కుప్పం దొంగల ముఠా కేసులో కీలక పురోగతి | AP Kuppam Robbery Gang Case: One Arrested After Massive Search | Sakshi
Sakshi News home page

కుప్పంలో దొంగల ముఠా హల్‌చల్‌.. కేసులో కీలక పురోగతి

Jun 5 2025 11:27 AM | Updated on Jun 5 2025 11:50 AM

AP Kuppam Robbery Gang Case: One Arrested After Massive Search

సాక్షి, చిత్తూరు: కుప్పంలో పోలీసుల మీదకే వాహనంతో దూసుకెళ్లిన దొంగల ముఠా కోసం గాలింపు కొనసాగుతోంది. ఆ ముఠాలో ఐదుగురు సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి పోలీసులు పురోగతి సాధించారు.

కుప్పం రైల్వే స్టేషన్‌లో ముఠా సభ్యుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. శుక్రవారం ఉదయం పుష్‌పుల్‌ రైలులో బెంగళూరు వెళ్లే ప్రయత్నంలో ఉండగా.. అదుపులోకి తీసుకున్నారు. అతని ద్వారా మిగిలిన ముఠా సభ్యుల ఆచూకీ కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. 

కరుడుగట్టిన దొంగల ముఠా ఒకటి సరిహద్దు దాటుతున్నారనే సమాచారంతో కుప్పం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో కృష్ణగిరి-పలమనేరు జాతీయ రహదారిపై ఉన్న తంబిగానిపల్లె చెక్‌పోస్టు వద్ద పోలీసులను చూసి దుండగులు తమ కారుతో తొక్కించేందుకు విఫలయత్నం చేశారు. వెంటనే కానిస్టేబుళ్లు పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో తప్పించుకున్న వారిని నిలువరించేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. 

ఈ కాల్పుల్లో కారు నడుపుతున్న డ్రైవర్‌ తొడకు బుల్లెట్‌ గాయమైంది. అయినా కూడా ఆ ముఠా తప్పించుకుంది.  కొద్దిదూరం వెళ్లాక కారును వదిలేసి ఆ ముఠా సభ్యులు పరారైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కుప్పం డీఎస్పీ పార్థసారథి మాట్లాడుతూ హత్యాయత్నం కింద దొంగలపై కేసు నమోదు చేశారు.  

పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి సమీప ప్రాంతాల్లో దొంగల కోసం జల్లెడ పడుతున్నారు. కుప్పం పరిధిలోని పలు గ్రామాల్లో డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్‌తో గాలింపు చేపట్టారు. ఆ ముఠాలో హర్యానా, రాజస్థాన్‌ ముఠా సభ్యులు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. హిందీలో మాట్లాడుతూ ఎవరైనా అనుమానాస్పద రీతిలో ఎవరైనా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement