిధులు కావాలని చేసిన డిమాండుకూ, కేంద్ర ప్రభుత్వ తాజా బడ్జెట్లో రక్షణ రంగానికి సాపేక్షికంగా చేసిన తక్కువ కేటాయింపులకూ మధ్య ఎన్నడూ లేనంత అంతరం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. గత వార్షిక బడ్జెట్లకు లాగే, 2022–23 వార్షిక బడ్జెట్లోనూ రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయింపును అంచనా వేసిన దానికంటే కాస్త ఎక్కువగా పెంచారు. ఆర్థికమాంద్య పరిస్థితుల్లో ద్రవ్యపరమైన వాస్తవాలను అర్థం చేసుకుంటూనే, వన రుల కొరత భారాన్ని అధిగమించడానికి సాధారణంగా కేటాయించే బడ్జెట్ కంటే ఇదేమీ పెద్ద మొత్తం కాదనే చెప్పాల్సి ఉంటుంది. మొత్తం రక్షణ బడ్జెట్కు ఈ ఏడాదికి గానూ 5.25 లక్షల కోట్ల మేరకు కేటాయించారు. ఇది గత సంవత్సరం కంటే ఎక్కువే. కానీ స్థూల దేశీయోత్పత్తి పరంగా చూస్తే ఇది తక్కువే. గత ఏడాదిలోని 2.15 శాతంతో పోలిస్తే ఈ ఏడాది కేటాయింపులు 2.04 శాతానికి పడిపోయాయి. కేంద్రప్రభుత్వ మొత్తం వ్యయంలో రక్షణ రంగ వాటా 13.73 శాతం నుంచి 13.31 శాతానికి దిగజారిపోయింది. ఈశాన్య, వాయవ్య సరిహద్దుల్లో అణ్వాయుధ ప్రత్యర్థులైన చైనా, పాకిస్తాన్ రెండు దేశాలతో ఘర్షణ వాతావరణం ఏర్పడిన నేపథ్యంలోనూ రక్షణ రంగ కేటాయింపులు తగ్గిపోవడం గమనార్హం. 2020లో 15వ ఫైనాన్స్ కమిషన్కి సమర్పించిన రక్షణ శాఖ సొంత అంచనాల ప్రకారం చూస్తే, 2023 ఆర్థిక సంవత్సరానికి రక్షణ బడ్జెట్ 2.81 లక్షల కోట్లకు పెరగాల్సి ఉంది. ఈ మొత్తంలో సగం లేదా 1.62 లక్షల కోట్లను మూల ధనంపై వెచ్చించాలి. దీన్ని సైనికబలగాల ఆధునికీకరణకు, సైనిక చర్యల సామర్థ్య పెంపుదల కోసం వెచ్చిం చాల్సి ఉంది. రక్షణ రంగ బడ్జెట్ ప్రధాన సవాళ్లలో ఒకటి సైనిక బల గాల వేతనాల బిల్లు పెరుగుతూనే ఉండటం. దీంతో నిర్వహణాత్మక ఖర్చులకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేకపోతున్నారు. సైనిక బలగాల వేతనాల బిల్లు 2001 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రెవెన్యూ బడ్జెట్లో 36.81 శాతం మేరకు ఉండగా, 2023 బడ్జెట్ నాటికి ఇది 66.94 శాతానికి లేదా రూ. 1,49,403 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు రెట్టింపయింది. త్రివిధ దళాల్లోనే ఎక్కువ సంఖ్యలో ఉంటున్న ఆర్మీకి చెందిన వేతనాల బిల్లు కూడా బాగా పెరిగింది. 2001 ఆర్థిక సంవత్సరంలో ఆర్మీ వేతనాలు మొత్తం రక్షణరంగ రెవెన్యూ బడ్జెట్లో 40.36 శాతం మేరకు ఉండగా, రెండు దశాబ్దాల తర్వాత అది 70.78 శాతానికి అంటే రూ.1,16,707 కోట్లకు పెరిగింది. తద్భిన్నంగా, సైనిక బలగాల వేతనాల పెంపు ఇలా పెరిగి నప్పటికీ, సైనికుల స్టోర్ బడ్జెట్... అంటే రేషన్లు, దుస్తులు, రక్షణ పరికరాల స్పేర్ పార్టులు, మందుగుండు సామగ్రి, భారతీయ సైన్యం సమర్థతను బలపర్చే ఇతర చిల్లర ఖర్చులపై వ్యయం బాగా పడిపోయింది. ఈ 20 ఏళ్లలో త్రివిధ బలగాలకు అయ్యే ఈ వ్యయం 43.65 శాతం నుంచి 16.18 శాతానికి పడిపోయింది. దీంతోపాటు భవనాలు, ఇతర కట్టడాల నిర్మాణానికి కీలకమైన మౌలిక వసతుల కోసం కేటాయించే బడ్జెట్ బాగా తగ్గిపోయింది. ఈ రెండింటిపై వెచ్చించే ఖర్చు కూడా దాదాపు సగానికి పడిపోయింది. అంకెల్లో చెప్పాలంటే, 2001 నాటికి ఇది 9.62 శాతం ఉండగా, 2023 నాటికి 5.7 శాతానికి పడిపోయింది. అంటే కేవలం రూ.12,728 కోట్లకు ఈ వ్యయం పడిపోయింది. ఫైనాన్స్ కమిషన్, రక్షణ మంత్రిత్వ శాఖకు సమర్పించిన నివేదికను బట్టి ఈ లోటు తీవ్రత స్థాయిని అంచనా వేయవచ్చు. 2021 నుంచి 2026 సంవత్సరాలకు గానూ సైనిక బలగాల రెవెన్యూ వ్యయం 6.97 లక్షల కోట్ల వరకు తగ్గనుందని తెలుస్తోంది. దీంతో భారత సైన్యం నిర్వహణా సామర్థ్యం తీవ్రంగా ప్రభావితం కానుంది. 2020 మేలో తూర్పు లద్దాఖ్లో చైనా ప్రజావిముక్తి సైన్యంతో మొదలైన ఘర్షణ ఇంకా ప్రతిష్టంభనలోనే ఉన్న సమయంలో భారత సైనిక బలగాల అప్రమత్తత ద్విగుణీకృతం కావలసి ఉంది. ఈ సమయంలో సైన్యం నిర్వహణాత్మక వ్యయానికి కావలసిన వనరు లను ఇంకా పెంచాలి. కానీ ఈ అయిదేళ్ల కాలానికి గాను ఈ వ్యయం తగ్గుముఖం పట్టనుండటం గమనార్హం. బలగాలు, వేతనాలకు సంబంధించిన అంశాలకు ఇప్పుడు ఆర్థికంగా మరింత ప్రాధాన్యం ఉంది. ఇవి పెన్షన్ చెల్లింపుతో అంతర్గత సంబంధం కలిగి ఉంటాయి. సైనిక బలగాల వేతనాలు, పింఛన్లకు అయ్యే ఖర్చు 2001 సంవత్స రంలో రూ. 12 వేల కోట్లు కాగా, 2023 ఆర్థిక సంవత్సరానికి ఇది అమాంతంగా రూ. 1.19 లక్షల కోట్లకు చేరుకుంది. అలాగే ద్రవ్యపరమైన చిక్కులు సైనికబలగాల వ్యయాన్ని అడ్డు కుంటున్నాయి. గత 20 ఏళ్లలో సైనిక బలగాల వ్యయం రూ.17,926 కోట్లనుంచి 8.5 రెట్లు పెరిగి రూ.1.52 లక్షల కోట్లకు చేరింది. కేపిటల్ బడ్జెట్ 85 నుంచి 90 శాతంకి అమాంతంగా పెరిగినప్పటికీ దాంట్లో ఎక్కువ భాగం ముందే కట్టుబడిన చెల్లింపులకు, ముందస్తుగా కొనుగోలు చేసిన రక్షణ సామగ్రికి సరిపోతుండటంతో కొత్త పరికరాల కొనుగోలుకు తక్కువ నిధులు మాత్రమే లభ్యమవుతుండటం గమ నార్హం. భారత ఆర్మీ మాజీ వైస్ చీఫ్ లెప్టినెంట్ జనరల్ శరత్ చంద్, 2018లో రక్షణరంగంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీతో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. రక్షణరంగానికి కనీసమాత్రంగానే కేటాయింపులు పెంచుతుండటం వల్ల సైనిక బలగాల ఆధునికీకరణపై ఆర్మీ ఆశలు చెదిరిపోయాయని పేర్కొన్నారు. నిశితంగా పరిశీలిస్తే, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్ ప్రసంగంలో ఇలాంటి ప్రాథమిక సమస్యలను కనీసం ప్రస్తావించలేదు. తాజా బడ్జెట్లో ప్రజాకర్షక నిర్ణయాలే పతాక శీర్షికలకు ఎక్కాయి తప్పితే ఇలాంటి కీలక అంశాలు చర్చకు రాలేదు. ఆర్థకమంత్రి రెండు ప్రకటనలు చేశారు. తాజా రక్షణ రంగ బడ్జెట్లో 68 శాతం దేశీయ రక్షణ పరికరాల సేకరణకు రిజర్వ్ చేస్తున్నా మన్నారు. ఇది 2021లో 58 శాతం మాత్రమే. ఇకపోతే రీసెర్చ్, డెవలప్మెంట్ బడ్జెట్లో 25 శాతాన్ని (డీఆర్డీఓకి కేటాయించిన మూలధన బడ్డెట్ రూ. 11,981 కోట్లలో ఇది కొంత భాగం) ఇప్పుడు సైనిక పరికరాల రూపకల్పనలో పాలు పంచుకునే స్థానిక పరిశ్రమ కోసం, స్టార్టప్ల కోసం అట్టిపెట్టారు. ఈ రెండు నిర్ణయాలూ భారత రక్షణ పరిశ్రమకు, దేశీయంగా రక్షణ ఉత్పత్తుల తయారీకి మంచివార్తే కానీ రక్షణ రంగ ఆధునికీకరణకు నిధుల కొరత అనే మొత్తం సమస్యను ఇవి పరిష్కరించలేవు. అయితే బడ్జెట్లో ఆర్థిక పదజాలాల డాంబికాన్ని అలా పక్కన పెడితే, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కి గత బడ్జెట్లో రూ. 2,500 కోట్లు కేటాయించగా, ఈ సంవత్సరం బడ్జెట్లో రూ. 3,500 కోట్లకు పెంచారు. అలాగే ఇండియన్ కోస్ట్గార్డ్కి రూ. 2,650 కోట్ల నుంచి, రూ. 4,246.37 కోట్లకు పెంచారు. అయితే ఈ పెంపుదల ఎంతో ముందే చేయాల్సి ఉంది. దేశ సరిహద్దు, తీరప్రాంత మౌలిక సదు పాయాల కల్పనను ఇది వేగవంతం చేస్తుంది. గత బడ్జెట్లలో వీటిని ఫుట్నోట్లలో మాత్రమే ప్రస్తావించిన విషయం గుర్తించాలి. చివరగా, 2023 సంవత్సరం రక్షణ బడ్జెట్ కాస్త ఎక్కువ తక్కువగా గత బడ్జెట్లకు అనుగుణంగానే ఉంటోంది. కానీ రక్షణ రంగ మూలధన, రెవెన్యూ వ్యయం కొరతకు సంబంధించిన ప్రాథమిక సమస్యల పరిష్కారంలో తాజా బడ్జెట్ కూడా మరోసారి విఫలమైంది. ఈ బడ్జెట్లో కూడా సమగ్రమైన, రక్షణ రంగ ఫైనాన్షియల్ ప్రణాళికకు అవసరమైన రోడ్ మ్యాప్ లోపించిందని పలువురు సైనిక విశ్లేషకులు, రిటైరైన, సర్వీసులో ఉన్న సైనికాధికారులు పేర్కొన్నారు. ప్రత్యేకించి డీఆర్డీఓ, ఇండియన్ కోస్ట్గార్డ్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ తదితర కీలక సంస్థలకు సంబంధించిన సమగ్ర ప్రణాళిక ఈ బడ్జెట్లోనూ కనిపించలేదని వారన్నారు. 2018లో ఏర్పర్చిన అత్యున్నత స్థాయి రక్షణ ప్రణాళిక కమిటీ ఈ కర్తవ్యాలను నెరవేర్చాలని ఆదేశించింది కానీ అది కూడా చెత్తబుట్టలో కలిసిపోయిందనే చెప్పాలి. – అమిత్ కోషిష్, రక్షణ శాఖ మాజీ ఆర్థిక సలహాదారు – రాహుల్ బేడీ, సీనియర్ జర్నలిస్టు -
స్థిరాస్తులపై కొత్త నిబంధనలు..అమ్మకాలు, కొనుగోలు చేసేటప్పుడు..
స్థిరాస్తి వ్యవహారాల మీద టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్)కి సంబంధించి కొత్త నిబంధనలు రాబోతున్నాయి. మొన్నటి బడ్జెట్లో తాజా ప్రతిపాదనల సారాంశం మీకోసం.. ప్రస్తుతం స్థిరాస్తులకు సంబంధించి అమ్మకపు విలువపై టీడీఎస్ వర్తిస్తుంది. ఇక నుం చి స్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు (వ్యవసాయ భూమిని మినహాయించి) ఆ విలువ రూ. 50,00,000 దాటితే అమ్మకపు విలువ లేదా స్టాంపు డ్యూటీ విలువ.. ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే ఆ మొత్తం మీద 1 శాతం టీడీఎస్ చేయాలి. క్యాపిటల్ గెయిన్స్ లెక్కించడానికి ప్రతి ఫలం విషయంలో ఇదే రూలు ఉంది.. అమ్మకపు విలువ ఎక్కువ? స్టాంపు డ్యూటీ విలువ ఎక్కు వ? ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే దాన్ని ప్రతిఫలంగా పరిగణిస్తారు. ఇప్పుడు టీడీఎస్కి ఈ నిబంధన తెచ్చారు. సాధారణంగా బయట మన కు కనిపించేది.. స్టాంప్ డ్యూటీ విలువ తక్కువ ఉంటుంది. నిజంగా ఇచ్చే ప్రతిఫలం ఎక్కువ ఉంటుంది. అంతే కాకుండా బ్లాక్, వైట్ వ్యవహారం ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త విధానం ద్వారా పన్ను ఎగవేతను అరికట్టవచ్చని ప్రభుత్వం అంచనా. ఉదాహరణగా చెప్పాలంటే ఒక వ్యక్తి ఇల్లు రూ. 60,00,000కు కొన్నారనుకుందాం. కానీ ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించాలంటే స్టాంపు డ్యూటీ రూ. 72,00,000 అనుకోండి.. పాత రూల్స్ ప్రకారం రూ. 60,00,000 మీద టీడీఎస్ చేయాలి. కానీ తాజా ప్రతిపాదనల ప్రకారం రూ. 72,00,000 మీద 1 శాతం చొప్పున టీడీఎస్ చేయాలి. దీనివల్ల టీడీఎస్ మొత్తం పెరుగుతుంది. అంతే కాకుండా, క్యాపిటల్ గెయిన్స్ లెక్కించడానికి ఎక్కువ మొత్తాన్నే పరిగణిస్తారు. ప్రతిఫలం ఎక్కువ, మూలధన లాభం .. ఫలితంగా పన్ను ఎక్కువ వసూలు చేయవచ్చు. ఇది రెసిడెంట్లకు మాత్రమే వర్తిస్తుంది. విలువ రూ. 50,00,000 దాటితేనే వర్తిస్తుంది. అమ్మకపు విలువ, స్టాంపు డ్యూటీ విలువ.. ఈ రెండూ రూ. 50,00,000 కన్నా తక్కువ ఉంటే టీడీఎస్ ప్రశ్న ఉండదు. విలువ రూ. 50,00,000 దాటితేనే టీడీఎస్ రూల్స్ వర్తిస్తాయి. దీని వల్ల ఎక్కువ పన్ను ఖజానాలోకి వచ్చి పడుతుంది. కొన్న వ్యక్తి ఎక్కువ మొత్తం పన్నుని రికవరీ చేసి టీడీఎస్ ఖాతాలోకి జమ చేస్తారు. అయితే, ఈ జమ .. అమ్మే వ్యక్తి స్వంత ఖాతాలో పన్ను చెల్లించినట్లుగా పడుతుంది. అమ్మే వ్యక్తి పన్ను చెల్లించాల్సి ఉంటే టీడీఎస్ను పరిగణనలోకి తీసుకుని మిగతా మొత్తాన్ని చెల్లిస్తారు. కానీ పూర్తిగా మినహాయింపు పొందే వ్యక్తికి ఈ టీడీఎస్ మొత్తం రిఫండ్ రూపంలో వస్తుంది. అలా వచ్చే వరకు, గవర్నమెంటు ఖజానాలో ఉంటుంది. రిఫండు వచ్చాక సరే సరి. అంటే, ప్రభుత్వం ముందుగానే ఎక్కువ టీడీఎస్ వసూలు చేసి అసెస్మెంట్ తర్వాత వెనక్కు ఇస్తుంది. మొదటి నుంచి ఇదే పాలసీ.. పన్ను వసూళ్లను టీడీఎస్ రూపంలో ఆదిలోనే వసూలు చేయటం ఆనవాయితీ. కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి; కె.వి.ఎన్లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు -
తిండి పెట్టిన వాళ్లకే మొండి చెయ్యి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చే చర్యలు బొత్తిగా లేకపోవడం దేశ ప్రజల్ని నిశ్చేష్టుల్ని చేసింది. కరోనా కష్టకాలంలో దేశ ప్రజలను ఆదుకొన్నది వ్యవసాయ రంగమే. ఈ వాస్తవాన్ని కేంద్రం ఎందుకు విస్మరించిందో అర్థం కాదు. కరోనా దెబ్బకు మిగతా రంగాలు చతికిల పడ్డాయి. రెండేళ్లు దాటినా నేటికీ పలు రంగాలు కోలుకోలేదు. కానీ, వ్యవసాయరంగం మాత్రం యావత్ దేశాన్ని ఆదుకొంది. ప్రజలకు కష్టకాలంలో పట్టెడన్నం పెట్టింది. పెద్ద ఎత్తున ఉపాధి కల్పించింది. తల్లిలా అందర్నీ ఆదుకొన్న వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్లో మరింత ఊతం ఇచ్చే చర్యలు ఉంటాయని వేసుకున్న అంచనాలు పూర్తిగా తారు మారయ్యాయి. బడ్జెట్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు 2021–22లో కేటాయించిన 3.92% నిధులను ఈసారి (2022–23) 3.84%కు కుదించడం శోచనీయం. వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిం చడం, స్టార్టప్లపై దృష్టి పెంచడం ఆహ్వానించదగిన చర్యలే. కానీ, కీలకమైన మార్పులు చేయకుండా అరకొర చర్యలతో సరిపెడితే ఉపయోగం ఏముంటుంది? ఆశించిన ఫలితాలెలా వస్తాయి? వరి, గోధుమల సేకరణకు కనీస మద్దతు ధరలు అందించ డంతో పాటు అన్ని పంటలకు కూడా రైతు సంఘాలు కోరినట్లుగా చట్టబద్దమైన మద్దతు ధరలు అందించడానికి బడ్జెట్లో నిధుల కేటాయింపులు పెంచి ఉండాల్సింది. ఇప్పటివరకు మొత్తం ఆహార ధాన్యాలలో కేంద్రం సేక రించింది 35 శాతమే. ఒక అంచనా ప్రకారం 2022 మార్చి నాటికి దేశంలోని రైతాంగం వద్ద 65 శాతం ఆహారధాన్యాలను కేంద్రం కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ, కేంద్రం వైఖరి చూస్తోంటే... వరి, గోధుమ మినహా మిగతా పంటలను ప్రైవేటు వ్యాపారులకే అప్పజెప్పేటట్లు కనిపిస్తోంది. ఇక, దేశంలో తృణ ధాన్యాల వాడకం పెరిగిన నేపథ్యంలో 2023వ సంవత్సరాన్ని ‘తృణ ధాన్యాల సంవత్సరం’గా ప్రకటించడాన్ని ఆహ్వానించాల్సిందే. రైతాంగానికి లాభసాటి ధరలు లభించే అవకాశం ఉంది. అయితే, ఈ పంటలపై మరిన్ని పరిశోధనలు చేపట్టడానికి వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు నిధులు కేటా యించాలని ఎప్పటినుంచో డిమాండ్లు ఉన్నప్పటికీ... ఈ బడ్జె ట్లో కూడా వాటికి నిధులు కేటాయించలేదు. 2022–23ను కేవలం తృణధాన్యాల సంవత్సరంగా నామకరణం చేయడం వల్ల రైతులకు ఒరిగే లాభమేమిటి? ఇక, రసాయనాల వాడకాన్ని నిరుత్సాహపర్చడానికి ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ సాగును ప్రోత్సహిస్తామని బడ్జెట్లో పేర్కొన్నప్పటికీ అందుకు నిర్దిష్టమైన ప్రతిపాదనలు బడ్జెట్లో కనపడటంలేదు. స్వయంగా ప్రధానమంత్రి ప్రతి పాదించిన పథకాలకు బడ్జెట్లో ప్రోత్సాహకాలు లేకపోవడం బహుశా ఇదే ప్రథమం కావచ్చు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించి వివిధ పథకాలను విలీనం ద్వారా కుదించడం మరో అనాలోచిత చర్య. ఉదాహరణకు ‘పరం పరాగత్ కృషి యోజన’ను ‘రాష్ట్రీయ కృషి యోజన’లో విలీనం చేశారు. మొత్తం 27 పథకాలను 7 పథకాలుగా మార్చారు. సహకార రంగానికి ప్రోత్సాహం ఇస్తామని చెప్పి... దేశంలో విశిష్ట చరిత్ర, ప్రాముఖ్యం ఉన్న పాల ఉత్పత్తి సహకార సంఘాలకు ఇస్తున్న కొన్ని రాయితీలను ఎత్తేయడానికి ఏకంగా పథకాలనే రద్దు చేయడం శోచనీయం. మూడునాలుగేళ్ల క్రితం ఎంతో ప్రతిష్ఠాత్మకమైన పథకంగా అభివర్ణించిన ఫసల్ బీమా పథకం అసలు ఉన్నదో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ పథకంలో మార్పులు తెచ్చి రైతులకు ప్రయోజనం కలిగేలా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది. ఈ బడ్జెట్లో నిరాశ కలిగించిన మరో ప్రధానమైన అంశం రైతులకు స్వల్పకాలిక రుణాలపై ఇచ్చే రాయితీ గురించిన ప్రస్తావన లేకపోవడం! ‘మార్పు చేసిన వడ్డీ రాయితీ పథకం’ అంటూ ఓ కొత్త పథకం ప్రవేశపెడుతున్నట్లు చెప్పుకొస్తున్నారు. ఈ పథకం విధివిధానాలేమిటో భవిష్యత్తులో చూడాల్సి ఉంది. రైతులు, రైతాంగ సంస్థలు జాతీయ స్థాయిలో ఏడాదిపాటు ఉద్యమించి కేంద్రం మెడలు వంచి మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకొనేలా చేసినందుకు గాను వారిపై కేంద్ర ప్రభుత్వం ప్రతీకార చర్య తీసుకొన్నట్లుగా ఉందిగానీ, సానుకూల ప్రోత్సాహకాలు కనిపించటంలేదు. రైతులు ఏం పాపం చేశారు? కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి తిండి గింజలు పండించి దేశ ప్రజల ఆకలి తీర్చడమేనా? వ్యవసాయ సంక్షోభాన్ని నివారించి రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ఈ కేంద్ర బడ్జెట్ లేదు. అయితే... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మరి కొన్ని రాష్ట్రాలు రైతులను ఆదుకోవడానికి చేపట్టిన ప్రోత్సాహ కాలే వ్యవసాయ రంగాన్ని నిలబెట్టాయి అనే విషయం కాదన లేని వాస్తవం. కేంద్ర సహకారం తోడై ఉంటే పరిస్థితి మరింత మెరుగై ఉండేది. వ్యాసకర్త శాసన మండలి సభ్యులు, ఏపీ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ వ్యవసాయ రంగానికి అన్యాయం చేసింది. కరోనాకు ఎదురునిలిచి రైతన్న దేశానికి తిండిపెట్టాడు. అటువంటి మెతుకు దాతకు బడ్జెట్ నిరాశను మిగిల్చింది. వ్యవసాయం, అను బంధ రంగాలకు నిధులను కుదించడం శోచనీయం. స్వయంగా ప్రధాని ప్రతిపాదించిన పథకాలకు బడ్జెట్లో ప్రోత్సహకాలు లేకపోవడం బహుశా ఇదే ప్రథమం కావచ్చు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించి వివిధ పథకాలను విలీనం ద్వారా కుదించడం మరో విమర్శనార్హమైన అంశం. డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు -
ఏపీకి 18 ఈ-పోక్సో కోర్టులు
సాక్షి, న్యూఢిల్లీ: అత్యాచారం, పోక్సో చట్టం కేసుల సత్వర పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్కు 18 ఈ–పోక్సో కోర్టులు కేటాయించినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్రిజుజు శుక్రవారం లోక్సభలో తెలిపారు. వీటిలో 10 ప్రస్తుతం పనిచేస్తున్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్రామ్ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆ మూడు ప్రాజెక్టులకు ఆర్థిక సాయం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధిచేయ తలపెట్టిన రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టులకు సాగరమాలలో భాగంగా ఆర్థికసాయం ఇవ్వడం లేదని కేంద్ర నౌకాయన మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. ఈ మూడు నాన్–మేజర్ పోర్టులు అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం సమాచారం ఇచ్చిందని ఎంపీ బాలశౌరి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కోర్టుల్లో ఏఐ జస్టిస్ డెలివరీ సిస్టమ్ సామర్థ్యం పెంచడానికి సాంకేతికతతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆవశ్యకతను గుర్తించినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్రిజుజు తెలిపారు. ఈ–కోర్టు రెండో దశ ప్రస్తుతం కొనసాగుతోందని వైఎస్సార్సీపీ ఎంపీలు గోరంట్ల మాధవ్, వంగా గీతావిశ్వనా«థ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. భర్తీకాని 1,425 పీజీ సీట్లు 2020–21లో 1,425 మెడికల్ పీజీ సీట్లు భర్తీకాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా చెప్పారు. వీటిలో 1,365 బ్రాడ్–స్పెషాలిటీ సీట్లు, 60 డిప్లొమా సీట్లు ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ పి.వి.మిథున్రెడ్డి ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఏపీలో 12,859 మంది ఔషధ మొక్కల సాగు ఆంధ్రప్రదేశ్లో 12,859 మంది రైతులు ఔషధ మొక్కలు సాగుచేస్తున్నట్లు కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. నేషనల్ ఆయుష్ మిషన్ ద్వారా ఆయా రైతులకు ఆర్థికసాయం అందిస్తున్నట్లు వైఎస్సార్సీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ప్రశ్నకు జవాబుగా చెప్పారు. మంగళగిరి ఎయిమ్స్లో నర్సింగ్ కళాశాల మంగళగిరి ఎయిమ్స్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి నర్సింగ్ కళాశాల ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతి ప్రవీణ్ తెలిపారు. ప్రిన్సిపాల్, అధ్యాపక సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. కాగా,దేశవ్యాప్తంగా మంగళగిరి సహా 13 ఎయిమ్స్ల్లో 7,500 పడకలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. ఉచిత వ్యాక్సిన్కు రూ.27,945.14 కోట్లు కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందించడానికి 2021–22లో రూ.35 వేల కోట్లు కేటాయించగా ఫిబ్రవరి 7 నాటికి రూ.27,945.14 కోట్లు వినియోగించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతి ప్రవీణ్ తెలిపారు. 2022–23 బడ్జెట్లో కూడా వ్యాక్సినేషన్కు రూ.5 వేల కోట్లు కేటాయించినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ తలారి రంగయ్య ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మంత్రుల సంఖ్య పెంచే ప్రతిపాదన లేదు కేంద్ర మంత్రుల సంఖ్య పెంచడానికి రాజ్యాంగాన్ని సవరించే ప్రతిపాదనేదీ ప్రస్తుతం లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్రిజుజు.. వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. -
పామాయిల్ సాగు ప్రోత్సాహానికి రూ.11 వేల కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పామాయిల్ సాగు ప్రోత్సాహం కోసం రూ.11 వేల కోట్లు కేటాయించినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. దేశంలో వంట నూనెల అందుబాటును విస్తృతం చేసేందుకు నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్–ఆయిల్ పామ్ (ఎన్ఎంఈవో) పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. దేశంలో 27.99 లక్షల హెక్టార్లు పామాయిల్ సాగుకు అనుకూలంగా ఉన్నట్లు ఐసీఏఆర్ ఆధ్వర్యంలోని కమిటీ అంచనా వేసిందని తెలిపారు. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి, సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచి వంటనూనెల దిగుమతి వల్ల పడుతున్న భారాన్ని తగ్గించుకునేందుకు ఎన్ఎంఈవో బృహత్తర కార్యాచరణను అమలు చేస్తోందన్నారు. అంతర్జాతీయ ధరల్లో హెచ్చు తగ్గుల నుంచి పామాయిల్ రైతులను కాపాడేందుకు వీలుగా గిట్టుబాటు ధర విధానాన్ని ప్రవేశపెట్టినట్లు మంత్రి చెప్పారు. ఏపీలో 40 ఎఫ్సీఐ వేర్హౌస్లు ఆంధ్రప్రదేశ్లో ఎఫ్సీఐకు చెందిన సొంత, అద్దె గోదాములు 40 ఉన్నాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్చౌబే తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. ఎఫ్సీఐ, రాష్ట్ర ఏజెన్సీలు నిర్వహిస్తున్న వేర్హౌస్లు సెంట్రల్పూల్ స్టాక్కు సరిపోతాయని చెప్పారు. ఏపీ ప్రతిపాదనలకు అనుమతి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై)లో ఏపీ పంపిన ప్రతిపాదనలను అనుమతించామని కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. రూ.657.11 కోట్ల పనులకు అనుమతించి ఇప్పటివరకు రూ.108.95 కోట్లు విడుదల చేశామని చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, ఓడరేవుల్లో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతోపాటు ఫిష్ రిటైల్ హబ్ తదితర పనులకు అనుమతి ఇచ్చినట్లు వివరించారు. పీపీపీ పద్ధతిలో ఎంవీయూలు పశువుల సంరక్షణ నిమిత్తం సేవలు నేరుగా రైతుల ఇంటివద్దే అందించేలా మొబైల్ వెటర్నరీ యూనిట్లను (ఎంవీయూలను) పబ్లిక్, ప్రైవేటు పార్టనర్షిప్ (పీపీపీ) పద్ధతిలో తీసుకొచ్చినట్లు కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మౌలికసదుపాయాలను, ఏజెన్సీలు (కోఆపరేటివ్, మిల్క్ యూనియన్లు) మానవ వనరులను ఏర్పాటు చేస్తాయని వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. లబ్ధిదారుల్ని పెంచాలని ఏపీ కోరింది జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ)లో లబ్ధిదారుల సంఖ్యను గ్రామీణ ప్రాంతంలో 75, పట్టణ ప్రాంతంలో 50 శాతానికి పెంచాలని ఏపీ ప్రభుత్వం కోరిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. బీజేపీ సభ్యుడు జి.వి.ఎల్.నరసింహారావు ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. 2011 జనాభా లెక్కలననుసరించి ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో 60.96 శాతం, పట్టణ ప్రాంతాల్లో 41.14 శాతం లబ్ధిదారుల్ని గుర్తించినట్లు చెప్పారు. -
ఇది మనుషులు పట్టని అభివృద్ధి
రానున్న వందేళ్ల భారతావనికి మార్గం వేసేదని ఘనంగా చాటిన బడ్జెట్ను ప్రవేశపెట్టారు సరే... ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కూడా అందులో భాగమని ప్రకటించారు సరే... అయితే ఆచరణలో గానీ, కేటాయింపుల్లో గానీ ఎటువంటి ప్రత్యేకతలూ లేవు. విమర్శలకు భయపడి మాత్రమే ఎస్సీ, ఎస్టీల పేర్లు చేర్చారు తప్ప ఇందులో ఎటువంటి చిత్తశుద్ధి లేదన్నది కఠిన వాస్తవం. జనాభా దామాషా ప్రకారం కేటాయింపులు లేవు. చేసినవి కూడా సరిగ్గా ఖర్చు చేయలేదని గత నివేదికలు చెబుతున్నాయి. అందుకే ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధి ఒకవేళ ప్రభుత్వానికి ప్రాధాన్యత అయితే, వీటి అమలు కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కావాలి. ఆ వర్గాల ప్రత్యేక నిధుల కోసం ప్రత్యేకమైన చట్టాన్ని తేవాలి. ఢిల్లీ సర్కార్ బడ్జెట్ సమర్పణ జరిగి పోయింది. స్పందనలు, ప్రతిస్పందనలు హోరెత్తాయి. అధికార పక్షం శభాష్ అంటే, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. కొంతమంది తటస్థంగా ఉండే విశ్లేషకులు, ఆర్థిక వేత్తలు నిజాలు మాట్లాడితే పట్టించుకున్నవారు లేరు. ఇప్పటికే పది రోజులు దాటిపోయింది. ఇక ఆ తర్వాత అందరూ మరిచి పోతారు. మళ్ళీ వచ్చే ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టే వరకూ దాని ఊసు ఎత్తేవారుం డరు. ప్రభుత్వాలు తమ పని తాము చేసుకుంటూ పోతాయి. విమర్శ లను పట్టించుకోరు. ముఖ్యంగా సమాజంలో అట్టడుగున ఉన్న ఎస్సీ, ఎస్టీల బడ్జెట్ కేటాయింపులు చాలామంది విశ్లేషకులకు పట్టవు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం యథావిధిగా కేటాయింపులు జరిపింది. నాకు తెలిసి ఒక ఆలోచనతో, ప్రణాళికతో చేసిన కేటాయింపులు ఇవి కావని తెలుస్తూనే ఉంది. గత సంవత్సరం రెండు పైసలు ఇస్తే, ఈ సంవత్సరం మూడు పైసలు ఇచ్చి, మధ్యలో దానిని రెండున్నర పైసలు చేసి, ఖర్చు అంతకన్నా తక్కువ చేసి, చేతులు దులుపుకొంటారు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని ఆ కేటాయింపుల తతంగం చూస్తే అర్థమవుతుంది. కేంద్రంలో కూడా సబ్ప్లాన్ హెడ్ ఒకటి ఉంటుంది. అయితే దానిని పేరు మార్చారు. గతంలో బడ్జెట్లో ప్లాన్, నాన్ప్లాన్ అనే వర్గీకరణ ఉండేది. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి, నీతి ఆయోగ్ను ఏర్పరిచిన తర్వాత ప్లాన్ అనే పేరు లేదు. అందువల్ల జనాభా దామాషా ప్రకారం కేటాయించాల్సిన నిధులను, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ కేటాయింపులు (అలోకేషన్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్స్)గా పేరు మార్చారు. అయితే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా లెక్కలు ఘనంగానే ఉన్నాయి. భారతదేశం మొత్తం బడ్జెట్ 39,44,909 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. ఇందులో షెడ్యూల్డ్ కులాలకు 1,42,342 కోట్ల రూపాయలుగా, షెడ్యూల్డ్ తెగలకు 89,265 కోట్లుగా నిర్ణయించారు. నిజానికి జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు కేటాయించా ల్సింది ఒక లక్షా 82 వేల 976 కోట్ల రూపాయలు. ఆ కేటాయించిన దానిలో కూడా ప్రత్యక్షంగా ఎస్సీలకు చేరే నిధులు 53,795 కోట్లు. ఈ కేటాయింపులు మొత్తం బడ్జెట్లో 37 శాతం మాత్రమే. మిగతా మొత్తంలో ఎస్సీలకు నేరుగా చేరేవి చాలా తక్కువ. దాదాపు సగానికి పైగా మంత్రిత్వ శాఖలకు అసలు కేటాయింపులే లేకపోవడం విచార కరం. అదేవిధంగా ఎస్టీలకు నిజానికి 98,664 కోట్లు కేటాయించాల్సి ఉంది. కేటాయించిన మొత్తంలోనూ వారికి నేరుగా చేరేవి 43 వేల కోట్లు మాత్రమే. కొన్ని మంత్రిత్వ శాఖల్లో ఎస్సీ, ఎస్టీలకు అందరితో పాటు కేటాయిస్తారు. కానీ వాటి లెక్కలు, వివరాలు... ఎవరైతే ప్రయోజనం పొందాలో వారి వివరాలు ఏమీ ఉండవు. ఉదాహరణకు, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ కింద అమలు జరుగుతున్న ఫసల్ బీమా యోజనకు 2022–23 సంవత్సరానికి ఎస్సీలకు 2,667 కోట్లు, ఎస్టీలకు 1,381 కోట్లు కేటాయించారు. ఇవి కాకిలెక్కలు తప్ప నిజ మైన ప్రయోజనమేదీ వీటివల్ల లేదని, గత బడ్జెట్లపైన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన నివేదికను బట్టి అర్థమవుతుంది. కాగ్ 2017లో ఇచ్చిన నివేదికలో పేర్కొన్న విషయాలను చూస్తే మన కళ్ళు తెరుచుకుంటాయి. ‘‘ఎస్సీ, ఎస్టీ రైతుల ప్రయోజనం కోసం 2011–12 నుంచి 2015–16 వరకు 2,381 కోట్ల రూపాయలు కేటా యించారు. ఈ పథకం కింద ప్రయోజనం పొందిన వివరాలు లేవు. ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ మహిళా రైతుల కోసం శ్రద్ధ వహించాలని చేసిన సూచనను మంత్రిత్వ శాఖ పట్టించుకోలేదు.’’ అదేవిధంగా ఉన్నత సాంకేతిక విద్య కోసం ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం కేటాయించిన డబ్బులు కూడా వినియోగం కాలేదని కాగ్ తెలియజేసింది. ఇప్పటికే ఐఐటీ సంస్థల్లో పీహెచ్డీ చేస్తున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంఖ్య అత్యల్పం. ఎస్సీలకు కేటాయించిన సీట్లలో 75 శాతం, ఎస్టీలకు కేటాయించిన సీట్లలో 95 శాతం ఖాళీగా ఉన్నట్టు కాగ్ తన నివేదికలో తెలిపింది. అదేవిధంగా పీజీ కోర్సులలో కూడా ఇదే విధమైన ఖాళీలు ఉన్నట్టు 2021లో కాగ్ నివేదిక స్పష్టం చేస్తున్నది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న సఫాయి కర్మచారి సంక్షేమం కోసం కేటాయించిన నిధుల వివరాలు కూడా బడ్జెట్ లెక్కల్లో లేవని కూడా కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. కోవిడ్ సమయంలో సఫాయి కార్మికులు ఏ విధమైన సాహసం చేశారో మనందరికీ తెలుసు. అటువంటి వాళ్ల కోసం కేటాయించిన అరకొరా నిధులను కూడా సరిగ్గా వినియోగించకపోవడం అత్యంత బాధాకరమైన విషయం. 2016–17లో స్వయం ఉపాధి కింద 9 కోట్లు కేటాయిస్తే, ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. 2017–18లో అయిదు కోట్లు ఖర్చు చేశారు. అదేవిధంగా 2020–21లో వంద కోట్లు కేటాయించామని గొప్పలకు పోయారు. అయితే అందులో ఖర్చు చేసింది కేవలం 16.60 కోట్లు మాత్రమే. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి డిపార్ట్మెంట్ కథా ఇదే. అందుకే ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధి ఒకవేళ ప్రభుత్వానికి ప్రాధాన్యత అయితే, వీటి అమలు కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కావాలి. కేవలం బడ్జెట్లో అంకెలు చూపెడితే సరిపోదు. అందుకోసం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక నిధుల కోసం ప్రత్యేకమైన చట్టాన్ని తేవాలి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెచ్చిన సబ్ప్లాన్ చట్టం, మరిన్ని సానుకూల అంశాలతో 2017లో తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ యాక్ట్ వల్ల ప్రయోజనం చేకూరింది. అయితే ఆశించిన స్థాయిలో ఆ ప్రయోజనాలు అందాయా అంటే, లేదనే చెప్పాలి. కానీ, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చట్టం అమలులో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటకల్లో భిన్నమైన పథ కాలు వచ్చాయి. ముఖ్యంగా విద్యారంగంలో ఎస్సీ, ఎస్టీల కోసం నెలకొల్పి, నిర్వహిస్తోన్న రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు దేశంలోనే మార్గదర్శకంగా నిలిచాయి. కర్ణాటకలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తరహాలో సబ్ప్లాన్ చట్టం అమలులోకి వచ్చింది. రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ ఈ చట్టం కోసం ప్రభుత్వాలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ బడ్జెట్కు ఒక ప్రత్యేకత ఉందని ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇది వందేళ్ళ భారత్కు మార్గంవేసే బడ్జెట్ అని చెప్పారు. భవిష్యత్ భారతావనికిది ఆరంభం అన్నారు. అందులో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కూడా ఒకటిగా ప్రకటించారు. అయితే ఆచ రణలో గానీ, కేటాయింపుల్లో గానీ ఎటువంటి ప్రత్యేకతలూ లేవు. విమర్శలకు భయపడి మాత్రమే ఎస్సీ, ఎస్టీల పేర్లు చేర్చారు తప్ప ఇందులో ఎటువంటి చిత్తశుద్ధి లేదన్నది కఠిన వాస్తవం. భవిష్యత్లో యువత ఎదుర్కోబోయే నిరుద్యోగం ఈ ప్రభుత్వానికి పెద్ద సవాల్గా నిలవనుందనడంలో సందేహం లేదు. దీనికి ముందుగా బలవబో తున్నది ఎస్సీ, ఎస్టీలే. డిగ్రీలు, పీజీలు, పీహెచ్డీలు చేసిన లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉద్యోగాలు లభించడం కష్టం. అందుకోసం ఇప్పటి నుంచే ఒక సమగ్రమైన కార్యాచరణ కావాలి. కోవిడ్ మహమ్మారి వల్ల చాలా రంగాల్లో ఉపాధి కోల్పోయిన వాళ్ళు కోట్లల్లో ఉన్నారు. మానవ రహిత అభివృద్ధి, రోబోలు, సాంకే తిక ప్రయోజనం ఉన్న అభివృద్ధి వైపు పారిశ్రామిక వర్గాలు మొగ్గు చూపుతున్నాయి. దానికి ప్రభుత్వాల దగ్గర ఎటువంటి కార్యక్రమం లేదు. కేవలం దేశ సంపదను పెంచి, నిజమైన సంపదగా ఉన్న మను షులను వదిలేస్తే, అది ఎటువంటి దేశాభివృద్ధి అవుతుందో నిపుణులు ఆలోచించాలి. ‘‘దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషు లోయ్’’ అన్న గురజాడ మాటలను హిందీలోకి అనువాదం చేసి, మన దేశాధినేతలకు ఎవరైనా వినిపిస్తేనైనా కళ్ళు తెరుస్తారేమో చూడాలి. మల్లెపల్లి లక్ష్మయ్య ,వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
కేంద్ర బడ్జెట్ నిరాశ పరిచింది: విజయసాయిరెడ్డి
-
ఆంధ్రప్రదేశ్ కోణంలో ఇది చెత్త బడ్జెట్: విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కోణంలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్.. చెత్త బడ్జెట్ అని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వి. విజయసాయిరెడ్డి అన్నారు. రాజ్యసభలో బుధవారం కేంద్ర బడ్జెట్పై చర్చ కొనసాగుతోంది. చర్చలో పాల్గొన్న ఎంపీ వి.విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశ పరిచిందని అన్నారు. ఆత్మ నిర్భరత కేంద్రానికే కాదు రాష్ట్రాలకూ అవసరమేనని తెలిపారు. సెస్లు, సర్ఛార్జ్ల పేరుతో రాష్ట్రాల పన్ను వాటా తగ్గించారని తెలిపారు. పెట్రోల్ విషయంలో ట్యాక్స్ వాటా 40 శాతం తగ్గిందని చెప్పారు. 2010-2015 మధ్య ఏపీ షేర్ 6.9 శాతం కాగా, 2015-2020 నాటికి ఏపీ పన్నుల వాటా 4.3 శాతానికి పడిపోయిందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వ్యవసాయంపై ఏపీ ప్రభుత్వం 5.9 శాతం నిధులు వెచ్చిస్తోందని తెలిపారు. కానీ, కేంద్రం వెచ్చిస్తోంది 3.9 శాతం మాత్రమేనని చెప్పారు. విద్య కోసం ఏపీ 11.8 శాతం ఖర్చుచేస్తుంటే కేంద్రం 2.6 శాతం ఖర్చు చేస్తోందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లోనూ కేంద్రం కంటే రాష్ట్రామే ఎక్కువ ఖర్చు చేస్తోందని చెప్పారు. ఏపీ ప్రభుత్వంపై కేంద్రం సవతి ప్రేమ చూపిస్తోందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. -
భారత్ డిజిటల్ రూపాయి
-
అన్ని వర్గాలకు జరిగేలా బడ్జెట్లో కేటాయింపులు: కేంద్ర మంత్రి
-
వట్టి శుష్క వాగ్దానాల బడ్జెట్
నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అనే రెండు ఉపద్రవాలను దేశం ఎదుర్కొంటోంది. ఉపాధి అవకాశాలను పెంచి ద్రవ్యోల్బణ సూచిని తగ్గించడానికి ఆర్థిక మంత్రి ప్రాధాన్యత ఇస్తారని భావించారు. అయితే బడ్జెట్లో కేటాయించిన నిధులు పేదలను, కార్మికులను, వలస కూలీలను వంచించాయనే చెప్పాలి. రైతులకు స్వావలంబనతో కూడిన సంక్షేమ చర్యలు చేపట్టడానికి కనీస నిధులను కూడా బడ్జెట్లో కేటాయించలేదు. ఇక వ్యవసాయాన్ని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామన్నది వట్టి మాటే. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర పాలకులు దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను మరోసారి చిదిమివేశారు. ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2022–23 కేంద్ర బడ్జెట్ పూర్తిగా దిశారహితం గానూ, పేదలకు, రైతులకు వ్యతిరేకం గానూ రూపొందింది. ఇది ఆర్థికరంగంలో బీజేపీ పాలకుల వైఫల్యంపై శ్వేతపత్రం మాత్రమే. గత కొన్నేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపయిందంటూ కేంద్రప్రభుత్వం ఊదరగొడు తోంది. కానీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైతుల పెరిగిన ఆదాయంపై ఒక్క మాటంటే ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు. ఇక కేంద్ర ప్రభుత్వం ఘనంగా చెప్పుకున్న 100 విశ్వనగరాల పురోగతి మాట ఏమిటి? బడ్జెట్లో చూపించిన కేటాయింపులు కొత్త సీసాలో పోసిన పాత సారా తప్ప మరేమీ కాదంటే అది అసందర్భ వ్యాఖ్య కాదు. కరోనా మహమ్మారి ద్వారా కలిగిన నష్టాలను పూరించ డానికి సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష నగదు సహాయాన్ని అందిస్తున్నట్లు ఘనంగా ప్రకటించు కుంది. కానీ, దీనికి ప్రత్యామ్నాయంగా 2023 మార్చి వరకు చిన్న కార్పొరేషన్లకు అత్యవసర రుణ పరపతి హామీ పథకాన్ని (ఈసీఎల్జీఎస్) పొడిగిస్తున్నట్లు ఆర్థికమంత్రి పేర్కొన్నారు. అయితే ద్రవ్య సమస్యల్లో ఇప్పటికే కూరుకు పోయిన చిన్న సంస్థలు క్రెడిట్ స్కోర్ని మెయిన్టెయిన్ చేసే స్థితిలో లేవన్న ఇంగితజ్ఞానం ప్రదర్శించడంలోనూ భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. ఇప్పుడు నిజంగా చేయవలసింది ఏమిటంటే చిన్న తరహా సంస్థలను ప్రోత్స హించడమే. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో వ్యవసాయ రంగం వాటా 14 నుంచి 15 శాతంగా ఉంటోంది. ఈ తరుణంలో రైతుల ఆదాయాన్ని పెంచగలిగితే అది దేశ ఆర్థిక వ్యవస్థకు బూస్టర్ డోస్గా పనిచేస్తుంది. వ్యవసాయ పనుల్లో విస్తృతంగా పాల్గొం టున్న రైతులు తమ రాబడికి హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ కనీస మద్దతు ధర పథకాన్ని చట్టబద్ధం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న ఒక్క పదం కూడా తాజా బడ్జెట్ ప్రతిపాదనలో కనిపించదు. గ్రామీణ భారతావనికి ఘోరమైన అన్యాయం చేయడంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండమైన విజయం సాధించింది. రైతులకు స్వావలంబనతో కూడిన సంక్షేమ చర్యలు చేపట్టడానికి కనీస నిధులను కూడా ఈ తాజా కేంద్ర బడ్జెట్లో కేటాయిం చలేదు. ఇక వ్యవసాయాన్ని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామన్నది వట్టి మాటే మరి. గంగానది పొడవునా రసాయన రహిత స్వచ్ఛ వ్యవ సాయాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కానీ ఛత్తీస్గఢ్తో సహా కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే దీనికి పూను కున్నాయి. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను రైతుల ఖాతాలకు బదలాయించాలని నిర్ణయించింది.. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్నదానికి కొనసాగింపు మాత్ర మేనని చెప్పాలి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఇప్పటికే కనీస మద్దతు ధరను రైతుల ఖాతాకు నేరుగా బదిలీ చేస్తోంది. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు దగ్గరి దారి ఏమిటంటే ప్రత్యక్ష నగదు బదిలీని అమలుపర్చటమే! ఈవిధంగానే కరోనా మహమ్మారి కాలం పొడవునా ఆర్థిక మాంద్యం నుంచి చత్తీస్గఢ్ తన్ను తాను కాపాడుకోగలిగింది. కేంద్రప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధిని విస్తరిస్తున్నట్లు చెబుతూ వచ్చింది కానీ బడ్జెట్లో దీని ప్రస్తావన కూడా తేలేదు. పసలేని వాగ్దానాలను చేయ డంలో నరేంద్ర మోదీ నేతృత్వం లోని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రాటుదేలి పోయింది. ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసం గంలో ఏడు చోదక శక్తుల గురించి మాట్లాడారు. అవేమిటంటే – రోడ్లు, రైల్వే, విమానాశ్రయాలు, ఓడరేవులు, ప్రజా రవాణా, జల మార్గాలు, నిర్మాణ రంగం. వీటితో ఆర్థికవ్యవస్థను ముంద డుగు వేయించవచ్చని మంత్రి పేర్కొన్నారు. కానీ వీటికి సరిపడా నిధుల కేటాయింపు బడ్జెట్లో కనిపించలేదు. ఎంత వెచ్చిస్తారనే సంఖ్యలనూ పేర్కొనలేదు. గతంలోని కొన్ని బడ్జెట్లను మనం పరిశీలించినట్లయితే, పెద్ద పెద్ద బులెటిన్లను ప్రకటించారు. సమర్థ మౌలిక వసతుల మిషన్, జాతీయ వ్యాప్తంగా డిజిటల్ వెల్ బీయింగ్ మిషన్ వంటివి వీటిలో కొన్ని. కానీ క్షేత్రస్థాయిలో వాటి అమలు మాత్రం ఊహించినంత పరిమాణంలో లేదు. పోతే, ప్రధాని గతిశక్తి పథకం మార్గంలో మౌలిక వసతులపై వ్యయాన్ని పెంచుతారా అంటే అదీ స్పష్టం కావడం లేదు. ప్రస్తుతం నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అనే రెండు ఉప ద్రవాలను మన దేశం ఎదుర్కొంటోంది. ఉపాధి అవకా శాలను పెంచి ద్రవ్యోల్బణ సూచిని తగ్గించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రాధాన్యం ఇస్తారని భావించారు. అయితే బడ్జెట్లో కేటా యించిన నిధులు భారత ప్రజలను ప్రత్యేకించి పేదలను, కార్మికులను, వలస కూలీలను, మహమ్మారి కాలంలో పూర్తిగా మూతపడిన ఆర్థిక సంస్థలను వంచించాయనే చెప్పాల్సి ఉంటుంది. ఇక ‘పనికి ఆహార పథకా’నికి నిధుల కేటాయింపును పెంచలేదు. ఎప్పటిలాగే ఇది ఎన్నికల సంవత్సరంలో మాత్రమే పట్టించుకునే అంశంగా ఉండిపోయింది. దీంతో అసలే కరోనా దెబ్బతో జీవితాలు అతలాకుతలమైన పేదప్రజలపై పిడుగు పాటు తప్పదు. ఆత్మనిర్భర్ భారత్ను సాధించడానికి వస్తూత్పత్తితో లింక్ చేసిన ప్రోత్సాహక పథకం ద్వారా, కొత్తగా 60 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని ఆర్థికమంత్రి పేర్కొన్నారు కానీ దీనికి సంబంధించిన గణాంకాలు కానీ, ఎలా ఉద్యోగాలను çసృష్టిస్తా రన్న ఎరుక కానీ బడ్జెట్లో కనిపించలేదు. కేంద్రప్రభుత్వం ఉపాధి కల్పనపై ఎలాంటి నమూనా ఇవ్వనందున నిరు ద్యోగితకు వ్యతిరేకంగా రోడ్లమీదికి వస్తున్న లక్షలాది మంది యువతకు ఇది పూర్తిగా నిరాశపరిచే అంశమే అవుతుంది. నిరుద్యోగ పరిస్థితులతో ఎలా వ్యవహరించాలనే విషయమై కేంద్రం మా ఛత్తీస్గఢ్ నుంచి పాఠాలు నేర్చుకోవాలి. మా రాష్ట్ర నిరుద్యోగితా రేటు దేశ సగటు నిరుద్యోగ రేటు కన్నా తక్కువగా ఉందని నివేదికలు ఇప్పటికే తేటతెల్లం చేశాయి కూడా! ఆర్థిక వ్యవస్థను నిధుల లేమి తీవ్రంగా ప్రభావితం చేస్తోంది కాబట్టే కొనుగోలుదారుకు సాధికారత కల్పించాలని కేంద్రం కోరుకుంటోంది. కానీ ఈ భావన కూడా ఇప్పుడు డిమాండ్ లేని సరకుగా మారిపోయింది. ప్రభుత్వం ఏమి చేస్తోందో అంతుబట్టడం లేదు. వేళ్లమీద లెక్కబెట్టగల కార్పొ రేట్లకు సంపద ధారపోయడం కంటే కేంద్ర ప్రభుత్వాధికారులు అధిక జనాభా చేతుల్లోకి డబ్బు వచ్చిపడేలా ప్రత్యామ్నాయ లక్ష్యాలను ఇకనైనా రూపొందించుకోవాలి. కానీ ఇక్కడ కూడా ప్రభుత్వం ప్రజలకు ద్రోహం చేసిందనే చెప్పాలి. కంపెనీలపై పన్నును 18 నుంచి 15 శాతానికి తగ్గించారు కానీ అదే సమ యంలో ఆదాయ పన్ను విభాగంలో వేతన జీవులకు ఎలాంటి ఊరటనూ అందించలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే తాజా కేంద్ర బడ్జెట్ ఒక దిశా దశా లేని శుష్క వాగ్దానాల బడ్జెట్. మధ్య తరగతికి మొండిచెయ్యి చూపిన బడ్జెట్. అంతకుమించి నిరు పేదల మాడు పగలగొట్టిన బడ్జెట్! భూపేశ్ బఘేల్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి –కాంగ్రెస్ నాయకుడు -
పురోగతికి ఇది బూస్టర్ బడ్జెట్
ఆర్థిక సంక్షోభ సమయంలోనూ బడ్జెట్లోని ఉద్దీపనల ప్రణాళికల లక్ష్యాన్ని కూడా మించి భారత్ గత రెండేళ్లుగా సత్ఫలితాలను పొందగలుగుతోందంటే కారణం– దేశాన్ని నడిపిస్తున్నవారి దృఢత్వం. బడ్జెట్పై ఎవరెన్ని విమర్శలు చేసినా, లెక్కల ఎక్కువ తక్కువల నుంచి నిరాశాపూరితమైన అర్థతాత్ప ర్యాలను ఎత్తి చూపినా, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రానున్న పాతికేళ్లలో భారత్ వందేళ్ల స్వాతంత్య్ర గమనాన్ని అభివృద్ధిపథంలోకి వేగవంతం చేసే భవిష్యత్ ప్రణాళికే ఈ బడ్జెట్. కరోనా ప్రభావ పర్యవసానాల నుంచి దేశాన్ని ముందుగానే భద్రతా వలయంలోకి తప్పిం చడం, అభివృద్ధిని కుంటపడ నివ్వని విధంగా స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడం అనే రెండు అంశాలపై తాజా కేంద్ర బడ్జెట్ చక్కని సమతుల్యతను పాటిం చింది. కరోనా తన అనూహ్యమైన ఉత్పరివర్తనలతో ప్రపంచ దేశా లతో పాటు భారత్నీ లాక్డౌన్లోకి నెట్టేసిన నేపథ్యంలో మిగతా దేశాల మాదిరిగానే మనమూ ఈ విపత్తువంటి పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు అనుగుణంగా రెండు వార్షిక బడ్జెట్లకు, మధ్యమధ్య కొన్ని చిన్నతరహా బడ్జెట్లకు రూపకల్పన చేసుకున్నాం. సహజంగానే ఈ అత్యయిక స్థితిలో సంపన్న దేశాలు తమ బడ్జెట్లలో భారీ ఉద్దీపన ప్రణాళికలను ఏర్పరచుకున్నాయి. భారత్ కూడా అదే బాటలో ఆర్థికపరమైన స్థిర నిర్ణయాలకు మొగ్గు చూపింది. రెండేళ్లు గడిచినా నెమ్మదించని కరోనా... సంపన్న దేశా లను సైతం అప్పుల పాలు చేసింది. యావత్ ప్రపంచ పురోగతి మార్గాలు మూసుకుపోయాయి. ద్రవ్యోల్బణం ఆయా దేశాలను వరదలా ముంచెత్తింది. అదే సమయంలో భారత్... ప్రపంచం లోనే అతి వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఈ ఏడాది 9.2 శాతం స్థూల జాతీయోత్పత్తిని సాధించే దిశగా పయని స్తోంది. కఠినమైన ఈ ఆర్థిక సంక్షోభ సమయంలోనూ బడ్జెట్ లోని ఉద్దీపనల ప్రణాళికల లక్ష్యాన్ని మించి కూడా సత్ఫలితా లను భారత్ పొందగలుగుతోందంటే కారణం... దేశాన్ని నడిపి స్తున్నవారి దృఢత్వం, వారి తిరుగులేని అధినాయక ఆర్థిక దిశా నిర్దేశకత్వమే! గత రెండేళ్లుగా భారత్ అనుసరిస్తూ వస్తున్న చురుకైన విధానాల రూపకల్పన, వస్తు సేవల సరఫరాలను పెంపొందిం చేలా తీసుకువచ్చిన సంస్కరణలు వర్తమాన ఆర్థిక స్థితికి పటిష్ఠ మైన పునాదిని అందించాయి. 2047 నాటికి వందేళ్ల స్వాతంత్య్రం వైపు భారతదేశాన్ని తీసుకెళ్లే పాతికేళ్ల ‘అమృత కాల’ జవ, జీవనయాన మార్గాన్ని సుగమం చేశాయి. ఆర్థిక అవ రోధాలను, అంతరాయాలను వినూత్న ఆవిష్కరణలతో నెగ్గుకు వచ్చేందుకు భారత ప్రధాని దర్శించిన ‘ఆత్మనిర్భర భారత్’ ప్రపంచ దేశాలకు కూడా దారి చూపగలిగినంతటి శక్తిమంత మైనది. ఈ దార్శనికతకు కొనసాగింపుగానే భారత సమ్మిళిత, స్థిరాభివృద్ధి కోసం 2022–23 బడ్జెట్కు సూత్రకల్పన జరిగింది. ఇందులో భావి భారత నిర్మాణానికి పునాది స్తంభాలుగా కనిపి స్తున్న కొన్ని ముఖ్యాంశాలను నేను ఇక్కడ ప్రస్తావించదలిచాను. ఒక పార్టీ నాయకుడిగా కాక, ప్రజాహితాన్ని ఆశించే ఒక పరిశీల కుడిగా బడ్జెట్లోనే నేను నాలుగు అంశాలను తరచి చూశాను. మొదటిది – మూలధన వ్యయం. భారతదేశ మధ్యకాలిక వృద్ధిని ప్రగతిపథంలో పైపైకి పురోగమింపజేసే శక్తి.. నిరంత రాయంగా కొనసాగే స్థిరత్వమే. ఆ స్థిరత్వాన్ని కల్పించే మౌలిక సదుపాయాల వ్యయానికి గత ఏడాది బడ్జెట్లో జరిగిన భారీ కేటాయింపులు తాజా బడ్జెట్లో గణనీయంగా అపూర్వ రీతిలో రూ. 7.5 లక్షల కోట్లు అయి, 35.4 శాతం పెరిగాయి. ఇదే ఊపులో గతిశక్తి బృహత్ ప్రణాళికలో ఒక భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానించే 1.5 ట్రిలియన్ డాలర్ల జాతీయ మౌలిక సదుపాయాల వ్యవస్థకు ఈ బడ్జెట్ ప్రాధాన్యం ఇచ్చింది. అనుసంధాన పరిధిలోకి వచ్చే విద్య, రక్షణ, వాణిజ్య రంగాలపైన కూడా గతిశక్తి సానుకూల ప్రభావం, ప్రయోజనం ఉంటాయి. రెండవది – డిజిటైజేషన్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సంభ వించగల మార్పులు, పరిణామాలకు అనుగుణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ విధానాన్ని పునఃపరిశీలించుకునేందుకు అవసర మైన ముఖ్యమైన పనిని తాజా బడ్జెట్ నిర్దేశించుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థను డిజిటల్ కరెన్సీతో బలోపేతం చేసే ఈ అద్భుతమైన ఆలోచన మోదీ ప్రగతిశీల భావజాలం నుంచి ఆవిర్భవించిందే! దీంతో భారత్ ప్రపంచంలోనే డిజిటల్ కరెన్సీ కలిగిన అతి పెద్ద దేశాలలో ఒకటిగా అవతరించినట్లయింది. పెట్టుబడిదారుల ప్రయోజనాలకు డిజిటల్ కరెన్సీ గట్టి రక్షణను ఇస్తుంది. ఆన్లైన్ మోసాల నుంచి భద్రతనిస్తుంది. మనీ లాండరింగ్ను నిరోధిస్తుంది. మూడవది – పన్ను ఆదాయాల రాబడిని పెంచే నిర్ణ యాలు. గడిచిన ఏడాదిలో ప్రతినెలా కూడా వస్తుసేవల పన్ను వసూళ్లు (జీఎస్టీ) రికార్డు స్థాయిలో ఉంటున్నాయి. ఒక్క జనవరిలోనే మునుపెన్నడూ లేనంత అత్యధికంగా వసూళ్లు రూ. 1.4 లక్షల కోట్లకు చేరుకున్నాయి! ఫలితంగా ద్రవ్యోల్బణం నెమ్మదిగానే అయినా కచ్చితంగా దారికి వస్తుంది. నాల్గవది, వ్యక్తులను ఆర్థికంగా శక్తిమంతులను చేయడం. వారికి సాధికారతను కలిగించడం. నిర్ణయాధికార బలాన్ని చేకూర్చడం. బడ్జెట్లోని సామాజిక రక్షణను పునర్వచించిన విలక్షణమైన గుణం ఇది. పి.ఎం. ఆవాస్ యోజన, పి.ఎం. కిసాన్ సమ్మాన్ నిధి వంటి కీలకమైన పథకాలకు బడ్జెట్లో కేటాయింపులు స్పష్టమైన వ్యత్యాసంతో పెరిగాయి. అత్యంత ప్రజావశ్యక ‘హర్ ఘర్ నల్ సే జల్’ పథకం కింద 3 కోట్ల 50 లక్షల ఇళ్లకు తాగు నీటిని అందించేందుకు కేంద్ర 60 వేల కోట్ల రూపాయలను ప్రత్యేకించింది. దేశంలో వివిధ ప్రాంతాలను కలిపే విధంగా 25 వేల కి.మీ. జాతీయ రహదారుల నిర్మా ణానికి ప్రాధాన్యం ఇచ్చింది. ‘ఉత్పత్తితో ముడిపెట్టిన ప్రోత్సా హాక’ ప్రణాళికతో 60 లక్షల ఉద్యోగ అవకాశాలను కల్పించ బోతోంది. మహమ్మారి నీడ పడిన ప్రతి రంగానికి, ప్రతి విభా గానికి వెలుగును ప్రసరింపజేసేందుకు ఉద్దేశించిన ఈ బడ్జెట్... రైతులకు నేరుగా కూ. 2.37 లక్షల కోట్ల కనీస మద్దతు ధరను చెల్లించబోతోంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభి వృద్ధి కోసం ప్రస్తుతం ఉన్న అత్యవసర రుణ సహాయ వ్యవస్థను పరిపుష్టం చేసి, ఆ పరిశ్రమల పనితీరును వేగవంతం చేసే పథ కాన్ని ప్రవేశపెట్టనుంది. అంకుర సంస్థలకు పన్ను మినహా యింపులను విస్తృతం చేస్తోంది. ఎవరెన్ని విమర్శలు చేసినా, లెక్కల ఎక్కువ తక్కువల నుంచి నిరాశాపూరితమైన అర్థతాత్పర్యాలను ఎత్తి చూపినా, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో.. రానున్న పాతికేళ్లలో భారత్ వందేళ్ల స్వాతంత్య్ర గమనాన్ని అభివృద్ధి పథంలోకి వేగవంతం చేసే సమీప భవిష్యత్ ప్రణాళికే ఈ బడ్జెట్. ముందే చెప్పినట్లు కరోనా ప్రభావాల నుంచి జాతికి రక్షణ వలయాన్ని ఏర్పరుస్తూ, అదే సమయంలో స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని సాధించేలా ఒక చక్కటి సమతుల్యాన్ని పాటిస్తూ రూపొందిన బడ్జెట్ ఇది. ప్రపంచ దేశాలలో భారత్ మహాశక్తిగా ఎదిగే పరివర్తన క్రమాన్ని మోదీ పాలనలోనే దేశ ప్రజల చూడబోతున్నారు. ఈ పరివర్తన.. మౌలిక సదుపాయాలు, డిజిటైజేషన్, మూలధన పెట్టుబడులు, వాణిజ్య స్నేహశీలతల చక్రాలపై, ఇంకా.. కోటీ ముప్పై లక్షల మంది ప్రజల స్ఫూర్తి సామర్థ్యాలపై సాగబోతోందని బడ్జెట్ సారాంశం తెలియ జేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ పాలన వ్యవహారశైలిలోని దృఢత్వం, భావిభారత లక్ష్యాలపై పట్టు, భారత్ ఎంత గడ్డు స్థితినైనా ఎదుర్కోగలదని ఆయన ఇస్తున్న ధీమా, అర్థంలేని విమర్శలతో విలువైన చట్టసభల సమయాన్ని, ప్రజాధనాన్ని వృ«థా పరిచే ప్రతిపక్షాల కుటిలయత్నాలకు గట్టి సమాధానం బడ్జెట్లో ప్రతిఫలించాయి. జ్యోతిరాదిత్య సింధియా కేంద్ర మంత్రి –బీజేపీ నాయకుడు -
ద్రవ్యలోటును దాటితేనే సంక్షేమం
నాలుగు దశాబ్దాలపాటు నష్టం చేసిన నయా ఉదారవాద విధానాలను వదిలేసి చాలా దేశాలు ముందుకు సాగేందుకు యత్నిస్తున్నాయి. మన దేశ ప్రజలు కూడా విద్య, వైద్య రంగాలలో ప్రభుత్వాల పాత్ర పెరగాలనీ, సంక్షేమ రాజ్య దిశగా ఆర్థిక వ్యవస్థ మళ్ళాలనీ, రైతులను మార్కెట్ విధానాల పేరిట కార్పొరేట్లకు బలి చేయడం తగదనీ, నిరుద్యోగులను వారి తలరాతకు వారిని వదిలేయరాదనీ కోరుకున్నారు. ఇదంతా జరగాలంటే ఆర్థిక వ్యవస్థలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ఉదారంగా ఖర్చు పెట్టాలి. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ పెట్టరాదనే ‘ద్రవ్యలోటు’ సిద్ధాంతానికి చరమగీతం పాడాలి. ప్రపంచవ్యాప్తంగా 1980ల ముందరిలా ద్రవ్యలోటు పట్ల పట్టింపులేని, సంక్షేమ రాజ్యాల దిశగా ఆర్థిక రథం మళ్లాలి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో 2022–23 ఆర్థిక సంవత్సరం తాలూకు బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ ఎలా ఉండాలనే దాని గురించి కొన్ని మౌలిక ఆకాంక్షలు దేశ ప్రజలలో అప్ప టికే ఉన్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సంబంధించినంత వరకూ ప్రాధాన్యతాంశాల గురించిన పలు రకాల ఒత్తిడులు ఉన్నాయి. వీటిలో కీలకమైనవి: 1. సంవత్సర కాలం పైబడి సాగిన రైతు ఉద్యమం ముందుకు తెచ్చిన డిమాండ్లు. 2. కోవిడ్ రెండో వేవ్ కాలంలో కోల్పోయిన తన ప్రాధాన్యాన్ని తిరిగి ఎంతోకొంత పొంద వలసిన ఆగత్యం ప్రధాని మోదీకి ఉండటం. 3. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి 2014లో అధికారంలోకి వచ్చాక, నిజానికి ఉన్న ఉద్యోగాలే ఊడిపోయిన స్థితి. రికార్డు స్థాయి నిరు ద్యోగానికి ఎంతో కొంత ఆచరణాత్మక పరిష్కారం చూపించాల్సిన బాధ్యత. 4.కోవిడ్ ముందరి 2018 జనవరి–మార్చి కాలం నుంచే పతనమవుతూ, కోవిడ్ కాలంలో అగాథంలోకి పడిపోయిన స్థూల జాతీయోత్పత్తి గణాంకాన్ని తిరిగి నిలబెట్టగలగడం. 5. యూపీఏ ప్రభుత్వ పతనానికి ఒక ప్రధాన కారణమైన ద్రవ్యోల్బణం నేడు మరల తీవ్రస్థాయిలో పెరుగుతున్న స్థితి. దీనికి పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని మరింత తగ్గించడం వంటి పరిష్కారాల ఆవశ్యకత. 6. కోవిడ్ కాలంలో భారీ సంఖ్యలో ఉపాధిని కోల్పోయిన, అప్పుల పాలైన, పేదరికంలోకి జారిపోయిన కోట్లాదిమంది మధ్యతరగతి వర్గానికి ఉపశమనం కలిగించే అవసరం. స్థూలంగా మింట్ సి ఓటర్ సర్వేలో బడ్జెట్ నుంచి ప్రజలు కోరుకుంటున్న అంశాలుగా ఈ నాలుగు ప్రస్ఫుటమైనాయి. (ఎ) విద్యా వైద్యానికి కేటాయింపును భారీగా పెంచడం. (బి) నిరుద్యోగ భృతి వంటి అంశంపై దృష్టి పెట్టడం. (సి) దేశంలో రైతాంగ వర్గానికి చెందనివారు కూడా కోరుకుంటున్న విధంగా రైతు అనుకూల విధానాలు. (డి) సంక్షేమ రాజ్యాన్ని భారీగా విస్తరించాలన్న ఆకాంక్షకు రూపాన్ని ఇవ్వటం. ముందుగా రైతు ఉద్యమ నేపథ్యంలో ముందుకు వచ్చిన రైతాంగ ఎజెండా బడ్జెట్లో ఎలా ప్రతిఫలించిందో చూద్దాం. సంవ త్సరం పాటు ఉద్యమం నడిపి ఇరకాటంలో పెట్టిన రైతాంగం పట్ల ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి చూపిందనే ఆరోపణ ఉంది. పంటల సేకరణను అన్ని పంటలకూ విస్తరించి, లబ్ధిదారుల సంఖ్యను పెంచా లనే రైతుల కోరికకు భిన్నంగా... పంటల సేకరణకు కేటాయించిన మొత్తాన్ని 2021–22 బడ్జెట్లోని 2.48 లక్షల కోట్ల నుంచి ప్రస్తుతం 2.37 లక్షల కోట్లకు తగ్గించారు. పంటల సేకరణ తాలూకు లబ్ధిదారుల సంఖ్యను గతేడాదిలోని 1.97 కోట్ల మంది నుంచి 1.63 కోట్ల మందికి కుదించారు... అదీ కథ! ఎరువులపై ఇచ్చే సబ్సిడీ 2021–22 బడ్జెట్ తాలూకు 1,40,122 కోట్ల రూపాయల నుంచి ఇప్పుడు 1,05,222 కోట్లకు అంటే 25 శాతం మేరకు తగ్గింది. మరో పక్క గ్రామీణ పేదలకు అత్యంత ప్రాధాన్యత ఉన్న ఉపాధి పథకానికి 73 వేల కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో ఇది 74 వేల కోట్లు (అదనపు కేటాయింపులతో ఈ మొత్తం లక్ష కోట్ల మేరకు చేరుకుంది.) ఉపాధి హామీ చట్ట ప్రకారం, గ్రామీణ ప్రాంతంలోని పేదలకు, వారు పని చేయాలని కోరుకుంటే, సంవత్సరానికి కనీసం వంద పని దినాలకు హామీ ఇవ్వాలి. కానీ చాలా ఏళ్లుగా ఈ పథకానికి కేటా యింపులు తగినంతగా లేవు. దీనివల్ల 2020 ఆర్థిక సంవత్సరంలో కల్పించిన పని దినాలు 34.76 మాత్రమే. 2021 ఆర్థిక సంవత్సరంలో అవి మరింతగా దిగజారి 27.16కు పరిమితమయ్యాయి. అంతకు ముందటి కాలంలో ఇవి సగటున 42గా ఉన్నాయి. ఉపాధి పనులకు ఏర్పడ్డ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని, ఈ పథకం సంతృప్తికర అమలు కోసం 2.64 లక్షల కోట్ల రూపాయలు అవసరమని ఒక ప్రఖ్యాత సంస్థ లెక్కించింది. స్థూలంగా 2013–2019 మధ్యకాలంలో సాగుబడి ద్వారా రైతుల ఆదాయం తగ్గిపోయింది. ఒక రైతు కుటుంబానికి వారి ఆదాయంలో 48 శాతంగా ఉన్న సాగుబడి ఆదాయ వాటా ప్రస్తుతం 37 శాతానికి తగ్గింది. పేద ప్రజలకిచ్చే ఆహార సబ్సిడీపై కోత పడ్డది. 2,86,469 కోట్ల రూపాయల నుంచి ప్రస్తుత బడ్జెట్లో 2,06,831 కోట్లకు తగ్గింది. ప్రపంచ క్షుద్బాధ సూచీలో 2021 సంవత్సరానికి మొత్తం 116 దేశాలలో భారతదేశం ర్యాంకు 94 నుంచి 101కి దిగజారింది. కోవిడ్ కాలంలో మరింత తీవ్రమైన ఆకలి సమస్యను ఈ ఆహార సబ్సిడీల కోత మరింత పెంచుతుంది. దీన్ని మరింత జఠిలం చేస్తూ ధరలు పెరుగుతున్నాయి. దీని వెనుక అంతర్జాతీయంగా కమోడి టీల ధరల పెరుగుదల, దేశీయంగా విపరీతమైన పన్నుల భారం వలన పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, ఎస్మా వంటి చట్టాల రద్దు వలన పట్టపగ్గాలు లేని వ్యాపారస్తులు, దళారుల చేతివాటం, అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం కావడం వలన ధరలపై నియంత్రణ ఉంచ గల సమాంతర వ్యవస్థ దెబ్బతినడం వంటివి అన్నీ ఉన్నాయి. ఈ కారణాలలో మొదటిదాన్ని వదిలేస్తే, మిగతావన్నీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్వాకాలే. ఐదు రాష్ట్రాల ఎన్నికలు అడ్డు రావడం వలన గత రెండు నెలలుగా నిలిచిపోయిన పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఎన్నికల తరువాత పైకి ఎగసేందుకు సిద్ధంగానే ఉంది. ఈ నిర్వాకం చాలద న్నట్లు, ఈ మధ్య కాలంలో జీఎస్టీ శ్లాబులలో మార్పు చేస్తామంటూ ప్రస్తుతం 0 శాతం జీఎస్టీ ఉన్న కొన్ని సరుకులపై పన్నును విధించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ సమస్యలన్నీ ఇలా ఉండగా, నిరుద్యోగం దేశ ప్రజలకు జీవన్మరణ సమస్యగా మారింది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగా లిస్తామనే హామీని తుంగలో తొక్కి... రానున్న కాలంలో 60 లక్షల ఉద్యోగాలంటూ కొత్త పల్లవిని అందుకుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చుతున్న బీజేపీ ప్రభుత్వం, నగర ప్రాంతాలకు కూడా ఉపాధి హామీ పథకం కావాలనే డిమాండ్కు సహజంగానే అనుకూలంగా స్పందించలేదు. ఈ మొత్తం క్రమంలో దేశ స్థూల జాతీయోత్పత్తి దిగజారింది. అనేకమంది అంతర్జాతీయ ఆర్థిక వేత్తల అభిప్రాయం ప్రకారం, భారతదేశపు జీడీపీ గణాంకాలను నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి గతంలో మోదీ ఘనంగా ప్రకటించిన జీడీపీని 5 లక్షల కోట్ల డాలర్లకు తీసుకెళ్ళడం అనేది వట్టి నీటిమూటే కాగలదు. పెద్ద నోట్ల రద్దు, అవకతవక జీఎస్టీ వంటి నిర్ణయాలకు తోడుగా కోవిడ్ వల్ల దిగజారిన పరిస్థితులను పునరుజ్జీవింప జేసేందుకు ఆర్థిక ఉద్దీపన ఇవ్వడాన్ని నిర్లక్ష్యం చేయడం వంటి చర్యలన్నీ దేశ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బ కొట్టాయి. ప్రపంచమంతటా కూడా వామపక్ష ఆలోచనా విధానం బల పడుతోంది. ఫలితంగానే మింట్ సి ఓటర్ సర్వేలో మన దేశ ప్రజలు కూడా విద్య, వైద్య రంగాలలో ప్రభుత్వాల పాత్ర పెరగాలనీ, సంక్షేమ రాజ్య దిశగా ఆర్థిక వ్యవస్థ మళ్ళాలనీ, రైతులను మార్కెట్ విధానాల పేరిట కార్పొరేట్లకు బలి చేయడం తగదనీ, నిరుద్యోగులను వారి తలరాతకు వారిని వదిలేయరాదనీ కోరుకున్నారు. ఇదంతా జరగా లంటే ఆర్థిక వ్యవస్థలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ఉదారంగా ఖర్చు పెట్టాలి. ప్రభుత్వం ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ పెట్టరాదనే ‘ద్రవ్యలోటు’ సిద్ధాంతానికి చరమగీతం పాడాలి. ప్రపంచవ్యాప్తంగా 1980ల ముందరిలా ద్రవ్యలోటు పట్ల పట్టింపులేని, సంక్షేమ రాజ్యాల దిశగా ఆర్థిక రథం మళ్లాలి. ఈ దిశగా, అమెరికా, యూరోప్ దేశాలూ, కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలలో కూడా కొంత ప్రయత్నం మొదలైంది. ఉదాహరణకు, అమెరికా ప్రభుత్వం ద్రవ్య లోటును పట్టించుకోకుండా (14% పైగా ఉంది) ప్రజల కొనుగోలు శక్తిని, మార్కెట్ డిమాండ్ను పెంచేందుకు భారీ వ్యయాలు చేస్తోంది. యూరోపియన్ యూనియన్, చైనా కూడా అదే పని చేస్తున్నాయి. అంటే ఈ దేశాలు ప్రజలకు నాలుగు దశాబ్దాలపాటు నష్టం చేసిన నయా ఉదారవాద విధానాలను వదిలేసి ముందుకు సాగేందుకు యత్నిస్తున్నాయి. వ్యాసకర్త ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు ‘ 98661 79615 -
హైదరాబాదీలకు ఊరట.. నగరంలో మరో రైల్వే టర్మినల్
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో రైల్వే టర్మినల్ అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై పెరిగిన ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని గతంలో ప్రతిపాదించిన చర్లపల్లి రైల్వేస్టేషన్ విస్తరణ కోసం కేంద్రం ఈసారి రూ.70 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో తొలిదశ విస్తరణ పనులను చేపట్టనున్నారు. రానున్న రెండేళ్లలో చర్లపల్లి టర్మినల్ను వినియోగంలోకి తెచ్చేందుకు దక్షిణమధ్య రైల్వే కార్యాచరణ చేపట్టింది. తొలిదశలో వచ్చే రెండేళ్లలో పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు దక్షిణమధ్య రైల్వే కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం టెండర్ల ప్రక్రియను పూర్తి చేసినట్లు గురువారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిషోర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్కు ఈసారి కేంద్ర బడ్జెట్లో కొత్త రైళ్లు, లైన్లు, ఇతరత్రా ప్రాజెక్టుల కోసం ఎలాంటి నిధులను కేటాయించలేదు. గతంలోనే ప్రతిపాదించిన చర్లపల్లికి మాత్రం ఈసారి నిధులను కేటాయించారు. ఎంఎంటీఎస్ రెండో దశ కోసం రూ.10 లక్షలు కేటాయించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ డెవలప్మెంట్ పనులను కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు జీఎం తెలిపారు. భవిష్యత్తులో వందేభారత్ రైళ్లకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉంటుందని, ఇక్కడి నుంచి అన్ని ప్రధాన నగరాలకు, పట్టణాలకు ఈ రైళ్లు నడుస్తాయన్నారు. చర్లపల్లి విస్తరణ ఇలా.. ► మొదటి దశలో రూ.54.58 కోట్ల అంచనాలతో పనులు చేపట్టనున్నారు. రెండు సబ్వేలు, 3 ర్యాంప్లు, 6 చోట్ల మెట్ల మార్గాలను నిర్మిస్తారు. 5 చోట్ల బ్రిడ్జి పనులతో పాటు, 2 హైలెవల్ ఐలాండ్ ప్లాట్ఫామ్లను నిర్మించనున్నారు. ► ఇప్పుడున్న అన్ని ప్లాట్ఫామ్ల ఎత్తు, పొడవు పెంచుతారు. అన్ని ప్లాట్ఫామ్లకు మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడంతో పాటు, ఓవర్హెడ్ ట్యాంక్ను నిర్మించనున్నారు. మురుగునీటి కాల్వలు, ఇతర పనులను పూర్తి చేస్తారు. (క్లిక్: ప్రతి ఆదివారం.. ప్రాపర్టీ టాక్స్ పరిష్కారం) రెండో దశలో... ► సుమారు రూ.62.67 కోట్ల పనులను చేపట్టనున్న పనుల్లో భాగంగా చర్లపల్లి స్టేషన్ ప్రాంగణం విస్తరణ,సీసీ రోడ్ల నిర్మాణం, విద్యుత్ సబ్స్టేషన్, స్టేషన్ నిర్వహణ షెడ్, తదితర పనులు చేపడతారు. ► 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, 5 ఎస్కలేటర్లు, 9 లిఫ్టులు (వాటిలో 3 సబ్వేల కోసం, 6 ప్లాట్ఫామ్లపైన ఏర్పాటు చేస్తారు). కొత్తగా 4 పిట్లైన్లను నిర్మించనున్నారు. పార్శిల్ షెడ్, బయో టాయిలెట్, తదితర పనులు రెండో దశలో పూర్తి చేయనున్నారు. చర్లపల్లి స్టేషన్ విస్తరణ వల్ల ప్రతి రోజు కనీసం 100 రైళ్లను నిలిపేందుకు అవకాశం లభిస్తుంది. 50 వేల మందికి పైగా ప్రయాణికులకు ప్రయోజనం ఉంటుంది. (చదవండి: హైదరాబాద్ మెట్రోకు వైరస్ బ్రేక్) ఎంఎంటీఎస్కు నిధుల కొరత.. మరోవైపు రక్షణశాఖ పరిధిలో ఉన్న మౌలాలీ– సనత్నగర్ మార్గంలోని 5 కిలోమీటర్లు మినహాయించి ఎంఎంటీఎస్ రెండో దశ పూర్తయిందని జనరల్ మేనేజర్ తెలిపారు. నిధుల కొరత వల్ల రైళ్ల కొనుగోళ్లు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు రూ.129 కోట్లు మాత్రమే అందాయని, మరో రూ.760 కోట్లు రావాల్సి ఉందని అధికారులు వివరించారు. పెండింగ్ నిధుల కోసం ఇప్పటికే అనేక సార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. రాష్ట్రం నిధులు ఇస్తే తప్ప ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లబోదన్నారు. యాదాద్రికి ఎంఎంటీఎస్ పొడిగింపు కోసం దక్షిణమధ్య రైల్వే రూ.330 కోట్లతో ప్రణాళికలను రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం 2/3 వంతు నిధులు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుకు కూడా నిధుల కొరతే కారణమని అధికారులు స్పష్టం చేశారు. (క్లిక్: సికింద్రాబాద్ స్టేషన్కు.. ఎయిర్పోర్టు లుక్) -
రైల్వే ప్రాజెక్టులకు రూ.7 వేల కోట్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కీలకమైన రైల్వే ప్రాజెక్టులకు నిధుల సాధనలో రాష్ట్ర ప్రభుత్వం సఫలీకృతమైంది. ఎన్నో ఏళ్లుగా నత్తనడకన సాగుతున్న కొత్త లైన్లు, విద్యుదీకరణ, డబ్లింగ్ ప్రాజెక్టులకు 2022–23 కేంద్ర బడ్జెట్లో భారీగా నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు చేసింది. దీంతో ఈ బడ్జెట్లో కేంద్రం రూ.7,032 కోట్లు కేటాయించింది. గత ఏడాది కేటాయించిన రూ.5,812 కోట్ల కంటే ఇది 21 శాతం ఎక్కువ. ప్రత్యేక రైల్వే జోన్ను ప్రకటించకపోవడంతో రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని కూడా ఈ బడ్జెట్ కేటాయింపులు ప్రతిబింబించాయి. 2022–23 బడ్జెట్లో రాష్ట్రంలోని ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులు ► నడికుడి – శ్రీకాళహస్తి కొత్త లైన్కు రూ.1,501 కోట్లు కేటాయించింది. 309 కి.మీ. ఈ ప్రాజెక్టును రూ. 2,289 కోట్లతో 2011–12లో చేపట్టారు. తగినన్ని నిధులివ్వకపోవడంతో ఇప్పటివరకు 46 కి.మీ. పనులే పూర్తయ్యాయి. ఇప్పుడు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడంతో పనులు వేగం పుంజుకోనున్నాయి. ► కోటిపల్లి–నరసాపూర్ కొత్త లైన్కు కేంద్రం రూ.358 కోట్లు కేటాయించింది. 57 కి.మీ. ఈ లైన్ను రూ.2,120 కోట్లతో 2000–01లో ప్రారంభించారు. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో పనులు వేగంగా సాగలేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు తాజా బడ్జెట్లో ఎక్కువ నిధులిచ్చింది. ► కడప – బెంగళూరు కొత్త లైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. రాయలసీమను కర్ణాటకతో మరింతగా అనుసంధానిస్తూ వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. రూ.2,706 కోట్లతో చేపట్టే 255 కి.మీ. కొత్త లైన్కు 2008–09లో ఆమోదం లభించింది. ఏపీ పరిధిలో ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పటికే మొదటి దశలో కడప నుంచి పెండ్లిమర్రి వరకు 21 కి.మీ. నిర్మాణం పూర్తయ్యింది. ప్రస్తుత బడ్జెట్లో రూ.289 కోట్లు కేటాయింపుతో మిగిలిన పనులు జోరందుకోనున్నాయి. ► 221 కిలోమీటర్ల విజయవాడ–గుడివాడ–మచిలీపట్నం–భీమవరం–నరసాపూర్–నిడదవోలు డబ్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్టుకు తాజా బడ్జెట్లో రూ.1,681 కోట్లు కేటాయించడం విశేషం. 2011–12లో ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టు తగినన్ని నిధుల్లేక నత్తనడకన సాగింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రయత్నాలతో గత రెండు బడ్జెట్లలో ఎక్కువ నిధులిచ్చారు. దీంతో విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు 144 కి.మీ. పనులు పూర్తి చేశారు. ఇప్పుడు భారీగా నిధులు కేటాయించడంతో ఈ ఏడాదిలోనే పనులు పూర్తవుతాయని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ► విజయవాడ– గూడూరు మూడో లైన్కు తాజా బడ్జెట్లో కేంద్రం రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. 288 కి.మీ. మేర నిర్మించే మూడో లైన్లో ఇప్పటికి 55 కి.మీ. మేరే పనులు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో ఈసారి ఎక్కువ నిధులు కేటాయించారు. ► రాష్ట్రం నుంచి దేశ రాజధానికి వెళ్లే కీలకమైన విజయవాడ– కాజీపేట మార్గంలో మూడో లైన్కు రూ.592 కోట్లు కేటాయించారు. రూ.1,953 కోట్లతో 220 కి.మీ. నిర్మించే ఈ లైన్లో నిధులు లేక ఇప్పటివరకు 17.5 కి.మీ. పనులే పూర్తి చేశారు. తాజా కేటాయింపులతో పనులు వేగం పుంజుకోనున్నాయి. ► రూ.3,631 కోట్లతో 401 కి.మీ. గుంటూరు – గుంతకల్ డబ్లింగ్ను 2016–17లో ఆమోదించారు. అరకొర నిధులతో ఇప్పటి వరకు 92 కి.మీ. పనులే చేశారు. ప్రస్తుత బడ్జెట్లో రూ.803 కోట్లు కేటాయించడంతో పనులు ఊపందుకోనున్నాయి. ► గుత్తి–ధర్మవరం డబ్లింగ్కు రూ.100 కోట్లు కేటాయించారు. రూ.714 కోట్లతో 91 కి.మీ. ఈ ప్రాజెక్టును 2015–16లో ఆమోదించారు. ఇప్పటివరకు 57 కి.మీ. పనులు పూర్తయ్యాయి. ► దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఐదు రైల్వే స్టేషన్లలో బైపాస్ లైన్ల కోసం రూ.407.47 కోట్లు కేటాయించారు. వాటిలో విజయవాడ, రేణిగుంట, గుత్తి, తెలంగాణలో కాజీపేట, వాడి రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ► చిత్తూరు జిల్లా పాకాల – అనంతపురం జిల్లా ధర్మవరం మార్గం విద్యుదీకరణకు రూ.131 కోట్లు, కర్నూలు జిల్లా నంద్యాల – వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మార్గంలో విద్యుద్దీకరణకు రూ.51 కోట్లు కేటాయించారు. ► కర్నూలులో మిడ్లైఫ్ రిహాబిలిటేషన్ ఫ్యాక్టరీకి రూ.58 కోట్లు కేటాయించారు. ► తిరుపతి రైల్వే స్టేషన్లో దక్షిణ ముఖద్వారం పనులకు రూ.3 కోట్లు, తిరుచానూరు రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.6.5 కోట్లు కేటాయించారు. ప్రత్యేక జోన్ లేకపోవడంతో ఏపీకి తీవ్ర నష్టం విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ లేకపోవడంతో రాష్ట్రానికి జరుగుతున్న నష్టం మరోసారి సుస్పష్టమైంది. భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్ పూర్తిగా ఒడిశాకే ప్రాధాన్యమిచ్చి ఆంధ్రప్రదేశ్ను నిర్లక్ష్యం చేసిందనడానికి బడ్జెట్ కేటాయింపులే నిదర్శనం. తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలో మొత్తం 12 కొత్త లైన్ల పనులకు నిధులు కేటాయిస్తే వాటిలో ఏపీ పరిధిలోని నౌపడ–గుణుపూర్– తెరుబలి లైన్ ఒక్కటే ఉంది. అది కూడా 20 శాతమే ఏపీలో ఉంటుంది. 80 శాతం ఒడిశాలోనే ఉంటుంది. ఆ లైన్కు కూడా కేవలం రూ.10 కోట్లే కేటాయించారు. ఇక ఈ జోన్ పరిధిలో 28 డబ్లింగ్ పనులకు నిధులివ్వగా, ఏపీ పరిధిలోనివి నాలుగే ఉన్నాయి. వాటిలో కూడా అత్యధిక భాగం ఒడిశాకు ప్రయోజనం కలిగించేవే. ఒడిశాలోని టిట్లాఘర్ – ఏపీలోని విజయనగరం మూడోలైన్కు రూ.961 కోట్లు కేటాయించారు. కొత్తవలస–ఒడిశాలోని కోరాపుట్ డబ్లింగ్ పనులకు రూ.348.94 కోట్లు ఇచ్చారు. ఒడిశాలోని ఖుర్దారోడ్, ఏపీలోని విజయనగరం రైల్వే స్టేషన్ల వద్ద బైపాస్ లైన్లకు కలిపి రూ.4.18 కోట్లు కేటాయించారు. ఒడిశాలోని భద్రక్ –ఏపీ లోని విజయనగరం మూడోలైన్ మిగులు పనులకు రూ.కోటి మాత్రమే కేటాయించారు. ప్రత్యేక జోన్ ప్రకటించి ఉంటే ఏపీకి కొత్త రైల్వే ప్రాజెక్టులు వచ్చి ఉండేవని నిపుణులు చెబుతున్నారు. -
బడ్జెట్ సమావేశాలు: శుక్రవారానికి రాజ్యసభ వాయిదా
TIME: 15:00 ► శక్రవారం ఉదయం 10 గంటలకు రాజ్యసభ వాయిదా పడింది. ► కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. రాహుల్ గతంలో 'యువరాజు' లాగా ప్రవర్తించేవాడని, ఇప్పుడు తానే ను భారతదేశానికి 'రాజు' అని భావిస్తున్నాడని చురకలంటించారు. ► లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సరైన పార్లమెంటరీ విధానాన్ని అనుసరించడం లేదని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా బుధవారం కాంగ్రెస్ సభ్యుడు, ఎంపీ రాహుల్ గాంధీపై మండిపడ్డారు. తాను మాట్లాడుతున్న సమయంలో రాహుల్ గాంధీ మరో ఎంపీకి మాట్లాడేందుకు అనుమతి ఇవ్వడంతో.. స్పీకర్ స్పందిస్తూ అనుమతి ఇవ్వడానికి మీరు ఎవరు? మీరు అనుమతి ఇవ్వలేరు, అది నా హక్కు అని స్పష్టం చేశారు. ► ఏపీలో ప్రషాద్ (PRASHAD) పథకంలో అమరావతి, శ్రీశైలం, సింహాచలం, అన్నవరం దేవస్థానాలు ఉన్నాయయని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అడిగిన ప్రశ్నకు.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు వాటిని ఈ పథకంలో చేర్చామని మంత్రి పేర్కొన్నారు. అమరావతికి 2015-16లో రూ.27.77 కోట్లతో పర్యాటక గమ్యస్థానం కింద అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేసినట్లు తెలిపారు. శ్రీశైలం ఆలయాభివృద్ధి కోసం రూ.37.88 కోట్ల ఖర్చు చేశామని పేర్కొన్నారు. ► లోక్సభలో విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ అంశానికి సంబంధించిన వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి లేఖపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ.. విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. కొత్త రైల్వే జోన్ ఏర్పటుపై డీపీఆర్ అందిందని ఆయన పేర్కొన్నారు. ► రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ ఎంపీ మోపీదేవి వెంకటరమణ ఏపీలో ఆక్వా టూరిజం అభివృద్ధికి సంబంధించిన అంశాన్ని లేవనెత్తారు. దీనిపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ స్పందిస్తూ.. ఏపీలోని కాకినాడ, నెల్లూరులో ఆక్వా టూరిజం అభివృద్ధి చేస్తున్నామని సమాధానం ఇచ్చారు. ► పెగాసస్ అంశంపై పార్లమెంటును తప్పుదారి పట్టించినందుకు కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్పై వచ్చిన ప్రివిలేజ్ మోషన్లను పరిశీలిస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ► రాజ్యసభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. హైకోర్టులు, సుప్రీంకోర్టులలో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తుల్లో తొలిసారిగా నలుగురు మహిళా న్యాయమూర్తులు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తాను న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ముగ్గురిని నియమించారని తెలిపారు. హైకోర్టుల్లోని 1098 మంది న్యాయమూర్తుల్లో, 83 మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారని పేర్కొన్నారు. ► చాలా విరామం తర్వాత బుధవారం రాజ్యసభ అంతరాయం లేకుండా సజావుగా కొనసాగిందని చైర్మన్ వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ స్ఫూర్తి కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నాలుగో రోజు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు సజావుగా సాగేందుకు సభ్యులందరూ సహకరించాలని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై ప్రజలకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని బుధవారం రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. -
కొనసాగిన బడ్జెట్ జోష్
ముంబై: బడ్జెట్ మరుసటి రోజూ మార్కెట్లో కొనుగోళ్లు కొనసాగాయి. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్–2022పై పలువురు విశ్లేషకులు సానుకూలంగా స్పందించడం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. ఆర్థిక రికవరీ వేగం మరింత పుంజుకునేందుకు మౌలికరంగానికి పెద్దపీట వేయడంతో పాటు పెట్టుబడులను ప్రోత్సహించేందుకు భారీ మూలధన వ్యయాన్ని కేటాయించడాన్ని స్టాక్ మార్కెట్ స్వాగతించిందని ట్రేడర్లు పేర్కొన్నారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూలతలు కలిసొచ్చాయి. ఫలితంగా సెన్సెక్స్ 696 పాయింట్లు పెరిగి 59,558 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 203 పాయింట్ల లాభంతో 17,780 వద్ద నిలిచింది. సూచీలకిది వరుసగా మూడో లాభాల ముగింపు. ట్రేడింగ్ అన్ని రంగాల షేర్లకు సంపూర్ణ కొనుగోళ్ల మద్దతు లభించింది. బడ్జెట్ రోజున స్తబ్ధుగా ట్రేడైన బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లకు అధిక కొనుగోళ్ల మద్దతు లభించింది. ట్రేడింగ్ ప్రారంభంలో కాస్త అమ్మకాల ఒత్తిడికి లోనైన సూచీలు.., తర్వాత కోలుకొని మార్కెట్ ముగిసే దాకా ర్యాలీని కొనసాగించాయి. ఒక దశలో సెన్సెక్స్ 757 పాయింట్లు, నిఫ్టీ 218 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. మధ్య, చిన్న తరహా షేర్లకు భారీగా డిమాండ్ లభించడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్క్యాప్ ఇండెక్సులు ఒకటిన్నర శాతం చొప్పున లాభపడ్డాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ఆరంభ లాభాలను కోల్పోయి ఒక పైసా స్వల్ప లాభంతో 74.83 వద్ద స్థిరపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.184 కోట్ల షేర్లను అమ్మేయగా.., దేశీ ఇన్వెస్టర్లు రూ.426 కోట్ల షేర్లను కొన్నారు. కార్పొరేట్లు మెరుగైన ఆదాయాలను ప్రకటన నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో సానుకూలతలు నెలకొన్నాయి. ఆసియాలో చైనా లునార్ కొత్త ఏడాది సందర్భంగా ఈ దేశ మార్కెట్తో పాటు హాంగ్కాంగ్, కొరియా స్టాక్ మార్కెట్లు పనిచేయలేదు. జపాన్ స్టాక్ సూచీ నికాయ్ ఒకశాతం లాభపడింది. యూరప్ మార్కెట్లూ రాణించాయి. ‘‘కేంద్రం బడ్జెట్పై ఆశావాదంతో మార్కెట్ మూడోరోజూ ముందుకే కదిలింది. రానున్న రోజుల్లో మార్కెట్కు ప్రపంచ పరిణామాలు దిశానిర్దేశం చేస్తాయి. ఒపెక్ సమావేశ నిర్ణయాలు, యూరోజోన్ ద్రవ్యోల్బణ డేటా కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. సానుకూలతలు ఎన్ని నెలకొన్నప్పటికీ.., నిఫ్టీ పరిమిత శ్రేణిలోనే ట్రేడ్ అవుతోంది. సాంకేతికంగా 18,000–18,300 శ్రేణిలో కీలక ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుంది. బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లు రాణించే అవకాశం ఉంది’’ జియోజిత్ ఫైనాన్షియల్ హెడ్ రీసెర్చ్ వినోద్ నాయర్ తెలిపారు. మూడు రోజుల్లో రూ.9.57 లక్షల కోట్ల సంపద గడిచిన మూడురోజుల్లో సెన్సెక్స్ 2,358 పాయింట్లు ర్యాలీ చేయడంతో రూ.9.57 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. సూచీల ఒకశాతం లాభంతో బుధవారం ఒక్కరోజే రూ.2.67 కోట్లు ఇన్వెస్టర్ల సొంతమైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.270 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► రుణాన్ని ఈక్విటీ రూపంలో మార్చే ప్రణాళికను ఉపసంహరించుకోవడంతో టాటా టెటిసర్వీసెస్ షేరు 5 శాతం లాభపడి రూ.149 వద్ద స్థిరపడింది. ► కేర్ రేటింగ్ సంస్థ రేటింగ్ను అప్గ్రేడ్ చేయడంతో వోడాఫోన్ ఐడియా షేరు ఏడు శాతం లాభపడి రూ.11 వద్ద స్థిరపడింది. ► మార్కెట్లో అనిశ్చితిని సూచించే వీఐఎక్స్ ఇండెక్స్ ఏడు శాతం దిగివచ్చి 18.65 వద్ద స్థిరపడింది. -
వచ్చే 25 ఏళ్ల వృద్ధికి బడ్జెట్ పునాదులు
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో మంగళవారం ప్రవేశపెట్టిన 2022–23 వార్షిక బడ్జెట్ వచ్చే 25 సంవత్సరాలకు వృద్ధికి పునాదులు వేసిందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఎకానమీ పురోగతికి కీలకమైన ప్రైవేటు పెట్టుబడులు పెరగడానికి కేంద్ర బడ్జెట్ తగిన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు రాజీవ్ కుమార్ వెల్లడించారు. కరోనా వైరెస్తో అతలాకుతలం అయిన ఎకానమీ పురోగతికి 2022–23 వార్షిక బడ్జెట్ దోహదపడుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈ) పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో నెలకొన్న సంక్లిష్ట ప్రక్రియను సరళతరం చేయడం జరిగిందని, రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రక్రియ మరింత క్రమబద్ధీకరిణ జరుగుతుందని ఆయన తెలిపారు. స్వాతంత్య్ర సముపార్జనకు సంబంధించి శతాబ్ది ఉత్సవాలను జరుపుకునే 2047లో భారత్ సమోన్నత స్థితి లక్ష్యంగా 2022–23 బడ్జెట్ రూపకల్పన జరిగిందని అన్నారు. అప్పటికి భారత్ అన్ని సాంకేతిక విభాగాల్లో అగ్ర స్థానంలో ఉంటుందని, వృద్ధి ప్రయోజనాలు ప్రజలందరికీ ప్రత్యేకించి నిరుపేదలకూ అందుబాటులోకి వస్తాయని రాజీవ్ కుమార్ తెలిపారు. మౌలిక పరిశ్రమల నుంచి అభివృద్ధిలోకి వస్తున్న రంగాల వరకూ పటిష్ట పురోగతి, సాంకేతికాభివృద్ధి తాజా బడ్జెట్ ప్రధాన లక్ష్యాలని తెలిపారు. పన్ను కోతల రూపంలో మధ్య తరగతికి ఎటువంటి ప్రయోజనాలూ కల్పించలేదన్న విమర్శకు సమాధానమిస్తూ ఈ విషయంలో ప్రస్తుత రేట్లు సజావుగానే ఉన్నాయని రాజీవ్ కుమార్ అన్నారు. -
కొత్త సెజ్ చట్టంతో బహుళ ప్రయోజనాలు
న్యూఢిల్లీ: బడ్జెట్లో ప్రతిపాదిత ప్రత్యేక ఆర్థిక జోన్ల (సెజ్) కొత్త చట్టం ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు అనుగుణంగా ఉంటుందని వాణిజ్య కార్యదర్శి బీవీఆర్ సుబ్రమణ్యం పేర్కొన్నారు. ప్రత్యేక ఆర్థిక జోన్లకు సంబంధించి ప్రస్తుత చట్టం స్థానంలో తీసుకువస్తున్న కొత్త చట్టంతో వ్యవస్థలో అన్ని అనుమతులు, విధి విధానాలు, కార్యకలాపాలు సింగిల్ విండో కింద జరుగుతాయని, అంతర్జాతీయ స్థాయిలో మౌలిక రంగం పురోగతికి కొత్త చట్టం దోహదపడుతుందని ఆయన అన్నారు. సెజ్లను నియంత్రించే ప్రస్తుత చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం మంగళవారం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. డెవలప్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అండ్ సర్వీస్ హబ్స్(డీఈఎస్హెచ్)లో రాష్ట్రాలను భాగస్వాములు చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ప్రస్తుత సెజ్ యాక్ట్ను 2006లో తీసుకువచ్చారు. ఎగుమతుల పెరుగుదల, మౌలిక రంగం పురోగతి, ఉపాధి కల్పన ఈ చట్టం ప్రధాన లక్ష్యం. అయితే కనీస ప్రత్యామ్నాయ పన్ను విధింపు, పన్ను ప్రోత్సాహకాల తొలగింపు వంటి చర్యల తర్వాత ఈ జోన్ల ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. కొత్త చట్టంతో తిరిగి సెస్లకు బహుళ ప్రయోజనాలు ఒనగూరుతాయని, దేశాభివృద్ధిలో కీలక పాత్రను పోషిస్తాయని సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు. సెజ్ 2.0 ముసాయిదా యాక్ట్ తయారీ పక్రియలో ఉందని, వచ్చే కొద్ది నెలల్లో ప్రస్తుత సెజ్ యాక్ట్ స్థాయిలో ఇది అమల్లోకి వచ్చే చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం భారత్ ఎగుమతుల్లో దాదాపు 20 శాతం సెజ్ల వాటా కావడం గమనార్హం. -
‘ఆత్మనిర్భర్’ పునాదిపై దేశ నిర్మాణం
న్యూఢిల్లీ: దేశంలోని పేద, మధ్య తరగతితోపాటు యువతకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్ర బడ్జెట్ ప్రధానంగా దృష్టి పెట్టినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. భారత్ స్వయం సమృద్ధి సాధించిన దేశంగా నిలవడం చాలా ముఖ్యమని అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో ‘ఆత్మనిర్భర్ అర్థవ్యవస్థ’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. కోవిడ్–19 అనంతరం నూతన ప్రపంచం ఆవిష్కృతం కానుందని, ఆ దిశగా ఇప్పటికే సంకేతాలు వెలువడుతున్నాయని పేర్కొన్నారు. భారత్ పట్ల ప్రపంచ దేశాల ధోరణిలో పెద్ద మార్పు రాబోతోందని వెల్లడించారు. భారత్ను బలమైన, సాధికార దేశంగా చూడాలని ప్రపంచం కోరుకుంటోందని వ్యాఖ్యానించారు. సరిహద్దు ప్రాంతాల యువతకు ఎన్సీసీ శిక్షణ ‘భవ్యమైన గ్రామాల కార్యక్రమం’తో ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, లద్దాఖ్లోని సరిహద్దు గ్రామాలకు ఎంతో ప్రయోజనం చేకూరనుందని అన్నారు. అలాంటి ప్రాంతాల్లోని యువతకు నేషనల్ క్యాడెట్ కారŠప్స్(ఎన్సీసీ) శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని, వారు సైనిక దళాల్లో చేరేందుకు ఈ శిక్షణ తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయ కోణాన్ని పక్కనపెడితే, 2022–23 కేంద్ర బడ్జెట్ను అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారని ప్రధాని మోదీ తెలిపారు. పేదల కోసం మరో 80 లక్షల ఇళ్లు 80 లక్షల పక్కా ఇళ్ల నిర్మాణానికి తాజా బడ్జెట్లో రూ.48,000 కోట్లు కేటాయించామన్నారు. ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ఇది కూడా ఒక మార్గమేనని చెప్పారు. పవిత్ర గంగా నది తీరం వెంట 2,500 కిలోమీటర్ల మేర సహజ వ్యవసాయ నడవా(కారిడార్)ను బడ్జెట్లో ప్రతిపాదించినట్లు నరేంద్ర మోదీ పేర్కొన్నారు. త్వరలోనే దేశవ్యాప్తంగా ప్రతి గ్రామానికి అప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ అందుబాటులోకి రాబోతోందని తెలిపారు. 5జీ టెక్నాలజీ రాకతో కొత్త యుగంలోకి అడుగు పెట్టబోతున్నామని హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుత సీజన్లో వరి పండించే రైతులు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) కింద రూ.1.5 లక్షల కోట్లు పొందనున్నారని వెల్లడించారు. సమతుల్య అభివృద్ధి కావాలి గత ఏడేళ్లుగా తాము తీసుకుంటున్న నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగానే ఉంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఏడేనిమిదేళ్ల క్రితం భారత్ జీడీపీ రూ.1.10 లక్షల కోట్లు కాగా, ఇప్పుడు రూ.2.3 లక్షల కోట్లకు ఎగబాకిందని గుర్తుచేశారు. సామాజిక న్యాయాన్ని సాధించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, అందుకోసమే నిరంతరం పని చేస్తున్నామని వివరించారు. దేశ సంక్షేమానికి సామాజిక న్యాయం తరహాలోనే సమతుల్య అభివృద్ధి చాలా కీలకమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. -
పాతవే.. పట్టాలెక్కాయ్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో రైల్వేకు సంబంధించి రాష్ట్రానికి గతేడాది కంటే మెరుగ్గా నిధులు అందబోతున్నాయి. రైల్వే ప్రాజెక్టుల కోసం దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని తెలంగాణ ప్రాంతానికి ఈసారి రూ.3,048 కోట్లు ప్రతిపాదించారు. ఇది గతేడాది కేటాయింపులకన్నా 26 శాతం ఎక్కువ కావటం విశేషం. గత బడ్జెట్లో జోన్ మొత్తానికి కలిపి రూ.7,222 కోట్లు, ఇందులో రాష్ట్రానికి రూ.2,420 కోట్లు కేటాయించారు. బడ్జెట్లో రైల్వేకు నిధుల కేటాయింపు వివరాలను వెల్లడించే పింక్బుక్ను పార్లమెంటులో బుధవారం పొద్దుపోయిన తర్వాత ప్రవేశపెట్టారు. ఆ వివరాలను రైల్వే శాఖ రాత్రి వెబ్సైట్లో పొందుపరిచింది. ప్రాజెక్టుల వారీగా కేటాయింపుల వివరాల సమగ్ర సమాచారం గురువారం అధికారికంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించనున్నారు. పనులు జరుగుతున్న ప్రాజెక్టులకు ప్రాధాన్యం కొన్నేళ్లుగా కొత్త రైళ్లను మోదీ సర్కారు పెద్దగా ప్రకటించకున్నా ప్రాజెక్టులకు కొంత సంతృప్తికరంగానే నిధులు కేటాయిస్తోంది. ఈసారీ అదే పంథాను కొనసాగించినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తే తర్వాత ఇచ్చే నిధులు వేటికీ న్యాయం చేయలేమని ప్రధాని చెప్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా పనులు జరుగుతున్న ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చింది. వీటితో వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు ప్రాజెక్టులు పూర్తి కానుండగా మరికొన్ని వేగంగా పనులు జరుపుకొనేందుకు వీలుపడనుంది. బుధవారం రాత్రి వరకు ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ప్రధాన ప్రాజెక్టులకు కేటాయింపులు ఇలా ఉన్నాయి. మునీరాబాద్–మహబూబ్నగర్: రూ.210 కోట్లు ఇది 1997–98లో మంజూరైంది. నిడివి 243 కిలోమీటర్లు. అంచనా వ్యయం రూ.1,723 కోట్లు. ఇందులో తెలంగాణ పరిధిలో 66 కిలోమీటర్లు ఉంది. దీనికయ్యే వ్యయం రూ.452 కోట్లు. గత బడ్జెట్లో రూ.149 కోట్లు కేటాయించారు. దేవరకద్ర–మక్తల్ మధ్య లైన్ అందుబాటులోకి రాగా కృష్ణా–మక్తల్ మధ్య చివరి దశలో ఉన్నాయి. భద్రాచలం–సత్తుపల్లి: రూ.162 కోట్లు ఈ ప్రాజెక్టు 2010–11లో మంజూరైంది. నిడివి 54 కిలోమీటర్లు. అంచనా వ్యయం రూ.704 కోట్లు, సింగరేణితో కలిసి బొగ్గు రవాణాకు ప్రత్యేకంగా రైల్వే ఈ పనులు చేస్తోంది. భద్రాచలం–చుండ్రుగొండ మధ్య 25 కిలోమీటర్లు పనులు ఇటీవలే పూర్తయ్యాయి. గత బడ్జెట్లో రూ.267 కోట్లు కేటాయించారు. వాటితో పనులు వేగంగా సాగుతున్నాయి. తుది దశకు చేరుకున్నాయి. కాజీపేట–బల్లార్షా మూడోలైన్: రూ.548 కోట్లు ఈ ప్రాజెక్టు 2015–16లో మంజూరైంది. నిడివి 202 కిలోమీటర్లు. అంచనా వ్యయం రూ.2,063 కోట్లు. పోత్కపల్లి–కొలనూర్ మధ్య, వీరూరు–మానిక్ఘర్ సెక్షన్ల మధ్య పనులు పూర్తయ్యాయి. గత బడ్జెట్లో రూ.475 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటికి 50 కిలోమీటర్ల పనులు పూర్తికాగా మిగతా సెక్షన్లలో పనులు పనులు వేగంగా సాగుతున్నాయి. అక్కన్నపేట–మెదక్: రూ.41 కోట్లు 2012–13లో మంజూరైన ఈ ప్రాజెక్టు నిడివి 17 కిలోమీటర్లు. అంచనా వ్యయం రూ.118 కోట్లు. ఇందులో సగం ఖర్చు రాష్ట్రప్రభుత్వం భరించాలి. గత బడ్జెట్లో రైల్వే రూ.83.6 కోట్లు కేంద్రం కేటాయించింది. ప్రస్తుతం పనులు దాదాపు పూర్తయ్యాయి. రాష్ట్రం వాటా నిధులు పెండింగ్లో ఉండటంతో వాటి కోసం రైల్వే అడుగుతోంది. ఈసారి పెద్దగా నిధులు కేటాయించే అవకాశం లేదు. మనోహరాబాద్–కొత్తపల్లి: రూ.160 కోట్లు ఈ ప్రాజెక్టు 2006–07లో మంజూరైంది. నిడివి 151 కిలోమీటర్లు. అంచనా వ్యయం రూ.1,160 కోట్లు. మూడొంతుల ఖర్చు రైల్వే భరించనుండగా ఒక వంతు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. భూ సేకరణ వ్యయం తెలంగాణదే. ఇప్పటికే 50 కిలోమీటర్ల లైన్ పనులు పూర్తయ్యాయి. ఇందులో మనోహరాబాద్–గజ్వేల్ వరకు 32 కిలోమీటర్ల మేర పనులకు గతంలోనే రైల్వే సేఫ్టీ కమిషనర్ క్లియరెన్స్ వచ్చింది. మిగతా పనులు వేగంగా సాగుతున్నాయి. గత బడ్జెట్లో దీనికి రైల్వే రూ.325 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం కుకునూరు పల్లి వద్ద ట్రాక్ పరిచే పనులు జరుగుతున్నాయి. చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్: రూ.69 కోట్లు ఈ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. రూ.110 కోట్లకు సంబంధించిన టెండర్లు పిలిచి పనులు అప్పగించటంతో 6 ప్లాట్ ఫామ్స్, 5 పిట్ లైన్స్ పనులు జరుగుతున్నాయి. గత బడ్జెట్లో కూ.50 కోట్లు కేటాయించారు. ఎలక్ట్రిఫికేషన్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. రాష్ట్ర వాటా ఇస్తేనే ఎంఎంటీఎస్–2 దశ ఈ ప్రాజెక్టు విషయంలో రైల్వే–రాష్ట్ర ప్రభుత్వం మధ్య పేచీ నెలకొంది. ఇది నగరంలో కీలకమైంది. ఎంఎంటీఎస్ మొదటి దశ విజయవంతం కావటంతో 2012–13లో ఈ ప్రాజెక్టు మంజూరైంది. అంచనా వ్యయం రూ.817 కోట్లు. మూడో వంతు రూ.450 కోట్లకు గాను రాష్ట్రప్రభుత్వం దశలవారీగా> రూ.130 కోట్లనే విడుదల చేసింది. తాము ఖర్చు చేయాల్సిన దానికన్నా ఎక్కువగా రైల్వే ఇప్పటికే వ్యయం చేసినందున రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇస్తేనే పనులు ముందుకు సాగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గత బడ్జెట్లో రూ.10 కోట్లే కేటాయించింది. ఘట్కేసర్–యాదాద్రి ఎంఎంటీఎస్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. రాష్ట్రం నిధులివ్వక పనులు సాగట్లేదు. రాష్ట్రం బకాయి పడటంతో తాజా బడ్జెట్లో కేంద్రం నిధులివ్వలేదని సమాచారం. కాజీపేట ఓవర్ హాలింగ్ వర్క్షాప్ సంగతేంటి? కీలకమైన కాజీపేట పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్షాపు ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి రైల్వేకు అధికారికంగా భూ బదలాయింపు జరగలేదు. అది జరిగితేగాని పనులు చేపట్టలేనని రైల్వే ఇప్పటికే చెప్పింది. భూ బదలాయింపులో రాష్ట్రం చొరవ చూపితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనులు జరిగే అవకాశముంది. గత బడ్జెట్లో నామమాత్రంగా రూ. 2 కోట్లే దీనికి మంజూరయ్యాయి. ఈసారీ ప్రతిష్టంభన నెలకొంది. కాజీపేట–విజయవాడ మూడోలైన్: రూ.590 కోట్లు ఈ ప్రాజెక్టు(2012–13) నిడివి 219 కి.మీ. అంచనా వ్యయం రూ.1,857 కోట్లు. విజయవాడ–కొండపల్లి మధ్య పనులు దాదాపు పూర్తయ్యాయి. మిగతాచోట్ల జరుగుతున్నాయి. గత బడ్జెట్లో రూ.333 కోట్లు మంజూరయ్యాయి. సికింద్రాబాద్–మహబూబ్నగర్ డబ్లింగ్: రూ.150 కోట్లు ఈ ప్రాజెక్టు 2015–16లో మంజూరైంది. నిడివి 85 కిమీ. అంచనా వ్యయం రూ.774 కోట్లు. షాద్నగర్–గొల్లపల్లి మధ్య పూర్తి కాగా, గొల్లపల్లి–మహబూబ్నగర్ మధ్య త్వరలో పూర్తి కానున్నాయి. గత బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించారు. -
కేంద్ర బడ్జెట్ 2022: మీకు ఈ విషయాలు తెలుసా..
మళ్లీ కేంద్ర బడ్జెట్ వచ్చేసింది. కేంద్రం ఎవరెవరికి ఉపశమనం కలిగిస్తుంది, ఎవరిపై భారం పెరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. ఇప్పుడేకాదు ఏటా బడ్జెట్ వచ్చిందంటే ఉత్కంఠగానే ఉంటుంది. అయితే బడ్జెట్లో లెక్కలే కాకుండా.. మరెన్నో విశేషాలు కూడా ఉంటుంటాయి. అలాంటి కొన్ని విశేషాలు తెలుసుకుందామా? నెహ్రూ.. ఇందిర.. రాజీవ్ 1958లో అప్పటి ఆర్థికమంత్రి టి.టి.కృష్ణమాచారి రాజీనామా చేసినప్పుడు, జవహర్లాల్ నెహ్రూ బడ్జెట్ను సమర్పించి అలా చేసిన మొదటి ప్రధానమంత్రిగా నిలిచారు. 1970లో ఇందిరాగాంధీ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అప్పటి ఆర్థికమంత్రి మొరార్జీ దేశాయ్ రాజీనామా చేసి ఉన్నారు. 1987–88లో ఆర్థికమంత్రి వీపీ సింగ్ రాజీనామా చేసినప్పుడు, అప్పటి ప్రధాని రాజీవ్గాంధీ బడ్జెట్ను సమర్పించారు. తెల్లారింది లేవండోయ్.. 2000 సంవత్సరం వరకు, ఫిబ్రవరి నెల చివరి పనిదినం సాయంత్రం 5 గంటలకు బడ్జెట్ను సమర్పించేవారు. అయితే, అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా బడ్జెట్ సమర్పణ సమయాన్ని ఉదయం 11 గంటలకు, సభలో మొదటి కార్యక్రమంగా మార్చారు. 2014లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ను సమర్పించినప్పుడు, 2.5 గంటలపాటు సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగం చేశారు. దీనిని బడ్జెట్ సమర్పణలలో సుదీర్ఘ ప్రసంగాలలో ఒకటిగా పరిగణిస్తారు. రైల్వేను కలిపేశారు.. 2017 వరకు, ప్రతి సంవత్సరం రెండు వేర్వేరు బడ్జెట్లు సమర్పించేవారు. ఆర్థిక బడ్జెట్ను ఆర్థికమంత్రి, రైల్వే బడ్జెట్ను రైల్వే మంత్రి సమర్పించడం ఆనవాయితీగా ఉండేది. నరేంద్రమోదీ ప్రభుత్వం రెండు బడ్జెట్లను కలిపి ఉమ్మడి బడ్జెట్ను తీసుకొచ్చింది. 2017లో అప్పటి ఆర్థికమంత్రి అరుణ్ జైటీ తొలి ఉమ్మడి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొదటి బడ్జెట్కు 162 ఏళ్లు.. మొదట్లో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ పాలనలో ఉన్న మన దేశాన్ని.. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటన్ నేరుగా పాలించడం మొదలుపెట్టింది. ఆ సమయంలోనే మన దేశానికంటూ మొదటిసారిగా 1860 ఏప్రిల్ 7న బడ్జెట్ ప్రవేశపెట్టారు. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం తరఫున స్కాటిష్ ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు జేమ్స్ విల్సన్ ఆ బడ్జెట్ రూపొందించి, బ్రిటిష్ పార్లమెంట్కు సమర్పించారు. స్వాతంత్య్ర భారతంలో 1947 నవంబర్ 26న అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముగం శెట్టి తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రహస్యంగా..ప్రింటింగ్నే మార్చేసి కేంద్ర బడ్జెట్ రూపకల్పన, పత్రాల ముద్రణ అత్యంత రహస్యంగా సాగుతుంది. బడ్జెట్లోని అంశాలు ముందే తెలిస్తే.. ఎవరైనా వాటిని మార్చేలా ప్రభావితం చేయడానికి వీలు ఉంటుందన్నదే దీనికి కారణం. అందుకే బడ్జెట్ పత్రాలను ముద్రించినన్ని రోజులు సిబ్బంది ఎవరినీ బయటికి వెళ్లనివ్వరు. 1950 వరకు రాష్ట్రపతి భవన్లో బడ్జెట్ పత్రాలు ముద్రించేవారు. ఆ ఏడాది బడ్జెట్ రహస్యాలు ముందే లీకవడంతో ముద్రణను ఢిల్లీలోని మింట్ రోడ్లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్కు మార్చారు. 1980 నుంచి కేంద్ర ఆర్థికశాఖ కార్యాలయం ఉండే నార్త్బ్లాక్లో బడ్జెట్ పత్రాలను ముద్రిస్తున్నారు. -
ఈ బడ్జెట్లు స్వతంత్ర భారతంలో వెరీ స్పెషల్..
స్వతంత్ర భారతంలో 76 ఏళ్లుగా ఏటా బడ్జెట్ ప్రవేశపెడుతూనే ఉన్నారు. కానీ కొన్ని బడ్జెట్లు మాత్రం ఎంతో ప్రత్యేకం. ఆయా సందర్భాలుగానీ, బడ్జెట్లలో చేర్చే కీలక అంశాలుగానీ దీనికి కారణం. అలాంటి బడ్జెట్లు ఏమిటో చూద్దామా? బ్లాక్ బడ్జెట్ 197374లో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న యశ్వంత్రావు చవాన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ను ‘బ్లాక్ బడ్జెట్’గా వ్యవహరిస్తారు. అప్పటికే కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో.. 550 కోట్ల ఆర్థిక లోటుతో ఆ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇప్పటి లెక్కల్లో ఈ మొత్తం తక్కువే అనిపిస్తున్నా.. నాటి పరిస్థితుల ప్రకారం.. భారీ లోటు అన్నమాట. క్యారట్ – స్టిక్ ఓ వైపు తాయిలాలు ఇస్తూనే.. మరోవైపు బెత్తంతో అన్నింటినీ నియంత్రణలోకి తెచ్చుకునే లక్ష్యంతో 1986లో కాంగ్రెస్ ఆర్థిక మంత్రి వీపీ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్నే ‘క్యారట్ అండ్ స్టిక్ బడ్జెట్’గా పిలుస్తారు. దేశంలో లైసెన్స్రాజ్ వ్యవస్థకు మంగళం పాడేదిశగా చర్యలు ఈ బడ్జెట్లోనే మొదలయ్యాయి. అంతేకాదు పన్నులపై మళ్లీ పన్నులు పడుతూ పెరిగిపోయే భారం నుంచి ఉపశమనం కలిగించేందుకు ‘మోడిఫైడ్ వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ క్రెడిట్’ను అమల్లోకి తెచ్చారు. అదే సమయంలో స్మగ్లర్లు, బ్లాక్ మార్కెటింగ్ చేసేవారు, పన్నులు ఎగ్గొట్టేవారిపై కఠిన చర్యల కోసం ప్రత్యేక డ్రైవ్ను చేపట్టారు. ప్రగతి బడ్జెట్ ఒక రకంగా ఆధునిక భారతదేశ చరిత్రనే మార్చినదిగా చెప్పుకొనేది 1991 బడ్జెట్. మన దేశం ఆర్థిక సంక్షోభం అంచున ఉండి, రోజువారీ వ్యవహారాల కోసం బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితుల్లో.. పీవీ నర్సింహారావు ప్రభుత్వంలో మన్మోహన్సింగ్ ఆర్థిక మంత్రిగా విప్లవాత్మక సంస్కరణలతో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. లైసెన్స్రాజ్ వ్యవస్థకు పూర్తిగా మంగళం పాడుతూ.. స్వేచ్ఛాయుత వ్యాపారానికి దారులు తెరిచారు. ఎగుమతులను పెంచేందుకు భారీగా పన్నులు తగ్గించారు. కలల బడ్జెట్ వ్యాపారస్తుల నుంచి సామాన్యుల వరకు కలలుగనేది పన్నుల తగ్గింపు, సులువుగా వ్యాపార, వాణిజ్యాలు చేసుకునే అవకాశమే. అలా అందరి ఆశలు తీర్చినది 1997–98 బడ్జెట్. కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టిన ఆ బడ్జెట్లో ఎన్నో సంస్కరణలను అమల్లోకి తెచ్చారు. ఆదాయపన్నులో మార్పులు చేశారు. గరిష్ట శ్లాబును 40శాతం నుంచి 30 శాతానికి తగ్గించారు. దేశీయ కంపెనీలకు పన్నును 35 శాతానికి తగ్గించారు. స్వచ్ఛందంగా నల్లధనాన్ని వెల్లడించే పథకాన్ని ప్రకటించారు. కస్టమ్స్ డ్యూటీని ఏకంగా 40 శాతానికి తగ్గించి, ఎగుమతులు–దిగుమతులు ఊపందుకోవడానికి బాటలు వేశారు. ‘మిలీనియం’ ఐటీరంగంలో ప్రస్తుతం మన దేశం ప్రపంచంలోనే కీలకమైన స్థానంలో ఉంది. అలాంటి సాంకేతికతకు ప్రాధాన్యమిచ్చినదే 2000లో యశ్వంత్సిన్హా ప్రవేశపెట్టిన ‘మిలీనియం బడ్జెట్’. అందులో సాఫ్ట్వేర్ ఎగుమతులకు భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించారు. కంప్యూటర్లు, సంబంధిత ఉపకరణాలపై దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించారు. ‘రోల్బ్యాక్’ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏదైనా ప్రతిపాదన చేసిందంటే.. దాదాపుగా దాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్టేనని ఆర్థిక నిపుణులు చెప్తుంటారు. అలాంటిది యశ్వంత్సిన్హా ప్రవేశపెట్టిన 2002–03 బడ్జెట్లోని చాలా అంశాలపై.. అప్పటి వాజ్పేయి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కొన్ని ప్రతిపాదనలనైతే మొత్తంగా వెనక్కి తీసుకుంది. అందుకే ఈ బడ్జెట్ను ‘రోల్బ్యాక్ బడ్జెట్’గా పిలుస్తుంటారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
వాహనదారులకు షాకింగ్ న్యూస్..!
ఎన్నో అంచనాల మధ్య ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామణ్ బడ్జెట్-2022ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ కొంతమందికి ఊరటను కల్పించిన మరికొందరికీ తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఇక ప్రతిపక్షాలు బడ్జెట్పై తీవ్ర విమర్శలను చేశాయి. బడ్జెట్లో పెట్రోల్, డిజీల్పై తీసుకున్న నిర్ణయం మరోసారి వాహనదారులకు షాక్ తగలనుంది. దీంతో పెట్రోల్, డిజీల్ ధరలు లీటర్కు రూ. 2 పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కారణం అదే..! పెంపు అప్పటి నుంచే..! ఇథనాల్ లేదా బయోడీజిల్ మిశ్రమం లేకుండా విక్రయించే పెట్రోలియం ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించాలనే ప్రతిపాదనను బడ్జెట్ 2022లో పొందుపరిచారు. దీంతో అన్బ్లెండెడ్ ఫ్యూయల్పై లీటరుకు రూ. 2 పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనతో చాలా ప్రాంతాల్లో 2022 అక్టోబర్ 1 నుంచి డీజిల్పై అదనపు బాదుడును కేంద్రం విధించనుంది. అయితే ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా కొన్ని ప్రాంతాలలో పెట్రోలు ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఉద్గారాలను తగ్గించేందుకు..! మిక్స్డ్ పెట్రోల్, డీజిల్ను వాడడంతో తక్కువ స్థాయిలో ఉద్గారాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 2022-23 బడ్జెట్లో నాన్-బ్లెండెడ్ ఇంధనాలపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 90 డాలర్లు దాటిన బ్యారెట్ క్రూడ్ ఆయిల్..! అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు రయ్మంటూ పెరిగిపోతున్నాయి. 2014 తరువాత బ్యారెల్ బ్రెంట్ ముడిచమురు ధర ఏకంగా 90 డాలర్లకు చేరుకుంది.ఏడేళ్ల గరిష్ట స్థాయికి బ్యారెల్ చమురు ధరల పెంపుకు పలు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులే కారణంగా ఉన్నాయి. ఐరోపా, మధ్యప్రాచ్యంలోని భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు చమురు మంటలకు ప్రధాన కారణంగా ఉన్నాయి. వీటితో పాటుగా డిమాండ్ కంటే చమురు సరఫరా తక్కువగా ఉంది. క్రూడ్ ఆయిల్ ధరలు 90 డాలర్లకు చేరిన భారత్లో ఇప్పటివరకు ఇంధన ధరల్లో మార్పు రాకపోవడం విశేషం. చదవండి: తలనొప్పిగా మారనున్న రష్యా-ఉక్రెయిన్ టెన్షన్..! ఇంధన ధరలు రయ్ అంటూ..! -
మనకు తెలిసిన పెద్ద నోటు 2,000.. మరి ప్రపంచంలో పెద్ద నోటేంటో తెలుసా..?
బడ్జెట్ అంటేనే డబ్బుల లెక్కలు.. అంటే మనకు గుర్తొచ్చేవి కరెన్సీ నోట్లు, నాణేలే. నాగరికతలు అభివృద్ధి చెందిన మొదట్లో డబ్బులనేవే లేవు. ఓ వస్తువు ఇవ్వడం, బదులుగా మరో వస్తువు తీసుకోవడమే. ఆ తర్వాత బంగారం, వెండి, రాగి, ఇతర లోహాలతో చేసిన నాణేలు కరెన్సీగా అమల్లోకి వచ్చాయి. కాగితాన్ని కనిపెట్టాక నోట్లు మొదలయ్యాయి. అందులోనూ ఏ దేశానికి ఆ దేశం నచ్చినట్టుగా కరెన్సీ నోట్లు, నాణేలను తయారు చేసుకుంటూ వస్తున్నాయి. మరి ఈ కరెన్సీలో కొన్ని చిత్రాలేమిటో చూద్దామా..? స్టాంపు కాదు డబ్బులే.. ప్రపంచంలోనే ఇప్పటివరకు అధికారికంగా చలామణీ అయిన అతిచిన్న కరెన్సీ నోటు.. రొమేనియా దేశానికి చెందిన ‘10 బని’. 1917లో ముద్రించిన ఈ కరెన్సీనోటు పరిమాణం 4.4 సెంటీమీటర్ల ఎత్తు, 3.3 సెంటీమీటర్ల వెడల్పు మాత్రమే. అంటే కాస్త పెద్ద సైజు స్టాంపు అంత అన్నమాట. సాధారణంగా కరెన్సీ నోట్లు తక్కువ ఎత్తుతో, ఎక్కువ వెడల్పుతో అడ్డంగా ఉంటాయి. కానీ దీని ఎత్తు ఎక్కువ, వెడల్పు తక్కువ. ఇంకో విశేషం ఏమిటంటే.. ఈ నోట్లకు నకిలీలను తయారు చేస్తే పదేళ్లు జైల్లో వేస్తామని ఆ నోటుపైనే ముద్రించారు. చదవండి: (బడ్జెట్ ఇంగ్లిష్లోనే ఎందుకు?) సర్టిఫికెట్ సైజులో లక్ష నోటు... ఈ ఫొటోలో ఓ సర్టిఫికెట్ అంత పెద్దగా కనిపిస్తున్నది ఫిలిప్పీన్స్కు చెందిన లక్ష పెసోల కరెన్సీ నోటు. ఆ దేశానికి స్పెయిన్ నుంచి స్వాతంత్య్రం వచ్చి 300 ఏళ్లయిన సందర్భంగా.. 1998లో 14 అంగుళాల పొడవు, 8.5 అంగుళాల వెడల్పుతో ఈ నోటును విడుదల చేసింది. ప్రపంచంలో అధికారికంగా చెలామణిలో ఉన్న అతిపెద్ద కరెన్సీ నోటు ఇదే. కోటి కోట్ల కోట్లు.. ఒక్క నోటు మామూలుగా మనం చూసే పెద్ద నోట్లు అంటే ఏంటి? ఐదు వందలు, రెండు వేలే కదా. ఒకప్పుడు పదివేల నోటు కూడా ఉండేది. మరి ప్రపంచంలో ఇలా అత్యధిక డినామినేషన్ ఉన్న నోటు ఏదో తెలుసా..? హంగరీ దేశానికి చెందిన ‘కోటి కోట్ల కోట్లు (100 మిలియన్ బిలియన్)’ పెంగో నోటు. అంటే ఒకటి పక్కన 20 సున్నాలు పెడితే వచ్చే సంఖ్య అది. 1946లో రెండో ప్రపంచ యుద్ధంలో బాగా దెబ్బతిన్న హంగరీలో ధరలు పెరిగిపోయి ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటింది. దాంతో ఈ నోటును విడుదల చేశారు. 2008లో జింబాబ్వేలో ధరలు, ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో.. అక్కడి ప్రభుత్వం ఏకంగా కోటి కోట్ల (హండ్రెడ్ ట్రిలియన్) జింబాబ్వే డాలర్ల నోట్లను విడుదల చేసింది. పోకెమాన్.. డాలర్ మిక్కీమౌస్.. 2 డాలర్లు సాధారణంగా ఏ దేశమైనా తమ నాణేలపై ప్రముఖులు, తమ దేశ ప్రత్యేకతలు వంటివాటిని ముద్రిస్తుంటుంది. కానీ నియూ మాత్రం చిత్రంగా స్టార్వార్స్, పోకెమాన్, మిక్కీమౌస్, చివరికి ఇటీవలి ఫ్రాజెన్ వంటి యానిమేటెడ్ క్యారెక్టర్లను కాయిన్లపై ముద్రిస్తోంది. పసిఫిక్ సముద్రం మధ్యలో చిన్న దీవి అయిన నియూ.. న్యూజిలాండ్ పర్యవేక్షణలో స్వతంత్ర దేశంగా కొనసాగుతోంది. ‘నియూ డాలర్స్’గా పిలిచే ఈ కరెన్సీ అధికారికంగా చెల్లుబాటు అవుతుంది కూడా. -
హైదరాబాద్ టు ఢిల్లీ ‘వందేభారత్’.. పింక్ బుక్లో ఏముందో..
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి వందేభారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా వివిధ ప్రాంతాలకు వందేభారత్ పరుగులు పెట్టనుంది. దేశవ్యాప్తంగా 400 వందేభారత్ రైళ్లకు కేంద్రం ఈ బడ్జెట్లో పచ్చజెండా ఊపిన నేపథ్యంలో గతంలోనే ప్రతిపాదించినట్లుగా హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ, సికింద్రాబాద్–ముంబయి, కాచిగూడ–బెంగళూర్ నగరాల మధ్య వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉందని రైల్వే వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు గతంలో ప్రతిపాదించిన 100 రైళ్లు కాకుండా ఈ బడ్జెట్లో మరో 400 రైళ్లను కేంద్రం కొత్తగా ప్రకటించడం గమనార్హం. చదవండి: (భారత గడ్డపై తొలి బడ్జెట్కు 162 ఏళ్లు..) పింక్ బుక్లో ఏముందో.. ►వందేభారత్ మినహా కొత్త రైళ్లు లేనట్లే. సికింద్రాబాద్ నుంచి విశాఖ, తిరుపతి, షిరిడీ, శబరి, తదితర ప్రాంతాలకు కొత్త రైళ్లకు డిమాండ్ ఉన్నప్పటికీ కొత్తగా రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం లేదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. సరుకు రవాణా టర్మినళ్లపై కూడా పింక్బుక్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ►మరోవైపు ఇప్పటికే కొనసాగుతున్న కొత్త లైన్ల నిర్మాణం, ఎంఎంటీఎస్ రెండోదశ, యాదాద్రికి ఎంఎంటీఎస్, చర్లపల్లి రైల్వే టర్మినల్ విస్తరణ తదితర పనులకు ఏ మేరకు నిధులు విడుదలవుతాయనేది పింక్బుక్ వస్తే తప్ప తెలిసే అవకాశం లేదు. ►వందేభారత్ రైళ్లపై కూడా కచ్చితమైన అంచనాలు ఉన్నప్పటికీ ఏయే రూట్లలో ఎప్పటి నుంచి ప్రవేశపెడుతారనేది పింక్బుక్లోనే తేలనుంది. చదవండి: (బడ్జెట్ ఇంగ్లిష్లోనే ఎందుకు?) -
డిజిటల్ చెల్లింపులు.. అంత ఈజీనా?
ఈసారి కేంద్ర బడ్జెట్ డిజిటల్ మంత్రం జపించింది. అన్నింటా ఆధునికత ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా డిజిటల్ చెల్లింపులు, పేపర్ లెస్ పేమెంట్స్ ప్రక్రియ వేగవంతం చేసేలా పలు నిర్ణయాలు ప్రకటించింది. అయితే సరైన మౌలిక సదుపాయలు లేకుండా ప్రభుత్వం కంటోన్న డిజిటల్ కల నెరవేరుతుందా? డిజిటల్ ఇండియా లక్క్ష్యంగా చేసుకునే కేంద్రం బడ్జెట్ 2022-23ని ప్రవేశపెట్టిందనే విషయం ఇట్టే తెలిసిపోతోంది. డిజిటల్ చెల్లింపులు, డిజిటల్ బ్యాంకింగ్కు మరింత ప్రోత్సాహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నోట్ల రద్దు తర్వాత డిజిటల్ భారత్లో భాగంగా మొదలైన కాంటాక్ట్ లెస్ చెల్లింపుల వ్యవహారం.. కరోనా టైంలో ‘నోట్ల ద్వారా వైరస్ వ్యాప్తి’ కారణంగా ఎవరూ ఊహించని స్థాయికి చేరుకుంది. 2016లో డిజిటల్ పేమెంట్స్ 61 బిలియన్ డాలర్లు ఉండగా 2021 నాటికి అది ఏకంగా 300 బిలియన్ డాలర్లకి చేరుకుంది. టీ కొట్టు నుంచి.. డిజిటల్ పేమెంట్స్కి సంబంధించి ప్రభుత్వ లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోవడంలో స్టార్టప్లు కీలకంగా మారాయి. పేటీఎం, ఫోన్పే వంటి స్టార్టప్లు టీ స్టాల్, పాన్ డబ్బా నుంచి ఫైవ్స్టార్ హోటళ్ల వరకు చెల్లింపులు, కరెంటు బిల్లులు, ఫోన్ రీచార్జ్ ఆన్లైన్లో చేస్తూ డిజిటల్ పేమెంట్ వ్యవస్థను బలోపేతం చేశాయి. డిజిటల్ పేమెంట్స్లో ప్రస్తుతం కొనసాగుతున్న బూమ్ 2026 నాటికి ఏకంగా వన్ ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. అయితే అప్పటికీ ఇండియాలో జరిగే పేపర్ లెస్ లావాదేవీల్లో ఈ వన్ ట్రిలియన్ వాటా కేవలం 30 శాతమే అని రీసెర్చ్ సంస్థ సీఎల్ఎస్ఏ చెబుతోంది. మందకొడిగా.. ప్రైవేటు సెక్టార్లో త్వరితగతిన డిజిటల్ పేమెంట్స్ జరుగుతుండగా ప్రభుత్వ పరంగా ఆర్టీసీ, రైల్వేస్, రిజిస్ట్రేషన్లు, రేషన్ దుకాణాలు ఇలా చాలా సర్కారీ శాఖల్లో డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ఇంకా ఊపందుకోలేదు. గ్రామీణ భారతంలో ఆర్థిక లావాదేవీలు ఇప్పటికీ నగదు నోట్ల రూపంలోనే జరుగుతున్నాయి. ఇక్కడ పేపర్ లెస్ ట్రాన్జాక్షన్స్ లక్ష్యానికి దూరంగా ఉండిపోయాయి. దీన్ని అధిగమించేందుకు డిజిటల్ మంత్రాన్ని కేంద్రం జపిస్తోంది. అందుకే ఈ బడ్జెట్లో పెద్ద పీట వేసింది. డిజిటల్ బడ్జెట్ డిజిటల్ యూనివర్సిటీతో పాటు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకుల ద్వారా 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల ఏర్పాటు ప్రతిపాదన సైతం బడ్జెట్లో ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. దీంతో పాటు డిజిటల్ బ్యాంకింగ్ కీలకమైన ఇంటర్నెట్ విస్తరణపైనా కేంద్రం దృష్టి సారించింది. పట్టణ ప్రాంతాలు లక్ష్యంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 5జీ సేవలు అందుబాటులోకి తెస్తామంది. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల కోసం భారత్నెట్ ప్రాజెక్టును చేపట్టింది. భారత్నెట్ ద్వారా 2025 నాటికి దేశమంతటా తక్కువ ధరకే బ్రాడ్బ్యాండ్ సేవలు అందిస్తామని ప్రభుత్వం అంటోంది. ఏకంగా డిజిటల్ యూనివర్సిటీ కూడా నెలకొల్పుతామంది. ఆఖరికి వివాదాలు, విమర్శలు పక్కన పెట్టి క్రిప్టో కరెన్సీకి కూడా సై అంది కేంద్రం. స్లో అయితే కష్టం అయితే ప్రభుత్వం లక్ష్యాలు అర్బన్, సెమీ అర్బన్ రీజియన్ల వరకు ఓకే. మరి రూరల్ భారత్ సంగతి ఏంటనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎప్పుడో ప్రారంభం కావాల్సిన 5జీ, భారత్నెట్ ప్రాజెక్టులు ఇంకా లక్ష్యానికి దూరంగా ఉండి పోయాయి. ఇక రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, వైన్స్ తదితర చోట్ల డిజిటల్ పేమెంట్స్ చేస్తే అదనపు చార్జీలను కస్టమర్ల మీద మోపుతున్నారు. ఇలాంటి వ్యవహారాలకు ఎక్కడా అడ్డుకట్ట పడుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ తరుణంలో ప్రభుత్వం జపిస్తున్న డిజిటల్ మంత్ర ఎంత వరకు సిద్ధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. (క్లిక్: కేంద్రం కీలక సంస్కరణ.. దేశంలో ఏకరీతిగా భూ రిజిస్ట్రేషన్..!) డబుల్ వేగం వేగవంతమైన ఇంటర్నెట్తో యాక్సెస్ వస్తే డిజిటల్ పేమెంట్స్ అందనంత వేగంతో దూసుకుపోతాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2016లో ఉన్న అంచనాల ప్రకారం వచ్చే ఐదేళ్లు 2021 సెప్టెంబరు నాటికి డిజిటల్ పేపెంట్స్ రూ.3 లక్షల కోట్లకు చేరుకుంటాయనుకున్నారు. అందరీ అంచనాలు తారుమారు చేస్తూ డిజిటల్ పేమెంట్స్ ఏకంగా రూ. 7 లక్షల కోట్లకు చేరాయి. చౌక ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ వినియోగం పెరిగడంతో యాభైకి పైగా డిజిటల్ పేమెంట్స్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. 250 బ్యాంకులు యూపీఐ పేమెంట్స్ని అంగీకరిస్తున్నాయి. సగటున ప్రతీ రోజు యూపీఐ ద్వారా రోజుకు 14 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ లావాదేవీల్లో యాభై శాతం రూ.200లోపువే కావడం గమనార్హం. (క్లిక్: అందుబాటులోకి డిజిటల్ రూపీ.. జారీ చేసేది అప్పటి నుంచే..) ఇక్కడ ఫోకస్ చేయాల్సిందే రూరల్ ఇండియా, పేద, మధ్య తరగతి ప్రజలు ముందస్తు అంచనాలు తలకిందులు చేస్తూ వేగంగా డిజిటల్ వైపు మళ్లగా భారీ లావాదేవీలు మాత్రం ఇప్పటికీ నగదుతోనే జరుగుతుంది. ప్రస్తుతం క్రెడిట్, డెబిట్ కార్డుతో జరిగే లావాదేవీల మొత్తం కంటే యూపీఐ లావాదేవీల మొత్తమే ఎక్కువ. కాబట్టి భారీ డీల్స్ కూడా డిజిటల్ పద్దతిలో జరిగేలా ప్రభుత్వం దృష్టి సారించాలంటున్నారు నిపుణులు. భారీ లావాదేవీలను కూడా డిజిటల్ పరిధిలోకి తీసుకువస్తే పారదర్శకత పెరిగి పన్ను వసూళ్లు పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది. ఇక డిజిటల్ పేమెంట్స్కి సంబంధించి ఆన్లైన్ మెసాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. సైబర్ సెక్యురిటీ, డేటా ప్రైవసీ విషయంలో ప్రభుత్వం నుంచి నిర్ధిష్టమైన చర్యలు అవసరం. - సాక్షి, వెబ్ స్పెషల్ -
బ్యాంకింగ్ వ్యవస్థలో చేరిపోనున్న పోస్టాఫీసులు
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు లావాదేవీలకు దూరంగా ఉంటూ... పోస్టాఫీసునే బ్యాంకుగా భావించే కోట్ల మందికి ఇది నిజ్జంగా శుభవార్తే. ఎందుకంటే కొన్నేళ్లుగా ‘పోస్టల్ బ్యాంక్’ మాట వినిపిస్తున్నా బ్యాంకుకు ఉండాల్సిన చాలా లక్షణాలు పోస్టాఫీసులకింకా రాలేదు. ఇదిగో... వీటన్నిటినీ కోర్ బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకొస్తామని నిర్మల హామీనిచ్చారు. అంటే పోస్టాఫీసు ఖాతాదారులంతా ఇకపై ఎక్కడి నుంచైనా ఆన్లైన్లో డిపాజిట్లు చేయొచ్చు. వేరే ఖాతాలకు నగదు బదిలీ చేయొచ్చు. ఆర్డీ, ఎఫ్డీ సహా బ్యాంకుల నుంచి పొందే ఆన్లైన్ సేవలన్నీ పొందొచ్చు. కాలం చెల్లిన సేవలకు క్రమంగా స్వస్తి చెబుతూ...ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నీ అందిపుచ్చుకొని వినూత్న ఆలోచనలు, సరికొత్త సేవలతో ముందడుగు వేస్తున్న పోస్టాఫీసులకు మహర్దశ పట్టనుంది. ఇప్పటికే వాణిజ్య బ్యాంకులకు దీటుగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబి) ఏర్పాటు చేసి దాని ద్వారా పోస్టాఫీసుల్లో ప్రాథమిక బ్యాంకింగ్ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది. పోస్టాఫీసులతో పాటు ఇంటి వద్దకు కూడా బ్యాంకింగ్ సేవలు అందిస్తోంది. తాజాగా కేంద్ర బడ్జెట్– 2022లో పోస్టాఫీసుల్లో పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సేవలు ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించడం మరింత కలిసి వచ్చే అంశం. ఇక పోస్టాఫీసుల ద్వారా ఆన్లైన్ బ్యాంకింగ్,నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు అందుబాటులో రానున్నాయి. ఇప్పటికే ఐపీపీ బ్యాంక్ పోస్టాఫీసుల ద్వారా మూడు రకాల జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాల సేవలు అందిస్తోంది. చదవండి: బ్యాంకులు, ఏటీఎంలకు వెళ్లకుండానే పీఎం కిసాన్, రైతుబంధు డబ్బులు -
భారత గడ్డపై తొలి బడ్జెట్కు 162 ఏళ్లు..
న్యూఢిల్లీ: మొదట్లో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ పాలనలో ఉన్న మన దేశాన్ని.. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటన్ నేరుగా పాలించడం మొదలుపెట్టింది. ఆ సమయంలోనే మన దేశానికంటూ మొదటిసారిగా 1860 ఏప్రిల్ 7న బడ్జెట్ ప్రవేశపెట్టారు. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం తరఫున స్కాటిష్ ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు జేమ్స్ విల్సన్ ఆ బడ్జెట్ రూపొందించి, బ్రిటిష్ పార్లమెంట్కు సమర్పించారు. స్వాతంత్య్ర భారతంలో 1947 నవంబర్ 26న అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముగం శెట్టి తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రహస్యంగా..ప్రింటింగ్నే మార్చేసి కేంద్ర బడ్జెట్ రూపకల్పన, పత్రాల ముద్రణ అత్యంత రహస్యంగా సాగుతుంది. బడ్జెట్లోని అంశాలు ముందే తెలిస్తే.. ఎవరైనా వాటిని మార్చేలా ప్రభావితం చేయడానికి వీలు ఉంటుందన్నదే దీనికి కారణం. అందుకే బడ్జెట్ పత్రాలను ముద్రించినన్ని రోజులు సిబ్బంది ఎవరినీ బయటికి వెళ్లనివ్వరు. 1950 వరకు రాష్ట్రపతి భవన్లో బడ్జెట్ పత్రాలు ముద్రించేవారు. ఆ ఏడాది బడ్జెట్ రహస్యాలు ముందే లీకవడంతో ముద్రణను ఢిల్లీలోని మింట్ రోడ్లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్కు మార్చారు. 1980 నుంచి కేంద్ర ఆర్థికశాఖ కార్యాలయం ఉండే నార్త్బ్లాక్లో బడ్జెట్ పత్రాలను ముద్రిస్తున్నారు. చదవండి: (బడ్జెట్ ఇంగ్లిష్లోనే ఎందుకు?) -
బడ్జెట్ ఇంగ్లిష్లోనే ఎందుకు?
న్యూఢిల్లీ: మన దేశంలో ఒక రకంగా చూస్తే హిందీ అధికార భాష. దానికి తోడుగా 22 గుర్తింపు పొందిన స్థానిక భాషలు ఉన్నాయి. గుర్తింపు పొందిన భాషల్లో ఇంగ్లిష్ లేనే లేదు. మరి ఏటా బడ్జెట్ ప్రసంగాన్ని ఇంగ్లిష్లో మాత్రమే ఎందుకు చదువుతారో తెలుసా? దానికి గట్టి కారణమే ఉంది. నిజానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలోనే.. కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలన్నీ హిందీలో నిర్వహించేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ దేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇతర భాషలను తీసుకునే పరిస్థితి లేదు. దాంతో బ్రిటిష్కాలం నుంచి కొనసాగుతూ.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పరిచయం ఉన్న ఇంగ్లిష్ను మధ్యే మార్గంగా.. ‘అనుసంధాన భాష’గా ఎంపిక చేశారు. ఇప్పటికీ అదే కొనసాగుతోంది. అయితే రాజ్యాంగం ప్రకారం.. రాష్ట్రాలకు భాష విషయంలో స్వేచ్ఛ ఉంది. ఏ రాష్ట్రమైనా కేంద్ర గుర్తింపు పొందిన భాషనుగానీ, తమకు నచ్చిన మరే భాషను గానీ.. సదరు రాష్ట్ర పరిధిలో అధికారిక భాషగా ప్రకటించవచ్చు. ఆ భాషలో కార్యకలాపాలు కొనసాగించవచ్చు. చదవండి: (Biggest Budget: అతిపెద్ద బడ్జెట్ మన్మోహన్దే..) -
ఏపీ రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
► ఆంధ్రప్రదేశ్ రాజధానిపై నిర్ణయ అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభలో ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఏపీ విభజన చట్టం అమలుపై రాజ్యసభలో కీలక ప్రశ్నలను సభ్యులు లేవనెత్తారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజధాని అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ.. రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉందని మరోసారి పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసింది. ►మూడో రోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభ జీరో అవర్లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అంశాన్ని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులకు అత్యంత పవిత్రస్థలమని, టీటీడీ అనేక ధార్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యాకలాపాల నిర్వహణకు భారీస్థాయిలో నిధులు అవసరం అవుతాయని తెలిపారు. విదేశాల నుంచి ప్రవాస భారతీయులు విరాళాలుగా పంపిస్తుంటారని గుర్తుచేశారు. కేంద్ర హోంశాఖ సాంకేతిక కారణాలతో ఎఫ్సీఆర్ఏ లైసెన్సును తాత్కాలికంగా నిలిపివేసిందని, తగిన పత్రాలన్నీ సమర్పించినప్పటికీ లైసెన్స్ పునరుద్ధరించలేదని కేంద్రం దృష్టికి ఎంపీ విజయసాయిరెడ్డి తీసుకువెళ్లారు. డిసెంబర్ 31 నాటికి రూ.13.04 కోట్ల నిధులు ఎఫ్సీఆర్ఏ అనుసంధాన బ్యాంకు ఖాతాలో ఉన్నాయని తెలిపారు. యాక్ట్ ఈస్ట్ పాలసీ తరహాలో లుక్ సౌత్ పాలసీని అమలు చేయాలని ఈ సందర్భంగా కోరారు. బీజేపీని హిందూ జాతీయవాదానికి టార్చ్ బేరర్గా చెప్పుకుంటారని, తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఎందుకు ఉదాసీనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మూడో రోజు ఉభయ సభలు కొలువుదీరాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగానికి లోక్సభ, రాజ్యసభలో సభ్యులు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం కేంద్ర బడ్జెట్-2022ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈసారి బడ్జెట్ మూలధన వ్యయాన్ని 35. 4 శాతం మేర పెంచారు. వృద్ధి ప్రణాళికలకు మద్దతుగా ఆర్థిక వ్యవస్థ వార్షిక వ్యయం పరిమాణాన్ని రూ.39.5 ట్రిలియన్కు (529 బిలియన్ డాలర్లు) పెంచాలని సీతారామన్ ప్రతిపాదించారు. -
సిటీపై సీతమ్మ చిన్నచూపు .. ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే!
సాక్షి, సిటీబ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ నగర ప్రజలను నిరాశపర్చింది. కరోనా నేపథ్యంలో మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి జనం ఇప్పటికే ఆర్థిక పరిస్థితులు బాగా లేక సతమతమవుతున్నారు. కేంద్ర బడ్జెట్పై గ్రేటర్ జనం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రత్యేకంగా వేతన జీవులకు ఎలాంటి ఊరట కల్పించలేదు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు మండుతున్నాయి. ఈ బడ్జెట్తో ధరలు మరింత పెరుగుతాయని నగర వ్యాపారుల అంచనా. డ్రైఫ్రూట్స్పై తగ్గని జీఎస్టీ ఇప్పటీకే కరోనా ప్రభావంతో గ్రేటర్లోని అన్ని వర్గాల ప్రజలు ఇమ్యూనిటీ కోసం ఎక్కువగా డ్రైఫ్రూట్స్ వాడుతున్నారు. గతంలో పోలిస్తే కరోనాతో డ్రైఫ్రూట్స్ వాడకం దాదాపు 60 శాతం పెరిగింది. ఈ బడ్జెట్లో ఇప్పటికే డ్రైఫ్రూట్స్పై కొనసాగుతున్న 12 శాతం జీఎస్టీ నుంచి 5 శాతానికి కేంద్రం తగ్గిస్తుందని భావించారు. కానీ తగ్గించకపోవడంతో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. తగ్గేవి ఇవే.. వస్త్రాలు, తోలు వస్తువులు, చెప్పులు, స్టీల్ స్క్రాప్స్ చవక అవుతాయి. వ్యవసాయ పరికరాల ధరలు, మొబైల్ ఫోన్స్, మొబైల్ చార్జర్ల ధరలు దిగివస్తాయి. పెరిగేవి ఇవే.. మూలధన వస్తువులు, ముడి ఇంధనం, రోల్డ్ గోల్డ్ ఆభరణాల ధరలు మరింత పెరిగాయి. ప్లాస్టిక్ ఐటమ్స్, ఫర్టిలైజర్స్, ఐరన్, స్టీల్, మెడికల్ పరికరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆర్గానిక్ కెమికల్స్ ధరలు పెరగనున్నాయి. (చదవండి: సొంత వాహనాల్లోనూ మాస్క్ తప్పనిసరి.. లేకుంటే ఛలానా? అర్థం ఉందా?) -
హైదరాబాద్ను కరుణించని నిర్మల.. అంచనాలు తలకిందులు
కేంద్ర బడ్జెట్లో గ్రేటర్ నగరానికి ‘బూస్టర్’ దక్కలేదు. పేద, మధ్య తరగతి, వేతన జీవులకు ఊరట లభించలేదు. ఎస్సార్డీపీ పనులకు నిధులు విదిల్చలేదు. ప్రధాన మంత్రి ఆవాస్యోజన (పీఎంఏవై) కింద కొత్త ఆర్థిక సంవత్సరంలో రూ.48వేల కోట్లు కేటాయించినప్పటికీ, వీటిలో గ్రేటర్ నగరానికి ఎన్ని నిధులందుతాయో చెప్పలేని పరిస్థితి. మున్సిపల్ పరిపాలన శాఖ ప్రతిపాదించిన ప్రాజెక్టులకు కేంద్రం శూన్య హస్తమే చూపింది. ప్రధానంగా జలమండలి, మెట్రో రెండోదశ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపుపై స్పష్టమైన ప్రకటన కరువైంది. రెండు అంశాల్లో మాత్రం నగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది. హైదరాబాద్ కేంద్రంగా వివిధ ప్రాంతాలకు వందేభారత్ పరుగులు పెట్టనుంది. సరికొత్త సేవలతో ముందడుగు వేస్తున్న పోస్టాఫీసులకు మహర్దశ పట్టనుంది. కేంద్ర బడ్జెట్లో నగరానికి తీవ్ర అన్యాయం జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: కేంద్ర బడ్జెట్లో ఈసారి జీహెచ్ఎంసీ చేపట్టిన ఎస్సార్డీపీ పనులకు నిధులందుతాయేమోనని పలువురు ఎదురు చూశారు. కానీ.. నిధులు కనిపించలేదు. జీహెచ్ఎంసీ దాదాపు రూ.25వేల కోట్లతో ఎస్సార్డీపీ కింద పలు ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు, జంక్షన్ల అభివృద్ధి తదితర పనులకు శ్రీకారం చుట్టింది. ఇందుకు అప్పులు, బాండ్ల జారీ ద్వారా నిధులు సేకరించడంతోపాటు సొంత ఖజానా నిధులు సైతం రూ.3వేల కోట్లు ఖర్చు చేసింది. కొన్ని పనులు పూర్తి కాగా, కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. పనులు ప్రారంభించాల్సినవి ఇంకా ఎన్నో ఉన్నాయి. నగరాభివృద్ధికి సంబంధించిన పనులకు కేంద్రం సహకారం కూడా ఉంటుందని ఇటీవల ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ఎస్సార్డీపీ పనులకు కేంద్రం తనవంతుగా రూ.1400 కోట్లు ఆర్థిక సహకారం అందించాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కోరారు. నగరంలో నిర్మిస్తున్న లింక్రోడ్లు, స్లిప్రోడ్ల కోసం మరో రూ.800 కోట్లు అడిగారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖరాయడం తెలిసిందే. దీంతో కేంద్రం నుంచి ఎంతోకొంత సహకారం అందగలదని భావించిన వారి అంచనాలు తలకిందులయ్యాయి. (చదవండి: ఒక్కరోజే 2,850 కరోనా కేసులు) పోస్టాఫీసులకు మహర్దశ ఇప్పటికే వాణిజ్య బ్యాంకులకు దీటుగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబి) ఏర్పాటు చేసి దాని ద్వారా పోస్టాఫీసుల్లో ప్రాథమిక బ్యాంకింగ్ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది. తాజాగా కేంద్ర బడ్జెట్– 2022లో పోస్టాఫీసుల్లో పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సేవలు ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించడం మరింత కలిసి వచ్చే అంశం. ఇక పోస్టాఫీసుల ద్వారా ఆన్లైన్ బ్యాంకింగ్,నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు అందుబాటులో రానున్నాయి. పరుగులు పెట్టనున్న వందే భారత్ హైదరాబాద్ కేంద్రంగా వివిధ ప్రాంతాలకు వందేభారత్ పరుగులు పెట్టనుంది. దేశవ్యాప్తంగా 400 వందేభారత్ రైళ్లకు కేంద్రం ఈ బడ్జెట్లో పచ్చజెండా ఊపిన నేపథ్యంలో గతంలోనే ప్రతిపాదించినట్లుగా హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ, సికింద్రాబాద్–ముంబయి.కాచిగూడ–బెంగళూర్ నగరాల మధ్య వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉందని రైల్వే వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు గతంలో ప్రతిపాదించిన 100 రైళ్లు కాకుండా ఈ బడ్జెట్లో మరో 400 రైళ్లను కేంద్రం కొత్తగా ప్రకటించడం గమనార్హం. (చదవండి: నదులతో ‘ఓట్ల’ అనుసంధానం! ) -
Budget 2022: నదులతో ‘ఓట్ల’ అనుసంధానం!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఉత్తర్ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న కేంద్రం ప్రభుత్వం తన బడ్జెట్లో రాష్ట్రంలోని అత్యంత వెనుకబడ్డ బుందేల్ఖండ్ ప్రాంత తాగు, సాగునీటి వసతిని కల్పించే కెన్–బెత్వా నదుల అనుసంధాన ప్రక్రియకు అత్యం త ప్రాధాన్యం ఇచ్చింది. గత ఏడాది డిసెంబర్లో కేంద్ర ఆమోదం లభించిన ఈ నదుల అనుసంధానానికి 2002–23 వార్షిక బడ్జెట్లో రూ.1,400 కోట్ల కేటాయింపులు చేస్తున్నట్లు ప్రకటించింది. మంగళవారం లోక్సభలో తన బడ్జెట్ ప్రసంగంలో నదుల అనుసంధాన ప్రక్రియను ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘రూ.44,605 కోట్ల అంచనా వ్యయంతో కెన్–బెత్వా లింక్ ప్రాజెక్ట్ను చేపట్టనున్నాం. దీని ద్వారా 9.05 లక్షల హెక్టార్ల రైతుల భూములకు సాగునీరు, 62 లక్షల మందికి తాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. 103 మెగావాట్ల హైడ్రో, 27 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా ఉంది. దీనికై 2022–23లో రూ.1,400 కోట్లు ఈ ప్రాజెక్ట్ కోసం కేటాయించాం’అని పేర్కొన్నారు. ఈ అనుసంధాన ప్రక్రియ ద్వారా ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించి నీటి కొరత ఎదుర్కొంటున్న బుందేల్ఖండ్ ప్రాంతానికి ప్రయోజనం చేకూరనుంది. గోదావరి – కావేరి అనుసంధాన డీపీఆర్లు ఖరారు మరో ఐదు నదుల అనుసంధాన ప్రక్రియపై కేంద్ర ఆర్ధికమంత్రి కీలక ప్రకటన చేశారు. దామనగంగ–పింజల్, పర్ తాపీ– నర్మద, గోదావరి–కృష్ణా, కృష్ణా–పెన్నా, పెన్నా–కావేరి అనుసంధానం ముసాయిదా డీపీఆర్లు ఇప్పటికే ఖరారయ్యాయని వెల్లడించారు. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత కేంద్రం తోడ్పాటును అందిస్తుందని ప్రకటించారు. ఇందులో గోదావరి మొదలు కావేరి వరకు జరిగే అనుసంధాన ప్రక్రియ అంతా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించేవి. ఇచ్చంపల్లి మీదుగా 247 టీఎంసీల నీటిని నాగార్జునసాగర్లకు తరలించి అటు నుంచి సోమశిల మీదుగా కావేరి గ్రాండ్ ఆనకట్కి తరలించే ప్రణాళికను కేంద్రం రూ.85,962 కోట్లతో ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన ద్వారా 9.35 లక్షల హెక్టార్ల కొత్త ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉందని తెలిపింది. గోదావరి–కావేరి అనుసంధానంపై పరీవాహక రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించే కార్యాచరణను ఇప్పటికే జాతీయ జల వనరుల అభివృధ్ధి సంస్థ చేపట్టింది. నదీ జలాల లభ్యత, నీటి కేటాయింపులు, మళ్లింపు అంశాలపై అన్ని రాష్ట్రాలను ఒప్పించి త్వరగా అనుసంధాన ప్రతిపాదనను పట్టాలెక్కించే లక్ష్యంతో సంప్రదింపులు చేస్తోంది. రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటూ ముందుకు సాగుతామని ఇదివరకే స్పష్టమైన సంకేతాలిచ్చింది. ఇదే సమయంలో ‘హర్ ఘర్ నల్ సే జల్’కార్యక్రమం కింద 8.7 కోట్ల ఇళ్లకు నల్లా కనెక్షన్ల ప్రక్రియ పూర్తయిందని, ఈ ఆర్థిక ఏడాదిలో మరో 3.8 కోట్ల ఇళ్లకు నీటిని అందించే లక్ష్యంతో రూ.60 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. -
Budget 2022: ఇండియా@100 టార్గెట్తో..
సాక్షి, న్యూఢిల్లీ: స్వాతంత్య్ర భారతం 75 ఏళ్లు పూర్తి చేసుకుని అమృతకాలంలోకి ప్రవేశించిందని.. భారత్ వందేళ్లకు చేరుకునే ఈ 25 ఏళ్లు అమృతకాలమని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ 25 ఏళ్లలో సాధించాల్సిన లక్ష్యాలతో ‘ఇండియా@100’ విజన్ను ప్రధాని మోదీ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఆవిష్కరించారని గుర్తుచేశారు. ఆ విజన్కు ప్రస్తుత బడ్జెట్లో పునాది వేస్తున్నామన్నారు. విజన్ లక్ష్యాలను సాధించడానికి మూడు మార్గాలను నిర్దేశించుకున్నట్టు వెల్లడించారు. ► అన్ని స్థాయిల్లో సమ్మిళిత అభివృద్ధి, అన్నివర్గాల సంక్షేమం దృష్టి ►డిజిటల్ ఎకానమీ, ఫిన్టెక్ రంగాలకు ప్రోత్సాహం. ►టెక్నాలజీ ఆధారిత అభివృద్ధి, ఇంధన వినియోగంలో మార్పులు, పర్యావరణ పరిరక్షణకు చర్యలు ప్రైవేటు పెట్టుబడులు భారీగా పెరిగేలా ప్రోత్సహించడంతోపాటు ప్రభుత్వ పెట్టుబడుల పెంపు’’ ఆ మార్గాలని వివరించారు. పన్నుల వసూలు రాజధర్మం నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన వివరాలను ప్రారంభిస్తూ.. మహాభారతంలోని శ్లోకాన్ని ఉదహరించారు. ‘దాపయిత్వకరం ధర్యాం రాష్ట్రం నిత్యం యథావిధి అశేషాంకల్పయేంద్రజాయోగ క్షేమానతంద్రితః’ ..శాంతి పర్వంలోని 72వ అధ్యాయంలో ఉన్న ఈ 11వ శ్లోకం రాజ ధర్మం ఎలా ఉండాలో చెప్తుందని ఆమె చెప్పారు. ‘‘రాజు ధర్మానికి అనుగుణంగా రాజ్యాన్ని పాలించాలి. రాజధర్మంలో భాగమైన పన్నుల వసూలు, ప్రజల సంక్షేమం విషయంలో నిర్లక్ష్యం చూపకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలి’’ అని ఆ శ్లోకం అర్థాన్ని వివరించారు. ఈ క్రమంలోనే పన్నుల వ్యవస్థను సరళతరం చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఆదాయ పన్ను సహా ఇతర ట్యాక్సులు వేటికి సంబంధించి కూడా ఉపశమనం కలిగించే చర్యలను నిర్మలా సీతారామన్ ప్రకటించలేదు. పన్నుల ఎగవేతకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోనున్నట్టు హెచ్చరించారు. పన్నులు పెంచలేదు.. చూడండి లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నిర్మలా సీతారామన్ పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పన్నుల తగ్గింపు, ఐటీ పరిమితి పెంపుపై మధ్యతరగతి వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, కానీ ఉపశమనం ఇవ్వలేదేమని మీడియా ప్రశ్నించగా.. ‘‘కరోనా మహమ్మారి సమయంలో పన్నులు పెంచి ప్రజలపై భారం వేయదలుచుకోలేదు. అందుకే గత రెండేళ్లుగా ఎలాంటి పన్నులు పెంచలేదు..’’ అని సీతారామన్ సమాధానమిచ్చారు. -
రైల్వే జోన్పై ముఖం చాటేసిన కేంద్రం
సాక్షి,అమరావతి: కేంద్ర ప్రభుత్వం 2022–23 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ను చిన్నచూపు చూసింది. అతి ముఖ్యమైన ప్రాజెక్టులకు సైతం ఆశించిన రీతిలో నిధులు కేటాయించకుండా అన్యాయం చేసింది. విభజన చట్టం ప్రకారం పూర్తిగా తనే నిధులు ఇవ్వాల్సిన పోలవరం ప్రాజెక్టును సైతం నిర్లక్ష్యం చేసింది. రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు అంశంపై ఈ ఏడాది కూడా ముఖం చాటేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించి ఈ ఏడాది శుభవార్తలు విందామనుకున్న ఐదు కోట్ల మంది ప్రజలను నిరాశ, నిస్పృహలకు గురిచేసింది. ► కేంద్ర బడ్జెట్లో విశాఖపట్నం రైల్వే జోన్ అంశాన్ని కనీసం ప్రస్తావించకపోవడం విస్మయం కలిగిస్తోంది. దక్షిణ మధ్య రైల్వే గత ఏడాది సెప్టెంబరు 30న విజయవాడలో నిర్వహించిన సమావేశంలో వైఎస్సార్సీపీ ఎంపీలు జోన్కు సంబంధించిన డిమాండ్ను గట్టిగా వినిపించారు. ► రైల్వే ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై నిలదీశారు. అయినప్పటికీ పెద్దగా కేటాయింపులు లేవు. పూర్తి వివరాలతో బ్లూ బుక్ వస్తే గానీ రాష్ట్రంలో ఇతర రైల్వే ప్రాజెక్టులకే ఏ మేరకు నిధులు కేటాయించారన్నది స్పష్టం కాదు. ► వాస్తవానికి 2019 ఫిబ్రవరి 27న విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వేజోన్’ ఏర్పాటు చేస్తున్నామని కేంద్రం ప్రకటించింది. రైల్వే శాఖ ఇందుకు సంబంధించిన డీపీఆర్ను సిద్ధం చేసింది. భవనాలు, ఇతర అవసరాల కోసం విశాఖలో దాదాపు 950 ఎకరాలు అందుబాటులో ఉందని పేర్కొంది. ► కానీ గత రెండు బడ్జెట్లలోనూ రైల్వే జోన్పై కేంద్రం మొండిచేయి చూపించింది. గత బడ్జెట్లో కేవలం రూ.40 లక్షలు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఏడాదీ నిరాశే ఎదురైంది. ఒడిశాలోని భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే ప్రయోజనాలకు పెద్దపీట వేసింది. ► రైల్వే శాఖ ద్వంద్వ వైఖరి రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. కొత్త రైల్వే జోన్లు ఏర్పాటు చేసే ఉద్దేశంలేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కొన్ని నెలల క్రితం ప్రకటించారు. దీనిపై రాష్ట్రంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దాంతో రైల్వే శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ► ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించినందున విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పడం రాష్ట్రానికి కాస్త ఊరట నిచ్చింది. అయినప్పటికి మరోసారి మోసపూరిత వైఖరే అవలంబించింది. -
సాక్షి కార్టూన్(02-02-2022)
-
బడ్జెట్లో క్రీడలకు రూ.3,062 కోట్లు.. 305.58 కోట్లు పెరిగింది!
Union Budget 2022: 3062 Crores Allocated For Sports : కేంద్ర బడ్జెట్లో క్రీడలకు కేటాయింపులు పెంచారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో క్రీడల కోసం రూ. 3,062.60 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్తో పోల్చుకుంటే రూ. 305.58 కోట్లు పెరిగింది. టోక్యో ఒలింపిక్స్లో పెరిగిన పతకాల సంఖ్యతోపాటు ‘ఖేలో ఇండియా’కు మరింత ఊతమిచ్చేందుకు బడ్జెట్ నిధుల్ని పెంచారు. గత ఆర్థిక సంవత్సరం (2021–22)లో రూ.2596.14 కోట్లు కేటాయించగా తర్వాత దీన్ని రూ.2757.02 కోట్లకు సవరించారు. కామన్వెల్త్ క్రీడలు (బర్మింగ్హామ్), ఆసియా క్రీడల (హాంగ్జౌ) రూపంలో ఈ ఏడాది రెండు మెగా ఈవెంట్లున్నాయి. ఈ నేపథ్యంలోనే కేటాయింపుల్ని గణనీయంగా పెంచినట్లు తెలిసింది. మొత్తం క్రీడల బడ్జెట్లో ‘ఖేలో ఇండియా’ కార్యక్రమం కోసం రూ. 974 కోట్లు (గతంలో రూ. 657.71 కోట్లు), ప్రోత్సాహక అవార్డులు, రివార్డుల కోసం రూ.357 కోట్లు (గతంలో రూ.245 కోట్లు), స్పోర్ట్స్ అథారిటీ (సాయ్)కి రూ. 653 కోట్లు కేటాయించారు. జాతీయ క్రీడాభివృద్ధి నిధిని రూ. 9 కోట్ల నుంచి 16 కోట్లకు పెంచారు. అయితే జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)ల కోసం గతంలో లాగే ఈసారి రూ. 280 కోట్లు కేటాయించారు. చదవండి: Icc U 19 World Cup 2022: మరో ఫైనల్ వేటలో.. అండర్-19 టీమిండియా -
కొత్త రాజ్యాంగం కావాలి
సాక్షి, హైదరాబాద్: ‘‘రాజ్యాంగం ద్వారా లభించిన అవకాశాలతో కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా 50 ఏండ్లు ప్రజా జీవితంలో ఉన్న అనుభవంతో చెప్తున్నా.. ప్రస్తుత వ్యవస్థతో ఏదీ మారదు. ఈ దేశంలో కొత్త రాజ్యాంగం రాయాల్సిన అవసరం ఉంది. దేశం ముందు నేను పెడుతున్న ఈ ప్రతిపాదనపై చర్చ జరగాలి..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. చాలా దేశాలు తమ రాజ్యాంగాన్ని తిరిగి రాసుకున్నాయని.. కొత్త ఆలోచన, కొత్త దిశ, కొత్త రాజ్యాంగం అన్నది తమ విధానమని వెల్లడించారు. సీఎం కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. వారి చేతగానితనంతోనే అంధకారం ‘‘స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా అంతా దారుణం. మనది ధనవంతమైన దేశమైనా ఆలోచనలో పేదరికం ఉంది. ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా తయారయ్యే సామర్థ్యమున్నా కాంగ్రెస్, బీజేపీల చేతగానితనం వల్లే అంధకారంలో ఉంది. దేశాన్ని పాలిస్తున్న ప్రధాని, ప్రభుత్వం చెప్తున్నవన్నీ అబద్ధాలే. ఇదో పనికిమాలిన చెత్త ప్రభుత్వం. అబద్ధాలతో, మత పిచ్చి రేపుతూ, ధర్మం పేరిట దేశాన్ని విభజిస్తోంది. ఈ దేశ యువత, ప్రజానీకానికి పిలుపునిస్తున్నా. రేపటి భవిష్యత్తు, దానిని కాపాడే బాధ్యత మీదే. బీజేపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపితేనే అభివృద్ధి సాధ్యం. త్వరలో మా కార్యాచరణ ప్రారంభిస్తాం. దేశం కోసం బయల్దేరుతున్నాం దేశంలో నూతన శకం, గుణాత్మక మార్పు రావాల్సి ఉంది. అబద్ధాలు చెప్పే వారితో ఒకట్రెండు రోజులు మాత్రమే సంతోషం.. సమస్యలు పరిష్కారం కావు. ప్రతీ పౌరుడు దేశం కోసం పనిచేయొచ్చనే ఉద్దేశంతో.. మేం దేశం కోసం బయలుదేరుతున్నాం. భారత్లో సాగుయోగ్యమైన 40 కోట్ల ఎకరాల్లో ప్రతీ అంగుళానికి నీరు ఇవ్వగలం. రెండేళ్లలో దేశాన్ని అభివృద్ధితో మెరిసేలా చేసి ప్రపంచానికి చూపుతాం. నీళ్లు, విద్యుత్ వినియోగంలో నేను చెప్పిన లెక్కలు అబద్ధమని రుజువు చేస్తే.. నిమిషంలో సీఎం పదవికి రాజీనామా చేస్తా. పదవికాదు.. కొత్త ఎజెండా కావాలి ఫెడరల్ ఫ్రంట్ అని నేను ఏనాడూ చెప్పలేదు. ప్రధాని పదవి ఎవరికి దక్కుతుందనేది అప్రస్తుతం. దేశానికి కొత్త ఎజెండా కావాలి. రేపు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ప్రజలను జాగృతం చేసేందుకు ఏ పద్ధతిలో ముందుకు పోవాలనే దానిపై త్వరలో హైదరాబాద్లో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల సదస్సులో మేధోమథనం చేస్తాం. విప్లవాల కోసం తుపాకీ అవసరం లేదు. నాగరిక ప్రపంచంలో ఇందిరాగాంధీ వంటి నాయకురాలు గద్దె దిగింది. తెలంగాణ బిడ్డ వెలిగితే అభ్యంతరమా? ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ముస్లిం సమాజానికి ఒక దిక్కుగా మారాలనుకుంటున్నారు. ఉమ్మడి ఏపీలో తమ రాజకీయ మనుగడను నిలుపుకొన్న ఎంఐఎం.. ఇప్పుడు మహారాష్ట్ర, బిహార్ వంటి చోట్లా తమ ఉనికిని చాటుతోంది. ఒక తెలంగాణ బిడ్డ దేశవ్యాప్తంగా విస్తరిస్తూ వెలుగుతుండటం మాకు గర్వకారణం. దీనిపై మీకేమైనా అభ్యంతరం ఉందా? యూపీ ఎన్నికల సమయంలోనే బుందేల్ఖండ్ దరిద్రం మోదీకి కనిపించి.. బెన్క్వెటా ప్రాజెక్టు గుర్తుకు వచ్చిందా? దేశం గురించి మోదీకి చెప్పినా, గోడకు చెప్పినా ఒక్కటే. ముందస్తు ఎన్నికలు వస్తయని కొందరు బేవకూఫ్ గాళ్లు ప్రచారం చేస్తున్నారు. ఒకడు సోషల్ మీడియాలో పోస్టు పెడితే ముందస్తు ఎన్నికలు పెడ్తమా? 103 మంది ఎమ్మెల్యేలతో రాజకీయ సుస్థిరత ఉంది. వచ్చే ఎన్నికల్లో మేం 95 నుంచి 105 మధ్య సీట్లు సాధిస్తాం. ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తాం. నీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ కుమార్తె పెళ్లి ఖర్చులను ఓ బినామీ కంపెనీ ద్వారా ప్రముఖ నిర్మాణ సంస్థ చెల్లించిందంటూ ఓ న్యూస్ పోర్టల్లో కథనం వచ్చిందని ఓ మీడియా ప్రతినిధి ప్రస్తావించగా.. అదేమీ తన దృష్టికి రాలేదని సీఎం కేసీఆర్ బదులిచ్చారు. కుక్కలు ఏదో మొరిగితే సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. బట్టలు మార్చే ట్రిక్కులతో బాగుపడుతుందా? 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించే ప్రధాని నీళ్లలో విమానం దిగి ఏదో పీకి పడేసిన అని చెప్తుండు. బెంగాల్లో ఎన్నికలొస్తే ఠాగూర్లా వేషం, తమిళనాడు ఎన్నికలొస్తే లుంగీ కట్టడం వంటి బట్టలు మార్చే ట్రిక్కులతో దేశం బాగుపడుతుందా? రాజ్యాంగం కేంద్రం, రాష్ట్రాలకు విడిగా, ఉమ్మడిగా అధికారాలు ఇచ్చినా.. కాంగ్రెస్, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాలు లాక్కున్నాయి. వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ వంటి ప్రతిపాదనలతో రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోంది. రాష్ట్రానికి వచ్చే ప్రధానికి ఒక ముఖ్యమంత్రిగా స్వాగతం పలుకుతా. కానీ నా అభిప్రాయాలను హెలికాప్టర్లో కూర్చుని ప్రధానితో కూడా చెప్పగలను. నేను కేసీఆర్ను.. వెనక్కి తగ్గే రకం కాదు. కేసీఆర్ను జైల్లో వేస్తరా? కేసీఆర్ను జైల్లో వేస్తామనే చిల్లరగాళ్లు అనేక రకాలుగా ఉంటారు. సోషల్ మీడియా హడావుడి, హంగామా తప్ప రాష్ట్రంలో టీఆర్ఎస్కు సరైన ప్రతిపక్షం లేదు. సోషల్మీడియా కాదు.. క్షుద్ర విద్య. దాని అంతు చూస్తాం. సోషల్ మీడియా పేరిట సొల్లు పురాణం కుమ్మరిస్తే ఇకపై చూస్తూ ఊరుకోం. విరిచి పోయిలో పెడతాం. ప్రపంచ నేతలతో మాట్లాడుతా.. టీఆర్ఎస్ పుట్టిన తర్వాత చంద్రబాబు, బీజేపీ, కమ్యూనిస్టులతోపాటు అందరిచేతా జైతెలంగాణ అనిపించాం. రేపు కూడా కలిసి వచ్చే పార్టీలు, ప్రజలు కదలివస్తారు. డీఎంకే, ఆర్జేడీనే కాదు, ప్రపంచ నేతలతో కూడా మాట్లాడుతా. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో మాట్లాడా. రెండు మూడు రోజుల్లో ముంబై వెళ్లి నా ఆలోచనను ఆయన ముందు పెడతా. మోదీ సీఎంగా చేసి పీఎం అయ్యారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉంటూనే మోదీ ప్రధాని అయ్యారు. నేను కూడా పార్లమెంటుకు పోటీ చేశాను. ఏదీ అసాధ్యం కాదు. అమెరికా కంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే యువశక్తి, వనరులు భారత్కు ఉన్నాయి. వాటిని గరిష్టంగా నియోగించుకుని నా శక్తిమేర కృషి చేస్తా. – సీఎం కేసీఆర్ -
చారిత్రక.. అభివృద్ధి కారక బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ చారిత్రక.. అభివృద్ధి కారక.. అన్ని వర్గాలను సంతృప్తి పరిచేదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ చెప్పారు. తాయిలాలతో ఎన్నికల బడ్జెట్ ఉంటుందని విశ్లేషకులు చెబుతూ వచ్చారని, అందరి అంచనాలను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ పటాపంచలు చేసిందన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో హైప్ కోసమే బడ్జెట్ ప్రవేశ పెడతారని.. అంతా డొల్ల అని వ్యాఖ్యానించారు. ఎన్నికల విశ్లేషకుడు పీకే డైరెక్షన్లో బడ్జెట్ ప్రసంగం ముగియక ముందే స్క్రిప్ట్ తయారు చేసుకుని సీఎం కేసీఆర్ కూనిరాగాలు తీశారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాదిరిగా ఎన్నికల ముందు తాయిలాలు ప్రకటించి బీజేపీ మోసం చేయదన్నారు. పన్నుల భారం పడకుండా బడ్జెట్ ప్రవేశ పెట్టారని, పన్నులను పెంచకుండా రూ.5 లక్షల కోట్లకు పైగా అదనపు బడ్జెట్ పెట్టడం విశేష మన్నారు. -
కార్పొరేట్ సంస్థల బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ సంస్థల కోసం అన్నట్లుగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. బడ్జెట్లో ఆరోగ్య శాఖకు కేటాయింపులు లేవని, కరోనాతో చిన్న పరిశ్రమలు దెబ్బతిన్నా వారిని ఆదుకునే ప్రయత్నం కూడా చేయలేదని మండిపడ్డారు. అలాగే రాజ్యాంగం మార్చాలని అనడానికి సీఎం కేసీఆర్కు బుద్ధి ఉండాలని, దీనిపై బీజేపీ, టీఆర్ఎస్ నాటకానికి తెరలేపారని భట్టి విమర్శించారు. -
తెలంగాణాకు ద్రోహం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం సమర్పించిన రూ.39 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ స్థూలంగా ప్రజా సంక్షేమాన్ని పణంగా పెట్టడమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కేంద్రం తాజా బడ్జెట్లో అవసరమైన చర్యలు చేపట్టలేదన్నారు. హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ నిర్మాణానికి ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తితో శంకుస్థాపన చేయించి.. గుజరాత్లో గిఫ్ట్ సిటీ కేంద్రంగా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ పని చేస్తుందని బడ్జెట్లో ప్రకటించటం తెలంగాణ ప్రజలను మోసగించటమేనన్నారు. తెలంగాణ ఆదివాసీ విశ్వవిద్యాలయాన్ని మాటమాత్రంగా పేర్కొని, రెండు రాష్ట్రాలకూ కలిపి కేవలం రూ.43 కోట్లు కేటాయించారన్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారానికి, దీర్ఘకాలంగా పెండింగ్లోఉన్న రైల్వేలైన్ల పూర్తికి, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి ప్రస్తావన కూడా కరువైందన్నారు. -
విద్యార్థికి ఫోను.. రైతుకు డ్రోను
ఉపాధి హామీకి అంటకత్తెర.. గత బడ్జెట్ కంటే 25 శాతం కోత, ఆహార సబ్సిడీకి క్షవరం.. ఎరువుల సబ్సిడీకి 4వ వంతు కటింగ్, మహిళలపై ‘సీత’కన్ను.. జెండర్ బడ్జెట్ కుదింపు వేతన జీవుల ఐటీ వేదన యథాతథం. విద్యార్థికి ఫోను.. రైతుకు డ్రోను. టీవీల్లో టీచర్లు.. ఫోన్లైన్లో డాక్టర్లు. ఇదీ.. మంగళవారం కేంద్రం విడుదల చేసిన ‘డిజిటల్’ కథా చిత్రమ్. పేపర్లెస్ బడ్జెట్ అని పేరు పెట్టినందుకో ఏమో గానీ... ఈ సారి ఆర్థిక మంత్రి నిర్మల ఆన్లైన్లో వీరవిహారం చేశారు. ప్రయాణం.. ఆరోగ్యం.. విద్య... కరెన్సీ.. సర్కారీ లావాదేవీలు.. ఒకటేమిటి అన్నింటిలో డిజిటల్ మంత్రాన్నే జపించారు. కానీ ఒక్కటి! ఎరువులు చల్లటానికి డ్రోన్లు ఇస్తామన్నారు. ఎరువుల సబ్సిడీని నాలుగో వంతు తగ్గించేశారు. నిరుపేదలకూ ఇంటర్నెట్ ఇస్తామన్నారు కానీ... ఆహార సబ్సిడీలో 80 వేల కోట్లు కోతవేశారు. గ్రామీణ ఉపాధికి పెద్దదిక్కుగా ఉన్న ఎన్ఆర్ఈజీఎస్కూ క్షవరం తప్పలేదు. ఇక ఆదాయపు పన్ను సవరణల కోసం ఆశపడ్డ వేతన జీవులను పొగిడారు తప్ప పైసా విదల్చలేదు. అలాగని పొదుపరులు, మదుపరులకు కూడా దక్కిందేమీ లేదు. ఇంటర్నెట్ సిగ్నల్స్కు మైళ్ల దూరం నడిచే గ్రామాల్లో... ఎకరా, అరెకరాపై యావత్తు కుటుంబం ఆధారపడ్డ క్షేత్రాల్లో ఈ డిజిటల్ విప్లవం తెచ్చే మార్పులెలా ఉంటాయి? కాకపోతే.. దేశాభివృద్ధికి ప్రధాన చోదకమైన రోడ్లు, తాగునీరు, ఇళ్ల వంటి మౌలిక సదుపాయాలకు మాత్రం నిర్మల జై కొట్టారు. కోవిడ్ కారణంగా రెండేళ్లుగా ఆగిపోవటంతో... 25వేల కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి జెండా ఊపారు. 400 వందే భారత్ రైళ్లనూ ప్రతిపాదించారు. రాష్ట్రాలు చేసే మూలధన వ్యయానికి కేంద్రమిచ్చే సాయాన్ని కూడా ఆర్థిక మంత్రి భారీగానే 50 శాతం వరకూ పెంచారు. ఇది ప్రజల బడ్జెట్. మరింతగా ఇన్ఫ్రా, ఇన్వెస్ట్మెంట్లు, వృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా రూపొందిన ప్రగతిశీల బడ్జెట్. ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూనే, సామాన్యుడు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి సరికొత్త అవకాశాలు చూపడమే లక్ష్యంగా బడ్జెట్ రూపొందింది. ఒక్కమాటలో చెప్పాలంటే, అన్ని రంగాలూ మనస్ఫూర్తిగా స్వాగతించిన ‘ఆత్మనిర్భర్ భారత్ బడ్జెట్’ ఇది. – ప్రధాని మోదీ బడ్జెట్ ప్రతిపాదనలతో రేట్లు పెరిగే, తగ్గే ఉత్పత్తులు.. ఇవి ప్రియం.. దిగుమతి చేసుకున్న హెడ్ఫోన్లు, ఇయర్ఫోన్లు, లౌడ్స్పీకర్లు, గొడుగులు, స్మార్ట్ మీటర్లు, ఇమిటేషన్ ఆభరణాలు, సోలార్ సెల్స్, సోలార్ మాడ్యూల్స్, ఎక్స్రే మెషీన్లు, ఎలక్ట్రానిక్ బొమ్మల్లో విడిభాగాలు. ఇవి చౌక .. వజ్రాలు (కట్, పాలిష్డ్), కోకో బీన్స్, ఇంగువ, ఫ్రోజెన్ మసల్స్ .. ఫ్రోజెన్ స్క్విడ్స్ (సముద్ర ఆహార ఉత్పత్తులు), మీథైల్ ఆల్కహాల్, ఎసిటిక్ యాసిడ్, దుస్తులు, సెల్ఫోన్లలో వాడే కెమెరా లెన్స్, మొబైల్ చార్జర్లు, పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమయ్యే రసాయనాలు, స్టీల్ స్క్రాప్. మౌలిక సదుపాయాల కల్పన, డిజిటలైజేషన్ లక్ష్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.39.45 లక్షల కోట్లతో 2022–23 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వందేళ్ల స్వాతంత్య్ర భారతానికి మార్గం వేస్తూ.. దీర్ఘకాలిక లక్ష్యాలతో బడ్జెట్ను రూపొందించినట్టు ప్రకటించారు. ప్రధానంగా రోడ్లు, ఇతర రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటలైజేషన్పై దృష్టిపెట్టారు. విద్యా రంగం, నైపుణ్య శిక్షణకు సంబంధించి నిర్మల పలు కీలక ప్రతిపాదనలు చేశారు. కరోనా నేపథ్యంలో తప్పనిసరిగా మారిన ఆన్లైన్ క్లాసులకు సంబంధించి.. ఒక్కో తరగతికి ఒక్కో టీవీ చానల్ ఏర్పాటు, అందులోనూ ప్రాంతీయ భాషల్లో పాఠాలు చెప్పాలన్న నిర్ణయం ఆకట్టుకుంది. డిజిటల్ యూనివర్సిటీలు, , చిప్ ఆధారిత పాస్పోర్టులు, కాగిత రహిత విధానం, అమల్లోకి 5జీ టెక్నాలజీ, ఆఫ్టికల్ ఫైబర్ నెట్వర్క్, టెలిమెడిసిన్ సేవలు, వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం, ‘ఈ–రూపీ’ డిజిటల్ కరెన్సీ ప్రవేశపెట్టడం వంటి డిజిటలైజేషన్ చర్యలను ఆర్థికమంత్రి ప్రకటించారు. అయితే పన్నులకు సంబంధించి దాదాపుగా ఎలాంటి మార్పులనూ ప్రకటించలేదు. ముఖ్యంగా వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి పెంచకపోవడం ఉద్యోగులు, మధ్యాదాయ వర్గాలకు నిరాశ కలిగించింది. మరోవైపు డిజిటల్ ఆస్తులు, క్రిప్టో కరెన్సీలను పన్ను పరిధిలోకి తేవడం గమనార్హం. కరోనా సమయంలో ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలకు 50 ఏళ్ల గడువుతో రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణాలను ఇస్తున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించినా.. రాష్ట్రాలు డిమాండ్ చేసిన మేర నిధులు, ప్రాజెక్టులు ఇవ్వలేదన్న అసంతృప్తి వ్యక్తమైంది. ఇక రక్షణ రంగంలో పరిశోధనలు చేసేందుకు.. ప్రైవేట్ పరిశ్రమలు, స్టార్టప్లు, విద్యాసంస్థలకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. కరోనా బాధితులకు సానుభూతితో.. దేశంలో కరోనా మహమ్మారి బాధితులు, ఆర్థికంగా దెబ్బతిన్నవారికి సానుభూతి ప్రకటిస్తూ నిర్మలా సీతారామన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. గత రెండేళ్లలో మెరుగుపర్చిన వైద్య సౌకర్యాలు, వేగవంతమైన వ్యాక్సినేషన్తో కోవిడ్ను సమర్థవంతంగా ఎదుర్కోగలిగామని చెప్పారు. మన ఆర్థిక వ్యవస్థ కూడా వేగంగా పునరుత్థానం చెందిందని, పెద్ద దేశాలన్నింటిలో అత్యధికంగా 9.2 శాతం వృద్ధి సాధించిందని వివరించారు. 2014లో తమ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి దేశ ప్రజలు.. ముఖ్యంగా పేదల సాధికారత కోసం కృషి చేస్తున్నామని నిర్మల తెలిపారు. ప్రస్తుతం వందేళ్ల స్వాతంత్య్ర భారతం దిశగా ఆర్థిక వ్యవస్థను నడిపించడం కోసం ప్రస్తుత బడ్జెట్లో పునాది వేస్తున్నామని ప్రకటించారు. గతేడాది బడ్జెట్లో ప్రకటించిన చాలా అంశాల్లో గణనీయమైన పురోగతి సాధించామన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కింద చేపట్టిన పథకాలకు మంచి స్పందన వచ్చిందని.. వచ్చే ఐదేళ్లలో 30 లక్షల కోట్ల అదనపు ఉత్పత్తులు, 60 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. అద్భుత మార్పుల వైపు.. ‘గతిశక్తి’ దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు తెచ్చేందుకు మౌలిక సదుపాయాల పెంపును కేంద్ర ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. మౌలిక సదుపాయాలు పెరగడం, వాటికోసం ప్రభుత్వం చేసే వ్యయంతో.. పారిశ్రామిక వృద్ధి, వినియోగం ఊపందుకుంటాయని.. ఆర్థిక వ్యవస్థకు జోష్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థను అద్భుత మార్పు దిశగా తీసుకెళ్లేందుకు ‘ప్రధానమంత్రి గతిశక్తి’ కార్యక్రమాన్ని చేపట్టామని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రధానంగా ఏడు చోదకశక్తులైన రోడ్లు, రైల్వే, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, జల మార్గాలు, ప్రజా రవాణా, సరుకు రవాణా సదుపాయాలు కీలకమని వెల్లడించారు. ఈ ఏడు చోదకశక్తులకు తోడుగా ఇంధన వనరుల మార్పు, ఐటీ కమ్యూనికేషన్లు, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థలు, సామాజిక మౌలిక సదుపాయాలు కలిసి ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్తాయని పేర్కొన్నారు. ‘పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్’కు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు రంగం ఉమ్మడిగా ముందుకెళతాయని వెల్లడించారు. పీఎం గతిశక్తి పథకం కింద.. దేశవ్యాప్తంగా రోడ్డు, రైల్వే, ఇతర రవాణా వ్యవస్థలను విస్తరిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రైల్వేలకు అనుసంధానంగా అర్బన్ ట్రాన్స్పోర్ట్, పర్వత ప్రాంతాల్లో రోప్వేలు, మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులు వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మొత్తంగా దేశంలో మౌలిక సదుపాయాల పెంపుపై కేంద్ర ఆర్థిక మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. డిజిటలైజేషన్తో.. ‘సమ్మిళిత వృద్ధి’ వ్యవసాయం నుంచి విద్య దాకా.. ఆరోగ్యం నుంచి బ్యాంకింగ్ దాకా.. ప్రజలతో ముడిపడి ఉన్న అన్నిరంగాల అభివృద్ధికి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో చోటు కల్పించారు. వ్యవసాయం సహా అన్ని రంగాల్లో సాంకేతికత వినియోగం, డిజిటలైజేషన్పై ప్రధానంగా దృష్టిపెట్టారు. పరిశ్రమలకు అవసరమైన తోడ్పాటు అందిస్తూనే.. విద్యా రంగంలో టెక్నాలజీ వినియోగం,, నైపుణ్యాల అభివృద్ధి అంశాలకూ బడ్జెట్లో ప్రాధాన్యత కల్పించారు. ప్రస్తుత బడ్జెట్లో ‘సమ్మిళిత వృద్ధి’పై దృష్టిపెట్టినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇందుకోసం వ్యవసాయం, విద్యుత్, నదుల అనుసంధానం, ఫుడ్ ప్రాసెసింగ్, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు తోడ్పాటు, కార్మికులు, యువతలో నైపుణ్యాల అభివృద్ధి, నాణ్యమైన విద్య, డిజిటల్ యూనివర్సిటీలు, ఆయుష్మాన్ భారత్, నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్, మహిళా శిశు సంక్షేమ పథకాలు, ఇంటింటికీ సురక్షిత మంచినీరు, అందరికీ ఇళ్లు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, డిజిటల్ బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్స్ వంటి రంగాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. సమర్థంగా ఉత్పాదకత.. భద్రతకు ‘పరిరక్షణ’ ఆర్థికాభివృద్ధికోసం ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, ఉత్పాదకత పెంపు వంటివి ఓవైపు చేపడుతూనే.. మరోవైపు పర్యావరణ పరిరక్షణ దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి చూపు సారించారు. ఇందులోనూ సాంకేతిక వినియోగం, డిజిటలైజేషన్కు ప్రాధాన్యత ఇచ్చారు. పరిశ్రమలు, సంస్థలు మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు.. మూలధనం, మానవ వనరుల ఉత్పాదకతను పెంచేందుకు సులభతర వ్యాపారం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) 2.0ను అమలు చేయనున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రభుత్వ అనుమతులను మరింత సరళీకృతం చేస్తామని, ఎగుమతులను పెంచే చర్యలు చేపడతామని వెల్లడించారు. యువతకు భారీగా ఉద్యోగావకాశాలు కల్పించే యానిమేషన్, టెలికం, కృత్రిమ మేధ (ఏఐ), జినోమిక్స్, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడతామన్నారు. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా పలు స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలను తాజా బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. కాలుష్య రహిత ఇంధనాలు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తామన్నారు. ఎలక్ట్రిక్ వేస్ట్, కాలం చెల్లిన వాహనాలు, ప్రమాదకర పారిశ్రామిక వ్యర్థాలను నియంత్రించడం, జాగ్రత్తగా డంప్ చేయడంపై దృష్టిపెడతామన్నారు. అభివృద్ధికి ‘పెట్టుబడి’ సాయం.. దేశ అభివృద్ధికి, ఆర్థిక వ్యవస్థ వేగంగా దూసుకెళ్లడానికి కీలకమైన పెట్టుబడుల (ఇన్వెస్ట్మెంట్)కు ప్రోత్సాహాన్ని ఇవ్వడంపై నిర్మలా సీతారామన్ దృష్టిపెట్టారు. ప్రభుత్వ మూలధన వ్యయాన్ని భారీగా పెంచడంతోపాటు.. ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడానికి తోడ్పడే చర్యలను బడ్జెట్లో ప్రతిపాదించారు. కేంద్ర బడ్జెట్లో మూలధన వ్యయానికి కేటాయింపులను ఏకంగా 35.4 శాతం పెంచారు. డేటా సెంటర్లు, విద్యుత్ నిల్వ వ్యవస్థలు, బ్యాటరీలు, భారీ చార్జింగ్ సదుపాయాల స్థాపన, టెక్నాలజీ ఆధారిత ఆర్థిక, ఫార్మా, అగ్రిటెక్ సంస్థలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల నుంచి నిధులు అందించేలా చూస్తామని ప్రకటించారు. రాష్ట్రాలు మూలధన వ్యయాన్ని పెంచేందుకు కేంద్రం నుంచి రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణసాయం అందించనున్నట్టు తెలిపారు. నాలుగు ప్రాధాన్యతలతో.. ఇండియా 100 విజన్ను సాధించే క్రమంలో ప్రస్తుత బడ్జెట్లో నాలుగు ప్రాధాన్యతలను ఎంచుకున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ► ప్రధానమంత్రి గతిశక్తి, ► సమ్మిళిత అభివృద్ధి, ► పెట్టుబడులు, ఉత్పాదకత పెంపుదల, కొత్త ఇంధనాలవైపు చూపు, పర్యావరణ పరిరక్షణ చర్యలు, ► అభివృద్ధికి తోడ్పడేలా పెట్టుబడుల నిర్వహణ’’.. ఆ నాలుగు ప్రాధాన్యతలని వెల్లడించారు. ఈ నాలుగు ప్రాధాన్యతల కింద ఆర్థిక వృద్ధి, సుస్థిర అభివృద్ధి కోసం చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. -
హైవేల నిధులకు ‘రూట్’ క్లియర్!
National Highways to be expanded: రాష్ట్రంలోని కొత్త జాతీయ రహదారులకు ‘రూట్’క్లియర్ అయింది. కొన్నేళ్లుగా కేంద్రప్రభుత్వం తెలంగాణకు కొత్త జాతీయరహదారులను బాగానే కేటాయిస్తున్న విషయం తెలిసిందే, వాటి నిర్మాణానికి కూడా భారీగానే నిధులు కేటాయిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.7 వేల కోట్ల విలువైన జాతీయ రహదారులకు పచ్చజెండా ఊపిన కేంద్రం, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ దాదాపు రూ.7 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్ల విలువైన రోడ్డు పనులకు అనుమతులు మంజూరు చేసే అవకాశముంది. తాజా బడ్జెట్లో దేశవ్యాప్తంగా 25 వేల కి.మీ. రోడ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేంద్రం ప్రకటించింది. రూ.20 వేల కోట్లకుపైగా నిధులు ఖర్చు చేయనున్నట్టు పేర్కొంది. ఇందులో మన రాష్ట్రానికి రూ.3,500 కోట్ల మేర కొత్తగా నిధులు కేటాయించే అవకాశముందని ఒక అంచనా. పెండింగ్లో ఉన్న ప్రతిపాదనలకు సంబంధించి దాదాపు రూ.3,500 కోట్లు త్వరలో రానున్నాయి. అవి పాత బడ్జెట్ కిందే ఇచ్చే అవకాశం ఉంది. కొత్త బడ్జెట్ కేటాయింపుల నుంచి మరో రూ.3,500 కోట్లు వస్తుండొచ్చని రాష్ట్ర అధికారులు భావిస్తున్నారు. వెరసి వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.7 వేల కోట్లకుపైగా విలువైన కొత్త రోడ్లకు పచ్చజెండా ఊపే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే కొన్ని రాష్ట్ర రహదారులకు జాతీయ రహదారుల హోదా ఇచ్చిన కేంద్రం, వాటికి అనుమతులు, డీపీఆర్లు, పనుల ప్రారంభానికి పచ్చజెండా ఊపనుంది. మరో రెండుమూడు కొత్త రోడ్లకు కూడా నిధులు కేటాయించే అవకాశం ఉంది. అనుమతులు రావాల్సిన రోడ్లు ఇవే.. గత ఏడాదికాలంలో తెలంగాణ రాష్ట్రంలో 3,306 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. అందులో 2,168 కి.మీ. మేర రోడ్లకు అనుమతులు మంజూరు చేసింది. ఇంకా 1,138 కి.మీ. రోడ్లకు సంబంధించి అనుమతులు ఇవ్వాల్సి ఉంది. వాటిల్లో రీజినల్ రింగురోడ్డులోని ఉత్తర భాగానికి అనుమతి రాగా, దక్షిణ భాగమైన చౌటుప్పల్–ఆమన్గల్–షాద్నగర్–కంది రోడ్డుకు పచ్చజెండా ఊపాల్సి ఉంది. ఇది దాదాపు 183 కి.మీ. మేర ఉంటుంది. ఇక కరీంనగర్–సిరిసిల్ల–కామారెడ్డి–ఎల్లారెడ్డి–పిట్లం రహదారి, కొత్తకోట–గూడూరు–మంత్రాలయం, జహీరాబాద్–బీదర్–డెగ్లూర్ రహదారులకు సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఐఆర్ఎఫ్) నుంచి రూ.750 కోట్లు కేటాయించాల్సి ఉంది. వీటికి మరిన్ని జత చేసి వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేటాయించే అవకాశం ఉందని రాష్ట్ర అధికారులు అంచనా వేస్తున్నారు. -
సుస్థిర అభివృద్ధిలో దూసుకుపోతున్న ఏపీ
సాక్షి, అమరావతి: సుస్థిర అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతోందని ప్రభుత్వ సలహాదారు (స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్) సలహాదారు చల్లా మధు తెలిపారు. ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా ర్యాంకింగ్స్లో సుస్థిర అభివృద్ధిలో 72 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో నిలిచిందని చెప్పారు. తాడేపల్లిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... నీతి ఆయోగ్ విడుదల చేసిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచి 2020–21లో దేశంలో కోస్తా రాష్ట్రాల్లో ఒడిశా తర్వాతి స్థానాన్ని ఏపీ దక్కించుకొందన్నారు. రాష్ట్రంలో అనేక సంస్కరణలు ప్రవేశపెడుతూ సంక్షేమం, అభివృద్ధి పరంగా ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శక్తివంతంగా మారుతుండటాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోందని అన్నారు. ప్రభుత్వంపైన, వైఎస్సార్సీపీ పైనా ఎల్లో మీడియా బలంతో దుర్మార్గమైన కుట్ర, కుతంత్రాలతో అధికారమే పరమావధిగా టీడీపీ దుష్ప్రచారానికి ఒడిగడుతోందన్నారు. నీతి ఆయోగ్ విడుదల చేసిన ర్యాంకులను చూసిన తర్వాత అయినా చంద్రబాబు, ఆయన కుమారుడు, టీడీపీ నేతలు వారి తీరు మార్చుకోవాలని హితవు పలికారు. వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమం ఓ విప్లవాత్మక చర్య అని అన్నారు. చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో చేయలేనిది వైఎస్ జగన్ సీఎంగా రెండున్నరేళ్లలో చేసి చూపారని తెలిపారు. కేంద్ర బడ్జెట్ రాష్ట్రాలకు ప్రయోజనకారి కాదు కేంద్ర బడ్జెట్ పూర్తిగా నిరుత్సాహపరిచిందని చెప్పారు. ఈ బడ్జెట్ రాష్ట్రాలకు ఏమాత్రం ప్రయోజనకరంగా లేదన్నారు. రాష్ట్రానికి సంబంధించిన చాలా విషయాలపై ఎలాంటి ప్రస్తావనా చేయలేదని తెలిపారు. చూడటానికి మేడిపండులా ఉన్నా, అందులో ఏమీ లేదని తెలిపారు. ఆర్థిక మంత్రి చెప్పిన సబ్ కా వికాస్ అస్సలు లేదన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా అత్యల్పంగా ఉందన్నారు. రాష్ట్రాలకు మూలధన వ్యయం కింద లక్ష కోట్లు ఇస్తామన్నారని, ఇప్పుడున్న ఫార్ములా మేరకు రాష్ట్రానికి రూ.4 వేల కోట్లే వస్తుందన్నారు. వెంటనే ఆ ఫార్ములాను సవరించి, రాష్ట్ర వాటా పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. -
నిరాశాజనకంగా కేంద్ర బడ్జెట్
సాక్షి, అమరావతి: కేంద్ర బడ్జెట్ చాలా నిరాశాజనకంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం చెప్పారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో మాట్లాడుతూ.. ఆంద్రప్రదేశ్ పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపించిందని తెలిపారు. భారతీయ జనతా పార్టీ అనేది ఉత్తర భారతీయ జనతా పార్టీగా నిజస్వరూపాన్ని మరోసారి చూపించుకొందని వ్యాఖ్యానించారు. దక్షిణాది రాష్ట్రాలను మరోసారి వంచించే ప్రయత్నం చేశారన్నారు. విభజన హామీలు అయిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్, ఆంధ్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడాన్ని చూస్తే బీజేపీ ఆంద్రప్రదేశ్ని పూర్తిగా విస్మరించినట్లు స్పష్టమైందని అన్నారు. కేంద్రం తీరును ఖండిస్తున్నామన్నారు. కేవలం ఎన్నికలు జరిగే రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపొందించడం చాలా దుర్మార్గమని మండిపడ్డారు. పార్టీలు ఏవయినా అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూడాలని, అప్పుడే కేంద్ర రాష్ట్రాల మధ్య సమైక్య స్పూర్తి వర్ధిల్లుతుందని తెలిపారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం కేంద్రం మీద ఒత్తిడి చేసి రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఆంద్రప్రదేశ్కు వెంటనే తగిన న్యాయం చేసి, బడ్జెట్లో కేటాయింపులను సరి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
‘బడుగుల సంక్షేమాన్ని మరిచిన కేంద్ర బడ్జెట్’
సాక్షి, హైదరాబాద్: కేంద్రప్రభుత్వ బడ్జెట్లో బీసీలకు 74 ఏళ్లుగా అన్యాయం జరుగుతూనే ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విమర్శించారు. మంగళవారం లోక్సభలో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేశ్ అధ్యక్షతన బీసీ భవన్లో జరిగిన సమావేశానికి కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించాలని పలు మార్లు ప్రధాని మోదీకి, కేంద్రమంత్రులకు విన్నవించినా కేంద్రానికి చీమకుట్టినట్లుకూడా లేదని మండిపడ్డారు. కేంద్రప్రభుత్వం తన బీసీ వ్యతిరేక వైఖరిని వెంటనే మార్చుకోకపోతే బీసీలమంతా ఏకమై పార్లమెంట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. బీసీ ప్రధాని అయితే బీసీలకు న్యాయం జరుగుతుందని తాము అనుకున్నప్పటికీ మోదీ పాలనలో నేటికీ అన్యాయం, వివక్ష కొనసాగుతున్నాయని ఆరోపించారు. సురేశ్ మాట్లాడుతూ దేశంలోని 6 వేల బీసీ కులాలను ఆదుకునేలా బడ్జెట్ను పునఃసమీక్షించాలన్నారు. కార్యక్రమంలో సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, అనంతయ్య, అంజి, జయం తిగౌడ్, హరీశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ ప్రయోజనాలు విస్మరించిన కేంద్రం
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను విస్మరించిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్ర బడ్జెట్లో విస్మరించడం తీవ్ర నిరాశపరిచిందని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం, మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల కోసం బడ్జెట్లో కనీసం ప్రస్తావించకపోవడం పట్ల ఒక ప్రకటనలో అసంతృప్తి వ్యక్తంచేశారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్నారు. కానీ, రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకపోవడం సమంజసం కాదని అన్నారు. కరోనా పరిస్థితులు, పరిమిత వనరులు, రుణాలపై ఆంక్షలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నుంచి భారీగా నిధుల కేటాయింపు, రుణ సేకరణకు పరిమితులు పెంచి ఉంటే బాగుండేదని తెలిపారు. రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహద పడేదని అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం, ఎరువులు, ఆహార సబ్సిడీ తదితర వాటిలో రాష్ట్రాలకు కేంద్రం కోత విధించిందన్నారు. జలజీవన్ మిషన్, జాతీయ విద్యా మిషన్, జాతీయ ఆరోగ్య మిషన్ తదితర ప్రాజెక్టులకు నిధులు పెంచినప్పటికీ ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా అవి ఏమాత్రం చాలవన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్కు మరిన్ని నిధుల అవసరం ఉందన్నారు. జాతీయ రహదారులకు నిధులు రెండింతలు చేయడం, రాష్ట్రాలకు ఆర్థిక సహాయం చేసేందుకు పెట్టుబడి నిధులను రూ.లక్ష కోట్లకు పెంచడం హర్షణీయమన్నారు. రోడ్లు, రైల్వేలు, ఎయిర్పోర్టులు, పోర్టులు, రవాణా, జలమార్గాలు, లాజిస్టిక్స్–మౌలిక సదుపాయాలు అనే ఏడు రంగాలను చోదక శక్తులు (గ్రోత్ ఇంజన్స్)గా చేసుకొని జాతీయ మాస్టర్ ప్లాన్ రూపొందించడం శుభపరిణామమన్నారు. రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కొరతను అధిగమించేలా తగినన్ని నిధులు కేటాయిస్తేæ జాతి నిర్మాణంలో రాష్ట్రాలు మరింత సమర్ధవంతమైన పాత్ర పోషిస్తాయని చెప్పారు. అత్యవసర పరపతి హామీ పథకాన్ని 2023 మార్చి వరకు పొడిగించడం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణ సహాయం కోసం పరపతి మొత్తాన్ని పెంచడం ఆర్థిక వృద్ధికి తోడ్పాటునిస్తుందన్నారు. రక్షణ, రక్షణ పరిశోధనకు అవసరమైన వాటిని దేశీయంగా సమకూర్చుకోవాలని నిర్ణయించడం ముదావహమని అన్నారు. రక్షణ రంగానికి గత బడ్జెట్లో కేటాయింపులు రూ. 13.89 లక్షల కోట్ల నుంచి రూ.15.23 లక్షల కోట్లకు పెంచడం, రైల్వేలకు కేటాయింపులు రూ. 2.04 లక్షల కోట్ల నుంచి 2.39 లక్షల కోట్లకు పెంచడం సానుకూల పరిణామమని చెప్పారు. కానీ వడ్డీ చెల్లింపుల కోసం కేటాయింపులు రూ. 8.14 లక్షల కోట్ల నుంచి రూ. 9.41 లక్షల కోట్లకు పెరగడం ఆందోళన కల్గిస్తోందని అన్నారు. జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరగడంతో ఈ ఏడాది స్థూల పన్ను రాబడి రూ. 17.65 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. 2020–21లో రూ. 197.46 లక్షల కోట్లుగా ఉన్న జీడీపీ 2021–22లో రూ. 232.18 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. జీడీపీలో ద్రవ్య లోటు 2020–21లో 9.21 శాతం ఉండగా, 2021–22లో 6.85 శాతానికి తగ్గిందని తెలిపారు. రెవెన్యూ లోటు 2020–21లో జీడీపీలో 7.34 శాతం ఉండగా, 2021–22లో 4.,69 శాతానికి తగ్గడం ప్రోత్సాహకరంగా ఉందని చెప్పారు. -
పన్నులు పెంచకపోవడమే ‘ఊరట’
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం భారీ ఎత్తున వ్యయాలు చేస్తున్నప్పటికీ, అందుకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు ప్రజలపై పన్నుల భారం మోపలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో పన్నులు పెంచకపోవడమే మధ్యతరగతి వర్గాలకు ఊరటగా భావించాలని పరోక్షంగా వ్యాఖ్యానించారు. బడ్జెట్లో ఆదాయ పన్ను భారం తగ్గేలా ప్రతిపాదనలు ఉంటాయని మధ్య తరగతి వర్గాలు ఆశించినప్పటికీ దానికి భిన్నంగా ట్యాక్స్ శ్లాబుల్లో ఎటువంటి మార్పులు చేయలేదు. దీని మీద వచ్చిన ప్రశ్నలపై మంత్రి ఈ విధంగా స్పందించారు. ‘పన్నులు పెంచుతారేమోనని అంచనాలు పెట్టుకుని ఉంటే, నేను ఆ పని చేయలేదు. గతేడాది, ఈ ఏడాది కూడా నేను పన్ను రేట్లు పెంచలేదు. అదనంగా పన్ను భారం మోపి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. పన్నులను పెంచడం ద్వారా మహమ్మరి సవాళ్లను ఎదుర్కొనవచ్చని అనుకోలేదు‘ అని చెప్పారు. ఇన్ఫ్రా, గ్రామీణం, వ్యవసాయం, హౌసింగ్ మొదలైన వాటిపై ప్రభుత్వం చేసే వ్యయాలను గురించి వివరిస్తూ .. వీటి వల్ల అంతిమంగా మధ్య తరగతి వర్గాలకు అదనపు ఆదాయం లభించగలదని తెలిపారు. ‘కొన్ని సందర్భాల్లో ఇవ్వగలం. మరికొన్ని సందర్భాల్లో వేచి చూడాల్సి ఉంటుంది. అయినప్పటికీ మిడిల్ క్లాస్ కోసం చాలానే చేశాం‘ అని మంత్రి చెప్పారు. ఎంఎస్ఎంఈలు, అందుబాటు ధరల్లో గృహాలు, సీనియర్ సిటిజన్లు, రిటైల్ ఇన్వెస్టర్లు మొదలైన వర్గాల కోసం అమలు చేస్తున్న చర్యలను ప్రస్తావిస్తూ.. మధ్యతరగతి వర్గానికి చెందిన వారందరికీ ఉపశమనం చేకూర్చామని వివరించారు. -
ఇది ప్రజల బడ్జెట్.. ఆత్మనిర్భర బడ్జెట్
ఇది ప్రజల బడ్జెట్. మరింత ఇన్ఫ్రా, మరిన్ని ఇన్వెస్ట్మెంట్లు, మరింత వృద్ధి, మరిన్ని ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా రూపొందిన ప్రగతిశీల బడ్జెట్. పేదల సంక్షేమానికి పెద్దపీట వేయడం ఇందులోని ప్రధాన హైలైట్. ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూనే, సామాన్యుడు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి సరికొత్త అవకాశాలు చూపడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపొందింది. ప్రతి నిరుపేదకూ పక్కా ఇల్లు, టాయిలెట్, నల్లా నీరు, గ్యాస్ కనెక్షన్ల కలను సాకారం చేయనుంది. ఆధునిక ఇంట ర్నెట్ కనెక్టివిటీకీ ప్రాధాన్యమిచ్చింది. యువతకు మెరుగైన భవిష్యత్తుకు భరోసానిచ్చింది. హిమాచల్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల వంటి కొండ ప్రాంతాల్లో ఆధునిక రవాణా వ్యవస్థకు బాటలు వేస్తోంది. రైతులకు డ్రోన్లు, వందే భారత్ ట్రైన్లు, డిజిటల్ కరెన్సీ, 5జీ సేవలు, నేషనల్ డిజిటల్ హెల్త్ ఎకో సిస్టమ్ తదితరాలతో యువత, మధ్యతరగతికే గాక పేద, దళిత, వెనకబడ్డ వర్గాలకు కూడా ఎంతో లబ్ధి చేకూరుతుంది. గంగా ప్రక్షాళనతో పాటు నది పరీవాహక రాష్ట్రాల్లో సహజ సాగును ఈ బడ్జెట్ ప్రోత్సహించనుంది. అగ్రి స్టార్టప్లకు ప్రోత్సాహం, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి ప్యాకేజీ వంటివి రైతు ఆదాయాన్ని బాగా పెంచేవే. వారికి రుణ హామీతో పాటు మరెన్నో పథకాలు ఈ బడ్జెట్లో ఉన్నాయి. రక్షణ బడ్జెట్లో 68 శాతాన్ని దేశీయ పరిశ్రమకే రిజర్వ్ చేయడం వల్ల ఎంఎస్ఎంఈ రంగానికి ఎంతో లబ్ధి చేకూరుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, అన్ని రంగాలూ మనస్ఫూర్తిగా స్వాగతించిన ’ఆత్మనిర్భర్ భారత్ బడ్జెట్’ ఇది! -
ఇది అసమానతలు పెంచే బడ్జెట్
ఒక సంపన్న దేశంగా మారాలనుకుంటున్నాం కానీ, ఒక సంక్షేమ దేశంగా మారాలనే స్వప్నాన్ని వదిలేశాం. ఈ నియో లిబరలిజం భావజాలమే మనకు ఈ బడ్జెట్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఏ దేశంలోనైనా అభివృద్ధి సాధించాలంటే రెండు రంగాలు ప్రధానం. మొదటిది విద్య, రెండోది వైద్య రంగం. రెండేళ్ల క్రితం ‘జాతీయ విద్యా విధానా’న్ని ప్రకటించిన ప్రభుత్వమే ఇప్పుడు విద్యారంగానికి ఎక్కువ డబ్బులు కేటాయించకపోవడం అనేది మనమెలా అర్థం చేసుకోవాలి! ఇక రెండోదైన వైద్య రంగంలో మనం కేటాయించే బడ్జెట్ గత 70 ఏళ్లుగా చాలా తక్కువే. దాదాపు 30 ఏళ్లుగా వైద్య రంగాన్ని కూడా పూర్తిగా మార్కెట్కు అప్పజెప్పే దిశలోనే ముందుకెళ్లాం. 80వ దశకం నుంచి బడ్జెట్ దృష్టంతా సంపద పెంపు పైనే ఉంది కానీ సంక్షేమం అనేది పూర్తిగా వెనక్కు నెట్టబడింది. దీని ఫలితంగా భారతదేశంలో గతంలో ఎన్నడూ లేనంత అసమానతలు పెరిగిపోయాయి. చాలా మంది బడ్జెట్ను ఆదాయాల, ఖర్చు పట్టికగా పరిగణిస్తారు. బడ్జెట్ అంటే కేవలం లెక్కలు చూపడమో, లేక ప్రభుత్వ కార్యక్రమాల మెనూ అనుకుంటారు. కానీ, భారతదేశం లాంటి దేశంలో బడ్జెట్ ఒక సామాజిక ప్రయోజనం, సామాజిక మార్పునకు సాధనంగా పరిగణించాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగం ఆదేశిక సూత్రాలలో చాలా స్పష్టంగా అన్ని రకాల అసమానతలనూ తగ్గిస్తాం అని వాగ్దానం చేసింది. మనం ఈ అసమానతలను ఎలా తగ్గిస్తాం అనే ఒక సవాల్ను ఎదుర్కొంటే దేశ సంపదలను, ఉత్పత్తి సాధనాలను కేంద్రీకృతం కాకుండా సర్వ ప్రయోజనానికి దారి తీయాలని కూడా రాజ్యాంగం స్పష్టంగా చెబుతోంది. ఈ సంపద పంచడం కానీ, లేదా ఉత్పత్తి సాధనాలను కానీ సమష్టి సమాజం చేతిలో కాకుండా వ్యక్తుల చేతిలోనే ఉండిపోయాయి. ఇక, అసమానతలను తగ్గించడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం బడ్జెట్. 1950–60లలో మన దేశంలో సంపద పెరుగుతున్న కొద్దీ ప్రత్యక్ష పన్ను అదే నిష్పత్తిలో పెరుగుతూ వచ్చేది. అలా పెంచి, దాని ద్వారా వచ్చిన ఆదాయాలతో దేశంలోని పెద్ద పెద్ద ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించారు. అలాగే సంక్షేమానికి ఆ వనరులను ఉపయోగించారు. 1970వ దశకంలో దేశ వ్యాప్తంగా అసంతృప్తి పెరిగినప్పుడు పేదరిక నిర్మూలన అనే ఒక నినాదం రావడమే కాక, బ్యాంకుల జాతీయీకరణ చేసి మొత్తంగా రాజ్యం పేద ప్రజలకు ఒక విశ్వాసాన్ని కల్పించే ప్రయత్నం చేసింది. 1980వ దశకం వచ్చేవరకు దేశ సంపద పెరగాల్సిన అంత వేగంగా పెరగడం లేదనీ, సంపద సృష్టికి సంపన్నులు తమ ఆదాయాన్ని పెంచుకునే వసతి కల్పిస్తే తప్ప దేశ సంపదను పెంచలేమనే పెట్టుబడిదారీ భావజాలం మన విధాన నిర్ణయాల్లోకి ప్రవేశించింది. ఇక, 80వ దశకం నుంచి బడ్జెట్ దృష్టంతా సంపద పెంపు పైనే ఉంది కానీ సంక్షేమం అనేది పూర్తిగా వెనక్కు నెట్టబడింది. దీని ఫలితంగా భారతదేశంలో గతంలో ఎన్నడూ లేనంత అసమానతలు పెరిగిపోయాయి. దేశ జనాభాలో ఒక్క శాతం ఉండే సంపన్నుల దగ్గర 56 శాతం ఆదాయం, దాదాపు 40 శాతం మంది ఉండే కింది వర్గాల దగ్గర మాత్రం 20 శాతం ఆదాయమే చేరుతోంది. ఒకప్పుడు వ్యవసాయ రంగానికి దేశంలో దాదాపు 40 – 50 శాతం వాటా ఉంటే, ఈ రోజు అది 13 శాతానికి తగ్గింది. దీంతో 3 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే దయనీయ పరిస్థితుల్లోకి వ్యవసాయ రంగం నెట్టబడింది. నిజానికి, దేశ జనాభాలో 45 శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు. కానీ, విధాన లోపం వల్ల అసమానతలు తీవ్రంగా పెరగడమే కాకుండా పేదరికం కూడా పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యమే రైతాంగ ఉద్యమాలకు దారితీసింది. గత ఏడాది కాలంలో వాళ్లు ఉద్యమం చేయడమే కాక, ఏకంగా 700 మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి ఇలా ఉన్నా బడ్జెట్లో దీని ప్రభావం మనకేమీ కనిపించడం లేదు. ఒకే ఒక్క అంశం ఏమిటంటే... కనీస మద్దతు ధర కోసం రూ. 2 లక్షల కోట్లు కేటాయించినట్టు విత్తమంత్రి ప్రకటించడం. విద్య, వైద్యాలకు ఇంతేనా? ఏ దేశంలోనైనా అభివృద్ధి సాధించాలంటే రెండు రంగాలు ప్రధానం. మొదటిది విద్య, రెండోది వైద్య రంగం. అమెరికా లాంటి పెట్టుబడిదారీ వ్యవస్థలో కూడా కామన్స్కూల్ విద్యా విధానాన్ని అమలు చేసి, అక్కడి పిల్లలందరికీ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారు. జపాన్, చైనా, దక్షిణకొరియా లాంటి దేశాలే కాక చాలా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ విద్యకు గణనీయమైన వాటా కేటాయిస్తున్నారు. విద్యారంగంలో పెట్టిన వనరులు ఆ దేశాల అభివృద్ధికి దోహదపడ్డాయి. రెండేళ్ల క్రితం ‘జాతీయ విద్యా విధానా’న్ని ప్రకటించిన ప్రభుత్వమే ఇప్పుడు విద్యారంగానికి ఎక్కువ డబ్బులు కేటాయించకపోవడం అనేది మనమెలా అర్థం చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే, ఈ బడ్జెట్లో విద్యకు కేటాయింపు కొంత తగ్గించారు. ఇక విశ్వవిద్యాలయాల పరిస్థితులు కానీ, మొత్తం విద్యారంగ పరిస్థితి కానీ భవిష్యత్తుపై ఎలాంటి విశ్వాసాన్నీ కలిగించడం లేదు. విద్యను మార్కెట్ శక్తులకు అప్పజెప్పి ప్రైవేటు విద్యా విధానాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ఈ దేశ సంక్షేమానికీ, భవిష్యత్తుకూ అపాయకరం. ఇక రెండోదైన వైద్య రంగంలో మనం కేటాయించే బడ్జెట్ గత 70 ఏళ్లుగా చాలా తక్కువే. దాదాపు 30 ఏళ్లుగా వైద్య రంగాన్ని కూడా పూర్తిగా మార్కెట్కు అప్పజెప్పే దిశలోనే ముందుకెళ్లాం. గత రెండేళ్ళుగా వైద్య రంగం ఎంత లోపభూయిష్ఠంగా ఉందో మనం చూశాం. మొత్తం సమాజం దాని దుష్ఫలితాలకు లోనైంది. వైద్య రంగ సదుపాయాలు సరిగ్గా లేక, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యసేవలు లేక ప్రజలు ఎన్ని రకాల బాధలు పడ్డారో మనమందరం చూశాం. ఈ బాధాకరమైన అనుభవం వల్ల వైద్య రంగానికి పెద్ద ఎత్తున బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని అందరూ ఆశించారు. కానీ చాలా ఆశ్చర్యంగా వైద్యరంగానికి కూడా కేటాయింపులు పెంచలేదు. సంపద సృష్టి దేని కోసమో తెలుసా? మన దేశం పెట్టుబడిదారీ పంథాయే కాక దానికి మించి ప్రమాదకరమైన నియో లిబరలిజం సాలెగూటిలో పడిపోతోంది. నియో లిబరలిజం కేవలం ఆర్థికవృద్ధిపై దృష్టి ఉంచి, సంక్షేమం అనేది అభివృద్ధికి అడ్డంకి అని వాదిస్తుంది. వాళ్ల సంపదను ఏ మాత్రం ముట్టినా దేశ అభివృద్ధి దెబ్బ తింటుందని ఈ విధానాన్ని అనుసరించే వారి వాదన. దేశంలో ప్రజలుంటారనీ, ప్రజల సంక్షేమం రాజ్యం యొక్క బాధ్యత అనీ, సంపద పెరగడంతో పాటు మనుషుల జీవితాలు మారాలనే ఆశయాలకు ఈ నియో లిబరలిజం పూర్తి వ్యతిరేకం. కానీ, మనం అనివార్యంగా అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే... ఏ సమాజంలోనైనా సంపద సృష్టి దేని కోసం అని? ప్రజల జీవితాలను మార్చకుండా, అందరికీ ఒక సుఖవంతమైన జీవితం కల్పించకుండా సమాజం సామరస్యంగా, సంతోషంగా ఉండడం సాధ్యం కాదు. ఈ మానవీయ దృక్పథాన్ని మనం కోల్పోతే ఒక అమానవీయ సమాజ నిర్మాణానికి దారితీస్తుంది. సంపన్న దేశమా? సంక్షేమ దేశమా? అందరం ఆలోచించాల్సింది మనకు ఎలాంటి సమాజం కావాలి? రాజ్యాంగమే ఎలాంటి సమాజ నిర్మాణం చేయాలో మనకు స్పష్టంగా సూచించింది. కానీ, రాజ్యాంగం నిర్దేశించిన దిశలో కాకుండా మొత్తంగా మన ఆలోచన, విధానాల దిశ మార్చుకుంటున్నాం. ఒక సంపన్న దేశంగా మారాలనుకుంటున్నాం కానీ, ఒక సంక్షేమ దేశంగా మారాలనే స్వప్నాన్ని వదిలేశాం. ఈ నియో లిబరలిజం భావజాలమే మనకు ఈ బడ్జెట్లో స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి స్కాండనేవియన్ దేశాల్లో సంపన్నుల దగ్గర దాదాపు 60–65 శాతం ఆదాయాన్ని రాజ్యం తీసుకొని, ప్రజలందరికీ ఒక భద్రత కలిగిన సమాజాన్ని సృష్టించుకున్నారు. ఆ దేశాల్లో ఘర్షణలూ తక్కువ, నేరాలూ తక్కువ. దాదాపు శాంతియుతంగా జీవిస్తున్న సమాజాలు అవి. మనం మాత్రం ఏ దారిలో పోతున్నామో, ఎక్కడికి పోతున్నామో అనే మార్గం తెలియని సందిగ్ధ సామాజిక స్థితిలోకి నెట్టబడ్డాం. బడ్జెట్ ఒక సామాజిక, ఆర్థిక మార్పునకు సాధనం అనే ఆశయాన్ని గుర్తిస్తే తప్ప బడ్జెట్లకు సంపన్నులకు చేసే సాధనాలుగా మిగిలిపోతాయి. ఇది సమాజ భవిష్యత్తుకు మంచిది కాదు! ప్రొ. జి. హరగోపాల్ వ్యాసకర్త ప్రముఖ సామాజికవేత్త, విశ్లేషకులు -
బడ్జెట్పై రాహుల్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన నిర్మల.. జాలేస్తోందంటూ..
న్యూఢిల్లీ: బడ్జెట్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. బడ్జెట్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ ‘జీరో బడ్జెట్’ వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు. ట్విటర్లో త్వరగా స్పందిస్తూ చేసిన రాహుల్ వ్యాఖ్యలను చూసి జాలి పడుతున్నానని అన్నారు. ముందుగా బడ్జెట్ను అర్థం చేసుకోడానికి ప్రయత్నించాలని సూచించారు. బడ్జెట్పై అవగాహన పెంచుకుని, బడ్జెట్ను పూర్తిగా అర్థం చేసుకుని విమర్శిస్తే సమాధానం చెప్పేందుకు తాను రెడీ అని పేర్కొన్నారు. అంతేగానీ సరైన హోంవర్క్ చేయకుండా విమర్శిస్తే తీసుకోనని అన్నారు. బడ్జెట్లో ప్రస్తావించిన అంశాలను, ప్రయోజనాలను ముందుగా మహారాష్ట్ర, పంజాబ్, చత్తీస్గఢ్ వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలని రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. చదవండి: నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంపై చిదంబరం తీవ్ర విమర్శలు #WATCH | I pity people who come up with quick responses...Just because you want to put something on Twitter, it doesn't help. He should first do something in Congress-govern states then talk about it: FM Nirmala Sitharaman on Congress leader Rahul Gandhi's comment on Budget 2022 pic.twitter.com/m90TGkq8s4 — ANI (@ANI) February 1, 2022 #WATCH | "...Rahul Gandhi anyway has a problem in understanding maths, he'll look at everything with a sum of 0... Every intelligent person has welcomed the budget & its vision," said Union Commerce & Industry Minister Piyush Goyal, on Opposition's views on #BudgetSession2022 pic.twitter.com/Iv7EXT9Dx1 — ANI (@ANI) February 1, 2022 ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై విమర్శలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్గాంధీపై కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే బడ్జెన్ను అర్థం చేసుకోడానికి తెలివి తేటలు ఉండాలని రాహుల్కు చురకలంటించారు. మ్యాథమెటిక్స్ అర్థం చేసుకోవడంలో రాహుల్కు సమస్య ఉందని అన్నారు. రాహుల్కు ప్రతీది సున్నాలాగే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. అర్థం చేసుకున్న వారు బడ్జెన్ను స్వాగతించారని తెలిపారు. కాగా కేంద్రం జీరో బడ్జెట్ ప్రవేశపెట్టిదని రాహుల్ గాంధీ విమర్శించిన విషయం తెలిసిందే. బడ్జెట్లో పేద, మధ్య తరగతి వర్గాలు, రైతులు, యువతకు ఒరిగిందేమి లేదని దుయ్యబట్టారు. చదవండి: వచ్చే వందేళ్ల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది: ప్రధాని మోదీ -
హర్ష్ గోయెంకా వైరల్ ట్వీట్..! బడ్జెట్ ఎలా ఉందంటే..!
సామాజిక మాధ్యమాల్లో రెగ్యులర్గా స్పందించే పారిశ్రామికవేత్తలలో హర్ష్గోయోంకా ఒకరు. పలు రంగాల్లో అన్నింటి మీద ఆయన ట్వీట్లు చేస్తుంటారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్-2022ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్-2022పై ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా ట్వీటర్లో స్పందించారు. బడ్జెట్ ఎలా ఉందంటే..! ఎన్నో అంచనాల మధ్య కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్-2022పై హర్ష్ గోయెంకా సానుకూలంగా స్పందించగా... ఆయన స్నేహితుడు మాత్రం విమర్శిస్తూ ఒక ఆసక్తికర వీడియోను హర్ష్ గోయెంకాతో పంచుకున్నాడు. హర్ష్ గోయెంకా తన ట్విట్లో ‘ ఈ ప్రభుత్వాన్ని అసలు ఇష్టపడని నా స్నేహితుడితో ఇది చక్కటి బడ్జెట్! భారత ఆర్థిక వ్యవస్థ ఇంజన్లు ఇప్పుడు మరింత వేగంగా కదులుతాయి. బడ్జెట్ గురించి నువ్వేం అనుకుంటున్నావు? అని స్నేహితుడిని అడగ్గా రాయల్ ఎన్ఫీల్డ్ బాడీతో సైకిల్పై ప్రయాణిస్తోన్న వ్యక్తి వీడియోతో నా మిత్రుడు తన అభిప్రాయాన్ని పంచుకున్నాడని హర్ష్ గోయెంకా వీడియోను షేర్ చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూడడానికే భారీగా కన్పిస్తోన్న బడ్జెట్లో అంత పసలేదని ఆయన స్నేహితుడు విమర్శించాడు. ప్రతిపక్షాల విమర్శలు..! కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. ఇది ప్రగతిశీల బడ్జెట్ అని..ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను అభినందనలు తెలిపారు. ఇదిలా ఉండగా బడ్జెట్పై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలను చేస్తున్నాయి. నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చేసిన బడ్జెట్ ప్రసంగంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు ఏ ఆర్థిక మంత్రి చదవని పెట్టుబడిదారీ బడ్జెట్ ప్రసంగం చేశారని మండిపడ్డారు. మొత్తం బడ్జెట్ ప్రసంగంలో పేదలన్న పదం కేవలం రెండుసార్లు మాత్రమే(పేరా ఆరులో) వచ్చిందన్నారు. ఈ దేశంలో పేద ప్రజలు ఉన్నారని గుర్తు చేసినందుకు ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు అంటూ ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వం ‘జీరో’ సమ్ బడ్జెట్ ప్రకటించిందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. మధ్య తరగతి ప్రజలు, పేదలు, బడుగు బలహీన వర్గాలు, యువత, రైతులు, ఎంఎస్ఎంఈలకు ఈ బడ్జెట్లో మొండిచేయి చూపారని రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. I told my friend who doesn’t like this government “A fine budget! The engines of economy will now move faster. What do you think of it?” He sent me this reply… pic.twitter.com/In636XorPK — Harsh Goenka (@hvgoenka) February 1, 2022 చదవండి: ఇండియా ఎలా ఉందన్న అమెరికన్.. ఈ ఆన్సర్ చూస్తే ఆశ్చర్యపోతారు! -
నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంపై చిదంబరం తీవ్ర విమర్శలు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చేసిన బడ్జెట్ ప్రసంగంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు ఏ ఆర్థిక మంత్రి చదవని పెట్టుబడిదారీ బడ్జెట్ ప్రసంగం చేశారని ధ్వజమెత్తారు. మొత్తం బడ్జెట్ ప్రసంగంలో పేదలన్న పదం కేవలం రెండుసార్లు మాత్రమే(పేరా ఆరులో) వచ్చిందని.. ఈ దేశంలో పేద ప్రజలు ఉన్నారని గుర్తు చేసినందుకు ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు అంటూ ఎద్దేవా చేశారు. ఈ పెట్టుబడిదారీ బడ్జెట్ను ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు. చదవండి: వచ్చే వందేళ్ల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది: ప్రధాని మోదీ 99.99 శాతం ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు రాబోయే 25 ఏళ్ల ప్రణాళికను వివరిస్తున్నామని ఆర్థిక మంత్రి చెప్పడం ఆశ్చర్యమేసిందని చిదంబరం పేర్కొన్నారు అంటే ప్రస్తుతంపై ఎలాంటి శ్రద్ధ అవసరం లేదని ప్రభుత్వం విశ్వసిస్తోందని విమర్శించారు. అమృత గడియల వరకు ఓపికగా వేచి ఉండమని చెప్పడం.. భారత ప్రజలను అపహాస్యం చేయడమేనని మండిపడ్డారు. దేశంలోని అత్యంత ధనవంతుల కోరిక మేరకే కేంద్రం ఈ బడ్జెట్ తెచ్చినట్లుగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిప్టో కరెన్సీ నేటి నుంచి చట్టబద్ధమని ఆర్బీఐకి బదులు, కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించడాన్ని తప్పుబట్టారు. వీటన్నింటి వల్ల దేశంలోని 99.99 శాతం ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. చదవండి: అందుకే పన్నులను పెంచలేదు: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ -
Union Budget 2022: వీరికి పండగే..! వారికి మాత్రం తీవ్ర నిరాశే..!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం కేంద్ర బడ్జెట్-2022ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సారి బడ్జెట్ మూలధన వ్యయాన్ని 35. 4 శాతం మేర పెంచారు. వృద్ధి ప్రణాళికలకు మద్దతుగా ఆర్థిక వ్యవస్థ వార్షిక వ్యయం పరిమాణాన్ని రూ. 39.5 ట్రిలియన్కు (529 బిలియన్ డాలర్లు) పెంచాలని సీతారామన్ ప్రతిపాదించారు. ఇదిలా ఉండగా బడ్జెట్-2022 ప్రకటనలు పలు రంగాలకు బూస్ట్ను కల్పించగా..మిగతా వారికి నిరాశనే మిగిల్చింది. వీరికి పండగే..! ఈవీ బ్యాటరీ మేకర్స్ క్లీన్ ట్రాన్స్పోర్ట్ టెక్నాలజీని ప్రోత్సహించడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్-2022లో ఎలక్ట్రిక్ వాహనాల కోసం కొత్త స్వాపింగ్ విధానాలను ప్రవేశ పెడతామని తెలిపారు.ఈ నిర్ణయం దేశంలోని బ్యాటరీ తయారీదారులు లాభం పొందనున్నారు. రవాణా, మౌలిక సదుపాయాలు మూడు సంవత్సరాలలో రిమోట్ రోడ్లు, నగరాల్లో సామూహిక రవాణా, 400 కొత్త “వందే భారత్” రైళ్ల ప్రకటనతో ఎల్&టీ లిమిటెడ్, జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్, ఐఆర్బీ ఇన్ఫ్రా లిమిటెడ్, కంటైనర్తో సహా కీలకమైన మౌలిక సదుపాయాల సంస్థలకు ప్రయోజనం చేకూరనున్నాయి. వారితో పాటుగా కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఆల్కార్గో లాజిస్టిక్స్ లిమిటెడ్, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లబ్ధి చేకూరనుంది. మెటల్ రంగం 38 మిలియన్ల ఇళ్లకు పైప్డ్ వాటర్ కోసం 600 బిలియన్ రూపాయల కేటాయింపులను ప్రభుత్వం ప్రకటించింది. దాంతో పాటుగా లాజిస్టిక్స్పై భారీగా ఖర్చు చేయడం వల్ల భారత్లోని లోహాల ఉత్పత్తిదారులైన వేదాంత లిమిటెడ్, టాటా స్టీల్ లిమిటెడ, జేఎస్డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్, జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్, పైప్మేకర్స్ జైన్ ఇరిగేషన్ లిమిటెడ్, కెఎస్బి ఇరిగేషన్ సిస్టమ్స్. ., కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. సోలార్ రంగం స్థానికంగా సోలార్ మాడ్యూళ్ల తయారీని పెంచడానికి 195 బిలియన్ రూపాయల విలువైన ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహకాలను బడ్జెట్-2022 ప్రస్తావించారు. దీంతో టాటా పవర్ లిమిటెడ్, సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్, అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్తో సహా ప్రముఖ ప్యానెల్ తయారీదారుల వృద్ధిపై దృష్టి సారించనున్నాయి. సిమెంట్, నిర్మాణ రంగం నగరాల్లోని తక్కువ-ఆదాయ కుటుంబాల కోసం మరిన్ని గృహాలను నిర్మించాలనే ప్రభుత్వ ప్రణాళికతో సిమెంట్, నిర్మాణ సంస్థలైన అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్, అంబుజా సిమెంట్స్ లిమిటెడ్, బిర్లా కార్పొరేషన్, ఏసీసీ లిమిటెడ్లకు మరిన్ని కాంట్రాక్ట్సు వచ్చే అవకాశం ఉంది. టెల్కోలు, డేటా సెంటర్లు 2022లో 5G స్పెక్ర్టమ్ వేలం ప్రారంభిస్తారనే నిర్ణయం టెల్కో రంగాన్నిమద్దతుగా నిలవనుంది.భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, వోడాఫోన్ ఐడియా లిమిటెడ్, మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్, హెచ్ఎఫ్సిఎల్ లిమిటెడ్ వంటి కంపెనీలకు ప్రయోజనం చేకూరనుంది. డిఫెన్స్ పరికరాల తయారీదారులు వార్షిక బడ్జెట్లో సెక్టార్ క్యాపెక్స్లో 68 శాతం స్థానిక కంపెనీలకు కేటాయించాలనే సీతారామన్ ప్లాన్తో రక్షణ పరికరాలను తయారు చేసే కంపెనీలు భారీగా లాభపడే అవకాశం ఉంది. ఎల్&టీ లిమిటెడ్., భారత్ ఫోర్జ్ లిమిటెడ్, పారాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ గెయినర్స్గా ఉన్నాయి. డ్రోన్ స్టార్టప్లలో జ్యూస్ న్యూమెరిక్స్, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ , బాట్ల్యాబ్ డైనమిక్స్కు ప్రయోజనాలు పొందనున్నాయి. వీరికి నిరాశే..! ప్రభుత్వ ఆధ్వర్యంలోని బ్యాంకులు డిజిటల్ కరెన్సీని ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోన్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. వర్చువల్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ల వైపు ప్రపంచ తరలింపునకు అనుగుణంగా దేశంలో సాంప్రదాయ బ్యాంకింగ్ నియమాలు మారే అవకాశం ఉంది. ఈ చర్యతో దేశంలోని ప్రాచీన రుణదాతలైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్స్కు ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్రిప్టో కంపెనీలు క్రిప్టోకరెన్సీలు, నాన్-ఫంజిబుల్ టోకెన్లతో సహా డిజిటల్ అసెట్ లావాదేవీల నుంచి వచ్చే లాభాలపై 30 శాతం పన్ను విధించాలనే నిర్ణయంతో క్రిప్టో కంపెనీలకు తక్కువ లాభదాయకంగా మారే అవకాశం లేకపోలేదు. ఇది క్రిప్టో ఎక్స్ఛేంజీలను కూడా ప్రభావితం చేయనుంది. WazirX, Zebpay, CoinDCX, కాయిన్ స్విచ్ కుబెర్ వంటి క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ను భారీగా ప్రభావితం చేయనున్నాయి. కోల్, థర్మల్ పవర్ గ్రీన్ఎనర్జీ, సోలార్ పవర్ వైపు అడుగులు వేస్తున్న తరుణంలో ఈ రంగంలో భారీ ప్రోత్సాహకాలను అందిస్తామని బడ్జెట్లో పేర్కొన్నారు. దీంతో కోల్ ఇండియా లిమిటెడ్. సింగరేణి కాలరీస్ కో., అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ లాంటి కోల్, థర్మల్ ఆధారిత కంపెనీలపై తీవ్ర ప్రభావాలను చూపే అవకాశం లేకపోలేదు. స్టెయిన్లెస్ స్టీల్ కంపెనీలు మెటల్ ధరల పెరుగుదల కారణంగా స్టెయిన్లెస్ స్టీల్, కోటెడ్ స్టీల్ ఫ్లాట్ ఉత్పత్తులు, అల్లాయ్ స్టీల్ బార్లు , హై-స్పీడ్ స్టీల్పై కొన్ని యాంటీ-డంపింగ్, కౌంటర్వైలింగ్ డ్యూటీలను ఉపసంహరించుకోవాలని కేంద్రం ప్రణాళికలను సిద్ధం చేసింది. దీంతో జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్, టాటా మెటాలిక్స్ లిమిటెడ్లపై ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఆటోమొబైల్ తయారీదారులు గ్లోబల్ సెమీకండక్టర్ కొరతతో ఆటోమొబైల్ కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయాయి. బడ్జెట్ ప్రకటన తర్వాత ఆటోమొబైల్ సెక్టార్లో నిరుత్సాహకరమైన వాతావరణం నెలకొంది. చదవండి: Union Budget 2022: పెరిగే..తగ్గే వస్తువుల జాబితా ఇదే..! -
బడ్జెట్ నిరుత్సాహ పరిచింది
సాక్షి, న్యూఢిల్లీ: వ్యాక్సిన్ బూస్టర్ డోస్లా ఉంటుందనుకున్న కేంద్ర బడ్జెట్ నిరుత్సాహ పరిచిందని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చెప్పారు. పైకి స్టైల్గా కనిపించినా.. వాస్తవంగా అందులో ఏమీ లేదన్నారు. ఆర్థిక మంత్రి సబ్కా వికాస్ అని చెప్పినప్పటికీ రాష్ట్రాలకు ప్రయోజనకారిగా లేదని తెలిపారు. మంగళవారం ఏపీ భవన్లో ఎంపీలు మిధున్రెడ్డి, పిల్లి సుభాష్చంద్రబోస్, మార్గాని భరత్, ఆదాల ప్రభాకర్రెడ్డి, తలారి రంగయ్య, వంగా గీత, చింతా అనూరాధ, గొడ్డేటి మాధవి, గురుమూర్తి, రెడ్డెప్ప, మాధవ్, ఎంవీవీ సత్యనారాయణ, లావు శ్రీకృష్ణదేవరాయలు, పోచ బ్రహ్మానందరెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఎఫ్ఆర్బీఎంలో ఇదేమిటి? చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జీఎస్డీపీలో ఎఫ్ఆర్బీఎం పరిధిని 3 శాతంగా నిర్ధారించినా, దానికన్నా ఎక్కువ రుణాలు తీసుకున్నారు. ఆ మొత్తాన్ని ఇప్పుడు రాష్ట్రానికి నిర్థారించిన రుణ సేకరణలో తగ్గించే ప్రయత్నం జరిగింది. దీనిని వెంటనే ప్రధాని దృష్టికి తీసుకెళ్లాం. ఎఫ్ఆర్బీఎం కేంద్రం, రాష్ట్రాలకు ఒక్కటే. కానీ కేంద్రం ఆ పరిధి దాటొచ్చని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దాటొద్దు అంటూ ద్వంద్వ ప్రమాణాలు పాటించడం అభ్యంతరకరం. మూల ధన వ్యయం కింద గతంలో రాష్ట్రాలకు రూ.15 వేల కోట్లు ఇవ్వగా, ఈసారి లక్ష కోట్లు ఇస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు. ఇది స్వాగతించదగినదే అయినా, కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి ఇస్తున్న మొత్తం 4.047 శాతం మాత్రమే. దీంతో రాష్ట్రానికి వచ్చేది రూ.4 వేల కోట్లే. కేంద్ర పన్నుల్లో మహారాష్ట్రకు 6.31 శాతం, మధ్యప్రదేశ్కు 7.8 శాతం, యూపీకి 17.9 శాతం ఇస్తున్నారు. ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. అయినా అన్యాయం జరుగుతోంది. గతేడాది ఆంధ్రప్రదేశ్కు రూ.35 వేల కోట్లు రాగా, యూపీకి రూ.1.53 లక్షల కోట్లు ఇచ్చారు. జీఎస్టీ వల్ల రాష్ట్రాలకు ఆదాయం తగ్గినందువల్ల మరో 5 ఏళ్లు రాష్ట్రాల వాటా పొడిగించాలని కోరినా ఏ ప్రస్తావనా లేదు. నదుల అనుసంధానం ఖర్చు తిరిగివ్వాలి నదుల అనుసంధానం అభినందనీయం. గోదావరి– కృష్ణా, కృష్ణా–పెన్నా అనుసంధానం పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొంత ఖర్చు చేసింది. ఆ ఖర్చును తిరిగివ్వాలి. పీఎం గతి శక్తిలో తూర్పు తీరం డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (ఖరగ్పూర్ నుంచి విజయవాడ వరకు), రాష్ట్రంలోని పోర్టులను కలుపుతూ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ పనులు చేపట్టాలి. భోగాపురం జాతీయ రహదారిని వేగంగా పూర్తి చేయాలి. పీఎం జన ఆరోగ్య యోజన కింద మధ్య తరగతికి ఆరోగ్య బీమా అందించాలి. ఉపాధి హామీలో కవరేజ్ పెంచలేదు. పీఎం కిసాన్ పథకంలో భూమి లేని రైతులను పూర్తిగా వదిలేశారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరుతున్నాం. ధాన్యం సేకరణకు స్పష్టమైన పాలసీ లేదు. విశాఖ ఉక్కు, ఎల్ఐసీ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నాం. ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్ అనేది ఇప్పటికే రాష్ట్రంలో సచివాలయాల్లో మొదలు పెట్టాం. స్టాంప్ డ్యూటీకి దేశమంతా ఒకే విధానం ఉండాలన్న అంశాన్ని కేంద్రం ప్రతిపాదించినప్పుడు స్పందిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జాతీయ పింఛన్ విధానంలో అదనంగా 4%, అంటే 14%వరకు పన్ను రాయితీ ఇవ్వడం అభినందనీయం. క్రిప్టో కరెన్సీపై కేంద్రం నిర్ణయం స్వాగతించదగ్గది. చదవండి: పనికిమాలిన పసలేని బడ్జెట్ ఇది: సీఎం కేసీఆర్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ టీడీపీకి ప్రయోజనకారి నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ మంచి నిర్ణయం. దీని వల్ల ప్రయోజనం పొందేది టీడీపీయే. ఆ పార్టీలో చాలా మందికి మెంటల్ సమస్యలు వచ్చాయి. దాన్ని వారు వినియోగించుకోవాలి. సీఎం నివేదించిన అంశాలపై సానుకూల స్పందన ఆశిస్తున్నాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాన మంత్రికి నివేదించిన 10 అంశాలను కమిటీ ముందుంచాము. వాటి మీద సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం. సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలులో ముందున్న రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టుతో పాటు 13వ షెడ్యూల్లో ఉన్న అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం. వాటికి సానుకూల స్పందన వస్తుందని భావిస్తున్నాం. -
అంతా గోల్మాల్ గోవిందం
►అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలున్న ఎల్ఐసీని అమెరికాలో అతిపెద్ద బీమా కంపెనీలకు లాభం చేకూర్చేందుకు అమ్ముతున్నారు. అంతర్జాతీయ బీమా సంస్థలకు బ్రోకర్గా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: ‘ఇది దారుణమైన బడ్జెట్. దూరదృష్టి లేని కురచ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండటం దరిద్రం. బడ్జెట్లో రైతులు, పంటలకు కనీస గిట్టుబాటు ధర ప్రస్తావనే లేదు. పైగా రూ.12,708 కోట్ల యూరియా సబ్సిడీ, రూ.22192 కోట్ల ఇతర ఎరువుల సబ్సిడీలు కలిపి మొత్తం రూ.34,900 కోట్ల సబ్సిడీలను తగ్గించారు. 2022 నాటికి రైతుల ఆదా యం రెట్టింపు చేస్తామనే హామీ ఏమైంది? రైతు ల పరిస్థితే బాగుంటే ఏడాది పాటు ఎండావానల్లో ఆందోళన ఎందుకు చేశారు? ఓ వైపు దేశంలో నిరుద్యోగం తీవ్రంగా పెరిగిపోతే, గ్రా మీణ ఉపాధి హామీ పథకానికి రూ.25 వేల కో ట్లు కోత పెట్టారు. కేంద్ర విద్యుత్ విధానం మెం టల్ కేస్లాగా ఉంది..’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ప్రగతిభవన్లో ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో కేసీఆర్ కేంద్ర బడ్జెట్పై మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. పాక్, నేపాల్ కన్నా అధ్వాన్న స్థితిలో.. దేశ ప్రజానీకం ఆయన ప్రభుత్వానికి పదేళ్ల కాలానికి తీర్పునిస్తే ఇప్పటికే 80 శాతం సమయం పూర్తయింది. 116 దేశాల ప్రపంచ హంగర్ ఇండెక్స్లో నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ కంటే భారత్ అధ్వాన్న స్థితిలో 101వ స్థానంలో ఉంది. అయినా బడ్జెట్లో ఆహార సబ్సిడీని రూ.65 వేల కోట్లు తగ్గించారు. 2022 నాటికి అందరికీ ఇళ్లు అనే నినాదం పెద్ద బోగస్. గతంలో క్రిప్టో కరెన్సీని అనుమతించమని చెప్పి ఇప్పుడు క్రిప్టో కరెన్సీ మీద 30 శాతం పన్నులు ఎలా వేస్తారు? పచ్చి అబద్ధాలకు శ్లోకాలు వాడుకుంటారా? మిషన్ భగీరథ పథకానికి 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణ రూ.40 వేల కోట్లు ఖర్చు చేసింది.140 కోట్ల దేశ జనాభాకు రూ.60 కోట్లతో జలశక్తి మిషన్ అట. ఇలాంటి అబద్ధాలు చెప్పేటపుడు మంత్రి నిర్మల ఆత్మ ఘోషించలేదా. పచ్చి అబద్ధాలకు మహా భారతంలోని శాంతి పర్వం శ్లోకాన్ని వాడుకుంటారా? మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని చెప్పుకునే దరిద్రులు బీజేపీ నేతలు. కేసీఆర్ కిట్ పథకంలో ఇస్తున్న నిధుల్లో రూ.6 వేలు తమవే అని చెప్పుకుంటున్నారు. చినజీయర్ స్వామి ఆశ్రమంలో రామానుజాచార్యుల సమతా మూర్తి నిర్మాణం కూడా తమ ఘనత అని ప్రచారం చేసుకుంటున్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చేది గుండు సున్నా. మన దగ్గర నుంచి వెళ్లే నిధులతోనే కేంద్రం బతుకుతోంది. మన సొమ్ములతో వాళ్ల సోకులు పడుతున్నారు. దేశాన్ని సాకుతున్న ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. చదవండి: అందుకే పన్నులను పెంచలేదు: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అహ్మదాబాద్లో శిఖండి ఆర్బిట్రేషన్ సెంటర్ హైదరాబాద్లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలన్న నా విజ్ఞప్తికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అంగీకరించారు. రూ.300 కోట్ల విలువ చేసే భూమిని కేటాయించి ఈ నెల 5న చీఫ్ జస్టిస్ చేతుల మీదుగా శంకుస్థాపన నిర్వహిస్తున్నాం. హైదరాబాద్లో ఆరిట్రేషన్ సెంటర్ ఏర్పాటుతో నిద్రపట్టని ప్రధాని మోదీ దాన్ని అహ్మదాబాద్కు తరలించాలని సుప్రీం కోర్టుపై ఒత్తిడి చేశారు. సాధ్యం కాకపోవడంతో ప్రస్తుత బడ్జెట్లో గిఫ్ట్ సిటీ (అహ్మదాబాద్)లో అలాంటి శిఖండి ఆర్బిట్రేషన్ సెంటర్ను ప్రతిపాదించారు. ఆయన దేశానికి కాదు గుజరాత్కు ప్రధానిలా వ్యవహరిస్తున్నారు. తెలుగువారి కోడలు అయిన నిర్మలా సీతారామన్ ఈ విషయంలో ఆత్మద్రోహం చేసుకున్నారు. నదుల అనుసంధానం మిలీనియం జోక్ నదుల అనుసంధానం మిలీనియం జోక్. కృష్ణా, గోదావరి, కావేరీ నదుల అనుసంధానం చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో ఏ అధికారంతో చేర్చారు. మా సమ్మతి లేకుండా కావేరీలో ఏ చట్టం ప్రకారం కలుపుతారు. ఒకవేళ గోదావరిలో మిగులు జలాలు ఉంటే తెలంగాణ ప్రాజెక్టుల డీపీఆర్లను ఎందుకు ఆమోదించడం లేదు. కేంద్రంలో 15 లక్షల పోస్టులు ఖాళీ కేంద్రంలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే తెలంగాణలో ధర్నాలు చేస్తామని ప్రచారం చేస్తున్నారు. వారికి నెత్తీ కత్తీ రెండూ లేవు. కొత్త జోనల్ విధానంతో స్థానికులకు 95 శాతం ఉద్యోగాలు వస్తాయి. అర్బన్ జిల్లాల యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలనే 317 జీవో తెచ్చాం. ఎక్కడివారికి అక్కడే ఉపాధి, ఉద్యోగం, సంక్షేమం అందాలన్నదే మా విధానం. జర్నలిస్టులు, ఎమ్మెల్యేలకు ఇళ్ల స్థలాల కేటాయింపు కేసు ఈ నెలాఖరులో ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నాం. ప్రత్యేక చట్టం తీసుకువచ్చి త్వరలోనే స్థలాలిస్తాం. చదవండి: వచ్చే వందేళ్ల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది: ప్రధాని మోదీ -
అందుకే పన్నులను పెంచలేదు: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం కేంద్ర బడ్జెట్-2022ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దాదాపు గంటన్నరపాటు బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. అయితే పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టిన అనంతరం నిర్మలా సీతారామన్ మీడియాతో చర్చించారు. ఈ సమావేశంలో క్రిప్టో, టాక్స్, డిజిటల్ రూపీ తదిరత అంశాలపై మరింత వివరణ ఇచ్చారు. అందుకే పెంచలేదు..! కోవిడ్-19 నేపథ్యంలో ప్రజలపై అదనంగా పన్నుల భారం పెంచే ఉద్ధేశ్యం ప్రభుత్వానికి లేదని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.గత ఏడాది మాదిరిగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిశానిర్దేశంలో పన్నులను పెంచలేదని తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో ప్రజల నుంచి ప్రభుత్వం ఒక్క పైసా కూడా సంపాదించాలని కోరుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ గత ఏడాది బడ్జెట్కు సంపూర్ణ ఎజెండా కొనసాగుతోందని అభిప్రాయపడ్డారు. ఉద్యోగాలపై ప్రభావం..! కోవిడ్-19 రాకతో ఉద్యోగాలపై భారీ ప్రభావమే చూపిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అయితే ఉద్యోగాల విషయంలో ఊరటను కల్పిస్తూ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు. రాహుల్ గాంధీకి చురకలు..! పార్లమెంట్లో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై కాంగ్రెస్ నాయకుడు, పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ స్పందించారు. మోదీ ప్రభుత్వం ‘జీరో సమ్’ బడ్జెట్ ప్రకటించిందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను నిర్మలా సీతారామన్ తిప్పికొట్టారు. బడ్జెట్ను సరిగ్గా అర్థం చేసుకోనే ప్రయత్నం చేయాలని రాహుల్కు హితవు పలికారు. చదవండి: వచ్చే వందేళ్ల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది: ప్రధాని మోదీ -
వచ్చే వందేళ్ల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వచ్చే వందేళ్ల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్గా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. నాలుగు ప్రధాన సూత్రాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన జరిగింది. 1. ప్రధాని గతిశక్తి యోజన 2. సమీకృత అభివృద్ధి 3. అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు 4. పరిశ్రమలకు ఆర్థిక అండ ఈ అంశాలను ఆధారంగా చేసుకుంటూ బడ్జెట్ రూపొందించాము. దేశ యువత ఉజ్వల భవిష్యత్కు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది. ఉద్యోగాలు, మౌలిక వసతులు, అభివృద్ధి ప్రాతిపదికన ఈ బడ్జెట్ రూపొందించింది. ఈ బడ్జెట్లో భారత రక్షణకు పెద్దపీట వేశాం. బడ్జెట్లో మహిళల కోసం మిషన్ శక్తి, వాత్సల్య, సక్షమ్ అంగన్వాడీల రూపకల్పన వంటి 3 ప్రత్యేక పథకాలు తీసుకొచ్చాం. గంగానది తీర రాష్ట్రాల్లో సహజసిద్ధ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. దేశ ఆర్థిక వ్యవస్థ సరైన దిశలోనే ప్రయాణిస్తోంది. అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. నవశకానికి నాంది పలికేలా ఈ బడ్జెట్ ఉంది' అని ప్రధాని నరంద్ర మోదీ అన్నారు. చదవండి: (Budget 2022: క్రిప్టో ట్రేడర్లకు శుభవార్త !) -
Budget 2022: ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వారికి శుభవార్త..!
ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టార్లో విప్లవాత్మక మార్పులను కేంద్రం ఆశిస్తోంది. ఈవీ వెహిలక్ యూజర్లకు ప్రస్తుతం ఉన్న ఇబ్బందులు తీర్చే విధంగా భారీ ప్యాకేజీని ప్రకటించింది కేంద్రం. పెట్రోల్, డీజిల్ పోయించుకున్నంత తేలికగా ఈవీ బ్యాటరీలు మార్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అందుబాటులోకి తెస్తామంటూ తాజా బడ్జెట్లో ప్రకటించింది. దాంతో పాటుగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై మరిన్ని ప్రోత్సాహాకాలను అందించనుంది. అసలు సమస్య ఇక్కడే ఈవీ వాహనాల వినియోగం పెంచాలని కేంద్రం ఎంతగా చెబుతున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఆశించినట్టుగా లేవు. దీనికి ప్రధాన కారణం ఈవీ వాహనాల విషయంలో బ్యాటరీ ఛార్జింగ్కి పట్టే సమయం. ఆయా ఈవీ వాహనాల బ్యాటరీలు ఫుల్ ఛార్జ్ అయ్యేందుకు కనీసం రెండు నుంచి ఐదు గంటల వరకు సమయం పడుతుంది. ఈ సమస్యకి మెరుగైన పరిష్కారం లభిస్తే తప్ప ఈవీ బూమ్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో బ్యాటరీ స్వాపింగ్ పాలసీని కేంద్రం తెర మీదకు తెచ్చింది. బ్యాటరీ స్వాపింగ్ పాలసీ..! దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం ముందుచూపుతో బడ్జెట్-2022 పలు ప్రతిపాదనలను చేసింది. దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రభుత్వం బ్యాటరీ మార్పిడి పాలసీను తీసుకువస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. జాతీయ రహదారులపై ప్రతీ నలభై కిలోమీటర్లకు ఒక బ్యాటరీ స్వాపింగ్ సెంటర్ను అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే ఇంచుమించు పెట్రోల్, డీజిల్ పోయించుకున్నంత తేలిగ్గా డిస్ఛార్జ్ బ్యాటరీ స్థానంలో ఫుల్ ఛార్జ్ బ్యాటరీలను వాహనాల్లో అమర్చుకునే వీలుంటుంది. ఫలితంగా ఫ్యూయల్ రన్నింగ్ అవుట్ సమస్య చాలా వరకు తెరమరుగైపోతుంది. ఇప్పుడున్న ఈవీ వెహికల్ మోడళ్ల ప్రకారం బ్యాటరీ స్వాపింగ్ ప్రక్రియ ఫోర్ వీలర్ వెహికల్ విషయంలో సుదీర్ఘమైన ప్రక్రియగా అయినప్పటికీ టూవీలర్ ఈవీ వాహనాలకు తక్కువ సమయం పడుతుంది. గ్రీన్ ఎనర్జీపై ముందడుగు..! బడ్జెట్-2022 ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజా రవాణాలో ప్రత్యామ్నాయ ఇంధనాలకు ప్రముఖ స్థానాన్ని కల్పించారు. అందులో భాగంగా సోలార్ ఎనర్జీ ఉత్పత్తి కోసం రూ. 19,500 వేల కోట్ల భారీ కేటాయింపులు చేశారు. సంప్రాదాయ వాహనాల వాడకాన్ని తగ్గిస్తూ ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై మరిన్ని ప్రోత్సాహకాలను కేంద్రం అందించనుంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో గ్రీన్ బాండ్స్ సేకరణ. గంగా నది పరివాహక ప్రాంతంలో సేంద్రియ వ్యవసాయాన్ని మరింత ఊతమిచ్చేలా చర్యలను కేంద్రం తీసుకొనుంది. 10 రంగాల్లో క్లీన్ ఎనర్జీ యాక్షన్ ప్లాన్ను ప్రతిపాదించనుంది. రవాణ రంగంలో మౌలిక సదుపాయాల కోసం రూ.20 వేల కోట్ల కేటాయింపులతో పాటుగా అవసరాలకు అనుగుణంగా మెట్రో రైలు కనెక్టివిటీ ఏర్పాటుచేయనున్నట్లు బడ్జెట్లో ప్రస్తావించారు. చదవండి: Union Budget 2022: పెరిగే..తగ్గే వస్తువుల జాబితా ఇదే..! -
ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం ఎంతసేపు సాగిందంటే..
FM Nirmala Sitharaman Budget Speech Time: ఆర్థిక మంత్రి హోదాలో నాలుగోసారి లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. 62 ఏళ్ల నిర్మలమ్మ 92 నిమిషాలపాటు ప్రసంగించారు. అయితే గతంతో పోలిస్తే ఈ దఫా ఆమె బడ్జెట్ ప్రసంగం త్వరగానే ముగించేశారు. 2019 బడ్జెట్ ప్రసంగం 2 గంటల 17 నిమిషాలపాటు ప్రసంగించి.. గతంలో జశ్వంత్ సింగ్(2003లో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 2 గంటల 15 నిమిషాలు ప్రసంగించారు) రికార్డును బద్ధలు కొట్టారామె. ఆపై 2020లో 2 గంటల 42 నిమిషాలు(భారత్ సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం!), 2021లో గంటా నలభై నిమిషాలపైనే, ఇప్పుడు గంటా 32 నిమిషాలపాటు ఆమె ప్రసంగించారు. సాధారణంగా బడ్జెట్ ప్రజంటేషన్ నిడివి 90 నిమిషాల నుంచి 120 నిమిషాలు(రెండు గంటలుగా ఉంటుంది). ఇక కేంద్ర బడ్జెట్ 2022 లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. 2022-23 మొత్తం బడ్జెట్ విలువ రూ. 39 లక్షల 45 వేల కోట్లు. 2022-23 మొత్తం వనరుల సమీకరణ రూ. 22.84 లక్షల కోట్లు కాగా.. ద్రవ్యలోటు 6.9 శాతం ఉంది. రూ.17 లక్షల కోట్ల లోటు బడ్జెట్గా తేలింది.ఇక బడ్జెట్ సెషన్ రెండో దశ మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే. -
బడ్జెట్ 2022: పెరిగేవి..తగ్గేవి ఇవే..!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం కేంద్ర బడ్జెట్-2022ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఆసియాలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇక కేంద్ర బడ్జెట్-2022లో ఆర్థిక మంత్రి ప్రతిపాదించినట్లుగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో పలు వస్తువులు మరింత చౌకగా, ఖరీదైనవిగా లభించే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్-2022 ప్రకారం మొబైల్ ఫోన్స్, మొబైల్ ఫోన్ ఛార్జర్లతో సహా పెద్ద సంఖ్యలో సాధారణంగా ఉపయోగించే వస్తువులు చౌకగా మారబోతున్నాయి. కట్ చేసి పాలిష్ చేసిన వజ్రాలు, రత్నాలపై కస్టమ్స్ డ్యూటీ 5 శాతంకు తగ్గించారు. భారత్లో తయారు చేయబడిన వ్యవసాయ రంగానికి సంబంధించిన పనిముట్లు, ఉపకరణాలపై మినహాయింపును పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో చౌకగా, ఖరీదైన వస్తువుల జాబితా ఇదే.. చౌకగా లభించేవి బట్టలు రత్నాలు,వజ్రాలు. మొబైల్ ఫోన్లు మొబైల్ ఫోన్ ఛార్జర్లు పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమైన రసాయనాలపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు మిథనాల్తో సహా కొన్ని రసాయనాలు స్టీల్ స్క్రాప్పై రాయితీ మరో ఎడాదిపాటు వర్తించనుంది. స్మార్ట్వాచ్ వినికిడి పరికరాలు వ్యవసాయ ఉపకరణాలు కోకా బీన్స్, ఇంగువ ఖరీదైనవి అన్ని దిగుమతి వస్తువులు గొడుగులపై భారీ సుంకాలను పెంచడంతో వీటి ధరలు భారీగా పెరగనున్నాయి. క్రిప్టో లావాదేవీలపై 30 శాతం పన్నులు అనుకరణ ఆభరణాలు స్పీకర్స్, హెడ్ ఫోన్స్, ఇయర్ఫోన్స్ సోలార్ సెల్స్, మాడ్యూల్స్ ఎక్స్ రే మెషిన్స్ చదవండి: Budget 2022: క్రిప్టో ట్రేడర్లకు శుభవార్త ! -
వర్క్ఫ్రమ్ హోం.. ఆశాభంగం!
కరోనా రాకతో పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోంకే పరిమితమైన ఉద్యోగులు ఈ బడ్జెట్లో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుందని గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2022లో ‘వర్క్ఫ్రమ్ హోం’కు నిరాశే ఎదురైంది. క్రిప్టో కరెన్సీపై బడ్జెట్లో ప్రకటనను ఎవరూ ఊహించకపోగా.. ఊహించిన వర్క్ఫ్రమ్ హోం లాంటి అంశంపై కేంద్రం నుంచి ప్రకటన రాకపోవడంతో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కరోనా మహమ్మారి రాకతో.. కంపెనీలన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. తద్వారా ఆయా కంపెనీలకు అయ్యే ఖర్చు అమాంతం తగ్గింది. కంపెనీలు ఆయా ఖర్చులను తగ్గించుకున్నా.. ఎక్కువ శాతం ఆ భారం పూర్తిగా ఉద్యోగుల మీద పడుతోంది. దీనికి తగ్గట్టుగా ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించాలనే డిమాండ్లు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఇవి దృష్టిలో ఉంచుకోని బడ్జెట్-2022లో కేంద్రం ఊరట ఇస్తుందని అంతా భావించారు. పైగా స్టాండర్డ్ డిడక్షన్, వర్క్ఫ్రమ్ హోం అలవెన్స్ విషయంలో స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. స్టాండర్డ్ డిడక్షన్.. తుస్? 2018లోనే ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్ను మళ్లీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అనేక మంది ఉద్యోగులు స్టాండర్డ్ డిడక్షన్ని ఎంచుకున్నారు. ప్రస్తుత స్టాండర్డ్ డిడక్షన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అలవెన్స్ను కవర్ చేసేందుకు ఎలాంటి అవకాశం లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారి కోసం ప్రస్తుత స్టాండర్డ్ డిడక్షన్ పరిమితినైనా పెంచాల్సి ఉంది. లేదంటే కొత్తగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఖర్చుల కోసం కొత్త డిడక్షన్నైనా ప్రవేశపెట్టాల్సి ఉంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 16 కింద ప్రస్తుతం ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.50వేల నుండి రూ.1 లక్షకు పెంచాలని కోరగా.. కేంద్రం నుంచి సానుకూల స్పందన కరువ కావడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. వర్క్ ఫ్రమ్ హోమ్ అలవెన్స్.. సైలెంట్ వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు అలవెన్స్ అందించాలని ప్రభుత్వాన్ని పరిశ్రమల సంస్థ నాస్కామ్ సహా డెలాయిట్ ఇండియా ప్రీ-బడ్జెట్ ఎక్స్పెక్టేషన్ 2022 నివేదికలో బలంగానే కేంద్రాన్ని కోరాయి. పనిలో పనిగా ఉద్యోగుల కోసం ‘‘వర్క్ ఫ్రమ్ హోమ్’’ ఖర్చులపై మరిన్ని తగ్గింపులను సూచించాయి. అంటే.. ఉద్యోగులకు అదనంగా రూ. 50,000 WFH భత్యాన్ని సిఫార్సు చేయగా.. బడ్జెట్లో అసలు ఆ ఊసే లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. శాలరీ స్ట్రక్చర్’ని ఓ కొలిక్కి తీసుకొచ్చినట్లు ప్రకటించుకున్న కేంద్రం.. ‘తక్కువ ఇంటి అద్దె భత్యం నుంచి కొత్త తగ్గింపుల వరకు’.. కొన్ని ప్రతిపాదనలపై కంపెనీల ప్రతినిధుల మధ్య వరుసబెట్టి చర్చలు నడిపించింది. పైగా కొత్త వర్క్ మోడల్కు లీగల్ ఫ్రేమ్వర్క్ అంటూ గప్పాల ప్రకటనలు ఇచ్చిన కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ.. ఈ దిశగా ఆర్థిక శాఖపై ఒత్తిడి తేలేకపోయిందనే విమర్శ వినిపిస్తోంది ఇప్పుడు. -
కేంద్ర బడ్జెట్ 2022 కీలకాంశాలు..
పార్లమెంట్లో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ నాల్గోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. సుమారు గంటన్నరపాటు ప్రసంగించిన నిర్మలా సీతారామన్.. ఈ ఏడాది ద్రవ్యలోటు 6.9గా ఉంటుందని అంచనా వేశారు.ఇక రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి వడ్డీ రహిత రుణ పరిమితిని రూ. లక్ష కోట్లకు కేటాయించినట్లు పేర్కొన్నారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కీలకాంశాలు ఇవే.. రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి వడ్డీ రహిత రుణ పరిమితిని రూ.15 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లు కేటాయింపు రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ రహిత రుణాలు ఈ ఏడాది ద్రవ్యలోటు 6.9 గా ఉంటుందని అంచనా 2023లో ద్రవ్యలోటు 6.4 గా ఉంటుందని అంచనా 2022 మూలధన వ్యయం 35.4 శాతానికి పెంపు రూ.7.50 లక్షల కోట్లు కేటాయింపు ప్రతి తరగతికి ఒక టీవీ ఛానెల్ ద్వారా పాఠాలు, ప్రాంతీయ భాషల్లో పాఠాలు, ప్రస్తుతం 12 విద్యా టీవీ ఛానెల్స్ ఉండగా.. వీటిని 200 కి పెంపు 2 లక్షల అంగన్వాడీ కేంద్రాల అప్గ్రెడేషన్ 75 జిల్లాల్లో 75 ఈ–బ్యాంకులు(డిజిటల్ బ్యాంక్స్) అన్ని పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సేవలు. డిజిటల్ పేమెంట్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు ఇకపై డిజిటల్ పాస్పోర్టులు. చిప్ ఆధారిత పాస్పోర్టులు మంజూరు పీఎం గృహ నిర్మాణ పథకానికి రూ.48 వేల కోట్ల కేటాయింపులు ప్రధాని ఆవాస్ యోజన కింద 80 లక్షల ఇళ్లు నిర్మాణం అర్బన్ ఏరియాలో పబ్లిక్ ట్రాన్స్పోర్టులుగా షిప్స్ ఉపయోగిస్తాం పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ఉన్నత స్థాయి ప్యానెల్ ఏర్పాటు వచ్చే 3 ఏళ్లలో 400 కొత్త వందే భారత్ రైళ్లు దేశవ్యాప్తంగా వంద గతిశక్తి కార్గో టెర్మినల్స్ నిర్మాణం 25 వేల జాతీయ రహదారుల నిర్మాణం మేకిన్ ఇండియాలో భాగంగా 60 లక్షల ఉద్యోగాల కల్పన డిజిటల్ యూనివర్సిటీల ఏర్పాటుకు పూర్తి సహకారం వంట నూనె దేశీయంగా ఉత్పత్తి చేసేలా చర్యలు పట్టణ ప్రణాళిక, ప్రజా రవాణాపై అధ్యయనం రూ250 కోట్లుతో 5 విద్యా సంస్థల ఏర్పాటు ఇకపై కేంద్ర మంత్రిత్వ శాఖల లావాదేవీలు ఆన్లైన్లోనే అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కాగిత రహిత విధానం త్వరలో 5 జీ టెక్నాలజీ సేవలు, 2022 నాటికి 5 జి స్ప్రెక్టమ్ వేలం 2025 నాటికి ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ పూర్తి పీపీపీ రూపంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆప్టికల్ ఫైబర్ కేబులింగ్ ఎగుమతుల ప్రోత్సాహకానికి ఎస్ఈజెడ్లో సమూల మార్పులు ఎగుమతుల ప్రోత్సాహకానికి కొత్త చట్టం రక్షణ రంగంలోనూ ఆత్మనిర్భర్ భారత్ అమలు రక్షణ రంగంలో పరిశోధనలకు ప్రైవేట్ పరిశ్రమలు, స్టార్టప్లు, విద్యాసంస్థలకు అవకాశం డిఫెన్స్ బడ్జెట్లో 25 శాతం డిఫెన్స్ రీసెర్చ్ కోసం కేటాయింపులు పర్యాటక ప్రాంతాల్లో పీపీపీ పద్ధతిలో అభివృద్ధి పనులు ఎనిమిది పర్యాటక ప్రాంతాల్లో 60 కిమీ మేర రోప్వేలు సోలార్ ఎనర్జీ ఉత్పత్తి కోసం రూ.19,500 కోట్ల కేటాయింపులు 10 రంగాల్లో క్లీన్ ఎనర్జీ యాక్షన్ ప్లాన్ ఎంఎస్ఎంఈల ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక పోర్టల్ వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక పోర్టల్ పీపీపీ మోడల్లో ఆహార శుద్ధి పరిశ్రమలు ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు నిధుల సమీకరణకు సావర్ గ్రీన్ బాండ్ల త్వరలో డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టనున్న ఆర్బీఐ 2022–23లోనే అమల్లోకి డిజిటల్ కరెన్సీ డిజిటల్ కరెన్సీ కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎలక్ట్రికల్ వాహనాలకు మరిన్ని ప్రోత్సాహకాలు త్వరలో రహదారులపై బ్యాటరీలు మార్చుకునే సౌకర్యం ప్రజారవాణాలో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగానికి ప్రణాళికలు పెట్రో డీజిల్ వినియోగాన్ని భారీగా తగ్గించే వ్యూహం వచ్చే 5 ఏళ్లలో 60 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. వద్ధిరేటులో మనం ముందున్నామని దేశ వ్యాప్తంగా కొత్తగా 25 వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం వచ్చే ఐదేళ్లలో 13 లక్షల కోట్ల ఉత్పత్తి ఆధారిత ఇన్సెంటివ్లు అందిస్తున్నట్లు నిర్మల పేర్కొన్నారు. చిన్న, మధ్యతరహా రైతుల కోసం వన్నేషన్ వన్ప్రొడక్ట్ పథకం అమలు 2023 నాటికి 2 వేల కి.మీ రైల్వే లైన్లు పెంపు రవాణ రంగంలో మౌలిక సదుపాయాల కోసం రూ.20 వేల కోట్టు కేటాయింపులు – భారత్లో అవసరాలకు అనుగుణంగా మెట్రో రైలు కనెక్టివిటీ వచ్చే ఐదేళ్లలో 13 లక్షల కోట్ల ఉత్పత్తి ఆధారిత ఇన్సెంటివ్లు చిన్న రైతులు, చిన్న పరిశ్రమలకు అనుగుణంగా రైల్వే నెట్వర్క్ వ్యవసాయ క్షేత్రాల పర్యవేక్షణకు కిసాన్డ్రోన్లను అభివృద్ధి దేశవ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయానికి ప్రొత్సాహం కృష్ణా,పెన్నా,కావేరి నదుల అనుసంధానానికి ప్రణాళిక ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ మరింత సులభతరం, రెండేళ్ల దాకా రిటర్స్ ఫైల్ చేసుకునే అవకాశం -
బడ్జెట్ 2022 హైలైట్స్పై ఓ లుక్కేయండి (ఫోటోలు)
-
బడ్జెట్ షాక్ : ఆరంభ లాభాలు ఢమాల్!
సాక్షి, ముంబై: స్టాక్ మార్కెట్లు ఆరంభ లాభాలనుంచి వెనక్కి తగ్గాయి. ముఖ్యంగా వేతన జీవులకు ఎలాంటి ఊరట లభించపోవడంతో ఇన్వెస్టర్లు నిరాశకు గురయ్యారు. దీంతో ఆరంభంలో వెయ్యి పాయింట్లకు పైగా ఎగిసిన మార్కెట్లో అమ్మకాలు కొనసాగాయి. అయితే కార్పొరేట్ సంస్థలకు లబించిన ఊరటతో ఊగిసలాట కొనసాగుతోంది. సెన్సెక్స్ 891 పాయింట్ల లాభంతో 59 వేలకు దిగువన, నిఫ్టీ 223 పాయింట్ల లాభాలకు పరిమితమై 18 వేల దిగున ట్రేడయింది. క్రమంగా నష్టాల్లోకి జారుకుని తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగుతోంది. ప్రధానంగా ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో రంగ షేర్లు నష్టపోతున్నాయి. మరోవైపు భారతీయ రిజర్వు బ్యాంకు త్వరలో డిజిటల్ రుపీని జారీ చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం బడ్జెట్ ప్రసంగంలో భాగంగా వెల్లడించారు. 2022-23లో భారత దేశానికి సొంత డిజిటల్ కరెన్సీ వస్తుందన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా డిజిటల్ రూపీని జారీ చేయబోతున్నట్లు వెల్లడించారు. డిజిటల్ అసెట్ల బదిలీపై 30శాతం పన్ను రాయితీ ఇవ్వనున్నారు. జనవరిలో స్థూల జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో రూ. 1,40,986 కోట్లకు చేరుకున్నాయని, ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకోవడం వల్లే సాధ్యమైందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అయితే మార్కెట్ విశ్లేషకులు మాత్రంనిర్మలాది మరో 2022-23 గ్రోత్ ఓరియెంటెడ్ బడ్జెట్ అంటూ ప్రశంసించారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు లభించిన ఊరటను ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. 2022-23 బడ్జెట్లో ఎమ్ఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు లభించాయి. ఎంఎస్ఎంఈలకు మార్కెటింగ్ సహకారం కోసం నూతన పోర్టల్ ఏర్పాటుతోపాటు, ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక ప్లాట్ఫాంను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం ప్రత్యేక క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. క్రెడిట్ గ్యారంటీ పథకానికి రూ.2 లక్షల కోట్ల ఆర్థిక నిధులు ప్రకటించారు. రానున్న ఐదేళ్లలో ఎంఎస్ఎంఈల కోసం రానున్న అయిదేళ్లలో 6,000 కోట్ల రూపాయల RAMP కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే స్టార్టప్ల కోసం రూ.2 లక్షల కోట్ల రూపాయలను వెచ్చించనున్నామని ప్రకటించడం విశేషం. -
క్రిప్టో ట్రేడర్లకు శుభవార్త !
క్రిప్టో ట్రేడర్లకు శుభవార్త ! కేంద్రం బడ్జెట్లో క్రిప్టోకి అనుకూలంగా నిర్ణయం వెలువడింది. భారత ఆర్థిక వ్యవస్థకు పురోగతి అందించే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ‘డిజిటల్ రూపీ’ 2022-23లో ప్రవేశపెట్టబోతున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వర్చువల్ డిజిటల్ ఆస్తుల లావాదేవీలపై 30 శాతం టాక్స్ విధిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా తెలిపారు. ప్రైవేట్ క్రిప్టో లావాదేవీల్లో పన్ను విధానం లేదు. కానీ ప్రభుత్వం తెచ్చే డిజిటల్ రూపీలో పన్ను విధానం ఉంటుందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. క్రిప్టో కరెన్సీకి భారత్లో అనుమతులు ఇవ్వాలంటూ ఇటీవల డిమాండ్లు వినిపించాయి. కేంద్రం సైతం శీతాకాల సమావేశాల్లో ఈ అంశంపై చర్చిస్తామని చెప్పింది. అయితే ఆర్బీఐ అధికార వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశం చర్చకు రాలేదు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ నేరుగా బడ్జెట్ ప్రసంగంలో క్రిప్టో అంశాన్ని చేర్చింది కేంద్రం. ఇప్పటికే పలు దేశాల్లో ప్రభుత్వ ఆధీనంలో క్రిప్టో వ్యవస్థలు పని చేస్తున్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ఓన్లీ ఫైలింగ్ అప్డేట్కి అవకాశం.. స్టాబుల్లో నో ఛేంజ్ -
ట్యాక్స్ పేయర్స్కి గుడ్న్యూస్! నిర్మలమ్మ వరాలు
పన్ను చెల్లింపుదారులకు తొలి గుడ్న్యూస్ వెలువడింది. ట్యాక్స్ రిటర్న్ అప్డేట్ చేసుకునేందుకు రెండేళ్ల సమయం పెంచుతున్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రకటించారు. ఐటీ రిటర్న్లో లోపాలను సవరించుకునేందుకు పన్ను చెల్లింపుదారులకు ఇది మంచి అవకాశమని మంత్రి అన్నారు. పన్నులు చెల్లింపులు మరింత సులభం చేసేందుకు ప్రభుత్వం ఈ ఫైలింగ్ను అమల్లోకి తేగా..టెక్నికల్ గ్లిచెస్తో అనేక మంది ఇబ్బందులు పడ్డారు. వర్క్ఫ్రం హోం అమలవుతున్నందున స్టాండర్డ్ డిడక్షన్లో పలు సవరణలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. మరి ఈ బడ్జెట్లో దానికి సంబంధించిన అంశం ఎప్పుడు ప్రస్తావనకు వస్తుందా అని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఇన్ట్యాక్స్ శ్లాబుల్లో కూడా మార్పులు తేవాలనే డిమాండ్లు ఉన్నాయి. అయితే కేంద్ర బడ్జెట్లో వీటికి అవకాశం కల్పించలేదు. పన్నులకు సంబంధించిన అనుబంధ సెక్షన్లలో సైతం ప్రభుత్వం ఎటువంటి మార్పులు చేయలేదు. పన్ను గురించి బడ్జెట్లో పేర్కొన్న అంశాలు - కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 14 శాతం పన్ను ఆదా - సహకార సంస్థలకు సంబంధించి ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్ రేటుని 18.50 శాతం నుంచి 15 శాతానికి తగ్గింపు - సహకార సంస్థలు చెల్లించే సర్ ఛార్జీలు 7 శాతం తగ్గింపు - నేషనల్ పెన్షన్ స్కీంలో డిడక్షన్ 14 శాతం పెంచుకునే వెసులుబాటు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బడ్జెట్ 2022 ప్రసంగం: డిజిటల్ భారత్ ప్రధానంగా..
నాలుగోసారి పార్లమెంట్లో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. కరోనా సమయంలో మరో బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు ప్రసంగం మొదలుపెట్టారు ఆమె. ఈ ఏడాది వృద్ధి రేటు 9.2 శాతం దాటుతుందని అంచనా. వృద్ధి రేటులో ముందున్నామని నిర్మలా సీతారామన్ ప్రకటించుకున్నారు. వ్యాక్సినేషన్ క్యాంపెయిన్జోరుగా సాగుతోంది. కొవిడ్ కట్టడిలో వ్యాక్సినేషన్ కీలకంగా వ్యవహరించిందని పేర్కొన్నారు ఆర్థిక మంత్రి. ఆత్మనిర్భర్ స్ఫూర్తితో ముందుకు సాగనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. వంట నూనె దేశీయంగా తయారీపై దృష్టి. వెయ్యి లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరిస్తామన్నారు. బడ్జెట్ ప్రసంగంలో కీలకాంశాలు కొన్ని.. ►పీఎం ఆవాస్ యోజన కింద 18 లక్షల ఇళ్లు. 48 వేల కోట్లు కేటాయింపు. 75 జిల్లాలో 75 డిజిటల్ బ్యాంకింగ్ కేంద్రాలు. తృణ ధాన్యాల సంవత్సరంగా 2023. ►యాప్లో ప్రజలకు అందుబాటులో బడ్జెట్. వచ్చే ఐదేళ్లలో మేకిన్ ఇండియాలో భాగంగా 60 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రణాళికగా ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి ప్రకటించారు. ఇంటి ఇంటికి మంచి నీటి కోసం 60 వేల కోట్ల కేటాయింపు. ►వ్యవసాయ రంగానికి ఆధునిక టెక్నాలజీని ఉపయోగం, భూ రికార్డులను డిజిటలైజేషన్. డ్రోన్లతో పంట పొలాల పరిరక్షణ. సేంద్రీయ వ్యవసాయానికి ప్రత్యేక రాయితీల ప్రకటన. పీఎం ఈ విద్య కోసం 200 ఛానెల్స్. ప్రాంతీయ భాషల్లో విద్యాబోధన.. 1.12 తరగతులకు వర్తింపు. ►ఆతిథ్య రంగానికి రూ. 5 లక్షల కోట్ల కేటాయింపులు. మైక్రో, చిన్నతరహా కంపెనీలకు 2 లక్షల కోట్ల కేటాయింపులు. ఎంఎస్ ప్రత్యేకంగా డిజిటల్ యూనివర్సిటీ. స్టార్టప్లకు 2 లక్షల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో 4 మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్లు. అంగన్వాడీ 2.0 కింద 2 లక్షల అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణ. ►తెలుగు స్టేట్స్లో నదుల అనుసంధానంపై ప్రణాళిక. త్వరలో కృష్ణ గోదావరి, కృష్ణ పెన్నా నదుల అనుసంధానం. పెన్నా-కావేరి నదుల అనుసంధానానికి ప్లాన్. గంగా నదీ తీరంలో 5 కిలోమీటర్ల మేర సేంద్రీయ సాగు. ►అన్ని పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సేవలు(నెట్బ్యాంకింగ్, ఏటీఎం సహా) అందుబాటులోకి. ఇకపై చిప్ ఆధారిత పాస్ పోర్టులు. కొత్తగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0 ►డిజిటల్ పేమెంట్, నెట్బ్యాంకింగ్ సేవలకు ప్రోత్సాహకాలు. గతిశక్తి కార్గొ టెర్మినళ్ల నిర్మాణం. కొత్త రహదారుల నిర్మాణం. పేద, మధ్య తరగతి సాధికారికత కోసం ప్రభుత్వం కృసి చేస్తోందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ►2022 నాటికి 5జీ స్పెక్ట్రం వేలం పూర్తి చేసే యోచన. 2023 నుంచి 5జీ సేవలు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం. ► ప్రజా రవాణాలో ప్రత్యామ్నాయ ఇంధనలకు ప్రముఖ స్థానం. ఈ-వెహికల్స్ ప్రోత్సహకంలో భాగంగా హైవేలపై బ్యాటరీలు మార్చుకునే సదుపాయం. సోలార్ ఎనర్జీ ఉత్పత్తి కోసం 19,500 వేల కోట్ల రూ. కేటాయింపు. ►అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కాగిత రహిత విధానం. మానసిక ఆరోగ వ్యవస్థ కోసం జాతీయ విధానం. 10 రంగాల్లో క్లీన్ఎనర్జీ యాక్షన్ ప్లాన్. ఎగుమతుల ప్రోత్సాహకానికి కొత్త చట్టం. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక స్టార్టప్లు. (చదవండి: Budget 2022 Highlights) -
పాత పాస్పోర్ట్లకు కాలం చెల్లు - బడ్జెట్లో మంత్రి నిర్మలా సీతారామన్
పాస్పోర్ట్ విధానంలో సరికొత్త మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. పాత కాలం నాటి పేపర్ పాస్పోర్టుల స్థానంలో కొత్తగా డిజిటల్ పాస్పోర్టులు ప్రవేశపెట్టబోతున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ పథకం అమల్లోకి వస్తే చిప్ ఆధారిత పాస్పోర్టును జారీ చేస్తారు. ప్రపంచంలో ఇప్పటికే పలు దేశాలు చిప్ ఆధారిత పాస్పోర్టులను జారీ చేస్తున్నాయి. వీటిని క్యారీ చేయడం తేలిక అదే విధంగా ట్యాంపర్ చేయడం కష్టం. మన్నిక, భద్రత విషయంలో చిప్ పాస్పోర్టులు సాధారణ పాస్పోర్టు కంటే ఎంతో మెరుగు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వచ్చే మూడేళ్లలో పట్టాలెక్కనున్న 400 వందే భారత్ రైళ్లు
ఎన్డీఏ సర్కారు ఈ సారి కొత్త రైళ్లు ప్రవేశపెట్టడంపై దృష్టి సారించింది. మోదీ సర్కార్ కొలువుదీరిన తర్వాత కొత్త రైళ్లు స్టార్ చేయడం కంటే నూతన రైల్వేలైన్ల నిర్మాణం, డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులపై ఎక్కువగా ఫోకస్ చేశారు. గతానికి భిన్నంగా వందే భారత్ పేరుతో భారీగా రైళ్లు ప్రవేశపెట్టబోతున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇప్పటికే వరుసగా 75 వారాల పాటు 75 వందే భారత్ రైళ్లను నడిపిస్తామని పీఎం మోదీ ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా ఆర్థిక మంత్రి ప్రకటన వచ్చింది. కొత్తగా వచ్చే వందే భారత్ రైళ్లను పూర్తిగా లింకే హఫ్ మన్ బుష్ (ఎల్ఎఫ్బీ) కోచ్లతో రూపొందించబోతున్నారు. ప్రస్తుతం రాయ్బరేలీ, కపుర్తాల, చెన్నైలలో ఉన్న కోచ్ ఫ్యాక్టరీలలో ఎల్ఎఫ్బీ కోచ్లను తయారు చేస్తున్నారు. ఏప్రిల్లో ఈ బోగీలకు సంబంధించిన టెస్ట్ జరుగనుందని మంత్రి అశ్వీనీ వైౌష్ణవ్ తెలిపారు. ఆగష్టు, సెప్టెంబరులో ఈ రైళ్లు పట్టాలెక్కే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అయితే ఈ రైళ్లు ప్రీమియం కేటగిరిలో సేవలు అందించే అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని పలు నగరాల నంచి దేశరాజధానికి వందే భారత్ రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా వచ్చే రైళ్లలో తెలంగాణ, ఏపీకి వాటా దక్కనుంది. ఇక వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు రైల్వే నెట్వర్క్ను ఉపయోగిస్తామని మంత్రి ప్రకటించారు. వ్యవసాయ రంగానికి సంబంధించి ఇప్పటి వరకు ఎరువుల సరఫరాకే రైల్వే నెట్వర్క్ ఉపయోగపడుతోంది. కరోనా సంక్షోభం వచ్చాక రైళ్ల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల రవాణా పెద్ద ఎత్తున చేపట్టారు. వీటి ఫలితాలు బాగుండటంతో ఈసారి చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే కార్గో సేవలు ప్రారంభిస్తామన్నారు. ఈ మేరకు పీఎం గతి శక్తి ద్వారా దేశవ్యాప్తంగా వంద కార్గో టెర్మినల్స్ నిర్మించబోతున్నారు. ఇతర కీలక అంశాలు - రైల్వే, పోస్టల్ శాఖల సమన్వయంతో పార్సిస్ సర్వీసుల బలోపేతం - ఆధునిక టెక్నాలజీ సీల్ 4 సాయంతో రైలు ప్రమాదాలు నివారించేందుకు ‘కవచ్’ కార్యక్రమం. 2022-23 చివరి నాటికి కవచ్ పరిధిలో 2,000 కి.మీ ట్రాక్. - రైల్వేలతో మాస్ అర్బన్ ట్రాన్సపోర్టేషన్ అనుసంధానం - లోకల్ బిజినెస్ని ప్రోత్సహించేందుకు సప్లై చెయిన్ బలోపేతానికి వన్ స్టేషన్ - వన్ ప్రొడక్ట్ పథకం - ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 1.37 లక్షల కోట్లు కేటాయింపు - రైల్వే స్టేషన్ల డెవలప్మెంట్ కోసం రూ. 12,000 కోట్ల కేటాయింపు -
గుడ్న్యూస్: సిలిండర్ ధరలపై ఊరట!
బడ్జెట్ ముందర గ్యాస్ సిలిండర్ ధరల నుంచి ఊరట ఇచ్చే ప్రకటన వెలువడింది. డొమెస్టిక్ సిలిండర్లపై భారీగా ధరలను తగ్గిస్తున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించగా.. వరుసగా నాలుగో నెలలోనూ చాలా చోట్ల సిలిండర్ ధరల పెంపు ప్రకటన వెలువడకపోవడం విశేషం. ప్రతి నెలా ఒకటో తేదీన ధరల సవరణపై ఓఎంసీలు ప్రకటిస్తాయన్నది తెలిసిందే. అక్టోబర్ నుంచి డొమెస్టిక్, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు అక్టోబర్ నుంచి తగ్గలేదు. నవంబర్ నుంచి పెట్రో ధరలు సైతం స్థిరంగా ఉన్నాయి. ఈ తరుణంలో బడ్జెట్కు కొద్ది గంటల ముందు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు(OMCs) ఎల్పీజీ సిలిండర్ ధరలను కొన్ని ప్రాంతాల్లో తగ్గించినట్లు ప్రకటనలు విడుదల చేశాయి. ఐదు అసెంబ్లీ రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గృహా వినియోగ సిలిండర్ ధర ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని భావించారు. అదే సమయంలో కమర్షియల్సిలిండర్ల ధరల్లోనూ మార్పు ఉండొచ్చని ఆశించారు. కానీ, ఈ తరుణంలో కేంద్రం డొమెస్టిక్ సిలిండర్ల ధరల్ని పెంచుకుండా ఊరట ఇచ్చాయి. మరోవైపు ఆయిల్ కంపెనీలు భారీగానే తగ్గింపులు ప్రకటించాయి. క్రూడ్ ఆయిల్ అంతర్జాతీయ మార్కెట్లో ఆకాశాన్ని అంటున్న తరుణంలో ఇది ప్రత్యేకమనే చెప్పాలి. ఫిబ్రవరి 1న ఢిల్లీలో 14.2 కేజీల ఇండేన్ డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 899.50 గా ఉంది. అలాగే కోల్కతాలో డొమెస్టిక్ సిలిండర్ ధర 926రూ. ఉంది. ముంబైలో నాన్ సబ్సిడైజ్డ్ ఎల్పీజీ సిలిండర్ రూ. 899.50 గా, చెన్నైలో రూ. 915.50గా ఉంది ఇవాళ. మరికొన్ని రాష్ట్రాల్లోనూ కంపెనీలు సిలిండర్ల ధరలు భారీగా తగ్గించాయి. హైదరాబాద్లో ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.952 దగ్గర ఉంది. నాలుగు నెలలుగా ఇదే ధర కొనసాగుతోంది. ఇక ఓఎంసీ కమర్షియల్ సిలిండర్ ధరలపైనా భారీగానే తగ్గింపు ప్రకటించింది. (19కేజీల) ఎల్పీజీ సిలిండర్ రూ.91.50పై. తగ్గింది. ఇది ఈ రోజు నుంచే అమలులోకి రానుంది. వాస్తవానికి కొత్త ఏడాది మొదటి రోజునే ఓఎంసీ కమర్షియల్ సిలిండర్పై 102రూ. తగ్గించింది. అయినప్పటికీ 2 వేల రూపాయలకు పైనే ఉండేది. ప్రస్తుత ధరల సవరణ తర్వాత ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1,907రూ.గా ఉంది. -
బడ్జెట్ 2022: ఆ రాష్ట్రాల మీదే ఫుల్ ఫోకస్?
Union Budget 2022 Updates: ప్రధాని మోదీ హయాంలోని బీజేపీ ప్రభుత్వం పదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రపతిని కలిసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. వార్షిక బడ్జెట్ వివరాలు తెలిపారు. కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. బడ్జెట్కు కేబినెట్ ఆమోద ముద్ర తర్వాత పార్లమెంట్ బడ్జెట్ సెషన్ రెండో రోజు ప్రారంభం కానుంది. 80సీ కింద మినహాయింపులు(లక్షన్నర నుంచి రూ. 3లక్షల పెంచుతారనే ఆశ) మీద వేత జీవుల ఆశలు, స్టాండర్డ్ డిడక్షన్ 50 వేల నుంచి లక్ష రూ. పెంచడం లాంటి అంశాల మీద అందరి దృష్టి ఉంది. అయితే.. కరోనాతో గత రెండేళ్లుగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆర్థిక పురోగతికి ఈ ఏడాది కలిసి రావొచ్చనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం మూడో వేవ్లో ఉన్నప్పటికీ.. పరిస్థితి మెరుగైందనే చెప్పొచ్చు. ఈ తరుణంలో రూ.2.5 లక్షలుగా ఉన్న ఐటీ పరిమితి మినహాయింపులు పెరిగే అవకాశాలు తక్కువనే నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఐదు స్టేట్స్లో ఎలక్షన్స్ నేపథ్యంలో.. వాటి మీదే ప్రధాన ఫోకస్ ఉండొచ్చని, వ్యవసాయ, పారిశ్రామికరణ.. ఇతరత్ర కేటాయింపులు ఉండొచ్చనే టాక్ ప్రధానంగా వినిపిస్తోంది. (చదవండి: Budget 2022 LIVE Updates) గతంలో ఎలక్షన్ సంబంధిత రాష్ట్రాలకు జరిగిన కేటాయింపులనే అందుకు ఉదాహరణలుగా చూపిస్తున్నారు. వ్యవసాయం మాత్రమే కాదు.. మౌలిక వసతులు, రోడ్లు, రైల్వే, ఇరిగేషన్, మెడిసిన్ సంబంధిత బడ్జెట్ వరాలు సైతం ఆయా రాష్ట్రాల పైనే కురవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు బీజేపీ వ్యతిరేక రాష్ట్రాల్లోనూ పట్టు కోసం బడ్జెట్ ఫోకస్ ఉండొచ్చనే వాదనా వినిపిస్తోంది. దీంతో అసంతృప్త రాష్ట్రాల పరిస్థితిపై జోరుగా చర్చ నడుస్తోంది. అదే సమయంలో.. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 8-8.5 శాతంగా ఉండొచ్చనే లెక్కల నడుమ.. రాబడి పెరగడంతో(గత రెండేళ్లలో పోలిస్తే) ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యపరంగా ఆసరా అందించే ఆస్కారం ఉందనే ఆశ మాత్రం ఉంది. వ్యాక్సినేషన్, సర్వీస్ సెక్టార్, నియంత్రణల సడలింపులు, ఎరువుల రాయితీలు, అంతరిక్షంలో ప్రైవేటీకరణ, రైల్వేలో పెట్టుబడులకు అవకాశం, రహదారుల నిర్మాణం, స్టార్టప్లకు వెన్నుదన్ను.. తదితర అంశాలపైనే ప్రధాన ఫోకస్ ఉన్నట్లు అర్థమవుతోంది. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటిస్తున్నప్పటికీ.. అసంతృప్త రాష్ట్రాలకు కేటాయింపుల విషయంలో కేంద్రం కరుణ చూపిస్తుందా? లేదంటే ఎప్పటిలాగే మొండి చేయి ఇస్తుందా? అనేది మరికొన్నిగంటల్లో తేలిపోనుంది. సంబంధిత వార్త: బడ్జెట్ బూస్ట్.. భారీ లాభాలు! -
తెలంగాణపై కేంద్రానికి ఎందుకు వివక్ష?
సాక్షి, న్యూఢిల్లీ: ‘తెలంగాణ పట్ల కేంద్రానికి ఎం దుకు వివక్ష? రాష్ట్రాన్ని ఎందుకు శత్రువులా చూస్తున్నారు, ఎందుకు విరోధం పెంచుకుంటున్నారు’ అని టీఆర్ఎస్ ఎంపీలు కె. కేశవరావు, నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు. రాష్ట్రానికి సంబంధించి విభజన సమస్యలను పరిష్కరించడంలో ఎనిమిదేళ్లుగా ఎందుకు తాత్సారం చేస్తున్నారని నిలదీశారు. సోమవారం మధ్యాహ్నం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు సంబంధించిన పెండింగ్ అంశాలను వీరిద్దరూ లేవనెత్తారు. రాష్ట్రానికి సంబంధించిన ఒక్కప్రాజెక్టులో కూడా కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందలేదన్నారు. దేశంలో అనేక మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నా తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ' ప్రతిపక్ష నేతల ఇళ్లపై ఈడీ, ఐటీ దాడులా? పెండింగ్లో ఉన్న జీఎస్టీ, ఐజీఎస్టీ నిధులను రాష్ట్రాలకు ఎందుకు విడుదల చేయట్లేదో తెలపాలని ఎంపీలు డిమాండ్ చేశారు. వరి ధాన్యం సేకరణలో జాతీయ సమగ్ర ధాన్యం సేకరణ విధానాన్ని తీసుకురావాలని కోరారు. ప్రతిపక్ష నేతల ఇళ్లపై ఈడీ, ఐటీ దాడులు చేస్తున్నాయన్నారు. ఇప్పుడు ప్రివిలేజ్ కమిటీ రూపంలో పార్లమెంట్ను కూడా వాడుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర విచారణ సంస్థలను కేంద్రం తన అవసరాలకు వీటిని ఉపయోగించవద్దని పేర్కొన్నారు. ( చదవండి: India Budget 2022-23 Highlights ) పెగసస్పై చర్చ జరగాలి పెగసస్ స్పైవేర్ సమస్య వంటి జాతీయ భద్రత అంశంతోపాటు ప్రజా సమస్యలపై పార్లమెంటులో చర్చ జరగాలని అన్ని పార్టీలు కోరుకుంటున్నాయని కేకే తెలిపారు. దేశంలో ఉపాధి కల్పనకు కేంద్రం చర్యలు తీసుకోవట్లేదని నామా విమర్శించారు. వెనుకబడిన జిల్లాల అభవృద్ధి కోసం కేం ద్రం ఇవ్వాల్సిన రూ.450 కోట్లు చెల్లించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందనలేదన్నారు. కాగా సోమవారం పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఉభ య సభలను ఉద్దేశించి జరిగిన రాష్ట్రపతి ప్రసంగానికి టీఆర్ఎస్ ఎంపీలు హాజరు కాలేదు. -
కేంద్ర బడ్జెట్ 2022 అప్డేట్స్
-
విశాఖ రైల్వే జోన్ పట్టాలెక్కేనా!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల సుదీర్ఘ ఆకాంక్ష, విభజన చట్టంలోని హామీ అయిన విశాఖపట్నం రైల్వేజోన్ పట్టాలెక్కుతుందా!?.. లేదా మరోసారి నిరాశను మిగులుస్తూ కేంద్రం వెయిటింగ్ లిస్టులో పెడుతుందా!?.. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో మంగళవారం ప్రవేశపెట్టనున్న 2022–23 వార్షిక బడ్జెట్పైనే యావత్ రాష్ట్రం దృష్టిసారించింది. నిజానికి దక్షిణ మధ్య రైల్వే గత ఏడాది సెప్టెంబరు 30న విజయవాడలో నిర్వహించిన సమావేశంలో వైఎస్సార్సీపీ ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్ను గట్టిగా వినిపించారు. రైల్వే ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై నిలదీశారు. అలాగే.. రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల్లో న్యాయం చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమగ్ర నివేదికను సమర్పించింది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. పట్టాలెక్కుతుందా.. అటకెక్కిస్తారా! విశాఖపట్నం కేంద్రంగా రాష్ట్రానికి ప్రత్యేక రైల్వేజోన్ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది. రాష్ట్ర విభజన చట్టంలో కూడా దీని ఏర్పాటు గురించి హామీ ఇచ్చినప్పటికీ 2018 వరకు కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదు. గత సార్వత్రిక ఎన్నికల ముందు అంటే 2019 ఫిబ్రవరి 27న విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వేజోన్’ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించి ఈ అంశాన్ని పరిశీలించేందుకు ఓ ప్రత్యేక అధికారిని కూడా నియమించింది. మరోవైపు.. రైల్వే శాఖ ఇందుకు సంబంధించిన డీపీఆర్ను సిద్ధంచేసింది. భవనాలు, ఇతర అవసరాల కోసం విశాఖలో దాదాపు 950 ఎకరాలు అందుబాటులో ఉందని పేర్కొంది. కానీ, గత రెండు బడ్జెట్లలోనూ రైల్వేజోన్పై కేంద్రం మొండిచేయి చూపించింది. గత బడ్జెట్లో కేవలం రూ.40 లక్షలు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు.. ప్రభుత్వం అనుమతిస్తే దక్షిణా కోస్తా రైల్వేజోన్ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించి ఏడాదిలో పూర్తిచేసేందుకు రైల్వేబోర్డు సిద్ధంగా ఉంది. కానీ, జోన్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వమే రాజకీయంగా తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో.. మంగళవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్పైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. రైల్వేజోన్పై కేంద్రం స్పష్టతనివ్వాలని రాష్ట్రం కోరుకుంటోంది. కేంద్రం ఇప్పుడు ప్రకటిస్తే ఏడాదిలో కొత్త జోన్ ఏర్పాటు సాధ్యపడుతుంది. ప్రస్తుతం కేంద్రం ఎలాంటి ప్రకటన చేయకుంటే ఇక రైల్వేజోన్ అంశం అటకెక్కినట్లేనని కూడా నిపుణులు భావిస్తున్నారు. (చదవండి: Parliament Budget Session 2022) డివిజన్లపై మరింత స్పష్టత అవసరం విశాఖపట్నం రైల్వే జోన్తోపాటు దాని పరిధిలోని డివిజన్ల ఏర్పాటులోనూ రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. 2019లో కేంద్రం ప్రకటించిన దాని ప్రకారం.. విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేర్ డివిజన్ను రద్దు చేస్తున్నట్టు చెప్పింది. ప్రస్తుతం ఏపీ, ఒడిశాలలో విస్తరించి ఉన్న వాల్తేరు డివిజన్ భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వేజోన్లో ఉంది. వాల్తేర్ డివిజన్ను రెండుగా విభజిస్తారు. ఒడిశాలోని ప్రాంతాలతో రాయగడ కేంద్రంగా రైల్వే డివిజన్ను ఏర్పాటుచేసి తూర్పు కోస్తా రైల్వేజోన్లో ఉంటుంది. అలాగే, ఏపీలోని ప్రాంతాలను విజయవాడ కేంద్రంగా ఉన్న రైల్వే డివిజన్లో కలుపుతారు. దీనిపై ఉత్తరాంధ్రలో తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. వాల్తేరు డివిజన్లేని రైల్వేజోన్తో ప్రయోజనంలేదని స్పష్టంచేశారు. వాల్తేరు డివిజన్తో కూడిన విశాఖపట్నం రైల్వేజోన్ మాత్రమే కావాలని స్పష్టంచేస్తున్నారు. అంతగా కావాలంటే విజయవాడ, గుంటూరులలో ఉన్న రైల్వే డివిజన్లను ఏకంచేసి ఓ డివిజన్ చేయొచ్చని నిపుణులు సూచించారు. దాంతో ఏపీ పరిధిలో మూడు రైల్వే డివిజన్లే ఉంటాయని చెప్పారు. ఈ అంశంపై కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. రైల్వే జోన్తోపాటు బడ్జెట్లో రాష్ట్రం ఆశిస్తున్నవి.. ► కర్నూలు జిల్లా డోన్ కేంద్రంగా రైల్వే కోచ్ల సెకండరీ మెయింటెనెన్స్ లోకోషెడ్ ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అందుకు 100 ఎకరాలు కేటాయిస్తామని కూడా చెప్పింది. దాంతో రాయలసీమ ప్రాంతంలో రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేయొచ్చన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. ► రాష్ట్రానికి కనీసం రెండు కొత్త రైళ్లు కేటాయించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. విశాఖపట్నం–బెంగళూరు, తిరుపతి–వారణాసి సూపర్ఫాస్ట్ రైళ్లు ప్రవేశపెట్టాలని కోరింది.ఇక విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా ఢిల్లీకి రాజధాని ఎక్స్ప్రెస్ వేయాల్సి ఉంది. విజయవాడ నుంచి సికింద్రాబాద్, విశాఖపట్నం నుంచి తిరుపతికి పగటిపూట నడిచే రైళ్లు కూడా వేయాలని ప్రతిపాదించారు. ► విజయవాడ–ఖరగ్పూర్ ప్రత్యేక ఫ్రైట్ కారిడార్ ఏర్పాటుచేస్తామని గత బడ్జెట్లో కేంద్రం పేర్కొంది. కానీ, ఇంతవరకు పట్టించుకోలేదు. ఆ కారిడార్ కోసం ప్రత్యేకంగా లైన్ నిర్మించే అంశంపై మంగళవారం బడ్జెట్లో స్పష్టతఇవ్వాలని కోరుకుంటోంది. ► మచిలీపట్నం–భీమవరం–నిడదవోలు డబ్లింగ్ పనులు, విజయవాడ–గూడూరు మూడో లైన్ పూర్తి కోసం పూర్తిస్థాయిలో నిధులు కేటాయించాల్సి ఉంది. ► రాష్ట్రంలో ఆర్వోబీలు నిర్మాణం సందిగ్ధంలో పడింది. గుజరాత్ తమ వాటా నిధులు మంజూరు చేయనప్పటికీ ఆ రాష్ట్రంలో ఆర్వోబీలను పూర్తిచేశారు. రాష్ట్ర విభజన, కరోనా పరిస్థితులతో రాబడి కోల్పోయిన ఏపీలో మాత్రం రాష్ట్ర వాటా నిధులతో ముడిపెడుతూ పనులు నిలిపివేయడంపై వైఎస్సార్సీపీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. నిధుల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమనే విషయాన్ని రైల్వేశాఖ గుర్తించాలని వారు సెప్టెంబర్ సమావేశంలో కోరారు. -
బడ్జెట్ సమావేశాలను ఫలవంతం చేద్దాం
న్యూఢిల్లీ: ఎన్నికలు తరచుగా జరుగుతూనే ఉంటా యని, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మాత్రం చాలా కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఒక ఏడాది కాలానికి బ్లూప్రింట్ను ఖరారు చేసే బడ్జెట్ సమావేశాలను ఫలవంతం చేద్దామని పార్లమెంట్ సభ్యులకు పిలుపునిచ్చారు. ఓపెన్ మైండ్తో సభలో చర్చల్లో పాల్గొనాలని కోరారు. మోదీ సోమవారం మీడియాతో మాట్లాడారు. దేశంలో ఏదో ఒకచోట తరచుగా జరుగుతున్న ఎన్నికల కారణంగా పార్లమెంట్ భేటీలకు, చర్చలకు అంతరాయం కలుగుతున్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు. అయినప్పటికీ పార్లమెంట్లో స్వేచ్ఛాయుతంగా, సదుద్దేశంతో ఆలోచనాత్మక చర్చలు జరగాలని ఆకాంక్షించారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భారత్ ముంగిట ఎన్నో అవకాశాలు ఉన్నాయని వివరించారు. (చదవండి Budget 2022 Updates in Telugu) దేశ ఆర్థిక ప్రగతి, కోవిడ్–19 వ్యాక్సినేషన్, స్వదేశంలో కరోనా టీకాల ఉత్పత్తి వంటి వాటితో అంతర్జాతీయంగా భారత్ పట్ల విశ్వాసం ఎంతగానో పెరిగిందన్నారు. ప్రపంచంలో మన దేశ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసేందుకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ఉపయోగించుకోవాలని, అర్థవంతమైన చర్చలు జరపాలని ఎంపీలకు సూ చించారు. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడానికి ఎంపీలందరితోపాటు అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా తోడ్పాటునందిస్తాయన్న ఆశాభావాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. చట్టసభల్లో ఓపెన్ మైండ్తో జరిపే నాణ్య మైన చర్చలు ఇందుకు దోహదం చేస్తాయని వెల్లడించారు. పూర్తి అంకితభావంతో ప్రస్తుత బడ్జెట్ సమావేశాలను ఫలవంతం చేస్తే రానున్న రోజుల్లో ఆర్థికంగా భారత్ ఉన్నత శిఖరాలకు చేరుకొనేం దుకు ఆస్కారం ఉంటుందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో రచ్చ తప్పదా? రైతుల సమస్యలు, దేశ సరిహద్దులో చైనా సైన్యం ఆగడాలు, పెగాసస్ స్పైవేర్ వంటి కీలక అంశాలపై పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. ఇజ్రాయెల్ నుంచి భారత్ 2017లో పెగాసస్ స్పైవేర్ను కొనుగోలు చేసిందంటూ న్యూయార్క్ టైమ్స్ పత్రికలో వచ్చిన కథనం ఇప్పటికే రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో కీలకమైన అంశాలపై ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, నిరసనలతో బడ్జెట్ సమావేశాలు హోరెత్తిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. మీడియా సమావేశంలో మోదీ -
పార్లమెంట్లో కరోనా నిబంధనల ఉల్లంఘన
సాక్షాత్తూ పార్లమెంట్ సాక్షిగా ఎంపీలు కరోనా నిబంధనలను ఉల్లంఘించారు. సామాజిక దూరం అనే మాటే మర్చిపోయారు. ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీల ఎంపీలదీ అదే తీరు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం సెంట్రల్ హాల్లో ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించారు. ఈ క్రమంలో మొదటి రెండు వరుసల్లో ఆసీనులైన ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు మాత్రమే సామాజిక దూరం పాటించారు. మూడో వరుస నుంచి కూర్చున్న ఎంపీలు కోవిడ్–19 ప్రొటోకాల్ను లెక్కచేయలేదు. వీరిలో కొందరు కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. కొన్ని బెంచీల్లో ఐదుగురు మాత్రమే కూర్చోవాల్సి ఉండగా, ఏడుగురు కనిపించారు. ఇక చాలామంది ఎంపీలు మాస్కులు కూడా కిందకు దించేశారు. మాస్కులు సక్రమంగా ధరించకుండానే ఒకరితో ఒకరు మాటల్లో మునిగిపోయారు. కరోనా కేసుల ఉధృతి దృష్ట్యా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. ఉదయం రాజ్యసభ, సా యంత్రం లోక్సభ సమావేశాలు జరుగుతాయి. (చదవండి: Nirmala Sitharaman Budget 2022 Speech)